Wednesday, September 29, 2010

కమ్యూనిస్టు గాంధి-దెందులూరు పెద్దింటివారి కె.బి.తిలక్ : వనం జ్వాలా నరసింహా రావు

(ఆంధ్ర ప్రభ దినపత్రిక 29-09-2010)
(సూర్య దినపత్రిక 29-09-2010)
వనం జ్వాలా నరసింహా రావు
పాతికేళ్లుగా పరిచయమున్న తిలక్ మరణ వార్త (23-09-2010) తెలిసినప్పటినుంచి, ఆయన జ్ఞాపకాలు పదే-పదే గుర్తుకొస్తున్నాయి. "తిలక్ జ్ఞాపకాలు" శీర్షికతో "ప్రజాతంత్ర" వారపత్రికలో పది సంవత్సరాల క్రితం అయనను గురించి రాసే రోజుల నాటి సంగతులు మరీ గుర్తుకొచ్చాయి. పత్రిక తాజా సంచిక మార్కెట్లోకి వచ్చిన ప్రతిసారీ, ఆ శీర్షికపై కొంత చర్చ జరిగే ది. సినిమాలకు సంబంధించిన "తిలక్ జ్ఞాపకాల"పై కొందరు స్నేహితులు ఏకీభవించడం, మరికొందరు విభేదించడం జరిగే ది. చర్చలో పాల్గొన్న వారిలో దేవులపల్లి అమర్, డి. వెంకట్రామయ్య, చలసాని ప్రసాదరావు, భండారు శ్రీనివాసరావు, ఆర్.వి.వి. కృష్ణారావు...తదితరులుండే వారు. చలసాని తాను చెప్పదల్చుకున్నవి కాగితంపై రాస్తే అందరం చదివేవాళ్లం. ఒకానొక సందర్భంలో ఆయన ఆ జ్ఞాపకాలను "తిలకాష్ట జీవన బంధనం" పేరుతో పుస్తకంలాగా ప్రచురించమని సలహా కూడా ఇచ్చారు. చివరకు, "అనుపమ గీతాల తిలక్" పేరుతో హాసం వారు దాన్ని ప్రచురించారు. కాకపోతే సీరియల్‌గా రాసినవన్నీ అందులో లేవు. కేవలం సినిమాలకు సంబంధించినంతవరకే ఆ పుస్తకం పరిమితమయింది. వాస్తవానికి తిలక్ ని సినిమాలకు మాత్రమే పరిమితం చేయడం సమంజసం కాదు. ఆయనో బహుముఖ ప్రజ్ఞాశాలి.

తిలక్‌ను చూడగానే పదహారణాల కాంగ్రెస్ నాయకుడన్న భావన కలుగుతుంది. ఆయన పార్లమెంటు భవనంలోకి పాస్ లేకుండా వెళ్లగలిగేవారన్న విషయం చాలామందికి తెలియదు. ఆయనలా లోనికి వెళుతుంటే పార్లమెంటు సభ్యుడనుకునేవారు. హైదరాబాద్‌కు వచ్చేంతవరకు ఆయనో సినిమా మనిషి. ఇక అక్కడినుంచి ఒక మానవతావాదిగా, సామాజిక కార్యకర్తగా, ఉద్యమకారునిగా, స్వాతంత్ర సమరయోధుల్లో ఒకడిగా, చిన్నల్లో చిన్నగా, పెద్దల్లో పెద్దగా....ఒక్కొక్కరికి ఒక్కొక్క అవతారంలో కనిపించేవాడు-అనిపించేవాడు. అవతారం ఏదైనా, అనుకున్నది సాధించేంతవరకు అలుపనేది లేకుండా సాగిపోవడం ఆయన నైజం. సినిమా కార్మికుల బాధా మయ గాథలు విని-చలించి, వారికోసం రంగంలోకి దిగిన సందర్భంలోను, "గాంధి" సినిమా విషయంలో భారతీయులకు న్యాయం చేకూర్చడానికి చేసిన న్యాయపోరాటంలోను. రాజభవన్ ప్రాంగణంలో కుముద్ బెన్ జోషి గవర్నర్‌గా వున్నప్పుడు తక్కువ ధర చేసే "డోమ్ హౌజ్" నిర్మాణం చేపట్టడంలోను, ఇండో-పాకిస్తాన్ మైత్రి సంబంధమైన కార్యక్రమాల నిర్వహణలోను, "ట్విన్సీ క్లబ్" స్థాపనలోను, కార్య దక్షతకు తిలక్ పర్యాయపదంగా వుండేవాడు. టీవీ ఛానళ్లు రాక పూర్వమే, ఏ రోజు వార్తలను ఆరోజే వీడియో కేసెట్లో రికార్డ్ చేసి కేబుల్ టీవీ ద్వారా ప్రసారం చేయించాలని ఆయన చేసిన ప్రయత్నం అద్భుతం. పాతరోజుల్లో తన మేధస్సు మధించిన అపురూపమైన చిత్రాలతో ప్రత్యేకించి తెలుగు చిత్ర రంగాన్ని, కొంత మేరకు హిందీ చలన చిత్ర రంగాన్ని ఒక మలుపు తిప్పిన మహనీయుడాయన. ఆయన్ను మొదట్లో తక్కువ అంచనా వేయడం మా లాంటి వారి అజ్ఞానం.

అనుపమ చలన చిత్ర దర్శక నిర్మాతగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, సామాజిక సేవకునిగా తిలక్ చాలామందికి సుపరిచితుడే. కాకపోతే ఆయన్ను గురించి తెలియని విషయాలూ ఎన్నో వున్నాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న తిలక్‍ జైలు జీవితం గడిపినప్పుడు ఎదురైన అనుభవాలు చెప్పినప్పుడు చలించిపోయాడు. దానికి కారణం ఆయన పడ్డ బాధలు కాదు. తోటి ఖైదీల బాధలు తీర్చలేని పరిస్థితిలో తానున్నందున. తిలక్ వున్నది "సింపుల్ ఇంప్రిజన్మెం ట్ సెల్" కాగా, పక్కనే, అచిర కాలంలో ఉరి శిక్షకు గురి కాబోయే వారి నుంచే "కన్డెమ్డ్ ఇంప్రిజన్మెంజట్ సెల్" వుండేదట. అందులో శిక్షను అనుభవించేవారు, తాము ఎదుర్కొన బోయే పరిస్థితిని తలచుకుని, రాత్రిళ్లు భోరున విలపిస్తుంటే, తిలక్ వాపోయేవాడు. ఖైదీలు, విసర్జించిన తమ మూత్రాన్ని కుండల్లో పట్టుకుని, జైలర్ అనుమతిచ్చినప్పుడు బయట పార పోయడం ఘోరంగా వుండేదనేవారు. తాము తినడానికి జైలు భోజనం ఏ మాత్రం అనువైంది కాదని కూడా అనేవారు. విడుదలైన తిలక్ "ఉషా మెహతా" స్వతంత్ర రేడియో ఉద్యమంలో పాల్గొని, స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని వాడ వాడలా ప్రచారం చేసారు.

ముదిగొండ జగ్గన్న శాస్త్రి పరిచయంతో ప్రజానాట్యమండలి వైపు ఆకర్షితుడైన తిలక్, అతివాద భావాల కళాకారులతో చేతులు కలిపాడు. నాటకాలు వేయడం, వేయించడం, డప్పులు వాయించడం, ప్రజానాట్యమండలి విప్లవ గీతాలను ఆలపించడం, వూరూరా తిరగడం చేసేవాడు. "పెద్దింటి వాళ్లం-తప్ప తాగి వచ్చి డప్పు కొట్తున్నాం-తప్పుకోండి" అంటూ కొంటెగా జానపద గీతం ఆలపిస్తుంటే, ప్రజల స్పందన విపరీతంగా లభించేదట. మేనమామ ఎల్వీ ప్రసాద్ బొంబాయి లో వుంటున్నందున తిలక్ అక్కడకు చేరుకున్నప్పటికీ, ఆయనలో అంతర్లీనంగా వున్న స్వతంత్ర సమరాభిలాష కొనసాగింది. అక్కడి "పీపుల్స్ థియేటర్" లో చేరి, బాలరాజ్ సహాని, రొమేష్ థాపర్ లాంటి వారితో సాన్నిహిత్యం పెంచుకున్నారు. వామపక్ష భావాల వారి కలయికకు వేదికైన "ఒపేరా హౌజ్" సినిమా టాకీస్ లో జరిగే "ప్రజానాట్యమండలి" సమావేశాలకు హాజరయ్యేవారు. తెలుగు విభాగం ఇన్-చార్జ్ గా కూడా వుండేవారు తిలక్. మిలిటరీ క్లబ్బులకు తంబోలా కూపన్లు అమ్మడం, ఎల్వీ ప్రసాద్ బాతు గుడ్ల వ్యాపారంలో పనిచేయడం ద్వారా నాలుగు డబ్బులు సంపాదించుకునేవారు. బాతు గుడ్ల వ్యాపారం వల్ల బొంబాయి లోని తెలుగు కార్మికులకు, కూలీలకు దగ్గరయ్యారు. ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక పత్రిక "పీపుల్స్ వార్" కు పేపర్ బోయ్ గా పనిచేశారు. అలా కమ్యూనిస్టు పార్టీ వారితో సంబంధాలు పెట్టుకున్నారు. బొంబాయిలో వున్న రోజుల్లోనే, దిన ఖర్చుల కొరకు అదనంగా, నర్సాపూర్ లేసులను మార్కెటింగ్ చేశారు. స్వల్ప మొత్తంలో తనకవసరమైన ఆర్థిక వనరులను కష్టపడి సమకూర్చుకునే తిలక్‌కు ఒకరిపై ఆధారపడి జీవించడం ఎంతమాత్రం ఇష్టముండేది కాదు.

మాజీ మంత్రి స్వర్గీయ పరకాల శేషావతారంతో కలిసి యూత్ లీగ్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ, బాలానందం సంఘం స్థాపించారు. యూత్ లీగ్ బృందం సభ్యులతో కలిసి, రైల్వే ప్లాట్ఫాిమ్ల పై దొరికే అశ్లీల సాహిత్యంపై సమర భేరి మోగించారు. అలాంటి పుస్తకాల అమ్మకాలను వ్యతిరేకిస్తూ "అరసం" తరహా ఉద్యమానికి ఆ రోజుల్లోనే నాంది పలికారు. అంతటితో ఆగకుండా, అశ్లీల సాహిత్యం చదవకుండా, తమవంతు కర్తవ్యంగా యూత్ లీగ్ చక్కటి సాహిత్యం సేకరించి చదివించేవారు. పోరాట పటిమను, ఉద్యమ స్ఫూర్తిని నీరు కార్చే ప్రయత్నాలు ఆ రోజుల్లో కూడా జరిగేవనడానికి ఉదాహరణగా, అప్పటి పశ్చిమ గోదావరి కలెక్టర్ శేషాద్రి తనను తోటి సమరయోధుల నుంచి విడదీసే ప్రయత్నం ఎలా చేసింది వివరించారు. ఎక్కడున్నా, ఏం చేసినా, స్వాతంత్ర్య ఉద్యమంతో ప్రత్యక్ష-పరోక్ష సంబంధాలను కొనసాగించే తిలక్, జైలు నుంచి విడుదలై వస్తుండే ఉద్యమకారులను కలుసుకొని, మూడో కంటికి తెలియకుండా, అజ్ఞాతవాసానికి తరలించేందుకు దోహద పడేవాడు. కమ్యూనిస్టు పార్టీ అజ్ఞాత కార్యకలాపాల కోఆర్డినేటర్ ఎస్వీ నరసయ్య కాంటాక్ట్ పాయింట్‌గా వుండేవారు. ఒక పర్యాయం కామ్రేడ్ మద్దుకూరు చంద్రశేఖర రావును, మరో కమ్యూనిస్టు అభిమాని శాస్త్రి కారులో మద్రాస్ నుండి బెంగుళూరు తీసుకెళ్లి, అక్కడినుంచి మారు పేర్లతో విమానంలో హైదరాబాద్ కు చేర్చారు తిలక్. హైదరాబాద్ రాష్ట్రంలో అప్పట్లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం వుంది. మద్దుకూరును కామ్రేడ్ గోళ్ల రాధాకృష్ణమూర్తికి అప్పగించారు. అదీ ఆయన ఉద్యమ స్ఫూర్తి.
తెలంగాణ విమోచన ఉద్యమం ఊపందుకుంటున్న రోజుల్లో, కమ్యూనిస్టు పార్టీతో సహా, ఉద్యమ నిర్మాణ-నిర్వహణలో కీలకపాత్ర వహిస్తున్న ప్రజానాట్యమండలిపైనా నిషేధం వుండేది. నిషేధం నీలినీడల్లో తిలక్‌తో సహా పలువురు ప్రజానాట్యమండలికి చెందిన వారు ఒక్కొక్కరు మద్రాసు చేరుకున్నారు. సాంస్కృతిక విభాగానికి చెందిన సుంకర, వాసిరెడ్డి, తుమ్మల, రాంభట్లలు; భవిష్యత్ సినీ దిగ్గజాలైన తాతినేని, వీరమాచనేని, మిక్కిలినేని, చదలవాడ, రాంకోటి, కోగంటి వారిలో ప్రముఖులు. వీరందరికీ తిలక్‍ ద్వారా ఎల్వీ ప్రసాద్ మద్రాస్‌లో కొంత ఆధారం ఏర్పాటుచేయడంతో పాటు, కొంతకాలం ఆంధ్ర ప్రజానాట్యమండలి అధ్యక్షునిగా పనిచేశారు. పీసీ జోషి కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా వున్న రోజుల్లో, సర్కారు జిల్లాల్లోని ఎగువ మధ్య తరగతి కుటుంబాల వారు చాలామంది పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. ఒకే ఇంట్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు అభిమానులుండడంతో ప్రతి ఇంటిపైనా ఇరు పార్టీల జండాలెగిరేవట. వారిలో చాలామంది ప్రజానాట్యమండలితో సంబంధాలు పెట్టుకుని, మద్రాసుకు వచ్చి స్థిరపడ్డారని చెప్పిన తిలక్, వారిలో పలువురు "క్యాపిటలిస్టులు" గా మారిపోయారని విచారం వ్యక్తంచేశారు. ప్రజానాట్యమండలి కళాకారులందరినీ ఒక వేదికపై తేవడానికి శాంతినికేతన్ లో విద్యనభ్యసించిన సి.వి.వి.ఆర్. ప్రసాద్, ఆయనతో పాటు ఎస్వీ నరసయ్య కృషిచేశారని అనేవారు తిలక్. అలా అభ్యుదయ కళాకారులందరూ ఒకే వేదికపై జమ కూడడం వల్లే, భవిష్యత్‌లో సినీరంగ అభివృద్ధికి పరోక్షంగా ఒక కీలక ఘట్టానికి నాంది పలికిందంటారు తిలక్.

వైభవంగా హైదరాబాద్‌లో జరిగిన "రోజులు మారాయి" సినిమా శత దినోత్సవ వేడుకలు, నగరానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరలి రావడానికి, మొట్టమొదటి సినీ స్టూడియో నిర్మాణానికి దారితీసిన చారిత్రాత్మక సంఘటన అనేవారు తిలక్. ఆ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన అప్పటి రాష్ట్ర మంత్రి స్వర్గీయ కొండా వెంకట రంగారెడ్డి, నగరం సాహితీ-సంస్కృత రంగాలలో అభివృద్ధి చెందాలంటే, చలన చిత్ర రంగ ప్రముఖులు కలిసి కట్టుగా కృషిచేయాలని తన ఉపన్యాసంలో చెప్పారట. ఆయన సూచన మేరకు, రోజులు మారాయి యూనిట్ ప్రముఖులందరూ కలిసి కట్టుగా ఆలోచించి సారధీ స్టూడియో నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించడం, అచిర కాలంలోనే అమీర్‌పేటలో అది రూపుదిద్దుకోవడం జరిగింది. స్టూడియో నిర్మాణానికి స్థలం కావాలని (ఇప్పటి లాగా) ప్రభుత్వాన్ని కోరలేదప్పుడు. ప్రయివేట్ వ్యక్తుల దగ్గర కొన్న భూమిలో స్టూడియో నిర్మాణం, దానికి కొంత దూరంలో-ఖైరతాబాద్ సమీపంలో సారధి యూనిట్ కళాకారులందరూ నివసించడానికి ఇళ్ల స్థలాలు కొనుక్కునే ఏర్పాటు జరిగింది. విశ్వ విఖ్యాత నటసార్వభౌములను, నటసామ్రాట్టులను, పద్మశ్రీలను, పద్మభూషణ్‌లను ఆ స్టూడియో అందించినప్పటికీ, సినీ కాల గమనంలో ఎవరికివారే వేరై, ఎవరి "సినీ కుంపటి" వారే పెట్టుకోవడం తననెంతో కలచివేసిందనేవారు తిలక్.

