Thursday, November 29, 2012

ప్రాంతీయ పార్టీల జాతీయ ప్రభుత్వం: వనం జ్వాలా నరసింహారావు


ప్రాంతీయ పార్టీల జాతీయ ప్రభుత్వం
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (01-12-2012
          
2009 లోక్ సభ ఎన్నికల అనంతరం ఏర్పాటైన యుపిఎ లో, భాగస్వామ్య పక్షాలుగా తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె, ఎన్సీపి, నేషనల్ కాన్ఫరెన్స్, జె ఎం ఎం, ముస్లింలీగ్, మజ్లిస్ లతో సహా మరో రెండు చిన్న పార్టీలున్నాయి. వీరంతా కలిసి కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. సమాజ్ వాదీ పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చింది. ఐతే తృణమూల్ కాంగ్రెస్ అలిగి సంకీర్ణాన్ని విడిచి పెట్టిన తరువాత, మైనారిటీలో పడి పోయిన ప్రభుత్వానికి, సమాజ్ వాదీ పార్టీతో పాటు, ఉత్తర ప్రదేశ్ కు చెందిన బహుజన సమాజ్ పార్టీ కూడా తన మద్దతును ప్రకటించింది. ఆ తరువాత డిఎంకె కూడా ప్రభుత్వంపై అలక పూనింది. మధ్యలో మజ్లిస్ కాంగ్రెస్ కు తన మద్దతును ఉపసంహరించుకుంది. ఐనప్పటికీ యుపిఎకి పెద్దగా సంఖ్యాపరమైన నష్టం కలగలేదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఓటింగ్ తో కూడిన చర్చకు ప్రభుత్వం అంగీకరించిన నేపధ్యంలో లోక్ సభలో బలాబలాలను అంచనా వేసిన విశ్లేషకులకు, యుపిఎ బలం 265 మంది సభ్యులని తేలింది. 22 మంది సభ్యులున్న సమాజ్ వాదీ, 21 మంది సభ్యులున్న బహుజన సమాజ్ పార్టీ కూడా మద్దతిస్తే, దాని బలం 300 దాటుతుంది. కాకపోతే రాజ్యసభలో కొంత ఇబ్బంది కలగవచ్చు. అధికార పక్షం పరిస్థితి ఇలా వుంటే, ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేసే దశలో లేవు. అదే యుపిఎ ప్రభుత్వానికి శ్రీరామ రక్షగా మిగిలిపోయింది.


మరోవైపు బిజెపి సారధ్యంలోని ఎన్డీయే, మూడో, నాలుగో ఫ్రంటులు రాబోయే ఎన్నికల కోసం ఎవరి వ్యూహంలో వారున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని-యుపిఎని వీడిన అలనాటి మిత్ర పక్షాలు కాని, ఇంకా కలిసి వున్న ఇతర చిన్న-చితకా పార్టీలు కాని రాబోయే లోక్ సభ ఎన్నికలలో ఉమ్మడిగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా వున్నట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా అవి తనతో కలిసి ఎన్నికల ముందు అవగాహన కుదుర్చుకుని పోటీ చేసే కంటే, అవి వేరుగా పోటీ చేసి, వీలై నన్ని స్థానాలు గెల్చుకుని, ఎన్నికల అనంతరం సంకీర్ణంగా ఏర్పడితే మంచిదన్న ఆలోచనలో వుంది. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, యుపిఎ ప్రభుత్వం "యాంటీ ఇన్‍కంబెన్సీని" తట్టుకోవాల్సిన పరిస్థితిలో పడిపోయింది. దానికి తోడు అవినీతి ఆరోపణలు కూడా వున్నాయి. తన పార్టీకి ఎలాగూ గతంలో వచ్చి నన్ని స్థానాలు వచ్చే అవకాశం లేదని ఆ పార్టీ భావనలాగా కనిపిస్తోంది. తనతో కలిసి పోటీ చేసి తన మైలను భాగస్వామ్య పక్షాలు అంటించుకునేకంటే, విడిగా పోటీ చేసి మంచి పేరుతో కొన్ని స్థానాలు గెలవడం మంచిదన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా వుంది. అదే జరుగబోతుంది. ఈ నేపధ్యంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగబోతోంది అని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి, నేటిదాకా, గత ఆరు దశాబ్దాల కాలంలో, రాజకీయాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆ మార్పులను వివిధ కోణాలనుంచి పరిశీలన చేయవచ్చు. ఆ మార్పులలో ప్రధానంగా గమనించాల్సిన విషయం, ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత పెరగడం. ఒకప్పుడు ఏ ఒకటో-రెండో రాష్ట్రాలకే పరిమితమైన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ వేళ్ల్లూనుకు పోయి, పార్లమెంటులో తమ బలాన్ని చాటుకుంటున్నాయి. గత రెండు-మూడు సార్వత్రిక ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని గమనిస్తే, జాతీయ పార్టీలకంటే అవి అధికంగా వున్నాయి. అంటే జాతీయ పార్టీల ప్రాముఖ్యత జాతీయ స్థాయిలో తగ్గుకుంటూ పోతుంటే, ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరుక్కుంటూ పోతోంది. భారత్ దేశ రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న మరో ప్రధానాంశం, వోటు వేసే వారిలో అధిక శాతం మంది బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు చెందిన వారు కావడం. మహిళలు కూడా పెద్ద ఎత్తున పురుషులకంటే అధికంగా ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం. వీటన్నిటి ప్రభావం ఏ మేరకు రాబోయే సార్వత్రిక ఎన్నికలపై పడుతుందో విశ్లేషించాలంటే, ప్రాంతీయ పార్టీల గురించి మరింత లోతుగా అధ్యయనం చేయాలి. ఈ నేపధ్యంలో ఇక్కడ కొన్ని మౌలికాంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

