Saturday, March 30, 2013

ప్రభుత్వ పధకాల ప్రచార వైఫల్యం-చర్చా కార్యక్రమం: వనం జ్వాలా నరసింహారావు

Please click here for a debate on Tv 5 Government Programs and their failure in publicizing: Vanam Jwala Narasimha Rao



ప్రభుత్వ పధకాల ప్రచార వైఫల్యం-చర్చా కార్యక్రమం: వనం జ్వాలా నరసింహారావు:http://www.youtube.com/watch?feature=player_detailpage&v=VskxnojVUrg

Thursday, March 28, 2013

ప్రాంతీయ పార్టీల జాతీయ ప్రభుత్వం: వనం జ్వాలా నరసింహారావు


ప్రాంతీయ పార్టీల జాతీయ ప్రభుత్వం
వనం జ్వాలా నరసింహారావు

          2009 లోక్ సభ ఎన్నికల అనంతరం ఏర్పాటైన యుపిఎ లో, భాగస్వామ్య పక్షాలుగా తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె, ఎన్సీపి, నేషనల్ కాన్ఫరెన్స్, జె ఎం ఎం, ముస్లింలీగ్, మజ్లిస్ లతో సహా మరో రెండు చిన్న-చితకా పార్టీలున్నాయి. వీరంతా కలిసి కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. సమాజ్ వాదీ పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చింది. ఐతే తృణమూల్ కాంగ్రెస్ అలిగి సంకీర్ణాన్ని విడిచి పెట్టిన తరువాత, మైనారిటీలో పడి పోయిన ప్రభుత్వానికి, సమాజ్ వాదీ పార్టీతో పాటు, ఉత్తర ప్రదేశ్ లో ఆ పార్టీని వ్యతిరేకిస్తున్న బహుజన సమాజ్ పార్టీ కూడా తన మద్దతును ప్రకటించింది. ఆ తరువాత డిఎంకె కూడా ప్రభుత్వంపై అలక పూనింది. ఇటీవలే తన పార్టీకి చెందిన మంత్రులతో రాజీనామా చేయించి, యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. మధ్యలో మజ్లిస్ కూడా కాంగ్రెస్ కు తన మద్దతును ఉపసంహరించుకుంది. ఇంత జరిగినప్పటికీ యుపిఎకి సంఖ్యాపరమైన నష్టం పెద్దగా కలగలేదు. కొన్నాళ్ల క్రితం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఓటింగ్ తో కూడిన చర్చకు ప్రభుత్వం అంగీకరించిన నేపధ్యంలో లోక్ సభలో బలాబలాలు స్పష్టంగా తేలిపోయాయి. ఓటింగులో యుపిఎ బలం 253 మంది సభ్యులని తేలింది. ప్రతిపక్షాలకు 218 మంది సభ్యుల మద్దతు మాత్రమే లభించింది. 22 మంది సభ్యులున్న సమాజ్ వాదీ, 21 మంది సభ్యులున్న బహుజన సమాజ్ పార్టీ కూడా ఓటింగులో పాల్గొన కుండా పరోక్షంగా ప్రభుత్వానికి మద్దతిచ్చాయి. అంటే అప్పట్లో ప్రభుత్వ బలం సుమారు 300 కు చేరుకుంది. అధికార పక్షం పరిస్థితి ఇలా వుంటే, ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేసే దశలో లేవు. యుపిఎ ప్రభుత్వానికి ఇదే శ్రీరామ రక్షగా మిగిలిపోయింది. ఈ నేపధ్యంలో, ప్రాంతీయ పార్టీల సారధ్యంలో-అండదండలతో, భవిష్యత్ లో తాను ప్రధానమంత్రి కాగలనన్న ధీమా ఇటీవల ప్రకటనల ద్వారా ములాయం సింగ్ యాదవ్ వెలిబుచ్చారు. అదే విధంగా బీహార్‌కు చెందిన నితీష్ కుమార్ కూడా తన మనసులోని మాట వెళ్ల బుచ్చాడు. మోడీ సరేసరి. కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో, ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రాంతీయ పార్టీని దువ్వుతూ, మచ్చిక చేసుకుంటూ ప్రభుత్వం పడిపోకుండా నెట్టుకొస్తూంది. తృణమూల్ కాంగ్రెస్ సంకీర్ణాన్ని వదిలితే, బహుజన సమాజ్ వాదీ పార్టీని కలుపుకుంది. డిఎంకె బెదిరిస్తే సమాజ్ వాదీని మరింత దగ్గరకు చేర్చుకుంది. ఇప్పుడు సమాజ్ వాదీ బెదిరిస్తుంటే, నితీష్ కుమార్ డిమాండ్లకు ఒప్పుకుని ఆయన మద్దతు తీసుకునే ప్రయత్నంలో వుంది.

          మరోవైపు బిజెపి సారధ్యంలోని ఎన్డీయే, మూడో, నాలుగో ఫ్రంటులు రాబోయే ఎన్నికల కోసం ఎవరి వ్యూహంలో వారున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని-యుపిఎని వీడిన అలనాటి మిత్ర పక్షాలు కాని, ఇంకా కలిసి వున్న ఇతర చిన్న-చితకా పార్టీలు కాని రాబోయే లోక్ సభ ఎన్నికలలో ఉమ్మడిగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా వున్నట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా అవి తనతో కలిసి ఎన్నికల ముందు అవగాహన కుదుర్చుకుని పోటీ చేసే కంటే, అవి వేరుగా పోటీ చేసి, వీలై నన్ని స్థానాలు గెల్చుకుని, ఎన్నికల అనంతరం సంకీర్ణంగా ఏర్పడితే మంచిదన్న ఆలోచనలో వుంది. దీనికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, యుపిఎ ప్రభుత్వం "యాంటీ ఇన్‍కంబెన్సీని" తట్టుకోవాల్సిన పరిస్థితిలో పడిపోయింది. దానికి తోడు అవినీతి ఆరోపణలు కూడా వున్నాయి. తన పార్టీకి ఎలాగూ గతంలో వచ్చి నన్ని స్థానాలు వచ్చే అవకాశం లేదని ఆ పార్టీ భావనలాగా కనిపిస్తోంది. తనతో కలిసి పోటీ చేసి తన మైలను భాగస్వామ్య పక్షాలు అంటించుకునేకంటే, విడిగా పోటీ చేసి మంచి పేరుతో కొన్ని స్థానాలు గెలవడం మంచిదన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా వుంది. యుపిఎ భాగస్వామ్య పక్షాలు కూడా అదే ఆలోచనలో వున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ మైల తమకు అంట రాదని భావించి ఒక్కొక్క పార్టీ కాంగ్రెస్ కు దూరమవుతోంది. ఈ నేపధ్యంలో 2014 లో కాని, అంతకంటే ముందస్తుగా కాని ఎన్నికలు జరుగుతే, ప్రాంతీయ పార్టీల హవా కొనసాగబోతోంది అని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి, నేటిదాకా, గత ఆరు దశాబ్దాల కాలంలో, రాజకీయాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆ మార్పులను వివిధ కోణాలనుంచి పరిశీలన చేయవచ్చు. ఆ మార్పులలో ప్రధానంగా గమనించాల్సిన విషయం, ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత పెరగడం. ఒకప్పుడు ఏ ఒకటో-రెండో రాష్ట్రాలకే పరిమితమైన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ వేళ్ల్లూనుకు పోయి, పార్లమెంటులో తమ బలాన్ని చాటుకుంటున్నాయి. గత రెండు-మూడు సార్వత్రిక ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని గమనిస్తే, జాతీయ పార్టీలకంటే అవి అధికంగా వున్నాయి. అంటే జాతీయ పార్టీల ప్రాముఖ్యత జాతీయ స్థాయిలో తగ్గుకుంటూ పోతుంటే, ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరుక్కుంటూ పోతోంది. భారత దేశ రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న మరో ప్రధానాంశం, వోటు వేసే వారిలో అధిక శాతం మంది బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు చెందిన వారు కావడం. మహిళలు కూడా పెద్ద ఎత్తున పురుషులకంటే అధికంగా ఓటింగ్‌లో పాల్గొనడం విశేషం. వీటన్నిటి ప్రభావం ఏ మేరకు రాబోయే సార్వత్రిక ఎన్నికలపై పడుతుందో విశ్లేషించాలంటే, ప్రాంతీయ పార్టీల గురించి మరింత లోతుగా అధ్యయనం చేయాలి. ఈ నేపధ్యంలో ఇక్కడ కొన్ని మౌలికాంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

