Thursday, December 30, 2010

ఉగాది పచ్చడిని పోలిన 2011 ఆంగ్ల సంవత్సరాది: వనం జ్వాలా నరసింహారావు

రెండువేల పది సంవత్సరానికి వీడ్కోలు... పదకొండుకి స్వాగతం...
వనం జ్వాలా నరసింహారావు

కొత్త ఆశలు - పాత వైఫల్యాలు - (ఆంధ్ర జ్యోతి, 1-01-2011)

2010 సంక్రాంతి రోజున అమెరికాలో వున్న నేను అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు పండుగ శుభాకాంక్షలు తెలియచేసేందుకు ఫోన్ చేశాను. ఉభయ కుశలోపరి తర్వాత, మరికొన్నాళ్ళు నన్ను అక్కడే వుండమని సలహా ఇచ్చారాయన. ఆయనలా ఎందుకన్నారో కారణం అందరికీ తెలిసిన విషయమే! అంతకు ముందు నెల రోజుల పూర్వం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష దరిమిలా కేంద్ర మంత్రి చిదంబరం చేసిన ప్రకటన నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన హింసా కాండ వల్ల శాంతిభద్రతల సమస్యలతో సతమవుతున్న హైదరాబాద్ కు రావడం కంటే, మరి కొద్ది రోజులు అమెరికాలో పిల్లల దగ్గర గడపడమే మేలని, ఆయన సూచనగా నాకర్థమయింది. మరో నూతన సంవత్సరాదికి స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్న నేడు కూడా రాష్ట్రంలో మళ్లీ అలాంటి పరిస్థితులే తలెత్తే అవకాశం వుండడమంటే అంతకంటే దురదృష్టం బహుశా మరోటి లేదనాలి.

2010 న్యూ ఇయర్స్ డే సందర్భంగా, డిసెంబర్ 31 రాత్రి, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, అమెరికా - హ్యూస్టన్ నగరంలో వుంటున్న సాహితీ మిత్రుడు పిల్లుట్ల సుదేష్ కుటుంబ సభ్యులు ఏర్పాటుచేసిన విందు-వినోద కార్యక్రమం మా అమెరికా పర్యటనలో ఒక మరపురాని సంఘటనగా మిగిలిపోయింది. చిన్న పిల్లలు, చిన్న పిల్లల్లా పెద్దలు, ఆడా-మగ తేడా లేకుండా, కలిసి-మెలిసి ఆనందంగా, తూరుపు-పడమరల సంగమంగా ఎంతో వేడుకగా జరుపుకొని, అర్థరాత్రి పన్నెండవుతూనే "హేపీ న్యూ ఇయర్ టు యూ" అంటూ కేరింతలు వేశారందరూ. శంకరాభరణం శంకరశాస్త్రి గారింట్లో పాదం మోపితే "సరిగమలు" వినిపిస్తాయని సినిమాలో చూచినట్లే, వీళ్ళింట్లోకి వెళ్లిన మాకు, మరచిపోతున్న మన సంస్కృతీ-సాంప్రదాయాలు కళ్ల ముందర సాక్షాత్కరించాయి. అలానే సంక్రాంతి సంబరాలు కూడా అక్కడే జరుపుకున్నాం. మరి ఈ ఏడాదో?... ఎలా వుండబోతోందో? ఈ వ్యాసం రాసేటప్పుడు అగమ్యగోచరంగానే వుందనాలి?

ఏం జరగనున్న దో అని అనుకుంటూ ఈ వ్యాసం రాస్తున్న సమయంలోనే, తెలంగాణ - సమైక్యాంధ్ర ఉద్యమాల నేపధ్యంలో అల నాడు రాష్ట్రంలో నెల కొన్న పరిస్థితులను అధిగమించడానికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పరిశీలించడానికి, కేంద్రప్రభుత్వం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను పాత్రికేయుల సమక్షంలో, హోం మంత్రి చిదంబరానికి అందచేసింది. తదుపరి ప్రక్రియ, జనవరి 6, 2011 న రాష్ట్రానికి చెందిన ఎనిమిది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సంప్రదించిన తర్వాతే ప్రారంభిస్తామని చిదంబరం ప్రకటన చేయడం వల్ల ఇక 2010 సంవత్సరానికి ఆందోళనలకు తావులేకుండా వీడ్కోలు పలికే అవకాశం కలిగిందనాలి. కాకపోతే, "కృష్ణా జలాలపై" బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పు మరో వివాదానికి తెర లేపి, శాశ్వతంగా పొరుగు రాష్ట్రాలకు, మనకు మధ్య విరోధానికి నాంది పలికిందని అనక తప్పదు. రాష్ట్రానికి, ఒక వైపు నికర జలాల వాటా పెంచుతూనే, గతంలో బచావత్ తీర్పు నిష్పత్తిలో కాకుండా తగ్గింపు కోటా ఇవ్వడం, మరో వైపు అదనపు జలాల కోటా పూర్తిగా తగ్గించడం వల్ల, రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేసేందుకు అవకాశాలను కలిగించింది ట్రిబ్యునల్. ఇలా ఆరంభమవుతున్న ది నూతన సంవత్సరం. ఉగాది పచ్చడిని పోలిన ఆంగ్ల ఉగాదికి ఇలా స్వాగతం పలుకుతాం!

ఈ నేపధ్యంలో గత ఏడాది సంఘటనలను ఒక్క సారి మననం చేసుకుంటే ఎలా వుంటుంది?

2009 సంవత్సరంలో విమాన ప్రమాదంలో మరణించిన రాజశేఖర రెడ్డి స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొణిజేటి రోశయ్య సారధ్యంలో, ఆయనకు ప్రమేయం వున్నా - లేకపోయినా, రాష్ట్ర ప్రజలకు 2010 సంవత్సరం ఎన్నో చేదు అనుభవాలను రుచి చూపించింది. ఆయనకు అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. డిసెంబర్ (2009) తొమ్మిది నాటి చిదంబరం "తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు" ప్రకటన వేర్పాటు వాదుల్లో ఆశలు రేకెత్తించగా, సమైక్య వాదులను ఉద్యమ దిశగా మళ్లించింది. దరిమిలా, తెలంగాణలోని ప్రజాప్రతినిధులు-ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీలకతీతంగా తమ పదవులకు రాజీనామా చేయడం, చివరకు కేవలం పన్నెండు మంది ఎమ్మెల్యేల రాజీనామాలు మినహా మిగతా అందరివీ తిరస్కరించడం జరిగింది. రాజీనామాల విషయంలో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రదర్శించిన "వ్యూహం", అధిష్టానం దృష్టిని ఆకర్షించి, రోశయ్య స్థానంలో అతి పిన్న వయస్సులో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి దోహద పడిందనవచ్చు! ఆ పన్నెండు మందిలో ఒకరు టిడిపికి, మరొకరు బిజెపికి చెందిన వారు కాగా, మిగతా పదిమంది తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఎన్నికైన వారే. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలలో రాజీనామా చేసిన వారందరినీ భారీ మెజారిటీతో గెలిపించారు తెలంగాణ ఓటర్లు. ఆ తీర్పు ఒక విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాదనకు బలం చే కూరిస్తే, మరో విధంగా రోశయ్య నాయకత్వంలోని బలహీనతలను బహిర్గతం చేశాయనాలి. ఆ మాటకొస్తే, రాజశేఖర రెడ్డి మరణంతో పార్టీ పరంగా కాంగ్రెస్, పాలనాపరంగా రాష్ట్రం "పటిష్టమైన నాయకత్వాన్ని" దాదాపు కోల్పోయిందనవచ్చు. ఒక వైపు తెలంగాణా ప్రజల్లో జాగృతి పెరగడానికి, మరోవైపు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి "ప్రత్యామ్నాయ నాయకుడు" గా ఎదగడానికి పరిస్థితులు అనుకూలించసాగాయి. అధిష్టానం అండదండలు పుష్కలంగా వున్న రోశయ్య, తన అపారమైన రాజకీయ అనుభవాన్ని ఫణంగా పెట్టినప్పటికీ, సంక్షోభాన్ని అధిగమించడంలో పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి.

