Saturday, July 24, 2010

ధిక్కార పర్వాల-అసంతృప్తి కాండల అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్థానం :వనం జ్వాలా నరసింహారావు

ధిక్కార పర్వాల-అసంతృప్తి కాండల
అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్థానం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, దివంగత ముఖ్యమంత్రి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుంగు సహచరుడు, కాపు వర్గానికి చెందిన నాయకుడు అంబటి రాంబాబును, పార్టీనుంచి సస్పెన్షన్ చేసిన వైనం కాంగ్రెస్ శ్రేణుల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, చేయకూడని విధంగా, రాంబాబు విమర్శలు చేశాడన్న ఆరోపణతో ఆయన్ను సస్పెండ్ చేసింది అధిష్ఠానం. రాంబాబు వివరణ కోరుతూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణా సంఘం ఇచ్చిన గడువు ముగియక ముందే, హఠాత్తుగా సస్పెన్షన్ చేయాల్సిన కారణాలను మీడియాకు వివరించడంలో స్పష్టత లోపించిందనాలి. రాంబాబు సస్పెన్షన్ వ్యవహారంతో ఆగకుండా, వైఎస్ జగన్ ఓదార్పు యాత్రలో రోశయ్యపై చేసినట్లు మీడియాలో వచ్చిన వ్యాఖ్యలకు సంబంధించిన నివేదికలు కూడా తెప్పించుకుంటామని మొయిలీ అన్నారు. జగన్ ధిక్కార ధోరణిని సహించబోమన్న సందేశం ఆయన మాటల్లో స్పష్ఠంగా వ్యక్తమైంది. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణానంతరం కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా విశ్లేషిస్తే ధిక్కార స్వరాల, అసంతృప్తి జ్వాలల భారత కాంగ్రెస్ నూట పాతికేళ్ల చరిత్ర గుర్తుచేసుకోవచ్చు. అఖిల భారత కాంగ్రెస్ అధిష్ఠానం, పటిష్ఠమైన ఈ ఒక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రాన్ని, అప్రయత్నంగానే వదులుకునే దిశగా అడుగులేస్తున్నదన్న అనుమానం పార్టీ శ్రేణుల్లో కలుగుతుందనాలి.

భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావపు తొలినాళ్లలో, పార్టీని-పార్టీ కార్య కలాపాలను ప్రభావితం చేసిన మితవాద భావాల "మాడరేట్ల" ప్రభావం క్రమేపీ క్షీణించి, మిలిటెంట్ భావాల వారి పలుకుబడి పెరగడంతో, 1907 లో పార్టీలో చీలి కొచ్చింది. మాడరేట్ల "కన్వెన్షన్" బాల గంగాధర తిలక్ ప్రభృతులను పార్టీ నుంచి బహిష్కరించింది. వారంతా "నేషనలిస్ట్ పార్టీ" పేరుతో సమావేశమయ్యారు. అలా వంద సంవత్సరాల పూర్వమే ధిక్కార స్వరాలకు అంకురార్పణ జరిగింది. తిలక్ కారాగార శిక్ష పూర్తి చేసుకుని విడుదలై వచ్చేటప్పటికి, అయన్ను బహిష్కరించిన మాడరేట్లకు అనుచరులు లేకుండా పోయారు. రాజకీయాలలో మహాత్మా గాంధి ప్రవేశించిన తర్వాత, భారత జాతీయ కాంగ్రెస్ పై ఆయన ప్రభావం పడింది. సెప్టెంబర్ 1920 లో కలకత్తాలో నిర్వహించిన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశాల్లో, లాలా లజపతి రాయ్, చిత్తరంజన్ దాస్ లాంటి నాయకులు వ్యతిరేకించినప్పటికీ, బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రౌలట్‌ చట్టానికి వ్యతిరేకంగా "సత్యాగ్రహం" చేపట్టాలన్న తీర్మానానికి పెద్ద సంఖ్యలో మద్దతు లభించింది. మోతీలాల్ నెహ్రూ, గాంధి పక్షం వహించారు. దరిమిలా చట్ట సభల్లో ప్రవేశించే విషయంలో తీవ్ర అభిప్రాయ బేధాలొచ్చాయి. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ ప్రభృతులు ఒక వైపు, రాజాజీ, అన్సారి ప్రభృతులు మరో వైపు వాదించారు. మాట నెగ్గించుకోలేని చిత్తరంజన్ దాస్ పార్టీకి రాజీనామా చేసి "స్వరాజిస్ట్ పార్టీ" ని స్థాపించారు. మోతీలాల్ నెహ్రూ ఆయన పక్షానే నిలిచారు. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూలది ధిక్కార స్వరమా? అభిప్రాయ భేదమా?

కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు, ముఠా పోకడలు, అధిష్ఠానాన్ని ధిక్కరించడం, పార్టీని వీడిపోవడం, స్వగృహ ప్రవేశం చేయడం, గతంలో కంటే ప్రాధాన్యత సంపాదించుకోవడం లాంటివి ఆది నుంచీ జరుగుతున్నదే. బాల గంగాధర్ తిలక్, గోపాల కృష్ణ గోఖలే, విభేదించినప్పటికీ దూషించుకోలేదు. గాంధీజీ నాయకత్వంలో యువకులైన నెహ్రూ, బోసులకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చినప్పటికీ, బోసు ధిక్కార ధోరణి గాంధీకి నచ్చలేదు. ఒకానొక సందర్భంలో, సుభాష్ చంద్ర బోసు కాంగ్రెస్ అధ్యక్షుడవడం ఇష్టపడని గాంధీజీ రాజీనామాకు సిద్ధపడడంతో, తనకంటే ఆయన సేవలే పార్టీకి శ్రేయస్కరమని భావించిన బోసు పార్టీని వదిలి ఫార్వర్డ్ బ్లాక్ పెట్టుకున్నారు. తనకిష్ఠమైన జవహర్లాల్ నెహ్రూను, స్వతంత్రం రాకమునుపు ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వానికి సారధిని చేసేందుకు, అబుల్ కలాం ఆజాద్ తో రాజీనామా చేయించి, ఆయన స్థానంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా నెహ్రూ వ్యవహరించేందుకు తోడ్పడ్డారు గాంధీజీ. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించినంతవరకు, రాగ ద్వేషాలకు, మహాత్ముడంతటి వాడే అతీతం కాదని అనుకోవడానికి నిదర్శనంగా భవిష్యత్ లో వల్లభాయ్ పటేల్ ప్రధాని అయ్యే అవకాశాలను కూడా పరోక్షంగా దెబ్బ తీశారు గాంధీజీ. మధ్యంతర ప్రభుత్వంలో తనకిష్ఠమైన విదేశాంగ శాఖను నెహ్రూ వుంచుకుని, హోం శాఖను పటేల్ కు కేటాయించడంతో తనకు తెలియకుండానే, భవిష్యత్ లో ఆయన ప్రాబల్యం పెరిగేందుకు అవకాశం కలిపించారు నెహ్రూ. అవన్నీ ఒక విధంగా గ్రూప్ రాజకీయాలే కదా ! పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించుకునే ప్రయత్నాలే కదా ! అసలు-సిసలైన అంతర్గత పోరాటం స్వతంత్రం వచ్చిన తర్వాత మొదలైందనాలి.

1948-1950 మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు మొదలైంది. హోమ్ మినిస్టర్ గా వున్న వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. దాదాపు అన్ని ప్రొవిన్షియల్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పటేల్ మనుషులు ఎన్నికయ్యారు. ఈ లోపున రాజ్యాంగ శాసనసభకు సంబంధించి, సంస్థానాల విలీనం గురించి చర్చలు-చర్యలు మొదలయ్యాయి. జాతీయ గీతంగా "జనగణమణ.." వుండాలా, "వందేమాతరం...” వుండాలా? అన్న విషయంలోనూ కాంగ్రెస్ నాయకత్వంలో విభేదాలు చోటుచేసుకున్నాయి. 1948 లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా గెలిచిన పట్టాభి సీతారామయ్య, ఆ తర్వాత పురుషోత్తం దాస్ టాండన్ చేతిలో ఓటమి పాలయ్యారు. వారిలో మొదటి వారు నెహ్రూ బలపర్చిన వ్యక్తికాగా, టాండన్ పటేల్ పక్షం మనిషి. గాంధీజీ మరణానంతరం, నెహ్రూ ఎంత ప్రయత్నించినా, రాజ్యాంగంలో, "ప్రణాళిక, సామ్యవాదం" అన్న పదాలకు తావులేకుండా పటేల్ జాగ్రత్త పడ్డారు. జనవరి 26, 1950 న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిగా గవర్నర్ జనరల్ గా పనిచేసిన రాజగోపాలా చారికి నెహ్రూ మద్దతు లభించగా, పటేల్ మద్దతు వున్న రాజేంద్ర ప్రసాద్ కు ఆ పీఠం దక్కింది. ఆయన అధ్యక్షుడైన మరుక్షణం నుంచే, రాష్ట్రపతికి, ప్రధానికి వుండే అధికారాల-హక్కుల విషయంలో చర్చ మొదలైంది. ఒకవిధంగా అవన్నీ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పోరాటాలే. ఇంతలో పటేల్ చనిపోవడం, ఆయన చనిపోయిన పక్షం రోజుల లోపునే, నెహ్రూ అభీష్ఠం మేరకు, "ప్రణాళికా సంఘం" ఏర్పాటు కావడం జరిగింది. అయితే దానికి రాజ్యాంగ బద్ధత కలిపించకుండా, ఎగ్జిక్యూటివ్ బాడీ హోదా కలిగించడం విశేషం.

వల్లభాయ్ పటేల్ చనిపోవడంతో, టాండన్ కు చిక్కులు మొదలయ్యాయి. ప్రధానిగా వున్న నెహ్రూ టాండన్ కు వ్యతిరేకంగా తన నిరసన తెలియచేసేందుకు, పార్టీ పదవులన్నిటి కీ రాజీనామా చేశారు. దేశానికి నెహ్రూ వల్ల కలిగే మేలు ఎక్కువని భావించిన టాండన్, స్వచ్చందంగా, అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. వెంటనే సమావేశమైన వర్కింగ్ కమిటీ, నెహ్రూను ఆయన స్థానంలో ఎన్నుకోవడంతో, పార్టీ పదవి-ప్రధాని పదవి ఒకే వ్యక్తి చేపట్టారు. నెహ్రూ మద్దతున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అప్పట్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులలో నెహ్రూ అనుచరులని, పటేల్ అనుచరులని వేర్వేరుగా సంబోధించేవారు. మద్రాస్ రాష్ట్రం విషయంలో తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని రెండుండేవి. మొదటిది చెన్నైలోను, రెండోది విజయవాడలోను పనిచేస్తుండేవి. అప్పట్లో నీలం సంజీవరెడ్డి నెహ్రూ అనుకూలుడుగా, టంగుటూరు ప్రకాశం పంతులు ఆయనకు వ్యతిరేకిగా చెప్పుకునేవారు.

మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న ప్రకాశం పంతులును దింపడానికి నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావులు ఒకటయ్యారని అంటారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పదే-పదే "ఆ రెండు పత్రికలు" అన్న రీతిలోనే, ఇంచుమించు అదే అర్థం వచ్చే విధంగా, తనకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు, ఒక పత్రిక సంపాదకుడు వరుసగా రాసిన ఐదు సంపాదకీయాలను "పంచ మహా పాతకాలు" గా ప్రకాశం పంతులు వర్ణించారు. 1950 లో జరిగిన ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికలో నెహ్రూ మద్దతున్న సంజీవరెడ్డి చేతిలో ఎన్జీ రంగా ఓడిపోయారు. దరిమిలా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలన్న నినాదం పుంజుకుంది. ఇంతలో 1952 ఎన్నికలొచ్చాయి. రాజగోపాలా చారి మద్రాస్ ముఖ్య మంత్రయ్యారు. ఆంధ్ర మంత్రుల్లో చాలామంది ఓడిపోవడంతో, విద్యాధికుడైన దామోదరం సంజీవయ్యను, నెహ్రూ సలహామీద, మంత్రివర్గంలోకి తీసుకున్నారు రాజాజీ. జస్టిస్ శ్రీకృష్ణ కమీషన్ నివేదిక తెలంగాణాకు అనుకూలంగా రాకపోతే "అంతర్యుద్ధం" తప్పదని కేసీఆర్ హెచ్చరిక చేసిన విధంగానే, అప్పట్లో అదే మాటను, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు విషయంలో, ప్రకాశం పంతులు ఉపయోగించారు.

అప్పట్లో నీలం సంజీవ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి గా, అల్లూరి సత్యనారాయణ రాజు ప్రధాన కార్యదర్శి గా, కాసు బ్రహ్మానందరెడ్డి గుంటూరు జిల్లా పరిషత్ బోర్డ్ చైర్మన్ గా వున్నారు.. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కాబోతున్న సమయంలో, రాజధాని ఎక్కడ వుండాలన్న సంగతి మద్రాస్ శాసనసభలోని ఎమ్మెల్యేలు నిర్ణయించాల్సి వచ్చింది. ఎన్జీ రంగా తిరుపతి కావాలంటే, రాయలసీమలో వుండాలని ఎవరూ అనలేదు. ఏర్పాటు కాబోయే ఆంధ్ర రాష్ట్రం, తాత్కాలికమే నన్న రాజాజీ, ఒక్క రోజు కూడా మద్రాస్ రాజధానిగా వుండడానికి ఒప్పుకోలేదు. పైగా అంతా కాంగ్రెస్ వారే. అందరివీ ధిక్కార స్వరాల కాంగ్రెస్ రాజకీయాలే. నీలం-కళా వెంకట్రావుల వ్యూహంలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయి, కాంగ్రెస్ వదిలి వెళ్లిపోయిన ప్రకాశం, స్వగృహ ప్రవేశం చేసి, సంజీవరెడ్డి ప్రోద్బలంతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యారు. తాత్కాలికంగా కర్నూల్ ను రాజధానిగా ఎంపిక చేశారు. ఉప ముఖ్య మంత్రి పదవి దక్కించుకున్న నీలం సంజీవ రెడ్డి చక్రం తిప్పారు. కాంగ్రెస్ ను వీడిన ఆయన ప్రత్యర్థి ఎన్జీ రంగా కృషిక్ లోక్ పార్టీకి నాయకుడప్పట్లో.

శాసన సభ సమావేశాలలో, మద్య నిషేధం సాకుగా, సంజీవరెడ్డి బలపర్చిన ప్రకాశం పంతులు ఓటమి దిశగా కొందరు కాంగ్రెస్ నాయకులు పావులు కదిలించారు. అడుసుమల్లి సుబ్రహ్మణ్యం శాసన సభకు రాకుండా ఒక వర్గం ప్రణాళిక వేసింది. ఓడిన ప్రకాశం రాజీనామా చేయడంతో గవర్నర్ పాలన విధించడం, శాసన సభను రద్దుచేయడం జరిగింది. అవన్నీ ముఠా రాజకీయాలే. దరిమిలా, నీలం సంజీవరెడ్డి స్థానంలో బెజవాడ గోపాల రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1955 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో "కుల రాజకీయాలు" బహిర్గతం కావడం కూడ ఆరంభమయ్యాయనవచ్చు. కమ్యూనిస్టు అభ్యర్థులపై పోటీకి దిగడానికి వెనుకంజ వేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేయడానికి కుల రాజకీయాల అవసరం కలిగింది. ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు మాకినేని బసవ పున్నయ్యను కూచిన పూడిలో ఓడించడానికి వ్యూహాత్మకంగా, గౌడ కులానికి చెందిన అనగాని భగవంత రావును ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ. భారీ మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నాయకుడిగా నీలం-బెజవాడల మధ్య పోటీ వుండడంతో, అధిష్ఠానం బెజవాడ గోపాల రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పుకుని, పి డబ్ల్యు శాఖతో తృప్తి పడాల్సి వచ్చింది. మళ్ళీ ముఠా రాజకీయాలు మొదలయ్యాయి. గోపాలరెడ్డికి వ్యతిరేకంగా, కళా వెంకట్రావును, కల్లూరు చంద్రమౌళిని కలుపుకుని నీలం సంజీవరెడ్డి పనిచేయ సాగారు. అధిష్ఠానం దూతగా వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి వారి మధ్య తాత్కాలికంగా రాజీ కుదిరించారు. అయినా ధిక్కార స్వరాలు ఆగిపోలేదు.

బెజవాడ గోపాలరెడ్డికి పోటీగా, కాసు బ్రహ్మానందరెడ్డిని ప్రోత్సహించిన నీలం సంజీవరెడ్డి, తమతో అల్లూరి సత్యనారాయణ రాజును కలుపుకున్నారు. అప్పట్లో ఆ ముగ్గురి ని "బుర్రకథ దళం" అని ముద్దు పేరుతో పిలిచేవారట. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా, 1956 లో విశాలాంధ్రగా "ఆంధ్ర ప్రదేశ్" రాష్ట్రం అవతరించింది. ముఖ్య మంత్రి పదవికోసం మరో మారు పోటీ మొదలైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి-మర్రి చెన్నారెడ్డి మద్దతు బెజవాడకు, బూర్గుల-విబి రాజుల మద్దతు నీలంకు లభించింది. ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు నీలంకే మద్దతు పలికారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. బెజవాడ గోపాలరెడ్డి ఆర్థిక మంత్రిగా సర్దుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి చేసినాయన, తన మంత్రివర్గంలోనే ఉప ముఖ్య మంత్రిగా పనిచేసిన వ్యక్తి కింద ఆర్థిక శాఖను నిర్వహించాల్సి వచ్చింది. ఒప్పుకోకపోతే, ధిక్కార స్వరాలు వినిపించే వే ! 1957 లో తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. నీలం వర్గానికి అధిక స్థానాలు వచ్చాయి. తన స్థానాన్ని పదిలపర్చుకోసాగాడు. మళ్లీ ధిక్కార స్వరాలు వినిపించాయి. కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పాగా పుల్లారెడ్డి, బొమ్మ కంటి సత్యనారాయణ రావు ప్రభృతులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పార్టీని వదిలి, "డెమోక్రాటిక్ పార్టీ” ని స్థాపించారు. విజయవాడలో నిర్వహించిన ఆ పార్టీ మహాసభలో ప్రసంగించిన మర్రి చెన్నారెడ్డి " కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరడం కంటె, కృష్ణా నదిలో పడడం మంచిదని" అన్నారు. అదే రోజుల్లో జాతీయ స్థాయిలో రామ మనోహర్ లోహియా స్థాపించిన "సోషలిస్ట్ పార్టీ” లో, రాష్ట్రానికి చెందిన పివిజి రాజు చేరారు. వారూ-వీరూ ఏకమై "సోషలిస్ట్ డెమోక్రాటిక్ పార్టీ" గా అవతరించి, నీలంకు వ్యతిరేకంగా పనిచేశారు. పార్టీ వదిలిన మర్రి చెన్నారెడ్డి అప్పుడే కాకుండా అలా మరి రెండు పర్యాయాలు వదలడం-స్వగృహ ప్రవేశం చేయడం, పదవులను అనుభవించడం అందరికీ తెలిసిందే.