ఒకవైపు ప్రాంతీయ పార్టీలు బలంగా పాతుకు పోతుంటే, మరొక వైపు, జాతీయ పార్టీలు బలహీన పడిపోవడంతో, పార్లమెంటులో మెజారిటీ స్థానాలను సంపాదించుకోవడం ఏ ఒక్క జాతీయ పార్టీకి సాధ్యపడదు. మెజారిటీకి దగ్గరగా రావడం కూడా కష్టమే. ఎప్పుడైతే, ఏ ఒక్క జాతీయ పార్టీ మెజారిటీ స్థానాలను సంపాదించుకోలేదో, ఇప్పటి లాగే, ప్రాంతీయ పార్టీలతో కలిసి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం మినహా గత్యంతరం లేదు. అలాంటప్పుడు ప్రాంతీయ పార్టీలతో అవగాహన ఎన్నికల ముందా? తరువాతా? అన్న ప్రశ్న ఉదయించక మానదు. ఉదాహరణకు 2009 ఎన్నికలే తీసుకుంటే, ఎన్నికల ముందు ఎక్కువగా కలిసి కట్టుగా-ఉమ్మడిగా పోటీ చేయడం జరగలేదు. ఎన్నికల అనంతరమే అవగాహన కొచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అలా అని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేయలేదని అర్థం కాదు. ఎన్నికల ముందు అవగాహన వుంటే సంకీర్ణాలు మనుగడ సాగించడం సులభం. ఎన్నికల అనంతరం అవగాహనకు వస్తే, బెదిరింపుల మధ్య, సంకీర్ణ ప్రభుత్వం మనుగడ కష్టం అవుతుంది. 1999-2004 మధ్య అధికారంలో వున్న బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వమైనా, 2004-2009 మధ్య అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వమైనా, అస్థిరత-స్థిరత్వం మధ్య ఊగిసలాడినప్పటికీ, పూర్తికాలం పాటు కొనసాగాయి. అది ఒక విధంగా గొప్ప విషయమే. ఇక 2009 తరువాత అధికారంలో కొచ్చిన యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం అహర్నిశలూ బెదిరింపులను ఎదుర్కుంటూనే మనుగడ సాగిస్తోంది. వస్తున్న బెదిరింపులన్నీ ప్రాంతీయ పార్టీల నుంచే కావడం విశేషం.

సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో, పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల సంఖ్య లెక్కకు మించి పోయింది. సభలో జరిగే చర్చలలో నాణ్యత లోపించడంతో పాటు, సభ నిర్వహణ కష్ట సాధ్యమై పోయి, వాయిదాపడడం సర్వసామాన్యమైన విషయంగా మారిపోయింది. రకరకాల పార్లమెంటరీ తీర్మానాలతో సభ ఏనాడూ సజావుగా సాగనీయడం లేదు ప్రతిపక్షాలు. అధికార పక్షంలోని భాగస్వామ్య పార్టీలకు చెందిన ప్రాంతీయ పార్టీ వారు కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అనేక చర్యలకు పాలపడుతున్నారు. పర్యవసానంగా సభలో చర్చించి సభ ఆమోదం పొందాల్సిన అనేక బిల్లులు ప్రవేశపెట్టడానికి కూడా నోచుకోక పోవడం దురదృష్టం. ప్రవేశపెట్టిన ఎన్నో బిల్లులు చర్చ జరగకపోవడంతో చాలా కాలంపాటు పెండింగ్‌లో పడిపోతున్నాయి. పార్టీల సంఖ్య పెరగడంతో పార్లమెంటరీ ప్రక్రియకే ముప్పు వాటిల్లడంతో పాటు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారిపోయింది.

ఆరు దశాబ్దాల భారతదేశ రాజకీయ రంగంలో గణనీయమైన మార్పులు రావడంతోను, ప్రాంతీయ పార్టీలు అధికసంఖ్యలో ఆవిర్భవించడంతోను, ఎన్నికల ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయింది. ఒక్కో ఎన్నిక జరిగే కొద్దీ, పోటీలో వుండే పార్టీల సంఖ్య పెరగ సాగింది. 1952 లోక్ సభ ఎన్నికలలో కేవలం 55 పార్టీలు మాత్రమే రంగంలో వుంటే, 2009 ఎన్నికల కల్లా వాటి సంఖ్య 370 కి చేరుకుంది. ఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే, 1957 లో మాత్రమే అతి తక్కువగా కేవలం 16 పార్టీలు మాత్రమే పోటీలో వుండగా, అత్యంత అధిక సంఖ్యలో 2009 లో పోటీకి దిగాయి. వీటి సంఖ్య రాబోయే ఎన్నికలలో ఇంకా పెరగొచ్చు. మొదటి ఎన్నికలలో పోటీ చేసిన 55 పార్టీలలో, 18 రాష్ట్ర స్థాయి పార్టీలు, 29 రిజిస్టర్డ్ పార్టీలు కాగా జాతీయ పార్టీల సంఖ్య కేవలం 8 మాత్రమేవాటి సంఖ్య 2004 లో 6 కు పడి పోయింది. కాగా అదే ఎన్నికలలో పోటీలో వున్న 230 పార్టీలలో, 36 ప్రాంతీయ పార్టీలు, 188 రిజిస్టర్డ్ పార్టీలు వున్నాయి. దానర్థం ఒకవైపు ప్రాంతీయ-రిజిస్టర్డ్ పార్టీల సంఖ్య పెరుగుతూ పోతుంటే, జాతీయ పార్టీల సంఖ్య తగ్గుకుంటూ పోతోంది. అదే విధంగా 1952 లోక్ సభ ఎన్నికల అనంతరం పార్లమెంటులో 22 పార్టీలకు ప్రాతినిధ్యం లభించగా, 2009 ఎన్నికల అనంతరం 37 పార్టీలకు ప్రాతినిధ్యం లభించింది. అత్యంత తక్కువగా కేవలం 12 పార్టీలకు మాత్రమే ప్రాతినిధ్యం లభించింది 1957 ఎన్నికల అనంతరం. ఏ విధంగా పార్టీల సంఖ్య, అవి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే వాటి సంఖ్య పెరుగుకుంటూ పోతుందో ఈ లెక్కలు తెలియచేస్తాయి.

ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరగడమంటే, రాజకీయ పోటీ తత్వంలో మార్పుల రావడమే. మొదట్లో, రాష్ట్ర శాసన సభలలో జాతీయ పార్టీలకు పోటీగా వున్న ప్రాంతీయ పార్టీలు దరిమిలా పార్లమెంటులో జాతీయ పార్టీలను శాసించే స్థాయికి చేరుకున్నాయి. ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో ప్రాంతీయ పార్టీకి ప్రజల మద్దతు-ఓటర్ల మద్దతు లభిస్తున్న తీరుతెన్నులను పరిశీలిస్తే, వారు పూర్తిగా జాతీయ పార్టీలను మరిచిపోతున్నారే మో అనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాలలో ప్రధాన పోటీ ఒక ప్రాంతీయ పార్టీకి, ఏదో ఒక జాతీయ పార్టీకి మధ్యన వుంటే, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఆ పోటీ ఒక ప్రాంతీయ పార్టీకి, మరో ప్రాంతీయ పార్టీకి మధ్యనే వుంటోంది. ఎన్నికల రంగంలో ఆ రాష్ట్రాలలో జాతీయ పార్టీలు మూడు-నాలుగు స్థానానికి పరిమితమై పోవడం కూడా కష్టమవుతోంది. ప్రాంతీయ పార్టీలతో పోల్చి చూస్తే, దేశం మొత్తం మీద జాతీయ పార్టీలకు పోలైన ఓట్ల శాతం తగ్గుకుంటూ వస్తోంది. ప్రధానంగా 1996 ఎన్నికల తరువాత ఈ పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఒకవైపు గెలిచిన స్థానాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్న ప్రాంతీయ పార్టీలు, మరో పక్క ఓటింగ్ శాతాన్ని కూడా పెంచుకుంటున్నాయి. 1984 లో ప్రాంతీయ పార్టీలన్నిటికీ కలిపి 11.2% ఓట్లు రాగా, 2009 ఎన్నికల నాటికి 28.4% కి పెరిగింది. రాబోయే ఎన్నికలలో 30% దాటినా ఆశ్చర్య పోనక్కరలేదు. దానర్థం జాతీయ పార్టీలకు కనీసం రెండు వందల స్థానాలన్నా రావడం కష్టమేఎక్కువమంది ఓటర్లలో జాతీయ పార్టీలకంటే ప్రాంతీయ పార్టీలే మంచివన్న అభిప్రాయం వుండి వుండాలి. రాష్ట్రాల పాలన ప్రాంతీయ పార్టీల చేతుల్లో వుండాలని కోరుకోవడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు అనుగుణంగా కేంద్రం నడుచుకోవాలంటే, పార్లమెంటులో కూడా వాటికి గణనీయమైన స్థానాలను గెలిపించాలని ఓటర్లు భావిస్తున్నారు.

ఈ నేపధ్యంలో రానున్న లోక్ సభ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలదే హవా కానుంది. ఎన్నికల అనంతరం యుపిఎ, ఎన్డీఏ లలో ఎవరు ఎక్కువగా ప్రాంతీయ పార్టీలను ఆకర్షించుకోగలరో వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. ముఖ్యంగా డిఎంకె, అన్నా డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ, బహుజన సమాజ్ పార్టీ, తెలుగు దేశం, ఎన్సీపి, జనతాదళ్, శివ సేన, అకాలీదళ్, బిజూ జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్, తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్సార్సీపి లాంటి పార్టీల మద్దతు కీలకమవుతుంది. వీటిలో చాలా వరకు, ప్రస్తుతానికి యుపిఎ, ఎన్డీఏ లలో ఏదో ఒక దాంట్లో భాగస్వాములుగా వున్న పార్టీలు అన్నీ కలిసి సుమారు 200-250 స్థానాలు గెల్చుకునే అవకాశం వుంది. వీరంతా కలిసి ఒక ప్రాంతీయ పార్టీల ఫ్రంట్‌గా ఏర్పడితే జాతీయ పార్టీల పరిస్థితి డోలాయమానంలో పడినట్లే! అందుకే రాబోయే ది ప్రాంతీయ పార్టీల జాతీయ ప్రభుత్వం. కాకపోతే, ఆ ప్రభుత్వానికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ మద్దతు కాని, భారతీయ జనతా పార్టీ మద్దతు కాని తప్పనిసరిగా అవసరం! జాతీయ పార్టీలూ తస్మాత్ జాగ్రత్త!