రాజకీయ రంగంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న మరో పరిణామం వై ఎస్ జగన్ చేపట్టిన "ఓదార్పు యాత్ర". వర్తమాన రాజకీయాల్లో, యావదాంధ్ర దేశంలో ఆబాలగోపాలం నోట జగన్ ఓదార్పు యాత్ర చర్చనీయాంశమైపోయినంతగా, బహుశా మరే అంశం కాలేదే మో! కారణాలే వైనా, ఆయన వెళ్లిన ప్రతి చోటా, విశేషంగా ప్రజాదరణ లభించింది. ముఖ్యమంత్రి హోదాలో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను జగన్ ఓదార్పు యాత్రకు వెళ్లకుండా ఆంక్షలు విధించే ప్రయత్నాలు రోశయ్య చేసినా, ఫలితం కనిపించలేదు. ఆయన నాయకత్వ లోపానికి అది మరో నిదర్శనంగా మిగిలిపోయింది. చివరకు సాక్షాత్తు "కాంగ్రెస్ అధినేత్రి" బెదిరింపులకు కూడా లొంగని జగన్ వెంట చెప్పుకోదగ్గ సంఖ్యలో ప్రజాప్రతినిధుల మద్దతు లభించింది. చివరకు, పార్టీని-అధిష్టానాన్ని తప్పు పడుతూ, జగన్ తన పార్లమెంట్ సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, కనీవినీ ఎరుగని సవాలు విసిరారు. ఆధ్యతన భవిష్యత్ లో ఆ సవాలు కాంగ్రెస్ అస్తిత్వానికే ముప్పు తెచ్చే దిగా పరిణమించవచ్చు. 2010 లో రాజకీయంగా, ఆంధ్ర రాష్ట్రంలో ఇదొక ప్రాముఖ్యత సంతరించుకున్న అంశంగా భావించాలి.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరుగుతుందో-లేదో కాని, ఆ పేరుమీద జరుగుతున్న వుద్యమంలో భాగంగా సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య సాంస్కృతిక విభేదాలు కొట్టొచ్చినట్లు పొడచూపాయి. తెలంగాణ ధూమ్-ధాం, బ్రతుకమ్మ పండుగలు పెద్ద ఎత్తున జరుపుకోవడం విశేషం. సినిమాలలో కూడా ఆంధ్ర తెలంగాణ విభేదాలు కనిపించాయి. ఒక ప్రాంతం వారికి చెందిన అంశాలకు సంబంధించిన సినిమాలను చేరే ప్రాంతం వారు బహిష్కరించే దాకా పోయింది కొన్ని సందర్భాల్లో.

వామ పక్ష వుద్యమం ఆంధ్ర ప్రదేశ్ లో క్రమేపీ బలహీన పడుతున్న సూచనలు ఈ సంవత్సరం ప్రస్ఫుటంగా కనిపించ సాగాయి. భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీలో చోటుచేసుకుంటున్న విపరీత ధోరణులు పార్టీని ఎటు వైపుగా తీసుకెళ్తాయో నాయకత్వానికే అర్థం కావాలి. ప్రాణాలను-ఆస్తులను-కుటుంబ బాధ్యతలను లెక్క చేయకుండా, సుందరయ్య గారి లాంటి నాయకులు, పార్టీని పటిష్టం చేశారు. వీర తెలంగాణ సాయుధ పోరాటంలో అల నాడు అంతమంది పాల్గొనడానికి కారణం ప్రజల్లో పార్టీ పట్ల-పార్టీ నాయకుల పట్ల వున్న విశ్వాసమే. క్రమేపీ, ప్రజలకు దూరం కా సాగింది కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజలే న్యాయమూర్తులని, వారికే తాము జవాబుదారులమని మరిచిపోతోంది పార్టీ నాయకత్వం. వాస్తవాలన్నీ ప్రజలు గమనించుతున్నారని కూడా గ్రహించలేని స్థితికి పోతుందా పార్టీ అనిపిస్తుంది. పార్టీలో ఏం జరుగుతుందో సామాన్యుడికి తెలిసే అవకాశమే లేదిప్పుడు. దానికి కావాల్సిన యంత్రాంగం లేనప్పుడు, ప్రజలతో సంబంధాలు తెగిపోవడం సహజం.

అయోధ్యలోని ఒకానొక చారిత్రక వివాదంపై అలహాబాద్ హైకోర్టు సెప్టెంబర్ 30, 2010 న ఇచ్చిన చరిత్రాత్మక "సెక్యులర్" తీర్పు ప్రభావం మిశ్రమంగా కనిపించింది. విశ్వాసాల ప్రాతిపదికగా, నమ్మకాల ప్రాతిపదికగా, చారిత్రాత్మక కట్టడాల నేపధ్యం ప్రాతిపదికగా, చారిత్రిక సాక్ష్యాధారాల ప్రాతిపదికగా, స్వాధీన అధీనం ప్రాతిపదికగా అనేకానేక పరిశోధనల సాక్ష్యాధారాలను ప్రామాణికంగా చేసుకుని వెలువరించిన ధర్మాసనం తీర్పును పలువురు ఆహ్వానించారనే అనాలి.

మరి కొన్ని విశేషాలు చెప్పుకోవాలంటే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రప్రధమంగా ఏర్పాటుచేసిన "బి. ఎన్. రెడ్డి జాతీయ అవార్డ్" గ్రహీత, ప్రముఖ సినీ దర్శక నిర్మాత-మానవతావాది-సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గళం విప్పిన కె. బి. తిలక్ సెప్టెంబర్ నెలలో చనిపోయారు. తెలుగు కవిత్వాన్ని స్వయంగా నడిపించిన ఒక శతాబ్దపు యుగ కవిగాను, మహాకవి గాను, తెలుగు సాహితీ-సాంస్కృతిక రంగాలపై అనూహ్యమైన ప్రభావం చూపిన అరుదైన వ్యక్తి గాను, అరసం-విరసం అధ్యక్షుడి గాను, అహర్నిశలు కమ్యూనిస్టుల పక్షాన నిలబడ్ట సామ్యవాదిగాను, "తెలుగు కవిత్వాన్ని ఖండించి-దీవించి-ఊగించి-శాసించి-రక్షించి” న మహా ప్రస్థానం సృష్టికర్త గాను, అందరికీ సుపరిచితుడైన మహాకవి శ్రీశ్రీ నూరేళ్ల విరసం మహాసభలు జరిగాయి. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనా-విలీనమా అన్న వాదనలు ఈ సంవత్సరం చోటుచేసుకున్నంతగా గతంలో ఎప్పుడూ లేదు. బాబ్లీ ప్రాజెక్టును సందర్శించి, స్వయంగా అధ్యయనం చేసి, ప్రధానికి అన్ని విషయాలు తెలియచేయాలన్న ఆలోచనతో ఆంధ్ర-మహారాష్ట్ర సరిహద్దుకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, తెలుగు దేశం పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులను, మహారాష్ట్రలోకి రానీకుండా అడ్డుకున్న మరాఠా పోలీసులు, ప్రాజెక్టుకు తీసుకుపోతామని మభ్యపెట్టి, పోలీసు వాహనం ఎక్కించి, అతి జుగుప్సాకరమైన పద్ధతిలో వారందరినీ "అరెస్టు" చేసినట్లు ప్రకటించి, మూడు రోజులు శారీరకంగా హింసకు గురిచేయడం పలువురిని విస్మయ పరిచింది.

మన రాష్ట్రంలో పుట్టక పోయినా ఇక్కడి అశేష ప్రజానీకం ఆదరాభిమానాలను చూరగొన్న మహామనిషి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ మృతి, పౌర హక్కుల నాయకుడు కన్నభీరన్ మృతి 2010 లో చోటుచేసుకున్న అత్యంత విషాదకరమైన సంఘటనలుగా పేర్కొనాలి.

మకుటం లేని మహారాణిగా చెలామణి అవుతున్న కాంగ్రెస్ పార్టీ "అధినాయకి " సోనియా గాంధీని, పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి రాజీనామా చేసిన వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వైపు, కాంగ్రెస్ పార్టీతో సరి సమానమైన ప్రజా బలం వున్న తెలుగు దేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు మరో వైపు, ఏ క్షణం ఎలాంటి వ్యూహంతో-ఎత్తుగడలతో ఎదురు తిరుగు తాడో అర్థంకాని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె సి ఆర్ ఇంకో వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, 2010 సంవత్సరంలో (ఆయన పాలన చేసిన సుమారు నెల రోజులు) ఇబ్బందులకు గురి చేస్తూనే వున్నారనాలి. జగన్ ఓదార్పు యాత్రలు, రైతు సంక్షేమ యాత్రలు, చివరకు రెండు రోజుల సామూహిక "లక్ష్య దీక్ష" కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సవాలు విసిరింది గత ఏడాది. అలానే, అంతకంటే ఎక్కువ మోతాదులోనే చంద్రబాబు నాయుడి ఆమరణ నిరాహార దీక్ష, దరిమిలా చెలరేగిన సంఘటనలు, గుంటూరులో నిర్వహించిన "రైతు కోసం" మహా సభ కూడా ముఖ్య మంత్రికి పెను సవాలే. విద్యార్థులపై వుద్యమాల సందర్భంగా పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా శీతాకాలం శాసన సభ సమావేశాలలో డిమాండు చేసినా ఒప్పుకోని కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిరాహార దీక్షకు దిగగానే ఒప్పుకోవడం 2010 సంవత్సరాంతంలో ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రధాన అంశం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కాని, తదనంతర పరిణామాలు కాని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టక పోతే, 2010 లో సంభవించిన పరిణామాల కంటే తీవ్రమైన పరిణామాలు 2011 జరగడానికి ఆస్కారం వుండబోతుందన వచ్చు. అలా జరగ రాదని, అందరూ సంయమనం పాటించాలని కోరుకుంటూ, రెండువేల పది సంవత్సరానికి వీడ్కోలు... పదకొండుకి స్వాగతం పలుకుదాం.