ఆంధ్ర రాష్ట్రం కొరకు మద్రాసులోని మైలావూర్‌లో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షను గుర్తుచేసుకున్న తిలక్ "ఆయన్ను బలిచేశారు" అనేవారు. అప్పట్లో మద్రాస్ టీనగర్లోని సినీ నటుడు చంద్రమోహన్ మామగారు, ప్రముఖ వైద్యులు డాక్టర్ గాలి బాలసుందర రావు ఇంట్లో జరిగే రాజకీయ సమావేశాలకు తిలక్ క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. అక్కడే పద్మశ్రీ డాక్టర్ పి. తిరుమల రావుతో, బులుసు సాంబమూర్తితో పరిచయమైంది. తిలక్ తన కుర్ర కారు గాంగును వెంట పెట్టుకుని, కనిపించిన ప్రతినాయకుడి ఇంటికి వెళ్లి, శ్రీరాములు నిరాహార దీక్షను విరమింపచేయమని ఒత్తిడి తెచ్చేవారు. ఆయనొక్కరే ఎందుకు బలి కావాలని వాదించేవారు. అప్పట్లో తిలక్ నివాసం టంగుటూరు ప్రకాశం పంతులు పెద్ద కొడుకు ఇంటి ఆవరణ వెనుక నున్న ఒక కారు షెడ్డు. ప్రకాశం భోలా మనస్తత్వాన్ని, ఆయనతో తన భేటీని గుర్తుచేసుకుంటూ, ఒకనాడు ఆయన ఇండియన్ రిపబ్లిక్ పత్రిక కార్యాలయంలో కారు దిగుతుండగా ఘెరావ్ చేసిన విషయం చెప్పారు. అప్పటికి పొట్టి శ్రీరాములు ఆత్మ త్యాగానికి మరి కొన్ని గంటల వ్యవధి మాత్రమే వుందట. తిలక్ తనను పట్టుకుని లాగుతుంటే ప్రశ్నించిన ప్రకాశంకు, పొట్టి శ్రీరాములును అందరూ కలిసి బలిదానం చేస్తుంటే తాను పిచ్చివాడినైపోయానని జవాబిచ్చాడు. ప్రకాశం లాంటి గుండే ధైర్యం వున్న మనిషి కూడా ఆ సమయంలో తనను ఏం చేయకపోవడం ఆయన గొప్పతన మంటారు తిలక్.

ఇలా గుర్తు తెచ్చుకుంటూ పోతుంటే తిలక్ జ్ఞాపకాలు, తిలక్ తో పరిచయం అయిన తర్వాత జ్ఞాపకాలు ఎన్నో గుర్తొస్తుంటాయి. ఆయన చనిపోయిన నాలుగో రోజున జన చైతన్య వేదిక సంతాప సభ ఏర్పాటుచేసింది. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ గీతారెడ్డి, సిపిఎం నాయకుడు బివి రాఘవులు, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక మండలి అధ్యక్షుడు రమణమూర్తి ప్రభృతులు వారి జ్ఞాపకాలను పంచుకున్నారు. సమాజంపై తనదంటూ విభిన్నమైన ముద్ర వేసిన తిలక్ భావి తరాల వారికి స్ఫూర్తి దాతగా నిలుస్తారని అంటూ, గీతారెడ్డి, తనకు "రాజకీయ ఆరంగేట్రం" చేయించిన గురువు గారు తిలక్ అని చెప్పారు. ఆయన ఆనాడు రూపొందించిన "భారత రత్న ఇందిరమ్మ" రూప వాణి కార్యక్రమంలో తనకు ఇందిరా గాంధి పాత్రను ఇవ్వడం వల్లే తనకు అమితమైన ప్రాచుర్యం వచ్చిందని, అది తాను రాజకీయంగా ఎదగడానికి దోహద పడిందని అన్నారు. సినీరంగంలో వున్న ప్రతి వ్యక్తి ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. "కామ్రేడ్ తిలక్" అని ఆయనను సంభోదిస్తూ ప్రసంగం చేసిన రాఘవులు, జీవితాంతం ప్రజా ధర్మం కొరకు పోరాడిన తిలక్ తనకు "కమ్యూనిస్టు కోణం" లోనే తెలుసన్నారు. వామ పక్ష ఐక్యత కొరకు అహర్నిశలు కృషిచేసిన తిలక్, ఎప్పుడూ గట్టి ప్రతిపక్షం, అదీ వామపక్ష ప్రతిపక్షం వుండాలని కోరుకునేవారని గుర్తుచేసుకున్నారు.

అన్ని రాజకీయ పార్టీల వారు, తిలక్ తమ వాడే అనడం ఆయన గొప్పదనానికి నిదర్శనం. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో "పెద్దింటివారు" అని పిలువబడే కుటుంబంలో జన్మించిన కొర్లిపర బాలగంగాధర తిలక్ను "కమ్యూనిస్టు గాంధి" అనడం సమంజసమేమో!

Monday, September 27, 2010

పాత తరం నాయకుడు కోట్ల విజయ భాస్కర రెడ్డి : వనం జ్వాలా నరసింహారావు

సెప్టెంబర్ 27, 2010 న కోట్ల విజయభాస్కర రెడ్డి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా
పాత తరం నాయకుడు కోట్ల విజయ భాస్కర రెడ్డి
వనం జ్వాలానరసింహా రావు

పాత తరం నాయకులలో కోట్ల విజయ భాస్కర రెడ్డికి ప్రత్యేకత వుందనాలి. ఆద్యంతం-ఆజన్మాంతం, చెదరని నిజాయితీతో, క్రమశిక్షణతో, పరిపాలనా దక్షతతో, ముందు చూపుతో, సామర్థ్యంతో, నైతిక విలువలతో, ఆత్మ విశ్వాసంతో, ముక్కు సూటిగా పోయే మనస్తత్వంతో, పట్టుదలతో రాష్ట్ర-దేశ రాజకీయాలలో తనదంటూ చెరిగిపోని ముద్ర వేసిన పెద్దమనిషి, సౌమ్యుడు, మితభాషి, అజాతశత్రువు, సంస్కార వంతుడు, అరుదైన సహజ నాయకుడు కోట్ల విజయభాస్కర రెడ్డి. జీవన యానంలో సహస్ర చంద్ర దర్శనం, రాజకీయ యానంలో షష్టి పూర్తి జరుపుకున్న ఆ మహా మనిషిని వరించని పదవి లేకపోయినా, ఎన్నడూ పదవే ధ్యేయంగా రాజకీయాలు చేయలేదు. అందుకేనేమో, అశేష జనం అభిమానాన్ని చూరగొన్న "పదహారణాల పెద్దాయన" య్యారు. మిగిలిన రాజకీయ వాదులతో పోల్చితే విజయభాస్కర రెడ్డిది పెద్ద మనిషి తరహా వ్యవహార శైలి.

అనేక ప్రజోపయోగమైన కీలక పదవులను తన అరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో పొందారు. పొందిన ప్రతి పదవికి వన్నె తెచ్చారు. స్వపక్షం-విపక్షం అన్న తేడా లేకుండా, తన వారైనా-పరాయి వారైనా తప్పుచేశారని భావించినప్పుడు, అందుకవసరమైన న్యాయ విచారణకు ఆదేశించి, ప్రశంశలను-అభిశంసలను అందుకున్నారు. అందుకేనేమో, సాక్షాత్తు రాజీవ్ గాంధీ లాంటి వారు, తన తల్లిపై-ఆమె ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చేసినప్పుడు, అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హోదాలో దాన్ని తిప్పికొట్టడానికి, విజయభాస్కర రెడ్డి లాంటి వారి పేరును వాడుకున్నారు. ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చేంత వరకు, ఏ విధంగానైతే కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో "నంబర్ టు" గా వ్యవహరించి, ఏ ముఖ్యమంత్రి వున్నా ఆయనకు అండగా సంపూర్ణ సహకారాలందించే వారో, అదే విధంగా అటు కేంద్రంలోను-ఇటు రాష్ట్రంలోను నిర్మాణాత్మక పాత్ర పోషించేవారు విజయభాస్కర రెడ్డి. ఆయన "నంబర్ టు" గా వుండడం, ఎప్పుడో బ్రహ్మానంద రెడ్డి కాలంలోనే ఆరంభమైంది. ఆయన ఏ శాఖను ఏ స్థాయిలో నిర్వహించినా, దానికి సంబంధించిన పూర్వా-పరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారని ఆయన ఆంతరంగిక అధికారులంటుండేవారు. నిజాయితీ పరులైన అధికారులంటే ఆయనకు ఎనలేని గౌరవం. వారిని ఎన్నో రకాలుగా ప్రోత్సహించేవారని పేరుంది. ఇప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్, ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయనకు కార్యదర్శిగా పనిచేశారు. అంతకు ముందు ఎన్ టీ రామారావు దగ్గర ఎస్వీ ప్రసాద్ పనిచేసినప్పటికీ, నిజాయితీ పరులైన అధికారులంటే ఆయనకున్న గౌరవమే తన దగ్గర పనిచేసేందుకు కూడా ఆయన్నే ఎంపిక చేసుకునేందుకు దారితీసింది. అలానే సమస్య ఎదురైనప్పుడు, దాన్ని ధైర్యంగా ఎదుర్కునేవారు కాని, ఇప్పటి నాయకులవలె బాధ్యతనుంచి తప్పించుకునే ధోరణి కాని-ఇతరులను నిందించడం కాని ఎన్నడూ చేయలేదని కూడా ఆయనతో పనిచేసిన అధికారులనేవారు. ఉదాహరణకు, తీవ్రవాదుల కిడ్నాప్‌కు గురైన ప్రభుత్వాధికారులను విడుదల చేయించేందుకు ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించిన తీరు అప్పట్లో పలువురి ప్రశంసలనందుకుంది.

కోట్ల తీసుకున్న సారా నిషేధం నిర్ణయం వల్ల మహిళలకు ధైర్యం కలగడం-అనేక బీద కుటుంబాలు బాగుపడడం జరిగింది. చౌక దుకాణాలను మహిళలకు కేటాయించాలనే నిర్ణయం కూడా ఆయనదే. అనాదిగా కాంగ్రెస్ పార్టీపై మహిళలకున్న అభిమానం, విజయభాస్కర రెడ్డి నిర్ణయాల మూలంగా ఇనుమడించిందనాలి. కర్నూలు జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా పనిచేసిన ఆయనకు పాలనా దక్షుడుగా పేరొచ్చింది. ఆ పేరే ఆయనను 1962లో రాష్ట్ర స్థాయికి ఎదిగేందుకు దోహదపడిందంటారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడుగా, రాష్ట్ర స్థాయికి చేరుకుని, దరిమిలా కేంద్ర స్థాయికి ఎదిగారు. ఆయన ప్రతిభను గుర్తించిన అధిష్టానం, ఎన్ని విధాల వీలై తే అన్ని విధాల, ఆయన సేవలను ఉపయోగించుకుంది. అహర్నిశలు ఆత్మవిశ్వాసంతో పనిచేసే విలక్షణమైన వ్యక్తిత్వమున్న విజయభాస్కర రెడ్డి ఏ పదవిలో వున్నా, అనవసర విషయాలకు, ఇప్పటి నాయకుల లాగా ప్రాధాన్యమివ్వకుండా, తన కర్తవ్య నిర్వహణలో ఎవరు కూడా వేలెత్తి చూపని రీతిలో హుందాగా ముందుకు సాగేవారు.

మానవత్వానికి, మంచితనానికి, సహనానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఆయన గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఒక పర్యాయం ముఖ్యమంత్రిగా ఆయన కాన్వాయ్ వెంట ప్రయాణిస్తున్న పాత్రికేయుల వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైందట. అది గమనించిన విజయభాస్కర రెడ్డి, తాను ముఖ్యమంత్రినన్న విషయం పక్కన పెట్టి, తన వాహనం దిగి, స్వయంగా గాయపడిన విలేఖరులకు సహాయ పడ్డారట. అదీ ఆయన మానవత్వం. వ్యవసాయానికి కావాల్సిన విద్యుత్ విషయంలో శ్లాబ్ పద్దతిని ప్రవేశపెట్టిన మంచితనం ఆయనది. కాపులను ముస్లింలను వెనుకబడిన వర్గాల వారిగా గుర్తించే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయించింది ఆయనే. బలహీన వర్గాల గృహనిర్మాణ పధకం రూపకర్తా ఆయనే. ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమం జాతీయ స్థాయిలో అమలు చేయాలని ఇందిరా గాంధి నిర్ణయం తీసుకోవడానికి కారణం, అంతకు ముందే, అలాంటి కార్యక్రమాన్ని విజయవంతంగా ఆంధ్ర ప్రదేశ్ లో విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రిగా అమలుపరచడమే. ఆయనకు సాగునీటి శాఖన్నా, విద్యుత్ శాఖన్నా, విద్యా శాఖన్నా ఎక్కువ మక్కువ నేవారు. అప్పటి ప్రధాని పీవీ సమక్షంలో తనకు, తన పార్టీ వారినుంచే జరిగిన అవమానానికి నిరసనగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆత్మగౌరవం ప్రదర్శించిన వ్యక్తి విజయభాస్కర రెడ్డి. ముఠా రాజకీయాలకు ఆలవాలమైన రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆయన సహనానికి ప్రతీక అనాలి. రాజకీయ నాయకుల కుండే సహజసిద్ధమైన "లౌక్యం" ఆయనకు అలవాటులేదు. నిర్మొహమాటంగా తాను చెప్పదల్చుకుంది చెప్పేవారేకాని మనసులో ఒక మాట, బయటకు మరో మాట చెఫ్ఫే మనస్తత్వం కాదు. ఉదాహరణకు, పీవీ నరసింహా రావు ఓటమి తర్వాత, యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ మద్దతు విషయంలో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం చెప్పుకోవాలి. తెలుగు దేశంతో కలిసి ఫ్రంట్కు మద్దతివ్వడం మంచిది కాదని నిక్కచ్చిగా ఆయన చేసిన సూచన విలువ కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత తెలిసొచ్చింది.

విజయభాస్కర రెడ్డి మన మధ్య లేకపోయినా ఆయన గురించి పెద్దలు చెప్పిన మంచి వాక్యాలు మన మదిలో ఎల్లప్పుడూ మెదులుతూనే వుంటాయి. సీపీఎం నాయకుడు స్వర్గీయ బోడేపూడి వెంకటేశ్వర రావు, శాసన సభలో తెలుగుగంగపై జరిగిన అవినీతికి సంబంధించిన చర్చలో పాల్గొన్నారొక పర్యాయం. ఆయన ఆ సమయంలో ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబడుతూనే, ఆయన సహచరులపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూనే, విజయభాస్కర రెడ్డిని గురించి ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన వ్యాఖ్యలు చేశారు. "నీతి-నిజాయితీలకు" ఆయన నిదర్శనమని, తాను చేస్తున్న ఆరోపణలకు విజయభాస్కర రెడ్డికి సంబంధం లేదని అన్నారాయన. అరుదైన నాయకుడాయన.

Saturday, September 25, 2010

రాజకీయ ఆజానుబాహుడు-విజయభాస్కర రెడ్డి: వనం జ్వాలానరసింహా రావు

సెప్టెంబర్ 27, 2010 న కోట్ల విజయభాస్కర రెడ్డి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా

కోట్ల విజయ భాస్కర రెడ్డి మరణించి అప్పుడే తొమ్మిదేళ్లయింది. ఐనా ఆయన మన మధ్య ఇంకా కదలాడుతున్నట్లే వుంది. కేవలం తన కంటిచూపుతోనే ఆత్మీయ తను పంచిపెట్ట గలిగే వ్యక్తిత్వం ఆయనది. ప్రలోభాలకు-ఒత్తిళ్లకు లోనుకాకుండా తనకు తానే సాటి అనిపించుకున్న కోట్ల, రెండు పర్యాయాలు, రాష్ట్ర ముఖ్య మంత్రిగా, అనేక సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసి అందరి మన్ననలు పొందారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో, విద్యార్థి నాయకుడుగా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, లాఠీ దెబ్బలు తిన్న కోట్ల జీవితాంతం అవే స్వతంత్ర భావాలు కనబరచారు. అడ్వొకేట్‌గా పనిచేస్తూనే, రాజకీయ రంగంలో ప్రవేశించారు.ఆరు సార్లు కర్నూలు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎమ్మిగనూరు, డోన్, పాణ్యం, పత్తికొండల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు కర్నూల్ జిల్లాపరిషత్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

పాత తరం నాయకులలో విజయభాస్కర రెడ్డికి ప్రత్యేకత వుందనాలి. ఎన్ టీ రామారావుకు ఖ్యాతినిచ్చిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని, అంతకు పది పైసలకన్నా తక్కువ ధరకే ప్రవేశ పెట్టిన వ్యక్తి విజయభాస్కర రెడ్డి. అలాగే సారాను నిషేధించాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఆ తర్వాత కాలంలో మద్య నిషేధానికి దారి తీసింది. ఈ నిర్ణయాలు ఆయన తీసుకోకపోతే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వారు వాటిని పట్టించుకోక పోయేవారేమో!

