Thursday, December 31, 2015

బాలకాండ మందరమకరందం సర్గ-8 : పుత్ర హీనతకు విషాద పడిన దశరథుడికి అశ్వమేథ యాగం చేయాలన్న ఆలోచన : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-8
పుత్ర హీనతకు విషాద పడిన దశరథుడికి
అశ్వమేథ యాగం చేయాలన్న ఆలోచన
వనం జ్వాలా నరసింహారావు

ధార్మికుడు, భగవదవతారానికి అన్ని అర్హతలున్న దశరథుడు, భగవదారాధన రూపకమైన యజ్ఞాన్ని మున్ముందు చేయబోతున్నాడనే విషయాన్ని వివరిస్తాడీ సర్గలో వాల్మీకి మహర్షి. విష్ణుమూర్తికి శ్రీదేవి-భూదేవి-నీళాదేవి లాగా, ధర్మ-అర్థ-కామాల లాగా, రాజస-సాత్విక-తామస గుణాలున్న ముగ్గురు భార్యలున్నారు దశరథ మహారాజుకు. ధర్మ బుద్ధిగల కౌసల్య, బంగారు కొండలాంటి సుమిత్ర, రూపమే ప్రధానమైన కైకేయి లే ఆ ముగ్గురు. కౌసల్యకు రజో గుణం, సుమిత్రకు తత్వ గుణం, కైకకు తమో గుణం ప్రధానంగా వున్నాయి. ముగ్గురిలో ఇలా మూడు రకాలైన గుణాలుండడం విశేషం. కౌసల్య కోసల రాజుకు, సుమిత్ర మగధ రాజుకు, కైక కేకయ రాజుకు కూతుళ్లు. భోగభాగ్యాలెన్ని వున్నా కొడుకులున్న సుఖం దశరథుడికి  గానీ, కన్నకొడుకులను ఎత్తుకునే అదృష్టం ముగ్గురు భార్యలకు గానీ లేదు. సంతానం లేదన్న కారణాన తపస్సు చేసినా ఫలితం దక్కలేదు. సుందర మందిరాలు-సువాసనలిచ్చు పూలతోటలు-ఏనుగు దంతాలతో, బంగారు రత్నాలతో కట్టిన అసమాన శాలలు-రాజ్య విలాస క్రీడలు-సుకుమారంలో రతీదేవిని మించిన సుందరమైన భార్యలు-అసమాన పరాక్రమం వున్నా, సంతానం లేనందున, సుఖాలెన్ని వున్నా-కుమారులవలన కలిగే భోగ భాగ్యాలతో సరితూగవని-తన తపస్సు వ్యర్థమనీ బాధపడేవాడు దశరథుడు.

(బ్రాహ్మణుడు పుట్టుకతోనే బ్రహ్మచర్యమైన ఋషుల రుణం, యజ్ఞాలైన దేవ రుణం, బిడ్డలను కనాల్సిన పితృ రుణం అనే మూడు రుణాలతో జన్మిస్తాడు. సుతులు లేనివారికి గతులు లేవంటారు. కొడుకులవల్ల జయం-మనుమల వల్ల సౌఖ్యం-ముని మనుమల వల్ల స్వర్గ సుఖం కలుగుతాయి. ఈ సుఖ సౌఖ్యాలన్నీ సత్ పుత్రులైతేనే. ఇదే మోతాదులో, దుష్ట పుత్రులవల్ల కీడు కలుగుతుంది. అందుకే, ఆజన్మాంతం భగవత్ భక్తి లేనివాడు తమ వంశంలో పుట్ట కూడదని, పుట్టినా వెంటనే చచ్చిపోవాలనీ పితృదేవతలు కోరుకుంటారు).

మనస్సులో పరితపిస్తున్న దశరథుడు సభా మందిరానికి వచ్చి, మంత్రులతో సమాలోచనలు చేస్తాడు. పుత్రులు కలిగేందుకు అశ్వమేథ యాగం చేస్తాననీ-అలా చేస్తే సంతానం కలగొచ్చనీ అంటాడు. అలా నిశ్చయించుకున్న వెంటనే, ఆ కార్యక్రమం గురించి ఆలోచించేందుకు, గురువులను-పురోహితులను తీసుకుని రావాలని, మంత్రులలో శ్రేష్టుడైన సుమంత్రుడిని కోరతాడు దశరథుడు. రాజాజ్ఞ ప్రకారం సుమంత్రుడు ఏమాత్రం ఆలశ్యం చేయకుండా, వేదాధ్యయనం చేసే వాసుదేవుడిని-సుయజ్ఞుడిని-జాబాలిని-కాశ్యపుడిని, ముఖ్య గురువైన వశిష్ఠుడిని, ఇంకొందరు ప్రముఖులను స్వయంగా వెళ్ళి తోడుకొని వస్తాడు. దశరథుడు వారినుద్దేశించి, ఇంతమంది తపస్సంపన్నులు తనకు సహాయం చేస్తున్నప్పటికీ, క్రూర గ్రహాలు తనకు కొడుకులు పుట్టకుండా ఎలా చేయగలుగుతున్నాయని ప్రశ్నిస్తాడు. సూర్యుడు మొదలు తన తరం వరకూ, అవిచ్ఛిన్నంగా వస్తున్న తమ వంశం, తన తదనంతరం ఆగిపోతే, రాజ్యం పరుల పాలై తనకు అపకీర్తి వస్తుందని వారితో అంటాడు దశరథుడు. సంతానం కలగలేదని చింతా సాగరంలో మునిగి బాధపడుతున్న తనకేదన్నా దారి చూపమని వారిని అడుగుతాడు. పుత్రులకొరకు అశ్వమేథ యాగం చేద్దామన్న తన కోరిక నెరవేరే ఉపాయం ఆలోచించమని కోరుతాడు. దశరథుడి ఆలోచన సక్రమంగానే వుందనీ-దానికవసరమైన పనులు ప్రారంభించమనీ వశిష్ఠుడితో సహా అందరు సలహా ఇస్తారు దశరథుడికి.


సందేహం మాని గుర్రాన్ని దేశ సంచారం కొరకు పంపాలనీ, పుత్రులు అవశ్యం కలుగుతారని, ధర్మబుద్ధిగల దశరథుడికి నీతిమంతులైన పుత్రులే పుడతారని వారంటారు. బ్రాహ్మణ వాక్యం వ్యర్థం కాదని నమ్మిన దశరథుడు, తన కప్పుడే పుత్రులు కలిగిన ఆనందంతో ఉప్పొంగి పోతాడు. యజ్ఞానికి కావల్సిన సమస్త సామాగ్రిని సమృద్ధిగా సమకూర్చాలని మంత్రులను ఆజ్ఞాపిస్తాడు. గురువులు చెప్పినట్లే గుర్రాన్ని విడవాలని-దానికి రక్షణగా ఒక పురోహితుడిని పంపాలని-సరయూనదీ తీరాన యజ్ఞశాల నిర్మించాలని-శాస్త్ర ప్రకారం జరగాల్సిన విధులన్నీ నిర్వహించాలని, దశరథుడు ఆదేశిస్తాడు. ఇలాంటి యజ్ఞాన్ని అందరు రాజులకు చేయాలన్న కోరికున్నప్పటికీ, మంత్రలోపమో-తంత్రలోపమో-శ్రద్ధాలోపమో-దక్షిణాలోపమో జరిగితే, ఇబ్బందులెదురైతాయనీ, అందుకే చేయడానికి భయపడుతారనీ అంటూ, అవేమీ లేకుండా చూడమని మంత్రులకు చెప్తాడు దశరథుడు.

యజ్ఞం నిర్వహణలో ఎక్కడో అక్కడ ఏదన్నా లోపం జరుగకపోతుందానని కాచుక్కూచుండే బ్రహ్మ రాక్షసులు దాన్ని విఘ్నం చేసేందుకు సకల ప్రయత్నాలు చేస్తారనీ-అదే జరిగితే కర్తకు కీడు కలుగుతుందనీ-అందువల్ల ఎలా చేస్తే విఘ్నాలు లేకుండా కొనసాగుతుందో అలానే సమర్థవంతంగా చేయాలని అంటాడు దశరథుడు. (పతితులతో కలిసిమెలిసి వుండేవాడు, పర స్త్రీ సాంగత్యం చేసేవాడు, బ్రాహ్మణుడి సొమ్ము అపహరించేవాడు, బ్రహ్మ రాక్షసుడిగా పుట్తాడు. రాక్షసుల్లో బ్రాహ్మణులు బ్రహ్మ రాక్షసులు. రావణాసురుడు క్షత్రియ రాక్షసుడు).


దశరథుడి లాంటి గొప్పవారు, సత్యాత్ములు పూనుకొని చేసే కార్యక్రమాలు విఘ్నం లేకుండా జరుగుతాయని చెప్తూ, పనులన్నీ చక్కగా నెరవేరుస్తామని హామీ ఇస్తారు మంత్రులు. మంత్రులు-పురోహితులు మినహా మిగతావారందరు అప్పటికింక దశరథుడిని దీవించి, శలవు తీసుకుంటారు. యజ్ఞం కొరత లేకుండా జరగడానికి కావలసినవన్నీ సమకూర్చమని మంత్రులను మళ్లీ ఆజ్ఞాపించి, దశరథుడు అంతఃపురానికి వెళ్తాడు. పుత్రులు కలగడానికి కారణమైన యజ్ఞాన్ని చేయబోతున్నానని, అంతఃపురంలోని తన భార్యలతో అంటూ, ఆ రోజునుండి వారుకూడా దీక్షతో వుండాలని కోరతాడు దశరథుడు. 