Saturday, December 25, 2010

రాజశేఖర రెడ్డి "రాజీవ్ ఆరోగ్య శ్రీ" లో అపశృతులు: వనం జ్వాలా నరసింహారావు


ప్రభుత్వ- ప్రైవేట్‌ భాగస్వామ్యంలో అపశృతి, ఈ మాత్రం సేవలు కూడా దక్కవా?,
నిధుల మళ్ళింపుతో సమస్యలు, పెరిగిన రుణ భారం, ఉద్యోగులకు అభద్రత
(సూర్య దినపత్రిక:19-01-2011)

వనం జ్వాలా నరసింహారావు
కన్సల్టెంటు హెచ్ఎంఆర్ఐ & ఇ.ఎం.ఆర్.ఐ మాజీ సలహాదారుడు

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో అత్యవసర సహాయ సేవలందించే 108 అంబులెన్సులను, నడపకుండా నిలుపుదల చేస్తామని, గత ఐదేళ్లు గా వాటిని నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఇ.ఎం.ఆర్.ఐ) ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. నడపకుండా నిలుపుదల చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చి రెండు వారాలు గడవక ముందే, ఆ సంస్థ సీఈఓ వెంకట్ చెంగవల్లి రాజీనామా చేసారు. రెండేళ్ల క్రితం .ఎం.ఆర్.వ్యవస్థాపక అధ్యక్షుడు రామలింగ రాజు రాజీనామా కంటే సీఈఓ రాజీనామా ప్రభావం 108 అత్యవసర సహాయ సేవల నిర్వహణపై పడడం, సేవలు సంక్షోభం దిశగా పయనించడం వాస్తవం అనవచ్చునేమో!.

వ్యక్తిగత పట్టింపులకు, పంతాలకు అతీతంగా నిర్వహించాల్సిన సేవలు ఏ ఒక్కరి సొత్తో-సొమ్మో అనుకుని అలా హెచ్చరికలు జారీచేయడం ఎంతవరకు సమంజసం? ఏదో వంక చూపి, అత్యవసర సహాయ సేవలను నిలుపుదల చేస్తామని లిఖిత పూర్వ కంగా ఇవ్వడం నేరంగా పరిగణించాలి కదా! 108 అంబులెన్సుల ద్వారా అత్యవసర సహాయ సేవలందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ పని తీరుపై ఏడెనిమిది నెలల క్రితం ప్రభుత్వం ఒక కమిటీని నియమించినప్పుడే, ప్రభుత్వ ఆలోచనా సరళిలో కొంత మార్పు వస్తున్నట్లు భావించాలి. ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు ఇంతకంటే "పెను సవాలు" మరోటి లేదు. ఇరువురు భాగస్వాముల మధ్య "విశ్వాసం"-"నమ్మకం" కలగడం ముఖ్యం. అలా జరక్కుండా, కాలయాపనకు దారితీసే "ప్రత్యామ్నాయాలను" ప్రతిపాదించడం కొరకు కమిటీలను వేయడమంటే 108-అత్యవసర సహాయ సేవలు పౌరులకు గతంలో మాదిరి నాణ్యమైన సేవలు లభ్యం కాకుండా చేయడమే! అంబులెన్సుల సేవలు ఆగిపోతే నష్టపోయేది పేద వారే కాని ధనికులు కాదు.

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యానికి సంబంధించి "ప్రయోగాత్మకంగా"-"ఆచరణాత్మకంగా" తొలుత భాష్యం చెప్పింది 108-అత్యవసర సహాయ సేవలను అందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ, అందుకు ప్రోద్బలం-ప్రోత్సాహం అందించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సారధ్యంలోని అలనాటి రాష్ట్ర ప్రభుత్వం. "లాభాపేక్ష లేకుండా" ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మనుగడ సాగించడానికి భాగస్వామ్య పక్షాలైన ఇరువురి లో నిబద్ధత కావాలి. ఒకరిపై ఇంకొకరికి "విశ్వాసం-నమ్మకం" వుండాలి. "విశ్వసనీయత" కు ప్రాధాన్యత ఇవ్వాలి కాని, "వంచన" కు ఏ ఒక్కరు పాల్పడినా ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. పలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం సడలుతున్న నేపధ్యంలో సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రక్రియకు కూడా విఘాతం కలిగితే ఇబ్బందులకు గురయ్యేది సామాన్య ప్రజలే-వారిలోను ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారే. ఆ ప్రమాదం పొంచి వుంటే, దానికి బాధ్యులైన వారందరూ నేరస్తులే.

ప్రభుత్వ పరంగా ప్రజలకు లభిస్తున్న ఆరోగ్య-వైద్య రంగ సేవల నిర్వహణలోని లోటుపాటులను అధిగమించడానికి, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ దోహద పడుతుంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కేవలం ప్రభుత్వ పరంగా సమకూర్చడం కన్నా, ప్రయివేట్ తోడ్పాటు తీసుకోవడానికి అనువైన-సులువైన-ఆచరణాత్మకమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఫలితంగా రూపుదిద్దుకున్నదే "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం". ఈ ప్రక్రియలో రెండు రకాల భాగస్వామ్యాలు ఆచరణలోకి రాసాగాయి. దీర్ఘకాలిక ఉత్పాదకతను దృష్టిలో వుంచుకుని రూపొందించే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో, ప్రభుత్వ పరంగా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ కార్యక్రమాలను అమలుచేసేందుకు, లాభాపేక్షతో పనిచేస్తున్న ప్రయివేట్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మొదటిది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, ప్రభుత్వ బాధ్యతగా అమలుపర్చాల్సిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలను, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో-తోడ్పాటుతో, మరింత మెరుగైన రీతిలో, లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో ప్రజలకు సమకూర్చడం రెండో తరహా భాగస్వామ్యం. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో సంక్షేమ కార్యక్రమాలను-అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరిచేందుకు-దీర్ఘకాలంగా కొనసాగించేందుకు, అవసరమైన ముఖ్య సాధనం, భాగస్వామ్య పక్షాల మధ్య అంగీకారంతో తయారు చేయబడే "ఎంఓయు-అవగాహనా ఒప్పందం".

"భద్రత మీ హక్కు" అన్న నినాదంతో, ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థగా, ఒకే గొడుకుకింద-ఒకే వ్యవస్థ నిర్వహణలో, వైద్య-అగ్నిమాపకదళ-పోలీసు సంబంధిత అత్యవసర సహాయ సేవలను అందించేందుకు అత్యవసర యాజమాన్య నిర్వహణా పరిశోధనా సంస్థ (ఇ.ఎం.ఆర్.ఐ) ఆవిర్భావం జరిగింది. తొలుత ప్రభుత్వం నుంచి ఏ రకమైన ఆర్థిక సహాయం ఆశించకుండా, సగటు పౌరుడిపై ఏ విధమైన ఆర్థిక భారం పడకుండా, వీరు-వారు అనే తేడా లేకుండా, అందరికీ లభ్యమయ్యేలా నిర్వహించేందుకు ఉద్దేశించబడిన ఇ.ఎం.ఆర్.ఐ అందుకనుగుణంగానే తన లక్ష్యాలను-ధ్యేయాలను రూపొందించుకుంది. 95% ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న 108-అత్యవసర సహాయ సేవలు లభ్యం కావటంలో ఏ మాత్రం అలసత్వం వున్నా కారణాలు తెలుసుకుని, ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ లింగ రాజు (సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో) హఠాత్తుగా బాధ్యతల నుంచి తొలగడం, ఆయన స్థానంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, "లోకోపకార దాతృత్వ” భావంతో పలు సంక్షేమ కార్యక్రమాలకు తన వంతు నిధులను సమకూరుస్తున్న జీ.వీ.కె సంస్థల అధిపతి శ్రీ జీ.వి.కృష్ణారెడ్డి, చైర్మన్ గా రావడంతో, అత్యవసర సహాయ సేవలు అందచేయడంలో ఏ సమస్యలు రావని లబ్దిదారులు భావించారు.