కోట్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తొలుత, 1955 శాసన సభ ఎన్నికలలో పోటీ చేసి, టంగుటూరు ప్రకాశం పంతులు ప్రభుత్వం అవిశ్వాసం తీర్మానంలో ఓటమి చెందడానికి కారణమైన న్యాయ కంటి శంకర రెడ్డిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. 1959 లో కర్నూల్ జిల్లా పరిషత్ మొదటి అధ్యక్షునిగా, మళ్లీ రెండో పర్యాయం 1964 లో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. శాసన మండలి సభ్యుడుగా కూడా 1967 లో ఎన్నికయ్యారు. బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో అనేక కీలక శాఖలను నిర్వహించారు. 1977-1999 మధ్య కాలంలో ఆరు సార్లు పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికయ్యారు. ఇందిరా గాంధి, రాజీవ్ గాంధి, పీవీ నరసింహా రావు మంత్రివర్గాలలో పనిచేశారు. 1983 లో నాలుగు నెలలు, 1992-1994 మధ్య కాలంలో రెండేళ్లకు పైగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షునిగా, వర్కింగ్ కమిటీ సభ్యునిగా, జాతీయాభివృద్ధి మండలి, జాతీయ సమగ్రతా మండలి సభ్యునిగా, వివిధ రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ పరిశీలకునిగా సేవలందించారు. దక్షిణాది నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి రెండుసార్లు ఎన్నికైన ఏకైక వ్యక్తి విజయభాస్కర రెడ్డి. తిరుపతి ప్లీనరీలో 1992 లో మొదటి పర్యాయం, కలకత్తాలో 1996 లో రెండో పర్యాయం వర్కింగ్ కమిటీకి ఎన్నికయ్యారాయన.

కోట్ల విజయభాస్కర రెడ్డి గురించిన ఘటన ఒకటి అప్పట్లో ప్రచారంలో వుండేది. ఇందిరా గాంధి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో, సిండికేట్‌ నాయకులతో ఘర్షణ నెలకొంది. ఈ సందర్భంలో నీలం సంజీవరెడ్డి అనుచరుడుగా పేరున్న కోట్లపై ఆమె దృష్టి పడింది. అప్పటికి ఆయన రాష్ట్రంలో ఆర్థిక మంత్రి మాత్రమే. ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి ఇందిరాగాంధి పక్షం. సంజీవ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీలో వున్నారు. ఆయనను సాక్షాత్తు ఇందిరా గాంధి ప్రతిపాదించారు. కానీ ఆ తరువాత మనసు మార్చుకుని స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన వీవీ గిరికి "అంతరాత్మ ప్రబోధం" అనే నినాదంతో మద్దతు ప్రకటించారు. ఇందిరా గాంధి పిలుపు మేరకు విజయభాస్కర రెడ్డి ఆమెను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఆమె నివాసంలో ఇందిరను కలిసి మాట్లాడుతున్న సమయంలోనే, సంజీవరెడ్డి అమెను కలిసేందుకు వచ్చారట. తనతో మాట్లాడడం పూర్తైన తర్వాత విజయభాస్కర రెడ్డిని ప్రధాన ద్వారం నుంచి కాకుండా, వేరే ద్వారం నుంచి వెళ్తే బాగుంటుందని ఆమె సలహా ఇచ్చారట. కోట్లకు, సంజీవరెడ్డికి ఉన్న అనుబంధం తెలిసిన ఆమె ఇరువురి స్నేహం చెడకుండా ఈ సలహా ఇచ్చిందంటారు. అయితే, కోట్ల మాత్రం తాను బహిరంగంగా ఇందిరకు మద్దతు తెలపడానికి వచ్చానని అంటూ వేరే ద్వారం నుంచి వెళ్లడానికి మర్యాదగా తిరస్కరించారట.

కోట్ల మరణించినప్పుడు సంతాపసభలో లోక్‌సభ దివంగత స్పీకర్ బాలయోగి చెప్పిన మాటలు మరువలేనివి. "ఆరడుగుల ఆజానుబాహుడు విజయభాస్కర రెడ్డి పార్లమెంటు సెంట్రల్ హాలుకు నడుచుకుంటూ వస్తుంటే, తెలుగు తేజం ఉట్టిపడుతుంది" అన్నారాయన.

Friday, September 24, 2010

మానవతావాది మన కె. బి. తిలక్ : వనం జ్వాలా నరసింహారావు

మానవతావాది మన కె. బి. తిలక్
వనం జ్వాలా నరసింహారావు
("అనుపమ గీతాల తిలక్" పుస్తక రచయిత)
ఖమ్మం నుంచి కారులో వస్తుంటే, పాతికేళ్ళుగా పరిచయమున్న ఆత్మీయుడు తిలక్ మరణించాడన్న వార్త తెలిసింది. నమ్మలేని నిజం. వారం రోజుల క్రితమే, ఎప్పటిలాగా, ఆయనతో ఫోనులో మాట్లాడినప్పుడు, డాక్టర్ రంగారావును తీసుకొని ఒక సారి రమ్మని అడిగారు. ఇంతలో మా బావ గారు చనిపోవడంతో ఖమ్మం వెళ్లాల్సి వచ్చింది. కలవడం ఆలస్యమయింది. నే నొచ్చేటప్పుడు, ఇటీవల స్థానిక దినపత్రికలో ఆయన గురించి వచ్చిన ఆర్టికల్ కాపీని కూడా తీసుకురమ్మని చెప్పారు. ఆయన్ను కలవలేకపోయానని-అడిగిన పని చేయలేకపోయానని విచారపడుతుంటే పలువురు ఉమ్మడి స్నేహితుల దగ్గర్నుంచి ఫోన్లొచ్చాయి. చనిపోయిన తిలక్ గారి మొబైల్ కు ఫోన్ చేస్తే, ఆయన డ్రైవర్ రిసీవ్ చేసుకున్నారు. ఆసుపత్రిలో ఐదు రోజుల క్రితం చేర్పించిన సంగతి చెప్పి, ఎలా చనిపోయింది వివరించారు. శాన్ ఫ్రాన్సిస్కో లో వున్న తిలక్ కుమారుడు లోకేష్ కు ఫోన్ చేసి అంత్యక్రియలు ఆదివారం జరుగుతాయని తెలుసుకున్నాను.

గవర్నర్ కుముద్ బెన్ జోషి ఆధ్యక్ష్యతనున్న "చేతన" స్వచ్చంద సంస్థలో పనిచేస్తున్న రోజుల్లో మొట్టమొదటి సారి రాజ్ భవన్ లో తిలక్ ను కలిసినప్పుడు, ఆయన వ్యవహార శైలి చూసి, అదోరకమైన మనిషి అనిపించాడు. ఆయన అనుకున్న పని సాధించే దాకా, ఆ ఒక్క లక్ష్యం గురించి తప్ప మరేదీ ఆయన ప్రస్తావించడు. అదో రకమైన పిచ్చి అనుకునేవాడిని. పరిచయం పెరిగినా కొద్దీ, ఆయన లాంటి మహా మనిషితో స్నేహం చేస్తున్నందుకు చాలా గర్వంగా వుండేది. ఎల్లప్పుడు, తెల్లటి ఖద్దరు దుస్తులు మాత్రమే వేసుకునే ఆయన్ను చూసి చాలామంది ఆయన్ను కాంగ్రెస్ పార్టీ వాడనుకునేవారు. స్వాతంత్ర్యోద్యమ రోజుల్లో ఆయన పాత్ర తెలిసినవారు మాత్రం ఆయన్ను అసలు-సిసలైన కమ్యూనిస్ట్ అంటారు. అబ్బే...ఇవన్నీ కాదు..ఆయన కేవలం ఒక సినిమా మనిషేనంటారు మరికొందరు. నిజానికి ఇవన్నీ ఆయనకు వర్తిస్తాయి. సీదా-సాదాగా తిరుగుతూ, అందరినీ పలకరిస్తూ, చిన్నల్లో - చిన్నగా, పెద్దల్లో-పెద్దగా అందరితో కలుపుగోలుగా తిరిగే ఆ "కొర్లిపర బాలగంగాధర తిలక్" - కె. బి. తిలక్ మానవతావాది. ఎక్కడ సాంఘిక దురాచారాలున్నాయో... అక్కడ వాటికి వ్యతిరేకంగా, ఏ మాత్రం ప్రచారం లేకుండా, పోరాడేవారిలో ఆయన ముందుండేవారు. సినీ కార్మికుల బాధా మయ గాధలకు స్పందించి ఆయన చేసిన అవిశ్రాంత కృషే అందుకు ఒక చక్కటి ఉదాహరణ.

అతి కొద్ది రోజుల్లోనే ఆయనలోని అరుదైన వ్యక్తిత్వం, పట్టుదల, ఏకాగ్రత అర్థం కాసాగాయి. ఇందిరాగాంధి హత్యా మరణం తర్వాత, ఆయన రూపొందించి, హైదరాబాద్ తో సహా పలు నగరాల్లో ప్రదర్శించబడిన "భారతరత్న ఇందిరమ్మ" రూప వాణి కార్యక్రమంలో ఆయన చేసిన "మేథా పరమైన కృషి” ని గమనించిన నాకు ఆయనొక అసామాన్యుడనిపించింది. ఆయన్ను గురించి తెలిసిన వారికి-తెలియని వారికి, మరింత తెలియచేయాలన్న కోరిక కలిగింది. వారానికి ఒక్క సారి మార్నింగ్ వాక్లోవ మా ఇంటికి వచ్చిన తిలక్‌ను మాట్లాడించి, ఆయన స్వయంగా వెల్లడించిన ఆయన జ్ఞాపకాలను, కాగితం పై పెట్టాను. 2006లో, తిలక్ గారి "అనుపమ" సంస్థ ఏభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో, విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన తిలక్ జ్ఞాపకాలను, "అనుపమ గీతాల తిలక్" పేరుతో హాసం ప్రచురణలు పుస్తక రూపంలో తీసుకొచ్చారు.

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జన్మించిన తిలక్ పిన్న వయస్సులోనే చదువుకు స్వస్తిచెప్పి స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు. చిన్నతనంలో ఏలూరు మునిసిపల్ పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లడానికి, ప్రతి దినం ఆరు మైళ్లు నడవాల్సి వచ్చేది. సైకిల్ కొనేంత వరకు నడకే. ప్రతి వారం ఒక్కసారన్నా సైకిల్ ప్రతి పార్టునూ వేరుచేసి, మళ్లీ చేర్చడం తనకో హాబీ అనేవారు తిలక్. ఆయన స్వగ్రామంలోని మోతుబరి రైతు కొర్లిపర సుబ్బయ్య మనుమరాలు అన్నపూర్ణ, ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వర రావు సతీమణి. దెందులూరులో అతివాద భావాల "యువజన సంఘం" స్థాపించినప్పుడు, దాని అనుబంధ సంస్థ "బాలానందం సంఘం" లో అన్నపూర్ణ గారిని సభ్యురాలిగా చేర్పించానని చెప్పారు. దత్తత వెళ్ళిన ఆమె బాబాయి వటపర్తి రామమోహన్ రావు దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పుస్తకాల సేకరణ అలవాటున్న తిలక్ అలా సంపాదించిన వాటితో వూళ్ళో గ్రంధాలయం కూడా ఏర్పాటుచేశారు చిన్నతనంలో. చిన్నతనంలో భక్త ప్లహాద నాటకంలో "నరసింహుడి" పాత్ర వేశారు తిలక్.

క్విట్ ఇండియా ఉద్యమంలో భీమడోలు దగ్గర రైలును ఆపడానికి పట్టాలను తొలగించేందుకు సిద్ధపడుతున్న ఆయన్ను-ఆయన మిత్ర బృందాన్ని నిర్బంధంలోకి తీసుకుంది ప్రభుత్వం. కొంతకాలం ఏలూరు సబ్-జైలులో వుంచి, తర్వాత రాజమండ్రి జైలుకు తరలించారు. జైలు జీవితం వివరించినప్పుడు, తన కష్టాల కన్నా, తోటి ఖైదీల బాధలు చెప్పి కంట తడి పెట్టే వారు తిలక్. ఆయన్ను నిర్బంధించిన సెల్ పక్కనే, ఉరి శిక్ష విధించబడి త్వరలో దాని అమలుకు గురి కాబడే ఖైదీల గురించి ఎన్నో విషయాలు చెప్పారాయన. ఆయన రోజులకు-ఆ తర్వాత రోజులకు, ఖైదీల పట్ల ప్రభుత్వ వైఖరిలో పెద్దగా మార్పు రాలేదని కూడా అనేవారు. ఆయన తోటి ఖైదీలలో గద్దె విష్ణుమూర్తి ఒకరు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కూడ. తిలక్ కుటుంబానికి చెందిన వారిని, వాళ్ల గ్రామంలో "పెద్దింటి వారు" అని పిలిచేవారట. తిలక్ జైలులో వుండగానే, వారి ఆస్తిపాస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది అలనాటి బ్రిటీష్ ప్రభుత్వం. చిన్న నాటి విషయాలను గుర్తు చేసుకుంటూ, తిలక్, "విభజించి పాలించే ఆంగ్లేయుల సిద్ధాంతాన్ని" గ్రామ పెద్దలు-భూస్వాములు, తన వూళ్లో ఎలా ఆచరణలో పెట్టింది వివరిస్తూ, దళితుల మధ్య వివాదాలు పెట్టి పెత్తనం చేశేవారని అన్నారు. అందుకే, స్వతంత్ర భారతావనిలో, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా, కేవలం అలాంటి ఇతివృత్తాలే కథా వస్తువుగా అనేక చిత్రాలను నిర్మించారు-దర్శకత్వం వహించారు తిలక్. ఆ పరంపరలోనే, ముద్దుబిడ్డ, ఎం.ఎల్.ఏ, ఉయ్యాల జంపాల, భూమికోసం, కొల్లేటి కాపురం, ఛోటిబహు, కంగన్ లాంటి చిత్రాల రూపకర్తయ్యారాయన.

రాజమండ్రి జైలునుండి విడుదలైన తిలక్ "ఉషా మెహతా" స్వతంత్ర రేడియో ఉద్యమంలో పాల్గొని, అతివాద భావాల ప్రజానాట్యమండలి వైపు ఆకర్షితుడై నారు. తన జీవిత గమనానికి తానే బాధ్యుడని అప్పటికీ-ఇప్పటికీ నమ్మే తిలక్, తన పూర్వీకుల ఆస్తితో తనకు సంబంధం లేదని స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టిచ్చి, మేనమామ ఎల్.వీ. ప్రసాద్ వద్దకు, మేనత్త వెంట బొంబాయికి చేరుకున్నారు. వెళ్లేటప్పుడు, కమ్యూనిస్ట్ యోధుడు చండ్ర రాజేశ్వరరావు నుంచి శ్రీపాద అమృత డాంగేకు తనను పరిచయం చేస్తూ రాసిన వుత్తరం పట్టుకెళ్లారు ముందు చూపుగా. సినీ పరిశ్రమలో అడుగిడేందుకు ప్రయత్నం చేస్తూనే, "పీపుల్స్ థియేటర్" ప్రముఖులైన బాలరాజ్ సహానీ, రొమేష్ థాపర్ లతో సాన్నిహిత్యం చేసుకున్నారు తిలక్. ఒపేరా హౌజ్ సినిమా టాకీసులో ప్రజానాట్యమండలి సమావేశాలకు హాజరయ్యేవారు. అలా తన స్వాతంత్ర్య సమరాభిలాషను కొనసాగించా రక్కడ. నేపధ్య గాయకుడు "డబ్ల్యు. ఎం. ఖాన్" తో, సింధీ కమెడియన్ "గోపి" తో పరిచయం చేసుకున్నాడు. ఆ పరిచయాలే ఆయన్ను సినీరంగంలోకి తెచ్చాయి. తన కాళ్లమీద తాను నిలబడేందుకు ఎల్వీ. ప్రసాద్ వ్యాపారంలో ఉద్యోగిగా చేరి, "బాతు గుడ్ల" ను కూడా అమ్మారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రచురించే "పీపుల్స్ వార్" పత్రికకు పేపర్ బోయ్ గా పనిచేశారు. కె.ఎల్.ఎన్. ప్రసాద్ సోదరుడి సినీ పంపిణీ సంస్థలో సేల్స్ బోయ్ గా కూడా పనిచేశారు. నర్సాపూర్ లేస్ ను అమ్ముకుంటూ కొంత సంపాదించుకునేవారు. ఇవన్నీ కలిపి ఆయన జీవించడానికి పనికొస్తే, వుండడానికి మేనమామ ఇల్లుండేది. ఒకరిపై ఆధారపడడం ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకం.

ఎల్వీ. ప్రసాద్ మద్రాసుకు వెళ్లడంతో తిలక్ కూడా అక్కడకు మకాం మార్చారు. ఎల్వీ సన్నిహితుడైన సినీ ఎడిటర్ ఎం. వీ. రాజన్ తో పరిచయం చేసుకున్నారు. ఎడిటింగ్ లైన్ లో ప్రావీణ్యం పొంద సాగారు. కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం విధించడంతో, దాని ప్రభావం ప్రజానాట్యమండలి కార్యకలాపాలపై పడి, దానికి చెందిన ప్రముఖులు ఒక్కొక్కరు మద్రాసు చేరుకున్నారప్పట్లో. వారిలో "భవిష్యత్ సినీరంగ దిగ్గజాలు" అందరూ వున్నారు. వారందరికీ ఎల్వీ. ప్రసాద్ మద్రాసులో ఆధారం కలిపించారు. అప్పట్లో కొంతకాలం ఎల్వీ కూడా ప్రజానాట్యమండలి అధ్యక్షుడిగా వున్నారు. ఎడిటింగ్ లైన్లో ప్రవేశించిన తిలక్, రాజన్ కాంబినేషన్ తో , "శ్రీమతి", "అంతామనవాళ్ళే", "రోజులు మారాయి", "మంత్రదండం" , "సువర్ణమాల", "రాధిక", "ధర్మాంగద", "జ్యోతి" లాంటి సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు. "శ్రీమతి" చిత్రానికి నూతన ఆర్టిస్టులను ఎంపికచేసే ప్రక్రియలో భాగంగా, రాజన్-తిలక్ లతో డైరెక్టర్ ఎల్వీ. ప్రసాద్ మూవీ టెస్ట్, స్టిల్ల్ టెస్ట్, మేకప్ టెస్ట్ చేయించిన వారిలో, దశాబ్దాల పాటు సినీరంగాన్ని, దశాబ్దం పైగా రాజకీయ రంగాన్ని శాసించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒకరు.

