Monday, February 27, 2017

మొక్కులు ప్రభుత్వ పక్షానే....తప్పేంటీ? : వనం జ్వాలానరసింహారావు

మొక్కులు ప్రభుత్వ పక్షానే....తప్పేంటీ?
వనం జ్వాలానరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (28-02-2017)

            తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని బంగారు ఆభరణాలు సమర్పించిన సమయంలో స్వామివారిని సమీపం నుండి తనివితీరా దర్శనం చేసుకున్న వారిలో నేను కూడా వుండడం అరుదైన, అపురూపమైన అనుభవం. సీఎం సతీ సమేతంగా దేవాలయానికి చేరుకోవడానికి అర గంట ముందరే ఆయనతో దర్శనం చేసుకోవడానికి తెలంగాణ నుంచి వెళ్ళిన బృందంలోని వారందరినీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి లోనికి తీసుకెళ్లారు దేవాలయాధికారులు. తొలుత రంగనాయక మండపంలో వుంచిన ఆభరణాలను కళ్లకద్దుకోవడం, ఆ తరువాత ముఖ్యమంత్రి వెంట దర్శనం చేసుకోవడం జరిగింది. పేరుపేరునా తన వెంట వచ్చిన ప్రతివారినీ తన సమీపంలోకి పిలుస్తూ, అందరికీ తనివితీరా దర్శనం చేయించారు సీఎం. హారతీ, తీర్థం అందరికీ లభించింది.

          సరిగ్గా 26 సంవత్సరాల క్రితం ఇదే ఫిబ్రవరి నెలలో, దాదాపు ఇవే రోజుల్లో, అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి దగ్గర పీఆర్వోగా పనిచేస్తున్నప్పుడు కూడా నాకిలాంటి దర్శనమే లభించింది. అప్పట్లో అమల్లో వున్న నిబంధనల ప్రకారం, సీఎం వెంట వున్న వారందరినీ ముఖద్వారం నుంచే లోనికి అనుమతించినట్లు జ్ఞాపకం. కాకపోతే అప్పుడు సీఎం తిరుమలకు వచ్చిన సందర్భం వేరు. కృష్ణా జలాల పంపకం విషయంలో నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్ పవార్, నాటి కర్నాటక ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్ తో త్రైపాక్షిక చర్చలకు తిరుపతి వేదికైంది. ఆ సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. నాకింకా ఆ సమావేశానికి సంబంధించిన ఒక అంశం ఇప్పటికీ గుర్తుంది. వాస్తవానికి ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసిన ఉద్దేశం కేవలం జలాల పంపిణీ విషయమే. రాజకీయాలు వారిమధ్య రాలేదు. నదీ జలాల సంబంధిత సమావేశం తరువాత, వాళ్లు, మళ్లీ తిరుపతిలో ఎక్కడా ప్రత్యేకంగా కలవలేదు కూడా. అయినప్పటికీ, ఒక ప్రముఖ పాత్రికేయుడు, అప్పట్లో జాతీయ స్థాయిలో బాగా పేరున్న "బ్లిట్జ్" ఆంగ్ల వార పత్రికలో రాస్తూ...ఈ ముగ్గురూ కలిసి రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా ఒక కూటమిని తయారు చేస్తున్నారని పేర్కొన్నాడు. ఆ పత్రికలో వచ్చిన అంశాన్ని నేను సీఎం చెన్నారెడ్డికి చూపించి, జరగని విషయం రాశారని అంటే...."ఆ మాత్రం భయం రాజీవ్ గాంధీకి వుంటే తప్పేం లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు! ఎందుకో ఈ విషయం ఇప్పుడు మళ్లీ గుర్తుకొచ్చింది.

          ఇవన్నీ ఒక ఎత్తైతే...తిరుమల స్వామి దర్శనం మాటకొస్తే "దర్శనం స్వామి ఇస్తేనే దొరికేది"...అంతే కాని ఎవరూ ఇచ్చేది కాదు. అదో నమ్మకం. సీఎం కేసీఆర్ ఆభరణాలు స్వామివారికి సమర్పించిన తరువాత ఎస్వీబీసీ ఛానల్ తో మాట్లాడుతూ తన స్వానుభవం ఒకటి వివరించారు. కొన్నేళ్ల క్రితం తిరుమలకు వచ్చి కూడా, దర్శనం చేసుకోకుండా తిరిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, స్వామి అనుజ్ఞ లేనిదే దర్శనం జరగదని, అందుకే ఆభరణాలు ఇవ్వడానికి ఇంత కాలం పట్టిందనీ, అన్నారు. ఇది నూటికి నూరు పాళ్లు వాస్తవం.

"వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి"… ఆ కలియుగ ప్రత్యక్ష దైవ దర్శనం ఒక్క క్షణ కాలంపాటు కలిగినా చాలని, వందల-వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి, లక్షలాది మంది భక్తులు, పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమల కొండకు నిత్యం వెళుతుంటారు. అలా తన భక్తులను తన వద్దకు రప్పించుకుంటాడా కలియుగ దైవం!

ఇదిలా వుంటే...ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వ పరంగా చెల్లించిన మొక్కులపై అనవసర రాద్ధాంతం పూర్తిగా అసమంజసం. వీరి విమర్శలు మెజారిటీ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విగా, వాళ్ల నమ్మకాలకు వ్యతిరేకంగా వున్నాయి. ప్రజలచే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి, అందునా రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజల బాగోగుల కోసం, రాష్ట్రం బాగుకోసం, ప్రజల పక్షాన, ప్రభుత్వ పక్షాన మొక్కులు చెల్లించుకోవడంలో తప్పేంటో అర్థం కావడం లేదు.


సీఎం చేసిన ఆయుత చండీ యాగం మీద కూడా కొందరు ఇప్పటికీ విమర్శలు గుప్పిస్తున్నారు. యాగాలు-యజ్ఞాలు చేయడం కొందరికి అదో నమ్మకం. వాటివల్ల లోక శాంతి, ప్రజా ప్రయోజనం వుంటుందని భావించడం కూడా ఒక నమ్మకమే. భారతదేశంలోను, అనేక ప్రపంచ దేశాలలోను, అనేక మతాలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు ఆచరణలో వున్నాయి. చైనా లాంటి  కమ్యూనిస్ట్ దేశాలలో కూడా ఇప్పటికీ మావో కు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అంతే ప్రాధాన్యం బుద్ధుడికీ ఇస్తున్నారు. కంబోడియాలో ప్రపంచంలో కెల్లా అతిపెద్దదైన అంగ్కార్ వాట్ దేవాలయం వుంది. యజ్ఞయాగాదులనేవి ఈ నాటివి కావు. మన భారతీయ సంస్కృతీ-సంప్రదాయాలతో పెనవేసుకునిపోయాయవి. మానవాళిని అహర్నిశలూ రక్షించేవి కూడా యజ్ఞ ఫలాలే. మానవ జాతి జీవన విధానం ఆరంభానికి కారణం కూడా యజ్ఞ యాగాలే. మానవ జాతి సృష్టే యజ్ఞ సహితంగా జరిగిందంటారు. యజ్ఞం సాక్షాత్తు భగవత్ స్వరూపమే. మానవ జీవితాన్ని ఫలవంతం చేసుకునేందుకు, తనను తాను సంస్కరించుకుని, ఆత్మోన్నతిని పొంది విశ్వ శ్రేయస్సుకు పాటుపడేందుకు యజ్ఞయాగాదులు చేయాలని పూర్వకాలం నాటి మహాఋషులు చెప్పారు. పూర్వకాలంలో మాదిరిగానే ఈ నాటికీ సాధన, సంపద, నిబద్ధత, సంస్కారం, పూర్వ జన్మ పుణ్యం, నలుగురికి మేలు చేయాలన్న ఆలోచన కలవారు, యజ్ఞ యాగాలు చేస్తూనే వున్నారు.

మొక్కుల విషయానికొస్తే....తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఫలానా...ఫలానా...దేవుళ్లకు , ఫలానా...ఫలానా ఆభరణాలు మొక్కుగా చెల్లిస్తానని సీఎం కాకముందు కేసీఆర్ మొక్కున్నారు. మొక్కుకున్నది రాష్ట్రం ఏర్పాటు కోసం...రాష్ట్ర ప్రజల భవిత కోసం. ఆయన మొక్కుకు అనుగుణంగానే రాష్ట్రం సిద్ధించింది. రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో, సంపదతో జీవిస్తున్నారు. మరి, అలాంటప్పుడు, ఆ రాష్ట్ర ప్రజల కోసం, వారి పక్షాన, ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ శాఖ నిధులతో, ఆభరణాలు కొని మొక్కులు తీరుస్తే తప్పేంటి? ఉదాహరణకు, ఏదైనా ఒక రాష్ట్రంలో విపత్తు లేదా ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే, పక్క రాష్ట్రం సహాయం చేయడం సాధారణ విషయం. అలా చేసే సహాయం ప్రభుత్వ పరంగానే వుంటుంది కాని, రాష్ట్ర ముఖ్యమంత్రి తన సొంత నిధులతో చేయరు. సీఎం ఎప్పుడూ తన సొంత డబ్బుతో మొక్కులు చెల్లిస్తానని అనలేదే? అలాంటప్పుడు ఎందుకీ విమర్శలు?

ఇవేవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాని, ఆ రాష్ట్ర ప్రజలు కాని, ప్రజా ప్రతినిధులు కాని పట్టించుకోలేదు. టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీ పార్టీలకు చెందిన నాయకులు సీఎం పర్యటనలో పూర్తిగా పాల్గొన్నారు. తిరుమల తిరుపతి పర్యటన కోసం సతీ సమేతంగా, కుటంబ సభ్యులతో విమానాశ్రయం చేరుకున్న సీఎంకు ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా మాజీ చైర్మన్  శంకర్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారువిమానాశ్రయం ఎదుట బ్రాహ్మణులు వేదమంత్రోచ్ఛారణలతో స్వాగతించారు. కేసిఆర్ అభిమానుల పేరిట వందల్-వేల సంఖ్యలో విమానాశ్రాయానికి చేరుకుని స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు నాయకులు, అధికారులు, ప్రముఖులు కూడా కేసిఆర్ ను కలిశారుగతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం శ్రీవారికి ఆభరణాలు సమర్పించలేదని, స్వతంత్ర భారత చరిత్రలో కేసిఆర్ కొత్త సాంప్రదాయానికి నాంది పలికారని టీటీడీ కార్యనిర్వహణ అధికారి స్వయంగా అన్నారు. ప్రభుత్వ పరంగా, శ్రీకృష్ణ దేవరాయలు, మైసూర్ మహారాజు లాంటి వారు మాత్రమే గతంలో శ్రీవారికి ఆభరణాలు సమర్పించారని చెప్పారు. ప్రభుత్వం తరఫున ఆభరణాలు సమర్పించడం కొత్తేమీ కాదనే కదా అర్థం?