అలాంటప్పుడు ఇ.ఎం.ఆర్.ఐ ఎందుకు అల్టిమేటం ఇవ్వాల్సి వచ్చింది? ప్రభుత్వ నిధులు సక్రమంగా అందడం లేదనుకోవాలా? జీ.వీ.కె అనుకున్న రీతిలో సహాయం అందించడం లేదా? అత్యవసర సహాయ సేవలు ఒడిదుడుకుల్లో పడడం నిజమేనా?ఒడిదుడుకులకు కారణాలు ఏమై వుండొచ్చు? జీ. వి. కృష్ణారెడ్డి ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతకు ముందు కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం స్థానంలో "పి.పి.పి ఒప్పందం" పేరుతో కొత్త ముసాయిదాను పరిశీలన కొరకు ప్రభుత్వానికి సమర్పించింది సంస్థ. గతంలో నాలుగు పర్యాయాలు కుదుర్చుకున్న ఒప్పందాల విషయంలో ఏ విధమైన అభ్యంతరాలను చెప్పని ప్రభుత్వం, ఈ సారి రకరకాల ఆక్షేపణలు తెలియచేయడానికి కారణాలే వై వుండొచ్చు? అప్పట్లో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య పక్షాలకు చెందిన అధికార ప్రతినిధులు కూర్చొని-చర్చించి ముసాయిదాను ఖాయపరిచే సాంప్రదాయం వుండేది. "విశ్వాసం-నమ్మకం" అనే ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రధాన ప్రాతిపదిక ఆధారంగా మొదటి నాలుగు ఎంఓయు లన్నీ ఖరారయ్యాయి. మొట్టమొదటి సారిగా "కొర్రీల సాంప్రదాయానికి" తెరలేపింది ప్రభుత్వమైనా అవకాశం ఇచ్చింది మాత్రం ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యమే అనాలి. ఇలా జరగకుండా వుండాల్సింది.

నెల-నెలా సగటున ఒక్కో అంబులెన్సుకు ప్రత్యక్ష నిర్వహణ వ్యయం కింద రు. 1, 12, 499 చొప్పున ఇ.ఎం.ఆర్.ఐ కి ఇస్తామని 502 అంబులెన్సులున్నప్పుడు అంగీకరించిన ప్రభుత్వం, అంబులెన్సుల సంఖ్య 652 కు చేరినప్పటికీ, ఆ తర్వాత ఆ సంఖ్య 802కు పెరిగినప్పటికీ, "విశ్వాసంతో-నమ్మకంతో" పునఃపరిశీలించకుండా చెల్లిస్తూ వస్తుంది. జీ.వీ.కె యాజమాన్యం 95% నిర్వహణ వ్యయాన్ని 100% పెంచమని, అదనంగా మరో రు. 10 కోట్లు "మూల ధన వ్యయం" కొరకు కావాలని కోరింది. సంవత్సరానికి రు. 12 లక్షల కంటే ఎక్కువ (నెలకు లక్ష రూపాయలు!) వేతనం ఇవ్వాల్సిన ఉద్యోగుల జీత భత్యాలను మాత్రమే ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం భరిస్తుందని, మిగతా వారి జీతభత్యాలు కూడా ప్రభుత్వమే ఇవ్వాలని మరో ప్రతిపాదన ఇచ్చింది. ఆర్థికంగా ప్రభుత్వంపై మరింత భారాన్ని పరోక్షంగా సూచించింది యాజమాన్యం. అడపాదడపా ఏదన్నా ఊహించని వ్యయం జరిగితే దాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని కోరింది. శిక్షణా కార్యక్రమాలన్నింటికీ అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని మరో ప్రతిపాదన. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకు ఇది రుచించలేదు. అధికారిక లెక్కల పుస్తకాలలో నెలనెలా నిర్వహణ వ్యయం ఒక్కో అంబులెన్సుకు సుమారు రు. 90, 000 మాత్రమే వున్నట్లు ఆర్థిక శాఖ దృష్టికొచ్చింది.

"రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సహాయ సేవలందించే" “నోడల్ ఏజన్సీ” గా 2005 లో ఇ.ఎం.ఆర్.ఐ ని గుర్తించిన ప్రభుత్వం, 2006 లో "గ్రామీణ అత్యవసర రవాణా పథకం" పేరుతో ప్రవేశ పెట్టదలిచిన అంబులెన్సుల నిర్వహణ బాధ్యతను కూడా "అత్యంత నమ్మకంతో-విశ్వాసంతో" అదే సంస్థకు అప్పగించారు. అదో చారిత్రాత్మక నిర్ణయం. వాస్తవానికి అలనాటి కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సీ.బి.ఎస్. వెంకట రమణ "నమ్మకం-విశ్వాసం" తో తీసుకున్న సాహసోపేత నిర్ణయమే ఈ నాటి రాష్ట్ర వ్యాప్త అత్యవసర సహాయ సేవలకు పునాది-నాంది. ఏమైందానాటి "నమ్మకం-విశ్వాసం" ? లోపం ఎవరిది ? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం వుంది. అయితే అప్పటి కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, (దివంగత) ముఖ్యమంత్రి "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" ఎంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ నిలబెట్టుకో గలిగిందనేది జవాబు దొరకని ప్రశ్న. 502 అంబులెన్సులున్నప్పుడు సగటున అయ్యే వ్యయం, 652కు, తర్వాత 802 కు పెరిగినప్పుడు, దగ్గుతోందన్న విషయం తెలిసిందే అయినప్పటికీ, బయటపడకుండా జాగ్రత్త పడ్డది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. పారదర్శకతతో ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం వ్యవహరించి, వాస్తవ లెక్కలను ఏదో ఒక సందర్భంలో బహిర్గతం చేసినట్లయితే బాగుండేదేమో !

లక్షలాది ప్రాణాలను కాపాడుతున్న అత్యవసర సహాయ సేవలను రామ లింగరాజు ఎందుకు ప్రారంభించ దలిచాడు, నిర్వహణ బాధ్యతను లాభాపేక్ష లేని ఒక స్వచ్చంద సంస్థ చేతుల్లో ఎందుకు పెట్టాడు, కేవలం కుటుంబీకులనే ఆ సంస్థ ప్రమోటర్ సభ్యులుగా ఎందుకు ఎంపిక చేశారు, రు. 34 కోట్లు వారందరి పక్షాన సంస్థకు ఎందుకిచ్చారు, ఆ తర్వాత ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేశారు, బాంక్ రుణం ఎందుకు తీసుకున్నారు-తీసుకోవాల్సిన ఆవశ్యకత నిజంగా వుందా, ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సహాయ సేవలను ఆరంభించి అచిర కాలంలోనే సంస్థ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంటే నిధులను సమకూర్చే విషయంలో నిరాసక్తత-నిర్లిప్తత ఎందుకు వహించారు, ఇతర రాష్ట్రాల నిధులను సంస్థ దైనందిన కార్యకలాపాలకు వినియోగించడం "ప్రభుత్వ నిధుల తాత్కాలిక దుర్వినియోగం" అని తెలిసి కూడా ఎందుకలా చేశారు, చేస్తుంటే ఇది తప్పని చెప్పాల్సిన బాధ్యత వున్న సిఇఓ చెప్పకపోవడానికి-చెప్పలేక పోవడానికి బలీయమైన కారణాలేంటి?

అత్యవసర సహాయ సేవలను ఇ.ఎం.ఆర్.ఐ తోడ్పాటుతో ప్రారంభించిన ప్రతి రాష్ట్రంలో, అధికారులు-అనధికారులు, ఇ.ఎం.ఆర్.ఐ ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులను వ్యయం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించడం, ముందస్తుగా విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ తర్వాత ఈ సేవలను మొట్టమొదట ఆరంభించిన గుజరాత్ నిధుల విడుదలకు బోణీ కొట్టింది. సేవలను ఆరంభించిన ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడ్వాన్సుగా నిధులను విడుదల చేయడం పరిపాటి అయిపోయింది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా "అవసరార్థం" అలా విడుదలైన నిధులను ఉపయోగించే సాంప్రదాయానికి ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ తెర లేపింది. అలా చేయడం "దుర్వినియోగం" కిందకు రాదని, "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా నిధుల వాడకమేనని సర్ది చెప్పుకుంది యాజమాన్యం. అదే క్రమేపీ రు. 120 కోట్ల "రుణ భారానికి" చేరుకుంది. ఆ రుణభారంలోనే రు. 40 కోట్ల బాంకు అప్పు కూడా వుంది!