నవయుగ బ్యానర్ కింద నిర్మించిన "జ్యోతి" చిత్రం తిలక్ సినీ జీవితంలో మైలురాయి. ప్రజానాట్యమండలికి చెందిన పలువురు కళాకారులతో సహా ఈ చిత్రంలో జి. వరలక్ష్మి నటించారు. దర్శకత్వం బాధ్యత తిలక్ మీద పడింది. ఎడిటర్ గా తనకున్న అనుభవాన్ని మేళవించి, దర్శకత్వానికి వన్నె తెచ్చారాయన ఆ చిత్రంలో. నిరక్షరాస్యతను సామాజిక సమస్యగా వర్ణిస్తూ కొండేపూడి పాటకు అభినయించిన నాటి బాల నటి జోగమాంబ, నేటి ఎమ్మెల్యే జయసుధ తల్లి-నిడదవోలు వెంకటరావు కూతురు. పెండ్యాల ఆ సినిమాకు సంగీత దర్శకుడు. ఆ సినిమాతో తిలక్ దర్శకుడిగా స్థిరపడిపోయారు. శకుంతలను "ఆదర్శ వివాహం" చేసుకుని మద్రాసులో కాపురం పెట్టారు. ఇటీవలే ఆమె మరణించారు. బహుశా తిలక్ ని సరిగ్గా అర్థం చేసుకున్నది ఆయన శ్రీమతి ఒక్కరేనేమో ! తిలక్ కుమారుడు లోకేష్ కాలిఫోర్నియాలో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

అనుపమ ఫిలిమ్స్ స్థాపించి, శరత్ నవల ఆధారంగా ఆరుద్ర రూపొందించిన స్క్రిప్ట్ తో, స్వీయ దర్శకత్వంలో, తన తొలి ప్రయత్నంగా " ముద్దుబిడ్డ" సినిమా తీశారు తిలక్. సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు నవలా రచయిత గోపీచంద్, ఆకాశవాణిలో పనిచేస్తున్న కొంగర జగ్గయ్యను తిలక్ కు పరిచయం చేశారు. జగ్గయ్యతో పాటు ఆ సినిమాలో ప్రధాన భూమికకు "గర్వం"-"స్వాభిమానం" సమపాళ్లలో నటించగల జమునను ఎంపికచేశారు తిలక్. ఆ పాత్ర కావాలని ఆశపడ్డ జి. వరలక్ష్మిని (రిలీజ్ చేయని మొదటి ఎనిమిది రీళ్లలో నటించిన) జమున వదిన పాత్రకు ఎంపికచేశారు. జమున కళాకారిణిగా స్థిరపడి పోయేందుకు ముద్దుబిడ్డ సినిమా కారణమనాలి. తాపీ ధర్మారావు, ఆరుద్రల "కలెక్టివ్‌ స్పిరిట్" తో సినిమా డైలాగులు రూపుదిద్దుకున్నాయని చెప్పారు తిలక్. ఆరుద్ర పాటలకు పెండ్యాల దర్శకత్వం వహించారు. ముద్దుబిడ్డలో తిలక్ పరిచయం చేసిన నూతన డాన్సర్ జ్యోతి ఇప్పటి పాపుల హీరో సాయికుమార్ కు, అయ్యప్ప శర్మకు తల్లి. "బాంబే మీనాక్షి" ని కూడా డాన్సర్ గా పరిచయం చేశారు. ఈ సినిమాతో ప్రారంభమైన తిలక్, ఆరుద్ర, పెండ్యాల కాంబినేషన్ "అనుపమ" కు హాల్ మార్క్ అయింది.

తిలక్ దర్శకత్వంలో రూపు దిద్దుకున్న సమస్యాత్మక చిత్రం "ఎమ్మెల్యే" అనేక నూతన ప్రయోగాలకు నాంది పలికింది. "బ్యాక్ సీట్ డ్రైవింగ్, బంతి వడ్డన రాజకీయాలు" ఎమ్మెల్యే సినిమా కథాంశం. జమీందారులు, భూస్వాములు, ధనికులు స్వయంగా చట్టసభలకు పోటీ చేయకుండా, ప్రజల నాడికి అనుగుణంగా వుండేవారిని తమ పలుకుబడితో గెలిపించి, తమ పనులను వారిద్వారా చక్కబెట్టుకునే దోపిడీ విధానాన్ని ఎద్దేవా చేసే సినిమా ఇది. తిలక్ ఈ సినిమాలో రమణమూర్తిని నటుడిగా, నేపధ్య గాయనిగా "జానకి" ని పరిచయం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో భూసంస్కరణల చట్టం తేవాలన్న ఆలోచన ప్రభుత్వానికి రావడానికి స్ఫూర్తి ఎమ్మెల్యే సినిమానే అనాలి. సెప్టెంబర్ 19, 1957న ఎమ్మెల్యే సినిమా రిలీజ్ అయిన తర్వాత 1958లో లాండ్ సీలింగ్ చట్టం నామమాత్రంగా రూపొందించినప్పటికీ, వాస్తవానికి 1961లో మాత్రమే చట్టంగా వచ్చింది. హైదరాబాద్ మెహందీలో నివసిస్తున్న "చోటీ ఖుర్షీద్" అనే అందమైన అమ్మాయితో సినిమాలో కవ్వాలీ నాట్యం చేయించారు. మనమంతా ఇప్పడు రుచిగా తింటున్న "ఎమ్మెల్యే పెసరట్టు" తిలక్ సృష్టే !

కుటుంబ పరమైన మరో సమస్యాత్మక చిత్రం "అత్తా ఒకింటి కోడలే". ఆరుద్ర "ద్విపద" రచనకు బాపు వేసిన "బొమ్మల కథ" తో వెలువడిన ప్రచార కార్టూన్లు మరో నూతన ఒరవడి. ఆంధ్ర పత్రికలో పనిచేస్తున్న రమణ, మితృడు బాపుని, ఒప్పించారు. అందరు కలిసి సినిమా వీక్షించారు. చూస్తూనే బాపు ఓ కాగితం మీద బొమ్మలు గీసి చూపించారు. అందరికీ నచ్చాయి. వెంటనే "అనుపమ చిత్రం అత్తా ఒకింటి కోడలే బొమ్మల కథ" రూపుదిద్దుకుంది. వారం వారం ఆరుద్ర సామెతలు రాయడం, బాపు ఇల్లస్ట్రేషన్ వేయడం, ఆంధ్ర పత్రికలో ప్రింట్ కావడం జరిగేది. స్టూవర్ట్ పురం సెటిల్‌మెంట్ థీమ్ తో చిట్టి తమ్ముడు సినిమా తీశారు. అందులో ఒకనాటి మేటి నటి "విజయ లలిత" బాల నటిగా సినీరంగానికి పరిచయం చేశారు. జయలలిత తల్లి సంధ్య చిట్టి తమ్ముడి సినిమాలో రమణారెడ్డి భార్యగా నటించింది. సామాజిక స్పృహకు ఉదాహరణగా తీసిన మరో చిత్రం "ఈడూ జోడూ".

మృదుమధురమైన పాటల ఆసరాతో, ఆబాలగోపాలం మన్ననలందుకున్న అపురూప చిత్రం తిలక్ "ఉయ్యాల జంపాల". "ఓ పోయే పోయే చినదానా...", "ఉంగరాల జుట్టు వాడు...", కొండగాలి తిరిగిందీ-గుండె వూసులాడిందీ...", "అందాల రాముడు ఇందివర శ్యాముడు.." అప్పటికీ-ఇప్పటికీ-ఎప్పటికీ మరిచిపోలేని "అనుపమ మధుర గీతాలు". అప్పటికే సినీరంగాన్ని వదిలి రాజకీయాల్లో చురుగ్గా వున్న కోన ప్రభాకర రావుతో తిలక్ ఇందులో మళ్లీ వేషం వేయించారు. అట్లతద్దినాడు "ఇస్తినమ్మా వాయినం-పుచ్చుకుంటినమ్మా వాయినం" అనే డైలాగులతో వాయినాలిచ్చే సన్నివేశం వుందిందులో. పెద్దాపురం మేజువాణి తరహా ప్రక్రియైన మరాఠీ "తమాషాల" పై తిలక్ కి కలిగిన ఆసక్తి పర్యవసానమే "పంతాలు పట్టింపులు" సినిమా. మరాఠీ మేటి నటిగా పేరు తెచ్చుకున్న లీలా గాంధీ ఇందులో నటించింది. సినిమాలో పాటలన్నీ ప్రశ్న-జవాబులో, అర్థవంతంగా-భావగర్భితంగా-తమాషాగా-పొడుపుకథల్లా వుంటాయి. ఆయనకు అఖిలభారత స్థాయిలో అవార్డ్ తెచ్చిపెట్టిన మ్యూజికల్ హిట్ పిక్చర్ ఇది. తిలక్ "ముద్దుబిడ్డ" హిందీ వర్షన్ "ఛోటీబహు" రాజేషఖన్నా-షర్మిలా టాగూర్ కాంబినేషన్ లో తీశారు. "ఛోటీబహు" లో ముద్దుబిడ్డ పాత్రను పోషించిన ’బేబీ సారిక’ కమల్‌హాసన్ ను వివాహం చేసుకుంది. "ఛోటీబహు" తిలక్ కు హిందీలో ఒక బ్రేక్. తర్వాత ఈడూజోడూ హిందీ వర్షన్ "కంగన్" ను మాలా సిన్హా, సంజీవకుమార్, అశోక కుమార్, మహమూద్ లతో తీశారు.

తిలక్ తమ్ముడు రామ నరసింహారావుకు సామాజికన్యాయం సాధించాలన్న పట్టుదల వుండేది. ఆ క్రమంలోనే నక్సలైట్ ఉద్యమానికి ఆది పురుషుడైన చారు మజుందార్ తో పరిచయం చేసుకున్నాడు. హఠాత్తుగా జనజీవన స్రవంతినుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిన ఆయన ఎన్‌కౌంటర్లో చనిపోయిన సంగతి తెలుసుకున్నారు తిలక్. తమ్ముడు చనిపోయిన తర్వాత వామపక్షాలన్నీ ఐకమత్యం కావాలన్న థీమ్ తో "భూమికోసం" సినిమాను తీశారు తిలక్. తమ్ముడికే అంకితం చేశారు దాన్ని. "భూమికోసం, భుక్తికోసం సాగే రైతుల పోరాటం, అనంత జీవిత సంగ్రామం" అని నమ్మిన తిలక్, ఆ సుదీర్ఘ పోరాటానికి "ఆరంభమే కాని అంతం వుండదు" అని తెలియచేసే విధంగా తీసిన విప్లవాత్మక-సామాజిక దృక్ఫద చిత్రమే "భూమికోసం". ఇందులో ఆయన వామపక్ష ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. శ్రీ శ్రీ రచించిన అపురూప విప్లవ గేయం నేపధ్యంలో కనిపిస్తాయి టైటిల్స్ ఆసాంతం. మేటి నటీమణి, ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలు జయప్రదను "కాబోయే కథానాయిక - కుమారి జయప్రద" గా భూమికోసం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు తిలక్. "చెల్లి చంద్రమ్మ" పాత్ర పోషించారు జయప్రద. సినిమాలో ఆమె పాడిన పాటను ప్రముఖ నక్సలైట్ నాయకుడు సత్యమూర్తి రచించారు. తెలుగులో మొట్ట మొదటిసారి ప్రఖ్యాత హిందీ నటుడు అశోక్ కుమార్ భూమికోసం లో పాత్రను పోషించారు. సినిమాలో శ్రీ శ్రీ రాసిన "తూర్పు దిక్కున వీచే గాలి" అనే పాటను గురించి సినిమా చూసిన రష్యన్ బృందం ప్రస్తావిస్తూ, అది చైనాను దృష్టిలో పెట్టుకుని రాశారా అని అడిగారు తిలక్ ను. చిత్రం ఆరంభంలోనే "దున్నేవాడికే భూమి హక్కు" అన్న నినాదాలు వినిపిస్తాయి.

కొల్లేటి ప్రాంతంలోని పరిస్థితులను గమనించిన తిలక్, పలువురి అభిమానాన్ని చూరగొన్న "కొల్లేటి కాపురం" సినిమా తీశారు. బాహ్య ప్రపంచంలోని "జమీందారు" వ్యవస్థ లాంటి కొల్లేటి ప్రాంత "ఇంజన్ దార్" వ్యవస్థ దోపిడీ విధానాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు. సినిమా తీసే ప్రయత్నంలో "కొల్లేటి పడవల" లో తిరిగి స్క్రిప్ట్ తయారు చేశారు తిలక్. ఈ సినిమాలో ’సుగుంబాబు’ ను గేయరచయితగా పరిచయం చేశారు. ఆయన్ను తిలక్ కు పరిచయం చేసింది శ్రీ శ్రీ. కొత్తదనానికి కొల్లేటి కాపురం సినిమా ఒక మచ్చుతునక. ప్రముఖ గజల్ సింగర్ పూర్ణచంద్ర రావును నేపధ్య గాయకుడిగా పరిచయం చేశారిందులో. సినిమాలోని ప్రతి పాట, మాట ఆ ప్రాంతానికి-సంస్కృతికి-జీవన విధానానికి సంబంధించినవే. అనుపమ చలనచిత్ర బ్యానర్ కింద కాకుండా నిర్మించిన "ధర్మ వడ్డీ" సినిమాకు కూడా తిలక్ దర్శకత్వం వహించారు.

తిలక్ మంచి గాయకుడు. "లేవరా...లేవరా..కార్మికుడా" అనే దేశ భక్తి గీతాన్ని, బొంబాయ్ లో వుంటున్నప్పుడు, తెలుగు కార్మికులు నివసిస్తుండే వాడల్లో పలుమార్లు పాడి వాళ్లను ఉత్తేజ పరిచేవారు తిలక్. అలా ఆయన పాడుతున్న పలు సందర్భాల్లో కమ్యూనిస్ట్ వ్యతిరేకులు రాళ్ళు వేసిన విషయాన్ని, ఆయన దెబ్బలు తగలకుండా తప్పించుకున్న విషయాన్ని వివరించారొకసారి. అదే రోజుల్లో బిటి రణదివే, వైద్య, అధికారి, విమల రణదివే, కానూరు రామానంద చౌదరి, మోహన్ కుమార మంగళం లాంటి వారితో పరిచయాలు కూడా చేసుకున్నారు తిలక్. ఆయన మద్రాసుకు వెళ్లింతర్వాత, మోహన్ కుమార మంగళం తండ్రి డాక్టర్ సుబ్బరాయన్ తోను పరిచయం చేసుకున్నారు. పలు ప్రపంచ శాంతి సంస్థలతో సంబంధమున్న రమేశ్ చంద్ర కూడా తిలక్ కు బాగా పరిచయం.

ఈ ఏడాది ఉగాది పర్వదినాన, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రప్రధమంగా ఏర్పాటుచేసిన "బి. ఎన్. రెడ్డి జాతీయ అవార్డ్" ను, కె. బి. తిలక్ కు, "నంది" బహుమతుల ప్రదానోత్సవంలో అందచేశారు. ఆరు దశాబ్దాలకు పైగా తెలుగు-హిందీ వెండి తెరతో సంబంధమున్న తిలక్ ని, కనీసం, ఎనభై నాలుగేళ్ల వయసు వచ్చిన తర్వాతైనా ప్రభుత్వం గుర్తించ గలగడం అదృష్టమే !

Saturday, September 18, 2010

వారసత్వ ప్రజాస్వామ్యం - కుటుంబ రాజకీయాలు : వనం జ్వాలా నరసింహారావు

వారసత్వ ప్రజాస్వామ్యం - కుటుంబ రాజకీయాలు
వనం జ్వాలా నరసింహారావు

ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగిన నాకు రాజకీయాలతో ను, రాజకీయ నాయకులతోను పరిచయాలు అక్కడే మొదలయ్యాయి. అలా పరిచయమైన వాళ్లలో స్థానిక నాయకులనుంచి మంత్రుల స్థాయికి ఎదిగిన వారి దాకా చాలామంది వున్నారు. అయితే వారిలో అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు మాత్రమే వారసత్వంగా ఎదగ గలిగారు. నా లాంటి వారికీ రాజకీయ కుటుంబ నేపధ్యమున్నా ఏ మాత్రం రాణించ లేకపోయాం. కారణాలు అనేకం. ఎన్.టీ రామారావు లాంటి వారు పటేల్-పట్వారీ వ్యవస్థనైతే రద్దు చేయగలిగారు కాని, వారసత్వంగా ఎదుగుతున్న రాజకీయ పటేల్-పట్వారీలను ఆపు చేయలేకపోయారు.