నీలం సంజీవరెడ్డి బలాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి లాగడమే మంచిదని భావించిన జవహర్లాల్ నెహ్రూ, పథకం ప్రకారం 1957-59 మధ్య కాలంలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన యు ఎన్ ధేబర్ స్థానంలో, 1960 లో ఆయన్ను నియమించారు. సంజీవరెడ్డి స్థానంలో ఎవర్ని ముఖ్య మంత్రి చేయాలన్న విషయంలో మళ్లీ పోటీ మొదలైంది. అల్లూరి సత్యనారాయణ రాజు కాని, కాసు బ్రహ్మానందరెడ్డి కాని ముఖ్య మంత్రి అయ్యే అవకాశాలున్నప్పటికీ, ఇరువురి లో ఎవరినీ కాదనలేని పరిస్థితుల్లో, అధిష్ఠానం ఆశీస్సులతో, వారిద్దరి మద్దతుతో, రాజీ అభ్యర్థిగా దామోదరం సంజీవయ్యను పీఠం ఎక్కించారు. తనకు మద్దతిచ్చిన అల్లూరికి-కాసుకు, పి డబ్ల్యు-ఆర్థిక శాఖలను కేటాయించారు సంజీవయ్య. వ్యతిరేకించిన ఏసీ సుబ్బారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. మర్రి చెన్నారెడ్డి స్థాపించిన డెమోక్రాటిక్ పార్టీకి చెందిన బొమ్మ కంటి సత్యనారాయణ రావు అప్పట్లో సంజీవయ్యకు మద్దతుగా చక్రం తిప్పారు. ఏ కొద్దిమందో తప్ప, దాదాపు కాంగ్రెస్ పార్టీలోని హేమా-హేమీలందరు సంజీవయ్యను ధిక్కరించిన వారే ! ఐనా పార్టీలో కొనసాగారు. రాష్ట్ర రాజకీయాలకు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా వున్న నీలం సంజీవరెడ్డి అప్పట్లో దూరంగా వుండేవారు. 1962 లో ఎన్నిక లొచ్చే సమయానికల్లా సంజీవరెడ్డిని తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకుని రావడం జరిగింది. ఆయన స్థానంలో సంజీవయ్యను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేశారు. అంతకుముందే అనధికారికంగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్న సోషలిస్ట్ డెమోక్రాటిక్ పార్టీని, 1962 ఎన్నికల్లో, కాంగ్రెస్ లో విలీనం చేశారు మర్రి చెన్నారెడ్డి ప్రభృతులు. ఎన్నికలనంతరం 1964 లో కర్నూల్ బస్సుల జాతీయం కేసులో రాజీనామా చేసేంతవరకు బలీయమైన నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి కొనసాగారు. ధిక్కార స్వరాలకు కొంతకాలం తెర పడింది.

1964 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అయింతర్వాత, మళ్లీ ముఠా రాజకీయాలకు తెర లేచింది. కాసుకు వ్యతిరేకంగా ఏసీ సుబ్బారెడ్డి అసంతృప్తి కాంగ్రెస్ వర్గానికి బాహాటంగానే నాయకత్వం వహించారు. కాసు వర్గాన్ని "మినిస్టీరియలిస్టులు" అని, ఏసీ వర్గాన్ని "డిసిడెంట్లు" అని పిలిచేవారు. మర్రి చెన్నారెడ్డి మద్దతు కాసు వర్గానికుండేది. ఏసీ సుబ్బారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి పేకాటలో, టెన్నిస్ క్రీడలో స్నేహితులైనా, రాజకీయాల్లో విరోధులే. 1967 లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలిచిన మర్రి చెన్నారెడ్డి ఎన్నికల కేసులో సభ్యత్వాన్ని కోల్పోవడమే కాకుండా, ఆరేళ్లు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడవడంతో, 1969 తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం చేపట్టారు. అప్పట్లో, ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకుల్లో ఒకరైన శీలం సిద్దారెడ్డికి కాసు అండదండలుండడంతో, మరో నాయకుడు జలగం వెంగళ రావు పరోక్షంగా తెలంగాణ ఉద్యమం ఖమ్మంలో మొదలవడానికి ప్రోత్సాహం ఇచ్చారంటారు. అదో రకమైన ధిక్కారం. ఇక చెన్నారెడ్డి నాయకత్వంలో హింసా మార్గంలోకి పోయిన తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మానందరెడ్డిని, ఆయన భార్యను బాహాటంగా కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతో ఎలా దూషించిందీ అందరికీ తెలిసిన విషయమే. కేంద్ర మంత్రివర్గంలో చేరిన నీలం సంజీవరెడ్డి గతంలో మాదిరిగానే, రాష్ట్ర రాజకీయాలలో తల దూర్చలేదు. చెన్నారెడ్డి ధిక్కార ధోరణి పుణ్యమా అని, కాసు ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఆయన స్థానంలో పీవీ నరసింహా రావు రావడం జరిగింది.

పీవీ మంత్రివర్గంలో పనిచేసిన జలగం వెంగళ రావు, ఆయనకు వ్యతిరేకంగా ఎప్పుడూ ధిక్కార ధోరణి ప్రదర్శించిన వాడే. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరించి, తెలంగాణ ప్రజా సమితి పేరుమీద ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు చెన్నారెడ్డి బలపర్చిన అభ్యర్థులు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో సస్పెన్షన్లకు లెక్కేలేదు. ముల్కి కేసులో తీర్పుపై పీవీ వ్యాఖ్యలకు నిరసనగా తలెత్తిన ఉద్యమం ఫలితంగా ఆయన పదవి కోల్పోవడం, ఆయన స్థానంలో కొన్నాళ్లకు జలగం ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఎమర్జెన్సీ కాలంలో ఇందిర విధేయుడుగా, అత్యంత సమర్థుడైన ముఖ్య మంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం, ఆ తర్వాత కాలంలో, ఇందిర మంత్రివర్గంలో "ఎమర్జెన్సీ హోం మినిస్టర్" గా పనిచేసిన "బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్" లో చేరాడు. 1978 శాసనసభ ఎన్నికల్లో, ఇందిరా కాంగ్రెస్ (నేటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్-ఐ) ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి విజయ పథంలో నడిపించగా, వెంగళ రావు నేతృత్వంలోని కాంగ్రెస్ పరాజయం పాలైంది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మొదటిసారి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన మాజీ ప్రధాని ఇందిరకు ఖమ్మంలో (తన స్వంత జిల్లా) కనీసం గెస్ట్ హౌజ్ కూడా ఇవ్వని వెంగళరావు మళ్ళీ ఇందిర పంచన చేరి కేంద్రంలో మంత్రి పదవి అనుభవించారు. పీసీసీ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. ఏమైందాయన ధిక్కార స్వరం? ఆయన బాటలోనే బ్రహ్మానందరెడ్డి నడిచారనాలి.

ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతో, సమ్మతి-అసమ్మతి రాగాల మధ్య, ముఖ్యమంత్రుల మార్పిడికి శ్రీకారం చుట్టడం జరిగింది. బహిరంగంగానే, అసమ్మతికి అధిష్ఠానం ప్రోత్సాహం లభించేది. ఒకరి వెంట మరొకరు అంజయ్య, భవనం, విజయ భాస్కర రెడ్డి ముఖ్య మంత్రులయ్యారు అసమ్మతి పుణ్యమా అని. 1983 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ను, 1989 లో మరో పర్యాయం, పీసీసీ అధ్యక్షుడుగా గెలిపించిన చెన్నారెడ్డి, ముఖ్య మంత్రి కావడానికి అధిష్ఠానం ఆశీస్సులు తప్పనిసరైందని అనక తప్పదు. మళ్ళీ అసమ్మతి... మళ్ళీ ధిక్కార స్వరాలు.. ఏడాదికే ఆయన స్థానంలో.. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ముఖ్య మంత్రయ్యారు. ఆయన్నూ వుండనివ్వలేదు అధిష్ఠానం. మరో మారు విజయ భాస్కర రెడ్డిని ముఖ్య మంత్రిని చేసి, తెలుగు దేశం ఇంకో మారు అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది. అప్పట్లో అసమ్మతిని, ధిక్కార స్వరాన్ని వినిపించిన డాక్టర్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసినా, కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి మరో పది సంవత్సరాలు పట్టింది. ఆయన రెండో పర్యాయం ముఖ్య మంత్రి అయింతర్వాత, ఆకస్మికంగా మరణించడంతో, ఆరేళ్లు వినిపించని ధిక్కార స్వరాలు మళ్లీ మొదలయ్యాయి. ఆయన వున్నప్పుడు ధిక్కారానికి అవసరం లేనందునో-వీలు కలగనందునో తాత్కాలికంగా ఆగినా, కాంగ్రెస్ లో అంతర్భాగమైన ధిక్కార పర్వాలు, అసంతృప్తి కాండలు మళ్ళీ మొదలయ్యాయి.

నూటా పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో ఏదో విధంగా అధిష్ఠానాన్ని ధిక్కరించని నాయకులు అరుదు. కాకపోతే ఆ తర్వాత సర్దుకు పోయేవారు. మూడు సార్లు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మోతీలాల్ నెహ్రూ అధిష్ఠానాన్ని ధిక్కరించి "స్వరాజిస్ట్ పార్టీ" లో చేరారు. స్వతంత్రం రాక పూర్వం మూడు పర్యాయాలు, వచ్చిన తర్వాత రెండు సార్లు అధ్యక్షుడైన జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడు టాండన్ ను రాజీనామా చేయించేందుకు ధిక్కార ధోరణితో వ్యవహరించారు. సుభాష్ చంద్ర బోసును దింపే ప్రయత్నంలో గాంధీజీ అంతటి వాడే రాగ ద్వేషాలకు లోనయ్యారు. స్వతంత్రం వచ్చిన సమయంలో ఆచార్య కృపలానీ అధ్యక్షుడిగా వున్నారు. 1961-69 మధ్య కాలంలో నీలం సంజీవరెడ్డి, కామరాజ్ నాడార్, నిజలింగప్పల పర్వం కొనసాగింది. 1969 లో ఇందిరా గాంధీ శకం మొదలై, పార్టీ చీలిపోయి, జగ్జీవన్ రాం అధ్యక్షుడయ్యారు. అధిష్ఠానాన్ని "సిండికేట్" పేరుతో ధిక్కరించిన ఇందిర పార్టీనే చీల్చారు. కొన్నాళ్లు ఇతరులకు అవకాశమిచ్చిన ఇందిరా గాంధీ 1983 నుంచి 1985 వరకు స్వయంగా తానే అధ్యక్ష పీఠాన్ని అధిష్టించింది. 1985 లో కొడుకు రాజీవ్ గాంధీకి అధ్యక్ష వారసత్వం లభించింది. ఇక అప్పటినుంచి హత్యకు గురయ్యేవరకు ఆయనే అధ్యక్షుడు. పీవీ, కేసరిల తర్వాత ఆ పీఠాన్ని 1998 లో అధిష్టించిన సోనియా గాంధీ, గత 12 సంవత్సరాలుగా మకుటం లేని మహారాణిలా, ఒంటి "చేతితో" అధిష్ఠానం అంటే తానే అన్న రీతిలో వ్యవహరిస్తోంది. పార్టీలో "ఏకాభిప్రాయం" అంటే, సోనియా గాంధి అనే "ఏక వ్యక్తి అభిప్రాయం" గా కాంగ్రెస్ పరిస్థితి మారిపోయింది. పార్టీలో ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత వుంటుందో-ఎప్పుడు ఎవరికి వుండకుండా పోతుందో చెప్ప గల వారు లేరిప్పుడు. సుమారు పాతిక పర్యాయాలు పార్టీ పగ్గాలను చేజిక్కించుకుని, నలభై సంవత్సరాల పాటు అధ్యక్ష పీఠం అధిష్ఠించింది నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారే. అదే వారసత్వానికి చెందిన సోనియా గాంధీ నాయకత్వంలోని అధిష్ఠానం ప్రస్తుతం అవలంభిస్తున్నది మాత్రం "విభజించి పెత్తనం సాగించడం" అనే బ్రిటీష్ పోకడలు. భవిష్యత్ లో పార్టీకి ఆ పోకడలు లాభం చేకూరుస్తాయనుకోవడం పొరపాటే.

XIII-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-13) : వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-13
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ నోడల్ ఏజన్సీగా, 108-అత్యవసర సహాయ సేవలు, ఆంధ్ర ప్రదేశ్ తో సహా పది రాష్ట్రాలలో లభ్యమవుతున్నాయిప్పుడు. గుజరాత్, ఉత్తరాంచల్, గోవా, తమిళనాడు, రాజస్థాన్, కర్నాటక, అస్సాం, మధ్య ప్రదేశ్, మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వాలు ఇ.ఎం.ఆర్.ఐ తో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుని, ఆంధ్ర ప్రదేశ్ తరహాలోనే అత్యవసర సహాయ సేవలు అక్కడి ప్రజలకు పూర్తి ఉచితంగా అందిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించిన సత్యం సంక్షోభం దరిమిలా, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామలింగ రాజు జనవరి 2009 లో రాజీనామా చేయడంతో, మీడియాలో ఆ సేవలందించడం పట్ల సందేహాలు వ్యక్తమైన నేపధ్యంలో, ఆంధ్ర ప్రదేశ్ (దివంగత) ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన హామీలాంటి హామీనే 108-అత్యవసర సహాయ సేవలు లభ్యమవుతున్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు, రాజకీయాలకు అతీతంగా ప్రకటించారు. అంతవరకు ప్రభుత్వం భరిస్తున్న 95% నిర్వహణ వ్యయాన్ని, నూటికి 100% భరించడానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. సుప్రీం కోర్టులో ఇ.ఎం.ఆర్.ఐ కి వ్యతిరేకంగా వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం గాని, సంస్థ చైర్మన్ రాజీనామా గాని, ఆ సంస్థ పట్ల రాష్ట్ర ప్రభుత్వాలకున్న "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" సడలించ లేకపోయాయి . అప్పట్లో "విశ్వసనీయత" కు ఇ.ఎం.ఆర్.ఐ పర్యాయపదం అనొచ్చు. ఈ అన్ని రాష్ట్రాలలో మేఘాలయ ప్రభుత్వాన్ని మరీ-మరీ అభినందించాలి. కోర్టు కేసులో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు అందాయని తెలిసి కూడా, సంస్థ చైర్మన్ రాజీనామా చేశారని తెలిసి కూడా, ఫిబ్రవరి 2009 లో, వీటన్నిటి కి అతీతంగా, అక్కడి అధికారులు-అనధికారులు ఒక్క మాట మీద నిలబడి, ఇ.ఎం.ఆర్.ఐ ని నోడల్ ఏజన్సీగా నియమిస్తూ ఎంఓయు కుదుర్చుకునేందుకు కృషి చేశారు.

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో, ప్రపంచంలోనే, అత్యంత అరుదైన పద్ధతిలో, అత్యవసర సహాయ సేవలను పూర్తి ఉచితంగా పౌరులకు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం-ఆ రాష్ట్ర (దివంగత) ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి. అచిర కాలంలోనే, ఇక్కడ లభిస్తున్న ఈ అరుదైన తరహా సేవల ప్రక్రియను అధ్యయనం చేసేందుకు, పొరుగు రాష్ట్రాల నుంచి-విదేశాల నుంచి అధికార-అనధికార ప్రతినిధులు, బృందాలు రావడం మొదలయింది. అంతటితో ఆగకుండా, ఆ సేవలను ఇతర రాష్ట్రాలలో ఆరంభించడం కూడా మొదలయింది. అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాల ప్రభుత్వాలు కూడా ఇ.ఎం.ఆర్.ఐ ద్వారా సేవలను ప్రారంభించడానికి సిద్ధమయ్యాయి. రాజుగారు చైర్మన్ గా వుండి వుంటే, ఈ పాటికి కనీసం రెండు-మూడు ఇతర దేశాలలో ఇ.ఎం.ఆర్.ఐ ఝండా ఎగురుతుండేదే ! ఇప్పుడిక ఆస్కారం లేకపోగా, అప్పట్లో ముందుకొచ్చిన కొన్ని ప్రభుత్వాలు వెనక్కు తగ్గుతున్నాయి కూడా. సేవలు లభ్యమవుతున్న రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాల ఆలోచనా ధోరణిలో కొంత మార్పు వస్తున్న సంకేతాలు అందుతున్నాయి. మరో వైపు, గతంలో మాదిరిగానే, ఇ.ఎం.ఆర్.ఐ పట్ల-సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారి పట్ల "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" ప్రదర్శిస్తూ, ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ఏప్రిల్ 2010 లో, ఎంఓయు కుదుర్చుకుంది. ఆ "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" ఆయన పై స్థాయిలో వున్న"భాగస్వామ్య యాజమాన్యం" ఎంతవరకు నిలుపుకోగలుగుతుందో చూడాలి.

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియలో, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభమైన అత్యవసర సహాయ సేవలు, దరిమిలా, అతి కొద్ది కాలంలోనే, పది రాష్ట్రాలకు వ్యాపించడం, సుమారు మూడువేల అంబులెన్సుల ద్వారా ప్రతిరోజు పది-పదిహేను వేలకు పైగా ఎమర్జెన్సీ కేసులకు సంబంధించిన వ్యక్తులను సమీప ఆసుపత్రికి చేర్చడం, కులాలకు-మతాలకు-రాజకీయాలకు-సామాజిక వర్గాలకు-ధనిక, బీద తేడాలకు-స్త్రీ, పురుష భేదాలకు అతీతంగా లక్షల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయడం పలు జాతీయ-అంతర్జాతీయ సంస్థలను, పరిశోధకులను ఆసక్తి పరిచాయి. అసలీ ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ ఏమిటని-ఎలా రూపు దిద్దుకుంటుందని-మనుగడ ఎలా సాగిస్తున్నదని ప్రశ్నించసాగారు. వాస్తవానికి, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మీద, "సిద్ధాంతపరంగా" ఎన్నో వ్యాసాలు-మరెన్నో పరిశోధనలు పుంఖానుపుంఖాలుగా మనకు లభ్యమయినప్పటికీ, "ప్రయోగాత్మకంగా"-"ఆచరణాత్మకంగా" ఆ ప్రక్రియకు భాష్యం చెప్పింది 108-అత్యవసర సహాయ సేవలను అందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ, అందుకు ప్రోద్బలం-ప్రోత్సాహం అందిస్తున్న భారత దేశంలోని పది రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే. ప్రయివేట్ భాగస్వామి "లాభాపేక్ష" తో ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం-కొనసాగించడం ఆచరణ సాధ్యమవుతుందేమోగాని, "లాభాపేక్ష లేకుండా" ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మనుగడ సాగించడం తేలికైన విషయం కాదు. అలా సాధ్య పడాలంటే భాగస్వామ్య పక్షాలైన ఇరువురి లో నిబద్ధత కావాలి. ఒకరిపై ఇంకొకరికి "విశ్వాసం-నమ్మకం" వుండాలి. "విశ్వసనీయత" కు ప్రాధాన్యత ఇవ్వాలి కాని, "వంచన" కు ఏ ఒక్కరు పాల్పడినా ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. పలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం సడలుతున్న వర్తమాన పరిస్థితులలో సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రక్రియకు కూడా విఘాతం కలిగితే ఇబ్బందులకు గురయ్యేది సామాన్య ప్రజలే-వారిలోను ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారే. ఆ ప్రమాదం పొంచి వుంటే, దానికి బాధ్యులైన వారందరూ, అధిగమించడానికి చర్యలు చేపట్టాలి.