ఇ.ఎం.ఆర్.ఐ వాడిన ఆ నిధుల్లో "ఇతర రాష్ట్రాల మూల ధన వ్యయానికి గాని, నిర్వహణ వ్యయానికి గాని, సంస్థ సమగ్ర యాజమాన్య-లేదా-నిర్వహణ వ్యయానికి గాని" ఏ మాత్రం సంబంధం లేని, అంతగా అత్యవసరం లేని, ప్రాధాన్యత ఖర్చు కిందకు రాని "మూల ధన వ్యయం" కొరకు ఎంత మేరకు నిధులను వాడారన్న విషయంలో పూర్తి పారదర్శకతతో యాజమాన్యం వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నుంచి తప్పుకుంది. ఇ.ఎం.ఆర్.ఐ రుణ భారం గురించి మాట్లాడే బదులు సంస్థ సేకరించుకున్న"ఆస్తులు" చేసిన "అప్పులు" కలిపి సమగ్ర విశ్లేషణ జరగాలి. అప్పుడే వాస్తవ పరిస్థితిని అంచనా వేయడానికి ఆస్కారం వుంటుంది. ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు "అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ". అప్పుల భారాన్ని నెత్తిన వేసుకుంటున్నామని, సంస్థను ఇబ్బందుల నుంచి కాపాడుతున్నామని, అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తున్నామని చెపుతున్న వారి ఆంతరంగం "దాతృత్వ వైఖరికి నిదర్శనమా ?" లేక ఆ పేరుతో "సంస్థ ఆస్తులను కైవసం చేసుకోవాలన్న ఆలోచనా ?" బేరీజు వేయడం జరిగుండాల్సింది. ఇ.ఎం.ఆర్.ఐ కి వున్న రుణ భారం సంగతేంటో గాని, అత్యంత ఖరీదైన సుమారు నలభై ఎకరాల భూమి, సుమారు రు. 30-40 కోట్ల భవనాలు, అంతర్జాతీయ ప్రమాణాల అనుగుణంగా నెలకొల్పిన (విలువ కట్టలేని) ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ లాంటి విలువైన ఆస్తులున్నాయి. ఇవేవీ ఏ ఒక్కరి "సొత్తో-సొమ్మో" కారాదు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి "ఒడిదుడుకులకు ఆస్కారం లేని" అత్యవసర సహాయ సేవల అమలు "ట్రస్ట్" కు శ్రీకారం చుట్టాల్సింది.

సంస్థ ప్రాంగణంలో రెండో అంతస్తు భవన నిర్మాణానికి, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ లో పోస్టు గ్రాడ్యుయేట్ శిక్షణ పొందుతున్నవారి వసతి హాస్టల్ నిర్మాణానికి కావాల్సిన మొత్తాన్ని కూడా ఇతర రాష్ట్రాల నిధుల నుంచే వాడి వుండాలి. యాజమాన్యం అంగీకరించిందన్న మిషతో, సుమారు నలబై లక్షలు ఖరీదు చేసే అధునాతనమైన కారును ఇతర రాష్ట్రాల నిధులతో ఖరీదు చేయడం కూడా ఎంతవరకు సబబు? అలా "సంబంధం లేని" వాటిమీద, ఇతర రాష్ట్రాల నిధులను వ్యయం (దుర్వినియోగం) చేయడంలోని ఔచిత్యాన్ని వివరించాల్సిన భాద్యత ప్రధానంగా సిఇఓ దే!

జనవరి 7, 2009 న రాజు గారు జైలుకెళ్లే ముందర ఇ.ఎం.ఆర్.ఐ భవిష్యత్ గురించి బహుశా ఆందోళన పడినా తన వారసులెవరనే విషయంలో మనసు విప్పి వుండకపోవచ్చు. కుటుంబ సభ్యులకు సూచించి వుండొచ్చు. కుటుంబ సభ్యులకు పిరమల్, జీ.వి.కె సంస్థలలో ఇదమిద్ధంగా ఎవరిపైనా ఎక్కువ ఆసక్తి వుండకపోయుండవచ్చు. వారిదనుకున్న "స్థిరాస్తి" అన్యాక్రాంతం కాకూడదన్న పట్టుదల వుండడం సహజం. బహుశా మొదట్లో పిరమల్ కావాలనుకున్నారే మో, అటు వైపు ఎక్కువ మొగ్గు చూపారు సిఇఓ. ఆ తర్వాత జీ.వి.కె. రెడ్డిపై మనసు మళ్లి వుండవచ్చు.

అధునాతన సౌకర్యాలున్న రెండంతస్తుల ఇ.ఎం.ఆర్.ఐ ప్రధాన కార్యాలయం, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ లో "ఉన్నత శిక్షణ” ను ఇచ్చేందుకు నిర్వహిస్తున్న పోస్టు గ్రాడ్యుయేట్ తరగతి విద్యార్థుల వసతి కొరకు నిర్మించిన (అర్థాంతరంగా ఆగిపోయిన) భారీ హాస్టల్ భవన సముదాయం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్, సత్యం పబ్లిక్ స్కూల్ నాటి (తర్వాత ఆధునీకరించిన) ప్రధాన కార్యాలయం, ఇండిపెండెంట్ ’తరగతి గదులు’, కొంతమంది ఉద్యోగులుండడానికి అనువుగా వున్న రెసిడెన్షియల్ క్వార్టర్స్..... ...... ఇలా "విలువైన ఆస్తులు"న్న, కోట్లాది రూపాయల విలువ చేసే, సుమారు నలభై ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా రాజు గారి సారధ్యంలో రూపు దిద్దుకున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ "నియమావళి", "సంఘ స్థాపన పత్రం" లోని చిత్ర-విచిత్రమైన అంశాల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. సంస్థ నియమావళికి, భవిష్యత్ లో ఎంత ప్రయత్నం చేసినా, సులభంగా సవరణలు తేలేని విధంగా, అతి చాకచక్యంగా దాన్ని తయారు చేయించారు రాజు గారు. సంస్థ "ఉజ్వల భవిష్యత్" ను దృష్టిలో వుంచుకుని, "నీతి విచక్షనలేని"వారి చేతుల్లోకి అది ఎట్టి పరిస్థితుల్లోనూ జారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాటుగా అలా చేసి వుండాలి రాజు గారు.

ఈ నేపధ్యంలో ఏ ప్రయోజనం కోరి ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం, అత్యవసర సహాయ సేవలను అర్థాంతరంగా ఆపుదల చేస్తామని, ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ లేఖ పంపించిందో అన్న అంశంపై విచారణ జరగాలి. లేఖ ఇవ్వడం ద్వారా ఎటువంటి ఒత్తిడిని ప్రభుత్వంపై యాజమాన్యం తేవాలనుకుందో వెల్లడి కావాలి. ప్రభుత్వం ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోవచ్చా? భవిష్యత్ లో ఏం జరుగబోతోంది?

ఇదిలా వుండగా, ఆరోగ్య నిర్వహణ-పరిశోధనా సంస్థ (హెచ్‍‍ఎంఆర్ఐ ) సమకూరుస్తున్న "104 నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు బదలాయించింది. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు, కొత్త యాజమాన్య విధానాన్ని రూపొందించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. 104 సంచార వాహన సేవలు ఆరంభించడానికి ఒక మహత్తర ఆశయం వుంది. కనీస వైద్య సౌకర్యం కూడా నోచుకోని నిరక్షరాస్యులైన నిరుపేద గ్రామీణులు, తమ గ్రామానికి 104 సంచార వాహనం వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా ఇచ్చినంత కాలం ఆనందించారు. రాని రోజున ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియనందున మౌనం దాల్చారు. అలాంటి నాలుగు కోట్ల మంది అభాగ్యులకు 104 సంచార వాహన సేవలు మొదలయ్యేంతవరకు అలాంటి సేవలుంటాయనే విషయమే తెలియదు. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆరంభమై ఇంతవరకు నిరంతరాయంగా ప్రజలకు లభ్యమవుతున్న సేవలు కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారానే లభించాలను కోవడం ఎంతవరకు సమంజసమో కూడా భవిష్యత్తే నిర్ణయించాలి? ఇప్పటికే పండిన పంటలు చేతికి రాకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్న లక్షలాది మంది పేద రైతులకు సకాలంలో ఇప్పటివరకూ లభ్యమవుతున్న ఆరోగ్య వైద్య సేవలు కూడా మృగ్యమవుతే ఎలా?

ఏదేమైనా రాజశేఖర రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైన "రాజీవ్ ఆరోగ్య శ్రీ" లో అపశృతులు చోటుచేసుకోవడం మాత్రం వాస్తవం! End

Thursday, December 23, 2010

ఆచరణలో విఫలమవుతున్న "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం"-3

108 అత్యవసర సహాయ సేవలను
అర్థాంతరంగా ఆపుచేస్తామనడంలో ఔచిత్యం?-III
వనం జ్వాలా నరసింహారావు

ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7, 2009 న "సత్యం కంప్యూటర్స్ సంస్థ కుంభకోణం" వ్యవహారంలో, చైర్మన్ రామ లింగరాజు తాను "దోషి" నని, "తప్పుచేసానని" బహిర్గతం చేయడానికి అర గంట ముందు, ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓకు ఫోన్ చేసి, మరి కాసేపట్లోనే తానొక "సంచలనాత్మక" ప్రకటన చేయబోతున్నానని, ఆ ప్రకటన ఇ.ఎం.ఆర్.ఐ భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుందని చెప్పారు. అయినప్పటికీ, తనకు అత్యంత గౌరవ ప్రదమైన-ప్రీతిపాత్రమైన-హృదయానికి చేరువైన 108-అత్యవసర సహాయ సేవలను "ఎన్ని కష్ట నష్టాలెదురైనా" నిరాటంకంగా కొనసాగించాలని కోరారు (అభ్యర్థించారు?).