Wednesday, December 30, 2015

బాలకాండ మందరమకరందం సర్గ-6 : దశరథ మహారాజు గుణ వర్ణన : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-6
దశరథ మహారాజు గుణ వర్ణన
వనం జ్వాలా నరసింహారావు

మహారథుల సమూహం తనను ఎల్ల వేళలా సేవిస్తుంటే, వైకుంఠాన్ని శ్రీమహావిష్ణువు పరిపాలించిన విధంగానే, అయోధ్యా నగరాన్ని దశరథ మహారాజు కీర్తివంతంగా పరిపాలించేవాడు. వేద వేదాంతాలైన ఉపనిషత్తుల అర్థం తెలిసినవాడు దశరథుడు. స్వయంగా అర్థాన్ని గ్రహించగల పాండిత్యముంది ఆయనలో. పండితులను-వీరులను, ధనం-గౌరవం ఇచ్చి, తనకనుగుణంగా మలచుకోగలిగిన గుణవంతుడు. భవిష్యత్ లో జరగనున్న సంగతులను, మున్ముందుగానే పసిగట్టగల శక్తిమంతుడు దశరథుడు. పట్టణ-పల్లె వాసులకు ఏం చేస్తే మేలుకలుగుతుందో, దాన్నే ఆలోచించి సమకూర్చగల సమర్థుడు. ఇక్ష్వాకుల వంశంలోని రాజులందరిలోనూ అతిరథుడు-అగ్రగణ్యుడు. యజ్ఞ యాగాలు చేయడంలో ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తుంటాడు. మనుష్యులకు, పశుపక్ష్యాదులకు ఉపయోగపడాలని భావించి, బావులు-గుంటలు-తోటలు తవ్వించాడు. సమస్త ప్రజలను తనకనుకూలంగా మలచుకోగల నేర్పరి. మహర్షులతో సరిసమానమైన వాడు. రాజర్షులలో శ్రేష్టుడు. యావత్ ప్రపంచం కొనియాడదగిన శ్రీమంతుడు-కీర్తిమంతుడు. అతిశయించిన దేహబలం-కండబలం వున్నవాడు. శత్రువులను అవలీలగా జయించినవాడు-జయించగలవాడు. మిత్రులు-విశ్వాసపాత్రులతో కలిమిడిగా వుంటాడు. ఇంద్రియాలను జయించిన వాళ్లలో మొదటగా చెప్పుకోవాల్సినవాడు. పర్వతరాజైన హిమవంతుడి ధైర్యంతో-ఆదిశేషుడి విద్యలతో పోల్చదగిన దశరథ మహారాజుకు సరితూగేవారు రాజ కులంలో ఇంకెవ్వరు లేరంటే అతిశయోక్తికాదేమో.

అసలు-సిసలైన బంగారు రత్నాభరణాలను, విలువైన వస్త్రాలను ధరించి, ఇంద్ర కుబేరులతో సరితూగుతూ, ఆజ్ఞా రూపంలో సర్వత్రా వ్యాపించి, వైవస్వత మనువువలె పరాక్రమవంతుడై, జగజ్జనులను పాలిస్తూ, సత్యవంతుడై, ధర్మ-అర్థ-కామాలను రక్షించే విధానం తెలిసున్నవాడిలా, అయోధ్యా పురాన్ని పరిపాలించేవాడు దశరథ మహారాజు. (దశరథుడు రాజ్యం చేస్తున్న రోజుల్లో కొందరు జ్యోతిష్కులు ఆయన్ను కలిసి, శనైశ్చరుడు రోహిణీ శకటాన్ని భేదించే ప్రయత్నంలో వున్నాడని-ఆయనట్లా చేస్తే పన్నెండు సంవత్సరాలు దేశంలో దుర్భర పరిస్థితులు నెలకొనే ప్రమాదముందని చెప్పాడు. అది విన్న దశరథుడు, నక్షత్ర మండలానికి తన రథంపై పోయి, శనైశ్చరుడిని ఎదిరించి-తాను జీవించి వున్నంతవరకు ఆయన రోహిణీ శకటాన్ని భేదించడం కుదరదని స్పష్ఠం చేశాడు. అవసరమైతే యుద్ధం చేసి-ఆయన్ను గెలిచి-ఆయన ప్రయత్నాన్ని అడ్డుకుంటానని హెచ్చరించాడు. దశరథుడి కోరిక మేరకు, ఆనాటినుండి శనైశ్వరుడు రోహిణీ నక్షత్రాన్ని ఆనుకుని పోవడమే కాని భేదించే ప్రయత్నం చేయలేదు. అదీ దశరథుడి ప్రజాహిత కాంక్ష.

అయోధ్యా పురజనుల వర్ణన

అయోధ్యా పురంలోని బ్రాహ్మణులు బాహ్యేంద్రియాలను-అంతరేంద్రియాలను, జయించినవారు. పరులను వంచించాలనే దురాచారానికి దూరంగా వుంటారు. ఎటువంటి అనాచారానికి లోనుకాకుండా, సత్యాన్నే పలుకుతూ, భగవత్ కథలనే వల్లించి కాలయాపన చేస్తూ, యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ, నిర్మల బుద్ధితో వుంటారు. వేదాల్లో చెప్పిన కర్మ కార్యాలను నెరవేరుస్తూ, అడిగిన వారికి లేదనకుండా శక్తికొలది దాన ధర్మాలు చేస్తుంటారు. అక్కడి వారెవరికీ, ఇతరులను యాచించాల్సిన పనేలేదు. ఆరంగాల (శిక్ష-వ్యాకరణం-ఛందస్సు-నిరుక్తం-జ్యోతిష్యం-కల్పం) వేదాధ్యయనం చేయడం వారికి నిత్య కృత్యం. పెద్ద మనసుతో పుణ్య కార్యాలను చేస్తూ, దేవర్షులతో-మహర్షులతో సమానంగా, సూర్య చంద్రుల తేజస్సుతో-వర్ఛస్సుతో భగవధ్యానం చేస్తూ, సదాచార సంపన్నులై మెలగుతుండేవారు.

(వాసుదాసుగారు ఈ వర్ణనను చేస్తూ రాసిన పద్యంలో: బ్రాహ్మణులను ద్విజాతులని-వేదషడంగ పారగోత్తములని–అహితాగ్నులని–సహస్రదులని–మహామతులని–సత్యవచస్కులని-హిమకరమిత్ర తేజులని- ఋషులని పోలుస్తారు. మరో పద్యంలో హృష్ఠ మానసులని - శాస్త్ర చింతన పరాయణులని – స్వస్వతుష్టులని – త్యాగశీలురని - భూరి సంచయులని వర్ణిస్తారు).

అయోధ్యా వాసులందరూ సంతుష్టిగల మనసున్నవారే – ధర్మాన్నెరిగినవారే - శాస్త్ర సంబంధమైన ఆలోచనలు చెసే వారే. దేవుడిచ్చిన దాంతోనే సంతృప్తి చెందేవారు. త్యాగ బుద్ధిగలవారు. నిజాన్ని మాత్రమే చెప్పే గుణంగలవారు. తమకెంత అవసరమో అంత సంపాదన మాత్రమే చెసేవారు. అవసరాని సరిపోయే ఆవులను, గుర్రాలను, సిరి సంపదలను కలిగినవారు. కుటుంబం అంటే శాస్త్రాల్లో ఎటువంటి నిర్వచనం చెప్పబడిందో, దానికనుగుణంగానే, పదిమంది (తను-తన తల్లి, తండ్రి, భార్య-ఇద్దరు కొడుకులు-ఇద్దరు కోడళ్లు-ఒక కూతురు-ఒక అతిథి) కంటే తక్కువున్న ఇల్లు ఆనగరంలో లేదు. కొడుకులకు, భార్యకు కడుపునిండా భోజనం పెట్టకుండా బాధించేవారు కానీ, దాన ధర్మాలు అనుదినం చేయనివారు కానీ, ఆ నగరంలో కనిపించరు. అందమైన ఆ నగరంలో చెడ్డవారు కనిపించరు. పర స్త్రీలను ఆశించే వారు కానీ, భార్యతో కూడా నిషిద్ధ దినాలలో కామ క్రీడలు ఆడేవాడు కానీ, వేశ్యా లోలురు కానీ, చదువురాదననివారు కానీ, నాస్తికులు కానీ అయోధ్యలో లేనే లేరు.

(పూర్వ కాలంలో అన్ని జాతుల వారు కూడా విద్య నేర్చుకునేందుకు అర్హులనే విషయం దీనివల్ల స్పష్టమవుతున్నది. ఒకానొకప్పుడు శూద్రులని పిలువబడే వారికి విద్యార్హతలుండవని వాదనుండేది. అయితే అది తప్పుడు వాదనేననాలి. నాస్తికులు అసలు లేనే లేరన్నప్పుడు "జాబాలి" అన్న వ్యక్తి నాస్తిక వాదన ఎలా చేశాడన్న ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. జాబాలి చేసింది నాస్తికవాదమైనంత మాత్రాన, ఆయన నాస్తికుడు కావాలన్న నియమం లేదు. నాస్తిక వాదన ఆయనతో పుట్టలేదు-అంతకు పూర్వమే వుంది. దాన్నే "బృహస్పతి గీత" అంటారు. అయోధ్యలో నాస్తికులు లేరంటే, ఆ వాదనను అంగీకరించిన వారు లేరని మాత్రమే అర్థం).

అయోధ్యా వాసులందరూ ధర్మం, శీలం కలవారే-ప్రేమ స్వరూపులే-ఇంద్రియ నిగ్రహం కలవారే-మంచి స్వభావం వున్న వారే-దోషరహితమైన నడవడిక గల వారే-ఋషితుల్యులే-నిష్కళంకమైన మనసున్నవారే-ముత్యాల హారాలు ధరించి, చెవులకు కుండలాలను అలంకరించుకున్నవారే-అందచందాలున్న వారే-కురూపులు కాని వారే-మకుటాలు ధరించి, చందనం పూసుకుని, కొరత లేకుండా భోగ భాగ్యాలను అనుభవించే వారే-ఇష్టమైన ఆహారాన్ని తీసుకునే వారే-అన్న దాతలే-అవయవాలన్నిటినీ అలంకరించుకునే వారే. ఇంద్రియ నిగ్రహంతో పాటు, ఇంద్రియాలను జయించిన వారక్కడి జనులు. అందరూ సోమ యాగం చేసినవారే-అగ్నిహోత్రాలు కలవారే-వారి, వారి ఆచారం ప్రకారం వర్ణాశ్రమ ధర్మాలను పాటించేవారే-బ్రహ్మాన్ని ధ్యానిస్తూ, జప తపాలు చేసేవారే-దయాళులై, చక్కని నడవడి కలవారే. దశరథ మహారాజు పరిపాలన చేసే రోజుల్లో, అగ్నిహోత్రం లేనివాడు కానీ-సోమయాగం చేయని వాడు కానీ-అల్ప విద్య, అల్ప ధనం కలవాడు కానీ-వర్ణ సంకరులు కానీ-దొంగలు కానీ లేనే లేరు అయోధ్యా పురిలో.