ఒకవైపు ప్రాంతీయ పార్టీలు బలంగా పాతుకు పోతుంటే, మరొక వైపు, జాతీయ పార్టీలు బలహీన పడిపోవడంతో, పార్లమెంటులో మెజారిటీ స్థానాలను సంపాదించుకోవడం ఏ ఒక్క జాతీయ పార్టీకి సాధ్యపడదు. మెజారిటీకి దగ్గరగా రావడం కూడా కష్టమే. ఎప్పుడైతే, ఏ ఒక్క జాతీయ పార్టీ మెజారిటీ స్థానాలను సంపాదించుకోలేదో, ఇప్పటి లాగే, ప్రాంతీయ పార్టీలతో కలిసి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం మినహా గత్యంతరం లేదు. అలాంటప్పుడు ప్రాంతీయ పార్టీలతో అవగాహన ఎన్నికల ముందా? తరువాతా? అన్న ప్రశ్న ఉదయించక మానదు. ఉదాహరణకు 2009 ఎన్నికలే తీసుకుంటే, ఎన్నికల ముందు ఎక్కువగా కలిసి కట్టుగా-ఉమ్మడిగా పోటీ చేయడం జరగలేదు. ఎన్నికల అనంతరమే అవగాహన కొచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అలా అని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేయలేదని అర్థం కాదు. ఎన్నికల ముందు అవగాహన వుంటే సంకీర్ణాలు మనుగడ సాగించడం సులభం. ఎన్నికల అనంతరం అవగాహనకు వస్తే, బెదిరింపుల మధ్య, సంకీర్ణ ప్రభుత్వం మనుగడ కష్టం అవుతుంది. 1999-2004 మధ్య అధికారంలో వున్న బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వమైనా,  2004-2009 మధ్య అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వమైనా, అస్థిరత-స్థిరత్వం మధ్య ఊగిసలాడినప్పటికీ, పూర్తికాలం పాటు కొనసాగాయి. అది ఒక విధంగా గొప్ప విషయమే. ఇక 2009 తరువాత అధికారంలో కొచ్చిన యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం అహర్నిశలూ బెదిరింపులను ఎదుర్కుంటూనే మనుగడ సాగిస్తోంది. వస్తున్న బెదిరింపులన్నీ ప్రాంతీయ పార్టీల నుంచే కావడం విశేషం.

సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో, పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల సంఖ్య లెక్కకు మించి పోయింది. సభలో జరిగే చర్చలలో నాణ్యత లోపించడంతో పాటు, సభ నిర్వహణ కష్ట సాధ్యమై పోయి, వాయిదాపడడం సర్వసామాన్యమైన విషయంగా మారిపోయింది. రకరకాల పార్లమెంటరీ తీర్మానాలతో సభ ఏనాడూ సజావుగా సాగనీయడం లేదు ప్రతిపక్షాలు. అధికార పక్షంలోని భాగస్వామ్య పార్టీలకు చెందిన ప్రాంతీయ పార్టీ వారు కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అనేక చర్యలకు పాలపడుతున్నారు. పర్యవసానంగా సభలో చర్చించి సభ ఆమోదం పొందాల్సిన అనేక బిల్లులు ప్రవేశపెట్టడానికి కూడా నోచుకోక పోవడం దురదృష్టం. ప్రవేశపెట్టిన ఎన్నో బిల్లులు చర్చ జరగకపోవడంతో చాలా కాలంపాటు పెండింగ్‌లో పడిపోతున్నాయి. పార్టీల సంఖ్య పెరగడంతో పార్లమెంటరీ ప్రక్రియకే ముప్పు వాటిల్లడంతో పాటు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారిపోయింది.

ఆరు దశాబ్దాల భారతదేశ రాజకీయ రంగంలో గణనీయమైన మార్పులు రావడంతోను, ప్రాంతీయ పార్టీలు అధికసంఖ్యలో ఆవిర్భవించడంతోను, ఎన్నికల ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయింది. ఒక్కో ఎన్నిక జరిగే కొద్దీ, పోటీలో వుండే పార్టీల సంఖ్య పెరగ సాగింది. 1952 లోక్ సభ ఎన్నికలలో కేవలం  55 పార్టీలు మాత్రమే రంగంలో వుంటే,  2009 ఎన్నికల కల్లా వాటి సంఖ్య 370 కి చేరుకుంది. ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే, 1957 లో మాత్రమే అతి తక్కువగా కేవలం 16 పార్టీలు మాత్రమే పోటీలో వుండగా, అత్యంత అధిక సంఖ్యలో 2009 లో పోటీకి దిగాయి. వీటి సంఖ్య రాబోయే ఎన్నికలలో ఇంకా పెరగొచ్చు. మొదటి ఎన్నికలలో పోటీ చేసిన 55 పార్టీలలో, 18 రాష్ట్ర స్థాయి పార్టీలు, 29 రిజిస్టర్డ్ పార్టీలు కాగా జాతీయ పార్టీల సంఖ్య కేవలం 8 మాత్రమే!  వాటి సంఖ్య 2004 లో 6 కు పడి పోయింది. కాగా అదే ఎన్నికలలో పోటీలో వున్న 230 పార్టీలలో, 36 ప్రాంతీయ పార్టీలు, 188 రిజిస్టర్డ్ పార్టీలు వున్నాయి. దానర్థం ఒకవైపు ప్రాంతీయ-రిజిస్టర్డ్ పార్టీల సంఖ్య పెరుగుతూ పోతుంటే, జాతీయ పార్టీల సంఖ్య తగ్గుకుంటూ పోతోంది. అదే విధంగా 1952 లోక్ సభ ఎన్నికల అనంతరం పార్లమెంటులో 22 పార్టీలకు ప్రాతినిధ్యం లభించగా, 2009 ఎన్నికల అనంతరం 37 పార్టీలకు ప్రాతినిధ్యం లభించింది. అత్యంత తక్కువగా కేవలం 12 పార్టీలకు మాత్రమే ప్రాతినిధ్యం లభించింది 1957 ఎన్నికల అనంతరం. ఏ విధంగా పార్టీల సంఖ్య, అవి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే వాటి సంఖ్య పెరుగుకుంటూ పోతుందో ఈ లెక్కలు తెలియచేస్తాయి.

ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరగడమంటే, రాజకీయ పోటీ తత్వంలో మార్పుల రావడమే. మొదట్లో, రాష్ట్ర శాసన సభలలో జాతీయ పార్టీలకు పోటీగా వున్న ప్రాంతీయ పార్టీలు దరిమిలా పార్లమెంటులో జాతీయ పార్టీలను శాసించే స్థాయికి చేరుకున్నాయి. ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో ప్రాంతీయ పార్టీకి ప్రజల మద్దతు-ఓటర్ల మద్దతు లభిస్తున్న తీరుతెన్నులను పరిశీలిస్తే, వారు పూర్తిగా జాతీయ పార్టీలను మరిచిపోతున్నారే మో అనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాలలో ప్రధాన పోటీ ఒక ప్రాంతీయ పార్టీకి, ఏదో ఒక జాతీయ పార్టీకి మధ్యన వుంటే, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఆ పోటీ ఒక ప్రాంతీయ పార్టీకి, మరో ప్రాంతీయ పార్టీకి మధ్యనే వుంటోంది. ఎన్నికల రంగంలో ఆ రాష్ట్రాలలో జాతీయ పార్టీలు మూడు-నాలుగు స్థానానికి పరిమితమై పోవడం కూడా కష్టమవుతోంది. ప్రాంతీయ పార్టీలతో పోల్చి చూస్తే, దేశం మొత్తం మీద జాతీయ పార్టీలకు పోలైన ఓట్ల శాతం తగ్గుకుంటూ వస్తోంది. ప్రధానంగా 1996 ఎన్నికల తరువాత ఈ పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఒకవైపు గెలిచిన స్థానాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్న ప్రాంతీయ పార్టీలు, మరో పక్క ఓటింగ్ శాతాన్ని కూడా పెంచుకుంటున్నాయి. 1984 లో ప్రాంతీయ పార్టీలన్నిటికీ కలిపి 11.2% ఓట్లు రాగా, 2009 ఎన్నికల నాటికి 28.4% కి పెరిగింది. రాబోయే ఎన్నికలలో 30% దాటినా ఆశ్చర్య పోనక్కరలేదు. దానర్థం జాతీయ పార్టీలకు కనీసం రెండు వందల స్థానాలన్నా రావడం కష్టమే!  ఎక్కువమంది ఓటర్లలో జాతీయ పార్టీలకంటే ప్రాంతీయ పార్టీలే మంచివన్న అభిప్రాయం వుండి వుండాలి. రాష్ట్రాల పాలన ప్రాంతీయ పార్టీల చేతుల్లో వుండాలని కోరుకోవడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు అనుగుణంగా కేంద్రం నడుచుకోవాలంటే, పార్లమెంటులో కూడా వాటికి గణనీయమైన స్థానాలను గెలిపించాలని ఓటర్లు భావిస్తున్నారు.

ఈ నేపధ్యంలో రానున్న లోక్ సభ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలదే హవా కానుంది. ఎన్నికల అనంతరం యుపిఎ, ఎన్డీఏ లలో ఎవరు ఎక్కువగా ప్రాంతీయ పార్టీలను ఆకర్షించుకోగలరో వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. ముఖ్యంగా డిఎంకె, అన్నా డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ, బహుజన సమాజ్ పార్టీ, తెలుగు దేశం, ఎన్సీపి, జనతాదళ్, శివ సేన, అకాలీదళ్, బిజూ జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్, తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్సార్సీపి లాంటి పార్టీల మద్దతు కీలకమవుతుంది. వీటిలో చాలా వరకు, ప్రస్తుతానికి యుపిఎ, ఎన్డీఏ లలో ఏదో ఒక దాంట్లో భాగస్వాములుగా వున్న ఈ పార్టీలు అన్నీ కలిసి సుమారు 200-250 స్థానాలు గెల్చుకునే అవకాశం వుంది. వీరంతా కలిసి ఒక ప్రాంతీయ పార్టీల ఫ్రంట్‌గా ఏర్పడితే జాతీయ పార్టీల పరిస్థితి డోలాయమానంలో పడినట్లే! అందుకే రాబోయే ది ప్రాంతీయ పార్టీల జాతీయ ప్రభుత్వం. తస్మాత్ జాగ్రత్త! 

Wednesday, November 28, 2012

గవర్నర్‍ వ్యవస్థను విమర్శించడం ఎంతవరకు సబబు?: వనం జ్వాలా నరసింహారావు


గవర్నర్‍ వ్యవస్థను విమర్శించడం 
ఎంతవరకు సబబు?
    వనం జ్వాలా నరసింహారావు
రాజ్యాంగ వ్యవస్థలపై రాజకీయాలు వద్దు ! 
నమస్తే తెలంగాణ (4-12-2012)                     

రాష్ట్ర గవర్నర్‌ను కలవడానికి తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు మూడు రోజుల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయన సమయం ఇవ్వడం లేదని, ధర్మాన కేసు లో తమ పార్టీ నాయకుల విజ్ఞప్తిని వివరించడానికి అవకాశం కల్పించడం లేదని, గవర్నర్ రాజ్యాంగ రక్షకునిగా వ్యవహరించాలి కాని, సోనియా ఏజెంటుగా వ్యవహరిస్తే తాము గవర్నర్ల వ్యవస్థపైనే పోరాడాల్సి ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగానే పరిగణించాలి. గవర్నర్ రవీంద్ర భారతికి వెళ్లినా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నా తమకు అభ్యంతరం లేదని, ఢిల్లీ యాత్రలు చేసినా పరవాలేదని, రాజ్యాంగబద్ధంగా గవర్నర్ చేయాల్సిన పని చేయాలని, చేయకపోతే తమ పార్టీ నిలదీయడం ఖాయమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా, గతంలో రహస్య గూఢచారి ఉద్యోగం చేసిన నరసింహన్ ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో కూడా అదే పని చేస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి. గవర్నర్ ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని, రాష్ట్రపతులను కలవడంలో తప్పు లేదు కాని, సోనియాను ఎలా కలుస్తారని ప్రశ్నించారు. రాజ్‌భవన్‌ను గాంధీ భవన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ఒక సారి, నలుగురు రాష్ట్ర మంత్రుల, ఇద్దరు పార్లమెంట్ సభ్యుల సమక్షంలో, కొందరు గ్రామ సర్పంచులను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ నరసింహన్, తనను తాను "చెడ్డ గవర్నర్" గా అభివర్ణించుకున్నారు. అంతటితో ఆగకుండా, ఇక ముందు ఎక్కువ కాలం తను రాజ్‌భవన్ లో గడపనని, ప్రజల మధ్య గడుపుతానని, వారి కష్ట సుఖాలను విచారిస్తానని హామీ కూడా ఇచ్చారు. గవర్నర్ తరచూ ఢిల్లీకి వెళ్లి నివేదికలు ఇస్తున్నారన్న విమర్శలూ వున్నాయి. పాలనలో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శా వుంది. ధర్మాన కేసును ఆయన ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే! కొన్ని కొన్ని విషయాలలో ఆయన నిర్ణయం ఎలా వుంటుందో నని ఎదురు చూడని పార్టీ రాష్ట్రంలో లేదు. ఆయన నిర్ణయాలు ఒక్కోసారి ఒక్కో పార్టీకి సంతోషకరం గా వుంటున్నాయి. మరి కొందరికి ఇబ్బందులు కలగ చేస్తున్నాయి. 