లక్షలాది ప్రాణాలను కాపాడుతున్న అత్యవసర సహాయ సేవలను రామ లింగరాజు ఎందుకు ప్రారంభించ దలిచాడు, నిర్వహణ బాధ్యతను లాభాపేక్ష లేని ఒక స్వచ్చంద సంస్థ చేతుల్లో ఎందుకు పెట్టాడు, కేవలం కుటుంబీకులనే ఆ సంస్థ ప్రమోటర్ సభ్యులుగా ఎందుకు ఎంపిక చేశారు, రు. 34 కోట్లు వారందరి పక్షాన సంస్థకు ఎందుకిచ్చారు, ఆ తర్వాత ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేశారు, బాంక్ రుణం ఎందుకు తీసుకున్నారు-తీసుకోవాల్సిన ఆవశ్యకత నిజంగా వుందా, ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సహాయ సేవలను ఆరంభించి అచిర కాలంలోనే సంస్థ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంటే నిధులను సమకూర్చే విషయంలో నిరాసక్తత-నిర్లిప్తత ఎందుకు వహించారు, ఇతర రాష్ట్రాల నిధులను సంస్థ దైనందిన కార్యకలాపాలకు వినియోగించడం "ప్రభుత్వ నిధుల తాత్కాలిక దుర్వినియోగం" అని తెలిసి కూడా ఎందుకలా చేశారు, చేస్తుంటే ఇది తప్పని చెప్పాల్సిన బాధ్యత వున్న సిఇఓ చెప్పకపోవడానికి-చెప్పలేక పోవడానికి బలీయమైన కారణాలేంటి.... ఇలాంటి వాటికి సమాధానం రాజు గారే ఏనాడో ఒకనాడు ఇవ్వాలి తప్ప ఇతరులకు జవాబు వెతకడం సాధ్య పడేది కాదు.

సంస్థను ఆరంభించిన నాటినుంచి జనవరి 9, 2009 వరకు, అత్యవసర సహాయ సేవల నిర్వహణ ఎలా రూపాంతరం చెందింది-ఎలా నిర్వహణ నిధులు సమకూరుతున్నాయి-ఆర్థిక పరమైన భారం తనపై ఎంత మేరకు తగ్గుతుంది-పెరుగుతుంది లాంటి విషయాలను రాజు గారు బహుశా ఎప్పటికప్పుడు అంచనా వేసుకునే వుంటారు. ఒక వైపు నిర్వహణ వ్యయంలో అధిక భారం ప్రభుత్వాలపై పడ్డప్పటికీ, ఇతర రాష్ట్రాలకు సేవలు వ్యాపించడంతో యాజమాన్య పరమైన వ్యయ భారం రాజు గారిపై పడడం కూడా ఎక్కువైంది. ఆయన ఆలోచనలకు అనుగుణంగా సేవలు ఇతర రాష్ట్రాలకు విస్తరించడంతో, ఆయన వంతు సమకూర్చాల్సిన నిధులను ఇ.ఎం.ఆర్.ఐ కి సకాలంలో విడుదల చేయడం బహుశా తలకు మించిన భారం అయ్యుండాలి. మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా, తొలుత బాంక్ ద్వారా రుణాన్ని- ఓవర్ డ్రాఫ్టును తీసుకోవడం మేలని భావించి, లోటును పూడ్చే ప్రయత్నం చేశారాయన. అయితే, ఆయన ఊహించని రీతిలో అత్యవసర సహాయ సేవలు ఒకటి వెంట-మరో రాష్ట్రానికి వ్యాపించడంతో, ఆయనపై అదనపు భారం పడ సాగింది. ఆ తాకిడిని తట్టుకోవడానికి సమాధానం కూడా అందులోనే దొరికింది.

అత్యవసర సహాయ సేవలను ఇ.ఎం.ఆర్.ఐ తోడ్పాటుతో ప్రారంభించిన ప్రతి రాష్ట్రంలో, అధికారులు-అనధికారులు, ఇ.ఎం.ఆర్.ఐ ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులను వ్యయం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించడం, ముందస్తుగా విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ తర్వాత ఈ సేవలను మొట్టమొదట (2007 లో) ఆరంభించిన గుజరాత్ నిధుల విడుదలకు బోణీ కొట్టింది. తాత్కాలిక అవగాహనా ఒప్పందం కుదిరిన మరుక్షణమే నాలుగు కోట్ల రూపాయలను అడ్వాన్సుగా ఇ.ఎం.ఆర్.ఐ కి విడుదల చేసింది. అప్పట్లో, అంత భారీ మొత్తంలో ఒకే దఫాగా బయట నుంచి నిధులు రావడం, అదే మొదటిసారి.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతవరకు, అంత మొత్తానికి, ఒకే చెక్కును ఇవ్వడం జరగలేదు. ఇతర రాష్ట్రం ఇ.ఎం.ఆర్.ఐ పై అంత విశ్వాసంతో-నమ్మకంతో అంత పెద్ద మొత్తాన్ని ఇవ్వడం మామూలు విషయం కాదు. ఆ తర్వాత కాలంలో సేవలను ఆరంభించిన ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు పది కోట్ల రూపాయల మేరకు అడ్వాన్సుగా ఎంఓయు పై సంతకాలు చేసిన తక్షణమే విడుదల చేయడం పరిపాటి అయిపోయింది. ఎంఓయు నిబంధనల ప్రకారం ముందస్తుగా విడుదల చేసిన ఆ నిధులను, అదే రాష్ట్రంలో ఆరంభించనున్న అత్యవసర సహాయ సేవల "మూల ధన వ్యయం" కొరకు (అంబులెన్సులు కొనడానికి, కాల్ సెంటర్ నెలకొల్పడానికి) ప్రధానంగా ఉపయోగించాలి. అయితే ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ఆపాటికే ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా "అవసరార్థం" నిధులను ఉపయోగించే సాంప్రదాయానికి తెర లేచింది. అలా చేయడం "దుర్వినియోగం" కిందకు రాదని, కేవలం అవసరార్థం సంస్థ "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా నిధుల వాడకమేనని సర్ది చెప్పుకుంది యాజమాన్యం. ఒక రాష్ట్రంతో-కొద్ది మొత్తంతో ఆరంభమయిన ఆ సాంప్రదాయం "ఇంతై-ఇంతింతై- వటుడింతై" అన్న చందాన రాజుగారు నిష్క్రమించేనాటికి రు. 120 కోట్ల "రుణ భారానికి" చేరుకుంది. రాజుగారి నిష్క్రమణంతో ఆ రుణ భారం మోసేదెవరన్నది "మిలియన్ డాలర్ల ప్రశ్నార్థకంగా" మిగిలిపోయింది. రాజు గారి స్థానంలో చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్. జీ.వీ.కె. రెడ్డి రు. 70 కోట్లకు పైగా సమకూర్చినట్లు చెప్పుకుంటున్నారు. ఆ రుణభారంలోనే రు. 40 కోట్ల బాంకు అప్పు కూడా వుంది!

ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా "అవసరార్థం" నిధులను మళ్లించడానికి బాధ్యులైన వారు, తక్షణ సమాధానం ఇవ్వాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. "అత్యవసర వ్యయానికి" తాత్కాలికంగా వాడిన ఆ నిధుల్లో "ఇతర రాష్ట్రాల మూల ధన వ్యయానికి గాని, నిర్వహణ వ్యయానికి గాని, సంస్థ సమగ్ర యాజమాన్య-లేదా-నిర్వహణ వ్యయానికి గాని" ఏ మాత్రం సంబంధం లేని, అంతగా అత్యవసరం లేని, ప్రాధాన్యత ఖర్చు కిందకు రాని "మూల ధన వ్యయం" కొరకు ఎంత మేరకు నిధులను వాడారన్న విషయంలో పూర్తి పారదర్శకతతో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నుంచి తప్పుకోలేరు. అలా చేసిన వ్యయం "ఆస్తుల సంపాదన" కిందకు వస్తుంది. ఇ.ఎం.ఆర్.ఐ రుణ భారం గురించి మాట్లాడే బదులు సంస్థ సేకరించుకున్న"ఆస్తులు" చేసిన "అప్పులు" కలిపి సమగ్ర విశ్లేషణ జరగాలి. అప్పుడే వాస్తవ పరిస్థితిని అంచనా వేయడానికి ఆస్కారం వుంటుంది. ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించినంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు "అప్పుల కంటే ఆస్తులే ఎక్కువ". అప్పుల భారాన్ని నెత్తిన వేసుకుంటున్నామని, సంస్థను ఇబ్బందుల నుంచి కాపాడుతున్నామని, అందుకు అవసరమైన నిధులను సమకూరుస్తున్నామని చెపుతున్న వారి ఆంతరంగం "దాతృత్వ వైఖరికి నిదర్శనమా ?" లేక ఆ పేరుతో "సంస్థ ఆస్తులను కైవసం చేసుకోవాలన్న ఆలోచనా ?" బేరీజు వేయడం జరిగుండాల్సింది. ఇ.ఎం.ఆర్.ఐ కి వున్న రుణ భారం సంగతేంటో గాని, అత్యంత ఖరీదైన సుమారు నలభై ఎకరాల భూమి, సుమారు రు. 30-40 కోట్ల భవనాలు, అంతర్జాతీయ ప్రమాణాల అనుగుణంగా నెలకొల్పిన (విలువ కట్టలేని) ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ లాంటి విలువైన ఆస్తులున్నాయి. ఇవేవీ ఏ ఒక్కరి "సొత్తో-సొమ్మో" కారాదు. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి "ఒడిదుడుకులకు ఆస్కారం లేని" అత్యవసర సహాయ సేవల అమలు "ట్రస్ట్" కు శ్రీకారం చుట్టాల్సింది.