తమ వర్ణానికి, ఆశ్రమానికి శాస్త్రోక్తమైన విహిత కర్మ ఏదో, దానినే బ్రాహ్మణులు శ్రద్ధతో ఆచరిస్తూ, విద్యా దానంలో-అధ్యయనంలో ఉత్తములై , వశ్యేంద్రులై, జితమనస్కులై, దానానికి పాత్రులై వుండేవారు. దశరథుడు పరిపాలన చేసే సమయంలో, చపలచిత్తులు, ఐహికాముష్మిక కార్య సాధనకు అవసరమైన దేహ బలం-మనో బలం లేనివారు, ఆరంగాలెరుగనివారు, అసత్యం పలికేవారు, ఈర్ష్య గలవారు, పాండిత్యం లేనివారు, చక్కదనం లేనివారు, పదివేలు తక్కువగా దానం చేసేవారు, దుఃఖించే వారు, రాజభక్తిలేని వారు, ఇతరులను పరవశులను చేయగల చక్కదనం లేని స్త్రీ-పురుషులు, స్త్రీలను స్త్రీలు-పురుషులను పురుషులు కూడా పరవశులు చేయగల చక్కదనం లేనివారు అయోధ్యా నగరంలో లేరు. అక్కడ నివసించే అన్ని వర్ణాలవారు దైవ పూజ చేయకుండా-అతిథిని ఆదరించకుండా, భోజనం చేయని దీక్షాపరులు. (పర గృహంలో ఒక్క రాత్రి మాత్రమే నివసించే వారిని అతిథుదులంటారు. ఒక్క రోజుకూడా-ఒక్క చోట కూడా నిలకడగా వుండలేడు కనుకనే "అతిథి" అంటారు). అయోధ్యా పురవాసులు శౌర్య పరాక్రమాలున్నవారు-సత్యమే ధనంగా కలవారు. ధనంలాగా సత్యాన్ని కాపాడుకునే శూద్రులు తాంత్రిక మంత్ర్రాలతో దేవ పూజ-హిరణ్య దానంతో అతిథి పూజ చేస్తారు. బ్రాహ్మణులు విద్యా శూరులు-వాద పరాక్రములు.

బ్రాహ్మణులుపదేశించిన కార్యాలలో ఆసక్తి కలిగి క్షత్రియులు నడచుకునేవారు. వైశ్యులు రాజులకు అనుకూలంగా వుండేవారు. వంచన-దొంగతనం అనే వాటిని దరికి రానీయకుండా, బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్యులకు సేవ చేస్తూ, శూద్రులందరు బ్రతుకు పాటుకై కుల విద్యలు నేర్చుకుని, కులవృత్తులలో నిమగ్నమై వుండేవారు. యుద్ధ భటులు కార్చిచ్చులాంటి దేహాలతో-తేజంతో, మందరం లాంటి ధైర్యంతో, ఇబ్బందులెన్ని ఎదురైనా, అప్పగించిన పనిని నెరవేరుస్తూ దేహ-మనో బలంతో ఉత్సాహంగా వుండేవారు.


దశరథ మహారాజు సైన్యంలోని గుర్రాలను కాంభోజ, బాహ్లిక, అరేబియా దేశాలనుండి కొనుక్కొచ్చేవారు. సూర్యుడి గుర్రాలకంటే-ఇంద్రుడి గుర్రం కంటే వేగంగా వెళ్లేవా గుర్రాలు. గుణం లేనివాడు కొడుకు కానట్లే-తపస్సు చేయని వాడు తెలివైన పండితుడు కానట్లే-భార్యను వశం చేసుకోలేనివాడు మగవాడు కానట్లే-ఏనుగులు లేనివాడు రాజు కాడన్న సూక్తిని అనుసరించి, మూడు జాతుల ఏనుగులు దశరథుడి సైన్యంలో వుండేవి. భద్రం, మంద్రం, మృగం అనే మూడురకాల శుద్ధ జాతి ఏనుగులు - వీటి సంకీర్ణ జాతి ఏనుగులు (భద్ర మంద్రాలు, మృగ మంద్రాలు, భద్ర మృగాలు, భద్ర మంద్ర మృగాలు) దశరథ మహారాజు సైన్యంలో వుండి, ఎనిమిది రకాలైన మదపు నీటిని స్రవింప చేసేవి. చెక్కిళ్ల నుండి (దానం అని) , కళ్ల నుండి (సీధువు అని), చెవుల నుండి (సాగరం అని), తొండం కొన నుండి (శీకరం అని), స్తనాల కొనల నుండి (సిక్యం అని), శిశ్నం నుండి  (మదం అని), హృదయం నుండి (ఘర్మం అని), పాదాల నుండి  (మేఘం అని) మదపు నీరు స్రవించేవి. ఇలాంటి సైన్యం తోడుండగా, ఎటు దిక్కుగా చూసినా రెండామడల దూరం నిడివి కలిగిన అయోధ్యా నగరాన్ని శత్రువులు జయించలేనిదిగా-ఇంద్రుడి అమరావతి నగరం లాగా, దశరథుడు, చుక్కల్లో చంద్రుడివలె పరిపాలించేవాడు.

దశరథ మహారాజు మంత్రులు బుద్ధిమంతులు-ప్రసిద్ధికెక్కిన వారు-ఇతరుల అభిప్రాయాన్ని వారిని చూస్తుండగానే తెలుసుకొనే శక్తిగలవారు-సదాచార సంపత్తిగలవారు-ధర్మమంటే ఆసక్తిగలవారు-లోకానికి మేలుచేసే ఆలోచనలున్న వారు-న్యాయాన్ని నమ్మేవారు-అపరాధాలు చేయనివారు-ఆలోచనలు చేయడంలో, చేసిన ఆలోచనలను కార్యరూపంలో పెట్టగల సామర్థ్యమున్న వారు-ప్రజల దగ్గరనుండి లంచాలు పుచ్చుకోవాలని గాని, రాజ ద్రవ్యం అపహరించాలని గాని అనుకునేవారు కాదు. మిక్కిలి రాజభక్తిగలవారు. మొత్తం ఎనిమిది మంది మంత్రులు దశరథుడి కొలువులో వుండేవారు-వారి పేర్లు: అర్థసాధకుడు, విజయుడు, సిద్దార్థుడు, ధృష్టి, జయంతుడు, మంత్రపాలుడు, అశోకుడు, సుమంత్రుడు. సుమంత్రుడు తప్ప మిగిలి ఏడుగురు మంత్రులంతా ఒక ఎత్తు-సుమంత్రుడు ఒక ఎత్తు. దశరథుడికి చాలా ముఖ్యుడైన సుమంత్రుడికి అంతఃపురం ప్రవేశించే అధికారం వుంది. వశిష్ఠుడు, వాసుదేవుడు అనే ఇద్దరు దశరథుడి రాజ పురోహితులుగా వుండేవారు. ఇద్దరూ సూర్య వంశ పురోహితులుగా వుంటూ, రాజుల మేలుకోరి-వారు అభివృద్ధి చెందేందుకు అవసరమైన శుభకార్యాలు చేయించేవారు.

అన్వీక్షకి, త్రయి, వార్త, దండనీతి అని పిలువబడే నాలుగు రకాలైన రాజ విద్యలను క్షుణ్ణంగా నేర్చుకున్న దశరథ మహారాజు మంత్రులు, చేయకూడని పనులు చేసేందుకు సిగ్గుపడేవారై- ఇంద్రియ చపలత్వం లేకుండా మంచి నీతి మార్గం తెలిసినవారై-బుద్ధి సూక్ష్మత గల వారై- శాస్త్ర జ్ఞానాన్ని మంచిగా కలిగుండి-పరాక్రమంలో ఎదురులేని వీరులై-మంచి కీర్తిని సంపాదించి, రాజ కార్యాలను మనో వాక్కాయ కర్మలతో నెరవేరుస్తూ, తమను చూసేందుకు వచ్చినవారిని సంతోషంగా తామే ముందుగా పలుకరిస్తూ, బల సంపదలతో, దురాశనేది లేకుండా, ప్రాణాపాయ స్థితిలో కూడా నియమం తప్పకుండా ప్రవర్తించేవారు. దేశ విదేశాల్లో జరిగిన-జరుగుతున్న-జరగబోయే వార్తా విశేషాలను, వేగులవారి నుండి తెప్పించుకుని, విశ్లేషించి, ఏ విషయంలో ఎలా ప్రవర్తించాల్నో అలానే చేసేవారు. వ్యవహారం నడపడంలో సమర్థులు. వీరిలో నీతి-నిజాయితీ ఎంత మోతాదులో వుందోనని తెలుసుకోదల్చిన దశరథ మహారాజు, రహస్యంగా వీరిని చేసిన పరీక్షలన్నిటి లోనూ, వారు నిష్కళంక పరిశుద్ధులని తేలింది. దోషం చేసారని తెలిస్తే, తమ కొడుకులనైనా దండించకుండా విడవని పరిశుద్ధ మనస్కులు దశరథుడి మంత్రులు. దోషం చేయని శత్రువునైనా దండించరు. మంత్రులకు తెలియకుండా ఏ వ్యవహారం జరగదు. రాజుకు-రాజ్యానికి అవసరమైన ధనార్జన విషయంలోగాని, సేనలకు జీతాలు-బహుమానాలు ఇచ్చే విషయంలోగాని, సంపాదించిన ధనం వ్యర్థం కాకుండా రక్షించే విషయంలోగాని మంత్రులంతా కడు సమర్థతతో వుంటారు. దశరథ మహారాజు సభలో వుండి మంచి ఆలోచనలు ఇవ్వడంతోపాటు, యుద్ధ సమయంలోనూ వీరులై, తమ ప్రతాపాన్ని ప్రదర్శించేవారు. శత్రువులను జయించడంలోను, మిత్రులను రక్షించడంలోను ఉత్సాహం కనబరుస్తారు. రాజనీతి శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివినందున, శుచులై-పురజనులను ధర్మ పద్ధతిలో రక్షించే ఔదార్యం కలిగిన ధైర్యవంతులనిపించుకున్నారు.

దోషం చేసినవాడు బ్రాహ్మణుడైనా-క్షత్రియుడైనా-ఇంకెవరైనా, చేసిన నేరానికి-దోషి యోగ్యతను బట్టి ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష అమలుపర్చేవారు. మంచిమాటలు చెప్పడంలోను, ఆలోచన చేయడంలోను మంత్రులందరూ ఐకమత్యంతో మెలిగేవారు. రాజు ఎంత సమర్థుడైనప్పటికీ, పురోహితులతోనూ-మంత్రులతోనూ ఆలోచించే రాజ్యపాలన చేసే విధంగా మసులుకునేవారా మంత్రులు-పురోహితులు.