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో అత్యవసర సహాయ సేవలు పది రాష్ట్రాలలో లభ్యం కావడానికి ప్రక్రియ ఎలా జరిగిందో తెలుసుకోవడం మంచిది. ఈ భాగస్వామ్యంలో ప్రయివేట్ భాగస్వామిగా కేవలం ఇ.ఎం.ఆర్.ఐ నే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఎంపిక చేశాయో-ఎలా ఎంపిక చేశాయో-చేయాల్సి వచ్చిందో తెలుసుకోవడం కూడా అవసరమే. ఆ విషయాలు సవివరంగా తెలుసుకునే ముందర ఒక ప్రముఖ జాతీయ ఆంగ్ల వారపత్రిక (ఔట్ లుక్, జనవరి 26, 2009) ఇ.ఎం.ఆర్.ఐ ని తప్పుబడుతూ ప్రచురించిన వ్యాసంలోని ముఖ్య విషయాలపై దృష్టి సారించాలి. సత్యం కుంభకోణం-సుప్రీం కోర్టులో ఇ.ఎం.ఆర్.ఐ పై ప్రజా ప్రయోజన వ్యాజ్యం నేపధ్యంలో ప్రచురించిన ఆ వ్యాసంలో పేర్కొన్న అంశాలు ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య సిద్ధాంతానికి-ఆచరణకు సంబంధించినవైనందున వాటిని ప్రస్తావించడం ఇక్కడ అవసరమని భావిస్తున్నాను. సత్యం కుంభకోణం నేపధ్యంలో రాజుగారికి సంబంధముందనుకున్న సంస్థలన్నిటి మీద నిఘా సంస్థల కన్ను పడిందని, సత్యం కంప్యూటర్ సర్వీసుల అనుబంధ సంస్థలకు చెందిన సమాచారాన్నంతా వెబ్సై్ట్లోంచి తొలగించే ప్రయత్నం చేసినా ఇ.ఎం.ఆర్.ఐ ని వేరుపరచడం సాధ్య పడలేదని, రాజు గారికి చెందిన 108-అత్యవసర సహాయ సేవలను ఇతర రాష్ట్రాలకు వ్యాపింప చేయడానికి "అనైతిక పద్ధతులను" అవలంబించారని, "టెండర్లను-ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇన్ట్రె స్టులను" తమకు అనుకూలంగా మలచుకోవడానికి అధికారులను ప్రభావితం చేశారని, తద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి "భారీ మొత్తంలో బడ్జెట్" కేటాయింపులు జరిగేలా చేశారని ఆ వ్యాసంలో ఆరోపించడం జరిగింది. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థలో పనిచేస్తున్న "యాజమాన్య స్థాయి ఉద్యోగులు" భారీ మొత్తంలో వేతనాలు పొందేవారని, అందులో కొందరి జీతభత్యాలన్ని కలిపి, ఏడాదికి సుమారు "కోటి రూపాయల" వరకుంటుందని ఆరోపించబడింది.

ఆగస్టు 15, 2005 న కేవలం 30 అంబులెన్సులతో ఆంధ్ర ప్రదేశ్ లో ఆరంభమయిన ఇ.ఎం.ఆర్.ఐ ప్రస్థానం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వ్యాపించి, నెల-నెలా ఒక్కో అంబులెన్సుకు రు. 1, 12, 000 చొప్పున, నిర్వహణ వ్యయంలో ప్రభుత్వ పరంగా లభించిన 95% నిధులతో, తమ వంతుగా కేవలం 5% నిధులను మాత్రమే భరిస్తూ, 652 అంబులెన్సులను నడిపే స్థాయికి ఎదిగిందని, ఇక అక్కడినుంచి, ఇతర రాష్ట్రాలలో "టెండర్" ప్రక్రియను ప్రభావితం చేసి దిన-దిన ప్రవర్థమానం అయిందని వ్యాసంలో రాశారు. అప్పట్లో ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య యూనిట్ లీడ్ పార్ట్ నర్ హోదాలోను, తర్వాత కన్సల్టెంట్ గాను పనిచేస్తున్న "జ్వాలా నరసింహారావు" (నేను), తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ కార్యదర్శి (పి. డబ్ల్యు. సి. డవిడర్) తో నిరంతరం సంబంధాలు ఏర్పాటు చేసుకుని, ప్రభుత్వం విడుదల చేయబోయే టెండర్ అడ్వర్టయిజ్ మెంటులో పొందుపరచాల్సిన అంశాలను ఇ.ఎం.ఆర్.ఐ కి అనుకూలంగా వుండే విధంగా తయారు చేయించాడని ఆరోపణ కూడా వుందా వ్యాసంలో. అందుకు సాక్ష్యంగా ఇరువురి మధ్య సాగిన ఇ-మెయిల్ కమ్యూనికేషన్లు తమ దగ్గరున్నాయని పేర్కొన్నారు. అలానే మధ్య ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని విషయాలను రాశారందులో. దీంట్లో అనైతికత ఏమీ లేదని నేను చేసిన వ్యాఖ్యానాన్ని కూడా ప్రచురించారు అదే వ్యాసంలో. టెండర్లలో అత్యవసర సహాయ సేవలను నిర్వహించడానికి కావాల్సిన అనుభవం విషయంలో ఇ.ఎం.ఆర్.ఐ కున్న అనుభవానికి సరిపడే విధంగా మేం రాయించామని మరో ఆరోపణ చేశారు.

రెండు సంవత్సరాలలో, అంబులెన్సు నిర్వహణ వ్యయాన్ని, ఇ.ఎం.ఆర్.ఐ, నెలకు రు. 14, 000 నుంచి రు. 1,12,000 కు పెంచిందని మరో అసంబద్ధమైన ఆరోపణ కూడా చేసింది ఆ వార పత్రిక. మరీ హాస్యాస్పదమైన విషయం ఇంకోటుంది. ప్రపంచ బాంక్ నిధులతో, అప్పటివరకు తమిళనాడులో, నెల-నెలా ఒక్కో అంబులెన్సుకు రు. 10,000 సరిపోతుండగా, ఇ.ఎం.ఆర్.ఐ ప్రభావితం చేసినందున దాన్ని లక్ష రూపాయలకు పెంచారని దాని సారాంశం. ఇ.ఎం.ఆర్.ఐ పైన చేసిన ఆరోపణలకు బలం చేకూరేందుకు, సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన (ట్రాన్సపరెన్సీ ఇన్ కాంట్రాక్ట్స్) సంస్థకు చెందిన వ్యక్తి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు లోని అంశాలను కూడా పేర్కొనడం జరిగింది. వ్యాసంలోని ప్రతి అంశానికి వివరణ ఇస్తూ పంపిన లేఖను ప్రచురించే సాహసం ఇంతవరకూ చేయలేదాపత్రిక. ఇ.ఎం.ఆర్.ఐ ఇతర రాష్ట్రాలలో కూడా అత్యవసర సహాయ సేవలను ఎలా ప్రారంభించింది, నిర్వహణ వ్యయం పెంచడంలోని నిజా-నిజాలు వివరంగా మరో చోట తెలియచేస్తాను. క్లుప్తంగా, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియను, నిర్వహణ వ్యయం పెరిగిందా, లేక, ప్రభుత్వ పరంగా అందిస్తున్న నిధులు పెరిగాయా అనేది ఇక్కడ వివరిస్తాను.

ప్రభుత్వ పరంగా చాలాకాలం నుంచీ ప్రజలకు లభిస్తున్న ఆరోగ్య-వైద్య రంగ సేవల నిర్వహణలోని లోటుపాటులను అధిగమించడానికి, సంస్కరణలే శరణ్యమని, ఆ రంగంలోని నిపుణులు నిర్ధారించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలనే సరైన రీతిలో నిర్వహించలేని స్థితిలో వుందని గుర్తించింది ప్రభుత్వం. దానికి ప్రభుత్వాన్ని మాత్రమే నిందించడం కూడా భావ్యం కాదు. ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా గ్రామీణ-గిరిజన ప్రాంతాలలో పనిచేయడానికి వైద్యులు కావల్సినంత సంఖ్యలో ముందుకు రావడం లేదు. పట్టణాలలో పరిస్థితి మరో మాదిరిగా వుంది. ప్రభుత్వ పరంగా లభించే వైద్య సేవలకు ధీటుగా-మరింత మెరుగుగా ప్రయివేట్ సేవలు ఆరంభమై, అచిర కాలంలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటుచేసే స్థాయికి వ్యవస్థ మారింది. ఈ నేపధ్యంలో, సామాన్యుడికి-అ సామాన్యుడికి మధ్య ఆరోగ్య-వైద్య సేవలు లభించడం విషయంలో అంతరాలు పెరిగాయి. ప్రయివేట్ సామర్థ్యాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సిన అవసరం వచ్చింది. సంస్కరణలకు నాంది పలికింది ప్రభుత్వం. సంస్కరణలలో ప్రధానంగా పేర్కొనాల్సింది ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ ద్వారా ఆరోగ్య-వైద్య సేవల కల్పన. మన దేశంలో, స్వాతంత్ర్యం లభించిన తర్వాత, వరుస పంచవర్ష ప్రణాళికలలో-జాతీయ ఆరోగ్య, వైద్య విధానాలలో-ప్రపంచ బాంక్ ఆదేశాలలో, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ఆవశ్యకతకు సంబంధించి కొంత పురోగతి కనిపించినప్పటికీ, 2004 లో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణాత్మకమైన ప్రగతి కనిపించిందనాలి. ఆయన ఆలోచనా ధోరణికి అనుకూలంగా రూపుదిద్దుకున్న "జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్" ఈ ప్రక్రియకు మరికొంత ఊతమిచ్చిందనాలి. ఆ ఆలోచనల-ఆచరణల అడుగుజాడల్లోనే, అత్యవసర సహాయ సేవలను, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో సమకూర్చేందుకు ప్రభుత్వ, ప్రయివేట్ వ్యక్తులు ఆంధ్ర ప్రదేశ్ లో చొరవ తీసుకోవడం, క్రమేపీ ఇతర రాష్ట్రాలకు వ్యాపించడం జరిగింది.

అనవసర జాప్యాలకు, ప్రభుత్వ ఉద్యోగులలో కూరుకుపోయిన అలసత్వానికి అతీతంగా, ప్రభుత్వ పరంగా ప్రజలకు లభ్యమయ్యే అభివృద్ధి-సంక్షేమ పథకాలను మరింత మెరుగుగా-వేగవంతంగా అందించాలన్న ఆశయంతో, భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్న పలు ప్రజాస్వామ్య దేశాల్లో, ఐదారు దశాబ్దాల క్రితం ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన జరిగింది. దురదృష్టవశాత్తు, యావత్ ప్రపంచంలో, అధిక సంఖ్యాకం ప్రభుత్వ రంగ సంస్థలు, ఆశించిన రీతిలో ఫలితాలు ఇవ్వకపోగా, నష్టాల్లో కూరుకుపోయాయి. మార్గరెట్ థాచర్ బ్రిటన్ ప్రధానమంత్రిగా వున్న కాలంలో, ఆమె చొరవతో రూపు దిద్దుకున్న "ప్రభుత్వ రంగ సంస్థల సంస్కరణలు" క్రమేపీ వివిధ దేశాల ప్రభుత్వాధినేతలను ఆకర్షించాయి. సంస్కరణల పుణ్యమా అని, భారతదేశంలోని పలు ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేయడం జరిగింది. వాటి మూసివేతకు కొంత ముందు-వెనుకగా నెల కొన్న "జాయింట్ వెంచర్లు" కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. "ప్రభుత్వ ప్రయివేట్ సంయుక్త రంగంలో" స్థాపించిన పరిశ్రమలలో చాలా వరకు, యాజమాన్య పరమైన బాలారిష్టాలకు గురై, మూసివేయడం జరిగింది. సుమారు దశాబ్దంన్నర-రెండు దశాబ్దాల క్రితం, ఒకే ఒక్క సంవత్సరంలో, స్వదేశీ-విదేశీ సంస్థల భాగస్వామ్యంలో వందల సంఖ్యలో నెలకొల్పిన జాయింట్ వెంచర్లు, విరివిగా లాభాలను ఆర్జించాలన్న లక్ష్యంతో వెలిసినప్పటికీ, నష్టాల బాటలో పయనించాయి.

ఒక వైపు వీటి పరిస్థితి ఇలా వుంటే, మరో వైపు, ప్రయివేట్ రంగంలో నెల కొన్న అనేక సంస్థలు మెరుగైన సేవలను అందించడమే కాకుండా, లాభాలను ఆర్జించడం కూడ మొదలయింది. ప్రభుత్వ రంగ సంస్థల, జాయింట్ వెంచర్ల చేదు అనుభవాల నేపధ్యంలో-ప్రయివేట్ పరంగా మెరుగైన పౌర సేవలు లభ్యమవుతున్న నేపధ్యంలో, ప్రభుత్వ ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కేవలం ప్రభుత్వ పరంగా సమకూర్చడం కన్నా, ప్రయివేట్ తోడ్పాటు తీసుకోవడానికి అనువైన-సులువైన-ఆచరణాత్మకమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఫలితంగా రూపుదిద్దుకున్నదే "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం". ఈ ప్రక్రియలో రెండు రకాల భాగస్వామ్యాలు ఆచరణలోకి రాసాగాయి. దీర్ఘకాలిక ఉత్పాదకతను దృష్టిలో వుంచుకుని రూపొందించే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో, ప్రభుత్వ పరంగా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ కార్యక్రమాలను అమలుచేసేందుకు, లాభాపేక్షతో పనిచేస్తున్న ప్రయివేట్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మొదటిది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, ప్రభుత్వ బాధ్యతగా అమలుపర్చాల్సిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలను, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో-తోడ్పాటుతో, మరింత మెరుగైన రీతిలో, లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో ప్రజలకు సమకూర్చడం రెండో తరహా భాగస్వామ్యం. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో సంక్షేమ కార్యక్రమాలను-అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరిచేందుకు-దీర్ఘకాలంగా కొనసాగించేందుకు, అవసరమైన ముఖ్య సాధనం, భాగస్వామ్య పక్షాల మధ్య అంగీకారంతో తయారు చేయబడే "అవగాహనా ఒప్పందం" (Memorandum of Understanding-MoU).

ప్రభుత్వ శాఖలలోని నైపుణ్యం-నాణ్యతా పరమైన లోటుపాటులను, ప్రయివేట్ రంగంలోని (లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థల) ఆర్థిక పరమైన ఇబ్బందులను, ఉమ్మడిగా అధిగమించేందుకు, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం సరైన ప్రక్రియని ప్రభుత్వం గుర్తించింది. ఈ దిశగా, ఆరోగ్య-వైద్య రంగంలో మెరుగైన సేవలందించేందుకు, పదవ పంచవర్ష ప్రణాళికలోనే, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం ఆవశ్యకతను గుర్తించింది ప్రభుత్వం. అలా గుర్తించడానికి బలవత్తరమైన కారణం కూడా వుంది. అప్పట్లో (బహుశా ఇప్పటికీ), ఆరోగ్య-వైద్య రంగంలోని పలు సేవలను, ప్రభుత్వపరంగా లభించే అవకాశం లేకపోవడంతో, ఆర్థిక స్థోమత లేనివారు కూడా, కార్పొరేట్ రంగాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. దారిద్ర్యరేఖకు దిగువనున్న మూడోవంతు పైగా జనాభా మాత్రం, ప్రభుత్వపరంగా లభించే సేవలు ఎలా వున్నప్పటికి-నాణ్యత లోపాలున్నప్పటికీ, తమ వైద్యావసరాలకు అక్కడకు వెళ్లక తప్పలేదు. మధ్యతరగతి వారి విషయం అగమ్య గోచరం. అటు పోలేక-ఇటు పోక తప్పక అప్పుల్లో కూరుకు పోయేవారు. ఈ నేపధ్యంలో, మౌలిక వసతులను ఏర్పాటు చేయగలిగే సామర్థ్యం, దానికి కావాల్సిన తొలి విడత పట్టుబడి సమకూర్చుకోగలిగే స్థోమత, సాంకేతిక పరిజ్ఞానం అమర్చుకోగల శక్తి గల, లాభాపేక్ష లేని ప్రయివేట్ వ్యక్తులతో-సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని, తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు అందించే ఆలోచన చేసింది ప్రభుత్వం. పరస్పర సంబంధ-బాంధవ్యాల విషయంలో, భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం-నిబద్ధత-హక్కులు-బాధ్యతల విషయంలో, ఎవరి పాత్ర ఏమిటన్న అంశం క్షుణ్ణంగా పరిశీలించాలని భావించింది ప్రభుత్వం.

పదకొండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో (2007-2012), ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆరోగ్య సేవలందించేందుకు, తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యయనం చేయడానికి, ప్రణాళికా సంఘం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఒక కార్య నిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆరోగ్య రంగంలోని ఏ విభాగాలలో ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ అర్థవంతంగా-సమర్థవంతంగా ఫలితాలనిచ్చే అవకాశాలు, ఆ విధమైన భాగస్వామ్యంలో వ్యయ నియంత్రణ అవకాశాలు, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ లక్ష్యాలను అమలు పరిచే అవకాశాలు, ప్రజల ఆరోగ్య-వైద్య అవసరాలు తీర్చేందుకు భాగస్వామ్య ప్రక్రియ ఎలా తోడ్పడగలదన్న అంశాలు పరిశీలించాల్సిందిగా అధ్యయన నిర్వాహక బృందాన్ని కోరింది ప్రణాళికా సంఘం. ప్రజల ఆరోగ్య-వైద్య అవసరాలకు అనుగుణంగా సమర్థవంతమైన-మెరుగైన-నాణ్యమైన సేవలను పౌరులకు లభ్యమయ్యేలా చేసేందుకు, యావత్ వైద్య రంగం "జాతీయ సంపద" గా మలిచేందుకు, ఒక ప్రధానమైన సాధనంగా "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం" ఉపయోగించుకోవాలని, ఆ ప్రక్రియకు నిర్వచనం వివరిస్తూ పేర్కొంది ప్రణాళికా సంఘం. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలోని ప్రయివేట్ పదానికి పెడార్థాలు చెప్పరాదని, ఆరోగ్యరంగాన్ని పూర్తిగా "ప్రయివేటీకరణ" చేసి, బాధ్యతలనుంచి ప్రభుత్వం తప్పుకుంటున్నదని భాష్యం చెప్పొద్దని ప్రణాళికా సంఘం అభిప్రాయం వెలిబుచ్చింది.