ఈ నేపధ్యంలో, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆభరణాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సరిగ్గా గంటపాటు ఆలయంలో గడిపిన ముఖ్యమంత్రి ఆలయ సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించారు. ముందుగా, సీఎం కేసీఆర్ దంపతులు ప్రధాన ధ్వారం ద్వారా ఆలయ ప్రవేశం చేశారు. ఆ తరువాత....రంగనాయక స్వామి మంటపంలో ప్రవేశించిన కేసీఆర్ స్వామికి సాంప్రదాయ బద్ధంగా ఆభరణాలు సమర్పించారు. బంగారు వాకిలి నుండి ప్రధాన ఆలయం లోకి ప్రవేశించి, స్వామి వారి దర్శనం చేసుకుని, ప్రధాన అర్చకుడు ఎ.ఎస్.నర్సింహ దీక్షితులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత, వకుళా మాత దర్శనం, పూజలు, విమాన వెంకటేశ్వరస్వామి దర్శనం, సబేరా మందిరంలో స్వామి వారి వస్త్రాలను కళ్లకద్దుకోవడం, హుండీలో కానుకలు వేయడం, భాష్య కార్ల సన్నిధిలో పూజలు, నర్సింహస్వామికి పూజలు, మూల స్తంభానికి నమస్కారం, రంగనాయక స్వామి మంటపంలో వేద పండితుల ఆధ్వర్యంలో ఆశీర్వచనం స్వీకరించడం చేశారు. ముఖ్యమంత్రి దంపతులకు, మంత్రులకు, కుటుంబ సభ్యులకు ఆలయ ప్రసాదాలు అందించారు అధికారులు.


            "తెలంగాణ వస్తే శ్రీ వెంకటేశ్వరస్వామికి, పద్మావతి అమ్మవార్లకు బంగారు ఆభరణాలు సమర్పిస్తానని ఉద్యమ సమయంలో మొక్కుకున్నాను. స్వామి వారి దయవల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ ఆభరణాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి అనేక సార్లు ఇక్కడికి వద్దామని అనుకున్నా కుదరలేదు. స్వామి వారు పిలిపించుకుంటే తప్ప ఇక్కడకు రావడం సాధ్యం కాదు. గతంలో నేనొకసారి మా చిన్నాన్నతో కలిసి తిరుపతి దాక వచ్చినా ఓ అశుభవార్త తెలియడంతో స్వామి వారిని దర్శించుకోకుండానే తిరిగి వెల్లిపోయాను. స్వామి వారి అనుగ్రహం ఉంటే తప్ప ఇక్కడకు రావడం, దర్శనం కలగడం జరగదు. ఇవాళ దేవుడే నన్ను పిలిపించుకున్నాడు. ఇవాళ మనస్ఫూర్తిగా పూజలు చేశాను. తెలంగాణ రాష్ట్రం బాగుండాలని దీవించమని ప్రార్ధించాను. రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని నిండు మనసుతో కోరుకున్నా. రెండు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశం భాగుండాలని కోరుకున్నా. సహకరించిన అందరికీ కృతజ్ఙతలు." అని రంగనాయక స్వామి మంటపంలో భక్తులను ఉద్దేశించి ఇచ్చిన సందేశంలో ముఖ్యమంత్రి చెప్పారు. మరి ఎందుకీ అర్థం లేని విమర్శలు?

Sunday, February 26, 2017

శ్రీ సుందర కాండ ఒక మహా మంత్ర భాండాగారం ..... ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

శ్రీ సుందర కాండ ఒక మహా మంత్ర భాండాగారం
ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (27-02-2017)

          శ్రీ సుందర కాండ ఒక మహా మంత్ర భాండాగారం. చక్కదనానికి సంకేతం. మనస్సును మురిపించేదే నిజమైన సౌందర్యం. శాబ్దిక పారమ్యాన్ని నింపుకున్న రామాయణం లోని ప్రతి అక్షరమూ మధురాతి మధురమేకాదు…..మహా మంత్రాక్షరాలతో నిక్షిప్తమైన అక్షయ నిధానం. శ్రవణ స్మరణాదుల మాత్రం చేత అంతఃకరణ శుద్ధి, ఆశయ సిద్ధి, సద్భుద్ధి లభిస్తాయట! వింటేనే చాలు సర్వతో భద్రమన్నారు. అలాంటి వాల్మీకి భగవానుని అనుగ్రహ ప్రసాదమైన రామాయణంలో సారభూతమైనదీ, సర్వారిష్ట నివారకమైనదీ, సర్వాభీష్ట ఫల ప్రదానమైనదీ శ్రీ సుందరకాండ. రామాయణంలో ప్రతికాండకూ అందలి కథా విశేషాన్ని బట్టీ, ఇతివృత్తాన్నిబట్టీ వాల్మీకుల వారు పేరు పెట్టారు. కానీ సుందరకాండ మాత్రం ఈ నియమానికి కట్టుబడినట్లు కనిపించదు, లోతుకు వెళ్లితే తప్ప. "ఏమిటీ ఆ సౌందర్యం" అంటే, "అందులో సుందరం కానిదేమున్నది" అంటారు విజ్ఞులు.

సుందరకాండలో ప్రస్తావించబడిన ప్రతి అంశమూ సౌందర్యమయమే అన్నారు. శ్రీరాముడు 96 అంగుళాల పొడవైన మహా చక్కనివాడు. సీతమ్మ అపురూప సౌందర్య రాశి. అశోకవనమూ-మధువనమూ అతిలోక సుందరమైనవే. ప్రతి శ్లోకంలోనూ పల్లవిస్తూ లయలతో హొయలొలికే గాయత్రీ మంత్రాక్షరాలు అద్భుత సుందర బంధురాలైన శబ్దమాలికలు. ఆద్యంతాలూ కనిపించే వానరాలు సుందర అరవిందాలు. ఇక కావ్యమా? నిరుపమాన సౌందర్యనిధానం. ఆదికావ్యం. పదపదం అక్షర రమ్యం. దివ్యం. ఇక సుందరకాండ ధ్వని, అర్థ సామర్థ్యాలతో చదువరిని మంత్రముగ్దుడిని చేయగల ఫణితితో నిండినది.

సముద్రతరణం - లంకాగమనం - సీతాన్వేషణం - శ్రీరామ నివేదనం - ఇవన్నీ కలిస్తే సుందరకాండ! జరిగిన ఇతివృత్తం యావత్తూ దినద్వయం లోపే. శబ్దాను ప్రాసలతోనూ, అంత్య ప్రాసలతోనూ మార్దంగిక వైభవంగా సాగుతాయి శ్లోకలతలు. "చంద్రోదయ వర్ణన" (ఐదవ సర్గ) ఒక్కటి చాలు....పదవిన్యాసాన్ని తిలకించడానికి.అర్థ సౌందర్యం - రస సౌందర్యం - కథా నాయికా నాయకులైన శ్రీ సీతారాముల సౌందర్య విశేషాలు (జీవాత్మ-పరమాత్మల సౌందర్యాలు)-ఆచార్యుడైన హనుమత్ సౌందర్యం-మహావిశిష్టమైన లంకా నగర సౌందర్యం - లంకానగర ప్రమదావన సౌందర్యం - లోక రావణుడైన రావణ రాజసవీర సౌందర్యం - హనుమంతుడి సమయోచిత బుద్ధిబల సౌందర్యం - వాల్మీకి మహత్తర కవితా శిల్ప సౌందర్యం, ఆదిమధ్యాంతాలూ నింపుకున్నది కాబట్టే, దీనిని వాల్మీకి "సుందరకాండ" అన్నారు. "సుందరః" అంటే హరి అని అర్థం. హరి అంటే నారాయణుడూ కావచ్చు - కోతీ కావచ్చు. శ్రీమన్నారాయుణుడైన శ్రీరాముడు, అరివీర పరాక్రముడూ - అంజనీ సూనుడూ అయిన ఆంజనేయుడు కోతి రూపంలో దర్శనీయులౌతారు ఇందులో.

ఇందులో అద్భుతమైన సాముద్రిక, సాగరిక, జలాంతర్గత, వాయు, వియత్తల, స్వప్న, ధర్మ, దౌత్య, రాజనీతి శాస్త్రాల రహస్యాలు ప్రచ్ఛన్నంగా ఉండడం గొప్ప విశేషం. కంటికి కనిపించే అవయవ సంపుటిని బట్టి కంటికి కనిపించని అవయవ విశేషాలను పసిగట్టి, వ్యక్తి తత్త్వాన్నీ, ఔన్నత్యాన్నీ వ్యక్తపరిచే సునిశిత కౌసల్యం ఇందులో నిక్షిప్తం చేయబడినందున, "వైఖరీ విద్యాపారంగతులకు" ఇదొక ప్రమాణ గ్రంథం.

మంత్ర శాస్త్రమే సుందరకాండ. ఇది గాయత్రీ బీజ సంయుతం. దీనికి విశ్వామిత్రుడు ఋషి. వాల్మీకి మహా ఋషి. ఆంజనేయుడు మంత్రాధి దేవత. సర్వారిష్ట నివారణ ఫలం. ఆద్యంతాలూ "త" కార, "స" కారాలతో సుసంపన్నమైన మహా మంత్ర వనం సుందర నందనం! "త", "థ", "స", "న", "ర" ల పట్టు అంతా ఈ అక్షరాలలో విధేయంగా అణగి వుంది. "రామ", "సీత", "హనుమ", "దశరథ", "భరత", "శత్రఘ్ను", ఇవన్నీ పేర్లుగా కనిపించినా, నిజానికి మంత్ర మూలికలు...మహిమాన్విత మంత్ర మాలికలు. అందువల్లనే దీనిని శ్రద్ధగా చదువుతారు. నియమంగా పారాయణం చేస్తారు. నిష్ఠగా శ్రవణం చేస్తారు. ఇవేవీ సాధ్యపడక పోయినా, పరోక్షంగా సుందరకాండను ప్రాచుర్యంలోకి తెస్తారు.