సుమారు ఐదు దశాబ్దాల క్రితం, ఖమ్మం శాసన సభ స్థానం నుంచి ఎన్నికైన కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన మహమ్మద్ రజబ్ అలీ, పాలేరు రిజర్వుడు నియోజక వర్గం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి కత్తుల శాంతయ్య, నేనెరిగిన మొట్టమొదటి ఎమ్మెల్యేలు. ఆ తర్వాత చాలా పర్యాయాలు ఎన్నికైన వారిరువురులో ఎవరు కూడ వారి వారసులెవరినీ రాజకీయాల్లోకి తెచ్చిన దాఖలాలు లేవు. ఖమ్మం జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి-కేంద్ర మంత్రి జలగం వెంగళరావు జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా, పార్లమెంట్ సభ్యుడుగా తన తర్వాత తమ్ముడు కొండల రావును చేశారు. ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసి గెలిచిన స్థానంనుంచి ఒక సారి పెద్ద కొడుకు ప్రసాద రావు, ఇంకొక సారి చిన్న కొడుకు వెంకట్రావు ఎన్నికయ్యారు. ప్రజాస్వామ్యంలో కూడ వారసత్వానికి అవకాశాలు మెండుగా వుంటాయని సోదాహరణంగా చూపించారు. ఇదేదో ఒకరిద్దరి విషయంలోనో-లేక కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి విషయంలోనో జరుగుతే ఆశ్చర్యపడాల్నేమో కాని, భారత దేశ రాజకీయాల్లో సర్వ సాధారణ విషయమై పోయి, ప్రజాస్వామ్యానికే పెను సవాలుగా మారుతుంటే ఆశ్చర్యపడక తప్పదు. రాజకీయాల్లో కీలకమైన పదవులను పొంది, ఉన్నత స్థాయికి చేరుకున్న వారి బంధుగణం అతి పిన్న వయసులోనే, రాజకీయ ప్రవేశం చేసి, చకచకా ఎదగడం సంప్రదాయంగా మారుతోంది. మొదటి తరం నాయకులు, తమ సంతానాన్ని-సోదరీ, సోదరుల సంతానాన్ని, తమ్ముళ్లను, చెల్లెళ్లను, భార్యలను, వీలున్న బంధువులను వ్యూహాత్మకంగా రాజకీయాల్లోకి దింపి, వారసత్వ సంపదలాగా పదవులను దక్కించుకుంటున్నారు.

అసలు ప్రజాస్వామ్యమే వారసత్వంగా మారుతున్నదా? ఔననక తప్పదు. నెహ్రూ-గాంధీ కుటుంబం జాతీయ స్థాయిలో (మంచికో-చెడుకో) ఈ ప్రక్రియకు బీజాలు నాటితే, దేశవ్యాప్తంగా వాటి మొక్కలు పెరిగి, భారీ వట వృక్షాలుగా వూడలు పెంచి, పెకలించడానికి సాధ్యపడని స్థితికి చేరుకుంది. "వారసత్వం జన్మ హక్కు" అని వాదించే స్థాయికి చేరుకుంది. సుమారు తొంబై సంవత్సరాల క్రితం బ్రిటీష్ ఇండియాలో, న్యూఢిల్లీ నుంచి "సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ" కి ఆ కుటుంబం మొదటి తరం నాయకుడు మోతీలాల్ నెహ్రూ ఎన్నికైన తర్వాత, ఆ కుటుంబానికి సంబంధించిన దాదాపు అందరూ చట్ట సభల్లో అడుగు పెట్టారు. కాకపోతే, అందులో పలువురు వారి-వారి సామర్థ్యాన్ని బట్టే ఆ పదవులకు చేరుకున్నారు.

భారత రాజకీయ కుటుంబ వారసత్వ పరంపరలో మునిగి తేలుతున్నవారు కోకొల్లలు. ఏడాది క్రితం జరిగిన సారస్వత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన-ఓడిన అభ్యర్థుల జాబితా చూస్తే చాలు, రాజకీయ వారసుల జాబితాలో ఎన్ని పేర్లున్నాయో తెలుసుకోవడానికి. కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసిన మురళి దేవరా కుమారుడు మిళింద దేవరా, సునీల దత్ కుమార్తె ప్రియా దత్, చగన్ భుజ బల్ అల్లుడు సమీర్ భుజ్ బల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్.బి.చవన్ అల్లుడు-ఇప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ బావమరిది భాస్కర రావ్ పాటిల్, మాజీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కొడుకు ముకుల్ వాస్నిక్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి హెచ్. ఎన్. బహుగుణ కొడుకు విజయ్ బహుగుణ (ఇతడి సోదరి యు.పి.సీ.సీ అధ్యక్షురాలు రిటా బహుగుణ-మరో కజిన్ బిసి.ఖండూరి ఉత్తరాంచల్ ముఖ్యమంత్రి), ఆంధ్ర ప్రదేశ్ (దివంగత)ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి వారసులుగా ఎదుగుతున్న మరో తరం ప్రజాస్వామ్య భావితరం నాయకులు. ఆ మాటకొస్తే ఆంధ్ర ప్రదేశ్ మంత్రి బొత్సా సత్యనారాయణ కుటుంబానికి చెందిన నలుగురికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆయనకు, ఆయన తమ్ముడికి, అల్లుడికి ఎమ్మెల్యే టికెట్లు, భార్యకు ఎంపీ టికెట్ లభించింది. అందరూ గెలవడం విశేషం.

ఒకప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఉమాశంకర్ దీక్షిత్ కోడలు శీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా దశాబ్దం పైగా పనిచేస్తుంది. ఆమె తనయుడు సందీప్ దీక్షిత్ ను ఆమె అప్పుడే రాజకీయాల్లోకి తేవడం పార్లమెంట్ సభ్యుడుగా చేయడం జరిగిపోయింది. హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యుడుగా కూడా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు దీపీందర్ సింగ్ హుడా ఆయన వారసుడుగా ఎదుగుతున్నాడు. ఆయనిప్పుడు పార్లమెంటు సభ్యుడు. భూపిందర్ కన్నా ముందున్న ముఖ్యమంత్రి దేవీ లాల్ తనయుడు ఓం ప్రకాష్ చౌతాలా కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. సమాజ్ వాది పార్టీ నాయకుడు, మాజీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులంతా వారసులుగా ఎదుగుతున్నవారే. కొడుకు అఖిలేష్ యాదవ్ మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి గెలవడం, ఒకటి రాజీనామా చేయడం, ఆ స్థానంలో కోడలు పోటీకి దిగడం తెలిసిందే.

నెహ్రూ-గాంధి కుటుంబ వారసుడిగా ఐదో తరం నాయకుడు-భావి భారత ప్రధానిగా పలువురు భావిస్తున్న రాహుల్ గాంధి, ఆయన తల్లి సోనియా గాంధి కాంగ్రెస్ అభ్యర్థులుగా వారసత్వ పరంపరలో పోటీ చేయగా, సంజయ్ గాంధి కొడుకు వరుణ్-భార్య మేనకా గాంధి భారతీయ జనతా పార్టీ పక్షాన పోటీ చేసి గెలిచారు. ఒరిస్సా ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తనయుడు దిప్ గొగోయ్, మరో మాజీ ముఖ్య మంత్రి బిజూ పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్, మనీష్ తివారి, రవ్నీత్ సింగ్ బిట్టు, కుమారి షెల్ జా, నాధు రాం మిర్ధా మనుమ రాలు జ్యోతి మిర్ధాలు కూడా వారి-వారి కుటుంబాలకు వారసులే. మోతీలాల్ ఓరా కొడుకుకు, అజిత్ జోగి భార్యకు, రాజస్థాన్ లో జగన్నాధ పహాడియా-సిస్ రామ్ ఓలా-నావల్ కిశోర్ శర్మ-గోవింద్ సింగ్ గుర్జార్ వాళ్ల పిల్లలకు వారసత్వ నాయకులుగా ఎదిగే అవకాశాలు దొరికాయి. జాతీయ స్థాయిలో నెహ్రూ-గాంధి కుటుంబ అడుగు జాడల్లోనే, ప్రాంతీయ స్థాయి నాయకులు కూడా నడుచుకోవడం విశేషం.

వారసత్వ కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితం కాలేదు. ఎన్.సీ.పీ వ్యవస్థాపక నాయకుడు శరద్ పవార్ కూతురు తండ్రికి వారసురాలిగా ఎదగసాగింది. ఆమె ఇప్పుడు పార్లమెంట్ సభ్యురాలు. కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప పెద్దకొడుకు రాఘవేంద్ర, మాజీ ప్రధాని దేవెగౌడ ఇద్దరు కుమారులు (ఒక కొడుకు హెచ్. డి. కుమార గౌడ ఈ ఈపాటికే జె. డి-ఎస్ నాయకుడు మాత్రమే కాకుండా, కర్నాటక ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు), తమిళ నాడు ముఖ్యమంత్రి సంతానం: కొడుకు అజహగరి, కూతురు కణిమొజిహి, కొడుకు స్టాలిన్, మురసోలి మారన్ కొడుకు దయానిధి మారన్, మాజీ లోక సభ స్పీకర్ పీ. ఏ. సంగ్మా కూతురు అగాథ చురుగ్గా ఎదిగిన కొందరు కాంగ్రేసేతర వారసులు. వీరంతా చట్ట సభల్లో రంగ ప్రవేశం చేశారీపాటికే. జమ్ము-కాశ్మీర్ లో షేక్ అబ్దుల్లా తనయుడు ఫరూక్ అబ్దుల్లా, ఆయన తనయుడు ఒమర్ అబ్దుల్లా...అందరూ నాయకులే. అంతా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రులైన వారే. కేంద్రంలో కీలక పదవులను అనుభవించిన వారే. వారి ప్రత్యర్థి పీ.డీ.పీ నాయకుడు ముఫ్టి మహమ్మద్ సయీద్ కూతురు మెహబూబా అప్పుడే నాయకురాలైంది. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ టీ రామారావు అల్లుళ్లిద్దరు, ఒక కొడుకు, కూతురు రాజకీయాల్లో కీలకమైన స్థానాల్లో వున్నారు. చంద్రబాబు నాయుడు తమ్ముడు నాయకుడే. కొడుకు కూడా ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్నాడు. మహారాష్ట్ర శివసేన నాయకుడు బాల్ థాకరే కొడుకు నాయకుడే. అలానే కరుణాకరన్, నందినీ సత్ పథి, జగ్జీవన్ రాం వారసులూ ఎదిగారు. ఆర్.జే.డీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, జెఎంఎం పార్టీ మహితో, మాజీ గుజరాత్ సీ. ఎం చిమన్ భాయ్ పటేల్ తమ అర్థాంగులను అందలం ఎక్కించారు.

ఒక తరం నుంచి మరో తరానికి రాజకీయాధికారం బదిలీ అవుతోందిలా. వారసత్వ రాజకీయాలు-కుటుంబ రాజకీయాలు దేశ భవిష్యత్ ను శాసించే దిశగా కదులుతున్నాయి. రాచరిక వ్యవస్థకు సంబంధించిన రాజకీయాలకు అలవాటు బడిన భారతీయులకు, అనాదిగా, రాజులు-మహారాజులు-చక్రవర్తులు తమ తమ కొడుకులను-కూతుళ్లను తమ తదనంతరం సింహాసనం అధిష్టింప చేసేందుకు పన్నే వ్యూహాల గురించిన కథలను విన్నారు. ప్రజాస్వామ్య మౌలిక సిద్ధాంతాలను ఇంకా సరిగ్గా అవగాహన చేసుకోలేని అమాయక భారతీయులు, బహుశా వర్తమాన రాజకీయాలలోనూ, వారసత్వంగా సంతానం నాయకత్వం చేపట్టడంలో తప్పులేదని భావిస్తుండవచ్చు. అలా మొదటి తరం నాయకులు తమ వారసులుగా సంతానాన్ని తేవడంలో అ నైతికం లేదనే వారి భావన కావచ్చు. అందుకే, స్థానిక సంస్థల నుంచి, ప్రధాన మంత్రి స్థాయి వరకు, వంశ పారంపర్యంగా కొన్ని కుటుంబాలకు చెందిన వారికే రాజకీయాధికారం లభిస్తోంది. ఒక్క సారి అధికారంలోకి రావడంతోనే, తమ సర్వ శక్తులను ఒడ్డి, బయట వారెవరినీ రాకుండా, తమ వారినే తమ వారసులుగా చేసే ప్రజాస్వామ్య రాచరిక వ్యవస్థ వేళ్లూనుకోసాగింది. దీని పర్యవసానం ఏంటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. దీనికి అడ్డు కట్ట వేయడం సాధ్యమేనా?

భారత దేశంలోని రాజకీయ పార్టీలన్నీ, అవినీతిని ఉత్పత్తిచేసే, వంశపారంపర్య కుటుంబ వ్యవస్థలు. వీటిని పెంచి పోషించే వ్యక్తులు, తమ కుటుంబీకులను తప్ప, వెలుపల వారిని తమ గుప్పిట్లో వుంచుకున్న పార్టీలోకి అడుగుబెట్టనివ్వరు. లోపలున్న వారి గొంతు నొక్కేసి, అసమ్మతి రాగాన్ని వినిపించకుండా జాగ్రత్త పడతారు. ఫలితంగా అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోవడం, ధన బలం-కండ బలం-కుల, మత బలం ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. ప్రజ్ఞా పాటవాలు-శక్తి సామర్థ్యాలున్న సాటి-తోటి పౌరులు, సమాజానికి ఎంతో సేవ చేయాలని వున్నా, దానికి కావాల్సిన రాజకీయ కుటుంబ నేపధ్యం లేకపోవడంతో, ఎన్నికల్లో పోటీ చేయలేక పోవడం, చేసినా, గెలిచి చట్ట సభల్లో ప్రవేశించలేక పోవడం కష్టమై పోతోంది. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే, భారత ప్రజాస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం లేనిది గాను-ప్రజల సాధికారత కొరవడేదిగాను కావడం తథ్యం. ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సారధ్యంలో ఆయా రాజకీయ నాయకుల కుటుంబ పాలన కొనసాగి, "ప్రజాస్వామ్య సంస్థానాలు" ఆవిర్భవించే ప్రమాదం పొంచి వుంది.

ఈ ప్రమాదానికి, వారసత్వ సంస్కృతికి కారకులెవరంటే, జవాబుగా కాంగ్రెస్ పార్టీ అని ఎవరైనా వెంటనే చెప్తారు. స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే, తండ్రి మోతీలాల్ నుంచి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని వారసత్వంగా పొందిన జవహర్లాల్ నెహ్రూ, చాలా వ్యూహాత్మకంగా-పకడ్బందీగా కుటుంబ వారసత్వ పాలనకు, ఆయన ప్రధానిగా వున్న కాలంలోనే పునాదులు వేశారు. వర్తమాన చరిత్రకారులెందరో దీన్ని ధృవీకరించారు. తన తదనంతరం కూతురు ఇందిర ప్రధాని కావాలని నెహ్రూ భావించారు. ఆయన కోరిక నెరవేరింది. ఇందిరా గాంధీ కూడా తండ్రి-తాత బాటలోనే పయనించింది. మొదట పెద్ద కొడుకు సంజయ్ గాంధీని, తర్వాత రాజీవ్ గాంధీని తెర పైకి తెచ్చింది తన వారసుడిగా. ఎమర్జెన్సీ ముందర, తర్వాత సంజయ్ గాంధీ ప్రభావం ఇందిరపై బాగా పనిచేసింది. అధికారిక హోదా లేకపోయినా, రాజ్యాంగేతర శక్తిగా ఆయన ఎదగసాగాడు. భావి భారత ప్రధానిగా, "దేశ్ కీ నేతా" గా కాంగ్రెస్ కార్యకర్తల నినాదాల మధ్య ఆయన బలీయమైన శక్తిగా పెరిగిపోయాడు. ఇంతలో జనతా చేతులో ఇందిర ఓటమి, కొన్నాళ్లకు అఖండమైన విజయం, సంజయ్ పార్లమెంటులో ప్రవేశం, మరి కొన్నాళ్లకు విమాన ప్రమాదంలో ఆయన దుర్మరణం ఒకటి వెంట మరొక టి సంభవించాయి. ఇక ఆ తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే. సంజయ్ వస్తాడనుకున్న స్థానాన్ని రాజీవ్, ఇందిర మరణం తర్వాత భర్తీ చేశాడు. ఆయన హత్యకు గురైంతర్వాత, కొంత విరామం తర్వాత, మకుటం లేని మహారాణిగా, సోనియా వారసత్వం స్వీకరించారు. ఇక ముందుంది రాహుల్ పర్వం. ఇదంతా ఒక పథకం ప్రకారం జరగింది కాదా? ఏమో!