ఇంతకూ ఇతర రాష్ట్రాల నుంచి అందుతున్న నిధులను ఇ.ఎం.ఆర్.ఐ ఆయా రాష్ట్రాల అవసరాలకు అదనంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఏ అవసరాలకు వాడి వుండే ఆస్కారం వుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం కష్టమేమీ కాదు. బాంక్ దగ్గర్నుంచి తెచ్చిన రుణం-ఓవర్ డ్రాఫ్ట్ మొత్తం ఖర్చయ్యాక, ప్రతి రాష్ట్ర సహాయ సేవల నిర్వహణ వ్యయంలో భరించాల్సిన 5% వాటా, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కు కావాల్సిన అదనపు మూలధనం ఖర్చు, పాలనా పరమైన వ్యయం, శిక్షణా సంబంధమైన వ్యయం (మౌలిక సదుపాయాలతో కలిపి), సీనియర్ ఉద్యోగుల జీత భత్యాలు, సాంకేతిక సంబంధమైన మూల ధన వ్యయం లాంటివన్నీ ఇతర రాష్ట్రాల నిధుల నుంచే వాడాల్సిన అవసరం కలిగింది. ఆ పాటికే రాజుగారు నిధులను ఇవ్వడం నిలిపేశారు. అడగాల్సిన సిఇఓ తన బాధ్యతను విస్మరించారు. ఇతర రాష్ట్రాల నిధుల మళ్లింపే తేలికనుకున్నారు. సంస్థ ప్రాంగణంలో రెండో అంతస్తు భవన నిర్మాణానికి, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ లో పోస్టు గ్రాడ్యుయేట్ శిక్షణ పొందుతున్నవారి వసతి హాస్టల్ నిర్మాణానికి కావాల్సిన మొత్తాన్ని కూడా ఇతర రాష్ట్రాల నిధుల నుంచే వాడి వుండాలి. యాజమాన్యం అంగీకరించిందన్న మిషతో, సుమారు నలబై లక్షలు ఖరీదు చేసే అధునాతనమైన కారును ఇతర రాష్ట్రాల నిధులతో ఖరీదు చేయడం కూడా ఎంతవరకు సబబు? ఇలాంటి అనుమానాలను మీడియా అప్పట్లో వ్యక్తం చేసింది కూడా. అలా "సంబంధం లేని" వాటిమీద, ఇతర రాష్ట్రాల నిధులను వ్యయం (దుర్వినియోగం) చేయడంలోని ఔచిత్యాన్ని వివరించాల్సిన భాద్యత ప్రధానంగా సిఇఓ దే!

ఇ.ఎం.ఆర్.ఐ అప్పట్లో ఎదుర్కున్న కష్టాల్లో ప్రధానమైంది "ప్రయివేట్ భాగస్వామ్య పాత్ర పోషించాల్సిన వ్యక్తుల-సంస్థల అన్వేషణ". మాజీ చైర్మన్ పై పలు ఆరోపణలు, సుప్రీం కోర్టులో సంస్థపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం, మీడియా వ్యతిరేక ప్రచారం, మధ్యలో అకౌంట్ స్థంబింప చేసిన యాక్సెస్ బాంక్, కింది స్థాయి ఉద్యోగులకు కూడా సరైన సమయంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి, అప్పుల వాళ్ల బాధలు, నిత్యావసరాలకు కూడా నిధుల కొరత... వెరసి అన్నీ కష్టాలే. ప్రయివేట్ భాగస్వామిని పొందే ప్రయత్నంలో పిరమల్, జీ.వి.కె సంస్థలు మాత్రమే చివరి దాకా ఆసక్తి కనబరిచాయి. ఇ.ఎం.ఆర్.ఐ ని దక్కించుకోలేక పోవడం పిరమల్ సంస్థ దురదృష్టమా, లేక, దక్కించుకోవడం జీ.వి.కె అదృష్టమా భవిష్యత్ పరిణామాలే తేల్చాలి.

జనవరి 7, 2009 న రాజు గారు జైలుకెళ్లే ముందర ఇ.ఎం.ఆర్.ఐ భవిష్యత్ గురించి బహుశా ఆందోళన పడినా తన వారసులెవరనే విషయంలో మనసు విప్పి వుండకపోవచ్చు. కుటుంబ సభ్యులకు సూచించి వుండవచ్చు. కుటుంబ సభ్యులకు పిరమల్, జీ.వి.కె సంస్థలలో ఇదమిద్ధంగా ఎవరిపైనా ఎక్కువ ఆసక్తి వుండకపోయుండవచ్చు. వారిదనుకున్న "స్థిరాస్తి" అన్యాక్రాంతం కాకూడదన్న పట్టుదల వుండడం సహజం. బహుశా మొదట్లో పిరమల్ కావాలనుకున్నారే మో, అటు వైపు ఎక్కువ మొగ్గు చూపారు సిఇఓ. ఆ తర్వాత జీ.వి.కె. రెడ్డిపై మనసు మళ్లి వుండవచ్చు. ఆ విషయం సూచన ప్రాయంగా బహిర్గతం చేశారే మో! జీ.వీ.కె తొలుత సానుకూలంగా స్పందించి జనవరి 24, 2009 న ఇ.ఎం.ఆర్.ఐ ని సందర్శించారు కూడా.

ఇంతలో, మళ్ళీ ఏమైందో గాని, రాజుగారి కుటుంబం దృష్టి మరో మారు పిరమల్ వైపు మళ్లింది. స్వయంగా వారి కుటుంబ ప్రతినిధి పిరమల్ ను కలుసుకొని ఒప్పించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ రప్పించారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని కలిసే ప్రయత్నం చేశారు. ఆయన హైదరాబాద్ లో లేనందున ఆర్థిక మంత్రిగా వున్న రోశయ్యను ఉదయమే వెళ్లి కలిశాం. సుమారు అర్థ గంట పైగా సమావేశం జరిగింది. సంస్థ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు రోశయ్య. వారి ఆసక్తిని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత వారూ ఇ.ఎం.ఆర్.ఐ ని సందర్శించారు. అంతా సవ్యంగా వుందనుకుంటుండగానే, నిరాసక్తతను వ్యక్త పరిచారు పిరమల్ అధినేత. ఇక ఆ తర్వాత మే 26, 2009 న ముఖ్యమంత్రి చొరవతో జీ.వీ.కె. రెడ్డి ఇ.ఎం.ఆర్.ఐ బరువు బాధ్యతలు స్వీకరించారు. పిరమల్ అధినేత అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్యను కలిసినప్పుడు, డాక్టర్ జీ.వీ.కె. రెడ్డి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో మాట్లాడినప్పుడు (బహుశా) లేవనెత్తిన ఒక ప్రధాన అంశం ఇ.ఎం.ఆర్.ఐ కార్యాలయం, భవన సముదాయం వున్న సుమారు నలభై ఎకరాల భూమి వ్యవహారం గురించి.

అధునాతన సౌకర్యాలున్న రెండంతస్తుల ఇ.ఎం.ఆర్.ఐ ప్రధాన కార్యాలయం, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ లో "ఉన్నత శిక్షణ” ను ఇచ్చేందుకు నిర్వహిస్తున్న పోస్టు గ్రాడ్యుయేట్ తరగతి విద్యార్థుల వసతి కొరకు నిర్మించిన (అర్థాంతరంగా ఆగిపోయిన) భారీ హాస్టల్ భవన సముదాయం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్, సత్యం పబ్లిక్ స్కూల్ నాటి (తర్వాత ఆధునీకరించిన) ప్రధాన కార్యాలయం, ఇండిపెండెంట్ ’తరగతి గదులు’, కొంతమంది ఉద్యోగులుండడానికి అనువుగా వున్న రెసిడెన్షియల్ క్వార్టర్స్..... ...... ఇలా "విలువైన ఆస్తులు"న్న, కోట్లాది రూపాయల విలువ చేసే, సుమారు నలభై ఎకరాల భూమి పూర్వాపరాల గురించి తెలుసుకునే ముందర, రాజు గారి సారధ్యంలో రూపు దిద్దుకున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ "నియమావళి" గురించి, "సంఘ స్థాపన పత్రం" లోని చిత్ర-విచిత్రమైన అంశాల గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. ఇంతకు ముందే తెలియచేసినట్లు, తన కుటుంబీకులే ప్రమోటర్ సభ్యులుగా సంస్థను రిజిస్టర్ చేయించడమే కాకుండా, సంస్థ నియమావళికి, భవిష్యత్ లో ఎంత ప్రయత్నం చేసినా, అంత సులభంగా సవరణలు తేలేని విధంగా, అతి చాకచక్యంగా దాన్ని తయారు చేయించారు రాజు గారు. యాదృచ్చికంగా అలా జరిగిందో, లేక, కావాలనే ఆయనో, ఆయన సలహాదారులో అలా చేయించారో తెలుసుకోవాలంటే, సమాధానం చెప్పాల్సింది రాజు గారే. సంస్థ "ఉజ్వల భవిష్యత్" ను దృష్టిలో వుంచుకుని, "నీతి విచక్షనలేని"వారి చేతుల్లోకి అది ఎట్టి పరిస్థితుల్లోనూ జారిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాటుగా అలా చేసి వుండాలి రాజు గారు.