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆలోచనలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ లక్ష్యాలు-ధ్యేయాలు చేరుకునేందుకు, అందులో ప్రధాన భాగమైన "గ్రామీణ అత్యవసర ఆరోగ్య రవాణా సేవల పథకం" అమలుకు-ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభమై పది రాష్ట్రాలకు పాకిన 108-అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడింది.

Tuesday, July 20, 2010

అంతర్ రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి రాష్ట్రేతర ఇంజనీరింగు నిపుణులను నియమించాలి : వనం జ్వాలా నరసింహారావు

వనం జ్వాలా నరసింహారావు

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు నలభై సంవత్సరాల వరకు, అటు కేంద్రంలోను, ఇటు పలు రాష్ట్రాలలోను కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో వున్నాయి. సరిహద్దు నున్న పొరుగు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తి, పార్టీ పరంగా చాలావరకు సమసి పోయినా, అన్ని విషయాల్లో-అన్ని సందర్భాల్లో అంగీకారానికి వచ్చాయని అనలేం. కాకపోతే ఆరంభంలో, రాష్ట్రానికి ఒకటో-రెండో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వంటివి మాత్రమే వుండడంతో, పెద్దగా పేచీలుండకపోయేయి. క్రమేపీ, ఒక్క నీటి పారుదల ప్రాజెక్టులే కాకుండా, రక-రకాల పంపకాలలో విభేదాలు తలెత్తడం మొదలైంది. అవీ, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్యనే-కాంగ్రెస్ ఇంకా కేంద్రంలో అధికారం కోల్పోక ముందే తలెత్తాయి. కాంగ్రేసేతర ప్రభుత్వాలు అధికారంలోకి రావడంతో, విభేదాలు చిలికి-చిలికి గాలివానలయ్యాయి. పొరుగు రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యలను రాజకీయ కోణం నుంచి, రాజకీయ లబ్దిని దృష్టిలో వుంచుకుని చూడడం సహజమైంది. ఇంతలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ-తమ ప్రాంత ప్రజలకు లాభం చేకూరాలన్న కోణంలో ఆలోచన చేయడం, ఆ ఆలోచనలో రాజకీయం వుండడం, అంతటితో ఆగకుండా కొందరు నాయకులు పొరుగు రాష్ట్రాల వారికి నష్టం జరిగినా తమకు లబ్ది జరగాలని ముందుకు సాగడం నిరంతర సమస్యలకు నాంది పలింది. తమ రాష్ట్రం నుండి పారుతున్న నీటిపై తమకే హక్కు అని కొందరు వాదిస్తే, మిగులు జలాలపై హక్కు తమదనే అని మరికొందరు వాదించ సాగారు. సహజంగా ప్రవహించే నీటిపై హక్కు ఎవరికి-ఎంత మోతాదులో వుండాల్నోనని తేల్చాల్సిన కేంద్ర జల వనరుల సంఘం, ప్రాజెక్టులు ఆరంభించినప్పటినుంచి, పూర్తయ్యేవరకు నిమ్మకు నీరెత్తినట్లు వుండి, ఆ తర్వాత తమకే హక్కుందని వాదించే పొరుగునున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తమదైన శైలిలో వంతుల వారీగా మద్దతిచ్చి సమస్యను మరింత జటిలం చేయడం ఆనవాయితీ అయిపోయింది. అలాంటి తాజా వివాదమే బాబ్లీ ప్రాజెక్టు.

బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణంలో మహారాష్ట్ర ప్రభుత్వం చేసింది, తప్పా-ఒప్పా అని నిర్ణయించే అధికారమున్న "కేంద్ర జల వనరుల సంఘం" తీర్పు చెప్పే లోపునే నిర్మాణం పూర్తైంది. తెలుగు దేశం హయాంలోనే పనులు మొదలయ్యాయని కాంగ్రెస్ వారు, కాదని తెలుగుదేశం నాయకులు వాదించు కోవడంతో మొదలైన జగడం, సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలనే వరకు పోయింది. అఖిల పక్ష కమిటీ ప్రధానిని కలిసే లోపునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, తెలుగు దేశం పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధుల బృందం, బాబ్లీ ప్రాజెక్టును సందర్శించి, స్వయంగా అధ్యయనం చేసి, ప్రధానికి అన్ని విషయాలు తెలియచేయాలన్న ఆలోచనతో ఆంధ్ర-మహారాష్ట్ర సరిహద్దుకు చేరుకుంది. వారిని మహారాష్ట్రలోకి రానీకుండా అడ్డుకున్న మరాఠా పోలీసులు, అంతటితో ఆగకుండా, ప్రాజెక్టుకు తీసుకుపోతామని మభ్యపెట్టి పోలీసు వాహనం ఎక్కించి, అతి జుగుప్సాకరమైన పద్ధతిలో వారందరినీ "అరెస్టు" చేసినట్లు ప్రకటించి, మర్నాడు న్యాయమూర్తి ముందర హాజరు పరిచారు. అరెస్ట్ చేసిన విధానం తప్పని న్యాయమూర్తికి ఎందుకు అనిపించ లేదో న్యాయ కోవిదులకే తెలియాలి. పైగా అరెస్టు చేసింది ఆంధ్ర హద్దుల్లో. అక్కడ ఏ నిషేధాజ్ఞలు లేవు. వున్నా అరెస్ట్ చేసే అధికారం మరాఠా పోలీసులకు లేదు. సరే.. అంతవరకు సరిపుచ్చుకుందామనుకుంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా, మిగతా వారందరు చట్ట సభలకు ఎన్నికైన వారని కూడా చూడకుండా, అందులోనూ మహిళలున్నారని కూడా ఆలోచించకుండా, మరాఠీ పోలీసులు ప్రవర్తించారు. రోజు-రోజుకు వారి ప్రవర్తన మరీ అభ్యంతరకరంగా మారి, నాలుగో రోజుకు పతాక స్థాయికి చేరుకుంది. అందరినీ జైలుకు తరలించాలన్న ఆలోచనతో, కనీస సౌకర్యాలు లేని ధర్మా బాద్ తాత్కాలిక జైలు నుంచి, అంతకంటే అధ్వాన్నంగా వున్న పోలీసు వాహనాలలోకి ఎక్కించే ప్రయత్నం జరిగింది. అభ్యంతరం చెప్పిన బాబు ప్రభృతులను దాదాపు చిత్ర వధలకు గురిచేసింది మహారాష్ట్ర ప్రభుత్వం.

ధర్మా బాద్ నుంచి బహిర్గతం చేయని ప్రదేశానికి తరలించడానికి ముందు రాత్రి వివిధ కారణాల వల్ల అనారోగ్యానికి గురైన మాజీ ముఖ్యమంత్రికి, ఆయన సహచర ఎమ్మెల్యేలకు అవసరమైన అత్యవసర వైద్య సహాయం అందించేందుకు అక్కడకు బయల్దేరిన నాలుగు "ఇ.ఎం.ఆర్.ఐ-108 అంబులెన్స్" వాహనాలను సరిహద్దు దాటనివ్వకపోవడం మానవత్వమున్న ప్రతి వ్యక్తీ ఖండించాల్సిన విషయం. తమకందిన ప్రభుత్వ సమాచారం మేరకు నాలుగు అంబులెన్సులలో, నలుగురు వైద్యులను, ఏడెనిమిది మంది పేరా మెడికల్ సిబ్బందిని, మామూలుగా వుండే అంబులెన్స్ సిబ్బందిని వెంట బెట్టుకుని, అర్థరాత్రి బయలుదేరి వెళ్ళిన ఇ.ఎం.ఆర్.ఐ-108 అధికారికి, ఆయన సహచరులకు చేదు అనుభవం ఎదురైంది. రాత్రి రెండున్నరకు చేరుకున్న వాహనాలను, సిబ్బందిని ఎన్ని ప్రయత్నాలు చేసినా, బాబు ప్రభృతులున్న ప్రదేశానికి అనుమతించలేదు. ఎట్ట కేలకు స్థానిక పోలీసు అధికారుల జోక్యంతో, తెల్లవారిన తర్వాత, షరతుల మధ్య ధర్మా బాద్ కు పోనిచ్చారు మరాఠా పోలీసులు. అంబులెన్సులు-సిబ్బంది అక్కడికి చేరుకున్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలు కాల కృత్యాలు తీర్చుకుంటుంటే, వీలున్నంతమందికి అత్యవసర వైద్య సహాయం కల్పించారు. వీరు పరీక్షించిన పలువురి పరిస్థితి కడు దయనీయంగా వుందట. చంద్ర బాబు నాయుడుని కలుద్దామనుకుంటుండగానే, హఠాత్తుగా కలకలం మొదలవడంతో హెచ్చరికల నడుమ వెనుదిరిగి సమీపంలో పార్క్ చేసిన అంబులెన్సులలో తలదాచుకున్నట్లు అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఇక అంబులెన్సుల సిబ్బంది గతే అలాగుంటే, ఇతరుల సంగతి చెప్పాల్సిన పనిలేదు.

ఇక ఆ తర్వాత జరిగిందంతా వివిధ టెలివిజన్ ఛానళ్లు నిరంతరం ప్రసారం చేశాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, వారూ-వీరూ అనే తేడా లేకుండా, పురుషులు-మహిళలు అన్న విచక్షణా జ్ఞానం లేకుండా, ఉపాహారం తీసుకుంటున్న సమయంలో, బాబు ప్రభృతులందరినీ చితకబాదుతూ, ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా, వాహనాల్లోకి ఎక్కించారు. బాబు అరెస్టయిన నాటినుంచే రాష్ట్రంలో చెలరేగిన ఆందోళన హింసాత్మకంగా మారుతోంది. మరో పక్కన తెలుగు వారికి, మరాఠీలకు మధ్య చిచ్చు లేపింది అటు మహారాష్ట్ర ప్రభుత్వం-ఇటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఇక్కడి వాహనాలను అక్కడ, అక్కడి వాహనాలను ఇక్కడ ధ్వంసం చేసుకునే పరిస్థితులకు దారితీసింది. పుట్టపర్తి రావాల్సిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తన పర్యటనను నిరసనల మధ్య వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అసమర్థతను బాహాటంగా బహిర్గతం చేసుకున్నాయి.

గతంలో రాష్ట్ర సమస్యలు వచ్చినప్పుడు-పొరుగు రాష్ట్రాలతో పోరాడవలసి వచ్చినప్పుడు, పార్టీలకతీతంగా కలిసి-మెలిసి పని చేసేవారు. ఇప్పుడా స్ఫూర్తి పోయింది. చంద్రబాబు నాయుడు చేసిన పని విమర్శించవచ్చునేమో కాని, ఆయన అరెస్టును, ఆ తర్వాత ఆయన పట్ల-ఆయన సహచరుల పట్ల మరాఠా పోలీసులు వ్యవహరించిన తీరును, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కాని-ప్రభుత్వం కాని ఖండించకపోవడం శోచనీయం. తెలుగు దేశానికి దీనివల్ల రాజకీయ లబ్ది కలుగుతుందో-లేదో కాని, ప్రభుత్వం-కాంగ్రెస్ నాయకత్వం మాత్రం అప్రతిష్ఠ పాలు కాక తప్పదు. ఎంతో కొంత మూల్యం చెల్లించుకోక తప్పదు. అసలింతకీ బాబ్లీ ప్రాజెక్టు ఇరు రాష్ట్రాల రైతుల సమస్య. మహారాష్ట్ర రైతే బాగుపడాలని కాని, ఆంధ్రా రైతే బాగు పడాలని కాని కోరడం సమంజసం కాదు. భారత దేశంలోని రైతు ఎక్కడున్నా రైతే. జల వివాదాలు పరిష్కరించుకొని, అంతర్ రాష్ట్రాల గుండా పారుతున్న జలాలను, ప్రాజెక్టులు ఎక్కడ కట్టినా, పొరుగు నున్న రాష్ట్రాల రైతులకు కూడా లాభం కలిగే ట్లు ఉపయోగించుకోవాలి. రెండు-లేక-మూడు ఇరుగు-పొరుగు రాష్ట్రాల మధ్య జల వివాదం వుంటే, రాజకీయాలను ఆస్కారం లేకుండా, ఇతర రాష్ట్రాల ఇంజనీరింగు నిపుణుల సంఘం పరిష్కరించే విధానం రూపొందించాలి. వారి నిర్ణయాన్ని ధిక్కరించకుండా సంబంధిత రాష్ట్రాలు అమలు పరిచే చట్టం రూపొందించాలి. అంతవరకు రాజకీయాలకు అతీతంగా భారత దేశ రైతు లాభ పడే ఆస్కారం భవిష్యత్ లో లేదు.

చారిత్రాత్మకంగా-భౌగోళికంగా రూపు దిద్దుకొని, సుస్థిర జన సమూహంతో-సామాజిక వర్గంతో కూడి, ఉమ్మడి భాష-పరిసరాలు-ఆర్థిక జీవన శైలి-మానసిక స్థితిగతులు కలిగిన సార్వజనీన సమాజ లక్షణాలుంటే దానినొక "జాతి" గా-"దేశం" గా పరిగణించాలని, అదే జాతికి సరైన నిర్వచనమని, మార్క్సిస్ట్ సిద్ధాంతం చెపుతుంది. ఈ నిర్వచనం అన్ని కోణాలలోంచి పరికించి చూస్తే సరిపోతోందా అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఎల్లలతో కూడిన సరిహద్దులున్నప్పుడే దాన్ని ఒక ప్రత్యేక జాతిగా, లేదా, దేశంగా పిలవాలని మరి కొందరి అభిప్రాయం. గత కొన్నాళ్లపాటు వార్తల్లోకెక్కిన బాబ్లీ ప్రాజెక్ట్ వివాదం గమనిస్తుంటే, ఒక దేశం విషయంలో ఇది నిజం కావచ్చునేమో కాని, ఒకే దేశంలో-ఒకే జాతిలో (భారత జాతి-ఉదాహరణకు) భాగమైన వివిధ రాష్ట్రాల విషయంలో హద్దులు-సరిహద్దులు-ఎల్లలు-హక్కులు-ప్రత్యేకతలు-వేర్పాటు ధోరణులు అనే భావన కలగడం సరైందేనా? అని ప్రశ్నించుకునే సమయం ఆసన్నమైందనాలి.

భారతదేశం వివిధ రాష్ట్రాల సమాఖ్య (ఫెడరల్ తరహా వ్యవస్థ). కాకపోతే, పాక్షికంగా ఏక కేంద్రక ప్రభుత్వ విధానాన్ని పాటించే రాజ్యాంగ వ్యవస్థ అని కూడా అంటాం. ఒక వైపు సకలాధికారాలున్న కేంద్ర ప్రభుత్వం, మరో వైపు తమ రాష్ట్రానికి సంబంధించినంతవరకు అదే మోతాదులో సర్వాధికారాలున్న రాష్ట్ర ప్రభుత్వాలు, సాధ్యమైనంత వరకు తమ-తమ హద్దుల్లో, రాజ్యాంగం నిర్దేశించిన పరిధుల్లో, అధికారాన్ని చలాయిస్తుంటాయి. రాష్ట్రాధికారాలని, కేంద్రం అధికారాలని, ఉమ్మడి అధికారాలని, వేర్వేరు రకాల అధికారాలను, అటు ఫెడరల్ విధానానికి-ఇటు యూనిటరీ విధానానికి భంగం కలగని రీతిలో రాజ్యాంగం నిర్దేశించింది. అంత వరకూ బాగానే వుంది కాని, ఒకే దేశంలో-ఒకే జాతిలో, భిన్న భాషలు మాట్లాడే, విభిన్న సంస్కృతులు అనుసరించే, రక-రకాల మనస్తత్వాలున్న సామాజిక వర్గంతో నిండిన వివిధ రాష్ట్రాల మధ్య అధికారాల-హక్కుల విషయంలో తేడాలొస్తే, పరిష్కరించుకునే విధానం అస్పష్టంగా వుండడంతో, బాబ్లీ లాంటి సమస్యలు ఉత్పన్నమవడం మొదలైంది.

అసలింతకీ మనముంటున్నది ఒకే దేశంలోని, ఒకే జాతి వారమా? లేక ఒకే దేశంలో నివసిస్తున్న విదేశీయుల మా? పొరుగునున్న ప్రాజెక్టును చూస్తామనడంలో తప్పేం టో అర్థం కావడం లేదు. ఇలాంటి సంఘటనలిలానే కొన సాగిస్తే, భిన్నత్వంలో ఏకత్వానికి-ఏకత్వంలో భిన్నత్వానికి ప్రతీకని మనం చెప్పుకుంటున్న భారతావని ప్రకటనలకే పరిమితం అనాల్సి వస్తుందేమో !

Wednesday, July 14, 2010

XII-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-12) : వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-12
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

వ్యూహ రచనలో తన తోటి సహచర లీడర్సుకు పాఠాలు నేర్పించడంతో సరిపుచ్చుకోలేదు వెంకట్ చంగవల్లి గారు. రంజన్ దాస్ సలహాలను-సూచనలను అమలు పరుస్తారో, లేదో అన్న విషయంలో, తన దగ్గర పనిచేసేవారి చాకచక్యం ఎవరెవరికి-ఎంత మేరకు వుందని అంచనా వేయడంలో తనదైన శైలితో ముందుకు సాగే తత్వం వెంకట్ ది. "జిమ్ కాలిన్స్" సిద్ధాంతమైన "గుడ్ టు గ్రేట్" ను ఆసాంతం ఔపోసన పట్టిన ఐదో స్థాయి కార్య నిర్వహణాధికారి వెంకట్ చంగవల్లి. పాతికేళ్ల పైబడి బహుళ జాతి సంస్థల్లో ప్రధాన భూమికను నిర్వహించిన వెంకట్, ఇ.ఎం.ఆర్.ఐ లో చేరిన మరుక్షణం నుంచే, తాను భవిష్యత్ లో పనిచేయాల్సింది లాభాపేక్ష లేని సంస్థ అని తెలిసి కూడా, చైర్మన్ రాజు అడుగు జాడల్లో, ఆ సంస్థను లాభాపేక్షతో వ్యాపారం చేసే "కార్పొరేట్ స్థాయి సంస్థ" తో సమానంగా నడిపించే దిశగానే అడుగులు వేశారు. సంస్థ ఆశయమా గొప్పది-వనరుల సంగతే మో అసందిగ్ధం అని తెలిసి కూడా తనతో వివిధ స్థాయిలలో పని చేసే వ్యక్తుల ఎంపిక విషయంలో ఒక వైపు శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూనే, మరో వైపు, వారి జీత భత్యాల విషయంలో లాభాపేక్షతో పనిచేసే కార్పొరేట్ సంస్థలకు తీసిపోని విధంగా జాగ్రత్త తీసుకున్నారు వెంకట్. యాజమాన్యం మారి జి.వి.కే ఇ.ఎం.ఆర్.ఐ అయ్యేంతవరకు, ఆ విషయంలో వెంకట్ రాజీ పడలేదు. ఆ తర్వాత పరిస్థితిలో కొంత మార్పొచ్చిందనే అనాలి. ఆ మార్పుకు గురైనవారిలో-బలైన వారిలో, సంస్థ ఎదుగుదలకు అహర్నిశలూ కృషి చేసినవారూ వున్నారు. కృషి చేయని వారూ వుండొచ్చు. కాకపోతే, అందరి విషయంలోనూ ఒకే న్యాయం పాటించారు. "సముచిత స్థాయి నుంచి సమున్నత స్థాయికి" ఇ.ఎం.ఆర్.ఐ ని తీసుకెళ్లడమే అసలు-సిసలైన రూపాంతరీకరణ అని ఆయన నమ్మకం. రంజన్ దాస్ వ్యూహ రచన శిక్షణా కార్యక్రమానికి ధీటుగా, అంతకంటే నైపుణ్యంగా "జిమ్ కాలిన్స్ గుడ్ టు గ్రేట్" సిద్ధాంతాన్ని నేర్పుగా తోటి లీడర్సుకు వివరించారు వెంకట్. పరోక్షంగా తన మనసులోని మాటను, భవిష్యత్ లో సంస్థలో ఎవరుంటారో-వుండరో అన్న విషయాన్ని బయట పెట్టారు. అది సత్ఫలితాలనే ఇచ్చిందో-లేదో ఆయనే చెప్పాలి.