వావిలికొలను సుబ్బారావు దాసు అని (వాసుదాసు) ఒక మహా....మహానుభావులు మన తెలుగు గడ్దపై అవతరించి, వాల్మీకి రామాయణాన్ని మందరం పేరుతో యధావిధేయంగా, ఛందోబద్ధంగా మూల మంత్రాలనూ, మంత్రాక్షరాలనూ సైతం రమ్యత, పారమ్యతలకు విఘాతం కలుగని రీతిలో తెలుగు లోనికి అనువదించి ఆంధ్ర వాల్మీకి అన్న గౌరవాన్ని సంపాదించుకున్నారు. వ్యాస భాగవతాన్ని మరిపించిన పోతన్న భాగవతం వలె, వాల్మీకాన్ని ఆంధ్ర వాల్మీకి రామాయణం మరిపించి తెలుగువారిని మురిపించింది. శ్రీవారి అవతారకాలం లోనే నాలుగైదు పర్యాయాలు ప్రచురణ పొంది, విశేషమైన ప్రాచుర్యాన్ని పొందగలిగింది 100 ఏండ్ల క్రితమే!. ఊహాతీత ప్రతిభా విరాజిగా వాసుదాసు గారు రామ భక్తుల హృదయారవిందాలలో సుప్రతిష్ఠులైనారు. వందేళ్లు పైగా కావొస్తూంది. కాలవిరామం పెరిగిపోతోంది. క్రమంగా వాసుదాస స్వామి వారు జనహృదయాలకు దూరంగా జరిగి పోతున్నారేమో అనిపిస్తున్న తరుణంలో, అశేష తెలుగు హృదయాలకు మరో మారు ఆయన్ను గుర్తు చేసే దిశగా ఆయన రాసిన వాల్మీకి తెలుగు అనువాదంలోని సుందర కాండను పాఠకులకు అందించే ప్రయత్నమే ఇది.

వాసుదాసు గారు ఆంధ్ర వాల్మీకులుగా లబ్ధ ప్రతిష్ఠులైనారు. మహనీయమైన మందర రామాయణాన్ని అనేకానేక విశేషాలతో, పద్య-గద్య-ప్రతిపదార్థ-తాత్పర్య-ఛందోలంకార విశేష సముచ్ఛయంతో నిర్మించి వేలాది పుటలలో కూర్చి మనకు అందించారు. రామాయణ క్షీరసాగరాన్ని మందరం మధించి మన కందరకూ ఆప్యాయంగా అందించింది. కానీ దానిని ఆస్వాదించే తీరికా, ఓపికా లేని జీవులమైపోయాం మనం. భాష, శైలి, అర్థం, తాత్పర్యం, కాలక్రమంలో పరిణామం చెందాయి. సూక్ష్మంలో మోక్షం కావాలంటున్నారు నేటి తరం పఠితులూ, పండితులూ కూడా. ఆత్మ తృప్తికీ, స్ఫూర్తికీ, మనశ్శాంతికీ, సర్వబాధోప శమనానికీ ఇది దివ్య రసమయ పానీయం. సాహితీ పిపాసులకూ, సౌందర్యారాధకులకూ, ఆస్తిక భావుకులకూ ఇది హృద్యమైన నైవేద్యం కాగలదని భావిస్తున్నాను.

శ్రీరామాయణం క్షీరధార. అందులో సుందరకాండ పంచదార. అందులోనూ శ్రీవాసుదాసస్వామి వారి "మందరం" మందార మకరంద మాధుర్యం."కవికులగురువు-కాళిదాసు" అన్నట్లు:

"వృత్తమ్ రామస్య వాల్మీకీః , కృతి తౌ కిన్నెర స్వరౌ!
కింతత్? యేన మనోహర్తుం అలం స్యాతాం నశ్రుణ్వతాం’!"

          (చరిత్ర మారాముడిది. రచన సాక్షాత్తూ వాల్మీకుల వారిది. గానం చేసేవారు కిన్నెర గాత్రులైన కుశ, లవులు. ఇంతటి మహనీయమైన రామాయణంలో శ్రోతలను పరవశింప చేయని అంశం ఏముంటుంది?)


అనన్య సామాన్యమైన సీతారాముల కధను ఎందరు ఎన్ని విధాలుగా మార్చి-మార్చి, కూర్చినా, దాని మాధుర్యం, ఇంకా, ఇంకా వృధ్ధి పొందుతూనే వుంటుంది. వసివాడని పారవశ్యం అది. End Intro

Saturday, February 25, 2017

Vows fulfilled on behalf of the Government ..... What’s wrong in it? : Vanam Jwala Narasimha Rao

Vows fulfilled on behalf of the Government
What’s wrong in it?
Vanam Jwala Narasimha Rao
When Telangana State Chief Minister Sri K Chandrashekhar Rao, along with members of his family had an affectionate Darshanam of Thirumala Lord Venkateswara Swamy and presented gold ornaments I too had the privilege to be present there. It was a rare and wonderful experience! Half an hour before the Chief Minister with his Wife entered the temple premises, the temple authorities allowed the team accompanying the CM through the Vaikuntam Queue Complex. After paying respects to the gold Ornaments placed in the Sri Ranganayaka Mandapam we had Darshanam of the Lord along with the CM and his family members. The CM saw to it that all the team members accompanying him had the similar Darshanam like the one he had and he even called out each and every one of us. Harathi and Thirtham were given to all of us.

I had the rare coincidence of having a similar Darshanam 26 years ago when I was PRO to the then AP CM Dr M Channa Reddy during the same month of February.  I remember that in accordance with the rules prevailing then CM team was allowed into the temple through the Main entrance. Tirupati was the venue then for a tripartite meet on the Krishna water distribution among the then Maharashtra CM Sharad Pawar, Karnataka CM Veerendra Patil and AP CM Dr Channa Reddy. I also participated in that meeting and I still remember one issue that took place then. The three CMs then met to discuss the Krishna water sharing issue only and there was no scope for any political discussion. After the meeting on the river water sharing they did not meet at all. However, a prominent journalist then wrote in the popular national Tabloid “Blitz” that the three CMs met to gang up against Rajiv Gandhi. I brought this matter to the notice of Dr Channa Reddy and told him that the journalist wrote about something that did not take place. For this, Dr Channa replied, “Good, at least Rajiv has something to fear about!”

There is a strong belief among the devotees that unless Lord Venkateswara Swamy desires to give his Darshanam, it can never happen. Speaking to SVBC Channel, after presenting the Gold Ornaments to the Lord, the CM had detailed his own personal experience in this matter. The CM said many years ago when he came here to have Darshanam it did not take place. He also said that though he wanted to present the Gold Ornaments soon after the formation of the State it did not happen as the Lord did not desire to give till now. 

“Venkatadri samam sthanam brahmande naasthi kinchanam……Venkatesa samo deva na bhooto na bhavishyathi” It is just enough to have the Darshanam of the Kaliyuga Presiding deity for a moment and the Lord will make his devotees come to him travelling thousands and lakhs of miles. The Lord will attract his devotees to the holy Tirumala hills.

Meanwhile, it is totally unjust and unreasonable one, for some people to talk about CM fulfilling his vows with government money. This sort of prejudiced criticism on an issue like this is hurting the sentiments of majority of the Telangana people and their faith. One would fail to understand as to what is wrong for a leader duly elected by the majority of people and trying to fulfill a vow he took on behalf of the same people and region? Moreover the vow is for the welfare and common god of the people in the State.

Some people are also still criticizing the Ayuta Chandi Yagam performed by the CM. Performing Yagam and Yagnams is belief of certain people. It is also belief that through performing Yagnam and Yaagam it will result in universal peace and people’s welfare. Such beliefs and faith is in vogue in several countries in the world as well as in our own country. Even in a Communist country like China they give equal importance to Mao and Buddha. The World’s largest temple Angkor Wat was in Cambodia. The fruits of Yagnams protect the humanity. Yagnas and Yagams are the reasons behind evolution of human society. Even today, those having Practice, Prosperity, Commitment, Good Samskara, punya of the previous birth and having a desire to help others are performing these rituals.


Coming back to the vows fulfilled by the CM Chandrashekhar Rao it is known that he had taken these vows to various temples, Shrines and deities in anticipation of the dream of separate Telangana sate during the height of the Telangana movement. He took these vows before he became a CM for the well being of the people and for the formation of the State. In accordance with his vows, the state is formed and the people are happy and leading comfortable lives. Under such a situation what is wrong if the CM fulfilled his vows on behalf of the government, through government funds by donating gold Ornaments to fulfill his vows to various temples?  In case of a natural calamity in the neighbouring State, if the State wants to offer help it is done from the Government Ex-chequer but not from the personal accounts of the CM. Moreover, the CM never said he would fulfill his vows by paying from his pocket! Then why criticize him?

However, these unfound criticisms have no takers in AP State Government, its public representatives or even the political parties there. TDP, BJP, YSRCP party leaders there have actively participated in the CM programme. When the CM reached the Renigunta Airport as part of his tour of Tirupati and Tirumala along with his wife and family members, AP Minister Bojjala Gopalakrishna Reddy, Tirupati MLA Ms Sugunamma, Chandragiri MLA Chevireddy Bhaskar Reddy, TUDA former Chairman Shankar Reddy, TTD Board member and BJP MLA Chintal Ramachandra Reddy from Telangana accorded a grand welcome. Outside the Airport, Vedic Scholars welcomed the CM with Vedic Chants. Thousands of fans of KCR have thronged to the Airport to welcome him. Prominent leaders from Chittoor district, officials and others have met the CM. TTD EO Sambasiva Rao had went on record to say that no other CM in the independent India had ever presented Gold Ornaments to the Lord! He also hailed the CM for heralding a new precedent in the independent India. He also said that in the ancient past, Emperors and Kings like Sri Krishnadevaraya and Mysore Maharaj presented the gold Ornaments to the Lord on behalf of their governments. This means that there is nothing new in presenting the gold Ornaments on behalf of the government and people.

Against this backdrop the CM presented the Ornaments, had Darshanam and performed poojas in accordance with the Temple norms. Under the guidance of Temple Chief Priest AS Narasimha Deekshitulu special poojas were performed. The CM later had Darshanam of Vakula Mata, Sri Ramanuja Charyulu, Vimana Venkateswara Swamy, Narasimha Swamy and performed poojas. The CM also paid respects to the clothes of the Lord kept in Sabera Mandir and salutations to the Flag-Staff (Moola Sthamba) and had the blessings of Vedic Scholars in Ranganayaka Mandapam.