Monday, March 25, 2013

విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు: వనం జ్వాలా నరసింహారావు


విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు


పక్కా "అంచెలంచల అధికార వ్యూహం" తో జగన్ వర్గంగా ముద్రపడి, ఇటీవల ముగిసిన అవిశ్వాస తీర్మానం ఓటింగులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, ఓటు వేసిన తొమ్మిదిమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల పైపార్టీ ఫిరాయింపుల  నిరోధక చట్టం కిందఅనర్హత  వేటు వేసేందుకు రంగం తయారవుతోంది. ప్రభుత్వ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి వీరిని అనర్హులుగా ప్రకటించమని సభాపతికి విజ్ఞప్తి చేశారు. దానికి అవసరమైన డాక్యుమెంట్లను కూడా ఆయన సభాపతికి సమర్పించారు. కాంగ్రెస్ బాటలోనే పయనించేందుకు తెలుగుదేశం నాయకులు కూడా సిద్ధమవుతున్నవారు. నేడో-రేపో వీరందరినీ అనర్హులుగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఆ తరువాత ఉపఎన్నికలు జరగడం, ఎవరి బలమెంతో తేలిపోవడం మనం చూడబోతున్నాం.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి రాజ్యాంగపరమైన నియమ నిబంధనలున్నాయి. కాకపోతేఅవి ఎంత సక్రమంగా అమలుకు నోచుకుంటున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పోనీసత్ సాంప్రదాయాలే మన్నా నెలకొన్నాయంటేఅలా ఏ రాష్ట్రంలోను జరిగిన దాఖలాలు లేవు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పది కాలాల పాటు మనుగడ సాగించాలంటే, రాజ్యాంగ నియమ నిబంధనలకు అదనంగాచిరకాలం గుర్తుంచుకునే సంప్రదాయాలు నెలకొనడం తప్పని సరి. ఏ పార్టీ అధికారంలో వున్నావారి వారి రాజకీయ అనుకూలతలు-అననుకూలతల ఆధారంగాఆ పార్టీ టికెట్ పై చట్ట సభకు ఎన్నికై సభాపతి పీఠాన్ని అధిష్టించిన వ్యక్తితన మాతృ సంస్థ ఆలోచనా ధోరణి ప్రకారమే నడచుకుంటున్న అపవాదు అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. ఇప్పటికీ సమయం మించి పోలేదుప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సభాపతిగా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ఈ విషయంలోయావత్ భారత దేశం అభినందించే రీతిలోరాజ్యాంగ నిబంధనలకు లోబడిన ఒక సత్ సంప్రదాయం ఆవిర్భావానికి చొరవ తీసుకుంటే మంచిది.

చట్ట సభలకు ఎన్నికైన వారుఏ ఏ సందర్భాలలోసభ్యులుగా కొనసాగడానికి అనర్హులవుతారనే విషయంరాజ్యాంగంలో స్పష్టంగా వివరించ బడింది. సర్వ సాధారణంగా పేర్కొనే విషయాలకు అదనంగాపదవ షెడ్యూలులోపార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఎలా వర్తిస్తుందని కూడా వివరించబడిందిరాజీవ్ గాంధి ప్రధానిగా వున్నప్పుడుపార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా, 1985 లో అమల్లోకొచ్చింది. నాలుగు వందలకు పైగా లోక్ సభ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీముందు జాగ్రత్తగా రాజ్యాంగ సవరణ చేసిందన్న ప్రచారం కూడా జరిగిందప్పుడు. ఒక రాజకీయ పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిస్వచ్చందంగాఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడుసహజంగా శాసన సభ సభ్యత్వం కూడా కోల్పోతారు. ఒక పార్టీ సభ్యుడుగా చట్ట సభకు ఎన్నికైన వ్యక్తిఎన్నికల అనంతరంమరో పార్టీలో చేరితన పార్టీకి వ్యతిరేకంగా పని చేసినా సభ్యత్వానికి అనర్హులవుతారు. సభాపతిగా-ఉప సభాపతిగాలేదా శాసన మండలి అధ్యక్షుడుగా-ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన వారికిపార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటికీఅనర్హత వేటు పడకుండా చట్టం మినహాయించింది.


అదే విధంగాటికెట్ ఇచ్చిన పార్టీ అధికారికంగా జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగాశాసన సభలో జరిగే ఓటింగులో పాల్గొనక పోయినా-పాల్గొని వ్యతిరేకంగా ఓటేసినాసభ్యత్వానికి అనర్హులవుతారు. కాకపోతేఅలా చేయడానికి పార్టీ నుంచి ముందస్తుగా అనుమతి పొందినాలేకఅలా చేసిన పదిహేను రోజుల లోపు అధికారికంగా పార్టీ నాయకత్వం ఆ వ్యక్తిని మన్నించినాఅర్హతకు గురి కాకుండే అవకాశం వుంది. చట్టం మరో చిన్న వెసులుబాటు కూడా కలిగించింది. ఏదైనా రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన శాసన (లోక్ సభ) సభ సభ్యులలోమూడింట ఒక వంతు మంది,మూకుమ్మడిగా పార్టీ మారితే-వేరే పార్టీలో విలీనమైతేఆ చర్యకు ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి మినహాయింపు వుంది. అయితేరాజ్యాంగ91 వ సవరణ ఈ నిబంధనను మార్చిమూడింట రెండు వంతుల సంఖ్య వుంటేనేవిలీనమైనట్లవుతుందని చెప్పింది. అలానే ఒక రాజకీయ పార్టీలో చీలిక వచ్చినప్పుడుపార్టీ మొత్తం మరో పార్టీలో చేరితే కూడా ఫిరాయింపుల చట్టం నుంచి మినహాయింపు వుంటుంది. ఆ పార్టీ నుంచి ఎన్నికైన కొందరు శాసన సభ సభ్యులు విలీనానికి అంగీకరించకుండా వేరే పార్టీ పెట్టుకున్నాఒక ప్రత్యేకమైన గ్రూపుగా ఏర్పడినామినహాయింపుంటుంది.

అనర్హత విషయంలో నిర్ణయాధికారం పూర్తిగా సభాపతి దే. పదవ షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిసభాపతి తీసుకున్న ఎటువంటి నిర్ణయమైనాన్యాయ స్థానాల తీర్పు పరిధిలోకి రావు. పదవ షెడ్యూల్ నిబంధనలను అమలు పరిచే విషయంలోతదనుగుణమైన విధి-విధానాలను రూపొందించుకునే అధికారం సభాపతికి వుంది. రాజకీయ పార్టీలు తమ-తమ పార్టీలకు చెందిన సభ్యుల వివరాలుకొత్తగా చేరిన వారి వివరాలుపార్టీ వ్యతిరేకంగా పని చేస్తున్న వారి వివరాలుపార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటేసిన వారి వివరాలుసంబంధిత అంశాలకు చెందిన ఇతర వివరాలను పార్టీలు నమోదు చేసుకోమని అడిగే అధికారం వుంది సభాపతికి. సభ్యుల అర్హత-అనర్హతలు నిర్ధారించ వలసిన సమయంలో అవి ఉపయోగ పడే అవకాశాలున్నాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యత్వానికి అనర్హులైన వ్యక్తులుయాంత్రికంగాతమ సభ్యత్వాన్ని కోల్పోరు. వారిని పార్టీ నుంచి తొలగించ వచ్చు కానీచట్ట సభల సభ్యత్వాన్నించి తొలగించడానికి,పార్టీ నాయకత్వం నియమించిన ప్రతినిధిసంబంధిత సభ్యుల అనర్హత విషయాన్ని సభాపతి దృష్టికి తీసుకుని పోయిన తదుపరితగు విచారణ జరిగిన చేసిన తర్వాతేసభాపతి తగు నిర్ణయం తీసుకుంటారు.