గుడ్ టు గ్రేట్ సిద్ధాంతంలో గుడ్-గ్రేట్ అనేవి, ఒకదానికి మరొక టి బద్ధ శతృవు. "గుడ్ టు గ్రేట్" ఒక్కసారి-ఒకే ఒక్కసారి దూకుతే జరిగే మార్పు కాదు-కానే కాదు. ఇ.ఎం.ఆర్.ఐ ని "సముచిత స్థాయి నుంచి సమున్నత స్థాయికి" తీసుకెళ్లడానికి కావలసిందల్లా....ఐదో స్థాయి నాయకత్వం. మొదలు (కావాల్సిన వ్యక్తులు) ఎవరు-ఏమిటి అన్న ఆలోచన చేయడం, పాశవిక వాస్తవాలను (నగ్న సత్యాలు) ఎదుర్కోవడం, అర్హత-యోగ్యతల ప్రకంపనలను అధిగమించడమనే హెడ్గెహాగ్ సిద్ధాంతం పాటించడం, నిరంతర ఫలితాల సాధనకు క్రమశిక్షణతో కూడిన సంస్కృతిని అవలంభించడం, సాంకేతిక వేగ సాధనాలను సక్రమంగా ఉపయోగించుకోవడం, ఐదో స్థాయి నాయకత్వానికి మాత్రమే సాధ్యపడుతుంది.

ఐదో స్థాయి అధికార వ్యవస్థంటే...ఆ స్థాయికి చేరుకోవాలంటే.... అంచలంచలుగా వివిధ స్థాయిలలో నాయకత్వ లక్షణాలెలా వుంటాయో అవగాహన చేసుకోవాలి. తమ వ్యక్తిగత ప్రజ్ఞతో, తెలివి తేటలతో, నైపుణ్యంతో, మంచి-మంచి అలవాట్లతో ఫలవంతమైన సహాయాన్ని సంస్థకు అందించగల వారై వుంటారు "మొదటి స్థాయి యోగ్యత గల స్వయం సాధకులు". "రెండో స్థాయికి చెందిన, బృందంలోని భాగస్వామ్య సభ్యులు", సామూహిక లక్ష్యాలను అధిగమించడానికి తమ-తమ వ్యక్తి గత సమర్థతలను జోడించి, తోటి బృంద సభ్యులతో కలిసి-మెలిసి పనిచేయగల వారై వుంటారు. "మూడో స్థాయికి చెందిన మేనేజర్స్-కార్య నిర్వాహకులు", ముందస్తుగా నిర్దారించిన లక్ష్యాలను సమర్థవంతంగా-సార్థకంగా చేరుకునే ప్రయత్నంలో భాగంగా, అవసరమైన మానవ-ఇతర వనరులను ఏర్పాటు చేయగల నైపుణ్యం కల వ్యక్తులై వుంటారు. "నాలుగవ స్థాయి సార్థక నాయకులు", శ్రేష్టమైన కార్యసాధక ప్రమాణాలను పాటించేందుకు, పురికొల్పే ప్రయత్నం-పట్టుదలతో, నిబద్ధతను ప్రోత్సహించే తరహా వ్యక్తులై వుంటారు. వీరందరిని, ఏఏ పనికి ఉపయోగించుకోవాలో, సంస్థ లక్ష్యాలను చేరుకోవడానికి సరైన స్థానంలో ఎవరెవర్ని నియమించాలో నిర్ణయించగలిగేది "ఐదో స్థాయి కార్య నిర్వహణాధికారి" మాత్రమే. వీరు తమ వ్యక్తిగత నమ్రత-అణకువలను వృత్తి పరమైన కార్య సాధనతో అసంభవమైన మిశ్రమంగా తయారుచేసి, తద్వారా శాశ్వతమైన గొప్పదనాన్ని-సమున్నత స్థాయి సంస్థను నిర్మించగల సామర్థ్యం గల వ్యక్తి అయి వుంటారు. ఇలా వున్న అంచలంచల వ్యవస్థలోనే, "గుడ్ టు గ్రేట్" ఆచరణ సాధ్యమవుతుంది.

వృత్తి పరమైన కార్య సాధన, వ్యక్తిగత నమ్రత-అణకువ లనే ఐదో స్థాయి కార్యనిర్వహణాధికారి నాయకత్వం అర్థం చేసుకోగలగడం ఆ స్థాయి వారికే వీలవుతుంది. తన కార్య సాధనలో భాగంగా సముచిత స్థాయి నుంచి సమున్నత స్థితికి సంస్థ రూపాంతరీకరణ చేసే దిశగా పతాక స్థాయి ఫలితాలను సాదించగలడు. ఎంత కష్టమైనా-ఎన్ని అవాంతరాలెదురైనా సడలించని సంకల్పం ప్రదర్శించి దీర్ఘకాలిక ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తాడు. శాశ్వత సమున్నత స్థితి సంస్థను నిర్మించేందుకు, తగిన ప్రమాణాలను నిర్ణయించగలడు. తన కృషి ప్రతిబింబిస్తోందా, లేదా అన్న అంశాన్ని స్వయంగా పరిశీలించేందుకు అద్దంలో దృష్టి సారిస్తాడు గాని నాలుగు గోడల అవతల వాటి మధ్య నున్న కిటికీ బయట తలపెట్టి చూడడు. అలా చూసి, నిస్సారమైన ఫలితాల బాధ్యతను ఇతరులపై మోపి, వాళ్లపై నింద వేయడు. తన దురదృష్టమనో-కారణాంతరాల వల్ల అనుకున్నది సాధించలేక పోయాననో, తప్పు తనది కాదనో అనడు. నమ్రత-అణకువలను కార్య సాధనలో అడుగడుగునా ప్రదర్శించుకుంటూ, వినయ-విధేయతలతో కార్యోన్ముఖుడవుతాడే గాని, గొప్పలు చెప్పడం-ముఖ స్తుతి కోరుకోవడం చేయడు. పట్టుదలతో, హంగు-ఆర్భాటం లేకుండా నిర్ధారించిన ప్రమాణాల ఆధారంగా ముందుకు సాగుతాడు. సంస్థలో పనిచేసే వారిలో మంచి ఫలితాలను సాధించాలనే ప్రగాఢ వాంఛను కలిగించి, తన లాంటి ఇతరులను తయారుచేసి, భవిష్యత్ లో-రాబోయే తరం వారిలో మరిన్ని విజయాలను సాధించేందుకు తగిన వారసులను సృష్టించగలడు. సాధించిన ఫలితాలన్నీ తన వల్లనే జరిగాయని అద్దంలో చూసుకుని మురిసిపోకుండా, ఆ పేరు-ప్రతిష్ఠలను ఇతరులతో పంచుకునేందుకు, తనకు తోడ్పడిన వ్యక్తులను గుర్తించేందుకు నాలుగు గోడల అవతల దృష్టి సారించుతాడు.

సంస్థలో పనిచేసే ప్రతివారు ముఖ్యులని అనేకన్నా, వారిలోని సరైన వ్యక్తులే ముఖ్యులని భావించడం మంచిది. సముచిత స్థితి నుంచి సమున్నత స్థితికి సంస్థను తీసుకెళ్లాలంటే, అందుకు తగిన వ్యక్తులను ఎంపిక చేసుకోవడం కార్య నిర్వాహకులు మొట్టమొదట చేసే పని. ముఖ్యంగా తన సహచర "నాయకత్వ బృందం" విషయంలో మరింత శ్రద్ధగా ఆ పని చేయాలి. తాను నిర్దేశించిన ప్రమాణాలను-సంస్థ లక్ష్యాలను చేరుకోలేని వ్యక్తులను సంస్థ వాహనం నుంచి తక్షణమే దింపగల నేర్పరితనముంటుంది వారికి. "గొప్ప దూరదృష్టికి గొప్ప మనుషులే కావాలి" అన్న సిద్ధాంతాన్ని పాటించుతారు వీరందరు. తన కింది వారు నిబద్ధతతో పనిచేయలేరని అనుమానం వచ్చిన వెంటనే, సరైన వ్యక్తులను వారి స్థానంలో నియమించడం వారిలోని నైపుణ్యం. అలా నియమించబడిన "సరైన వ్యక్తుల" తెలివితేటలు-నేర్పరితనం కంటే, వారిలోని సామర్థ్యం-ప్రవర్తన-నడత, సంస్థ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాంటి వారి పనితనాన్ని నిరంతరం అజమాయిషీ చేయడం కంటే, వారికి సరైన మార్గదర్శకాలను సూచించితే సరిపోతుంది. వారిని ముందుకు దూసుకుని పొమ్మని బోధించితే చాలు. "సముచిత స్థితి నుంచి సమున్నత స్థితికి" నడిపించగల బృంద సభ్యులు జీవితాంతం స్నేహితులుగానే నిలిచిపోతారు. ఐదో స్థాయి కార్య నిర్వాహక నాయకుడు చేయాల్సిందల్లా అలాంటి వారిని వెతికి పట్టుకుని, సంస్థ వాహనం ఎక్కించి సత్ఫలితాలను సాధించడమే. అవసరం అనుకుంటే వాహనంలోంచి దింపడంలోనూ చాకచక్యం చూపడమే !

ఈ నేపధ్యంలో, ఒక గొప్ప సమున్నత సంస్థను నిర్మించి, అభివృద్ధి చేయడంతో పాటు, అక్కడ పనిచేస్తున్న "సరైన వ్యక్తులకు" సంస్థ స్థాయికి తగ్గ జీవితాన్ని-బ్రతుకు తెరువును కలిగించడం అంత తేలికగా సాధ్య పడే విషయం కాదు. అయినా ఇ.ఎం.ఆర్.ఐ విషయంలో సాధ్య-అసాధ్యాలకు అతీతంగా మొదట్లో ఎన్నో సంభవించాయి. అవి కొనసాగాయి. ఐదో స్థాయి నాయకత్వం కూడా లభించింది. సంస్థను సముచిత స్థాయి నుంచి సమున్నత స్థాయికి తీసుకెళ్లగలవారు-తీసుకెళ్లిన అంచలంచల నాయకత్వ లక్షణాలున్న వారు అక్కడ పని చేశారు. యాజమాన్య మార్పిడితో వారిలో చాలామంది "సంస్థ వాహనం” నుంచి దిగి పోవాల్సి వచ్చింది. కొందరిని దిగి పొమ్మన్నారు. కొందరు తమంతట తామే దిగి పోవాల్సిన పరిస్థితులు కలిపించారు. సంస్థ ఒడిదుడుకులకు ఈ మార్పు కొంతవరకు కారణమయిందనడంలో సందేహం లేదు.

సంస్థ ఎదుగుదలకు అహర్నిశలూ కృషి చేసిన వారెందరో వున్నారు. వారిలో ఇంకా అక్కడ పనిచేస్తున్న వారి సంగతి అలా వుంచి, వివిధ కారణాల వల్ల సంస్థను వీడిపోవాల్సిన వారి గురించి కొంత తెలుసుకోవడం మంచిదే మో !

వెళ్లిపోయిన వారిలో మొట్ట మొదట గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి డాక్టర్ అనిల్ జంపాల. అమెరికా వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో పి.హెచ్.డి , సియాటిల్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.బి.ఏ పట్టాలు పొందిన అనిల్, ఎమర్జెన్సీ మెడిసిన్ కి చెందిన అమెరికన్ సంస్థల్లో, తత్సంబంధమైన సాఫ్ట్ వేర్ విభాగాల్లో పనిచేసిన అనుభవం అపారంగా వుంది. ఇ.ఎం.ఆర్.ఐ కి సాంకేతిక భాగస్వామ్యంతో సాఫ్ట్ వేర్ ను రూపొందించిన సత్యం కంప్యూటర్స్ లో వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్న అనిల్ అనుభవాన్ని, చైర్మన్ రాజు, ఇ.ఎం.ఆర్.ఐ లో వినియోగించుకోవాలని భావించారు. వెంకట్ కన్నా ఏడాది ముందు నుంచే వారణాసి సుధాకర్, డాక్టర్ రంగారావు, డాక్టర్ బాలాజిల ఉమ్మడి పర్యవేక్షణలో సంస్థ రూపు దిద్దుకుంటున్న రోజుల్లో, అనిల్ కూడా ప్రధాన భూమిక నిర్వహించారు. ఇ.ఎం.ఆర్.ఐ వర్కింగ్ మోడల్ రూపకల్పనలో ఆయన కృషి చాలా వుంది. ఇ.ఎం.ఆర్.ఐ టెక్నాలజీ విభాగానికి, ఆపరేషన్స్ విభాగానికి నాయకత్వం వహించడమే కాకుండా, దేశ-విదేశాల్లోని పేరెన్నికగన్న పలు జాతీయ-అంతర్జాతీయ సంస్థలతో, ఒకరి అనుభవాలను మరొకరు పంచుకునేందుకు, ఆయా సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదిరించిన ఏకైక వ్యక్తి అనిల్ జంపాల. అంతర్జాతీయంగా ఇ.ఎం.ఆర్.ఐ సారధ్యంలోని 108-అత్యవసర సహాయ సేవలకు గుర్తింపు రావడానికి అనిల్ కృషి మరువలేనిది. అంతర్జాతీయంగా ఆయన ద్వారా లభించిన గుర్తింపు వల్లే, దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సేవలను ప్రారంభించాయి. సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చిన కొన్నాళ్లకు, నిర్ణయం జంపాల తీసుకున్నారో, లేక, యాజమాన్యం తీసుకుందో గాని, ఆయన మాతృ సంస్థలోకి వెళ్లిపోవడం జరిగింది. మరి కొన్నాళ్లకు సత్యం (మహేంద్ర సత్యంగా మారింతర్వాత) సంస్థ నుంచి కూడా తప్పుకుని, తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు. నైపుణ్యం గల ఒక వ్యక్తిని ఇ.ఎం.ఆర్.ఐ శాశ్వతంగా కోల్పోవాల్సి వచ్చింది. కష్ట కాలంలో ఆయన అనుభవం సంస్థకు పనికి రాకుండా పోయింది.

అత్యవసర సహాయ సేవలు ఆంధ్ర ప్రదేశ్ తర్వాత తొలుత ప్రారంభించిన రాష్ట్రం గుజరాత్. అక్కడ మొదలైన కొద్ది కాలానికే గుజరాత్ ఇ.ఎం.ఆర్.ఐ ఆపరేషన్స్ అధిపతిగా నియమించబడి, అనతి కాలంలోనే, అభివృద్ధి పరిచిన ఘనత గోబింద్ లుల్లాకు చెందుతుంది. ముంబాయి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగులో ఉత్తీర్ణుడై, అహ్మదాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లో ఫస్ట్ రాంకులో ఎం.బి.ఏ పట్టా పుచ్చుకున్న గోబింద్ లుల్లా, ఇ.ఎం.ఆర్.ఐ లో చేరక ముందు వివిధ బహుళజాతి సంస్థల్లో 30 సంవత్సరాల యాజమాన్య స్థాయి అధికారిగా అపారమైన అనుభవం పొందారు. గుజరాత్ ప్రభుత్వంతో ఆయన నెలకొల్పిన సత్సంబంధాల పర్యవసానమే, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు అహ్మదాబాద్ పరిసరాల్లో ప్రభుత్వ భూమిలో రూపు దిద్దుకున్న కార్యాలయం. హైదరాబాద్ కార్యాలయానికి ధీటుగా నిర్మించడంలో లుల్లా కృషి అమోఘం. ఆంధ్ర ప్రదేశ్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా అత్యవసర సహాయ సేవలను ఆ రాష్ట్ర ప్రజలకు అందించడంలో లుల్లా అహర్నిశలు పాటుపడ్డారు. ఆయన ఎంపిక స్వయంగా వెంకట్, చైర్మన్ రాజు చేశారు. యాజమాన్య మార్పిడి జరిగిన మూడు నెలలకే లుల్లాకు సంస్థలో చోటు లేకుండా పోయింది. ఆయన అనుభవం అందుబాటులో లేకుండా పోయింది.

సంజయ్ క్షీరసాగర్ ఇ.ఎం.ఆర్.ఐ లో చేరింది మొదలు, ఆర్థిక పరమైన విషయాలలో క్రమ శిక్షణను అమలు పరచడమే కాకుండా, నిబంధనలకు విరుద్ధమైన ప్రతి అంశానికి, నిర్మొహమాటంగా-ధైర్యంగా అడ్డు తగిలేవారు. సంస్థలో చేరక ముందు దశాబ్దంన్నర కాలం వివిధ జాతీయ-బహుళ జాతీయ సంస్థలలో ఫైనాన్స్-అకౌంట్స్ విభాగాల్లో అపారమైన అనుభవం గడించారాయన. ఆయన ఇ.ఎం.ఆర్.ఐ లో కేవలం ఫైనాన్స్ కే పరిమితం కాకుండా, ఇతర రాష్ట్రాల్లో అత్యవసర సహాయ సేవల విస్తరణలో చురుకుగా తోడ్పడే వారు. యాజమాన్య మార్పిడి మరి కొద్ది రోజుల్లో జరుగుతుందనగా సంజయ్ సంస్థను వదిలిపోవాల్సిన పరిస్థితులు కలిగాయి. సంస్థ ఆర్థిక పరమైన విషయాలను చక్కదిద్దడంలో ఆయన అనుభవం కూడా దూరమయింది.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వుంటారు. ముఖ్యంగా, కారణాలు ఏవైనా, వైద్య వృత్తికి సంబంధించిన సీనియర్లు ఎవరు కూడా సంస్థలో ఇమడ లేక పోయారు. డాక్టర్ దయాకర్ దగ్గర్నుంచి, డాక్టర్ అజయ్... ఆ తర్వాత పలువురు నిపుణులు సంస్థకు దూరమయ్యారు. వారి అనుభవం ఉపయోగించుకోలేక పోవడం దురదృష్టం.