In his message through SVBC Channel the CM said, “I have taken a vow during the Telangana movement that I would present golden Ornaments to Lord Venkateswara Swamy if separate Telangana State becomes a reality. Due to Lord Venkateswara Swamy’s blessings we got the Telangana State. I am happy today that I have presented the Ornaments and fulfilled my vow. After the formation of Telangana State I wanted to come here and fulfill my vow. But it did not happen. As they say unless you have calling from the Lord you cannot make the visit. I prayed to the Lord to take care of the Telangana State and bless that it should do well. I also prayed from bottom of my heart to make the two Telugu States flourish. Not only the two states but also I prayed for the well being of the entire country….” 


CM has definitely fulfilled his vow on behalf of the Government and people of the state. What is wrong in it?  Why then the criticism? End

Sunday, February 19, 2017

విధి బలీయం-ధర్మం కన్న దైవం మిన్న .....వనం జ్వాలా నరసింహారావు

విధి బలీయం-ధర్మం కన్న దైవం మిన్న
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (20-02-2017)

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం రసరమ్యం. అందులో చెప్పినవన్నీ ధర్మాలే. అయితే ఆ ధర్మాలన్నింటికన్నా మించింది దైవమని చెప్పే విషయం అయోధ్య కాండలో వుంది. శ్రీరాముడుని అడవులకు పంపాలని, ఆయన స్థానంలో తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయాలని కైక దశరథుడిని కోరడం, ఆ విషయాన్ని ఆయన మాటగా కైకే స్వయంగా రాముడుకి తెలియచేయడం, రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడానికి అడవులకు పోవడానికి సిద్ధపడి తల్లి కౌసల్య అనుమతి-ఆశీర్వాదం కొరకు ఆమె దగ్గరకు పోవడం, ఆ సమయంలో కౌసల్య, తమ్ముడు లక్ష్మణుడు కైకను దూషించి రాముడు అడవులకు పోవద్దని అభ్యంతర పెట్టడం నేపధ్యంలో ధర్మం, అధర్మం, నీతి, న్యాయం లాంటి విషయాలెన్నో లక్ష్మణుడికి వివరిస్తాడు రాముడు. ధర్మాన్ని మించిన దైవం వుందని, కైక మోసం చేసిందనే నెపంతో ఆమెను కోపగించుకో కూడదనీ, అందులో ఆమె తప్పేమీ లేదని అంటాడు రాముడు. తనకు పట్టాభిషేకం చేయాలని ప్రయత్నం చేసిన వాడు దశరథుడు కాదని, విఘ్నం కలిగించింది కైక కాదని, తాను అడవుల పాలవడానికి తన దోషం ఏదీ లేదని, ఇవన్నీ కేవలం దైవ కృత్యాలేనని అంటాడు. విధి బలీయం అంటాడు శ్రీరాముడు.

విధి చేష్ట ఎలా వుంటుందో సోదాహరణంగా తెలియచేశాడు రాముడు. ఇంకా ఇలా అంటాడు: "ఇంత దూరాలోచన దైవ ప్రేరణ వల్లనే కలిగింది. అలా కాకపోతే తనకు ఏ అపరాధం చేయని నన్ను నిష్కారణంగా కష్టపెట్టాలని కైక మనసుకు కలగడం సాధ్యమా? మన ముగ్గురు తల్లులలో, నా మీద ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ ప్రేమ అని చెప్పడానికి, వారిలో కొంచెమైనా తారతమ్యం కనిపించడం నేను చూడలేదు. ఇదే కైకకు నిన్నటి దాకా తన కొడుకుపై ఎక్కువ ప్రేమ కాని, నామీద తక్కువ ప్రేమ కానీ, విరోధ భావం కానీ లేదు. ఇదంతా ఇవ్వాళే కలగడానికి కారణం చెప్పగలమా? ఉన్నట్లుండి ఇంతటి ప్రేమ, విరోధంగా మారడానికి కారణం దైవం కాకుండా మరెవరు? తన కన్న కొడుకు కంటే నాపై ఎక్కువ ప్రేమగల కైక, ఏ అపరాధం చేయని నన్ను, నిష్కారణంగా కఠినోక్తులు మాట్లాడి, ఊళ్లో కూడా వుండనీయకుండా, అడవులకు పొమ్మని అనడం అంటే, ఇదంతా విధి చేష్టకాకుండా ఇతరుల చేష్ట ఎలా అవుతుంది? ఇతరులకు ఇది సాధ్యం కూడా కాదు".

రాముడు ఇంకా ఇలా అంటాడు:"ఆమె స్వభావ రీత్యా దుష్టురాలు. ఆ దుష్ట స్వభావమే ఇప్పుడామెను ప్రేరేపించింది. ఇక దైవం ఏమి చేసిందంటావా? సహజంగా ఆమె దుష్టురాలు కాదు. ఆమె పుట్టడం తోనే ఆమెతో గుణాలకు తోడు గౌరవం కూడా పుట్టింది. కులం కొలది గుణం అంటారు. ఆమె గొప్ప వంశంలో రాజకుమారిగా పుట్టింది. గొప్ప జాతిలో, గొప్ప వంశంలో పుట్టి, గొప్పవారి సాంగత్యంలో పెరిగిన దానికి నీచగుణం సహజమని ఎలా చెప్పగలం? సాలగ్రామాల గనుల్లో గులకరాళ్లు కూడా వుంటాయికదా? సముద్రంలో విషం పుట్టలేదా? అలా ఐతే బాల్యం నుంచే ఆమె నీచురాలై వుండాలి. అలా కాకుండా, దానానికి, దయకు స్థానంగా కీర్తి సంపాదించింది. సహజంగా నీచురాలైతే ఆమెకు ఈ కీర్తి కలిగేదా? తనతో సమానమైన సవతుల మీద ద్వేషం పెంచుకుంది. అది నీచమే కదా? ఆమె ద్వేషించింది సపత్నీత్వాన్ని కాని సవతులను కాదు. వారు సవతులు కాకపోతే వారిని ద్వేషించేది కాదు. అందరు ఆడవారిని ద్వేషించలేదే? తమ యోగ క్షేమాలకు హాని కలిగిస్తారేమోనని అనుమానం కలిగిన తోటి రాజులను అణచివేసే ప్రయత్నాన్ని పట్టాభిషిక్తులైన రాజులు కూడా చేయడం లేదా? ఒకరికె ఎంతైనా దానం చేయగల కైక పరుల సొత్తును ఎందుకు ఆశించింది? ఎంతో దయా గుణం కల ఆమె ఇలాంటి క్రూరమైన పనికి ఎందుకు సాహసించింది? ఎందుకు భర్తను ఎదిరించింది? ప్రీతిపాత్రుడనైన నన్ను ఎందుకు పనికిమాలిన, బాధాకరమైన మాటలను అనగలిగింది? దైవం ఆవేశించకున్న ఇలా చేయగలిగేదా? సహజమైతే ఇన్నాళ్లు ఎందుకు చేయలేదు? కాబట్టి ఇంత మహిమగలది, ఊహించలేనిది, అసాధ్యమైన ప్రభావం కలదైన దైవం ఎలాంటివారికైనా అందలేనిదే. దానికి ఎదురులేదు. ఆమెకు ఆ దుర్భుద్ధి పుట్టడానికి, నాకు దారిద్ర్యం రావడానికి దైవమే కారణం. ఆ దైవమే ఇంత పని చేసింది".

"దైవం వుందనడానికి ప్రమాణం ఏంటి? దైవాన్ని ఎదిరించి ఇలాంటివి జరగకుండా మనం పురుషకారం చేయలేమా? ఒక పని మనం చేస్తున్నప్పుడు దైవం అనేదొకటున్నదని, అదేంటో చేస్తున్నదని, మనకు తెలియదు. ఫలితం కలిగేటప్పుడు మాత్రం ఆ దైవం కనపడి అదెలా చేయదల్చుకున్నదో, అలానే చేస్తుంది. ఫలితంలో మాత్రం కనిపించి, వేరే విధంగా కనిపించక, ఆ కారణం వల్ల దానిని జయించలేక సతమతమయ్యే మనం దైవంతో పోరాడగలమా? అది ఏ రూపంలో, ఎలా, ఏం చేస్తున్నదో మనకు తెలియనప్పుడు దానితో పోరాటం చేయగలమా? ఎలా చేస్తాం? ఫలానా సమయంలో, ఫలానా కార్యం సాధించేందుకు, ఫలానా సాధనాలను (దైవం) సిద్ధం చేసుకుని వుందని మనకు ముందే తెలుస్తే కదా, మనం ప్రతీకారం చేయగలం? కార్యస్వరూపంలో కనిపించకుండా, ఫలితం స్వరూపంలో కనిపించేదే దైవం. కాబట్టి దైవం వుందనడానికి అనుమానమే ప్రమాణం...బుద్ధి బలంతో మాత్రమే దానిని ఊహించగలం. కారణం లేకుండా కార్యం జరగదు. నిష్కారణం అంటే...కారణం మనకు తెలియదని అర్థమే కాని, కారణం లేదని అర్థం కాదు. కాబట్టి, మన సంతోషానికి, సౌఖ్యానికి, వ్యసనానికి, శాంతికి, రోషానికి, లాభనష్టాలకు, జననమరణాలకు, మరెన్నో ఇతర ఫలితాలకు....వేటినైతే కారణం లేకుండా కలుగుతున్నాయని అనుకుంటామో, వాటన్నిటికీ మూలకారణం దైవమే సుమా! ఇది తప్పదయ్యా తప్పదు!".