కొందరు గవర్నర్లు ఇలా వ్యవహరించడం ఈ దేశంలో, ప్రత్యేకించి మన రాష్ట్రంలో కొత్తే మీ కాదు. 1977-78 మధ్య కాలంలో రాష్ట్ర గవర్నర్ గా పదిహేను నెలలు పనిచేసిన శారదా ముఖర్జీ, 1985-90 మధ్య కాలంలో నాలుగు సంవత్సరాలకు పైగా పనిచేసిన కుముద్ బెన్ జోషి, భిన్న రీతుల్లో వ్యవహరించినప్పటికీ, ప్రస్తుత గవర్నర్ తో పోల్చదగిన వారని అనాలి. దివి సీమను అతలాకుతలం చేసిన భీకరమైన తుఫాను నేపధ్యంలో, స్వచ్చంద సంస్థల పనితీరుకు మార్గదర్శకంగా-ధీటుగా పనిచేసే తరహాలో "చేతన" సంస్థను స్థాపించి, సహాయ పునరావాస కార్యక్రమాలను చేపట్టి, రాష్ట్ర ప్రజల-పాలకుల అభినందనలు అందుకున్నారు శారదా ముఖర్జీ. చేతన సంస్థకు, గవర్నర్ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రి ఉపాధ్యక్షులుగా వ్యవహరించే పద్ధతిలో సంస్థ నియమ నిబంధనలను అప్పటి గవర్నర్ కార్యదర్శి మోహన్ కందా తోడ్పాటుతో రూపొందించారా మె. దరిమిలా మోహన్ కందా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. శారదా ముఖర్జీ గుజరాత్ గవర్నర్‍గా వెళ్లిపోయిన తర్వాత చేతన కార్యకలాపాలు అనతి కాలంలోనే ఆగిపోయాయి. ఏడేళ్ల తర్వాత గవర్నర్ గా వచ్చిన కుముద్ బెన్ జోషి, చేతన సంస్థను పునరుద్ధరించడంతో పాటు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ (నీసా) అనే మరో స్వచ్చంద సంస్థను స్థాపించి, పలు ప్రజోపయోగమైన కార్యక్రమాలను చేపట్టారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుతో అనేక సందర్భాల్లో విభేదించిందన్నపేరు తెచ్చుకున్న కుముద్ బెన్ జోషి, ఆ రెండు సంస్థల కార్య కలాపాల విషయంలో ఆయన సలహా సంప్రదింపులను "కూడా" తీసుకునేవారు. జోగినిల దురాచారం రూపుమాపే దిశగా రాజ్ భవన్ దర్బార్ హాలులో ఆ అభాగినులకు వివాహం జరిపించడం, రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు, కుముద్ బెన్ జోషి ఆధ్వర్యంలోని స్వచ్చంద సంస్థలు చేపట్టిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు.

2009 సెప్టెంబర్ నెలలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు రోశయ్య ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత, ఆ తరువాత ఆయన వారసుడిగా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తదుపరి, సహేతుకమైనా-కాకపోయినా, స్వపక్షాల-విపక్షాల విమర్శలకు దారితీసే పద్ధతిలో ప్రభుత్వ పాలన సాగుతోంది. దానికి బాధ్యుడు అలనాటి ముఖ్యమంత్రి రోశయ్యా? నేటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డా? అయిష్టంగా ఆయన మంత్రివర్గంలో కొనసాగుతున్న కొందరు మంత్రులా?ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తీరని రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్సార్సీపి నాయకుడు జగనా? ఆయనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిచ్చి ముఖ్యమంత్రిని ఇరుకున పెడుతున్న కొందరు కాంగ్రెస్ నాయకులా? తెలంగాణా వాదులా? సహకరించని ప్రకృతా? ఆర్థిక ఇబ్బందులా? కిరణ్ కుమార్ రెడ్డికి సంపూర్ణ అధికారాలు ఇవ్వని కాంగ్రెస్ అధిష్టానమా?. కారణాలు ఏమైనా వీటికి సంబంధం లేని ప్రజలై తే ఇబ్బందులకు లోనవుతున్న మాట వాస్తవం.