ఇలా...మోతీలాల్...దేవీ లాల్...భజన్ లాల్...కైరాన్...కరుణానిధి..కరుణాకరన్..చరణ్ సింగ్...అర్జున్ సింగ్..బిజూ పట్నాయక్...దేవెగౌడ..శరద్ పవార్...బాల్ ఠాక్రే..బహుగుణ..నందిని సత్పజథి...ఎవరైనా ఒకటే ! అందరి కోరికా తమ కుటుంబీకులే, తమ స్థానాల్లో పదవులలంకరించాలని. రాచరికంలో లేని వారసత్వం ప్రజాస్వామ్యంలో సుసాధ్యం చేసిన ఘనత మనదే! ప్రజాస్వామ్యాన్ని మించిన పాలనా విధానం లేనే లేదు. అలాంటి విధానాన్ని ఆచరణలో పెట్తున్న దేశాల్లో అతి పెద్ద దేశం మన దేశం. దురదృష్టవశాత్తు, అధికారంలో తమ వాళ్ళే వుండిపోవాలన్న కాంక్షతో, కొందరు వ్యక్తులు "ప్రజాస్వామ్యాన్ని" "వారసత్వ స్వామ్యం" గా మలిచేశారు. తమ కుటుంబ సభ్యుల లాంటి వారనేకమంది వుండే అవకాశం గురించి తెలిసి కూడా, వారు, అధికారాన్ని తమ వారికే ధారాదత్తం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అలా చేయడం వల్ల, ప్రజాస్వామ్యాన్ని-రాజకీయ వ్యవస్థను గేలి చేసి, హాస్యాస్పదం చేశారు. ప్రపంచంలో మనను చిన్న చూపు చూసే పరిస్థితి కలిగించారు. ఈ పాపంలో అన్ని రాజకీయ పార్టీలకు-నాయకులకు అంతో, ఇంతో భాగం వుంది. వారసత్వంగా ఎదిగిన-ఎదుగుతున్న వారిలో ఏ కొద్ది మందో తప్ప, చాలా మంది అలా ఎదగడానికి కేవలం రాజకీయ-కుటుంబ నేపధ్యమే కారణం అనక తప్పదు. ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయిందీ కారణాన.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, వారసత్వ స్వామ్యంగా మార్పుచెందుతుందనడానికి సజీవ సాక్ష్యాలెన్నో--ఎన్నెన్నో వున్నాయి. ఆదిలో ముఖ్యమంత్రి పీఠాన్నెక్కిన బూర్గుల, నీలం, బెజవాడల తర్వాత మిగిలిన వారందరి వారసులు పదవులను పొందిన వారే. బ్రహ్మానందరెడ్డికి చెందిన కాసు కృష్ణారెడ్డి; పీవీ నరసింహా రావుకు చెందిన ఇద్దరు రాజేశ్వర రావులు, రంగారావు, మరో ఒకరిద్దరు కజిన్లు; జలగం వెంగళ రావు తమ్ముడు, కొడుకులు; మర్రి చెన్నారెడ్డి కొడుకు శశిధర రెడ్డి; అంజయ్య సతీమణి మణెమ్మ; ఎన్. జనార్ధన రెడ్డి సతీమణి రాజ్య లక్ష్మి; కోట్ల విజయభాస్కర రెడ్డి కొడుకు సూర్య ప్రకాశ్ రెడ్డి-కోడలు సుజాత; డాక్టర్ వై. ఎస్. రాజశేఖర రెడ్డి కొడుకు, భార్య; నాదెండ్ల భాస్కర రావు కొడుకు మనోహర్; ఎన్ టీ రామారావు కొడుకు, కూతురు, అల్లుళ్లు; చిరంజీవి తమ్ముళ్లు, బావమరిది; తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే సీ ఆర్ అల్లుడు, కొడుకు; ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఇంకా మిగిలి పోతారు. ఎంపీల, ఎమ్మెల్యేల, జిల్లా పరిషత్ అధ్యక్షుల, పార్టీల అధ్యక్షుల కుటుంబీకులనేక మంది వారసత్వ వరుసలో వున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం, ఇప్పటి ముఖ్యమంత్రి రోశయ్య మాత్రం ఇంతవరకు నీలం, బెజవాడ, బూర్గుల బాటలోనే నడుస్తున్నారు. ఆయన తన వారసులను రంగంలోకి దింపకపోవడం అభినందనీయమే!

Thursday, September 16, 2010

Breeding of family Politicians: Vanam Jwala Narasimha Rao

Living examples of degeneration of democracy
Vanam Jwala Narasimha Rao

Neither Late Mohammad Razab Ali of the Communist Party of India nor Late Kattula Shantayya of the erstwhile Indian National Congress, the first two MLA s whom I had known while I was still a student in Khammam, brought any of their relatives in to politics. It was not the case with everyone. Jalagam Vengala Rao when vacated Khammam Jillaa Parisht Chairman Position or Parliament seat, it was only in favor of his brother Kondala Rao. Later he brought his son Prasada Rao in to politics followed by another son. This is not an isolated phenomenon in Indian Politics. Nor this is limited to only Congress Party alone. Family members of top political leaders take over the reign of the party early in life. They are groomed by the first generation politicians and are launched into the political scene by well planned strategic media campaign.

Democratic politics in India have become hereditary. Democracy itself has become hereditary. The lead given by Nehru-Gandhi family in National Politics has been very well taken by many in several states. Examples of Indian Hereditary Politicians are plenty. To quote from the recent past, several candidates in the race during the last general elections are just enough to mention a cross section of the cream of such gifted few. Congress contestant from Mumbai South Milind Deora is the son of Murli Deora Union Minister. Priya Dutt daughter of Sunil Dutt, Sameer Bhujbal nephew of Chhagan Bhujbal, Bhaskarrao Patil son-in-law of former chief minister SB Chavan and brother-in-law of Maharashtra CM Ashok Chavan, Mukul Wasnik son of former AICC general secretary, Vijay Bahuguna son of former UP CM HN Bahuguna and brother of current UPCC chief Rita Bahuguna as well as first cousin of UK Chief Minister B C Khanduri and YS Jagan Mohan son of the then AP CM Rajashekhara Reddy are only few more examples. In fact three Assembly tickets and one MP ticket was allotted to one single family of a Minister in AP, Botcha Satyanarayana. Not only did he win from an Assembly constituency, his wife Jhansi Lakshmi won the Lok Sabha, his brother Appalanarasiah won from Gajapartinagaram and nephew Appalanaidu won from Nellimarla Assembly seats.

Sheila Dixit, the CM of Delhi for over a decade, who herself was a product of hereditary politics being the family member of Umashankar Dikshit, former Union Cabinet Minister, has already brought her son Sandeep Dikshit in to politics and made him a Member of Parliament from East Delhi Constituency. Bhupinder Singh Hooda, CM of Haryana and four times parliament member from the state has brought his son Deependar Singh Hooda in to politics. He is now a Member of Parliament. Chaudhari Devi Lal, Hooda predecessor, also made his son Om Prakash Choutala as Haryana CM once. SP Leader Mulayam Sing Yadav family members are the key people in UP politics. His son Akhilesh Yadav won from two constituencies in last Loksabha elections. When he vacated a seat it was given to none other than the daughter in law of the family and she lost the election.

While Nehru-Gandhi family future heir in waiting Rahul Gandhi and his mother contested as Congress candidates, his cousin late Sanjay Gandhi’s son Varun Gandhi and Aunt Maneka Gandhi contested as BJP candidates. Dip Gogoi younger brother of CM Orissaa Tarun Gogoi, Manish Tewari, Ravneet Singh Bittu, Kumari Selja and Jyoti Mirdha granddaughter of Nathuram Mirdha are few more in the hereditary row. Congress national leader Motilal Vora’s son, former Union Minister Arvind Netam’s daughter, another leader Ajit Jogi wife is among them. In Rajasthan, Jagannath Pahadia, Sis Ram Ola, Nawal Kishore Sharma, Govind Singh Gurjar managed tickets for their sons in the last elections. While the Gandhis are regarded as India’s First Family, the regional lords have nurtured their ‘dynasties’ with loving care in their own arena.

The hereditary politics are not limited to congress alone. NCP supremo Sharad Pawar daughter Supriya Sule, Karnataka CM Yeddyurappa’s elder son Raghavendra, former PM Devegouda’s son H D Kumaraswamy of JD-S, Tamil Nadu CM Karunanidhi son M K Azhagiri, Murasoli Maran’s son Dayanidhi, former Lok Sabha Speaker P A Sangma’s daughter Agatha are some of the non-congress heirs. Kanimozhi, Karunanidhi daughter is a Rajya Sabha member while his other son Stalin is the CM in waiting. In Jammu and Kashmir, Late Sheik Abdullah son Farooq Abdullah has already made his son Omar as CM. PDP’s Mufti and daughter Mehbooba play musical chairs with Omar to sit on the State throne. In Andhra, TDP supremo is busy grooming his brothers-in-laws, while his son is also in waiting list. In Maharashtra the Thackeray and the Pawar clans compete for power. Then we have progenies of Karunakaran, Bahuguna, Nandini Satpathy and Jagivan Ram. RJD Chief Laloo’s Rabri, JMM’s Mahato and widow of former Gujarat CM Chimanbhai Patel are best better half examples.

Political power moves from one generation to another. The hereditary politics are ruining the country’s future. In Dynastic politics known to Indians from time immemorial, kings and emperors groom their sons and daughters to ascend the throne. Innocent Indian citizen who may not understand the basic concept of democracy think that such hereditary succession to the throne is nothing unusual or unethical and hence what has been happening in politics is right. Right from the local self government to the national level, political dynasties are everywhere enjoying the fruits of power and prestige. Once patriarch succeeds in attaining political power, he lets his near and dear ones to come in the line, so that the power would not go outside the family lineage. The king maker parent and the emerging dynasties ensure that the door to the top slot is available to none but to the family members alone.

Political parties in India are close family structures that breed corruption. They ensure that no outsider of the family and insider in the party dares voice dissent. The control of political parties by families inevitably lead to several undesirable consequences, such as money power, muscle power and caste factors playing in the electoral process. Citizens who are more talented and have more enthusiasm to work for the public cause but with less family background, find it hard to compete in the elections, let alone make it to the assemblies and parliament. If this present trend of continues, Indian democracy will cease to be participatory and it will cease to be a way of empowering people.

Political competence neither comes by conventional education alone, nor by mere acquaintance or association or heritage as well. A competent political leader’s wife, son or daughter need not be equally competent. It can be welcomed, if political heirs are capable enough to provide quality leadership to the country but the overall experience shows that under the control of families over political power, the institution of democracy is ridiculed. It is an insult to the concept of democracy. It would not be possible to undo the political dynasties in Indian democracy without changing this mindset. Politics in India is a business and a family business too. If the present scenario is allowed to continue, each state will become “a princely state” ruled by the dynasties of political leaders who promote their own kith and kin. Even the regional heavyweights RJD, Samajwadi, DMK, National Conference, PDP, Shiv Sena, Akali Dal, Telugu Desam, believe in brothers, sisters, in-laws, out-laws, sons, daughters, son in-laws and daughter in-laws.

Distressingly, the original promoter of this ancestry culture is none other than the Congress. Jawaharlal Nehru stepping in to the shoes of his father Motilal as AICC President before independence set the ball rolling and calculatedly laid the foundation of dynastic rule. He groomed daughter Indira, who in turn promoted Sanjay and later Rajiv. Just before and soon after the Emergency, Sanjay Gandhi rose in importance as Indira's advisor. Sanjay's influence with Indira and the government increased dramatically, although he was never in an official or elected position. Indira Gandhi and her Congress Party that was defeated by the Janata Party coalition returned to power in a landslide. Sanjay was elected to a parliamentary seat from Amethi in UP. Unfortunately he died in an accident. The rest is history. Rajiv was made PM and party leader. The lineage continued even after his death, though delayed for a while with Sonia occupying the uncrowned throne. On the way is now Rahul. Encouraged by this many have calculatedly promoted their wards. Kairon to Karunanidhi, Pant to Parmar, Devi Lal to Bhajan Lal, Charan Singh to Arjun Singh, Biju Patnaik to Deve Gowda, a never ending lineage.

No doubt democracy is the best form of governance. India is the largest democracy in the world. However Indian politicians, in their bid to remain in power permanently, have converted 'democracy' into 'hereditary democracy'. Conscious attempts are being made by the politicians, who are at the helm of affairs or holding power, to transfer power legitimately to their wards ignoring or simply overlooking the claim of other senior politicians in the same party, thereby making the existing party system as well as the democracy a laughing stock in the world. In the process, the party leaders show utter disregard for their loyal party men, their seniority, experience or even their talent or ability and all of them are being made subservient to the interests of their wards.

In India, probably with no exception, in almost all the national and regional parties, this tendency of promoting the wards in party politics prevail. Few of the wards of the political leaders have the requisite political background and exposure to enter politics on their own right. However, the most disturbing factor is with the blessing and support of the party leadership, they easily come to the forefront of party politics making other senior party men to suffer in silence.

The degeneration of democracy into 'hereditary democracy' is certainly a retrograde step in the evolution of democracy. In order to prevent such disturbing trends in democracy in India, something constructively needs to be done. If it cannot be prevented, then, the hereditary democracy too may deteriorate further, making the party system a casualty, posing a very big threat to very existence of democracy.

The living examples of degeneration of democracy, if it can be called so, are plenty in Andhra Pradesh. Barring Boorgula Ramakrishna Rao, Neelam Sanjeeva Reddy and Bezavada Gopalaredy the first three Chief Ministers in this part of the country rest all helped their family members gaining political advantage and occupying important political positions. Brahmananda Reddy brought kasu Krishna Reddy; PV Narasimha Rao his two sons, one brother-in-law and couple of other cousins; Jalagam Vengala Rao his brother, both the sons; Marri Channa Reddy his son; Anjayya his wife; Bhavanam his wife; N Janardhan Reddy his wife; Kotla his son Surya Prakasha Reddy and of course Dr YS Rajasekhara Reddy his brother and his son Jagan. Nadendla Bhaskara Rao’s son Manohar is already an MLA. NTR son, son-in-law is already in politics. His daughter is Union Minister. One son-in-law Chandrababu Naidu, on shifting party loyalties could become CM and his son is being groomed now. Telangana Rashtra Samithi Leader’s son, nephew are in to politics. Daughter is in waiting list. There are many more MPs, MLA s and ZP Chairmen who successfully put their kith and kin in active politics like PCC Chief D Srinivas and Minister Kanna Laxminarayana.

Interestingly Present Chief Minister Rosaiah is an exception on the lines of Neelam, Bezavada and Boorgula! On this count he needs to be congratulated.

Monday, September 13, 2010

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కుల రాజకీయాలు : వనం జ్వాలా నరసింహారావు


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్, హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు విడి-విడిగానే పనిచేసేవి. అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి చొరవతో, జులై 1957 లో, అల్లూరి సత్యనారాయణ రాజు అధ్యక్షతన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆవిర్భవించింది. భారత జాతీయ కాంగ్రెస్ కి రాజకీయ పార్టీకుండాల్సిన లక్షణాలు లేవనే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితీ అంతే. ప్రజల మద్దతున్న పార్టీ అయినప్పటికీ, అందులో అంతా నాయకులే తప్ప సుశిక్షితులైన అనుచరుల (కాడర్) కొరతుందనే అనాలి. ఆవిర్భావం నుంచి, చాలా కాలం వరకు, పెద్ద చదువులు చదువుకున్న పట్టణ ప్రాంతం వారితో ను, అగ్ర కులాలుగా పిలువబడే వారితో ను-అందునా అధిక సంఖ్యా కులు బ్రాహ్మణ కులానికి చెందినవారితో ను, పార్టీ నాయకత్వం పనిచేసేది. పట్టాభి, అయ్యదేవర, ప్రకాశం, ముట్నూరి, దుగ్గిరాల, కొండా, వీవీ గిరి, మాడపాటి, బూర్గుల, నీలం, కాశీనాథుని, పింగళి, వామన్ నాయక్, మెల్కొటె, జమలాపురం, కెవి రంగారెడ్డి లాంటి వారిని ఆ జాబితాలో ఉదహరించవచ్చు. స్వతంత్రం రాక పూర్వం పరిస్థితి అలా వుంటే, ఇక ఆ తర్వాత, బ్రాహ్మణే తర కులాలకు చెందిన ధనిక భూస్వామి వర్గాలలోని కమ్మ, రెడ్డి, కాపు, క్షత్రియ, వెలమ వారి ఆధిపత్యం మొదలైంది. ఇంకా కొనసాగొతుందిప్పటికీ. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టడంతో, ఈ తరగతులకు చెందిన వారిదే పూర్తి పెత్తనంగా మారడం, వారే ముఖ్యమంత్రులు-మంత్రులు-జిల్లా పరిషత్ అధ్యక్షులు-ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కావడం మొదలైంది. పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. అప్పటినుంచి కొంత మార్పొచ్చింది.