వీరు-వారు అనే భేదం లేకుండా అయోధ్యా నగరంలోని ప్రజలందరు సద్గుణవంతులే. దేహ పుష్ఠికలవారే. అసత్యాలాడనివారే. రాజు మేలుకోరేవారే. అధికారులందరు రాజ్యంలో తాముచేయాల్సిన-చేయాలనుకున్న పనులను కార్యరూపంలో పెట్టి చూపించేవారే కాని, ముందుగానే రహస్యాలు వెల్లడించి కార్యభంగం చేయరు. ఇలా యావన్మంది తనను సేవిస్తుంటే, వేగులవారి ద్వారా లోకంలో జరుగుతున్న విషయాలను కళ్లార చూసినట్లు తెలుసుకుని, తదనుగుణంగా భవిష్యత్ కార్యక్రమాన్ని, మంత్రుల-పురోహితుల సూచనలతో-సలహాలతో రూపొందించే వాడు దశరథ మహారాజు. ఇలా పరిపాలన చేస్తూ, బాలసూర్యుడు కిరణాలతో ప్రకాశించే విధంగా, దశరథ మహారాజు కూడా ప్రకాశించేవాడు.


(సూర్య బింబం కనిపించిన ఏడు నిమిషాల తర్వాత, సూర్య కిరణాలు భూమిని తాకుతాయి. సూర్య బింబం కంటే, సూర్య కిరణాల మూలంగానే, లోకానికి ప్రయోజనం చేకూరుతుంది. అదే విధంగా, రానున్న కాలంలో, అవతరించనున్న రామ-లక్ష్మణ-భరత-శత్రుఘ్నలు, దశరథుడికి సూర్య కిరణాల లాంటివారు. ఉదయాన ఎరుపు రంగులో వుండే సూర్యుడు దర్శనానికి పనికి రాడు. ఎండ వ్యాపించి-బింబం తెల్లగా మారిన తర్వాతే దర్శించడానికి యోగ్యుడు. అలాగే, రామాదుల వలనే దశరథుడు లోకమాన్యుడయ్యాడు. జాయానామ పూర్వుడు, స్వనామ పూర్వుడు, పుత్రనామ పూర్వుడు అనే మూడురకాల పురుషులుంటారు. మొదటి వాడికంటే రెండోవాడు-వాడికంటే మూడోవాడు శ్రేష్ఠుడు. దశరథుడు మూడో రకం వాడు).

Tuesday, December 29, 2015

బాలకాండ మందరమకరందం సర్గ-5 : శ్రీ రామాయణ కథా ప్రారంభం : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-5
శ్రీ రామాయణ కథా ప్రారంభం
వనం జ్వాలా నరసింహారావు

సమస్త భూమండలాన్ని సంతోషకరంగా పరిపాలించిన చక్రవర్తులలో - రాజులలో, తన అరవై వేలమంది కొడుకులతో సముద్రాన్ని తవ్వించిన సగరుడినే, కడు పుణ్యాత్ముడిగా-చక్రవర్తి శ్రేష్ఠుడిగా పరిగణించాలి. మిగిలిన రాజులందరు అతడిని అనుసరించి నడుచుకున్నవారే. అలా ప్రసిద్ధికెక్కిన వారిలో మనువు కుమారుడు-ఇక్ష్వాకు మహారాజు వంశంలో పుట్టిన సగరాది రాజులలో భూమ్మీద అవతరించిన రఘురాముడి చరిత్రే రామాయణం. భూలోకవాసులందరూ పూజించాల్సిన గ్రంథం రామాయణం. ఈ వంశంలో పుట్టిన భగీరథుడు, బ్రహ్మను ప్రార్థించి - బ్రహ్మ లోకంలో వున్న గంగను భూలోకానికి దిగేటట్లు చేసి - దాన్ని పావనం చేస్తాడు. బ్రహ్మ అనుగ్రహానికి పాత్రుడైన వాల్మీకి మహర్షి, బ్రహ్మ లోకంలో వున్న రామాయణాన్ని, భూలోకవాసులను పవిత్రులను చేసేందుకు అవతరింపచేశాడు. స్వర్గ సుఖాన్ని మాత్రమే కలిగించేది గంగైతే, ఇహలోక సుఖాన్ని - స్వర్గలోక సుఖాన్ని - మోక్షాన్ని కూడా ఇవ్వగలిగేది రామాయణం. కాబట్టే, గంగకంటే కూడా రామాయణం కడు పూజనీయమైంది. కాలిగోటికి-పూర్ణ విగ్రహానికి ఎంత తేడా వుందో, గంగకు-రామాయణానికి అంత తేడా వుంది. తన వద్దకు వచ్చిన వారినే పవిత్రం చేయగలిగేది గంగైతే, నగర-నగరానికి, గ్రామ-గ్రామానికి, పల్లె-పల్లెకు, ఇంటింటికి పోయి, ప్రపంచమంతా వ్యాపించి తనను సేవించిన వారందరినీ పవిత్రులను చేయగలిగేది రామాయణం.

రామాయణం పఠించేవారు సాక్షాత్తు రామ సేవ చేసినట్లే. విధిగా వేదాధ్యయనం చేయాల్సిన బ్రాహ్మణుడు ఈ రోజుల్లో నూటికి-కోటికి ఒకడున్నాడో-లేడో. అలాంటి వారందరు రామాయణ పఠనం చేస్తే, వేద పఠనం చేసినట్లే. వాల్మీకి ఒక సామాన్య ఋషే కదా ! ఆయన రాసింది వేదం ఎలా అవుతుందన్న ప్రశ్న అసమంజసం. చెప్పింది వాల్మీకే అయినా, వెలువడింది బ్రహ్మ ముఖం నుండి. కాబట్టి తప్పక విని తీరవలసిందే. అసూయ వల్ల, అశ్రద్ధ వల్ల, సోమరి తనం వల్ల అలక్ష్యం చేసి వినకపోతే, పాపాత్ములతో సమానమవుతారు. వింటే సకల పాపాలు నశించిపోతాయి. రామాయణ పుణ్య కావ్యాన్ని లోకంలో వ్యాపింపచేసే అధికారం మాత్రమే వాల్మీకికి వుంది కానీ, రచనలో కాని-ఫల ప్రదానంలో కాని అధికారం లేదని వాల్మీకే స్వయంగా-స్పష్టంగా చెప్పుకుంటాడు. రామాయణ పఠనం పాపాలను హరించి వేయడమే కాకుండా, ధర్మ కాంక్ష కలవారికి ధర్మాన్ని- అర్థ కాంక్ష కలవారికి అర్థాన్ని - కామం అందు ఆశ కలవారికి కామాన్ని ఇవ్వగలదు. బ్రహ్మ తనకిచ్చిన అధికారంతో శ్రీరామ జననం మొదలు నిర్యాణం వరకు వివరిస్తానని, సంతోషంతో వినమని-తద్వారా శుభం కలుగుతుందని అంటూ రామ కథను ప్రారంభిస్తాడు వాల్మీకి.

అయోధ్యా పుర వర్ణన

సరయూ నదీతీరంలో వున్న కోసల దేశంలో, ఎక్కడ చూసినా ధనధాన్యాలు రాసులు-రాసులుగా ఇంటింటా పడివుండి, ఒకరి ధనాన్ని-ధాన్యాన్ని మరొకరు ఆశించాల్సిన అవసరం లేనటువంటి స్థితిగతులుండేవి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఆ దేశంలో ప్రజలంతా దేహ పుష్టి కలిగి, సుఖసంతోషాలతో వుండేవారు. ధనధాన్యాది సంపదలతో మిక్కిలి భాగ్యవంతంగాను - మనువు స్వయంగా నిర్మించినందున అందంగా, రమ్యంగాను - పన్నెండామడల పొడవు, మూడామడల వెడల్పు, వంకర టింకర లేని వీధులతోను - ఇరు ప్రక్కల సువాసనలు వెదజల్లే పుష్పాలను రాలుస్తున్న చెట్లతోను - దారినపోయే వారి కళ్లల్లో దుమ్ము పడకుండా తడుపబడిన రాజవీధులతోను అలరారుతుండే అయోధ్యా నగరమనే మహా పట్టణం ఆ కోసల దేశంలో వుండేది. చక్కగా తీర్చి దిద్దిన వీధి వాకిళ్లతోను - తలుపులతోను - వాకిళ్లముందు మంగళకరమైన పచ్చని తోరణాలు కట్టేందుకవసరమైన స్తంబాలతోను - నగరం మధ్యలో విశాలమైన అంగడి వీధులతోను - శత్రువులను ఎదుర్కొనేందుకు కావాల్సిన రకరకాల ఆయుధ సామగ్రినుంచిన భవనాలతోను-శిల్ప కళాకారుల సమూహాలతోను-వందిమాగధులు, సూతుల జాతివారితోను-శ్రీమంతులైన పండితులతోను-ఎత్తైన మండపాల పై కట్టిన ధ్వజాలతోను-భయంకర శతఘ్నుల ఆయుధాలతోను-నాట్యమాడే స్త్రీ సమూహాలతోను-తియ్య మామిడి తోపులతోను, అందాలొలికే అయోధ్యా పురం "లక్ష్మీ పురం" నే మరిపించేదిగా వుంది. "అయోధ్యా పురి" అనే ఆ స్త్రీ నడుముకు పెట్టుకున్న ఒడ్డాణంలా వున్న ప్రాకారం, అగడ్తలు, మితిమీరిన సంఖ్యలో వున్న గుర్రాలు, లొట్టిపిట్టలు, ఆవులు, ఎద్దులు, ఏనుగులు, అనుకూలురైన సామంత రాజులు, కప్పం కట్టే విరోధులైన విదేశీ రాజులు, కాపురాలు చేస్తున్న నానా దేశ వ్యాపారులు, విశేష ధనవంతులైన వైశ్యులు, నవరత్న ఖచితమైన రాజుల ఇళ్లు, చంద్రశాలలున్న అయోధ్యా నగరం స్వర్గ నగరమైన అమరావతిని పోలి వుంది.


నవరత్నాలతో చెక్కబడి విమానాకారంలో కట్టిన ఇళ్లతోను-ఇంటినిండా ఆరోగ్యవంతులైన కొడుకులు, మనుమలు, మునిమనుమలు, మనుమరాళ్లు, వయో వృద్ధులతోను-ఎత్తుపల్లాలు లేకుండా భూమిపై కట్టిన గృహాల్లో పుష్కలంగా పండిన ఆహార పదార్థాల నిల్వలతోను-ఇంటింటా వున్న ఉత్తమ జాతి స్త్రీలతోను - నాలుగు దిక్కులా వ్యాపించిన రాచ బాటలతోను-వాటి మధ్యనే వున్న రాచగృహాలతోను నిండి వున్న అయోధ్యా నగరం జూదపు బీటలా వుంది.(నగరం మధ్యన రాజగృహం, అందులో కట్టడాలు, గాలి వచ్చేందుకు విడిచిన ఆరుబయలు,నలుదిక్కుల రాచబాటలుండడమంటే చూసేవారికి జూదపు బీటలా వుంటుందని అర్థం).