సభాపతి తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం న్యాయ స్థానాలకు లేకపోయినాచట్టంలో పొందు పరిచిన నియమ నిబంధనలకు భాష్యం చెప్పే అధికారంరాజ్యాంగ పరంగాన్యాయ మూర్తులకు వుంది. తాను ఎన్నికైన రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిస్వచ్చందంగా పార్టీకి రాజీనామా చేస్తే,సభ్యత్వానికి అనర్హుడవుతాడని చట్టం చెప్పిన దాన్ని విస్తరిస్తూసరి కొత్త నిర్వచనం చెప్పింది అత్యున్నత న్యాయ స్థానం. లాంఛనంగా రాజీనామా చేయకుండాతనకు టికెట్ ఇచ్చిన పార్టీ వ్యతిరేక కార్య కలాపాల్లో పాల్గొనే రీతిలోస్పష్టమైన వైఖరిలో ప్రవర్తించే చట్ట సభ సభ్యుల విషయంలో కూడా, ఫిరాయింపుల నిబంధనలు వర్తించుతాయని1994 లోసుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అదే విధంగాస్వతంత్రుడుగా గెలిచిఏదైనా పార్టీలో చేరిన వ్యక్తి కూడాఫిరాయింపుల చట్టం పరిధిలోకి వస్తారని చెప్పింది కోర్టు. పార్టీ ఫిరాయింపుల నియమ నిబంధనలను ఉల్లంఘించే సభ్యుల వివరాలుసభాపతి దృష్టికి తీసుకుని రానంత వరకుఅర్హత-అనర్హతలతో నిమిత్తం లేకుండాచట్ట సభలలో నిరాటంకంగా సభ్యులుగా కొనసాగడానికిఎన్ని రకాల అవకాశాలుండాలో అన్ని రకాల అవకాశాలను చట్టం కలిగించింది. రాజకీయ పార్టీల "అధి నాయకులు" తమకు అనుకూలమని భావించిసభాపతికి ఫిర్యాదు చేయనంత కాలంఫిరాయింపుల చట్టం కాగితాలకే పరిమితం. అలా కాకుండా కొన్ని సత్ సాంప్రదాయాలకు ఎవరో ఒక రాష్ట్రానికి చెందిన శాసన సభ సభాపతి చొరవ తీసుకోవాలి.

తాత్కాలిక-శాశ్వతఆర్థిక-లేదా-పదవి లాభం కొరకుపార్టీ ఫిరాయింపులుమన దేశంలోని వివిధ రాష్ట్రాలలో చోటు చేసుకోవడం చాలా కాలం నుండి జరుగుతున్న వ్యవహారం. విలువలకు తిలోదకాలిచ్చితనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించినమాతృ సంస్థకే ద్రోహం తలపెట్టడం నేరం. ఆ నేరానికి కనీసం శిక్ష అనర్హత వేటుపాతిక సంవత్సరాల క్రితం ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చినాదాని అమలు అంతంత మాత్రమే. రాజీవ్ గాంధి హయాంలోచట్టం తేవడానికి ప్రధాన కారణంఅంతకు ముందుదేశ వ్యాప్తంగాఆయారాం-గయారాంల హవాలో అనుక్షణం రాష్ట్ర ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్థకం కావడమే. అయితేచట్టం తేవడం జరిగినప్పటికీ,ఫిరాయింపులు మాత్రం ఆగలేదు. చట్టం అమలు బాధ్యత సభాపతిది మాత్రమే కావడంతో రాజకీయాలకు అతీతంగాసత్ సాంప్రదాయాలు నెలకొనక పోవడమే దీనికి కారణం. పార్టీ ఫిరాయింపులు యధేఛ్చగా కొనసాగుతూనే వున్నాయి. అవసరార్థం ఎమ్మెల్యేలను విపక్షం నుంచి స్వపక్షానికి తెచ్చుకునే ప్రయత్నాలు అన్ని రాజకీయ పార్టీలు చేస్తూనే వున్నాయి. కోట్ల ధనం చేతులు మారుతూనే వుంది. ప్రజాస్వామ్యం విలువను అపహాస్యం పాలు చేయడానికి ఫిరాయింపు దారులు చట్టం లోని లొసుగులను ఇంకా వాడుకుంటూనే వున్నారు. రాష్ట్ర మాజీ గవర్నర్పాలనానుభవం దిట్టఇందిరా గాంధికి సన్నిహితుడుపీసీ అలెగ్జాండర్ఫిరాయింపుల చట్టం లోప భూయిష్టమైందని విమర్శించారు. పదవ షెడ్యూల్ లోని ఫిరాయింపుల చట్టాన్ని తిరగ రాసిఏ స్థాయి ప్రజా ప్రతినిధైనాతాను ఎన్నికైన పార్టీని వీడినట్లైతేప్రజల విశ్వాసం కోల్పోయినట్లుగా భావించితక్షణం సభ్యత్వానికి అనర్హుడైనట్లుగా ప్రకటించే విధంగా వుండాలని సూచించారు.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారి విషయంలోనుదానికి కారణమైన వారి మాతృ సంస్థ రాజకీయ పార్టీల విషయంలోనుఎన్నికల సంఘం అంతో-ఇంతో అప్రమత్తంగా వుంటే మంచిదే మో! ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను నెరవేర్చని పక్షంలోపార్టీ వీడిపోయే సభ్యులకు ఎన్నికల సంఘం రక్షణ ఇవ్వడం సమంజసం. ఒక పార్టీఒక సారి ప్రణాళికలో చేర్చిన అంశాలకు సంబంధించిఅమలుకు నోచుకోని అంశాల విషయంలోఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేని పరిస్థితులున్నంత కాలం పార్టీలను వీడేవారికి ఇబ్బందులు తప్పవు. అదే విధంగాపదవ షెడ్యూల్ అమలు విషయంలోను,కనీసంసభాపతి దృష్టికి తీసుకుపోయే విషయంలోనైనాఎన్నికల సంఘం పాత్ర అంతో-ఇంతో వుండడం మంచిది. ఐదేళ్లకో సారి మేల్కొన కుండా,రాజకీయ పార్టీల-పార్టీల ద్వారా ఎన్నికైన సభ్యుల విషయంలో కొంత క్రియాశీలక పాత్ర పోషించాల్సిన బాధ్యతను ఎన్నికల సంఘం మరిచిపోకూడదు. End


Monday, March 18, 2013

సంఖ్యాపరంగా శాసనసభ విశ్వాసం కోల్పోయిన రాష్ట్ర ప్రభుత్వం: వనం జ్వాలా నరసింహారావు


సంఖ్యాపరంగా శాసనసభ 

విశ్వాసం కోల్పోయిన రాష్ట్ర ప్రభుత్వం


కిరణ్ సర్కారుపై అవిశ్వాసం వీగిపోయినప్పటికీ, ప్రభుత్వాన్ని మైనారిటీలోకి పడిపోయేలా మాత్రం చేసింది. కాంగ్రెస్ నుంచి 9 మంది, టీడీపీ నుంచి 7 మంది, మొత్తం పదహారు మంది వారి పార్టీల విప్‍లను ధిక్కరించి, అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసి, నేడో రేపో స్పీకర్ అనర్హత అస్త్రానికి గురికాబోతున్నారు. కొన్నాళ్ల క్రితం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్యాపదేశంగా తమ పార్టీ శాసన సభ్యులపై అన్న వ్యాఖ్యలు నిజమని నిరూపించబడింది. ఆనాడు పాత్రికేయులు బొత్స చెప్పిన తొమ్మిదిమంది కాంగ్రెస్ వారు ఎవరని మరీ మరీ అడిగినా రాని సమాధానం అవిశ్వాస తీర్మానం ద్వారా బయటకొచ్చింది. అలానే అవిశ్వాస తీర్మానం ఓటింగుకు వస్తే తన పార్టీకి నష్టమనుకున్న చంద్రబాబు నాయుడు భయం కూడా నిజమని తేలింది. తనవారు కారేమోననుకున్న ఏడుగురి విషయంలో ఆయన అనుమానం ధృఢ పడింది. ఆరుగురు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసి విప్‌ను ధిక్కరిస్తే, మరొక సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో పాల్గొననప్పటికీ.. నోటీసుకు మద్దతు తెలిపారు. అదికూడా విప్ ఉల్లంఘనే!