"పామరులమైన మన సంగతలా వుంచితే, ఘోరమైన తపస్సు చేసి, ఎంతో జ్ఞానాన్ని-మహిమను సంపాదించి, నిత్యనియమవ్రతులై, శాంతులై, నిష్కాములై, అడవిలో ఒక మూల నివసించే మునులు కూడా దైవాన్ని ఎదిరించి ఏమీ చేయలేరు. ఇలాంటి వారిలో కొందరు హటాత్తుగా కామానికి, కోపానికి లోబడి, దీర్ఘకాలంగా అభ్యసిస్తున్న నియమనిష్ఠలను నీటిపాలుచేసి, మర్యాద తప్పి, భ్రష్టులై పోవడం దైవ చేష్ట కాదా? పురుష ప్రయత్నంలో ఏ లోపం వుంది? విశ్వామిత్రుడంతటి వాడే నిమిషంలో కామానికి, క్రోధానికి వశుడై చెడి పోయాడో విన్నాం కదా? శివుడు కూడా అలానే అయ్యాడు కదా? ఎప్పుడు కూడా ఇదిలా జరుగవచ్చని ఊహించని పనులు తటాలున వున్నట్లుండి అయిపోవడం, అందరూ తప్పక అవుతుందనుకున్న కార్యం విఘ్నం కావడం లాంటివన్నీ దైవ చేష్టలే! ఇది సత్యం. ఈ విధంగా సప్రమాణంగా, నిస్సందేహంగా నిశ్చయించుకుని, ఇతరుల ఉపదేశాల వలనే కాకుండా, నాలో నేనే కార్యాచరణ ఆలోచించాను. ఇది దైవ కృత్యమని, దీనిలో మన దోషం లేదని, కైక నిమిత్త మాత్రమేనని, ఆమె దైవానికి సాధనం అయిందని, సాధించేది దైవం మాత్రమేనని, నాకు అర్థమైంది. దానివల్ల నాకు వ్యసనం, బాధ కలగలేదు. లక్ష్మి పోయింది...దారిద్ర్యం వచ్చింది అని దుఃఖించవద్దు. నా అభిప్రాయంలో, లెక్కింపనలవి కాని ఈ రాజ భోగాలు, అరణ్యవాసం, రెండూ ధర్మ కార్యాలే. రెండూ ఒకటిగానే అనిపిస్తున్నది. ఒక విధంగా ఆలోచిస్తే, వనవాసమే సుఖమనిపిస్తున్నది. ఎందుకంటే...రాజభోగం సుఖరూపక దుఃఖం; వనవాసం దుఃఖరూపక సుఖం. రాజభోగం ఇప్పటికి సుఖంగా కనిపించినప్పటికీ, నిర్వహణలో దుఃఖంతో కూడుకున్నదవుతుంది. వనవాసం నిశ్చింతం. నిరుపద్రవం. పుణ్యఫలదం. కాబట్టి, తాత్కాలికంగా దుఃఖంగా తోచినప్పటికీ, పోనుపోను సుఖమిస్తుంది. సుఖాన్ని, దుఃఖాన్ని ఇచ్చేవారెవరూ లేరు. ఎవరో ఇతరులు అవి కలిగిస్తారని మనం అనుకుంటాం. నేనే ఈ పని చేశాననడం వృధాభిమానం. ప్రతి మనిషి తాని చేసిన కర్మకు కట్టుబడి వున్నాడు. కైకలో స్వతస్సిద్ధమైన దోషం లేదు. పిశాచం పట్టిన వారు, సన్నిపాత జ్వరంతో బాధ పడేవారు, దూషించినప్పుడు, అది రోగబలమంటామే కాని వ్యక్తిని తప్పు పట్టం కదా? అలానే, దైవం కైక నోటి నుండి ఇలాంటి కీడు మాటలు పలికించింది. కైక మీద కోప్పడి ప్రయోజనం లేదు".

శ్రీరాముడు చెప్పినదంతా విన్న లక్ష్మణుడు ఆయనతో విభేదించి ఇలా అంటాడు: "కైకేయీ దశరథుల ఆలోచనను నువ్వు దైవ తంత్రంగా పోల్చావు. అలాంటి దైవం నాకిష్టం లేదు. కుట్రలు ప్రేరేపించు దైవం ఎలా దైవం అవుతుంది? ఎలా పూజ్యనీయమవుతుంది? బలం లేనివారు, అల్ప తేజస్సు కలవారు దైవ బలం అంటారు. ఎందుకు? వాళ్లకు కార్యసాధనకు కావాల్సిన బలం, తెలివితేటలు లేకపోవడం వల్ల, నింద తమ మీద వేసుకోకుండా దైవం మీద పెట్తారు. ఇక బలవంతులు, కీర్తిని కోరేవారు, దైవం అనేదొకటున్నదని కలలో కూడా అనుకోరు. పురుషకారంతో స్వకార్యాన్ని సాధించి కీర్తిని పొందుతారు. అలాంటివారిని దైవం ఏం చేస్తుంది? బలం గల గొప్పవాడు పౌరుష బలంతో దైవాన్ని దగ్గరకు రాకుండా తరిమికొట్టి, చివరకు, దైవం వల్ల ఏ బాధ పడకుండా, సమర్థతతో తన పని తాను చేసుకుంటాడు. నువ్వు దైవ బలం ఎక్కువ అంటున్నావు. నేను పురుష బలం ఎక్కువ అంటున్నాను".

కైకేయిని దూషించవద్దని లక్ష్మణుడితో రాముడంటాడు. రాజ్యాభిషేక విఘ్నం ఆమె చేసింది కాదని, దైవకృతం అని, ఆమె నిమిత్త మాత్రమే అని, ఆమె మీద కోప పడవద్దని, దైవమే మేలు-కీలుకు కారణం అని, ఆమెకు ఆ బుద్ధి కలిగించింది దైవమే అని, అలా కాకుంటే తన మీద ఎంతో ప్రేమ కలిగిన ఆమెకు నిమిషాల్లో విషమ బుద్ధి ఎందుకు కలిగిందని, దైవం అప్రతిహతమని, అలాంటి దైవంతో ఎవరు పోరగలరని, రాముడు సమాధానం చెప్పాడు. బదులుగా లక్ష్మణుడు...రాముడు చెప్పింది సరైంది కాదని, దైవం పరాధీనమైందని, అది స్వతంత్రించి ఏ పనీ చేయలేదని, అలాంటి దాన్ని నమ్ముకుని, దైవం ఇస్తుందని పురుష ప్రయత్నం చేయకుండా వుండడం సరికాదని అంటాడు. దైవం కంటే పౌరుషమే శ్రేష్టమని లక్ష్మణుడు వాదించాడు.

మహాభారతంలో చెప్పినట్లు, లోకం దైవాన్ని ఆలంబనంగా తీసుకుని పురుషకారంలో ఉదాసీనులు కాకూడదు. మనుష్యుడు చేయాల్సిన కర్మం చేయకుండా దైవమే ఇస్తాడని భావించకూడదు. ఇలాంటి మాటలు చూస్తుంటే, దైవం కంటే పౌరుషం బలమని అనిపిస్తుంది. రాముడు దైవమే బలిష్టమని అన్నాడు. దైవ-పౌరుషాలకు పరస్పర విరోధం కనిపిస్తున్నది. ఇదెలా అంటే....పురుషకారం లేకుండా దైవం ఏ కార్యం చేయలేదు...అలానే, దైవ సహాయం లేకుండా ఏ కార్యం ఫలించదు. కాబట్టి ఏదైనా ఫలితం కావాలంటే రెండూ అవసరమే! ఇదిలా వుంటే...రామచంద్రమూర్తి ఎందుకు పురుషకారానికి అనమతి ఇవ్వలేదు? ఆయన అభిప్రాయం ప్రకారం...పురుష ప్రయత్నం వ్యర్థం...దైవమే కార్యసాదకం. నిజంగా అలాంటి అభిప్రాయమే ఆయనకుంటే, సీతకొరకై పురుషకారం చేసి వుండేవాడు కాదు. దైవమే సీతను తెచ్చి ఇస్తుందని వూరకే వుండేవాడు. ధర్మ విరుద్ధ పురుషకారం శ్రీరాముడికి సమ్మతం కాదు. లక్ష్మణుడి పురుషకారానికి ప్రధమ కబళం దశరథుడు. రాజ్యం కోసం తండ్రిని పీడించిన వాడవుతాడు. అందుకే రాముడొప్పుకోలేదు. రాముడు పురుషకార విరోధి కాదు. అలానే, అన్న అరణ్యాలకు పోయి కష్టపడడం ఇష్టం లేక, ఎలాగైనా అయోధ్యలోనే ఆయన వుండేట్లు చేయడానికి సద్భావంతో లక్ష్మణుడు రాముడితో వాదించాడే కాని ఆయన దైవ విరోధి కాదు. అలాంటప్పుడు లక్ష్మణ వాదన సాధువాదమా? దుర్వాదమా? అని విచారించాలి.


            రామాయణంలో సీతారామలక్ష్మణుల చరిత్ర వల్ల, వారి మాటల వల్ల, బోధ పడేదేంటంటే...పౌరుషం కంటే దైవమే ప్రబలం కాబట్టి, దైవాన్నే సేవించాలనే విషయం. భారతంలో కూడా ఇదే చెప్పబడింది. కాబట్టి మనుష్యులు దైవాన్ని ధిక్కరించి పౌరుషాన్నే ఆశ్రయించక దైవాన్ని ఆశ్రయించి, యథాశక్తి, యథాశాస్త్రం ప్రకారం, నిష్కాములై స్వకర్మలు చేయాలి. రామాయణంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఇదే. భగవద్గీతోపదేశం కూడా ఇదే. రాముడు చెప్పిన ప్రతి మాట అందరికీ అన్ని వేళలా వర్తిస్తుందనడంలో సందేహం లేదేమో! END

Tuesday, February 14, 2017

ప్రపంచ వ్యాప్త మహిళా సాధికారత....మహినేలిన మహిళలు : వనం జ్వాలా నరసింహారావు

ప్రపంచ వ్యాప్త మహిళా సాధికారత
నమస్తే తెలంగాణ దిన పత్రిక (14-02-2017)
మహినేలిన మహిళలు
మన తెలంగాణ దిన పత్రిక (14-02-2017)
వనం జ్వాలా నరసింహారావు

"మహిళా సాధికారత...మహిళలకు భరోసా....అధికారంలో భాగస్వామ్యమే లక్ష్యంగా" జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులతో మూడు రోజుల మహిళా సదస్సు అమరావతిలో జరిగింది. టిబెట్  బౌద్ధ మతగురువు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత దలైలామా సదస్సు ముఖ్య తిథిగా పాల్గొని స్ఫూర్తిదాయకమైన ప్రసంగం కూడా చేశారు. ఈ నేపధ్యంలో, ఒక్క సారి గతంలోకి తొంగి చూస్తే...సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ప్రపంచ వ్యాప్తంగా మహిళలు రాణించడం, చాలా రంగాల్లో పురుషులను అధిగమించడం గత శతాబ్దంలోను, ముఖ్యంగా ఈ శతాబ్దంలోను గమనించవచ్చు. ఇతర రంగాలకంటే కూడా, మహిళలు, రాజకీయంగా అంచలంచలుగా ఎదగడమే కాకుండా, అధికారంలోకి వచ్చిన పలు దేశాల్లో, అనేక సంస్కరణలకు శ్రీకారం కూడా చుట్టారు. మహిళలకు ఓటు హక్కు ఇవ్వండి అని పురుషులను ఒకానొక నాడు అడిగిన ఆ మహిళలే, అనేక హక్కులను తమకే కాకుండా, పురుషులకు కూడా వారే కలిగించే స్థాయికి ఎదిగారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం, సమానత్వం, దినదినాభివృద్ధి చెందుతున్నదనడానికి ఇంతకంటే నిదర్శనం మరోటి లేదు. ఈ నేపధ్యంలో, ప్రపంచ వ్యాప్తంగా, గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయ రంగంలో మహిళలు గణనీయంగా ఎదిగి, పలు దేశాలకు అధ్యక్షులుగానో, ప్రధాన మంత్రులుగానో కావడం, అలా అయిన వారిలో కొందరు ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందడం తెలిసిన విషయమే.

ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఒక మహిళ, 1960 లో, సిరిమావో బండార నాయకే, శ్రీలంక ప్రధాన మంత్రిగా, అధికారంలో రావడంతో అంతర్జాతీయంగా ఒక సంచలనం కలిగింది. ఎలా ఒక మహిళ ఆ ఉన్నత పదవిలోకి రాగలిగిందని, ఎలా పాలన చేయబోతున్నదని, ప్రపంచ వ్యాప్త చర్చ జరిగింది. ఆ తరువాత ఎందరో మహిళలు, సుమారు వంద మందికి పైగా, ప్రధానులుగానో, అధ్యక్షులుగానో, ఎన్నో దేశాల్లో అధికారం చేపట్టారు. ఇంకా అది కొనసాగుతూనే వుంది. మొన్న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలిచినట్లైతే, ఆ దేశ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలయ్యేది ఆమె. కారణాలేవైనా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ముందు వరుసలో వుండే అమెరికాలో ఇంతవరకు మహిళకు అధ్యక్ష పీఠం ఎక్కే అవకాశం రాలేదు. ఏదేమైనా...భవిష్యత్ లో పురుషాధిక్యత రాజకీయాలకు చాలా దేశాల్లో స్వస్తి చెప్పాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం, వర్తమాన ప్రపంచ దేశాల్లో సుమారు 20 మందికి పైగా దేశాధినేతలుగా వున్నారు. ఈ సంఖ్య పోను-పోను పెరుగుతుంది. ఇరవై-ఇరవై ఒకటో శతాబ్దాలలో గణనీయమైన సంఖ్యలో వివిధ దేశాల్లో ప్రధానులుగా, అధ్యక్షులుగా వున్న మహిళల్లో చాలా మంది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వారైనప్పటికీ, కొందరికి మాత్రమే తెలిసుండే వీలు కూడా వుంది. వారిలో కొందరు అతి తక్కువ కాలం అధికారంలో వుండగా, మరి కొందరు దీర్ఘకాలం పదవుల్లో వున్నారు. కొందరికి వారసత్వంగా లాభం చేకూరగా, మరికొందరు ఎన్నికల సమరంలో కొత్తగా దిగి గెలిచారు.


శ్రీలంక ప్రధాన మంత్రిగా సిరిమావో బండార నాయికే మూడు సార్లు ఆ పదవిలో వుంది. ఆ తరువాత ఆమె కూతురు చంద్రికా కుమార తుంగ కొంతకాలం అధ్యక్షురాలిగా, ప్రధానిగా వుంది. సెప్టెంబర్ 1959 లో భర్త హత్యానంతర పరిణామాలలో బండార నాయికే  రాజకీయాల్లోకి రావడం, తన భర్త అడుగుజాడల్లో ఆయన సామ్యవాద విధానాలనే కొనసాగిస్తానంటూ ఎన్నికల్లో ప్రచారం చేయడం, సానుభూతి కొరకు తరచూ కళ్ల నీళ్ల పర్యంతం కావడం, అప్పట్లో చర్చనీయాంశాలయ్యేవి. 1965 ఎన్నికల్లో ఓటమిపాలైన ఆమె, తిరిగి 1970 లో గెలిచి రెండోసారి ప్రధాని అయింది. శ్రీలంక అధ్యక్షురాలిగా 1994 లో ఎన్నికైన కూతురు చంద్రిక, సిరిమావోను మూడోసారి ప్రధానిని చేసింది.

ఒక తరం పైగా భారతదేశంలో నెహ్రూ కుటుంబీకులు, పాకిస్తాన్ లో భుట్టో కుటుంబీకులు, బంగ్లాదేశ్ లో ముజిబుర్ రెహ్మాన్ కుటుంబీకులు అధికారంలో వున్నారు. 20 వ శతాబ్దపు విశ్వవిఖ్యాత మహిళ ఇందిరా గాంధీ భారత ప్రధానిగా రెండు విడతలుగా బాధ్యతలు నిర్వహించింది. మొదట తండ్రి మరణానంతరం లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో సమాచార ప్రసార శాఖల మంత్రిగా పదవిని చేపట్టిన ఇందిర, శాస్త్రి హఠాన్మరణం తరువాత ప్రధాని పదవి దక్కించుకుని, మొదటి విడతలో సుమారు 11 సంవత్సరాలు ప్రధానిగా పనిచేసింది. ఎమర్జెన్సీ విధించి, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి 1977 ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఆమె ఓటమికి కారణమైన జనతా కూటమి రెండున్నర ఏళ్ల కన్నా ఎక్కువ అధికారంలో కొనసాగ లేకపోయింది. 1980 లో జరిగిన ఎన్నికల్లో గెలిచి మరో మారు ప్రధాని కాగలిగింది. 1984 లో దారుణ హత్యకు గురైంది. గొప్ప రాజనీతిజ్ఞురాలిగా ప్రపంచ వ్యాప్త మన్ననలను పొందింది. బంగ్లాదేశ్ విమోచన కారణ భూతురాలైంది. అపర దుర్గగా ప్రతిపక్షాల మెప్పును కూడా పొందింది. ఆమె కోడలు ప్రధాని కాలేకపోయినా అనధికారిక ప్రధానిగా పదేళ్లు యుపిఎ ఛైర్ పర్సన్ గా వుంది. అలానే ప్రతిభా పాటిల్ భారత రాష్ట్రపతిగా అరుదైన గౌరవం పొందారు. స్పీకర్ పదవిని అలంకరించిన మీరా కుమార్, సుమిత్రా మహాజన్ ప్రపంచంలోనే అలాంటి పదవులు పొందిన అతి కొద్దిమందిలో ఒకరు.

ఇజ్రాయిల్ దేశం వ్యవస్థాపకుల్లో ఒకరైన గోల్డా మీర్, మొదట్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ, భర్తతో పాటు ఉద్యమంలో పాల్గొనేది. రాజకీయాలలో కూడా చురుగ్గా వుండేది. 1948 లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంలో మంత్రి అయింది. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత సోవియట్ యూనియన్ లో ఇజ్రాయిల్ రాయబారిగా గోల్డా మీర్ ను నియమించింది ప్రభుత్వం. దరిమిలా దేశానికి తిరిగొచ్చిన ఆమె లేబర్ పార్టీ జనరల్ సెక్రటరీ గా వుండగా, అప్పటి ప్రధాని హఠాన్మరణంతో, తన 70 వ ఏట, 1969 లో ఇజ్రాయిల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగింది. 1978 లో చనిపోయింది.


బ్రిటన్ మొట్టమొదటి మహిళా ప్రధాని మార్గరెట్ థాచర్ రసాయన శాస్త్ర పరిశోధకురాలిగా, బారిస్టర్ గా పని చేసి, 1953 లో ఆ దేశ చట్ట సభ హౌజ్ ఆఫ్ కామన్స్ కు ఎన్నికైంది. వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించింది. 1975 లో ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికైంది. 1979 లో ప్రధాని పదవి వరించిందామెను. పటిష్ఠ నాయకురాలిగా పేరు తెచ్చుకున్న థాచర్, అసంతృప్తిని అణచడంలో ఆరితేరిన మహిళగా ప్రసిద్ధికెక్కింది. 1990 లో ఆమె నాయకత్వాన్ని సవాలు చేసినప్పుడు, ప్రధానిగా రాజీనామా చేసి, హౌజ్ ఆఫ్ కామన్స్ నుంచి కూడా తప్పుకుంది. 1982 లో అర్జెంటినా నుంచి ఫాక్ లాండ్స్ ను వెనక్కు తీసుకోవడానికి ఆమె సైన్యాన్ని పంపింది. ఆమె ప్రవేశ పెట్టిన ప్రభుత్వ రంగ సంస్కరణలు నేటికీ పలు దేశాల్లో అమల్లో వున్నాయి. ఆమెను విమర్శించిన వారు సహితం వాటిని కొనసాగించారు. తనకు స్ఫూర్తి తన తండ్రి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుతో పాటు మార్గరెట్ థాచర్ అని నిజామాబాద్ లోక సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత అమరావతిలో పేర్కొనడం గమనించాల్సిన విషయం.

సూంగ్ సోదరీమణులుగా ప్రసిద్ధికెక్కిన చైనా దేశానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లు, ఆ దేశంలోని అత్యంత శక్తిమంతులైన ముగ్గురు ప్రముఖులను వివాహం చేసుకున్నారు. వాళ్లు జీవించిన కాలంలో ఆ ముగ్గురూ ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కినవారే. అందరిలోకి పెద్దదైన సూంగ్ ఐ లింగ్, అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన చైనా దేశపు ఆర్థిక మంత్రి హెచెచ్ కంగ్ ను పెళ్లాడింది. ఆమె తరువాత రెండో సోదరి సూం చింగ్ లింగ్ చైనా జాతి పితగా పేరుగాంచిన, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మొదటి అధ్యక్షుడిగా పనిచేసిన సన్ యట్ సేన్ ను పెళ్లి చేసుకుంది. 1968 - 1972 మధ్య కాలంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సంయుక్త అధ్యక్షురాలిగా, 1981 లో గౌరవాధ్యక్షురాలిగా పనిచేసిందామె. చివరి సోదరి సూంగ్ మే లింగ్ కూడా ఒక ప్రముఖ రాజకీయ వేత్త. ఆమె ఒకప్పటి చైనా అధ్యక్షుడైన చియాంగ్ కై షేక్ ను పెళ్లి చేసుకుంది. నవ చైనా రాజకీయ, ఆర్థిక, వర్తమాన చరిత్రలో ఆ ముగ్గురు సోదరీమణులు ప్రముఖ పాత్ర వహించారు.