ఒక గురుమూర్తో, ఒక ముసలయ్యో, ఒక హనుమంతరావో, ఒక సంజీవయ్యో, ఒక అంజయ్యో తప్ప ముఖ్యమంత్రులైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనా, జిల్లా పరిషత్ చైర్మన్లు అయినా, అగ్ర వర్ణాల వారో, ధనిక వర్గాల వారో కావడమే కాని, వెనుకబడిన వర్గాల వారికి అవకాశాలు ఎక్కువగా రాలేదనే అనాలి. ఇందిరా గాంధి నాయకత్వంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో మొదటి సారి చీలి కొచ్చిన తర్వాత, జరిగిన మధ్యంతర ఎన్నికలప్పటినుంచి, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కొంత మార్పు కనబడ సాగింది. వెనుకబడిన వర్గాల వారికి, దళితులకు కొంత ప్రాధాన్యత లభించడం మొదలైంది. సంఖ్యాపరంగా వారు మెజారిటీలో వుండడం, వారి ఓట్లు గెలుపుకు ముఖ్యం కావడం, ఈ మార్పుకు ప్రధాన కారణం. అయితే, జన్మతః అందరు వెనుకబడిన వర్గాలకు చెందిన వారైనప్పటికీ, అవకాశాల విషయానికొచ్చేటప్పటికి, కొందరికే ప్రాధాన్యత లభించింది. సామాజికంగా-ఆర్థికంగా పుంజుకున్న వారు, విద్యాధికులకే పైకి పోయే అవకాశాలు లభించాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో వీరి అవసరం రీత్యా పలువురికి అవకాశాలు రాసాగాయి. అయితే, మొదటి నుంచి కూడా, కాంగ్రెస్ నాయకత్వం ధనికుల-అగ్ర వర్ణాల వారి చేతుల్లో వున్నప్పటికి, పార్టీకి మద్దతిచ్చే వారిలో అధికులు దళితులు, వెనుక బడిన వర్గాల వారు. మైనారిటీలు కావడం విశేషం. ఇప్పటికీ, పూర్తిగా అవకాశం చేతికందకపోయినా, 1972 ఎన్నికల అనంతరం, అధిక సంఖ్యలో వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, దళితులు చట్ట సభల్లో ప్రవేశించే వీలు కలిగింది. పీవీ నరసింహా రావు మంత్రివర్గంలో సగానికి పైగా ఆ వర్గాల వారికే స్థానం లభించడం విశేషం.

కాంగ్రెస్ పార్టీలో ప్రాంతీయ విభేదాలెంత మోతాదులో వుంటాయో, అంతకంటే ఎక్కువ మోతాదులో కుల-మత విభేదాలుంటాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎన్నుకొనేటప్పుడు (ఎంపికచేసేటప్పుడు), శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ల పంపకమప్పుడు, ఎన్నికల అనంతరం శాసనసభ పక్షం నాయకుడి ఎన్ని కప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల విషయంలో, జిల్లా పరిషత్-మునిసిపల్ చైర్మన్ ఎన్ని కప్పుడు కుల రాజకీయాలకు అధిక ప్రాధాన్యతుంటుంది. ఇంతవరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో, అడపాదడపా తప్ప, సర్వసాధారణంగా రెడ్డి, కమ్మ కులస్తులకే ఎక్కువ స్థానాలు ఎక్కువ సార్లు లభించాయి. స్థానిక సంస్థల్లో అంజయ్య పుణ్యమా అని రిజర్వేషన్లు కలిగించడంతో, వెనుకబడిన వర్గాల వారు అధిక సంఖ్యలో ఎన్నిక కాగలుగుతున్నారు. అంతకు ముందు, జిల్లా పరిషత్ చైర్మన్లు గాని, సమితి అధ్యక్షులు గాని ఒక పథకం ప్రకారం అగ్ర వర్ణాల వారే ఎన్నికయ్యేవారు. అందునా, తెలంగాణలో-రాయలసీమలో రెడ్లు, కోస్తాంధ్రలో కమ్మ వారు, ఉత్తరాంధ్రలో క్షత్రియులు ఎన్నికయ్యేవారు.

కాంగ్రెస్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో అవతరించిన మరో రాజకీయ పార్టీ జనత పార్టీ. అంతకు ముందే కమ్యూనిస్ట్, ప్రజా సోషలిస్ట్, స్వతంత్ర లాంటి పార్టీలున్నప్పటికీ, ఇందిరా గాంధి విధించిన ఎమర్జెన్సీ నేపధ్యంలో మొట్టమొదటి కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి పార్టీగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా జనత పార్టీకి ప్రాధాన్యముందనాలి. ఆ పార్టీ కూడా అగ్ర కులాల ఆధిపత్యంలోనే పనిచేసింది. నీలం సంజీవరెడ్డి జనత ఆంధ్ర విభాగం ఏర్పాటును లాంఛనంగా ప్రకటించి, దాని అధ్యక్షుడుగా తెన్నేటి విశ్వనాథంను నియమించారు. ఇప్పటి జాతీయ స్థాయి నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు అప్పట్లో విద్యార్థి విభాగం కన్వీనర్. జనత పార్టీ రాష్ట్ర కమిటీలో కేవలం ఇద్దరు మాత్రమే షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు, నలుగురు వెనుకబడిన వర్గాలకు చెందిన వారుండగా, మిగిలిన 85% మంది ఇతరులున్నారు. కాకపోతే, వారిలో ఒక ముస్లిం, ఇద్దరు మహిళలు కూడా వున్నారు. 1977 ఎన్నికల ముందు ఏర్పాటుచేసిన అడహాక్ కమిటీ పరిస్థితి కూడా అంతే. అందులో షెడ్యూల్డ్ కులాల వారు, తెగల వారు, వెనుకబడిన వర్గాల వారందరు కలిసి కేవలం 23% మంది మాత్రమే సభ్యులయ్యారు. ఆ తర్వాత కొన్ని మార్పులు-చేర్పులు చేసినా, అవన్నీ రాజకీయ కోణం నుంచే కాని వెనుకబడిన వర్గాల వారి ప్రాధాన్యతను పెంచేందుకు కాదు. 1977 లోక్ సభ ఎన్నికల్లో ఇద్దరు వెనుకబడిన వర్గాల వారు, ఒక్క ముస్లిం అభ్యర్థి తప్ప మిగిలిన అందరూ ఇతరులే. ప్రజల-ఓటర్ల మద్దతు పొందేందుకు 1978 శాసనసభ ఎన్నికల్లో సుమారు 40% స్థానాలను ఆ వర్గాల వారికి కేటాయించింది జనత పార్టీ నాయకత్వం.

కమ్యూనిస్టు రాజకీయాలపై కూడా కుల ప్రభావం పడిందనాలి. ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ-సామాజిక-ఆర్థిక నేపధ్యంలో అవి తప్పవేమో! స్వతంత్రం రాక పూర్వం రాష్ట్రంలోని జాతీయోద్యమం బ్రాహ్మణుల నాయకత్వంలో చాలావరకు నడి చేది. రాయలసీమలోని రెడ్లు, కోస్తాలోని కమ్మ వారు, ఆధిపత్యం కొరకు బ్రాహ్మణులపై పోరాడారు. కోస్తాలోని కమ్మ వారికి, బ్రాహ్మణులను ఎదిరించేందుకు సరైన ఆయుధం కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో లభించింది. అలానే రాయలసీమ రెడ్డి వారు కూడా. నిజా-నిజాలెంతో కాని, 1952 లో జరిగిన ఎన్నికల్లో, కమ్యూనిస్ట్ వ్యూహం కాంగ్రెస్ పార్టీలోని కమ్మ-రెడ్డి విభేదాలను ఉపయోగించుకునే రీతిలో వుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కమ్యూనిస్టుల్లో కులం ముఖ్యమైనా-కాకపోయినా, చాలా కాలం వరకు అగ్ర కులాల వారి ఆధిపత్యంలోనే నాయకత్వం కొనసాగింది. ఇటీవలి కాలంలో పార్లమెంటరీ పంథాకు అలవాటు పడి, బూర్జువా పార్టీల ధోరణులన్నీ వంటబట్టించుకున్న అతివాద-మితవాద-తీవ్రవాద కమ్యూనిస్టులు, కులం విషయంలో కూడా ఏమీ తీసిపోలేదనిపిస్తున్నారు.

ఆంధ్రుల ఆత్మ గౌరవం ఢిల్లీ నడి వీధుల్లో తాకట్టు పెట్టారు కాంగ్రెస్ వారంటూ, ఆ పార్టీని ఓడించి, నేల నాలుగు చెరగు లా తెలుగు వాడి సత్తా నిరూపించాలని పిలుపిచ్చారు తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి ఆద్యుడు ఎన్ టీ రామారావు. ఆయన పిలుపునందుకొని వారు-వీరన్న తేడా లేకుండా ఆబాల గోపాలం ఆయన వెంట నడిచింది. కులమతాలకు అతీతంగా పార్టీ పక్షాన పోటీ చేసిన ప్రతి వారినీ విజయం వరించింది. అవినీతికి, అన్యాయానికి, వెనుకబడిన తనానికి వ్యతిరేకంగా ఎన్ టీ రామారావు మాట్లాడని రోజు లేదు. అంతవరకు బాగానే వుంది. మొదట్లో అవన్నీ పనికొచ్చాయి. క్రమంగా "ఆత్మగౌరవం" నినాదం స్థానంలో "రాజకీయ గౌరవం" ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్ టీ రామారావు ఆదర్శాలకు ఎదురుదెబ్బ తగిలి ప్రజాస్వామ్యం పరిహసించబడింది. ఆయన ప్రభుత్వాన్ని కూల దోసే నేపధ్యంలో కుల రాజకీయాలకే ప్రాధాన్యతుందనాలి. ఎన్ టీ రామారావును గెలిపించినప్పుడు కొందరు ఆయనను తమ కులానికి ప్రతినిధిగా మాత్రమే చూశారు. ఎప్పుడైతే అది కుదరలేదో, ఆ కులానికి చెందిన మరొకరిని ఆ పీఠంపై కూర్చొబెట్టే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన వ్యక్తులే, అదను చూసుకుని ఆయన అధికారంలో కొనసాగడం మంచిది కాదనుకుని నాయకత్వం చేపట్టారు. తెలుగు దేశం పార్టీ కూడా కుల ప్రాధాన్యత విషయానికొచ్చే సరికి అన్ని రాజకీయ పార్టీల మార్గాన్నే అనుసరించిందనాలి. లెక్కలు పక్కన పెట్టి తే, మూడు పర్యాయాలు ప్రభుత్వంలోకి వచ్చిన టిడిపి ఎమ్మెల్యేలలో కాని, మంత్రులలో కాని వెనుక బడిన వర్గాల వారి ప్రాధాన్యత మిగిలిన వారితో పోల్చి చూస్తే చాలా తక్కువే. నాయకత్వం సరిపడక పార్టీని వదిలి వెళ్ళి తిరిగొచ్చిన దేవేంద్ర గౌడ్ లాంటి వారు కూడా వెనుకబడిన వర్గాల వారి వాణిగా పేరు తెచ్చుకోలేక పోతున్నారు.

ఇక ఇటీవలి కాలంలో ధనవంతులైన కొందరు బీసీ నాయకులు పార్టీ పెట్టి తమ వారికి న్యాయం చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్సీ గా కూడా గెలిచారు. ఏమైందో-ఏమో, మళ్ళీ అవే రాజకీయాలు. కాంగ్రెస్ గూట్లో చేరారు. ఇలా ఉన్న ఒకటి-రెండు ఆశలను కూడా ఆ వర్గానికి చెందిన వారే అడియాసలు చేస్తుంటే ఎలా?

ఇవిలా వుండగా, కాంగ్రెస్ పార్టీని వీడిన వారు, అలిగి పోయిన వారు, రాజకీయ కారణాలతో కొంతకాలం బయటున్న వారంతా అగ్ర కులాల వారే. ఎన్జీ రంగా కేఎల్పీ పార్టీ, బ్రాహ్మణుల నాయకత్వంలో వెలిసిన కే.ఎం.పీ.పీ, మర్రి చెన్నా రెడ్డి డెమోక్రాటిక్ పార్టీ, స్వతంత్ర పార్టీ అలాంటివే. ఆధిపత్య పోరు కొరకే అవన్నీ. అందునా కుల ప్రాతిపదికన జరిగిన ఆధిపత్య పోరే అది. ఎదేమైనా-ఎవరెన్ని చెప్పినా, వెనుకబడిన వర్గాల వారికి రాజకీయ పెత్తనం అప్పగించడం ఇప్పటికీ ఇంకా మాటల్లోనే కాని ఆచరణలో కానే కాదు. ఒక వేళ వీరిలో ఎవరన్నా ఉన్నత స్థాయికి చేరుకోగల వారుంటే, వారికి కూడా ధన బలం తప్పని సరి. అది లేకపోతే, వారి వారే వెనక్కు పడవేయడం ఖాయం.

Saturday, September 11, 2010

హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో "విలీనం" - పోరాట కేంద్రంగా విజయవాడ : వనం జ్వాలానరసింహా రావు


వనం జ్వాలా నరసింహారావు

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనా-విలీనమా అని వాదనలు చేస్తున్న వారెవరూ ఆ రోజుకున్న ప్రాధాన్యతను-దాని నేపధ్యాన్ని ప్రస్తావించడం లేదు. హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి చేసి, స్వతంత్ర భారతావనిలో కలిపేందుకు సెప్టెంబర్ 13, 1948న మొదలయిన పోలీస్ యాక్షన్, కేవలం నాలుగైదు రోజులలోనే ముగిసి, యావద్భారత ప్రజల ఆనందోత్సాహాల మధ్య, హైదరాబాద్ రాజ సంస్థానం సెప్టెంబర్ 17, 1948న భారత దేశంలో విలీనమయింది. అప్పటి వరంగల్ జిల్లా, ఇప్పటి ఖమ్మం జిల్లా, బోనకల్లు గ్రామానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, స్వర్గీయ బొమ్మకంటి సత్యనారాయణ రావు రాసిన పాతిక సంవత్సరాల క్రితం జరిగిన స్వాతంత్ర్య సమరయోధుల క్లుప్తమైన చరిత్రను, "హైదరాబాదు స్వాతంత్ర్య పోరాటం" శీర్షికతో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక మాస పత్రిక "ఆంధ్ర ప్రదేశ్" సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ప్రచురించింది. బ్రిటీష్ సామ్రాజ్యపు పటిష్టమైన చిట్టచివరి దుర్గం హైదరాబాద్‌ సంస్థానమని, అక్కడి ప్రజలు నిరంకుశ నిజాం ప్రభువుల బానిసలని, ఆ పాలనను ఎదిరించిన వారందరినీ నిజాం పోలీస్ దౌర్జన్యంతో అణచివేసే ప్రయత్నం చేశాడని, అంధకారంలో మగ్గుతున్న ప్రజలకు విముక్తి కలిగించేందుకు తమ సర్వస్వాన్ని ధారపోసి రాష్ట్ర ప్రజలకు వెలుతురును ప్రసాదించిన అ నాటి సమరయోధులను జ్ఞప్తికి తెచ్చుకుంటూ తాను ఆ వ్యాసం రాస్తున్నానని బొమ్మకంటి పేర్కొన్నారందులో. బొమ్మకంటి పోరాటంలో పాల్గొని కీలకమైన పాత్ర వహించడమే కాకుండా, ఆ తర్వాత కాలంలో మధిర శాసనసభ సభ్యుడుగా ఎన్నికై రాష్ట్ర రాజకీయాలలో కొన్నాళ్లు చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు.

హైదరాబాద్ స్వాతంత్ర్య పోరాటం నేపధ్యంలో, 1938 లో ప్రారంభమైన ప్రథమ సత్యాగ్రహానికి ఆంధ్ర ప్రాంతంలో జమలాపురం కేశవరావు, హైదరాబాద్ రాష్ట్రంలో స్వామి రామానంద తీర్థ నాయకత్వం వహించారు. కాంగ్రెస్ పార్టీపై నిషేధం విధించినప్పుడు అజ్ఞాతవాసం చేస్తూ, హైదరాబాద్ సుల్తాన్ బజార్‌లోని చిన్న ఇంట్లో జాతీయోద్యమాన్ని సజీవంగా వుంచి, మహోద్యమంగా మలిచి, చివరిదాకా నాయకత్వం వహించిన వ్యక్తి స్వామి రామానంద తీర్థ. ఆయనతో పాటు స్వాతంత్ర్య సమరాన్ని గమ్య స్థానానికి చేర్చిన వారిలో బూర్గుల రామకృష్ణారావు, దిగంబర రావు బిందూ, మెల్కోటే, కొండా వెంకట రంగారెడ్డి, గోవింద దాస్ షర్రాఫ్, జనార్థనరావు దేశాయ్, జమలాపురం కేశవరావు, మాడపాటి హనుమంతరావు, మర్రి చెన్నారెడ్డి, బొమ్మకంటి సత్యనారాయణరావు, హయగ్రీవాచార్యులు, పాగా పుల్లారెడ్డి, కోదాటి-కొమరగిరి-కాళోజి నారాయణరావులు, విబి రాజు, ఎమ్మెస్ రాజలింగం, ఉమ్మెత్తల కేశవరావు, కెవి నరసింగరావు, పివి నరసింహారావులు ప్రముఖులు. వీరంతా వారి-వారి జిల్లాల్లో నాయకత్వం వహించారు.