పలు సందర్భాలలో-వేరు, వేరు సందర్భాలలో, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, సంబంధిత గవర్నర్ వ్యవహారం నచ్చనప్పుడు, గవర్నర్ పాత్రను విమర్శించడంతో సరిపుచ్చుకోకుండా, గవర్నర్ వ్యవస్థనే రద్దుచేయమని కోరడం అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా, అధికారంలో లేనప్పుడు ప్రతి పార్టీ చేసిన పని అదే. గవర్నర్లు తప్పుచేయలేదని కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన గవర్నర్లు లేరనీ కాదు. అంత మాత్రాన ఆ వ్యవస్థనే రద్దు చేయాలని కోరడం సమంజసం కాదు. రాజ్యాంగ స్ఫూర్తికి-ప్రకరణాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్న గవర్నర్లను పదవినుంచి తొలగించమని అడిగే హక్కుందికాని, వ్యవస్థనే ప్రశ్నించే విధంగా రాజకీయ నాయకులు ప్రకటనలు ఇవ్వడం తగదు. రాజ్యాంగపరంగా ఏర్పడ్డ రాష్ట్రపతి, గవర్నర్ పదవులు ఎల్లవేళలా "అలంకారప్రాయమైనవేనని" భావించడం తప్పు. ఎన్టీ రామారావును 1984 లో నాటి గవర్నర్ రామ్ లాల్ తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యంపై దెబ్బతీశారని అభియోగం మోపుతూ, న్యాయం కావాలని కోరుతూ తెలుగుదేశం నాయకత్వం రాష్ట్రపతి వద్దకు పోయింది గాని, ప్రధాన మంత్రి వద్దకు కాదే ! గవర్నర్ ను, గవర్నర్ వ్యవస్థను విమర్శించడానికి, సొంత కోణం నుంచి చూడకుండా, రాజ్యాంగ కోణం నుంచి చూడడం మంచిది. ప్రధాన మంత్రి వద్దకు కాకుండా, న్యాయం కొరకు రాష్ట్రపతి వద్దకు పోవడానికి కారణం, ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించే వాడు కాబట్టే.

కష్ట కాలంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధి (ప్రధాన మంత్రి స్థాయి వారైనా సరే) కంటే, రాజ్యాంగానికి బద్ధుడైన అధినేత (రాష్ట్ర పతి, గవర్నర్) అవసరమని, న్యాయం కోసం, ముఖ్యమంత్రి స్థాయి వాడే, ఎన్నికైన ప్రజా ప్రతినిధి-ప్రధాన మంత్రి వద్దకు పోలే దో, అలానే, రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అవసరమైనప్పుడు-న్యాయం జరగలేదని భావించినప్పుడు, గవర్నర్ వైపు దృష్టి సారించడం తప్పు కాదు. వారు గవర్నర్ దగ్గరకు పోయినా, లేక, గవర్నరే వారి దగ్గరకు వచ్చినా, ఉద్దేశం ఒకటే. కష్ట కాలంలో, గవర్నర్ నుంచి సహాయం కోరుకునే వారు, కేవలం ఎన్నికైన ప్రజా ప్రతినిధులే కావాలని లేదు. సామాన్య ప్రజానీకం కూడా కావచ్చు. బహుశా రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలను, రాజ్యాంగ అధినేతగా, తరచూ కేంద్రానికి-ప్రధానికి-రాష్ట్రపతికి తెలియచేయడం మంచిదని గవర్నర్ నరసింహన్ భావిస్తుండవచ్చు. ఆయన చర్యలను ఆక్షేపించడం గాని, వాటికి దురుద్దేశం ఆపాదించడం కాని, అపార్థాలు వెతకడం గాని చేయడం భావ్యం కాదు. భారత దేశంలో రాజకీయ పార్టీలు కోకొల్లలు. ఒక్కో పార్టీకి, ఒక్కో అవసరానికి, ఒక్కో రకమైన సిద్ధాంతం వుంటుంది. ప్రాంతీయ పరమైన, భాషా పరమైన, కుల-మత పరమైన పార్టీలెన్నో వున్నాయి. ఆ పార్టీల పక్షాన ఎన్నికై అధికారంలోకి వచ్చినవారు-ప్రతిపక్షంలో కూర్చున్న వారు, వారి-వారి పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా వ్యవహరించే ఆస్కారం లేదు. మత విద్వేషాన్ని, భాషా దురభిమానాన్ని, ఒక ప్రాంతం వారు మరో ప్రాంతం వారిని దోపిడీకి గురి చేయడాన్ని రెచ్చగొట్టినప్పుడు, కలిగే దుష్ఫలితాలను అదుపులో పెట్టడంలో ప్రజా ప్రతినిధులు (ముఖ్యమంత్రి-మంత్రి వర్గ స్థాయి వారితో సహా) విఫలమైతే, రాజ్యాంగానికి కట్టుబడ్డ గవర్నర్ పరిస్థితిని చక్కదిద్దడానికి, నెలకో-వారానికో ఢిల్లీకి వెళ్లి వస్తే తప్పేంటి?

గవర్నర్ పేరుపైన ప్రభుత్వ నిర్ణయాలు, ప్రకటనలు, ఉత్తర్వులు జారీ కావడం తెలిసిన విషయమే. రాజకీయ నాయకులు ఎన్ని చెప్పినప్పటికీ, గవర్నర్ పాత్రకు ప్రాధాన్యత వుందని, ఏ ఐఏఎస్ అధికారిని అడిగినా ఒప్పుకోవడానికి క్షణం కూడా ఆలోచించరు. గవర్నర్ కేవలం రాజ్యాంగంలో పొందుపరచిన వ్యక్తి మాత్రమే కాదు. "రబ్బర్ స్టాంపు" అసలే కాదు. పలు సాంఘిక-సంక్షేమ కార్యక్రమాలకు రాజ్యాంగ రీత్యా పర్యవేక్షకుడు. ఆయన ఆధ్వర్యంలో రెడ్ క్రాస్, హరిజన-గిరిజన సంక్షేమం, కుష్టువారి పునరావాసం, విలువ కట్టలేని తర-తరాల వారసత్వ సంపద పరిరక్షణ, విశ్వ విద్యాలయాల వ్యవహారాలు, రక-రకాల రాజ్యాంగం నిర్దేశించిన సహాయ కార్యక్రమాలు అమలు చేయాల్సి వుంటుంది. బడుగు వర్గాల అభ్యున్నతి ఆయన కనీస ధర్మం. రాష్ట్ర ప్రజల్లో ఐకమత్యానికి, సమగ్రతా భావాలకు, స్థిరత్వానికి కూడా గవర్నర్ బాధ్యుడు.