జుల్ఫికర్ అలీ భుట్టో కూతురు బేనజీర్ భుట్టో, తండ్రి వారసురాలిగా, 1988–90 , 1993–96 మధ్య కాలంలో రెండు పర్యాయాలు పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా పనిచేసింది. ప్రపంచంలోని ముస్లిం దేశాలలో ఆమె కంటే పూర్వం ఏ మహిళ కూడా ప్రధాని కాలేదు. బేనజీర్ కూ ఆ ఖ్యాతి దక్కింది. తండ్రిని ఉరితీసిన మూడేళ్లకు కేవలం 29 సంవత్సరాల వయసులోనే, తండ్రి స్థాపించిన రాజకీయ పార్టీ చైర్ పర్సన్ గా ఎన్నికై, దరిమిలా 1988 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని గెలిపించి, ఆ దేశ ప్రధాని అయిందామె. 2008 ఎన్నికలకు రెండు వారాల ముందు, ఒక బాంబ్ పేలుడు సంఘటనలో మరణించింది బేనజీర్. 1991 - 1996,  2001 - 2006 మధ్య కాలంలో బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికైన బేగం ఖలీదా, బేనజీర్ తరువాత ఇస్లాం దేశాలలో  ఆ పదవిని చేపట్టిన రెండవ మహిళ. ఏడేళ్ల కింద అధికారంలోకి వచ్చి, ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా వున్న షేక్ హసీనా వాజేద్, ఆ దేశపు రెండవ మహిళా అధ్యక్షురాలు. బంగ బంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ పెద్ద కూతురామె. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో కొంతకాలం ఆమె ప్రతిపక్ష నాయకురాలిగా కూడా పనిచేసింది హసీనా.

న్యూజీలాండ్ 37 వ ప్రధానిగా 1999 లో పదవిలో కొచ్చిన హెలెన్ ఎలిజబెత్ క్లార్క్ వరుసగా మూడు సార్లు 2008 వరకు ఆ పదవిలో కొనసాగింది. ఎన్నికల్లో గెలిచిన తొలి మహిళా ప్రధాని హెలెన్. 2004 నుంచి 2010 వరకు మొజాంబిక్ అధ్యక్షురాలిగా వున్న లుఇసా డయాస్ డిఓగో ఆ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలు. జర్మనీ రాజకీయ నాయకురాలు ఎంజెలా డొరోథియా మెర్కెల్ 2005 నుంచి ఆ దేశ ఛాన్స్ లర్ గా వుంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తూర్పు జర్మనీ ప్రభుత్వంలో ఆమె అంతకు ముందు అధికార ప్రతినిధిగా కూడా పనిచేసింది. కమలా పర్సాద్ బిస్సెస్సార్ 2010 నుంచి 2015 వరకు ట్రినిడాడ్-టొబాగోల ఏడవ ప్రధానిగా వుంది. ఆమె ఆదేశపు మొదటి మహిళా ప్రధాని.... ఆ తరువాత ఆమె ప్రతిపక్ష నాయకురాలు. 2010 నుండి 2013 వరకు ఆస్ట్రేలియా 27 వ ప్రధానిగా వున్న జూలియా ఐలీన్ గిల్లార్డ్ మొదట్లో ఉప ప్రధానిగా కూడా పదవిలో వుంది.


ఇలా ఎందరో మహిళలు దేశ దేశాల్లో కీలకమైన పదవుల్లో వుండడం గత ఐదారు దశాబ్దాల మహిళా సాధికారతకు నిదర్శనం. భవిష్యత్ లో మరి కొన్ని దేశాల అధ్యక్ష-ప్రధాన మంత్రులుగా మహిళలే ఎన్నిక కావాలని కోరుకుందాం. End

Sunday, February 12, 2017

శ్రీ సీతారామాంజనేయులకు మంగళం ....ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 31వ భాగం : వనం జ్వాలా నరసింహా రావు

శ్రీ సీతారామాంజనేయులకు మంగళం
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
31 భాగం
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (13-02-2017)

సీతాదేవి అగ్నిప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్న తరువాత, శివుడు-ఇతర దేవతలు సీతారామ లక్ష్మణులను ఆశీర్వదిస్తూ, అయోధ్యకు వెళ్లి ధర్మ సంస్థాపన చేయాలని అంటారు. మరణించిన దశరథుడు ఆకాశంలో వున్నాడని, ఆయన ఆశీర్వాదం కూడా తీసుకొమ్మని సూచించాడు శివుడు. ఆ సందర్బంలో దశరథుడు సీతాదేవిని ఓదార్చుతూ, ఆమె పాతివ్రత్యంలో ప్రసిద్ధికెక్కిన దానిగా పొగడుతూ, ఆమె భర్తపై కోపగించుకోవద్దని చెప్పిన మాటలను "మత్తకోకిలము" వృత్తంలో రాశారు కవి.

మత్తకోకిలము:        
కోపగింపకు మమ్మ నీ పతిఁ గోడలా! యిటు సేఁ తకున్
                నీ పతివ్రతమున్ జగంబుల నిత్యమై వెలుఁ గొందెడిన్
                బాపదూర వటంచుఁ దెల్పఁ గ బాల్పడెన్ హితకామియై
                సాపరాధుఁ డు గాఁ డు కూరిమి సైపవమ్మ సతీమణీ! -136

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ", , , , , " గణాలు. పదకొండవ స్థానంలో యతి.
కాండ చివరలో, "ఫలశ్రుతి" లో రాసిన పద్యాలలో ఒకటి "మానిని" వృత్తంలో వుంది. శుభకరమైన రామాయణ కావ్యాన్ని చదివినా, విన్నా పరమార్థమైన మోక్షం లభిస్తుందని అంటూ రాశారా పద్యాన్ని.

మానిని:
          ఈరహి మించుమహత్త్వముఁ గల్గిన యిట్టిపురాతన వృత్తమణిన్
        మీరు పఠింపుఁ డు సంశయ మూనక నిండుమనంబున నమ్మి జనుల్
        దూరములై చను దోషములన్నియు దోరపుభద్రము మీకు నగున్
        వారక విష్ణుమహామహిమోన్నతి వర్ధిలుతం గడువర్ధిలుతన్-137

తాత్పర్యం:     ఇందులో రామాయణము పురావృత్తమని చెప్పడం జరిగింది. పురావృత్తాలెన్నో వున్నా, అవి రామాయణానికి సరైనవి కావు అనే అర్థం స్ఫురిస్తుందిందులో.

ఛందస్సు:      మానినికి ఏడూ "" గణాలు, ఒక గురువు. పదమూడో ఇంట యతి.
యుద్ధకాండాంత పద్యాలలో ఒక దాన్ని "మంగళ మహా శ్రీ వృత్తము" లో రాస్తూ, ఆ కాండలో మొత్తం 3006 పద్యాలున్నాయని అర్థమొచ్చె రీతిలో పద్య పదాలను కూరుస్తారు. ఆ పద్యం ఇలా సాగుతుంది.

మంగళమహా శ్రీవృత్తము:
ధీర! రసఖాభ్ర శుచి దృష్టిగతపద్యనుత దేవహిత ఘోరరణవృత్తా!
సూరకుల! దాశరథి సూరిహితతా శరధి శూర! వరధీ! విరథి! వైదే
హీరమణ! హీరమణి హేమరమణీయ వర హీరశయనా! వనధివాసా!
భూరమణవర్య! గుణ పూత శుభచర్య! నత భూమిరథ మంగళమహాశ్రీ!-138

తాత్పర్యం:    
"రస" అంటే షడ్రసాలనీ, దానర్థం ఆరు (6) సంఖ్య అనీ; "ఖ" అంటే ఆకాశం అనీ, దానర్థం శూన్యమనీ (0); "అభ్ర" అన్నా ఆకాశమే అనీ, అంటే శూన్యమే (0) అనీ; "శుచి దృష్టి" అంటే శివుడి మూడు కళ్ళు అనీ, అంటే మూడు (3) సంఖ్య అనీ విడమరుస్తారు కవి. ఇన్ని పద్యాలతో స్తోత్రం చేయబడినవాడా అని అర్థం. 6003 ను 3006 గా తిరగ చదివితే యుద్ధకాండలో అన్ని పద్యాలున్నాయన్న అర్థం స్ఫురిస్తుంది.
ఛందస్సు: మంగళమహా శ్రీ వృత్తానికి "భ, , , , , , , , , " గణాలు.
తొమ్మిదింట యతి.

రావణ వధానంతరం మునులు శ్రీరాముడిని ప్రశంసలతో, ఇంద్రజిత్తు మరణ వార్త వినగానే వారెలా సంతోషంలో-ఆనందాల్లో-ఆశ్చర్యంలో మునిగిపోయారో ఆయనతో తెలియచెప్పిన విషయాన్ని "మత్తకోకిలము" వృత్తంలో రాశారు కవి.
మత్తకోకిలము:        
ఎన్ని మాయలయందొ ప్రోడయు నెట్టివారి కజయ్యుఁ డున్
        గన్నుదోయికిఁ గానరాఁ డని గర్కశుండు సురేంద్రజి
        త్తన్ని శాచరుఁ డాజిఁ గూలుట యాలకించినయంత య
        న్నన్న! మమ్ముఁ బ్రమోదమున్ బర మాద్భుతంబును ద్రెక్కొనెన్-139

తాత్పర్యం:      ఎన్ని మాయలలోనో సమర్ధుడు, ఎటువంటి వారికైనా జయింప సాధ్యపడనివాడు, యుద్ధంలో కళ్లకు కనపడనివాడు, క్రూరుడు ఇంద్రజిత్తు. అలాంటివాడు యుద్ధంలో మరణించాడన్న వార్త వినగానే, ఆహా హా! ఏమి చెప్పాలి? మేమందరం సంతోషంలో, ఆశ్చర్యంలో మునిగిపోయాం.