"రెస్పాన్సివ్ గవర్నమెంట్" అని, "రెస్పాన్సిబిల్ గవర్నమెంట్" అని తర్జనభర్జనలు జరిగి, "ఇండియన్ యూనియన్‌లో చేరండి" అనే నినాదంతో ఉద్యమం మలుపు తిరిగింది. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో షోలాపూర్లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రధమ సమావేశంలో పాల్గొన్న ప్రముఖుల్లో మాడపాటి, జమలాపురం, బొమ్మకంటి ముఖ్యులు. ఆ తర్వాత బొమ్మకంటి ప్రభృతులు విజయవాడ కేంద్రంగా పనిచేసేందుకు అక్కడకు చేరుకుని, అయ్యదేవర కాళేశ్వర రావు ఇంట్లో కార్యాలయం పెట్టుకుని పని చేయసాగారు. సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయం తీసుకుని, ఆంధ్ర ప్రాంతానికి జమలాపురం కేశవరావు నాయకత్వం వహించాలని, ఆయన జైలుకెళ్లినప్పుడు ఇన్-చార్జ్ గా హయగ్రీవాచార్యులుండాలని, ప్రచార విభాగాన్ని విబి రాజు, ఎల్లల ఉద్యమాన్ని బొమ్మకంటి నిర్వహించాలని నిర్ణయించారు.

అప్పట్లో నెల కొన్న అరాచక పరిస్థితులు భారత ప్రభుత్వాన్ని అయోమయంలో పడవేశాయి. పరిష్కారానికి పోలీసు చర్య తప్ప వేరే మార్గం కనిపించలేదు. భారత ప్రభుత్వం సైన్యాన్ని ప్రజల సంరక్షణ కొరకై పంపించింది. దక్షిణాదిన సైన్యాన్ని తరలించినప్పుడు, ఆ ప్రాంతంలోని మిలిటరీ అధినేతలు కల్నల్ అమృత్ సింగ్, విజి సుబ్బరాయన్ లు చిరస్మరణీయమైన పాత్ర పోషించారు. జె. ఎన్. చౌదరి హైదరాబాద్ లో ఝండా ఎగురవేయడంతో కథ సుఖాంతమైంది. హైదరాబాద్ సంస్థానంలో నివసించే వారు కూడా భారతీయులే కాబట్టి, భారత దేశంలో "విలీనం" కాకుండా చేసేందుకు జరిగిన ప్రయత్నాలు, అవరోధాలు ఆనాటి తో తొలగిపోయాయి. ప్రజా వాహిని ఊపిరి పీల్చుకుంది. విజయ దుందుభులు మ్రోగాయి. ప్రజా విజయం ఖాయమని గ్రహించిన నిజాం నవాబు, తెలివిగా, "విలీన పత్రం" సమర్పించుకున్నాడు. తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో సఫలమయ్యాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ ప్రజల పాలిట ప్రాణదాతయ్యాడు.

హైదరాబాద్ నవాబుకు ప్రజలపై ప్రేమ లేకపోగా, "దోపిడీ దొంగల స్థాయి నిరంకుశ ప్రభువు" లాగా వ్యవహరించాడు. నవాబును ఓడించేందుకు బొమ్మకంటి లాంటి సమర యోధులు పథకం వేసుకున్నారు. పటేల్, పట్వారీలను రాజీనామా చేయమని కోరారు తొలుత. సంస్థానానికి, భారత యూనియన్‌కు మధ్య నున్న సరిహద్దులను రూపుమాపేందుకు నిర్ణయించి, "కరోడ్గి్రి నాకాలను" ధ్వంసం చేయసాగారు. లెవీ ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా ప్రజలను సమీకరించారు. ప్రజలపై దాడులు చేయడానికి నవాబు ప్రభుత్వం వాడుకుంటున్న గవర్నమెంట్ విశ్రాంతి భవనాలను నిర్మూలించడం మొదలైంది. రహదారి మార్గాల గుండా మిలిటరీ-రజాకార్లు ప్రయాణం చేయకుండా నిరోధించేందుకు బ్రిడ్జులను ధ్వంసం చేశారు. బస్సులు, రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. గొరిల్లా దళాలతో మెరుపు దాడులు చేయసాగారు. గ్రామాలను రిపబ్లిక్‌లుగా ప్రకటించాలని, అక్కడ ప్రభుత్వ పాలన స్థానంలో గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలను సమీకరించి ఉద్యమంలో పాలుపంచుకునే ట్లు చేయసాగారు. కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగించేందుకు, విజయవాడ కేంద్రంగా మాడపాటి రామచంద్ర రావు, హయగ్రీవా చారి, వల్లూరి బసవ రాజుల నాయకత్వంలో, ఆంధ్ర ప్రాంత ఇన్-చార్జ్ గా బొమ్మకంటి సత్యనారాయణ రావును నియమించారు.

సర్దార్ జమలాపురం కేశవరావు, "బుర్రకథ దళం" వెంకట్ రాజుల నాయకత్వంలో, ఆగస్ట్ 7, 1948 న బొమ్మకంటి ప్రభృతులు సత్యాగ్రహ ఉద్యమానికి బయల్దేరారు. సత్యాగ్రహం మొదలెట్టే ముందు, తాను జైలుకెళ్లాల్సి వస్తుందని, జీవితంలో మళ్లీ కలుస్తామో-లేదో చెప్పలేనని, హయగ్రీవా చారి ఇన్-చార్జ్ గా, వట్టి కొండ రామ కోటయ్య సహాయంతో ఉద్యమాన్ని కొనసాగించాల్సిన బాధ్యత బొమ్మకంటి మీద పెట్తున్నానని జమలాపురం హెచ్చరించారు. జైలుకెళ్లాలని అనుకున్న బొమ్మకంటికి జమలాపురం ఆజ్ఞను ధిక్కరించే సాహసం లేకపోయింది. కేశవరావు సత్యాగ్రహం తర్వాత విజయవాడ చేరుకున్న బొమ్మకంటి సత్యనారాయణ రావు, మాడపాటి, హయగ్రీవా చారి, వల్లూరి బసవరాజులు "అన్నదమ్ముల మాదిరి" ఉద్యమాన్ని నిర్వహించే బాధ్యతను తమపై వేసుకున్నారు. స్వగ్రామం బోనకల్లు లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి బొమ్మకంటి అజ్ఞాతవాసం ప్రారంభించారు. సరిహద్దు చుట్టూ శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. వీరికి అవసరమైన ధన సహాయం సుగ్గల అక్షయ లింగం, మిర్యాల నారాయణ, శంకర లింగం గుప్తాలు సమకూర్చారు.

భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంతో నిజాం నవాబు, పాకిస్తాన్ ఏజంటుగా మారిపోయి, లాయక్ అలీని-ఖాసిం రజ్వీని ముందుంచి దుర్మార్గాలు చేయించసాగాడు. ప్రజలు తిరగబడ్డారు. ఖాసిం రజ్వీపై పోరాటం సాగించిన కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజాదరణ లభించింది. "కమిటీ ఆఫ్ యాక్షన్” కు చైర్మన్‌గా వున్న దిగంబర రావు బిందు సమరయోధులను ప్రోత్సహించారు. కార్యకర్తలకు సైనిక శిక్షణ ఇవ్వడానికి పండిట్ నరేంద్ర జీ నాయకత్వంలో ఆర్యసమాజం వారు తోడ్పడ్డారు. రజాకార్లతో పోరాడడానికి శిబిరాలు, క్యాంపులు పెట్టి, సరిహద్దు గ్రామాల్లోకి వెళ్లి కార్యక్రమాలను నిర్వహించేవారు. పండిట్ రుద్రదేవ్ నాయకత్వంలో ఆయుధాల నిర్మాణ కేంద్రం కూడా పనిచేసేది. క్యాంపులకు ఇన్-చార్జులు, కమాండర్లు వుండేవారు. వారిలో జలగం వెంగళరావు, కోదాటి నారాయణరావు, పాగా పుల్లారెడ్డి, కె. వి. నరసింగరావు లాంటి ప్రముఖులున్నారు.

రజాకార్లు, పోలీసులు వెంటబడ్డా ప్రాణాలను లెక్క చేయకుండా పెనుబల్లి మాస్టారు రామచంద్ర శాస్త్రి, రామకోటేశ్వరరావు, రాచకొండ కనకయ్య, ఉట్కూరు సత్యనారాయణరావు, జలగం వెంగళరావులు ధైర్య సాహసాలతో ప్రభుత్వ బస్సును సరిహద్దు గ్రామాలకు తీసుకెళ్లిన ఘటన గురించి రాశారు బొమ్మకంటి. నారాయణ కమాండర్ ధైర్యంగా మహమ్మద్ ఇబ్రహీం అనే రజాకార్ దగ్గరున్న రైఫిల్ లాక్కుని, ఆయనను చంపిన సంఘటనను వివరించారు. నారాయణ చేసిన పనికి సిరిపురం గ్రామానికి చెందిన కందిబండ రంగారావుపై నేరారోపణ వేసి, రజాకార్లు ఆయనను ఖమ్మం జైలులో పెట్టారు. అదృష్టవశాత్తు ఆయనను కాల్చి చంపలేదు. దెబ్బతిన్న మహమ్మద్ ఇబ్రహీం అకృత్యాలను ఎదుర్కోవడానికి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు ముత్తగుడెం నాకాను ధ్వంసం చేశారు. నిజాం-ఆంధ్ర ప్రాంతాల మధ్య నున్న హద్దులను తీసేశారు. పటేల్ పట్వారీలు దఫ్తరాలను పారవేసి పన్నుల వసూళ్లను నిలిపేశారు. గవర్నమెంటుకు ఆదాయం సమకూరుస్తున్న తాటి-ఈత చెట్లను ప్రజలు నరికేశారు. రిజర్వ్ ఫారెస్టును నాశనం చేసి నష్టం కలిగించారు.

సిరిపురం పక్కనున్న భగవాన్ల పురం వంతెన పడగొట్టి, మిలిటరీ రాకుండా చేసి, మధిర పట్టణాన్ని ఆక్రమించుకోవాలని కార్యక్రమం వేసుకున్నారు. ఈ వార్తను ముందే పసికట్టిన ప్రభుత్వం మిలిటరీ-రజాకార్ల బలగాన్ని మధిరలో మొహరించారు. అయినా పోరాటం ఆగలేదు. ఒక రాత్రంతా సాగింది. హైదరాబాద్ సంస్థానం విలీన పోరాటంలో అతి ముఖ్య ఘట్టం "రిపబ్లిక్ స్థాపన". పరిటాల తొమ్మిది గ్రామాలు, వరంగల్ పన్నెండు గ్రామాలు, గానుగపాడు, చిలుకూరు, జాల ముడి, రామచంద్రాపురం, అమర వరం అనేవి రిపబ్లిక్ గ్రామాలు. బొమ్మకంటి, హయగ్రీవా చారి పరిటాల గ్రామాలను ఆక్రమించుకుని ప్రజా ప్రభుత్వం ఏర్పాటుచేయాలని నిర్ణయించుకున్నారు. టాక్సీ డ్రైవర్ దాస్, మధుసూదనరావు, రామకోటేశ్వరరావులతో కలిసి బొమ్మకంటి పోలంపల్లికి వచ్చి, ఆయుధాలు తీసుకుని పరిటాలకు వెళ్లారు. రామకోటేశ్వరరావు ప్రభృతులు వేసుకున్న మిలిటరీ దుస్తులను చూసి, ఆఫీసర్లని భావించి సైనిక వందనం చేశారు నిజాం మిలిటరీ వారు. వందన స్వీకారం చేసి లోపలికి వెళ్లి కూర్చున్న కాసేపటికి, మిగతా బలగం వచ్చి, నిజాం సైనికుల ఆయుధాలను లాక్కొని, స్వాధీనం చేసుకుని, పరిటాల ఆఫీసు భవనంలో సభ ఏర్పాటుచేశారు. వారం రోజుల్లో రిపబ్లిక్ అవతరణోత్సవం జరిగింది. మాడపాటిని వూరేగించారు.

నిజాం మిలిటరీ, రజాకార్ల దౌర్జన్యాలు రోజు-రోజుకు మితిమీరి పోయాయి. వ్యతిరేకంగా, సంస్థానమంతా ప్రజా ఉద్యమాలు తీవ్రంగా జరిగి నిజాం ప్రభుత్వం పూర్తిగా స్తంభించింది. ఎంత పోరాటం చేసినా-చేయగలిగినా, నిజాం ప్రభుత్వాన్ని కూల దోయగల శక్తి సమరయోధులకు లేదని భావించారు. మునగాల పరగణా చుట్టూ రజాకార్ల దాడులు పెరిగాయి. యూనియన్లో వున్న గ్రామాలపై కూడా దాడులు పెరిగాయి. నల్గొండ జిల్లా సరిహద్దు గ్రామాలైన తక్కెళ్లపాడు పరిసర ప్రాంతాలకు కోదాడలోని సైనికులతో ప్రమాదం ఏర్పడింది. "బందరు సముద్రంలో తుపాకీలు కడుగుతానని" ఖాసిం రజ్వీ ప్రగల్భాలు పలకడం మొదలైంది. ఆత్మ రక్షణ కొరకు, చిల్లకల్లు-విజయవాడ రహదారి వద్ద వున్న భారత సైన్యం కమాండర్ అమృత్ సింగ్‌ను, మద్రాస్ పోలీసు శాఖకు చెందిన డి.ఐ.జి సుబ్బరాయన్‌ను కలిసి వ్యూహాన్ని పన్నారు బొమ్మకంటి, మాడపాటి, హయగ్రీవా చారి. సెప్టెంబర్ 6, 1948 న యూనియన్ సైన్యాన్ని తరలించడం, దాని వెంట బొమ్మకంటి సత్యనారాయణ రావు వెళ్లడం జరిగింది. కోదాడను ఆక్రమించిన సైన్యం, నిజాం కమాండర్ షేర్ ఖాన్‌ను సైనికులతో సహా బంధించి తక్కెళ్లపాడు దగ్గరున్న రహదారిపై కూచోబెట్టి, తర్వాత విజయవాడకు తరలించారు. ప్రగల్భాలు పలికిన ఖాసిం రజ్వీ బృందం కనీసం గంట సేపుకూడా పోరాడ లేకపోయారు. నిజాం నవాబుకు యూనియన్ సైన్యానికి ఎదురు తిరిగి పోరాడే సత్తా లేదని నిరూపణ అయింది.

సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక ఏ మాత్రం ఆలశ్యం చేయదల్చుకోలేదు. సెప్టెంబర్ 13, 1948న పూనాలో వున్న ఆయన స్వయంగా, స్వీయ పర్యవేక్షణలో, యూనియన్ సైన్యాన్ని నలుమూలల నుండి హైదరాబాద్ సంస్థానంలోకి పంపించారు. సంస్థానంలోని రజాకార్లు ఎక్కడివారక్కడ పారిపోసాగారు. బందరు, విజయవాడల నుండి పోవాల్సిన సైన్యాన్ని హైదరాబాద్ రహదారిపై నిలిపారు. మూసీ నదిపై వున్న వంతెనను రజాకార్లు ధ్వంసం చేయడం, దాని స్థానంలో, భారత సైన్యం ఒక్క రోజులో ఇనుప వంతెన నిర్మించడం జరిగింది. చిట్యాల దగ్గరకు సైన్యం చేరుకోగానే కొంత సేపు ఆగమని సందేశం రావడంతో, బొమ్మకంటి సత్యనారాయణ రావు జీపులో డ్రైవర్ గోకుల్ దాస్తోగ, మాడపాటి రామచంద్ర రావుతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. సెప్టెంబర్ 17, 1948 నాటి రాత్రి బొల్లారంలో వున్న మున్షీ గారింట్లో భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోయారు. మర్నాడు స్వామి రామానంద తీర్థను విడుదల చేశారు. సెప్టెంబర్ 18, 1948 న మేజర్ జనరల్ చౌదరి భారత పతాకాన్ని ఎగురవేశారు. నిజాం హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో "విలీనమైంది". భారత ప్రభుత్వానికున్న ధర్మ బుద్ధి నిజాం నవాబు ఆస్తిపాస్తులను కాపాడుకునేందుకు దోహదపడిందనాలి.

విమోచన ఉద్యమ నాయకుల్లో జమలాపురం కేశవరావు, కొలిపాక కిషన్ రావు, కొలిపాక రామచంద్రరావు, కాళోజీ, దాశరధి, హీరా లాల్ మోరియా, అయితరాజు రాంరావు ఒకే జైల్లో వుండేవారు. బొమ్మకంటి, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి వంటి వారు వెలుపలనుంచి ఉద్యమానికి నాయకత్వం వహించారు. వీరిలో జలగం వెంగళరావు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. బొమ్మకంటి ఎమ్మెల్యే మాత్రమే కాగలిగినా దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా వున్నప్పుడు రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు.1916 ఆగస్ట్ నెలలో జన్మించిన బొమ్మకంటి 1984 ఆగస్ట్ నెలలో మరణించారు. నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా చెన్నారెడ్డి డెమోక్రటిక్ పార్టీ స్థాపించినప్పుడు బొమ్మకంటి కీలకపాత్ర పోషించారు. చెన్నారెడ్డితో ఎంత స్నేహం చేసినా, తాను నమ్మిన సమైక్యతా వాదానికే జీవించినంతకాలం కట్టుబడ్డ మహనీయుడాయన. విలీనమైనా, విమోచనైనా, దాని కొరకు పోరాడినవారు ఇటు తెలంగాణ లోను, అటు ఆంధ్ర ప్రాంతంలోను వున్నారనే ది వాస్తవం.