నగరంలోని నీళ్లు చెరకు పాలల్లా తియ్యగా - తేలిగ్గా - మంచి ముత్యాల్లా కనిపించే లావణ్యం లాంటి కాంతితో వున్నాయి. మద్దెలలు, వీణలు, ఉడకలు, పిల్లన గ్రోవులు, సుందరీమణుల కాలి అందియలు-వీటివల్ల కలిగే ధ్వనులు ఆహ్లాదకరంగా వుండేవి. ఎల్లప్పుడు ఆటపాటలతో, ఉత్సవాలతో, అలంకరించుకున్న స్త్రీలతో, ఆహ్లాద భరితంగా వుండేదా వూరు. ఘోర తపస్సు చేసి సిద్ధిపొందిన వారికి మాత్రమే లభించే స్వర్గంలోని విమానాకార ఇల్లు, అయోధ్యా నగర వాసులకు ఏ కష్టం లేకుండా దొరికాయి.

ఆ నగరంలోని శూరులు అడవులకు వేటకు పోయేటప్పుడు, సింహాలను-అడవి పందులను-ఖడ్గ మృగాలను, ముఖాముఖి కలియబడి తమ భుజ బలంతో-శస్త్ర బలంతో-ఒకే ఒక్క వేటుతో చంపగలిగే గొప్పవారు. అయినప్పటికీ, ఆయుధం లేకుండా-సహాయం చేసేవారు లేకుండా-ఒంటరిగా చిక్కిన బలవంతుడైన శత్రువును కూడా క్షమించి విడిచిపెట్టగల దయా గుణమున్న శూరులు. భయంతో దాగిన వారినికూడా వదిలి పెట్తారు. అయోధ్యా పురంలోని బ్రాహ్మణులందరు అవిచ్ఛిన్నంగా అగ్నిహోత్రం కలిగుండే వారే - శమ దమాది గుణ సంపన్నులే - ఆరంగాలతో, నాలు వేదాలను అధ్యయనం చేసిన వారే - సత్య వాక్య నిరతులే - వేలకొలది దానాలు చేసిన వారే - గొప్ప మనసున్న వారే. వీరందరు సామాన్య ఋషులైనా, గృహస్తులైనా, నగర వాసులైనా, అడవుల్లో వుండే ఋషులకు సమానమైన వారు.


(భగవంతుడు అక్కడ పుట్టినందువల్లే, ఆ పుణ్య నగరం "అయోధ్య" గా కీర్తించబడింది. భగవంతుడైన విష్ణువు ఎక్కడుంటాడో, అదే పరమ పదం-ఆయన సేవే మోక్షం-అదే సర్వ కర్మలను ధ్వంసం చేస్తుంది. అయోధ్యలో మహా విష్ణువు పుట్టినందువల్లే మనుష్యులందరు ముక్తులయ్యారని శివుడు పార్వతికి చెప్పాడు).

Monday, December 28, 2015

బాలకాండ మందరమకరందం సర్గ-4 –Part II : అయోధ్యలో రామాయణాన్ని గానం చేసిన కుశ లవులు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-4 –Part II
అయోధ్యలో రామాయణాన్ని గానం చేసిన 
కుశ లవులు
వనం జ్వాలా నరసింహారావు

ముని కుమారులవలె కనిపిస్తున్న కుశ లవులు ఎంతో సమర్థతతో, వాల్మీకి నేర్పిన విధంగానే, రామాయణాన్నంతా ముఖస్థం చేశారు. ప్రశస్త రీతిలో, కడు సంతోషంతో, మహర్షులు-సాదువులు-బ్రాహ్మణులున్న పెద్ద సభా మండపంలో ధర్మ సమ్మతమైన కావ్యాన్ని గానం చేయసాగారు. గానం చేస్తున్న వారి సొంపు-గానం-ఇంపు-కథ పెంపు, వెరసి కర్ణ రసాయనంగా వినడం వల్ల, శ్రోతల కళ్ల నుండి ఆనంద భాష్పాలు జల-జల రాలాయి. రామచంద్రమూర్తి చేస్తున్న అశ్వమేధ యాగం చూడడానికి వచ్చిన మునీశ్వరులందరు కుశ లవులు గానం చేస్తున్న రామాయణాన్ని విని, ఆశ్చర్యపడి, సంతుష్ట మనస్కులయ్యారు. ముని కుమారుల వేషంలో, మనోహర సుందరకారంలో, సంగీత విద్యలో శ్రేష్ఠులై వున్న కుశ లవులను, మునీశ్వరులు మేలైన మాటలతో మెచ్చుకున్నారీవిధంగా: " ఆ హాహా, ఏమీ పాటల నీటు ! అరే ఏమీ పద్యాల హృద్యత ! సెబాసు ! ఏమీ అర్థపుష్ఠి ! ఔరా, ఏమి చిత్రం ! ఎంత కాలం క్రితం జరిగిన సంగతి? వీళ్లిప్పుడు పాడుతుంటే, ఇప్పుడే జరుగున్నట్లుందే ! ఏం ఆశ్చర్యం". (ఇది జరిగినప్పుడు శ్రీరాముడికి 54-55 సంవత్సరాల వయస్సుంటుంది. సీతాదేవికి 47-48 సంవత్సరాలుంటాయి. వాల్మీకి ఆశ్రమంలో విడిచి పెట్టినప్పుడు సీత వయస్సు 34 సంవత్సరాలు).

వాల్మీకి తమలాంటి ఋషే ఐనప్పటికి, ఆయన రచించిన గ్రంథాన్ని, ఏ మాత్రం అసూయపడకుండా, మునీశ్వరులందరూ ముక్త కంఠంతో పొగిడారు. ఎవరికి వారే మేలు-మేలని స్తుతించారు. వారిస్తున్న ప్రోత్సాహంతో ఉప్పొంగి పోయిన కుశ లవులు, స్వరం-లయ-గ్రామం-మూర్ఛనలతో రక్తికట్టిస్తూ, వినే వాళ్లు పరవశించే విధంగా, మనోహరంగా మళ్లీ - మళ్లీ పాడారు. విని సంతోషించిన మునులు వారికెన్నో బహుమానాలిచ్చారు. కొందరు చిత్రాసనాలిస్తే ఇంకొందరు జంద్యాలిచ్చారు. మోంజిలు, పాత్రలు, కమండలాలు, దండాలు, ఇతరత్రా ప్రియమైన వస్తువులెన్నో ఇచ్చారు మునులందరూ. ఏమీ ఇవ్వలేనివారు దీర్ఘాయుష్యులు కమ్మని దీవెనలిచ్చారు. (ఇవన్నీ బహుమానాలే కాని, దానాలు కావు. భగవత్ కథలు, పురాణాలు చెప్పేవారు ప్రతి ఫలాపేక్ష లేకుండానే చెప్పాలి-వినేవారు మాత్రం వారిని సత్కరించాలి). గుంపులు-గుంపులుగా జనాలున్న చోట, చిన్న-చిన్న వీధుల్లో, సందుల్లో-గొందుల్లో, రచ్చ బండల దగ్గర, అంగడి వీధుల్లో, సంతోషంగా పాడారు కుశ లవులు. పాడుతున్న బాలకులు, నెత్తిపై ముందున్న వెంట్రుకలను ముడేశారు - వెనుకనున్న వెంట్రుకలను జారవిడిచారు. పౌర్ణమి నాటి చంద్రుడిని బోలిన ముఖంపైన గోపీ చందనాన్ని రేఖగా దిద్దారు. ఎడమ భుజంపైన వీణ దండాన్ని-ఎడమ చేతిలో సొరకాయ బుర్రను వుంచారు. మెడలో ఒంటి జంద్యముంది. నడుంపైన చిన్న నార వస్త్రం చుట్టారు. లేత కుడిచేతి వేళ్ళతో వీనతంత్రులను మీటుతూ, మనోహరమైన రాగాలతో కాలం-తాళం తప్పకుండా, వాడ-వాడ తిరుగుతూ, రామాయణ గానం చేశారు కుశ లవులు.

(వీణలు రెండు రకాలు. శ్రుతి వీణ, స్వర వీణ. 22 శ్రుతులకు ఉపయోగించేది శ్రుతి వీణ. సప్త స్వరాలకుపయోగించేది స్వర వీణ. ఏక తంత్రికి బ్రహ్మ వీణన్న పేరుంది. రెండు తంత్రులుంటె నకులం అంటారు. విపంచికి ఇరవై ఒక్కటుంటాయి. మత్తకోకిలం, స్వర మండలం, ఆలాపిని, కిన్నరి, పినాకి, పరివాదిని, నిశ్శంక గా మరి కొన్నిటిని పిలుస్తారు. సరస్వతి వీణను కచ్ఛపి అని, నారదుడి వీణను మహతి అని, తుంబురుడి వీణను కళావతి అని, విశ్వావసు వీణను బృహతి అని అంటారు).

అయోధ్యలోని యజ్ఞ శాలలో వున్న జనులు-మునులు అందరూ, వాల్మీకి రచించిన కావ్యం గురించి-దాని మహిమ గురించి-శ్రేష్ఠత గురించి, వీధి-వీధిలో చెప్పుకోవడం జరిగింది. ఆ మహర్షి ఎంతటి మహిమాన్వితుడో కదా అని ఆయన్ను పొగడసాగారు. భావితరాల కవీశ్వరులు రచించబోయే కవితలకు-కావ్యాలకు వాల్మీకి రామాయణం ఆధారమౌతుందని, రాగాలకు యోగ్యమైనదిగా భావించబడుతుందని, ఓపికగా వినేవారి చెవులకు అమృత ధార అవుతుందని, చదివినవారి ఆయువు వృద్ధి చెందుతుందని పొగడ్తలతో దాన్ని గురించి చెప్పసాగారు. సముద్రంలో వున్న రత్నాలలాగా, రామాయణంలో వున్న సద్గుణాలు అనంతమని, నవరసాలకు నిలువ నీడైనదని, వ్యాధులను వుపశమించే దివ్యౌషధమని, ఆత్మ జ్ఞానాన్ని వృద్ధి చేస్తుందని పొగిడారు దాన్ని. వివిధ రకాల అభినయాలతో, నవ రసాల పలుకులతో కుశ లవులు గానం చేస్తుంటే, సంతోష సాగరంలో మునిగి తేలుతున్న జనావళి, వళ్లు మరిచి, వారిని భళీ-భళీ అని మెచ్చుకున్నారు.