'అర్ధరాత్రి' సమయంలో జరిగిన అవిశ్వాస పరీక్షలో.... ఎవరి 'విశ్వాసం' ఎంతో తేలిపోయింది! కాంగ్రెస్ టికెట్ల పై గెలిచి... జగన్ పంచన చేరిన తొమ్మిది మంది శాసనసభ సాక్షిగా తిరుగుబాటు బావుటాను ఎగురవేశారు. ఆది నుంచి అనుకుంటున్న ఎనిమిది మందితోపాటు... చివర్లో జోగి రమేశ్ కూడా కాంగ్రెస్‌కు 'చెయ్యి'చ్చారు. జగన్‌కు జై కొట్టారు. తెలుగుదేశంకు చెందిన ఏడుగురు సభ్యులు 'సైకిల్' దిగిపోయారు. 'మాది తటస్థ వైఖరి' అని తేల్చి చెప్పిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి... అనుకోకుండా మజ్లిస్ పార్టీ కూడా తోడైంది. అవిశ్వాస ప్రక్రియకు దూరంగా నిలిచింది. దీంతో... ముందుగా అనుకున్నట్లు గానే అవిశ్వాసం వీగిపోయింది. వైసీపీ రెండు అవిశ్వాస నోటీసులు ఇచ్చినప్పటికీ, టీఆర్ఎస్ నోటీసునే స్పీకర్ పరిగణనలోకి తీసుకున్నారు. దీనికి 45 మంది సభ్యులు మద్దతు ఇవ్వడంతో చర్చ మొదలైంది. వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు... విమర్శలు, ప్రతి విమర్శలు... ఆరోపణలు, సమాధానాలు... ఇలా వాడిగా, వేడిగా సభా సమరం కొనసాగింది. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ... వీటిలో ప్రతి పార్టీ మరో పార్టీపై దుమ్మెత్తిపోస్తూ తమ తమ వాదనలు వినిపించాయి. ఉదయం 11 గంటల సమయంలో మొదలైన చర్చ.... అర్ధరాత్రి వరకు కొనసాగింది. చివర్లో... విపక్షాల విమర్శలకు ముఖ్యమంత్రి కిరణ్ సుదీర్ఘ సమాధానం ఇస్తూ తన ప్రభుత్వ పని తీరును ఆకాశానికి ఎత్తివేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పక్ష నేత ఈటెల రాజేందర్ ఆనవాయితీ ప్రకారం మాట్లాడారు. అర్ధరాత్రి దాటాక అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఓటింగ్ జరిపారు. దీనికి టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎంతోపాటు కాంగ్రెస్, టీడీపీ రెబెల్స్... మొత్తం 58 మంది బలపరిచారు. 142 మంది అవిశ్వాసాన్ని వ్యతిరేకించారు. టీడీపీ, ఎంఐఎం సభ్యులతో సహా 91 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. టీడీపీ, ఎంఐఎం మద్దతు ఇచ్చినా సరే, అవిశ్వాసం వీగి పోవడానికే అవకాశాలు ఎక్కువగా వుండేవి. అయితే, చివరి నిమిషం దాకా అధికార పక్షానికి ముచ్చెమటలు  పోసేవి. ప్రస్తుతం ప్రభుత్వం అవిశ్వాసం నుంచి గట్టెక్కినా, సభలో మేజిక్ ఫిగర్ ను సాధించకపోవడంతో మైనారిటీలో పడిపోయినట్లే! ఏదైతేనేం... మరో ఆరునెలలపాటు 'అవిశ్వాసం' ఊసు ఉండదు.


రెండేళ్లు.. రెండు అవిశ్వాస తీర్మానాలు.. రెండుసార్లూ విజయాలు! ఇదీ.. సీఎంగా కిరణ్ ఘనత. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కూడా దాటలేదు. కానీ.. రెండు అవిశ్వాస తీర్మానాలను దాటేశారు. గత ఏడాది టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం గండం నుంచి గట్టెక్కారు. తాజాగా, టీఆర్ఎస్, వైసీపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు చర్చకు వచ్చాయి. వీటికి తాము మద్దతు ఇవ్వడం లేదని టీడీపీ ముందుగానే ప్రకటించడంతో అధికారపక్షం పైయెత్తు వేసింది. అవిశ్వాసంపై చర్చ, ఓటింగ్ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని భావించి ప్రతిపక్షాలకు ఝలక్ ఇస్తూ ఒక్క రోజులోనే చర్చ, ఓటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే, టీడీపీ నిర్ణయంతోనే 'సేఫ్'లోకి వెళ్లిన పాలక పక్షానికి ఎంఐఎం నిర్ణయం 'డబుల్ సేఫ్'లోకి నెట్టింది. అవిశ్వాసంపై పంతం నెగ్గించుకున్నామన్న ఆనందం... అధికార పక్షం దాడిని అంతే ధాటిగా తిప్పికొట్ట లేకపోయామన్న స్వల్ప నిరాశ! ఇదీ టీఆర్ఎస్ పరిస్థితి. ప్రధాన ప్రతిపక్షం కాకపోయినప్పటికీ... ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టి, చర్చ జరిగేలా చూడటంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. తనకు 17 మంది సభ్యుల బలమే ఉన్నప్పటికీ, ఇతర పక్షాలనూ కూడగట్టి, చివరికి వైసీపీ కూడా తమ వెంటే నడిచేలా చేసింది.

ఈ నేపధ్యంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అవిశ్వాస తీర్మానం పూర్వాపరాలను తెలుసుకోవడం మంచిది. అధికారంలో వున్న పార్టీ పనితీరును నిశితంగా విమర్శించేందుకు, ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ పథకాలలోని లోపాలను-లోటుపాటులను ఎత్తి చూపేందుకు, ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, తద్వారా ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించేందుకు, అవిశ్వాస తీర్మానాన్ని ఒక పదునైన ఆయుధంగా, ప్రజాస్వామ్య దేశాలలో-ముఖ్యంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలలో ప్రతిపక్షాలు వాడుకుంటాయి. సాధారణంగా ఈ పనిని ప్రధాన ప్రతిపక్షం తన భుజాన వేసుకుంటుంది. ఎన్నికైన ప్రభుత్వానికి ఒక నిర్దిష్ట కాలపరిమితి వరకు అధికారంలో వుండే అవకాశం వున్నప్పటికీ, అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం ద్వారా, ఆ కాలపరిమితి లోపునే, ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపే ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో సఫలం కావచ్చు, విఫలం కావచ్చు. ఒక విధంగా ఆలోచిస్తే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, అధికారంలో వున్న ప్రభుత్వానికి చట్ట సభలో మెజారిటీ లేదని నిరూపించి, మైనారిటీలో పడవేసి, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాని, ముందస్తుగా ఎన్నికలకు పోవడం కాని అవిశ్వాస తీర్మానం ద్వారా సాధించవచ్చు. కాకపోతే, అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన ప్రతిపక్ష పార్టీ, తీర్మానం నెగ్గించుకోగలిగితే, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అందించడానికి సిద్ధంగా వుండగలగాలి.  ఆషామాషీగా తీర్మానం పెట్టడం సాంప్రదాయం కాదు.

అవిశ్వాస తీర్మానం అనే ప్రక్రియ లేని కొన్ని ప్రజాస్వామ్య దేశాలలో, ప్రభుత్వాధినేతలను లేదా ఇతర ప్రజాప్రతినిధులను, పదవీచ్యుతులను చేసేందుకు "ఇంపీచ్‌మెంట్" కాని "రీకాల్" పద్ధతి కాని ఉపయోగించుకుంటాయి ప్రతిపక్షాలు. వీటికి అవిశ్వాస తీర్మానానికి మధ్య కొంత తేడా వున్నప్పటికీ, ఫలితం మాత్రం ఒకటే. అవిశ్వాస తీర్మానంలో ఇరుపక్షాలకు లభించిన మద్దతు ఓట్లు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. తాము ప్రతిపాదించిన అవిశ్వాసానికి ఇంతమంది మద్దతు వుందని బహిరంగపర్చడం ద్వారా, ప్రభుత్వాన్ని నిరంతరం ఇరుకున పెట్టవచ్చు. ఉదాహరణకు మొన్న ముగిసిన అవిశ్వాసాన్నే చెప్పుకోవచ్చు. దాని మూలాన, ప్రభుత్వానికి మద్దతిచ్చే సభ్యుల సంఖ్య స్పష్టంగా బయటపడింది. భవిష్యత్‍లో ఆ సంఖ్య పిసరంత తగ్గినా, ప్రభుత్వం మైనారిటీలో పడినట్లే! ఇలా మెడమీద కత్తి వేలాడుతూనే వుంటుంది. అవిశ్వాస తీర్మానానికి సెన్సార్ తీర్మానం అన్న పేరు కూడా కొన్ని చోట్ల వాడుకలో వుంది. కాకపోతే రెంటి మధ్యా తేడా కూడా వుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గితే, ప్రభుత్వం రాజీనామా తప్పనిసరి. సెన్సార్ తీర్మానం నెగ్గడం అంటే, ప్రభుత్వ విధి విధానాలకు సభ ఆమోదం తెలపడం లేదని అర్థం. సెన్సార్ తీర్మానం నెగ్గినప్పటికీ మంత్రివర్గం రాజీనామా చేయనవసరం లేదు. సెన్సార్ తీర్మానం ఏ ఒక్క మంత్రికి వ్యతిరేకంగానో, లేక, ఒకరికంటే ఎక్కువ మంత్రుల బృందానికి వ్యతిరేకంగానో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అవిశ్వాస తీర్మానం మాత్రం యావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వుంటుంది. ఒక్కో సారి, ప్రభుత్వమే, అది ప్రతిపాదించిన కొన్ని బిల్లుల విషయంలో, ఒక అడుగు ముందుకు వేసి, ఆ బిల్లు సభ ఆమోదం పొందడం అంటే, తమ ప్రభుత్వంపై విశ్వాసం ప్రకటించినట్లే అని స్పష్టం చేస్తుంది. అసంతృప్తితో వున్న అధికార పక్ష సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేయకుండా నిరోధించే చర్యలు కూడా చేపడ్తుంది ప్రభుత్వం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృక అని చెప్పుకునే బ్రిటీష్ సాంప్రదాయం ప్రకారం, ద్రవ్య వినియోగ బిల్లు కనుక చట్ట సభ ఆమోదం పొంద లేకపోతే, అవిశ్వాస తీర్మానం గెలిచినప్పుడు జరిగే విధంగానే, ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వుంటుంది. పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలకు పోవాల్సిన పరిస్థితి కూడా కలుగుతుంది.