ఇ.ఎం.ఆర్.ఐ ఒడిదుడుకులకు ఇలా దూరమయిన వారి "అనుభవం కొరత" కొంతలో కొంతైనా కారణమనవచ్చునేమో !

Thursday, July 8, 2010

అధిష్టానం మాటలకు అర్థాలే వేరయా: వనం జ్వాలా నరసింహారావు


భారత పునరుజ్జీవన రాజకీయ పర్యవసానమే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం. ఆవిర్భావ కాలం నాటి కాంగ్రెస్, తొలినాళ్లలో కొన్ని దశాబ్దాల పాటు, సమాజంలోని ఉన్నత-మధ్య తరగతి వర్గాల వారినే ఆకర్షించినప్పటికీ, 1905 నాటి స్వదేశీ ఉద్యమం ఫలితంగా, మధ్యతరగతి దిగువనున్న వర్గాల వారినీ కలుపుకుని పోయినప్పటికీ, ఈ నాటికీ, కుల-మతాల విషయం పక్కన పెడితే, ధనవంతుల-బలవంతుల పార్టీగానే మనుగడ సాగిస్తున్నదనవచ్చు. వారసత్వ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగం అనడం అతిశయోక్తి కాదు. కాకపోతే, అధిష్టానం దృష్టిలో, వారసత్వ రాజకీయాలకు ఎవరు అర్హులో-ఎవరు కాదో అనే విషయంలో, సమయానుకూలంగా మారుతూ వుంటుంది. రాజేష్ పైలట్, మాధవరావు సింధియాల పిల్లలకు ఒక నీతి, రాజశేఖర రెడ్డి తనయుడికొక నీతిని ఎంచుకుంది అధిష్టానం. అధిష్టానం బహిరంగంగా చెప్పినా-చెప్పక పోయినా, అడ్డంగా-నిలువుగా తల వూపి, నిమిషానికొక మాట మార్చడం కాంగ్రెస్ నాయకులకు పరిపాటై పోయింది.

జాతీయోద్యమానికి ఎప్పుడైతే మహాత్మాగాంధి నాయకత్వం లభించిందో, అప్పటినుంచి, అశేష జన వాహిని, తారతమ్యాలు మరిచి, కాంగ్రెస్ వెంట నడిచారు. ఏ గాంధి "సత్యాగ్రహం"-"నిరాహార దీక్ష" సిద్ధాంతాలకు అల నాడు కాంగ్రెస్ పట్ల ఆకర్షితులయ్యారో, ఆ సిద్ధాంతమే, నేడు వ్యక్తిగత అవసరాలను నెరవేర్చుకునేందుకు, అదే కాంగ్రెస్ వారసులకు ఆయుధంగా ఉపయోగపడుతున్నదనాలి. మహాత్మా గాంధి రాజకీయ వారసుడు జవహర్లాల్ నెహ్రూ, బ్రిటీష్ వలస విధానాన్ని-సామ్రాజ్య వాదాన్ని తుదముట్టించేందుకు, భారత ప్రజాశక్తిని, కాంగ్రెస్ అనే కవచం కింద కు చేర్చారు. బ్రిటీష్ పాలన అంతరించి, నవ భారత శకం ఆరంభమయిన పిదప, కాంగ్రెస్ రూపురేఖలే మారిపో సాగాయి. నెహ్రూ నాయకత్వంలోనే, భిన్న స్వరాల కాంగ్రెస్ పెద్దలు, మహాను భావుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వతంత్ర ఫలితాలను, తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. కాకపోతే, పార్టీలో సంభవిస్తున్న పరిణామాలను గమనించిన నెహ్రూ సహితం, అన్ని దృక్ఫదాల వారిని కలుపుకుని పోవాలన్న ఆరాటంతో, మౌనంగా, అన్నింటినీ సహించాల్సి వచ్చింది. స్వార్థపర శక్తులు తమ అవసరాలకు ఆ రోజుల్లోనే పార్టీని ఉపయోగించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, విలువలకు కట్టుబడ్డ ఎందరో మహాను భావులు మాత్రం సిద్ధాంత పరంగా ఒకరినొకరు విభేదించారే తప్ప, ఇప్పటి లాగా నిమిషానికొక మాట మార్చలేదు.

స్వాతంత్రోద్యమం నాటి భారత జాతీయ కాంగ్రెస్ కు ఇప్పటి భారత జాతీయ కాంగ్రెస్ (ఐ) కు పోలికే లేదనాలి. అలనాటి కాంగ్రెస్ లో అభిప్రాయ భేదాలకు, మైనారిటీ వ్యక్తుల సూచనలకు గౌరవం లభించేది. ఇక ఇప్పుడో, అధిక సంఖ్యాకుల మద్దతున్న వారికి, ప్రజా బలం వున్న వారికి, అధిక సంఖ్యాకుల ప్రజా ప్రతినిధుల ఆదరణ వున్న వారికి, ఏదో ఒక నెపంతో, పార్టీ దూరం చేసుకుంటున్నది. ఒక నాడు పార్టీ అనుసరించిన మద్యే మార్గం, అతివాద-మితవాద శక్తులను కలుపుకుని పార్టీని పటిష్టం చేయడమైతే, ఈ నాటి మద్యే మార్గం, భిన్నాభిప్రాయాలను వెల్లడించమని పరోక్షంగా అధిష్టానం ప్రోత్సహించడమే. అధిష్టానంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు, అధినేత్రి దగ్గర పలుకుబడిని సంపాదించుకునేందుకు, ప్రత్యక్షంగానో-పరోక్షంగా నో ప్రతి రాష్ట్రంలోని, సమ్మతి-అసమ్మతి వాదులను పురికొల్పడం ఈ నాటి మద్యే మార్గం. కింది స్థాయినుంచి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనని వారిని, స్థానికంగా ప్రజల మద్దతు లేని వారిని, పోటీ చేసి గెలవలేని వారిని, అధిష్టానం దగ్గర చెవులు కొరుకుతూ తిరిగే వారిని చేర దీయడం పార్టీకి అలవాటుగా మారింది. కాంగ్రేసేతర పార్టీలలో ప్రముఖ పాత్ర పోషించి, అన్నీ అనుభవించి, అక్కడ తమ అవసరాలన్నీ తీర్చుకుని, అక్కడ వున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇష్టమొచ్చినట్లు తూలనాడిన వారంతా పార్టీలో ప్రముఖులవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అంటూ గొంతు చించుకుంటున్న వారంతా, ఎప్పుడో ఒకప్పుడు పార్టీని దుయ్యబట్టిన వారో, ఇతర పార్టీలనుంచి వలస వచ్చిన వారో కావడం విశేషం.

స్వర్గీయ పర్వత నేని ఉపేంద్ర తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ కీలకమైన వ్యక్తిగా వుండి, పార్టీ పక్షాన, కేంద్ర మంత్రివర్గంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆయన పార్లమెంటులో తనకు వ్యతిరేకంగా మాట్లాడాడన్న నెపంతో, "నీ అంతు చూస్తాను"అని ఒకసారి హైదరాబాద్ పర్యటన కొచ్చిన సోనియా ఉపేంద్రను ఉద్దేశించి అన్నట్లు అప్పట్లో (డిసెంబర్ 22, 1987) పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. స్వయంగా తనను అలా అన్నదని ఉపేంద్ర గారే విలేకరులకు తెలియ చేశారప్పుడు. కానీ, తర్వాత ఏమైంది? అదే ఉపేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధాన భూమిక వహించి, చివరకు కాంగ్రెస్ రాజకీయాల్లోకి తన వారసుడిగా స్వయాన అల్లుడిని తీసుకొచ్చారు. తెలుగుదేశంలో వున్నన్నాళ్లు కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారాయన. అసలాయన కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం సోనియాగాంధి కాదా ?ఆయన లాగా కాంగ్రెస్ పార్టీని జగన్ విమర్శించలేదే !

ఈ నాడు కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన పదవిలో వున్న జైపాల్ రెడ్డి సోనియా గాంధి భర్త రాజీవ్ గాంధిని అనని మాట లేదు. ఎన్ని రకాల దూషించడానికి వీలుందో అన్ని రకాలుగా, బోఫోర్స్-ఫెయిర్‌ ఫాక్స్ విషయాల్లో, రాజీవ్ గాంధిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషించారు జైపాల్ రెడ్డి గారు. జనతా పార్టీనుంచి గెలిచి కేంద్రంలో మంత్రి పదవిని అనుభవించారు. మరిప్పుడాయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తి. అదృష్టం కలిసి వస్తే ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ కూడా వుండొచ్చు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో, కాంగ్రెస్ పార్టీలో మొదటి సారి చీలిక వచ్చినప్పుడు, వ్యవస్థాగత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, నంద్యాల లోక సభ స్థానానికి నామినేషన్ కూడా వేసి, రాత్రికి రాత్రే పార్టీ ఫిరాయించి, ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ (ఆర్) పక్షాన గెలిచిన స్వర్గీయ పెండేకంటి వెంకట సుబ్బయ్య సంగతేంటి ? అంతెందుకు సాక్షాత్తు ఇందిరా గాంధి మీద ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వీరేంద్ర పాటిల్ కాంగ్రెస్ (ఐ) లో చేరి తన స్థానాన్ని బల పర్చుకోలేదా ? తెలంగాణ ప్రజా సమితి పేరుతో కాంగ్రెస్ ను ధిక్కరించి, ఎన్నికల్లో పోటీ చేసి, పది మందికి పైగా అభ్యర్థులను పార్లమెంటుకు గెలిపించుకున్న స్వర్గీయ మర్రి చెన్నా రెడ్డిని అధిష్టానం ఏం చేయ గలిగింది. ఒక్క సారి కాదు ... కనీసం మూడు సార్లు ఆయన అధిష్టానాన్ని ధిక్కరించారు. ఇంతెందుకు.. ఎన్నికలు జరిగిన ప్రతి సారి, టికెట్ దొరకని పలువురు నేతలు, ఇండిపెండెంటుగా పోటీ చేయడం, ఆరేళ్లు బహిష్కరించ బడడం, స్వగృహ ప్రవేశం చేయడం, లోగడ కంటే, మంచి పదవులు పొందడం తెలిసిన విషయమే.

జగ్జీవన్ రాం, ఎన్డీ తివారి, అర్జున్ సింగ్ లను కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయగలిగింది ? శరద్ పవార్ గురించి ఏమనాలి ? సోనియా గాంధి విదేశీయ తను తెర పైకి తెచ్చిన మొదటి వ్యక్తి ఆయన కాదా ? ఇవ్వాళ ఆయన లేకపోతే భారత జాతీయ కాంగ్రెస్ మనుగడే లేదు. మమత బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ను కాదనే ధైర్యం సోనియా గాంధీకి వుందా? తమిళ నాడులో పీవీ నరసింహా రావు పొత్తుల నిర్ణయానికి వ్యతిరేకంగా "తమిళ మానిల కాంగ్రెస్" ను స్థాపించి, పార్లమెంటుకు ఎన్నికై, కాంగ్రేసేతర ప్రభుత్వంలో ప్రధాన కేంద్ర మంత్రిత్వ శాఖను నిర్వహించిన చిదంబరం కాంగ్రెస్ క్రమ శిక్షణకు లోబడినట్లా ? కాదా? వీరందరి ధిక్కారం కంటే జగన్ ధిక్కారం గొప్పదా?

జగన్ పట్ల కాంగ్రెస్ అధిష్టానం వైఖరి ఎందుకిలా వుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం దరిమిలా రాష్ట్రంలోనూ-రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోనూ ఊహించని పరిణామాల నేపధ్యంలో, రోశయ్యకు ముఖ్య మంత్రి పీఠం దక్కింది. జగన్ కు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ (దాదాపు) మద్దతు లభించినా అధిష్టానం మద్దతు కరువయింది. ఒక సమయంలో రోశయ్య మంత్రివర్గంలోని పలువురు బహిరంగంగానే జగన్ పక్షాన నిలిచారు. ఎవరు అవునన్నా-కాదన్నా, అభిమానుల అండ దండలు, గతంలో ఏ కాంగ్రెస్ నాయకుడికి లభించనంత మోతాదులో జగన్ కు లభించాయి. ముఖ్య మంత్రి రోశయ్య గారు తన పీఠాన్ని పదిల పర్చుకునే దిశగా అడుగులు వేస్తున్న సంకేతాలు జగన్ పసిగట్టడంతో, ప్రజలకు చేరువయ్యే దిశగా అతను పావులు కదిలించ సాగాడు. పరోక్షంగా పార్టీ (రాష్ట్రంలో) శ్రేణుల మద్దతు, ప్రత్యక్షంగా ప్రజల-పార్టీ కార్యకర్తల అండదండలు విరివిగా లభించడంతో అధిష్ఠానానికి ఫిర్యాదులు మోయడం మొదలయింది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయ లేని వారు, ఏళ్ల తరబడి పార్టీలో వున్నా పైకెదగ లేక పోయిన వారు, ఈర్ష్యాసూయలకు అలవాటు పడ్డ వారు, రాజ శేఖర రెడ్డిగారి హయాంలో నోరు మెదపడానికి కూడా భయ పడేవారు, అధిష్టానం కనుసన్నల్లో మెలిగే వారు, రోశయ్య గారి దృష్టిలో పడాలనుకునే వారు, ఇలా... ఒక్కో విధంగా.. ఎదురుపడి నిలిచి జగన్ ను ఎదిరించే శక్తిలేని వారందరు, తమ బాణాలను ఆయన పైకి ఎక్కుపెట్టారు. మహ బూబాబాద్ పర్యటనకు పోతున్న జగన్ ను అధిష్టానం ప్రతినిధులు సందిగ్ధంలో పడవేశారే గాని, ఇదమిద్ధంగా పోవద్దని-పొమ్మని చెప్పలేదు. తెలంగాణ వాదం బలంగా వున్న నేపధ్యంలో, ఆయన మహబూబాబాద్ పర్యటన అధిష్టానానికి సాకుగా దొరికింది. అంతవరకు బాగుంది... ఎందుకాయన కోస్తాంధ్ర పర్యటనను అడ్డుకోవాల్సి వచ్చిందో అర్థం కాని విషయం.

చివరకు అధిష్టానం తలవంచక తప్పలేదు. రోశయ్యతోనే అధిష్టానం ఆంతరంగాన్ని బహిష్కరించారు. హైదరాబాద్ లో ఆయన ఉదయం చేసిన ప్రకటనకు విరుద్ధంగా, ఢిల్లీలో ఆయన నోట వేరే మాట పలికించింది అధిష్టానం. బహుశా ముఖ్య మంత్రి రోశయ్య కూడా అధిష్టానాన్ని అర్థం చేసుకోలేక పోతున్నాడేమో ! బహుశా జగన్ కుటుంబ సభ్యులు సోనియాను కలిసినప్పుడే, ఇరువురి మధ్య ఒక అవగాహన కుదిరుండ వచ్చేమో ! జగన్ మీడియాకు రాసిన లేఖ ఆంతర్యం బహుశా, తనకు అయిష్టంగానన్నా సోనియా మద్దతుందని చెప్పడమేనేమో ? జగన్ ధిక్కార ధోరణిని అవలంభించాడని భావించినా, అధిష్టానం చేయగలిగిందేమీ లేదు. కాంగ్రేసేతర పార్టీలలో ప్రముఖ పాత్ర వహించి ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్న వారిని ఏమీ చేయలేని సోనియా, పార్టీని ధిక్కరించి బయటకు పోయి వేరు కుంపటి పెట్టుకున్న వారిపై ఆధార పడ్ద సోనియా, ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ లాంటి చురుకైన యువ నాయకుడిని వదులుకునే సాహసం చేస్తుందా? ఒక వేళ దుస్సాహసం చేస్తే, ఇటు రాష్ట్రంలోను-అటు కేంద్రంలోను పార్టీ సంక్షోభంలో పడదా? అవకాశం కొరకు ఎదురు చూస్తున్న పవార్లు, మమతలు తమ మద్దతును జగన్ కు ఇవ్వకుండా వుంటారా? ఏదేమైనా, రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు ఒకరిపై మరొకరు నిప్పులు కురిపించుకుంటూ మాట్లాడడం పార్టీకి శ్రేయస్కరం కానే కాదు.

Wednesday, July 7, 2010

108 అత్యవసర సహాయ సేవలతో రాజశేఖర రెడ్డి అనుబంధం: వనం జ్వాలా నరసింహారావు

(జులై 8, 2010 న డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి
అరవై ఒకటో పుట్టినరోజు సందర్భంగా)

ఇ.ఎం.ఆర్.ఐ-108, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య
మాజీ సలహాదారుడు

భారత దేశ చరిత్రలో, గత అరవై సంవత్సరాలలో తీసుకున్న విధాన నిర్ణయాలన్నింటిలో, అత్యంత కీలకమైంది "లాభాపేక్ష రహిత ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం". ఆ ప్రక్రియను ఆరోగ్య వైద్య రంగంలో "రాజీవ్ ఆరోగ్య శ్రీ" పథకంగా ప్రవేశపెట్టి, యావత్ భారతదేశానికి మార్గదర్శకంగా మలిచిన ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ది. ఆ గొడుగు కింద అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న 108 అత్యవసర సహాయ సేవలు రాజశేఖరరెడ్డికి మరీ ప్రీతిపాత్రమైనది. ఆ సేవల ఆవిర్భావం జరిగిన ఆంధ్ర ప్రదేశ్ లో, రాజశేఖరరెడ్డి మరణించిన అచిర కాలంలోనే అవే సేవలు ఒడిదుడుకుల్లో పడుతున్నాయన్న వార్తలు అత్యవసర సహాయ సేవల లబ్దిదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ అధ్యయనంలో "కరుణామయి-కారుణ్య దేవతగా" వర్ణించబడిన" 108 అంబులెన్స్-అత్యవసర సహాయ సేవల” తో రాజశేఖర రెడ్డి కి ఉన్న అనుబంధం ఎన్ని విధాలుగానో గుర్తు చేసుకోవచ్చు.

ఇ.ఎం.ఆర్.ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు రామలింగ రాజు, సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో జైలుకెళ్లాల్సి వచ్చింది. తక్షణమే 24 గంటల వ్యవధిలో, జనవరి 8, 2009 న, వైద్య-ఆరోగ్య శాఖ అధికారుల- ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య సమక్షంలో, రాజశేఖరరెడ్డి, ఇ.ఎమ్.ఆర్.ఐ అధికారులను పిలిపించి 108 అత్యవసర సహాయ సేవలందించే విషయంలో నిశితంగా సమీక్షించారు. మిన్ను విరిగి మీద పడ్డా-ఎటువంటి పరిస్థితులెదురైనా ఆ సేవలు ఆగిపోకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలను అటు ప్రభుత్వాధికారులకు-ఇటు మాకూ ఇచ్చారాయన. అవసరమైతే, ప్రభుత్వం అప్పటివరకూ భరిస్తున్న 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి నూరు శాతానికి పెంచడానికి సిద్ధమేనన్నారు. యాజమాన్య వాటాగా (ప్రయివేట్ భాగస్వామ్యంగా) అప్పటివరకూ ఇ.ఎం.ఆర్.ఐ భరిస్తున్న ఖర్చులను కూడా, తప్పదను కుంటే ప్రభుత్వమే సమకూరుస్తుందని హామీ కూడా ఇచ్చారాయన. అయితే అప్పట్లో ఆర్థిక మంత్రిగా వున్న రోశయ్య, పూర్తిగా ప్రభుత్వమే భరించడమంటే, అది ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు విరుద్ధమవుతుందని, విమర్శలకు దారితీస్తుందని సూచించారు.