రామాయణం గానం చేస్తున్న కుశ లవులను పిలిపించిన శ్రీరాముడు

ముని కుమారుల వేషాలను ధరించి మన్మధా కారులై-చంద్ర బింబం లాంటి ముఖం వున్నవారై- అత్యంత తేజస్సుతో అలరారుతూ-చక్కగా రాజవీధుల్లో గానంచేస్తున్న కుశ లవులను, సూర్య తేజస్సుతో ప్రకాశించే శ్రీరామచంద్రమూర్తి,తన ఇంటికి పిలిపించుకుంటాడు. ఆ సమయంలో కుశ లవులు, నల్లని  తుమ్మెదలను మించిన ముంగురులతోను,లేత చంద్రుడితో పోల్చదగే నొసలుతోను,శరీరకాంతితోను మెరిసి పోతుంటారు. తన తమ్ములు, ఇతర సామంత రాజులు, మంత్రులు, మరెందరో తను కూర్చున్న బంగారు సింహాసనం చుట్టూ చేరి, తనకు సేవలు చేస్తున్న సమయంలో, కుశ లవులనుద్దేశించి " నాయన లారా, మీరేదో పాడుతున్నారే ! దానిని నేనూ వింటాను" అని అంటాడు శ్రీరాముడు. మన్మధాకారంగల ముని వేషధారులైన కుశ లవులిద్దరు, ఒకేరకంగా వున్న విషయాన్ని - వారిని చూడగానే సమస్త విద్యలను సరిసమానంగా నేర్చుకున్నట్లుగా తెలుస్తున్న విషయాన్ని, నీతిమంతుడైన శ్రీరామచంద్రుడు గమనించి, తన మనసులో అనుకుంటున్న దాన్ని తమ్ములతో ప్రస్తావిస్తాడు. తేనెలొలికే అందం తోనూ, అమృత రస ప్రవాహంలోని అలల లాగానూ, వేదార్థంలోని సదభిప్రాయం తోనూ, వింటున్న కొద్దీ బ్రహ్మానందం కలిగించే విధంగా కుశ లవులిద్దరు గానం చేస్తున్నారని అంటాడు.


(రామాయణం వేదార్థం కలది. శ్రుతి కటువుగా కాకుండా, విన సొంపై, కేవలం ఐహికానందం మాత్రమే కాకుండా, అమృతంలాగా మోక్షానందం కూడా కలిగించేది రామాయణం. అలలు ఎలా అంతం లేకుండా వస్తుంటాయో, అలానే రామాయణ కావ్యం కూడా ఎప్పటికప్పుడు బ్రహ్మానందం కలిగిస్తూనే వుంటుంది. అసత్యమంటే ఎరుగని - అసత్యమాడని శ్రీరామచంద్రుడు తన మనసులో వున్న ఇదే విషయాన్ని బయటకంటాడు. ఆనందం రెండు రకాలు: విషయానందం, బ్రహ్మానందం. కమ్మని రుచికరమైన పదార్థాలను తినడం-ఇంపైన ధ్వనులను వినడం-పరిమళ పదార్థాలను చూడడం వలన కలిగే ఆనందం విషయానందం. మోక్ష కాలంలో పరిపూర్ణ బ్రహ్మానుభవం ద్వారా కలిగే ఆనందం బ్రహ్మానందం).

కుశలవుల గానాన్ని వినమని తమ్ముళ్లను ప్రోత్సహిస్తూ: "ఈ బాలకులు ఏ రసాన్నైతే అభినయిస్తూ పాడుతున్నారో, ఆ రసమే మనలో పుట్టి మనకూ అనుభవంలోకి వస్తున్నది. కవిత్వం విషయానికొస్తే, ఆసాంతం, విచిత్ర శబ్దాలతో కూడి వినసొంపుగావుంది. ఏ దోషాలు లేవు. ఇలాంటి నిర్దుష్టమైన-గుణవంతమైన-శ్లాఘ్యమైన కావ్యాన్ని చంద్ర బింబం లాంటి ఈ ముని కుమారులు గానం చేస్తున్నారు" అని సగౌరవంగా మాటలతోనే బహుకరిస్తూ అంటాడు శ్రీరాముడు. ఆలాపాల, రాగాల తీయ దనంతో, ప్రవాహంలాగా రామాయణ గానం చేస్తున్న బాలకుల ప్రతిభను గమనిస్తున్న వారంతా, ఆ రసాస్వాదనలో మునిగి తేలుతూ, ఇంకా తనివితీరా వింటే బాగుంటుందని భావిస్తూ పరవశులై పోతుంటారు. కుశ లవుల గాన మాధుర్యాన్ని-మనోహరత్వాన్ని ఆస్వాదించడమే కాకుండా, పాటకు సంబంధించిన కథలోని విశేషాన్ని కూడా గమనించాలని, శ్రోతలనుద్దేశించి అంటాడు శ్రీరాముడు. ఆయనలా మాట్లాడడంతో, కుశ లవులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. తేనెలో చక్కెర కలిపితే, తీపి దనం ఎలా పెరుగుతుందో, అలానే, భగవత్ కథలో తీయదనం కలిగిస్తున్న కుశ లవులు బాలకులైనప్పటికీ, భగవత్ కథను చెప్తున్నందున, వారికంటే ఉన్నత స్థానంలో తను కూర్చోడం భావ్యం కాదని తలచిన శ్రీరాముడు, సందడి చేయకుండా బంగారు సింహాసనం మీదనుండి దిగి, అక్కడున్న నలుగురి మధ్య ఒకడిగా కూచుంటాడు. దీంతో మరింత సంబరపడిన కుశ లవులు, అసలు-సిసలైన సంగీత విధానంలో రామ చరిత్రనంతా గానం చేశారు.

("తపమున స్వాధ్యాయంబున.. ... .. " అనే పద్యంతో ఆరంభమై, ఇంతవరకు చెప్పిందంతా ఉపోద్ఘాతం లాంటిది. నాటకానికి నాంది-ప్రస్తావనలు ఎలా అంతర్భాగాలో, రామాయణానికి ఇలాంటి ఉపోద్ఘాతం ఒక అంతర్భాగం. వ్యక్తి వైలక్షణ్యం, విషయ వైలక్షణ్యం, ప్రబంధ వైలక్షణ్యం అనే మూడు ప్రధాన విషయాలను, రామాయణం చదివే వారికి-దానిపై గౌరవం కలించేందుకు, ఈ ఉపోద్ఘాతం లో వివరించడం జరిగింది. కుశ లవులు రామాయణ గానం చేయడం, గ్రంథ రచన తదుపరి జరిగిన సంఘటన. ఎందుకు ఆరంభంలోనే దీన్ని రాయాల్సి వచ్చిందన్న ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. త్రికాల జ్ఞానైన వాల్మీకి మహర్షి యోగ దృష్టితో రామాయణ వృత్తాంతమంతా ఆద్యంతం మొదలే తెలుసుకున్న విధంగానే, ఈ విషయాన్నీ తెలుసుకుని, కుశ లవులతో చెప్పించినట్లుగా భావించాలి. వాస్తవానికి ఉపోద్ఘాతంలో తెలియచేసినట్లుగా, కుశ లవులు రామాయణ గానం చేసిన సంగతి ఉత్తర కాండలో సరైన సందర్భంలో చెప్పడం జరిగింది.దాన్నే పాఠకులకు సంక్షిప్తంగా ముందుగానే వివరించడం జరిగింది.మొదటి మూడు సర్గల్లో స్వవిషయం గురించి, తనకు యోగ దృష్టి కలదని చెప్పడం గురించి, బ్రహ్మ సాక్షాత్కారం గురించి, రాయడాన్ని కొందరు వాల్మీకి ఆత్మ స్తుతిగా ఆక్షేపించవచ్చు. వాస్తవానికి మొదటి మూడు సర్గల్లో "గ్రంథోత్పత్తి" గురించి చెఫ్ఫడం జరిగిందే కాని మరింకేమీ కాదు.


బాల కాండలో శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించాల్సిన కారణం, అయోధ్య కాండలో స్థితి కారణం, అరణ్య కాండలో మోక్షమిచ్చే అధికారం, కిష్కింధ కాండలో గుణ సంపత్తి, సుందర కాండలో సర్వ సంహార శక్తి, యుద్ధ కాండలో వేదాంత వేద్యత్వం, ఉత్తర కాండలో సృష్టికి హేతువు లాంటి విషయాలను చెఫ్ఫడం జరిగింది. రామాయణంలో చెప్పబడిన పర తత్వం శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన విష్ణువేనని స్పష్టమవుతుంది. ఇటువంటి పర తత్వాన్ని స్థాపించి, పరమాత్మ అనుభవించే ఉపాయం శరణాగతుని అర్థం చేసుకోవాలి. భగవంతునందు చేసిన శరణాగతికి ముఖ్య ఫలం, భగవత్ సన్నిధానంలో చేరి, భగవంతుడికి సేవ చేయడమే. ఇతర ఫలాలన్నీ అనుషంగ కాలనే ఈ గ్రంథంలో స్పష్టమవుతుంది. ఇట్టి శరణా గతికి పురుష కారం అవశ్యం. పురుషకారానికి కావాల్సిన ముఖ్యగుణం శరణాగతుడి పట్ల దయ. ఈ గ్రంథంలో పురుషకారం ప్రధానమైంది. శరణాగతుని అనుష్టించు అధికారికి శేషత్వం పారతంత్ర్యం స్వరూపం. భరతుడి చర్యవలన పారతంత్ర్యం స్పష్టంగా కనిపిస్తుంది. శత్రుఘ్నుడి చర్యలు భాగవత పారతంత్ర్యాన్ని తెలియచేస్తుంది. శరణాగతుడికి అర్థపంచక జ్ఞానం ఆవశ్యకం. అతడు అకించనుడు-అనన్య గతుడై వుండాలి. అతడు సదా జపం చేయాల్సింది రామాయణమే). 