అవిశ్వాస తీర్మాన ప్రక్రియలో దేశ దేశాలలో కొన్ని తేడాలున్నాయి. జర్మనీ, స్పెయిన్, ఇజ్రాయెల్ లాంటి దేశాలలో, అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన ప్రతిపక్ష పార్టీ, అదే ప్రతిపాదనలో, ప్రభుత్వం ఓడిపోతే-అధినేత రాజీనామా చేస్తే, ఆయన స్థానంలో ఎవర్ని నియమించాలో కూడా తెలియచేయాలి. అంటే ఒకే ఓటు ద్వారా అధికారంలో వున్న ప్రభుత్వంపై అవిశ్వాసం, రాబోయే ప్రభుత్వంపై విశ్వాసం ప్రకటించడం అన్న మాట. బ్రిటీష్ సాంప్రదాయం ప్రకారం, ప్రతిపక్షాలకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే అవకాశం ఇవ్వకుండా, ప్రభుత్వమే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. చాలా సందర్భాలలో అవిశ్వాస తీర్మానాలు కేవలం ప్రభుత్వ పని తీరును విమర్శించేందుకు పరిమితం కావడంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అవి నెగ్గే అవకాశాలు లేకపోయినా ప్రతిపాదించడం చేయడం ప్రతిపక్షాల ఆనవాయితీ అయిపోయింది. అదే విధంగా, ఒకసారి అవిశ్వాస తీర్మానం వీగి పోతే ఒక నిర్దుష్ట కాలపరిమితి వరకు మళ్లీ ప్రతిపాదించడానికి ఆస్కారం లేదు. మన దేశంలో రాష్ట్రపతి ప్రసంగానికి, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం లాంటిదే, బ్రిటీష్ సాంప్రదాయంలో రాణి ప్రసంగానికి వుంటుంది. ఆ తీర్మానం వీగి పోయినా, ప్రభుత్వం రాజీనామా చేయాల్సిందే. అది కూడా ప్రభుత్వానికి సభ విశ్వాసం కోల్పోయినట్లే భావించాలి. 

                ప్రప్రధమ పార్లమెంటరీ సాంప్రదాయ అవిశ్వాస తీర్మానం మార్చ్ 1782 లో బ్రిటన్‌లో ప్రవేశ పెట్టడం జరిగింది. అమెరికన్ రివల్యూషనరీ యుద్ధంలో, యార్క్ టౌన్ వద్ద బ్రిటీష్ ప్రభుత్వం ఓటమి చెందడంతో, అప్పటి ప్రధాన మంత్రిపైన, మంత్రి మండలిపైనా విశ్వాసం లేదని ప్రతిపక్షాలు పార్లమెంటులో తీర్మానం ప్రతిపాదించాయి. అయితే, వెంటనే, తన రాజీనామాను నాటి ప్రధాని లార్డ్ నార్త్ బ్రిటీష్ రాణికి సమర్పించడంతో కథ సుఖాంతమైంది. అదే విధంగా 19 వ శతాబ్దం తొలినాళ్లలో, కొందరు బ్రిటీష్ ప్రధాన మంత్రులు తమకు సభలో మెజారిటీ లేకపోయినా పాలన చేసేందుకు ప్రయత్నాలు చేయడంతో, ప్రతిపక్షాల నుంచి మొదలైన వ్యతిరేకత, శతాబ్దపు మధ్యకాలానికల్లా, అవిశ్వాస తీర్మానం ఒక పటిష్టమైన ఆయుధంగా మారడానికి దారి తీసింది. ఇప్పటి వరకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటన్‌లో, 11 మంది ప్రధాన మంత్రులు అవిశ్వాస తీర్మానం పుణ్యమా అని పదవులను కోల్పోయారు. 1925 తరువాత ఒకే ఒక్క సారి-జేమ్స్ కాలహాన్ కు వ్యతిరేకంగా మాత్రమే అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఆధునిక కాలంలో, సర్వసాధారణంగా, అవిశ్వాస తీర్మానాలను నెగ్గించుకోవడం దాదాపు జరగడం లేదనే అనాలి. పార్టీ క్రమశిక్షణ పేరుతో విప్ జారీ చేయడంతో విధిగా ఏ పార్టీ వారు ఆ పార్టీకే ఓటు వేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులు  ఆ విధంగా అవిశ్వాస సమయంలో తగ్గి పోయాయి. ఒకటి రెండు ఓట్ల మెజారిటీతో అధికారంలో కొచ్చిన సందర్భాలలో అవిశ్వాస తీర్మానాలు నెగ్గుతున్నాయే మో కాని సాధారణంగా ఓటమి పాలే అవుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాలలో అవిశ్వాస తీర్మానాలను ఎక్కువ సార్లు ప్రతిపాదించడం జరుగుతోంది.

Tuesday, March 12, 2013

పోప్ ఎన్నిక ఒక బృహత్తర ప్రహసనం: వనం జ్వాలా నరసింహారావు


పోప్ ఎన్నిక ఒక బృహత్తర ప్రహసనం

వనం జ్వాలా నరసింహారావు

వాటికన్‍లో మహా ఎన్నిక

ఆంధ్రజ్యోతి దినపత్రిక (14-03-2013)

          పోప్-పదహారవ బెనెడిక్ట్ తన 85 వ ఏట, ఫిబ్రవరి నెల చివరలో పదవికి రాజీనామా చేశారు. 1415 వ సంవత్సరంలో అప్పటి పోప్ పన్నెండవ గ్రెగొరీ రాజీనామా అనంతరం ఇన్నేళ్లకు ఇలా జరగడం ఇదే మొదటి సారి. పోప్ బెనెడిక్ట్ రాజీనామాతో, మరో మారు శతాబ్దాల కాలం నాటి ప్రక్రియైన ఆయన వారసుడి ఎన్నికకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో, కాథలిక్ చర్చికి కొత్త పోప్‌ను ఎన్నుకునేందుకు రంగం ఆరంభమైంది. సోమవారం (11-03-2013) తుది ఎత్తుగడల దశకు చేరుకున్న ఈ ప్రక్రియ, మంగళవారం (12-03-2013) ప్రారంభమైన కార్డినళ్ల రహస్య మహా సమ్మేళనంతో కీలక ఘట్టానికి చేరుకుందిఎన్నిక నేపథ్యంలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వీరిలో ఒకరు ఇటలీలోకి చెందిన మిలన్ ఆర్బిబిషప్ ఏంజెలో స్కోలా కాగా, మరొకరు బ్రెజిల్‌లో గల సావో పాలో బిషప్ ఒడిలో షేరర్.  115 మంది ఓటింగ్ అర్హతగల కార్డినళ్లలో మూడో వంతు మంది మద్దతు పొందిన వారే పోప్ కాగలరు. పోప్ ఎంపికలో పాల్గొంటున్న ఓటర్లు-కార్డినళ్లందరూ ఆదివారం నాడే సామూహిక ప్రార్థనల్లో పాల్గొని, మార్గనిర్దేశం కోసం పరిశుద్ధాత్మను వేడుకున్నారు.

పోప్ ఎన్నిక ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా, కడు రహస్యంగా, ఒక వేడుకగా జరుగుతుంది. ఈ ఎన్నికలో ఓటర్లయిన కార్డినళ్లు, చర్చ్ లోని సీనియర్ మతాధికారులు. వీరందరినీ, పోప్ నియమిస్తారు. వీరిలో కొందరు ఎప్పుడో ఒకప్పుడు పోప్ అయ్యే అవకాశాలుంటాయి. ఎన్నికకు ముందు వీరందరినీ, వాటికన్ సిటీలో సమావేశం కావడానికి ఆహ్వానిస్తారు. వారందరు వచ్చిన తరువాత ఎన్నిక ప్రహసనం-కాంక్లేవ్ మొదలవుతుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 69 దేశాలకు చెందిన 203 మంది కార్డినళ్లున్నారు. కాకపోతే వీరందరికీ ఓటు హక్కు లేదు. 1975 లో సవరించిన నిబంధనల ప్రకారం, 80 సంవత్సరాల వయస్సు దాటిన కార్డినళ్లను ఓటింగ్ నుంచి మినహాయించారు. అలా కుదించిన తరువాత ఆ సంఖ్య ఇంతవరకు 120 కి మించలేదు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటింగ్ కాన్‍క్లేవ్‍కు కేవలం 115 మందికి మాత్రమే అర్హత వుంది. అయితే వీరిలో 78  సంవత్సరాల వయసున్న జకార్తాకు చెందిన కార్డినల్ జూలియస్ ధర్మాత్మడ్జ, ఆరోగ్య కారణాల వల్ల ఓటింగ్‌లో పాల్గొనడం లేదు. అదే విధంగా, బ్రిటన్‌కు చెందిన కార్డినల్ కీత్ ఓబ్రియెన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నందున రాజీనామా చేసినందున ఆయనా ఓటింగులో పాల్గొనడం లేదు.