ఎన్నికల రణరంగంలో తలమునకై వున్నా, ఎప్పటికప్పుడు, 108 అత్యవసర సహాయ సేవలందించే సంగతి మరిచిపోలేదాయన. 108 సేవలు తమ పార్టీ గెలుపుకు కారణమయ్యాయని, 108-104 సేవలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశానని కూడా చెప్పారప్పుడు. బహుశా ప్రపంచ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా, అత్యవసర సహాయ సేవలకు ప్రత్యేకంగా ఒక మంత్రివర్గ శాఖను ఏర్పాటు చేయడం మన రాష్ర్ట్రంలోనే జరిగిందనాలి.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మొదటి సారి 2004లో అధికారంలోకి రావడంతోనే అత్యవసర సహాయసేవల అమలు కార్యరూపం దాల్చడం మొదలైంది. ఆరోగ్య-వైద్య-అగ్నిమాపకదళ సంబంధిత అత్యవసర సహాయ సేవలను అందించేందుకు నెలకొల్పిన ఇ.ఎం.ఆర్.ఐ, ఏప్రియల్ 2, 2005 న, (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సమక్షంలో, ప్రభుత్వంతో మొట్టమొదటి "అవగాహనా ఒప్పందం" కుదుర్చుకుంది. ఆగస్ట్ 15, 2005 న హైదరాబాద్ లో అంబులెన్సుల ప్రారంభోత్సవానికి (దివంగత) ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి, అప్పటి ఆరోగ్య-ఆర్థిక శాఖల మంత్రి (ఆ తర్వాత ముఖ్యమంత్రి) రోశయ్య వచ్చారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా ఆరంభమైన సేవలను, వరుసగా, తిరుపతి-విశాఖపట్నం-విజయవాడ-వరంగల్ పట్టణాలలో కూడా ప్రారంభించింది ఇ.ఎం.ఆర్.ఐ. ఆ క్రమంలో. అత్యవసర సహాయ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడానికి జనవరి 26, 2007 న రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం జరిగింది. ఆ నాటి సభలో, ఆయనతో పాటు, ఇప్పటి ముఖ్యమంత్రి రోశయ్య, ప్రస్తుతం హోం శాఖను నిర్వహిస్తున్న సబిత ఇంద్రారెడ్డి కూడా హాజరయ్యారు.

ఆగస్ట్ 14, 2007 న, (దివంగత) ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో నిర్వహణ వ్యయం విషయం చర్చకొచ్చింది. 108-అత్యవసర సహాయ సేవలందించడానికి ఇ.ఎం.ఆర్.ఐ కి, "ప్రత్యక్ష నిర్వహణ వ్యయం" కింద 95% వరకు ప్రభుత్వం భరించడానికి అంగీకరించిందని, యాజమాన్య పరమైన వ్యయాన్ని సంస్థ భరించాల్సి వుంటుందని అంటూనే, 2007-2008 ఆర్థిక సంవత్సరంలో మాత్రం, ప్రధాన కార్యదర్శి తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఆ వ్యయం కింద రు. 68, 700 ప్రభుత్వం భరిస్తుందని, 2008-2009 ఆర్థిక సంవత్సరం నుండి 95% నిర్ణయం అమల్లోకి వస్తుందని, అప్పటికి 502 అంబులెన్సులు రాష్ట్ర వ్యాప్తంగా సేవలందిస్తాయని అన్నారు ముఖ్యమంత్రి. అత్యవసర సహాయ సేవలను "రాజీవ్ ఆరోగ్య శ్రీ" పథకం గొడుకు కిందకు తేవాలన్న నిర్ణయం కూడా ఆ రోజునే తీసుకున్నారు రాజశేఖర రెడ్డి.

డిసెంబర్ 18, 2007 న (దివంగత) ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మరో సమీక్షా సమావేశంలో ఇ.ఎం.ఆర్.ఐ ఆధ్వర్యంలో అమలవుతున్న అత్యవసర సహాయ సేవల ప్రాధాన్యతను గుర్తించిన ప్రభుత్వం సూత్రప్రాయంగా మరో నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి కట్టుబడ్డ ప్రభుత్వం, సంబంధిత అధికారులు, అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి సంభాని చంద్రశేఖర్, దరిమిలా తొలుత 150 అంబులెన్సులు, మలి విడతగా మరో 150 అంబులెన్సులు, మొత్తం 802 అంబులెన్సులు సమకూర్చారు. అయితే వీటిలో కనీసం 100 వరకు తిరగక పోవడం వివిధ కారణాల వల్ల సేవలందించలేని స్థితిలో వుండడంతో అలా ఎందుకు "ఒడిదుడుకులకు లోను కావాల్సి వచ్చిందో" అర్థం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది ప్రభుత్వం ప్రస్తుతం.

అసలేం జరుగుతున్నది?ప్రభుత్వ హామీలు-జీ.వీ.కె హామీలు కాగితాలకే పరిమితమా? లేక యాజమాన్య నిర్వహణలో లోపాలున్నాయా? అధికారులు రాజశేఖర రెడ్డి లేని లోటును పరోక్షంగా ప్రదర్శిస్తున్నారా? ఒకవైపేమో "నిబద్ధత“ను కలిగున్న జీ.వీ.కె-మరో వైపే మో రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేరుస్తానంటున్న ముఖ్యమంత్రి రోశయ్య, 108 శాఖను నిర్వహిస్తున్న మంత్రి సాక్షాత్తు రాజశేఖర రెడ్డి అనుయాయుడు. అన్నింటికన్నా మించి పాతికేళ్ళ పైబడి యాజమాన్య నిర్వహణ అనుభవం, కష్ట కాలంలో బాధ్యతలు నైపుణ్యంతో నెరవేర్చిన సీ.ఇ.ఓ వెంకట్. ఈ సేవల కొన సాగింపు ప్రభుత్వ (లాభాపేక్ష లేని) ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకే ఒక పెను సవాలు. వ్యక్తిగత పట్టింపులకు-పంతాలకు అతీతంగా నిర్వహించాల్సిన-అమలు చేయాల్సిన ఈ సేవలు కేవలం ఏ ఒక్కరి సొత్తో-సొమ్మో కావు-కాకూడదు.

108 అంబులెన్సుల ద్వారా అత్యవసర సహాయ సేవలందిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఇ.ఎం.ఆర్.ఐ) పని తీరుపై ఏప్రియల్ 2010 చివరి వారంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. 108-అత్యవసర వైద్య సహాయ సేవలను పౌరులకు అందించే విషయంలో ప్రభుత్వ ఆలోచనా సరళిలో కొంత మార్పు వస్తున్నట్లు భావించాల్సి వస్తుంది. కమిటీని నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులో... "ప్రస్తుతం లభిస్తున్న అత్యవసర రవాణా సేవలకు ప్రత్యామ్నాయాలే మన్నా వున్నాయేమో పరిశీలించడంతో సహా అన్ని అంశాలను సమీక్షించి, సరైన సూచనలను-సలహాలను ఇవ్వాల్సింది" గా పేర్కొనడం భవిష్యత్ పరిణామాలకు సంకేతంగా భావించాల్సి వస్తుంది.

ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు ఇంతకంటే "పెను సవాలు" మరోటి లేదు. ఈ ఆలోచనా ధోరణిలో మార్పురానంత కాలం అత్యవసర సహాయ సేవల అమలు గతంలో మాదిరి జరిగే అవకాశం లేదు. ఇరువురు భాగస్వాముల మధ్య "విశ్వాసం"-"నమ్మకం" కలగడం ముఖ్యం గాని కమిటీ సిఫార్సులు ముఖ్యంకానేకావు. అలాంటి (లోగడ వున్న మాదిరిగానే) విశ్వాసం-నమ్మకం ఇరువురు భాగస్వాముల మధ్య పునరుద్ధరించడానికి అవసరమైన తక్షణ చర్యలకు ప్రభుత్వం నియమించిన కమిటీ శ్రీకారం చుట్టడం ప్రధానం. అది జరక్కుండా, కాలయాపనకు దారితీసే "ప్రత్యామ్నాయాలను" ప్రతిపాదించడమే జరిగితే భవిష్యత్ లో 108-అత్యవసర సహాయ సేవలు కొనసాగినప్పటికీ, నాణ్యతా లోపం-పౌరులకు గతంలో మాదిరి సేవలు లభ్యం కాకపోవడం తప్పదేమో !

రెండో విడత అధికారం చేపట్టి, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరిపించిన మర్నాడు-మే నెల 26, 2009 న, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇజ్రాయిల్ పర్యటనకు బయల్దేరడానికి ముందర, అత్యవసర సహాయ సేవల సంగతి తెలుసుకునేందుకు మమ్మల్ని రమ్మన్నారు. సంస్థా పరంగా-యాజమాన్య నిర్వహణ పరంగా ఇ.ఎమ్.ఆర్.ఐ ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులను అర్థం చేసుకున్న రాజశేఖర రెడ్డి, జీ.వీ.కె సంస్థల అధ్యక్షుడికి ఫోన్ చేసి, ప్రయివేట్ పరంగా లోగడ సత్యం కంప్యూటర్స్ చైర్మన్ ఇచ్చిన విధంగానే ఇ.ఎం.ఆర్.ఐ కి నిధులను సమకూర్చమని చెప్పారు. ఆయన ఒప్పుకోవడం. ఇ.ఎం.ఆర్.ఐ దరిమిలా జీ.వీ.కె ఇ.ఎం.ఆర్.ఐ గా మార్పు చెందడం జరిగింది. రాజశేఖర రెడ్డి సూచనమేరకు-బోర్డ్ సభ్యుల కోరిక మేరకు, ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ గా జీ.వీ.కె ఆ రోజునే పదవీ బాధ్యతలు స్వీకరించారు.

సమావేశం పూర్వ-ఉత్తర రంగాల్లో అత్యవసర సహాయ సేవల విషయంలో విలువైన సూచనలు చేశారు. అందులో ఎన్ని అమలుకు నోచుకున్నయో-ఎన్ని నోచుకోలేదో అన్న విషయం తేల్చాల్సింది ప్రభుత్వం (ఏప్రియల్ 2010 లో) నియమించిన కమిటీనే. కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో ఆ ప్రస్తావన లేకపోవడానికి కారణాలేంటి ?

రాజీవ్ ఆరోగ్య శ్రీ గొడుగు కింద పనిచేస్తున్న 108, 104, ఆరోగ్య శ్రీ పథకాలకు సంబంధించి నిరంతర ప్రభుత్వ మానిటరింగ్ జరగాలని, ఇవన్నీ ఒకే శాఖాధిపతి కింద వుండే వీలు గురించి పరిశీలన జరగాలని ఆ రోజున ముఖ్యమంత్రి సూచించారు. ఇ.ఎం.ఆర్.ఐ, హెచ్.ఎం.ఆర్.ఐ, ఆరోగ్య శ్రీ లకు కలిపి ఒక ప్రత్యేకమైన "ట్రస్ట్" ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించారు. అలా చేస్తే సేవలందించడంలో నైపుణ్యం, సామర్థ్యం, వృత్తి పరమైన దక్షత పెరిగే అవకాశం వుందన్నారు. అయితే, నియంత్రణల విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్య-వైద్య శాఖలకు చెందిన ఒక ప్రభుత్వాధికారిని ఇ.ఎం.ఆర్.ఐ గవర్నింగ్ బోర్డు సభ్యుడిగా చేయాలని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయం వెలిబుచ్చారు. ఆర్థిక పరమైన యాజమాన్య వ్యవహారాలను, వ్యయ నియంత్రణలను, నిర్వహణ సమస్యలను, ప్రభుత్వంతో సమన్వయం-సంఘటితం విషయాలను, సంస్థాగత నిర్మాణాన్ని, అధికారాలను, విధులను, బాధ్యతలను, పారదర్శకతను, జవాబుదారీ తనాన్ని, సంబంధిత ఇతర విషయాలను పర్యవేక్షించేందుకు ఎలాంటి కమిటీ వుంటే బాగుంటుందో పరిశీలించమని అధికారులను-ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యాన్ని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా నిధులను సమకూర్చడంలో ఒక్కో ఏడాది గడిచినా కొద్దీ భారం పెరుగుతుంది కాబట్టి, నిధుల సేకరణ విషయంలోను, కమ్యూనికేషన్ విషయంలోను, చేసిన తప్పులు సరి దిద్దుకునే విషయంలోను జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి.

ప్రభుత్వంతో ఇ.ఎం.ఆర్.ఐ కుదుర్చుకున్న ఎంఓయు గడువు మే నెల 5, 2008 తో ముగిసినందున, దాని అమలును, తగు సవరణలతో అవసరమైనంత కాలవ్యవధి వరకు పొడిగించాలని, కొత్త ఎంఓయు పై సంతకాలు కావాలని ఆయన చేసిన సూచన ఇంతవరకు అమలు జరగలేదు. లక్షలాది ప్రాణాలను కాపాడవలసిన సంస్థ నిర్వహణ వ్యయం కొరకు విడుదల చేయాల్సిన నిధులను తెచ్చుకోవడంలోనే సంస్థ అధికారులు నెలంతా కాలం వెళ్లబుచ్చాల్సిన పరిస్థితులున్నాయిప్పుడు. నిర్వహణ వ్యయం భరించే విషయంలో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం సిద్ధాంత ప్రక్రియకు అనుగుణంగా, ప్రభుత్వం-ఇ.ఎం.ఆర్.ఐ తమ-తమ వంతు వాటాగా 95%-5% నిష్పత్తి విధానాన్ని పాటించాలని, యాజమాన్య పరమైన వ్యయం కింద ఇ.ఎం.ఆర్.ఐ పెడుతున్న ఖర్చును సంస్థ సమకూర్చాల్సిన 5% వాటాగా పరిగణించాలని, రాజశేఖర రెడ్డి సూచించారు. ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్య నిర్వహణ బాధ్యతలు స్వీకరించబోయే భావి సంస్థల-వ్యక్తుల నుంచి, లోగడ ఇ.ఎం.ఆర్.ఐ కున్న రుణాల మొత్తాన్ని తీర్చేందుకు తగు ఆర్థిక సహాయాన్ని పొందే ఏర్పాటు చేసుకోవాలని ఆయన స్పష్టంగా సూచించారు. అత్యవసర సహాయ సేవల నిర్వహణకు నియమించబడిన ఆపరేషన్స్ సిబ్బంది జీతభత్యాలు, ప్రతి నెల మొదటి తేదీన చెల్లించే విధంగా, ప్రభుత్వం అంగీకరించిన నిధులను విడుదల చేస్తుందని మినిట్స్ లో నమోదుచేశారు. వాస్తవానికి ఇరువురి మధ్య గతంలో కుదుర్చుకుని, ఇంతవరకు అమల్లో వున్న ఎంఓయు ప్రకారం మూడు నెలల నిర్వహణ వ్యయాన్ని ముందుగానే అడ్వాన్సుగా చెల్లించాలి. ఇవెంతవరకు పాటిస్తున్నారనేది ప్రశ్నార్థకమే !

ఇ.ఎం.ఆర్.ఐ. పాటించాల్సినవి మినిట్స్ లో పొందుపరిచారు. పారదర్శకతను మరింత స్పష్టంగా పాటించడానికి "వెబ్ సైట్" ను రూపొందించి, అందులో ప్రతి ట్రిప్పుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు చూపాలని సూచించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ 108-అత్యవసర సహాయ సేవలకు సమకూరుస్తున్న నిధులను తగ్గించే ప్రయత్నం చేయకుండా-లోగడ మాదిరిగానే బడ్జెట్ కేటాయింపులు జరగాలని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి సంతకంతో ప్రధాన మంత్రికి లేఖ పంపమని రాజశేఖర రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారానాడు. మినిట్స్ లో పొందుపరిచిన అంశాలు, పొందు పరచకపోయినా ముఖ్యమంత్రి చేసిన సూచనలు, ఎంత మేరకు అమలుకు నోచుకున్నాయన్న విషయాన్ని ధృవీకరించాల్సింది అటు ప్రభుత్వం-ఇటు ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైన అత్యవసర సహాయ సేవలు, అలసత్వం వల్లనో, నిధుల కొరత వుందనో, కేంద్రం నుంచి నిధులు సకాలంలో అందడం లేదనో, సంస్కరణలు అమలు పరచడంలో భాగంగా సేవలను కుదించాలనీ-కొత్త భాష్యం చెప్పాలనీ.... మరింకేదో తలపెట్టే ప్రయత్నం చేయడమో జరుగుతే, ఆ ప్రయత్నం రాజశేఖర రెడ్డి ఆశయాలకు విరుద్ధంగా చేసినట్లే అవుతుంది. ఆయన తలపెట్టిన అత్యవసర సహాయ సేవలను అరమరికలు లేకుండా కొనసాగించడమే, మనం ఆయన పుట్టిన రోజున ఇచ్చే కానుక !

Tuesday, July 6, 2010

XI-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-11) : వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-11
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం
ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

అధునాతన సౌకర్యాలున్న రెండంతస్తుల ఇ.ఎం.ఆర్.ఐ ప్రధాన కార్యాలయం-ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ లో "ఉన్నత శిక్షణ” ను ఇచ్చేందుకు నిర్వహిస్తున్న పోస్టు గ్రాడ్యుయేట్ తరగతి విద్యార్థుల వసతి కొరకు నిర్మించిన (అర్థాంతరంగా ఆగిపోయిన) భారీ హాస్టల్ భవన సముదాయం-అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్-సత్యం పబ్లిక్ స్కూల్ నాటి (తర్వాత ఆధునీకరించిన) ప్రధాన కార్యాలయం-ఇండిపెండెంట్ ’తరగతి గదులు’-కొంతమంది ఉద్యోగులుండడానికి అనువుగా వున్న రెసిడెన్షియల్ క్వార్టర్స్..... ...... ఇలా "విలువైన ఆస్తులు"న్న, కోట్లాది రూపాయల విలువ చేసే, సుమారు నలభై ఎకరాల భూమి పూర్వాపరాల గురించి తెలుసుకునే ముందర, రాజు గారి సారధ్యంలో రూపు దిద్దుకున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ "నియమావళి" గురించి, "సంఘం స్థాపన పత్రం" లోని చిత్ర-విచిత్రమైన అంశాల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఇంతకు ముందే తెలియచేసినట్లు, తన కుటుంబీకులే ప్రమోటర్ సభ్యులుగా సంస్థను రిజిస్టర్ చేయించడమే కాకుండా, సంస్థ నియమావళికి, భవిష్యత్ లో ఎంత ప్రయత్నం చేసినా, అంత సులభంగా సవరణలు తేలేని విధంగా, అతి చాకచక్యంగా దాన్ని తయారు చేయించారు రాజు గారు. యాదృచ్చికంగా అలా జరిగిందో, లేక, కావాలనే ఆయనో-ఆయన సలహాదారులో అలా చేయించారో తెలుసుకోవాలంటే, సమాధానం చెప్పాల్సింది రాజు గారే. సంస్థ "ఉజ్వల భవిష్యత్" ను దృష్టిలో వుంచుకుని, "నీతి విచక్షనలేని"వారి చేతుల్లోకి అది ఎట్టి పరిస్థితుల్లోనూ జారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాటుగా అలా చేసి వుండాలి రాజు గారు బహుశా. రామ లింగరాజు గారి "వ్యూహాత్మక ఆలోచన" కు సరితూగే ఆలోచన చేయగలవారు బహుశా అరుదుగా వుంటారేమో ! ఈ సందర్భంగా "వ్యూహం-వ్యూహ రచన" అంటే కొంత తెలుసుకోవాల్సిన అవసరముంది.