అందరికీ అందుబాటులో ఆరోగ్య వైద్యం : వనం జ్వాలా నరసింహారావు

అందరికీ అందుబాటులో ఆరోగ్య వైద్యం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి (23-12-2015)

భారత దేశంలోలా కాకుండా సింగపూర్‌లో అమల్లో వున్న ఆరోగ్య వైద్య విధానం కింద, ఆ దేశంలోని ప్రతి వ్యక్తికీ, ప్రాధమిక ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రి వైద్యం, దీర్ఘకాలిక ఆరోగ్య పరిరక్షణ, తదితర సంబంధిత కార్యక్రమాలు ఒక క్రమ పద్ధతి ప్రకారం చేపట్టి అమలు చేస్తారు. ప్రభుత్వ-ప్రయివేట్ రంగంలో అనేక ఔట్ పేషంట్-ఇన్ పేషంట్ క్లినిక్‌లు, పాలీ క్లినిక్‌లు, ఆసుపత్రులు, సింగపూర్‌లోని పౌరులకు-విదేశీయులకు వారి-వారి అవసరాలకు అనుగుణంగా, నాణ్యమైన వైద్య సౌకర్యం కలిగిస్తాయి. సింగపూర్‌లో నూటికి ఎనభై శాతం మేర ప్రాధమిక వైద్య సౌకర్యం సుమారు 2000 వరకూ వున్న ప్రయివేట్  ఆసుపత్రులలో లభ్యమవుతుంది. ప్రభుత్వ పరమైన పాలీ క్లినిక్‌లు కేవలం 18 మాత్రమే. భారతదేశంలో ప్రయివేట్ రంగంలో ఎక్కువగా స్పెషాలిటీస్-సూపర్ స్పెషాలిటీస్ సౌకర్యం మాత్రమే వుంటుంది. ప్రాధమిక వైద్య సౌకర్యం దాదాపు లేనట్లే. సింగపూర్ ప్రభుత్వ ఆసుపత్రులలో 80% స్పెషాలిటీస్-సూపర్ స్పెషాలిటీస్ సౌకర్యం దొరుకుతుంది. ఆసుపత్రి పడకల సంఖ్య- సుమారు 80% పైగా, కూడా ప్రభుత్వ రంగంలోనే అధికం. ప్రయివేట్ ఆసుపత్రులలో కేవలం 20% మాత్రమే! డాక్టర్ల సంఖ్య కూడా అంతే. ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసేవారి సంఖ్య 80% కాగా, ప్రయివేట్ రంగంలో 20% మంది మాత్రమే వున్నారు.

భారత దేశంలోని పలు రాష్ట్రాలలో మరో పెద్ద సమస్య, అందునా ముఖ్యంగా మధ్యతరగతి ప్రజానీకం ఎదుర్కుంటున్న సమస్య అందుబాటులో లేని రోగ నిర్ధారణ పరీక్షల చార్జీలు. ఈ పరీక్షలన్నీ ప్రయివేట్ రంగంలోనే లభిస్తాయి. ఏవో ఒకటీ-అర తప్ప అన్నింటికీ ప్రయివేట్ కేంద్రాలకు వెళ్లాల్సిందే. కొన్ని పరీక్షల కయ్యే ఖర్చు మరీ ఎక్కువ. ఉదాహరణకు "పెట్" స్కాన్ అనే రోగ నిర్ధారణ టెస్ట్ కు రు. 20, 000 కు పైగా అవుతుంది. అలానే ఎంఆర్‍ఐ పరీక్షకు రు. 10, 000 అవుతుంది. ఇలాంటివన్నీ ప్రభుత్వమే సరసమైన ధరలకు చేసేలా చర్యలు చేపట్టాలి. అలానే పెద్ద సంఖ్యలో వీలైనన్ని ప్రదేశాలలో ప్రభుత్వమే పాలీ క్లినిక్‌లను ఏర్పాటు చేసి, లేదా, ప్రయివేట్ డాక్టర్లు నడుపుతున్న వారి సహకారం తీసుకుని పౌరులకు వైద్య-ఆరోగ్య సేవలందిస్తే బాగుంటుంది. ఈ నేపధ్యంలో, సింగపూర్ వైద్య-ఆరోగ్య వ్యవస్థ నుంచి కొన్ని విషయాలు తెలుసుకుని అమలు చేస్తే మంచిదేమో.

1965 లో సింగపూర్‌కు స్వాతంత్ర్యం లభించిన కొద్ది రోజుల్లోనే, అప్పటికే దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న అంటువ్యాధులను ముందస్తుగానే అరికట్టే ప్రక్రియ ఆరంభమైంది. పెద్ద ఎత్తున ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దరిమిలా, భవిష్యత్‍లో ఎటువంటి ఇబ్బందులు తలఎత్తకుండా జాగ్రత్త పడేందుకు 1983 లో జాతీయ ఆరోగ్య విధానాన్ని రూపొందించింది. రాబోయే 20 సంవత్సరాలలో చేపట్టి అమలుపర్చాల్సిన ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పన గురించి ఒక నిర్దుష్ట కార్యక్రమాన్ని రూపొందించింది. ఏటేటా ఆ కార్యక్రమాన్ని సమీక్షించి తప్పులను సరి దిద్దుకుంటూ ముందుకు సాగుతోంది.

సింగపూర్ ఆరోగ్య వైద్య విధానంలో అత్యంత కీలకమైన "మెడి సేవ్"-వైద్య పొదుపు పధకానికి నాంది పలికింది. సింగపూర్‌లో మూడు విభాగాల ఆరోగ్య వైద్య నియంత్రణ వ్యవస్థలున్నాయి. మొదటిది ఆరోగ్య మంత్రిత్వ శాఖ, రెండోది కేంద్రీయ భవిష్యత్ నిధి, మూడోది సింగపూర్ మానిటరీ అథారిటీ. ఆరోగ్య సంరక్షణ సేవల పూర్తి పర్యవేక్షణ బాధ్యత మంత్రిత్వ శాఖదే. పొదుపు పధకాన్ని అమలు పర్చాల్సిన బాధ్యత భవిష్యత్ నిధిది. సింగపూర్ పౌరులందరూ-శాశ్వత నివాసీయులందరూ, వర్తమానంలోను, భవిష్యత్‍లో పదవీ విరమణ చేసిన తరువాత ముసలితనంలోను, తమ పోషణ బాధ్యత-ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాలలో, తామే విజయవంతంగా తమపై వేసుకునే విధంగా భవిష్యత్ నిధి చర్యలు తీసుకుంటుంది. బీమా రంగానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను క్రమబద్ధీకరించి, భీమాదారులెలాంటి ఇబ్బందులకు గురి కాకుండా-వారి ప్రయోజనాలను కాపాడే బాధ్యతను, సింగపూర్ కేంద్రీయ బాంక్ లాగా, మానిటరీ అథారిటీ వ్యవహరిస్తుంది. ఈ మూడు వ్యవస్థలు ఒకదానికి మరొకటి సరైన సహాయ సహకారాలు అందించుకుంటుంది.

సింగపూర్ మొత్తంలో, పదమూడు ప్రయివేట్ ఆసుపత్రులు, పది ప్రభుత్వ ఆసుపత్రులు, అనేక స్పెషలిస్ట్ క్లినిక్‌లు వున్నాయి. ఒక్కో చోట ఒక్కో రకమైన చార్జీలు అమల్లో వున్నాయి. పేషంట్లు తమకిష్టమైన సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు, తాను వెళ్లదల్చుకున్న ప్రభుత్వ-లేదా-ప్రయివేట్ ఆసుపత్రికి కాని, పాలీ క్లినిక్‌కు కాని వెళ్లవచ్చు. ఎమర్జెన్సీ సేవలైతే 24 గంటలు అందుబాటులో వుంటాయి. ప్రభుత్వ-ప్రయివేట్ ఆసుపత్రులన్నీ కూడా అధునాతన వైద్య సదుపాయాలను కలిగి వుంటాయి. అక్కడా-ఇక్కడా కూడా అత్యున్నత వైద్య ప్రమాణాలను పాటిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ఎప్పుడో, 2000 సంవత్సరం నాటికే సింగపూర్ ఆరవ రాంకు సంపాదించింది. శిశు మరణాల విషయంలో అత్యంత తక్కువ శాతం సింగపూర్‌లోనే. ప్రసూతి మరణాలు దాదాపు లేనట్టే.

ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణా విధానంలో మూడు రకాలున్నాయి. మొదటిది "మెడిఫండ్". దీని ద్వారా, తమంతట తాము ఎలాంటి పద్ధతిలోను వైద్య ఖర్చులు భరించలేని వారికి ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వమే కలిగిస్తుంది. ఇదొక రకమైన శాశ్వత నిధి. రెండోదైన "మెడిసేవ్" ద్వారా, దాదాపు 85% మంది జనాభాకు ప్రయోజనం చేకూరుతుంది. ఇదొక రకమైన నిర్బంధ పొదుపు విధానం. మూడొదైన "మెడిషీల్డ్" కింద ప్రభుత్వమే ఒకరకమైన ఆరోగ్య భీమా పథకం అమలు పరుస్తుంది. నిర్బంధ పొదుపు ద్వారా, సబ్సిడీ విధానం ద్వారా, ధరలు అదుపు చేయడం ద్వారా, మెడిషీల్డ్ అమలు సులభతరమవుతుంది. అన్నింటిలోకి ప్రధానమైంది "మెడి సేవ్". ఇది మరొక రకమైన జాతీయ ఆరోగ్య భీమా ప్రణాళిక. మెడిసేవ్ పథకాన్ని ఏప్రిల్ 1984 లో, జాతీయ వైద్య పొదుపు గణాంక పద్ధతిన, ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. తక్షణం ఆసుపత్రిలో చేరడానికి, ఔట్ పేషంట్ విభాగంలో చికిత్స పొందడానికి, డే సర్జరీకి ఈ పొదుపు ఖాతాను ఉపయోగించవచ్చు. ప్రతి ఉద్యోగి తమ ఆదాయంలో, వారి-వారి వయసుకు అనుగుణంగా, 6.5-9.0% మేరకుతమ వ్యక్తిగత మెడిసేవ్ అకౌంట్‍‍లో జమ చేస్తారు. అలా పొదుపు చేసిన డబ్బు నుంచి, వైద్య-ఆరోగ్య బిల్లులు చెల్లించవచ్చు. సింగపూర్‌లో నిరుద్యోగం కేవలం రెండు శాతం లోపే. అంటే, దాదాపు అందరికీ పొదుపు చేసే వీలుంటుంది. ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువమంది పొదుపు ఖాతాదారులైతే, వారందరిదీ పూల్ చేసి కుటుంబ అవసరాలకు వాడుకోవచ్చు. ప్రతి వ్యక్తికీ, వారు చికిత్స పొందే సమయంలో, వారు ఎంపిక చేసుకునే మూడు రకాల సబ్సిడీలలో ఒకటి వర్తిస్తుంది.