సాధారణంగా, కార్డినళ్ల కళాశాల డీన్, పోప్ ఎన్నిక కాన్‍క్లేవ్‍ను సమావేశ పరిచే బాధ్యత తీసుకుంటారు. అయితే, ప్రస్తుతం ఆ పదవిని నిర్వహిస్తున్న ఇటాలియన్ కార్డినల్ యాంజిలో సొడానో వయస్సు 85 దాటినందున, ఓటింగ్‌కు అర్హత లేనందున, ఆ బాధ్యతను సీనియర్ కార్డినల్ ఓటరైన గియోవన్ని బట్టిస్టాకు అప్పగించారు. ప్రస్తుతం ఓటర్లుగా వున్న కార్డినళ్లలో ఎక్కువ మందిని మొన్న రాజీనామా చేసిన పోప్ నియమించగా, మిగతా వారిని-49 మందిని ఆయన కంటే ముందు పోప్ గా పనిచేసిన జాన్ పాల్-II నియమించారు. కార్డినళ్లలో 60 మంది యూరోపియన్లు, 21 మంది ఇటాలియన్లు, 19 మంది లాటిన్ అమెరికన్లు, 14 మంది ఉత్తర అమెరికా వారు, 11 మంది ఆఫ్రికన్లు, 10 మంది ఆసియా ఖండం వారున్నారు. ఒకరు ఓషియానియాకు చెందిన వారు. పోప్ రాజీనామా తరువాత ఆయన వారసుడు-నూతన పోప్‌ను ఎన్నుకునేంతవరకు, చర్చ్ పాలనా వ్యవహారాలను కార్డినల్ టార్‍సిస్కో బెర్టోన్ నాయకత్వాన కార్డినళ్ల కళాశాల నిర్వహిస్తుంది. ఆయనే యావత్ ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షించాలి. వాటికన్ సిస్టయిన్ చాపెల్ లో ప్రతి రోజూ జరిగే నాలుగు దఫాల రహస్య ఎన్నికల బ్యాలెట్ నిర్వహణ బాధ్యత కూడా అయనదే. ఎన్నిక కాన్‍క్లేవ్ జరిగినంత కాలం, కార్డినళ్లందరూ, విధిగా, వాటికన్‌లోనే వుండి తీరాలి, బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలుండ కూడదు. వుండే అవకాశం కూడా లేదు. కాన్‍క్లేవ్ జరిగినప్పుడు, రిటైరైన కార్డినళ్లతో సహా, అందరూ, కట్టు దిట్టమైన ఏర్పాట్ల మధ్య అత్యంత రహస్యంగా, కాబోయే పోప్ ఎవరనే విషయంలో చర్చించుకుంటారు. కార్డినళ్లలో ఎవరో ఒకరిని మాత్రమే పోప్ గా ఎన్నుకోవాలన్న నిబంధన ఏదీ లేదు. కాకపోతే, అనాదిగా-సాంప్రదాయ బద్ధంగా వస్తున్న ఆచారం మేరకు, ఇంతవరకు, ఎవరో ఒక కార్డినల్‍నే పోప్ గా ఎన్నుకుంటూ వస్తున్నారు. ఎవరిని ఎంపిక చేసుకోవాలనే విషయంలో ప్రతి కార్డినల్ కూడా తమ అంతరాత్మ ప్రబోధం మేరకే, భగవదాజ్ఞగా నడుచుకుంటారు. రాజకీయం లేదంటానికి వీలైతే లేదు. అంతో ఇంతో రాజకీయం వుండడానికి అవకాశాలు లేకపోలేదు. పోప్ కాదల్చుకున్న వారు ఓటరులపై ప్రభావం చూపే ఆస్కారం కూడా లేక పోలేదు.



పోప్ ఎన్నిక అత్యంత రహస్యంగా-ఒక ప్రత్యేకత సంతరించుకున్న విధానంలో జరుగుతుంది. వాటికన్ సిటీలో, ఎన్నిక జరగాల్సిన ఒక గదిలో వుంచి తాళం వేసి, దాదాపు నిర్బంధానికి గురిచేసిన తరహాలో, కార్డినళ్లందరినీ సమావేశపర్చి, మరీ ఎన్నిక జరుపుతారు. వారందరూ విధిగా ఒక అవగాహనకు వచ్చి, మూడింట రెండొంతుల మెజారిటీతో పోప్‌ను ఎన్నుకునేంతవరకు వారు ఆ గదిలో వుండాల్సిందే. ఎన్నిక పూర్తి కావడానికి ఎన్ని రోజులైనా పట్టవచ్చు. గత శతాబ్దాలలో కొన్ని సార్లు వారాల-నెలల తరబడి ఎన్నిక ప్రక్రియ జరిగిన సందర్భాలు కూడా వున్నాయి. కొన్ని సార్లు కొందరు కార్డినళ్లు కాన్‍క్లేవ్ పూర్తయ్యేలోపుగా మరణించిన ఉదాహరణలు కూడా వున్నాయి. ఓటింగ్ ప్రక్రియలో జరిగిన ఏ అంశం కూడా, ఎట్టి పరిస్థితులలో కూడా బయటకు పొక్కకుండా వుండే రీతిలో పటిష్టమైన ఏర్పాట్లుంటాయి. ఓటింగ్ సమయంలో కాని, ఓటింగ్ పూర్తైన తరువాత కూడా కాని, అక్కడ చోటు చేసుకున్న విషయాలు రహస్యంగా వుండి తీరాల్సిందే! ఎవరైనా ఆ రహస్యాలను బయటకు చెప్పే ధైర్యం చేస్తే, వారికి మత బహిష్కారం తప్పదనే భయం కార్డినళ్లందరికీ వుంటుంది. పోప్ జాన్ పాల్-II ఆయన హయాంలో ఎన్నిక నిబంధనలో కొన్ని మార్పులు చేసి, సాధారణ మెజారిటీ ద్వారా పోప్ ఎన్నిక కావడానికి శ్రీకారం చుట్టారు. అయితే, బెనెడిక్ట్-XVI ఆ నిబంధనను మళ్లీ మార్చి, మూడింట రెండు వంతుల మెజారిటీ తప్పని సరి చేశారు. ఓటింగ్ ప్రారంభానికి పూర్వ రంగంలో, ఆ ప్రాంగణాన్ని సమూలంగా తనిఖీ చేస్తారు. రహస్య మైక్రోఫోన్లు కాని, కెమెరాలు కాని లేవని మరీ-మరీ నిర్ధారించుకుంటారు. ఒక్క సారి కాన్‍క్లేవ్ ప్రారంభమవుతే, ఇక, అప్పటినుంచి, పోప్ ఎన్నిక అయ్యేంతవరకూ, కార్డినళ్లందరికీ భోజనం, బస, నిద్ర అన్నీ అక్కడే. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం వుండదు. ఆరోగ్య-వైద్య పరమైన అత్యవసర పరిస్థితి కలిగితే తక్షణ సహాయం అందించే వీలుంది. రేడియో కాని, టెలివిజన్ కాని, మొబైల్ ఫోన్ కాని, కనీసం వార్తా పత్రికలు కాని అందుబాటులో వుండవు. ఇద్దరు వైద్యులకు, ఒకరిద్దరు మతాచార్యులకు మాత్రం ప్రవేశముంటుంది. వాళ్లు కూడా రహస్యం పాటిస్తామని ప్రమాణం చేయాలి.

వాటికన్‌లోని సిస్టయిన్ చాపెల్ ఆవరణలో పోప్ ఎన్నిక జరుగుతుంది. ఆ ఆవరణ మొత్తం దైవత్వంతో నిండి వుంటుందని కార్డినళ్ల భావన. తాము చేయబోయే ప్రతి పని ఏనాడో-ఒకనాడు అక్కడున్న భగవంతుడు గమనిస్తూనే వుంటాడని వారందరి నమ్మకం. కాన్‍క్లేవ్ ప్రారంభమయ్యే రోజున, కార్డినళ్లందరూ సామూహిక ప్రార్థనల్లో పాల్గొని, మార్గనిర్దేశం కోసం పరిశుద్ధాత్మను వేడుకుంటారు. ఆ తరువాత వారందరు ఓటింగ్ హాలులోకి ప్రవేశించి, రహస్యాలు కాపాడుతానని ప్రమాణం చేస్తారు. గది తలుపులు మూసి వేసే ముందు, కార్డినళ్లు-ఓటర్లు కానివారందరు, హాలు నుంచి నిష్క్రమించాల్సిందిగా లాటిన్ భాషలో ఒక కమాండు కనిపిస్తుంది. ఓటింగ్ ప్రక్రియ మొదలవడానికి పూర్వం, బ్యాలెట్ పత్రాలను, వాటి కొరకు ఎంపిక చేయబడిన ఇద్దరు మాస్టర్లు, కార్డినళ్లకు పంపిణీ చేస్తారు. ఓటింగులో పాల్గొనే కార్డినళ్లలో ముగ్గురిని పర్యవేక్షకులుగా, ముగ్గురిని వారి పనిని మరో విడత పరిశీలించేందుకు గాను నియమించడం జరుగుతుంది. మొదటి రోజున ఒకే ఒక్క బ్యాలెట్ నిర్వహించినప్పటికీ, మర్నాటి నుంచి ఉదయం రెండు పర్యాయాలు, మధ్యాహ్నం రెండు సార్లు ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. బ్యాలెట్ పత్రం దీర్ఘ చతురస్రాకారంలో వుంటుంది. పేపర్ పై భాగంలో నేను....ఫలానా వ్యక్తిని...పోప్ గా ఎన్నుకుంటున్నాను అని రాసి వుంటుంది. దాని కింద ఆ వ్యక్తి పేరు రాయడానికి జాగా వుంటుంది. రాయడానికి వీలుగా, పేపర్ మడవడానికి అనువుగా జాగ్రత్త తీసుకుంటారు. ఎవరు ఫలానా వ్యక్తి పేరు రాసింది అని కనుక్కోవడానికి వీలు లేని పద్ధతి అనుసరిస్తారు. అందరు తమ బ్యాలెట్లను ఇచ్చిన తరువాత వాటన్నిటినీ కలిపి, కలగాపులగం చేసి, లెక్కించుతారు. ఆ తరువాత వాటిని తెరుస్తారు. బ్యాలెట్ పత్రాలన్నిటినీ ఒక చోటు చేర్చి, ఒక రకమైన పదార్ధాన్ని కలిపి, వాటిని తగులపెట్టారు. నల్లటి ఆకారంలో బయట వున్న వ్యక్తులకు కనిపించే విధంగా పొగ వచ్చే ఏర్పాటు చేస్తారు. ఎప్పుడైతే, ఒక వ్యక్తికి మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తుందో, అప్పుడు ఆ పొగ తెల్లగా బయటివారికి కనిపించే ఏర్పాటు చేస్తారు. పోప్ ఎన్నికైనట్లు అదే గుర్తు. పోప్ ఎన్నికయ్యేంతవరకూ, పొగ నల్లగాను, ఎన్నికైన తరువాత తెల్లగాను కనిపించడం ఎన్నిక ప్రక్రియలో ఒక భాగం.