సీ.ఇ.ఓ వెంకట్, అక్కడ పనిచేసే సీనియర్ లీడర్లలో ఆత్మ స్థయిర్యాన్ని పెంపొందించే దిశగా తీసుకున్న చర్యల్లో ప్రధానమయింది "వ్యూహాత్మకంగా సంస్థ ఎలా ముందుకు సాగాలి" అన్న అంశంపై ప్రొఫెసర్ రంజన్ దాస్ తో ఇప్పించిన శిక్షణా పరమైన ఉపన్యాసం అని ఇంతకుముందు పేర్కొన్నాను. అదిక్కడ మరి కొంచెం వివరంగా తెలుసుకుందాం. "సరైన అసలు-సిసలు వ్యూహ రచనే లక్ష్యసాధనకు తొలి మెట్టు" అన్న సందేశం ఆ ఉపన్యాసంలో రంజన్ దాస్ వివరించారు.

వ్యక్తైనా, వ్యవస్థ అయినా, లాభాపేక్ష లేని ఇ.ఎం.ఆర్.ఐ లాంటి స్వచ్చంద సంస్థ అయినా, లాభాలను ఆర్జించే చిన్నా-పెద్దా వ్యాపారమైనా, చివరకు రాజకీయ పార్టీ అయినా-రాజకీయేతర కార్య కలాపాలైనా... ... ఆ మాటకొస్తే, లక్ష్యం-గమ్యం-ధ్యేయం ఎంచుకున్న ఎవరైనా, వాటిని చేరుకునేందుకు-అధిగమించేందుకు, రూపొందించుకునే ప్రణాళికాబద్ధమైన-శాస్త్రీయ పద్ధతిలో అనుసరించాల్సిన కార్యక్రమాన్ని, మేనేజ్‌మెంట్ పరిభాషలో "వ్యూహం" అనో, "వ్యూహ రచన" (Strategy) అనో అంటారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించిన సత్యం కంప్యూటర్స్ సంస్థ చైర్మన్ "జనవరి 7, 2009 నాటి ప్రకటన" దరిమిలా, ఆయన సమకూర్చిన "వ్యక్తిగత నిధులతో", ఆయనే వ్యవస్థాపక అధ్యక్షుడిగా నెలకొల్పబడి-అచిరకాలంలోనే లక్షలాది ప్రాణాలను కాపాడేందుకు దోహద కారైన ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ, భవిష్యత్ లో, రాజు గారు లేని లోటు కనపడకుండా అత్యవసర సహాయ సేవలు అందించడానికి అవసరమైన నిధుల సేకరణకు, ఎలాంటి వ్యూహం అనుసరించాలనేదే నాటి ఉపన్యాసం ముఖ్య ఉద్దేశం. ఆంధ్ర ప్రదేశ్ తో సహా సహాయ సేవలు పొందుతున్న ఇతర రాష్ట్ర ప్రజలు కూడా ఏం జరుగబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపధ్యంలో వెంకట్ గారు "వ్యూహాత్మకంగా" ఏర్పాటు చేసిన కార్యక్రమం అది.

సేవా దృక్ఫదంతో అత్యవసర సహాయ సేవలను అందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ లాంటి సంస్థలు, "ప్రభుత్వం పైనా", "నిధులను సమకూర్చే ఒకరిద్దరి దాతృత్వ విరాళాల పైనా" ఎల్లకాలం ఆధార పడడం కంటే, "వ్యూహాత్మకంగా" ఆదాయ వనరుల సేకరణకు పూనుకోవాలని ఆ రంగంలో నిష్ణాతుడుగా పేరున్న రంజన్ దాస్ అన్నారు. అంబులెన్సుల "సరాసరి నిర్వహణ వ్యయం" ప్రభుత్వం భరించినంత మాత్రాన అదే “శాశ్వత పరిష్కారం అని” అనుకోకూడదని ఆయన హెచ్చరించారు. ఇ.ఎం.ఆర్.ఐ కేవలం అంబులెన్సుల నిర్వహణ మాత్రమే చేపట్టలేదని, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్-పరిశోధన-శిక్షణ కూడా సంస్థ కార్యకలాపాల్లో ప్రధానమయినవేనని, అన్నింటికీ నిధులను ఒక వ్యక్తో-సంస్థో-ప్రభుత్వమో సమకూర్చడం కష్టమని ఆయన అభిప్రాయ పడ్డారు.

ఇ.ఎం.ఆర్.ఐ ప్రధాన లక్ష్యాలను-ధ్యేయాలను ఎంతమాత్రం నీరు కార్చమంటూ నిధులను సమకూర్చేందుకు ముందుకొచ్చే దాతలు, సంస్థ విలువలను గౌరవించినప్పటికీ-మంచి మనసుతో, సేవా దృక్ఫదంతో నిధులిచ్చినప్పటికీ, అంతర్లీనంగా, తద్వారా తమకు కలగబోయే లాభం ఏంటని తప్పక ఆలోచిస్తారని స్పష్టం చేస్తూ, "సొంత కాళ్ల మీద నిలబడ గలగడమే" మెరుగైన పద్ధతిగా పేర్కొన్నారు రంజన్ దాస్. అదో సవాలుగా వర్ణించిన ఆయన, సీనియర్లు ఆ సవాలును స్వీకరించి, మారిన పరిస్థితుల్లో సంస్థ మనుగడకు తమవంతు తోడ్పడగలిగినప్పుడే "లీడర్లు-నాయకులు" కాగలుగుతారని, "మేధావి" గా పిలువబడతారని, అలాంటి వారికే ఇ.ఎం.ఆర్.ఐ లో స్థానం వుండాలని నిర్ద్వందంగా-నిర్మొహమాటంగా చెప్పారు. సవాలును స్వీకరించడమంటే "బిక్షాపాత్ర"తో ప్రయివేట్ భాగస్వామిని అన్వేషించడం కానే కాదని, "నిధులను సమీకరించగల కార్యాచరణ పథకాన్ని ఎందుకు నేను రూపొందించి అమలు చేయలేను" అని ప్రశ్నించుకుని, సమాధానం వెతుకు తే, అదే క్రమేపీ "వ్యూహ రచన" గా మారి లక్ష్యాన్ని చేరుకునేందుకు దోహదపడుతుందని తొలి పాఠం చెప్పారు రంజన్ దాస్. అదే జరిగినప్పుడు ఆబాల గోపాలానికి అత్యవసర సహాయ సేవలు దేశవ్యాప్తంగా మరింత మెరుగ్గా లభించి, మరెన్నో ప్రాణాలను కాపాడగలిగే వీలు కలుగుతుంది.

"లీడర్లు” గా పిలిపించుకున్న మాలో సంస్థ పెరుగుదలకు-ఆదాయ వనరుల సేకరణకు వ్యూహాత్మకంగా ఎంతమంది తోడ్పడగలిగారనేది ప్రశ్నార్థకం. తోడ్పడగల నైపుణ్యం వున్న ఒకరిద్దరిని, యాజమాన్యం ఎంతవరకు ప్రోత్సహించి-అవకాశం ఇచ్చిందనేదీ ప్రశ్నార్థకమే. మేధావులని, నిపుణులని, నిష్ణాతులని సంస్థలో తీసుకున్న వారు-కష్ట కాలంలో సంస్థను అంటిపెట్టుకుని వున్న వారు, యాజమాన్యం మారిన అతి కొద్ది కాలంలోనే వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి ? వీటన్నిటి సమాధానాలలోనే "ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు కూడా వుంటాయి". ఆ వివరాలు మరో సందర్భంలో తెలుసుకుందాం.

వ్యూహ రచనకు ప్రధానమైన మౌలికాంశాలను నిర్ధారించిన ఆ రంగంలోని నిపుణులు, ఐదు రకాల "షరతులను (నిబంధనలు-నియమాలు)" ఆ ప్రక్రియలో భాగంగా విధిగా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. వ్యూహ రచనను తయారుచేసేవారు చేయాల్సిందల్లా, ఆ ఐదు రకాల షరతులను, సంస్థను విజయపథంలో నడిపించు కోవడానికి, సందర్భోచితంగా అన్వయించు కోవడమే. ఇక్కడ "సందర్భం" అనేది చాలా ముఖ్యమైంది. "సమయం-సందర్భం" లేకుండా చేప్పేది-చేసేది అప్రస్తుతంగా భావించాలి. ఆ ప్రధాన షరతులను ఇ.ఎం.ఆర్.ఐ కి అన్వయించి విశ్లేషించారు రంజన్ దాస్.

108-అత్యవసర సహాయ సేవలను పొందాల్సిన ఖాతాదారులకు-లబ్దిదారులకు (వినియోగదారులు), ఆ సేవలను మరింత మెరుగైన రీతిలో-నాణ్యమైన పద్ధతిలో పొందే హక్కుందని, ఆ విషయంలో "తుది అభిమతం-నిర్ణయం" వారిదే అవుతుందని ఇ.ఎం.ఆర్.ఐ గుర్తించడం మొదటి షరతు. ప్రభుత్వం అంగీకారంతో నోడల్ ఏజన్సీగా తమ సంస్థ అందిస్తున్న సహాయ సేవల తరహా సేవలనే అందించగల "పోటీదారులు" వున్నారని-వుండవచ్చని, ఆ పోటీ ముమ్మరం కానున్నదని, ఆ పోటీని వ్యూహాత్మకంగా సవాలు చేయాల్సిన అవసరం ఆసన్నమవుతున్నదని-లేదా ఆసన్నమయిందని ఇ.ఎం.ఆర్.ఐ గుర్తించి తీరాలి. ఒకవేళ పోటీకి ఎవరూ లేనిపక్షాన, సవాలు విసిరి మరీ పోటీదారులను తయారుచేయాలనేది రెండో షరతు. మానవ-ఆర్థిక వనరులు పోను-పోనూ, పరిమితంగానే లభ్యమయ్యే స్థితి కలగవచ్చని గుర్తించడం మూడో షరతు. సంస్థ కార్య కలాపాలకు (యాజమాన్య పరమైన-నిర్వహణా పరమైన-ఇతర అవసరాలకు) నిధులు (ప్రస్తుతం) సమకూరుస్తున్నవారు, ప్రభుత్వమైనా-ప్రయివేట్ వారైనా, వారి పెట్టుబడికి తగిన ప్రతిఫలం రావడం లేదని, సహనం కోల్పోయే ప్రమాదముందని ముందుగానే ఊహించడం మరో షరతు. లాభాపేక్ష లేని సంస్థల విషయంలో, ఆ ప్రతిఫలం "ధన రూపేణా" వుండాల్సిన అవసరం లేదు. "పేరు-ప్రతిష్టలు" కావచ్చు, తద్వారా మరో రకమైన "ప్రతిఫలం" కావచ్చు. హఠాత్తుగా భారీ నష్టమో-లాభమో (రాజు గారు బరువు-బాధ్యతలు వెంకట్ గారిమీద పెట్టి హఠాత్తుగా తప్పుకున్న తరహాలో!) సంభవించవచ్చని ఊహించడం ఐదో షరతు. వ్యూహాత్మకంగా సంస్థను "ఒడిదుడుకులకు" లోనుకాకుండా నడిపించాలంటే, ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్య స్థాయి "లీడర్లు" ఈ ఐదు షరతులను విధిగా పరిగణలోకి తీసుకుని ముందుకు సాగాలి. ఈ ఐదింటిలో ఒకటి గాని-ఒకటికంటే ఎక్కువగాని షరతులు సంస్థకు అన్వయించాల్సి వచ్చిందంటే, తదనుగుణంగా వ్యూహ రచన చేయాల్సిందే.

యాజమాన్య స్థాయి "లీడర్లు" సమిష్టి గా ఆలోచించి, ఒక్కో అంశంపై వివరణాత్మక వ్యూహ రచన చేయాలంటే, అందులోని ప్రతి వ్యక్తి, తనకు సంబంధించిన-తన వంతు బాధ్యతను నిబద్ధతతో-నైపుణ్యంతో చేపట్టాలి. "బాధ్యతారాహిత్యం" వున్న చోట వ్యూహరచనకు తావులేదు. వ్యూహరచన చేయడమంటే, పరోక్షంగా-ప్రత్యక్షంగా ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు సౌభాగ్యం కలిగించడమే. సందర్భాన్ని బట్టి వ్యూహరచన వుంటుందంటే, దానర్థం, ఎటువంటి అవసరానికి ఎటువంటి మార్గాన్ని ఎంచుకోవాలన్న ఆలోచన చేయడమే. ఆలోచనలలోని వ్యత్యాసాలు, లేదా, భిన్నాభిప్రాయాలు వ్యూహరచనగా భావించరాదు. ఒకరి వ్యూహరచన మరొకరి దానికంటే భిన్నంగా వుండొచ్చు, అందుకే సందర్భ ప్రాధాన్యం చాలా ముఖ్యం. "వ్యూహ రచన బాధ్యత సంస్థదే-నాది కాదు" అని ఎవరికి వారే ప్రతి లీడర్ తప్పించుకుంటే వారిలో నాయకత్వ లక్షణాలు లేనట్లు గానే భావించాలి. సంస్థ అంతర్గత విధానాలు-నెల కొన్న పద్ధతి-నిర్మాణ వ్యవస్థ వ్యూహరచనకు తోడ్పడతాయి. నాయకుడన్న వాడు "సమస్యలో భాగస్వామి కాకుండా" "పరిష్కారంలో పాలుపంచుకోవాలి".

ఉదాహరణకు, ఇ.ఎం.ఆర్.ఐ కి ప్రభుత్వమో, లేక, ప్రయివేట్ భాగస్వామో సమయానికి కావాల్సిన నిధులను విడుదల చేయకపోతే, ఆ సమస్యను "జటిలం" చేయకుండా, ఏం చేస్తే ఆ సమయానికి నిధుల కొరత లేకుండా చేయగలుగుతామని ఆలోచన చేయడమే "వ్యూహ రచన". అది చేయగల వారే "లీడర్లు". వ్యూహాత్మకంగా రూపొందించిన ప్రణాళికను సంస్థ (ఇ.ఎం.ఆర్.ఐ) ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీ.ఇ.ఓ) అంగీకరించడంలేదనో-సూచనను వినిపించుకోవడంలేదనో, సాకులు చూపించడం నాయకత్వ లక్షణం కాదు. సరైన వ్యూహకర్త తాను చేసిన ఆలోచన మిగతా వారందరి ఆలోచనకంటే మెరుగైనదని ధృఢంగా విశ్వసించగలిగి, పై అధికారిని ఒప్పించగలగాలి. సందర్భాన్నిబట్టి వ్యూహరచనలో వ్యత్యాసం వుంటుంది. ఈ వ్యత్యాసం కనీసం మూడు అంశాల్లో వుండితీరుతుంది.

వినియోగదారుల పరిధి ఏమిటి-ఎలా నిరంతరం మార్పుచెందుతుంది అని ఆలోచన చేయడం మొదటి అంశం. వినియోగదారుల (ఇ.ఎం.ఆర్.ఐ అందిస్తున్న అత్యవసర సహాయ సేవలను పొందే లబ్దిదారుల) సంఖ్య పెరుగుతున్న కొద్దీ, సమస్యలు కూడా పెరుగుతాయి. వాస్తవ వినియోగదారులను గుర్తించడం కూడా క్లిష్టం కావచ్చు. ఉదాహరణకు, అత్యవసర సహాయం కొరకు ఎదురుచూచేవారు-అందులో ఖచ్చితంగా తక్షణం సహాయం కావల్సినవారు-సహాయం కావాలని ఫోన్ చేయగలవారు-ఫోన్ చేయలేనివారు-ఒక విధంగా పౌరులందరూ-ప్రభుత్వంలోని అధికార, అనధికార గణం-పోలీసు, వైద్య, ఆరోగ్య, అగ్నిమాపకదళ సిబ్బంది.... ఇలా అందరు కూడా ఇ.ఎం.ఆర్.ఐ వినియోగదారులే. అత్యవసర సమయాల్లో "రోగి బంధువులు" కూడా వినియోగదారులే. వినియోగదార్ల పరిధిని అర్థం చేసుకున్న తర్వాత, వారికి లభించబోయే లాభాన్ని ఎలా "విలువ" కట్టాల్నో కూడా వ్యూహంలో భాగమే. ఇది రెండో అంశం. చిట్ట చివరలో, చిట్ట చివరి వినియోగదారుడి చిట్ట చివరి అవసరానికి లభించిన పరిష్కారానికి-మొట్టమొదటి సారి, మొట్టమొదటి వినియోగదారుడికి అలాంటి సమస్యకు లభించిన పరిష్కారానికి తేడా వుండకూడదు. అలాంటి వ్యూహరచనే "విలువ ప్రాధాన్యతగల ప్రతిపాదన" అంటారు.

"కస్టమర్" ఎల్ల వేళలా దేముడితో సమానమే. ఆ కస్టమర్ లబ్దిదారుడు కావచ్చు, లేదా, నిధులను సమకూరుస్తున్న ప్రభుత్వమే కావచ్చు. తనకు అర్థమయ్యే పరిభాషలో, సేవలు లభ్యమవ్వాలని వినియోగదారుడు కోరుకుంటాడు. తప్పైనా-ఒప్పైనా కస్టమర్ చెప్పిందే "వేదం". అంటే, ఇ.ఎం.ఆర్.ఐ "ప్రధాన కస్టమరైన" ప్రభుత్వం చెప్పింది, ఖండించకుండా, నచ్చచెప్పే ధోరణిలో ఇ.ఎం.ఆర్.ఐ వ్యవహరించాలి.

రంజన్ దాస్ సలహాలను-సూచనలను ఎంతమంది సీరియస్ గా తీసుకున్నారనేది-ఎంతమంది అమలులో పెట్టగలిగారనేది చెప్పడం అంత తేలికైన విషయం కాదు. బహుశా ఆయన చెప్పింది పాటించి వుంటే, ఒడిదుడుకులు కొన్నైనా తప్పేవేమో !