ప్రభుత్వ పరంగా కాని, ప్రయివేట్ పరంగా కాని, ఏ స్థాయి సబ్సిడీ పొందుతున్న వారికి కాని, సింగపూర్ జాతీయ ఆరోగ్య ప్రణాళిక ప్రాధమిక సూత్రం ప్రకారం, "ఉచితం" అనే మాట వారి నిఘంటువులో అసలే కనిపించదు. ఏదీ-ఎవరికీ ఉచితం కానే కాదు. అలాగే, ఎవరికీ-ఎట్టి పరిస్థితుల్లోను, ఆరోగ్య వైద్య సేవలను నిరాకరించే ప్రసక్తే లేదు. రోగి ఫీజు కట్టాడా-లేదా అనే విషయాన్ని వైద్య సేవలను అందించడానికి ముడి పెట్టే సమస్యే లేదు. భారత దేశంలో వున్న ప్రయివేట్-ప్రభుత్వ ఆసుపత్రిలో-పాలీ క్లినిక్‌లలో మాదిరిగా కాకుండా, పేషంటు దగ్గర ఫీజు మొత్తాన్ని, మందులతో సహా, డిశ్చార్జ్ చేసేంతవరకు వసూలు చేయరు. వాళ్లు బిల్లు చెల్లించినా, చెల్లించ లేకపోయినా డిశ్చార్జ్ నిలుపుదల చేయరు. ఫీజు చెల్లించకుండా వెళ్లిన వారి విషయంలో, అది రాబట్టుకొనేందుకు వేరే యంత్రాంగం తరువాత కృషి చేస్తుంది కాని కట్టేంతవరకు డిశ్చార్జ్ చేయమని అనరు. ఫీజు కట్టకుండా వెళ్లి పోయే వారు ఒక శాతం లోపే. వారు కూడా సాధారణంగా కట్టలేని విదేశీయులే! ఏదీ ఉచితం లేకపోవడానికి కారణం, అనవసరంగా ఎవరూ వైద్య సేవలను దుర్వినియోగం చేయకూడదనే. వైద్య ఖర్చులు వారి-వారి స్థాయి సబ్సిడీని పట్టి వున్నప్పటికీ, "ఔట్-ఆఫ్-పాకెట్" వ్యయం మాత్ర్తం స్థాయిని బట్టి మారుతుంటుంది. ఎక్కువ స్థాయి సబ్సిడీ లభించే వారికి "ఔట్-ఆఫ్-పాకెట్" ఖర్చులు కూడా ఎక్కువగానే వుంటాయి. తక్కువ వారికి అంతగా వుండవు. మొత్తం మీద వారికీ-వీరికీ చివరకు పడేది దాదాపు ఒకే రకం భారం. క్రమేపీ పెరుగుతున్న ప్రయివేట్ రంగం వైద్య సేవలను ఎక్కువగా, ప్రయివేట్‌గా భీమా చేయించుకున్నవారు, విదేశీయులు, ఖర్చు భరించగల శక్తి వున్నవారు, "ఔట్-ఆఫ్-పాకెట్" ఖర్చుకు భయపడని వారు, ఉపయోగించుకుంటున్నారు. ఎంతగా ప్రయివేట్ రంగం విస్తరిస్తున్నప్పటికీ, ఇప్పటికీ, 70-80% మంది సింగపూర్ దేశీయులు ప్రభుత్వ పరంగానే వైద్య సేవలను పొందుతున్నారు.

సింగపూర్ జనరల్ ఆసుపత్రి-ఎస్.జి.హెచ్, ఆదేశం మొత్తంలో, అతి పెద్ద-పురాతనమైన ఆసుపత్రి. దాని పునాదులు 1821 లో వేయడం జరిగింది. "సింగ్ హెల్త్" అనే పేరుతో, ఆ గొడుగు కింద, ప్రభుత్వ రంగంలోని అనేక స్పెషలిస్టు ఆసుపత్రులు నడుస్తున్నాయి. చిన్న పిల్లల ఆసుపత్రి, కాన్సర్ ఆసుపత్రి, హృద్రోగ ప్రత్యేక ఆసుపత్రి, కంటి ఆసుపత్రి, డెంటల్ ఆసుపత్రి, న్యూరో ఆసుపత్రి ఆ గొడుగు కింద పనిచేస్తాయి. ఎస్.జి.హెచ్ లో సుమారు 600 మందికి పైగా వైద్యులు, 29 క్లినికల్ స్పెషాలిటీల్లో పని చేస్తున్నారు. ప్రతి పేషంటుకు వ్యక్తిగతంగా వారి-వారి వైద్య అవసరాలకు అనుగుణంగా, నిబద్ధతతో పనిచేస్తారీ డాక్టర్లు. ఎమర్జెన్సీ కేసుల విషయంలో తప్ప, మామూలు పరిస్థితుల్లో పేషంటును ఆసుపత్రిలో చేర్చుకోవాలంటే, ఆ అవసరం వున్నదని, ఎవరో ఒక స్పెషలిస్ట్ సూచించాలి. అడ్మిషన్ డేట్ తేలిన తరువాత, ముందస్తు జాగ్రత్తలెన్నో పేషంటుకు వివరిస్తారు. వాళ్లకు ఏ రకం సబ్సిడీ లబిస్తుందో, ఆ స్థాయికి తగ్గ గదులనే కేటాయిస్తారు. డార్మెటరీ కూడా కావచ్చు. అడ్మిషన్‌కు ముందుగానే, ఫీజు చెల్లించే విధానం, అవసరమైన డాక్యుమెంట్ల విషయం, అందాజాగా ఫీజు మొత్తం వివరించడం జరుగుతుంది. అడ్మిషన్ కంటే ముందే, ఎక్స్-రే, రక్త పరీక్షలు, ఇ.సి.జి లాంటి అవసరమైన పరీక్షలను నిర్వహిస్తారు.

సింగపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాని, ప్రభుత్వ స్పెషలిస్ట్ కేంద్రాలలో కాని, పాలీ క్లినిక్‌లో కాని, చికిత్సకు వెళ్లిన వారి క్లినికల్ పరీక్షల వివరాలను, "నేషనల్ ఎలెక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ సిస్టం" అనే పేరుతో, ఒక సెంట్రలైజ్డ్ డాటా బేస్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పేషంట్ మెడికల్ హిస్టరీ మొత్తం ఒకే చోట బధ్ర పరిచి, కంప్యూటర్‌కు అనుసంధానం చేశారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న అన్ని రకాల ఆరోగ్య కేంద్రాలు ఒకే గొడుగు కింద పనిచేసే ఈ విధానం వల్ల, ఒక సారి ఒకచోట క్లినికల్ టెస్టులు చేయించుకున్న పేషంటు, ఇంకో స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్లినప్పుడు, ఆయన దగ్గర కంప్యూటర్లో ఇవి చూసే వీలుంటుంది. మళ్లీ-మళ్ళీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల డబ్బు ఆదా కావడమే కాకుండా, సమయం వృధా కాదు. 

సింగపూర్ జనరల్ ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఎమర్జెన్సీ శాఖలో, ప్రతి షిఫ్ట్ లోను, ఒక సీనియర్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ తప్పనిసరిగా పనిచేస్తుంటారు. పేషంట్ రోగ తీవ్రతను బట్టి, అవసరానికి అనుగుణంగా, ప్రాధాన్యతా స్థాయిని ఎంపిక చేస్తారు. ఫలానా చోట వారికి అవసరమైన చికిత్స జరుగుతుందంటూ, వారిని, అక్కడకు వెంట తీసుకెళ్తుంది ఆసుపత్రి సిబ్బంది. నాలుగు రకాల ప్రాధాన్యతా పరమైన వెయిటింగ్ ప్రదేశాలుంటాయి. తీవ్రంగా బాధ పడుతున్న పేషంట్లకు ఒక విధంగా, మేజర్ ఎమర్జెన్సీకి ఇంకో విధంగా, మైనర్ ఎమర్జెన్సీలకు మరో విధంగా, ఎమర్జెన్సీ కాదని భావించిన వాటికి వేరే విధంగా చికిత్స ప్రారంభమవుతుందక్కడ. జ్వరాలతో బాధపడుతూ వచ్చే పేషంట్లను, వారి ఇన్‌ఫెక్షన్ ఇతరులకు తగలకుండా, మరో ప్రత్యేకమైన ప్రదేశానికి తరలిస్తారు.

సింగపూర్లో అత్యవసర వైద్య సహాయ సేవలను, "ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్" పేరుతో, "సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్" నిర్వహిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో 108 సేవల వలనే, ఇక్కడ 995 నంబర్‌కు ఫోన్ చేసి ఈ సేవలను పొందవచ్చు. జీవన్మరణ సమస్య తలఎత్తినప్పుడు మాత్రమే 995 నంబర్‌కు ఫోన్ చేసి సహాయం కోరాలి. ఫోన్ చేసిన వెంటనే 108-అంబులెన్స్ తరహాలోనే ఇక్కడా అంబులెన్స్ వస్తుంది. వైద్య సహాయం కావాలని కోరుకునే నాన్-ఎమర్జెన్సీ పేషంట్ సౌకర్యం కొరకు, వారికి అంబులెన్స్ పంపేందుకు 1777 అనే మరో నంబర్ కేటాయించింది ప్రభుత్వం. ఎమర్జెన్సీ కేసు కాదని తేలితే, 995 నంబర్‌కు ఫోన్ చేసి అంబులెన్స్ కోరినవారి దగ్గర నుంచి 180 సింగపూర్ డాలర్లు ఫీజు కింద వసూలు చేస్తారు. లేకపోతే ఈ సౌకర్యం ఉచితమే. అంబులెన్సులలో పేషంట్లను ప్రమాద స్థలానికి అతి సమీపంలో వున్న ప్రభుత్వ ఆసుపత్రికి చేరుస్తారు.


ప్రయోగాత్మకంగా, కనీసం, దేశంలోని ఆరు పెద్ద మెట్రోపాలిటన్ నగరాలైన న్యూ ఢిల్లీ, ముంబై, కోల్‌కత, హైదరాబాద్, చెన్నై, బెంగుళూర్ లలో సింగపూర్ విధానాన్ని ప్రవేశ పెట్టి, ఆ తరువాత ఫలితాలను బట్టి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తే మంచిదేమో. End