మూడు రోజుల తరువాత ఓటింగులో ఎవరికీ మెజారిటీ రాకపోతే, తాత్కాలికంగా ఓటింగ్ ప్రక్రియను ఒక రోజంతా నిలుపుదల చేస్తారు. ఆ రోజున ఒక సీనియర్ కార్డినల్ నేతృత్వంలో, ఏం చేస్తే బాగుంటుందన్న విషయంలో కొంత చర్చ జరుగుతుంది. ప్రార్థనలు కూడా చేస్తారు. ఎన్నికంతా పూర్తయిన తరువాత, ప్రతిరోజు-ప్రతి సెషన్‌లో జరిగిన ఓటింగ్ వివరాలను, ఫలితాలను, క్రోడీకరించి, ఒక డాక్యుమెంటు రూపంలో కొత్తగా ఎన్నికైన పోప్ కు అంద చేస్తారు. ఆ డాక్యుమెంటును అతి భద్రంగా ఒక పదిలపర్చి, సీల్ వేసి వుంచుతారు. పోప్ ఉత్తర్వుల మేరకు మాత్రమే దాన్ని తెరిచే వీలుంటుంది. ఓటింగ్ హాలులో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి, బయటివారికి వున్న ఏకైక మార్గం రోజూ రెండు పూటల వెలువడే "పొగ" మాత్రమే! తెల్ల పొగ కనిపించిందంటే పోప్ ఎన్నిక జరిగిందనుకోవాలి. మెజారిటీ సాధించి పోప్ గా ఎన్నికైన వ్యక్తిని అతని అంగీకారం తెలపమని అడుగుతారందరూ. ఏ పేరుతో పోప్ గా పిలువబడాలనుకుంటున్నాడో అని కూడా అడుగుతారు. అభినందనలతో పాటు కార్డినళ్లందరూ పోప్‌కు తమ విధేయతను కూడా తెలుపుకుంటారు. కొత్త పోప్‌కు సరిపడే కొత్త దుస్తుల ఏర్పాటు కూడా వెంటనే జరిగిపోతుంది. వివిధ సైజుల్లో ఆ పాటికే సిద్ధంగా వుంచిన దుస్తులను ఆయనకు అందచేస్తారు. సెయింట్ పీటర్ బాసిలికా బాల్కనీ నుంచి, "మనకు కొత్త పోప్ వచ్చారు" అన్న ప్రకటన వెలువడుతుంది. ఆయన పేరు వెల్లడవుతుంది. కొత్తగా ఎన్నికైన పోప్ బయట వేచి వున్న వారందరికీ దర్శనమిస్తారు. ఇక నాటి నుంచీ ఆయనే పోప్!
POST SCRIPT: March 14, 2013:

కొత్త పోప్.. ఫ్రాన్సిస్-1: కేథలిక్కుల అథిపతిగా అర్జెంటీనా బిషప్: తొలిసారి లాటిన్ అమెరికాకు అవకాశం
120 కోట్ల కేథలిక్కులకు కొత్త అధిపతి ఎన్నికయ్యారు. ఆయన... అర్జెంటీనాకు చెందిన జార్జ్ మారియో బెర్గోగ్లియో! బ్యూనస్ ఎయిర్స్ ఆర్చిబిషప్‌గా ఉన్న జార్జ్ ను, 115 మంది కార్డినల్స్ కొత్త పోప్‌గా ఎన్నుకొన్నారు. ఇందులో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. కొత్తపోప్ ఎంపికకు సూచికగా వాటికన్‌లోని సిస్టీన్ చాపెల్ ప్రాసాదం చిమ్నీ నుంచి బుధవారం అర్ధరాత్రి సమయంలో తెల్లటి పొగ సుడులు తిరుగుతూ వెలువడింది. వాటికన్‌లో కొత్త పోప్‌కు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్న వేలాదిమంది కేథలిక్కులు కేరింతలు కొట్టారు. కొత్త పోప్ ఎంపిక ప్రక్రియ మొదలైన రెండోరోజే 'తెల్ల పొగ రూపం'లో ఉత్కంఠ వీడింది. ఒక... కొత్త పోప్ ఎవరంటూ ప్రపంచమంతా వాటికన్‌లోని బాల్కనీ వైపు ఆసక్తిగా చూడ సాగింది. సుమారు గంట తర్వాత... ఆ ఉత్కంఠ కూడా వీడింది. అర్జెంటీనాకు చెందిన జార్జ్ బెర్గోగ్లియో 266 పోప్‌గా ఎన్నికైనట్లు ప్రకటన వెలువడింది. పోప్‌గా ఆయన తన పేరును 'ఫ్రాన్సిస్-1' అని మార్చుకున్నారు. బాల్కనీలోకి వచ్చి భక్తులకు అభివాదం తెలిపారు. పోప్‌గా తన తొలి సందేశం వినిపించారు. జెస్యూట్ మత వర్గానికి చెందిన తొలిపోప్ ఆయన. అంతేకాదు... లాటిన్ అమెరికా నుంచి ఎంపికైన తొలి పోప్ కూడా ఆయనే. ఆధునిక చరిత్రలో ఐరోపాయేతర దేశాల నుంచి ఎన్నికైన తొలిపోప్ కూడా ఆయనే. 
పోప్ ఫ్రాన్సిస్-1 వయసు 76 సంవత్సరాలు. ఆయన 1936 డిసెంబర్ 17న అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జన్మించారు. చిన్న వయసులోనే ఇన్‌ఫెక్షన్ సోకడంతో ఒక ఊపిరితిత్తి తీసేయాల్సి వచ్చింది. ఆయన 1998 నుంచి బ్యూనస్ ఎయిర్స్ ఆర్చిబిషప్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనను 2001లో పోప్ జాన్‌పాల్-2 కార్డినల్‌గా నియమించారు. ఫ్రాన్సిస్-1 ఫిలాసఫీ, సాహిత్యం, సైకాలజీ చదివారు. ఆయన పేదల పక్షపాతి. అవినీతికి వ్యతిరేకంగా గట్టిగా వాదిస్తారు. అర్జెంటీనాలో పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకోవడంలేదంటూ అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించారు. తమ దేశానికి చెందిన వారే పోప్‌గా ఎన్నిక కావాలంటూ అనేక దేశాల నుంచి వేలసంఖ్యలో భక్తులు తరలిరాగా... 'మీరు మాత్రం రావద్దు. మీ విమాన ప్రయాణానికి అయ్యే ఖర్చును చర్చికి విరాళంగా ఇవ్వండి. ఆ నిధులను పేదల బాగుకోసం ఖర్చు చేయవచ్చు' అని అర్జెంటీనా వాసులకు ఆయన ముందుగానే పిలుపునిచ్చారు.
పోప్ ఫ్రాన్సిస్-1 అర్జెంటీనాకు చెందినప్పటికీ... ఆయన మూలాలు మాత్రం ఇటలీలో ఉన్నాయి. ఆయన తండ్రి ఇటలీలో రైల్వే ఉద్యోగి. నిరాడంబర జీవితానికి ఆయన పెట్టింది పేరు. బస్సులోనే ప్రయాణిస్తారు. స్వలింగ సంపర్కులను వ్యక్తులుగా గౌరవించినా... స్వలింగ సంపర్క వివాహాలకు మాత్రం వ్యతిరేకి. కుటుంబ వ్యవస్థను గౌరవించాలని సూచిస్తారు. పిల్లలను పెంచడం, చదివించడం తల్లిదండ్రుల బాధ్యత అని బోధిస్తారు. 2005లోనూ ఆయన పేరు పోప్ పదవికి ప్రముఖంగా వినిపించింది.