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ", , , , , " గణాలు. పదకొండవ స్థానంలో యతి.
అగస్త్యుడు శ్రీరాముడికి రావణ జన్మాది వృత్తాంతం తెలియచేస్తూ, ఎన్నో విషయాలను చెప్పాడు. అందులో భాగంగా, ఒకానొక సందర్భంలో, దేవతలు శివుడి శరణు జొచ్చి, రాక్షసులు పెట్టే బాధలు సహించలేక, తమను రక్షించమని కోరే సందర్భంలో "కవిరాజవిరాజితము", "అంబురహము" వృత్తాలలో రెండు పద్యాలను రాశారు కవి.

కవిరాజవిరాజితము:
          సుతశతకంబునుగూడి నిశాచర శూరులు మువ్వురు గర్వితులై
        హితముఁ దలంపక బ్రహ్మవరంబున నెల్లజగంబుల రేఁ గి సదా
        గతిగతిఁ ద్రిమ్మరుచున్ ఋషిపన్నగ కాందములన్ సహశక్రమరు
        త్తతులను యక్షుల నేచిఁ రి వేఁ చిరి తాఁ చిరిపూఁ చి దురాసదులై-140

తాత్పర్యం:     ఆ ముగ్గురు రాక్షస శూరులు అనేకమంది కొడుకులతో కలిసి, గర్వంతో, మంచిచెడులాలోచింపక, బ్రహ్మ వరం వుందని విజృంభించి, గాలిలాగా అడ్డం లేకుండా, తిరుగుతూ ఋషులను, పన్నగులను, ఇంద్రాది దేవతలను భాదిస్తున్నారు.

ఛందస్సు:      కవిరాజవిరాజితమునకు ఒక్క "గణం, ఆరు "" గణాలు, ఒక్క "" గణం వుంటాయి. పద్నాలుగవ ఇంట యతి.

అంబురహము:
          వారలు పెట్టెడి బాధల నెల్ల సు పర్వకోటులు మౌనులున్
        సైరణ సేయఁ గ జాలక యెల్లరు సాధ్వసార్తులు నొక్కటై
        మారునివైరిఁ బురారిఁ ద్రినేత్రు ను మాధవున్ హరునిన్ జగ
        త్కారణు మారణు లోకనమస్కృతు దైవతాధిపు శంకరున్-141

తాత్పర్యం:     దేవతలు, మునులు వారు (రాక్షసులు) పెట్టే బాధలు సహించలేక, భయంతో అందరు కలిసి, మన్మధుడిని జయించిన-పురాలు దహించిన-మూడు కళ్ళు కల వాడిని, ప్రజాపతులలో చేరినవాడిని, జగత్తుకు కారణమైన వాడిని, కాలాగ్ని రుద్రుడై సంహారం చేయువాడిని, లోకాలలో పూజించబడేవాడిని, దేవతలకు అధిపతిని శివుడిని ప్రార్థించారు.

ఛందస్సు:      అంబురుహ వృత్తానికి నాలుగు "భ" గణాలు, ", , లగములు", పదమూడో ఇంట యతి స్థానం వుంటాయి.
నారదుడు రావణాసురుడికి మనుష్య వధ మానమని బోధించుతాడు. దానికి బదులు అందరినీ చంపే యముడిపై యుద్ధానికి పోయి అతడిని జయించితే అందరినీ జయించినట్లే అవుతుందంటాడు. నారదుడికి, రావణుడికి జరిగిన సంభాషణను "మానిని", "తరలము" వృత్తాలలో రాశారు కవి.


మానిని:
          కావున మోహనిరాకృతులం గడు కాఱియలం బడు మానవులన్
        నీవు జయించినవాఁ డవె చాల్, యము నిం గన నేగుదు రెల్లజనుల్
        నావచనంబున దండధరుం గద నంబున గెల్వు మవశ్యము నీ
        వా విభు గెల్చిన నందఱ గెల్చిన యట్ల యగుంజుమి నిక్కముగన్-142

తాత్పర్యం:      కావున, అజ్ఞానంతో, స్వరూపం పోయి, బాగా బాధలు పడుతున్న మనుష్యులను నీవు జయించినట్లే. రావణుడు మనుష్యులను జయించలేడని ఎవరూ అనరు. కావున నీ ప్రయత్నం మాను. ఎలాంటి వారైనా యముడిని చూడడానికి పోతారు. అందరినీ యముడు చంపుతాడు. కాబట్టి నువ్వు యముడిని యుద్ధంలో జయిస్తే అందరినీ జయించినట్లే.

ఛందస్సు:      మానినికి ఏడూ "" గణాలు, ఒక గురువు. పదమూడో ఇంట యతి.
తరలము:
          అనిన నవ్వుచు మ్రొక్కి పల్కె మ హాత్మ! గీతకళాప్రియా!
        ఘనవిదారణలాలసా! జయ కాంక్ష నేను రసాతలం
        బునకు నీ వచియించినట్టుల పోయి గెల్చి జగత్త్రయం
        బును సురాహుల నాదునానతి మోపఁ జేసి బలోద్ధతిన్-143

తాత్పర్యం:     అని (నారదుడు) చెప్పగా నవ్వుతూ, ఆయనకు మ్రొక్కి ఇలా అంటాడు (రావణుడు). మహాత్మా! సంగీత విద్యలో ప్రేమగలవాడా!  యుద్ధాలు చూడడంలో కోరికగలవాడా! నువ్వు చెప్పినట్లే జయంకొరకు పాతాళానికి పోయి మూడు లోకాలను, ఊర్థ్వ ములో దేవతలను, అధో లోకాలలో సర్పాలను గెల్చి, బల గర్వంతో, నా ఆజ్ఞకు లోబడి వుండేట్లు చేస్తాను.

ఛందస్సు:     తరలముకు ", , , , గజం" లు గణాలు. పన్నెండో అక్షరం యతి. మత్తకోకిలము వృత్తానికి ", , , , , " గణాలు. పదకొండవ స్థానంలో యతి. తరలము లోని మొదటి రెండు లఘువులను గురువుగా మారుస్తే మత్తకోకిలము అవుతుంది. అలానే మత్తకోకిలము లోని గురువును లఘువులుగా మారుస్తే తరలము అవుతుంది.

అగస్త్యాది మునులు శ్రీరాముడి అనుజ్ఞ తీసుకునివెళ్లిపోతారు. శ్రీరామచంద్రమూర్తి కొలువు తీరినప్పుడు ఎలా ఠీవిగా వున్నాడో, వివరించేందుకు కవి ఎంచుకున్న వృత్తం "తరలము". ఆ పద్యం ఇలా సాగుతుంది.


తరలము:      నిగమవృద్ధులు సత్కులీనులు నీరజాక్షుని హస్తముల్
                మొగిచి మ్రొక్కి నిజోచితాసన ముల్ గ్రహించి భజింపఁ గన్
                జిగి దొలంకఁ గ మౌనివర్యులు నిర్జరుల్ గొలువన్ దివిన్
                నగవిరోధిని మించి ఠీవిఁ ద నర్చె రాముడు గొల్వులోన్-144

తాత్పర్యం:     పౌరులలో ముసలివారు, గొప్ప వంశములలో పుట్టినవారు, శ్రీరామచంద్రుడికి చేతులు మోడ్చి, మ్రొక్కి, తమకు తగిన ఆసనాలపై కూర్చొని సేవిస్తుండగా, మునివర్యులు, దేవతలు కొలువగా స్వర్గాన వున్నఇంద్రుడిని మించిన ఠీవితో, రామచంద్రమూర్తి తన కొలువులో వెలిగాడు.

తరలముకు ", , , , గజం" లు గణాలు. పన్నెండో అక్షరం యతి. మత్తకోకిలము వృత్తానికి ", , , , , " గణాలు. పదకొండవ స్థానంలో యతి.
ఉత్తర కాండ చివరలో రాసిన పద్యం "సుగంధి" వృత్తంలో వుంది. ఆ కాండ మొత్తం పద్యాలున్న అర్థాన్ని స్ఫురిస్తూ రాసిన పద్యం అది.
సుగంధి:        రామ చంద్ర గోత్ర చంద్ర రమ్యపద్య గేయమా
                నామలోత్తర ప్రచార యాదిదేవ శ్రీహరీ
                రామ యొంటిమిట్టధామ రాజకన్య కాలస
                ద్వామభాగ దివ్యభోగ వాసు దాససేవథీ – 145

ఛందస్సు:      సుగంధికి  ర-జ-ర-జ-ర  గణాలు 9 వ అక్షరం యతి.
తాత్పర్యం:     ఎవరిలో సర్వం నశించునో, ఎవరు అంతటా నివసించునో, అతడే వాసుదేవుడు. అట్టివానికి కవి దాసుడని అర్థం. "రామ" అంటే మూడు (1) అని, "చంద్ర" అంటే ఒకటి (1) అని, "గోత్ర" అంటే ఏడు (7) అని,  "చంద్ర" అంటే ఒకటి (1) అని అర్థం చెపుతూ, కాండలో మొత్తం 1713 పద్యాలున్నాయని రాశారు ఆ పద్యాన్ని. అన్ని పద్యాలతో కీర్తించబడిన నిర్మలమైన, శ్రేష్టమైన గుణం కలిగినవాడనడంలో ఉత్తరకాండ అర్థాన్ని కూడా పద్యం సూచిస్తోంది.


ఉత్తరకాండ-ఆంధ్ర వాల్మీకి రామాయణం చిట్ట చివర పద్యాన్ని "మంగళ మహాశ్రీ వృత్తము" లో శ్రీ సీతారామాంజనేయులకు మంగళం చెప్పడం జరిగింది.

మంగళ మహాశ్రీ వృత్తము:

మంగళము రామునకు మంజుగుణధామునకు మాన్యసురసోమునకు నెందున్
మంగళము సీత కస మాన పరిపూతకును మాత కఘధూతకు సతంబున్
మాంగళము భ్రాతృహిత మండలసమేతునకు మారుతిసమర్చితునకున్ స
న్మంగళము భక్తజన మానసనివాసునకు మా నగుత మంగళమహాశ్రీ-146

ఛందస్సు: మంగళమహా శ్రీ వృత్తానికి "భ, , , , , , , , , " గణాలు.
తొమ్మిదింట తొమ్మిదింట యతి.

శ్లో.                నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై,

                నమోస్తు వాతాత్మభువే వరాయ, నమోస్తు వల్మీకభవాయ తస్మై .
END