రాజ్యాంగం నిర్దేశించిన విధంగా, గవర్నర్ ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సహచరులకు కష్ట-సుఖాలలో తోచిన సలహాలు ఇవ్వడం తప్పే మీ కాదు. ఆ మధ్యన ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యదర్శి స్థాయి అధికారులను రప్పించుకుని, శాఖాపరంగా తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు గవర్నర్. దాన్నీ విమర్శించిన వారున్నారు. తన ప్రభుత్వ కార్య కలాపాలను తెలుసుకుంటున్నాడే తప్ప అందులో దురుద్దేశం ఏమీ లేదు కదా ! గవర్నర్ మంత్రివర్గం సభ్యులకు ఇచ్చిన సలహాలను వారెంతవరకు పాటించుతారనేది, గవర్నర్ ఇచ్చే విషయం పైన-మంత్రులు ఆ సలహాను ఏ కోణం నుంచి చూస్తారన్న అంశంపైన ఆధార పడి వుంటుంది. త్రివేది గవర్నర్ గా వున్నప్పుడు, దైనందిన పాలనా వ్యవహారాల్లో ఆయన మంత్రులకు సలహాలను ఇచ్చేవారని-వాటిని వారు మరో ఆలోచన లేకుండా తిరస్కరించే వారని చెప్పుకునేవారు. బహుశా ఆ నేపధ్యంలో, సలహాలను ఇచ్చే శైలిలో మార్పొచ్చిందేమో ! పట్టం థాను పిళ్లై గవర్నర్ గా వున్నప్పుడు, హరిజన వసతి గృహాల విషయంలో జోక్యం చేసుకుని, వాటి స్థితిగతుల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆ సలహాను వారు పాటించారు. ప్రస్తుత గవర్నర్ నరసింహన్ ఒకసారి తన ఏలూరు పర్యటనలో భాగంగా, నిర్మల్ పురస్కారాలను అందుకున్న గ్రామాలకు కేంద్ర ప్రోత్సాహానికి అదనంగా మరో లక్ష రూపాయలను ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఆయన కోరికను వెంటనే అంగీకరించిన వ్యవసాయ మంత్రి రఘువీరా రెడ్డి దానికి సంబంధించిన ప్రకటన తక్షణమే చేశారు. ఏ విధానమైనా, ఆచరణలో పెట్టేవారి నిజాయితీని బట్టి సానుకూలమవుతుంది. వ్యక్తిగతమైన అభిమానాలకు-దురభిమానాలకు పాల్పడితే దేశ శ్రేయస్సు, రాష్ట్ర శ్రేయస్సు దెబ్బతింటుంది.

ఏదేమైనా, తొందరపడి గవర్నర్‌ను విమర్శించడం, వ్యవస్థనే కించపరచడం భావ్యం కాదు. రాజ్యాంగ బాధ్యతలు తెలియకుండా గవర్నర్ వ్యవహరిస్తాడని విమర్శించడం పొరపాటు.

Saturday, November 17, 2012

ఇక రాహుల్ రాజ్యమేనా?: వనం జ్వాలా నరసింహారావు


ఇక రాహుల్ రాజ్యమేనా?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (18-11-2012)

అందరూ అనుకున్నట్లే అయింది. "దేశ్ కీ నేతా రాహుల్ గాంధీ" అన్న ఆబాల గోపాలం కాంగ్రెస్ వర్గాల నినాదాలు సోనియా గాంధీ చెవిన పడ్డాయి. పన్నెండేళ్లకు పైగా మౌన ముద్ర వహించిన మేడం, కార్యకర్తల మొర ఆలకించారు. తనయుడు రాహుల్ గాంధీకి గురుతర బాధ్యత అప్పగించారు. గతంలో ఆయన ఇంత పెద్ద బాధ్యత నిర్వహించలేదని కాదు. ఐతే, అది ఏదో ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమై పోయింది. ఇప్పుడేమో యావత్ భారత దేశానికి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో పార్టీ పరంగా దిశా నిర్దేశం చేయాల్సిన బృహత్తర బాధ్యత అప్పగించబడింది. బహుశా రాహుల్ దృష్టికి రాకుండా ఏ ఒక్కరు కూడా ఎన్నికలలో పోటీ చేసే వీలుండదేమో! ముఖ్యంగా లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితా మొత్తాన్ని ఆయన చేతుల మీదుగానే రూపొందించాల్సి వుంటుంది. తన టీంను తానలా పూర్తిగా తయారు చేసుకుని, ఎన్నికల రంగంలో దిగి, విజయం సాధించి, ఆ విధంగా పార్టీని బలోపేతం చేసి, ఎన్నికల అనంతరం ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలన్న ఆలోచన సోనియా గాంధీ చేసి వుండవచ్చు. ఐతే ఇదంతా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించే స్థానాలపైన, దాని ఎన్నికల ముందస్తు-ఎన్నికల తదనంతరం అవగాహన కొచ్చే మిత్ర పక్షాలు సాధించే స్థానాలపైన ఆధార పడి వుంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో కొనసాగుతున్న యుపిఎ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలుగా వున్న పార్టీలు ఒక్కొక్కటిగా ప్రభుత్వానికి-కాంగ్రెస్ పార్టీకి మద్దతును ఉపసంహరించుకుంటున్నాయి. కొన్ని పార్టీలు గోపీలుగా వుంటూ ఎప్పటికప్పుడు ఇరుకున పెట్టే ప్రయత్నంలో వున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు కేంద్రంలో కొనసాగుతున్నది మైనారిటీ ప్రభుత్వమే! సంఖ్యాపరంగా చూస్తే అది ఏ క్షణాన్నైనా కూలి పోవడానికి సిద్ధంగా వుందనాలి. పూర్తిగా దింపుడు కళ్లెం ఆశ మీద వుంది. తృణమూల్ ప్రభుత్వంలోంచి వైదొలగిన తరువాత ప్రారంభమైన ఈ పతనం కరుణానిధి అలకతో పతాక స్థాయికి చేరుకుంది. మజ్లిస్ కూడా దూరమైంది. మాయావతి, ములాయంలు దోబూచులాడుతున్నారు. ఈ నేపధ్యంలో ముందస్తు ఎన్నికలకు పోవడం కంటే కాంగ్రెస్ పార్టీకి మరో గత్యంతరం లేనే లేదు. అదే పనిలో మునిగి పోయింది కాంగ్రెస్ పార్టీ, దాని నూతన బాస్ రాహుల్ గాంధీ.


అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోక్ సభ ఎన్నికలకు, అవి కూడా అనుకున్న దానికంటే ముందుగానే జరుగవచ్చన్న ఊహాగానాల నేపధ్యంలో, పూర్తి స్థాయిలో సమాయత్తమౌతోంది. అందులో భాగంగా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కొందరు కొత్త వారిని చేర్చుకుంటే, మరి కొందరు పాతవారిని పార్టీ పని కోసమని బయటకు పంపింది. పార్టీని నష్ట పరుస్తున్నారని భావించిన మరి కొందరిని ఏ పదవీ ఇవ్వకుండా పక్కన పెట్టింది. అలక పానుపు ఎక్కిన వారిని ఓదారుస్తోంది. ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్ యువ నేత రాహుల్‌గాంధీ తనదైన శైలిలో వేట ప్రారంభించారు. అభ్యర్థుల ఎంపికలో భాగంగా, వివిధ నియోజక వర్గాలలో భారీ స్థాయిలో సమాచార సేకరణకు శ్రీకారం చుట్టారు. విజయావకాశాలున్న నేతలు, ఇతర ప్రముఖుల కోసం ఆయన లోతుగా ఆరా తీస్తున్నారు. వారు పార్టీ సభ్యులు కాకపోతే, ఎలా వారిని తమలో చేర్చుకోవాలన్న అంశంపైనా దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం ప్రతి లోక్‌సభ స్థానానికీ తన సొంత వేగులను పంపుతున్నారు! ప్రతి సెగ్మెంట్ నుంచీ ప్రాధాన్యత క్రమంలో ముగ్గురి పేర్లను వారు గుర్తించి డిసెంబర్ తొలి వారానికల్లా రాహుల్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇందుకొరకు, స్వయానా రాహుల్ గాంధీ తనదైన శైలిలో ఎంపిక చేసి, ప్రత్యేక తరహా శిక్షణ ఇచ్చిన పరిశీలకులు, ఆంధ్ర ప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఇలా వివిధ రాష్ట్రాలకు పోయే బృంద సభ్యులలో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు నేతలు కూడా వున్నారు. ఈ సభ్యులకు పది-పదిహేను లోక్ సభ సెగ్మెంట్ల బాధ్యతలు అప్పగించారు. దేశవ్యాప్తంగా వారు ఇప్పటికే రంగంలోకి దిగారు. పార్టీ నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు, పలు వర్గాలకు చెందిన ప్రజలతో మాట్లాడి.. గెలుపు గుర్రాలు కాగల అభ్యర్థులను గుర్తించనున్నారు.

ఇంతకూ ఈ పరిశీలకులు చేయాల్సింది ఏంటి? ముందుగా తమకిచ్చిన సుమారు ముప్పై ప్రశ్నలతో కూడిన పత్రాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలి. దీని కొరకు శిక్షణా కార్యక్రమంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు వినికిడి. అభ్యర్థుల ఎంపిక పరిశీలన ఏ కోణంలో జరగాలి అన్న అంశంపై వ్యక్తిగత నైపుణ్యంతో కూడిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానికంగా గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయో అంచనా వేయడం పరిశీలకుల ప్రధమ కర్తవ్యం. ఒక్కో నియోజక వర్గానికి మూడేసి పేర్లతో కూడిన జాబితా రూపొందించాలి. వారి విజయావకాశాలకు వివిధ కోణాల నుంచి గల కారణాలను విశ్లేషణా పూర్వకంగా అంచనా వేయాలి. పరిశీలనా క్రమంలో మండల స్థాయి పైనుంచి, జిల్లా స్థాయి-రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలను సేకరించి తమ విశ్లేషణకు వాటిని జోడించాలి. సిట్టింగ్ ఎంపీల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వారికి టికెట్ ఇవ్వకుండా వుండడానికి గల కారణాలను సహేతుకంగా పొందుపరచాలి. వీటన్నింటి కీ అదనంగా పరిశీలకులు సిఫార్సు చేస్తున్న అభ్యర్థుల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి వారు ఆ కోణంలో గెలుపు గుర్రాలా? కారా? అనేది తేల్చి చెప్పాలి. కిందటి ఎన్నికలలో పోటీ చేసి ఓడి పోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి దారితీసిన కారణాలను అంచనా వేసి, అవి సరి చేయడానికి, అదే అభ్యర్థి సరైన వాడా? కాదా? అనేది విశ్లేషణ చేయాలి. ఇక అభ్యర్థి సామాజిక నేపధ్యం, కులం, మతం, గుణగణాలు, నిజాయితీ తనం, ఎలాగూ అంచనా వేయాలి. అభిప్రాయ సేకరణ కొరకు కేవలం పార్టీ ప్రముఖులనే కాకుండా, పార్టీతో అంతో-ఇంతో ప్రత్యక్షంగానో-పరోక్షంగానో అనుబంధం వున్న వారిని, స్థానికంగా ప్రముఖ వ్యాపార వేత్తలను, స్వచ్చంద సంస్థల కార్యకర్తలను, ప్రభుత్వేతర సంఘాల నాయకులను, పాత్రికేయులను, ఇతర ప్రముఖులను కూడా సంప్రదించాలి. మొత్తం మీద రాహుల గాంధీ అంచనాల మేరకు నివేదిక రూపొందించాలి. ఎవరికి టికెట్ కేటాయించాలనేది రాహుల గాంధీకి వదిలేయాలి!

రాహుల్ గాంధీ రాజకీయం ఫలిస్తుందా? ఆయన అనుకున్న అభ్యర్థులు దొరుకుతారా? అసలాయన మనస్సులో ఏముంది? ఈ కసరత్తంతా ఏదో విధంగా గెలిచే అభ్యర్థుల కొరకా? లేక, భవిష్యత్‍లో అవినీతికి తావులేని అభ్యర్థులనే రంగంలోకి దింపాలన్న మంచి ఆలోచనా? ఇవ్వాళ దేశవ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతోంది. సాక్షాత్తు రాహుల్ కుటుంబ సభ్యుడైన వాద్రాపైనే అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో, తాను అవినీతికి దూరం అని తెలిపే విధంగా అభ్యర్థుల ఎంపికకు రాహుల్ శ్రీకారం చుట్ట దల్చుకున్నాడా? ఆయన నిజంగా అలా భావిస్తే అలాంటి అభ్యర్థులు దొరకడం అంత సులువైన పనేనా? నేర చరిత్ర లేనివారు, నీతిమంతులు, కుల-మతాలకు అతీతులు అసలెవరైనా మిగిలారా? కోట్ల రూపాయలలో ఆర్థిక స్తోమత లేనివారు ఎన్నికలలో నిలబడి గెలిచే పరిస్థితులున్నాయా? ఇవన్నీ రాహుల్ గాంధీ ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటున్నాడనేది ప్రధానమైన ప్రశ్న. ఎన్నో ఆశలతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధిష్టానం రాహుల్‌ను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సంపాదించుకుంటే, భావి భారత ప్రధాని ఆయనే సుమా అనే రీతిలో రాహుల్‍కు బరువు బాధ్యతలు అప్పగించారు. కనీసం మన్మోహన్ సింగ్ ప్రసక్తే లేకుండా ఎన్నికలకు సంబంధించిన ప్రధాన కమిటీలను ఏర్పాటు చేశారు. ఆంటోనీ, ద్విగ్విజయ్ సింగ్‌లకు ఇచ్చిన ప్రాధాన్యతను కూడా మన్మోహన్ సింగ్‌కు ఇవ్వలేదు. ఇదంతా గమనిస్తుంటే రాబోయే రోజుల్లో అంతా రాహుల్ గాంధీదే హవా అనిపిస్తోంది.

ఇదిలా వుండగా, ముందస్తుగానే రావచ్చని భావిస్తున్న లోక్‌సభ ఎన్నికలకోసం పార్టీపరంగా రాహుల్‌గాంధీకి అత్యధిక ప్రాధాన్యమిచ్చి, కీలక బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో, ప్రతిపక్ష పార్టీలు కూడా అందుకు ధీటుగా సమాధానం చెపుతున్నాయి. వారికి తోచిన భాష్యం వారు చెప్పుకుంటున్నారు. ఒకటి వెంట మరొకటి యుపిఎ భాగస్వామ్య పార్టీలు ప్రభుత్వం నుంచి తొలగి పోతుంటే, దిగజారిన ప్రతిష్టను తిరిగి పొందేందుకు, తద్వారా అన్నివిధాలా కలిగిన నష్టాన్ని చక్కదిద్దుకునేందుకు, కాంగ్రెస్‌ ముందస్తు ఎన్నికలకు వెళుతుందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారాన్ని కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వం ఒక పక్క ఖండిస్తూనే, మరో పక్క తన ప్రయత్నాలలో తానుంది. ప్రతిపక్షాలు కూడా ముందస్తు ప్రయత్నంలో వున్నాయనడానికి ఉదాహరణ సమాజ వాది పార్టీ తీసుకున్న తాజా నిర్ణయమే! వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అప్పుడే 55 మంది పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీ ముందుగానే ఎన్నికలకు వెళ్లవచ్చని సిపిఎం సీనియర్‌ నాయకుడు సీతారాం ఏచూరి చెప్పడం మరో ఉదాహరణ. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి మాదిరిగానే ఖండించింది. తమ సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వానికి పూర్తిగా అయిదేళ్లు, అంటే 2014 వరకు, పాలించమని ప్రజలు అధికారమిచ్చారని, ప్రభుత్వం తన పూర్తి కాలపరిమితిని పూర్తిచేస్తుంది అని అంటుంది. యూపీఏ 2 అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇలాంటి పుకార్లు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అంటోంది. అయిదేళ్లు పాలించేందుకు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అయిదేళ్లు అధికారంలో ఉండమని ప్రజలు తీర్పిచ్చారు. అలాగే ప్రభుత్వం అయిదేళ్ల వరకూ అధికారంలో ఉంటుంది’ అని ఆ పార్టీ అంటుంది. ముందస్తు ఎవ్న్నికలకు అవకాశమే లేదని, షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, ప్రభుత్వానికి ముప్పేమీ లేదని బల్ల గుద్ది మరీ చెప్తోంది ఆ పార్టీ.

ఐతే, రాజకీయ పార్టీగా ఎన్నికలకు కాంగ్రెస్‌ ఎప్పుడూ సిద్ధమేనని ఏఐసిసి వర్గాలంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్థా? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం ఎవరి దగ్గర నుంచీ రాదు.  కాకపోతే, కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌కు మరింత విస్తృతమైన పాత్ర ఇవ్వడం అనేది ఆయనను వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించ డానికి సూచనే కదా? దీనికి సమాధానంగా పార్టీ వర్గాలు, పార్టీలో రాహుల్‌కు ఎప్పుడూ ప్రాధాన్యం ఉంది. కాంగ్రెస్‌కు రాహుల్‌గాంధీ ముఖ్యమైన వ్యక్తి. ఆయన స్థానం అలాగే ఉంటుంది’ అని చెప్తున్నారు. రాహుల్‌కు కాంగ్రెస్‌లో కొత్త పాత్ర ఇచ్చారు కనుక మధ్యంతర ఎన్నికలు వస్తాయా?’ అన్న ప్రశ్నకు, ఇది పూర్తికాలం కొనసాగే ప్రభుత్వమే కానీ, మధ్యంతర ప్రభుత్వం కాదు’ అని సమాధానం వస్తుంది.

ఏదేమైనా రాహుల్ రాజ్యం రాబోతోంది. ఒక వేళ కాంగ్రెస్ ఓడితే అంతా తారుమారు కావచ్చు. అది వేరే సంగతి!