ఈ నేపధ్యంలో ఏ ప్రయోజనం కోరి ఇ.ఎం.ఆర్.ఐ ఐ యాజమాన్యం, అత్యవసర సహాయ సేవలను అర్థాంతరంగా ఆపుదల చేస్తామని, ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ లేఖ పంపించిందో అన్న అంశంపై విచారణ జరగాలి. లేఖ ఇవ్వడం ద్వారా ఎటువంటి ఒత్తిడిని ప్రభుత్వంపై యాజమాన్యం తేవాలనుకుందో వెల్లడి కావాలి. ప్రభుత్వం ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోవచ్చా? భవిష్యత్ లో ఏం జరుగబోతోంది? END

Wednesday, December 22, 2010

ఆచరణలో విఫలమవుతున్న "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం"-2

108 అత్యవసర సహాయ సేవలను
అర్థాంతరంగా ఆపుచేస్తామనడంలో ఔచిత్యం?-II
వనం జ్వాలా నరసింహారావు

ఆశయం గొప్పది కావచ్చు. అమలు పరిచేవారు నిష్ణాతులే కావచ్చు- నిబద్ధత, అంకిత భావాలకు సాక్షాత్తు చిరునామా కావచ్చు. కాకపోతే, ప్రజాస్వామ్యంలో "అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు, సంబంధిత సమాచారాన్ని పొందే హక్కు" ప్రతి పౌరుడికి వుంది. దానికి తోడు, ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో 95% ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న 108-అత్యవసర సహాయ సేవలు లభ్యం కావటంలో ఏ మాత్రం అలసత్వం వున్నా కారణాలు తెలుసుకుని, ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ లింగ రాజు (సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో) హఠాత్తుగా బాధ్యతల నుంచి తొలగడం, ఆయన స్థానంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, "లోకోపకార దాతృత్వ” భావంతో పలు సంక్షేమ కార్యక్రమాలకు తన వంతు నిధులను సమకూరుస్తున్న జీ.వీ.కె సంస్థల అధిపతి శ్రీ జీ.వి.కృష్ణారెడ్డి, (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చొరవతో, చైర్మన్ గా రావడంతో, అత్యవసర సహాయ సేవలు అందచేయడంలో ఏ సమస్యలు రావని లబ్దిదారులు భావించారు. బహుశా ప్రభుత్వం కూడా అలానే భావించి వుంటుంది. అయితే, ప్రభుత్వం నాలుగు దశల్లో ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు సమకూర్చిన 732 అంబులెన్సులు-అంతకు ముందే ప్రయివేట్ భాగస్వామిగా ‘రామ లింగరాజు గారి ఇ.ఎం.ఆర్.ఐ’ జతకూర్చిన మరో 70 అంబులెన్సులు కలిపి మొత్తం 802 అంబులెన్సులు పౌరులకు సేవలందించాల్సి వుండగా, వాటిలో కనీసం 100 అంబులెన్సులు, వివిధ కారణాల వల్ల సేవలందించలేని స్థితిలో వుండడంతో అలా ఎందుకు "ఒడిదుడుకులకు లోను కావాల్సి వచ్చిందో" అర్థం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది ప్రభుత్వం.

రాజుగారి స్థానంలోకి జీ.వీ.కె ప్రవేశించడమంటే, ఎటువంటి ఇబ్బందికి 108 అత్యవసర సహాయ సేవలు గురి కాకూడదనే కదా ! మరెందుకు మీడియాలో విభిన్న కథనాలొస్తున్నాయి? ప్రభుత్వ నిధులు సక్రమంగా అందడం లేదనుకోవాలా? జీ.వీ.కె అనుకున్న రీతిలో సహాయం అందించడం లేదా? అత్యవసర సహాయ సేవలు ఒడిదుడుకుల్లో పడడం నిజమేనా?ఒడిదుడుకులకు కారణాలు ఏమై వుండొచ్చు? వాస్తవానికి వ్యవస్థాపక అధ్యక్షుడు రామలింగ రాజు గారు ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ గా రాజీనామా చేసిన నాటినుంచి (జనవరి 7, 2009) జీ.వీ.కె ఆ పదవి చేపట్టిన రోజు (మే నెల 26, 2009) వరకు బాహ్య ప్రపంచానికి అంతగా అవసరంలేని-పట్టని పలు ఇబ్బందులకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ లోనైంది. అయినా ఒక్క రోజుకూడా 108 అత్యవసర సహాయ సేవలు, ఒక్క క్షణం కూడా ఆపబడలేదు.

జీ.వీ.కె రెడ్డి అధ్యక్షతన జీ.వీ.కె. ఇ.ఎం.ఆర్.ఐ గా 108-అత్యవసర సహాయ సేవలు రూపాంతరం చెందాక యాజమాన్య పరంగా, నిర్వహణ పరంగా ఊహించీ-ఊహించని-ఊహ కందని అనేకానేక మార్పులు కనిపించసాగాయి. అనారోగ్యకరమైన మార్పులకు అంకురార్పణ జరిగిన ప్రతి సందర్భంలోనూ బాధను-అసంతృప్తిని బాహాటంగానే కొందరం వ్యక్త పరిచాం. నూతన చైర్మన్ జీ.వీ.కె రెడ్డి మొదటిసారి తన ఆంతరంగాన్ని ఇ.ఎం.ఆర్.ఐ సీనియర్ అధికారుల సమక్షంలో బహిర్గతం చేస్తూ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఇ.ఎం.ఆర్.ఐ-108 అత్యవసర సహాయ సేవల నెట్‌ వర్క్ నుంచి తొలగిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నప్పుడు, ఇతర రాష్ట్రాలను నెట్‌ వర్క్ లోకి తెచ్చిన మా లాంటి కొందరికి తీవ్రమైన బాధ కలిగింది. ఆయన ఆంతరంగం అర్థమయింది. ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సహాయ సేవలను ఆపు చేస్తామని సిఇఓ తో లేఖ ఇప్పించినప్పుడు అప్పటి మా భయం నిజమయింది.

జీ. వి. కృష్ణారెడ్డి ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ బాధ్యతలు చేపట్టిన తర్వాత 05.05.08 న కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం స్థానంలో "పి.పి.పి ఒప్పందం" పేరుతో కొత్త ముసాయిదాను పరిశీలన కొరకు ప్రభుత్వానికి సమర్పించింది సంస్థ. గతంలో కుదుర్చుకున్న మొదటి (ఏప్రియల్ 2, 2005) ఎంఓయు విషయంలో, రెండో (సెప్టెంబర్ 22, 2006) ఎంఓయు విషయంలో, మూడో (అక్టోబర్ 5, 2007) ఎంఓయు విషయంలో, నాలుగో (మే 5, 2008) ఎంఓయు విషయంలో ఏ విధమైన "కొర్రీలను" వేయని ప్రభుత్వం, ఈ సారి ఆక్షేపణలు తెలియచేసింది. అప్పట్లో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య పక్షాలకు చెందిన అధికార ప్రతినిధులు కూర్చొని-చర్చించి ముసాయిదాను ఖాయపరిచే సాంప్రదాయం వుండేది. "విశ్వాసం-నమ్మకం" అనే ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రధాన ప్రాతిపదిక ఆధారంగా మొదటి నాలుగు ఎంఓయు లన్నీ ఖరారయ్యాయి. మొట్టమొదటి సారిగా "కొర్రీల సాంప్రదాయానికి" అవకాశం ఇచ్చింది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. ఇలా జరగకుండా వుండాల్సింది. ఇంతకూ ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం ప్రభుత్వానికి సమర్పించిన ముసాయిదా ఎంఓయు లో వున్న అంశాలేంటి ? వాటి విషయంలో ఆర్థిక శాఖ లేవనెత్తిన అభ్యంతరాలేంటి ?

ముసాయిదా ఒప్పందం ప్రతిపాదనలో ప్రధానమైంది నెల-నెలా సగటున ఒక్కో అంబులెన్సుకు ప్రభుత్వ పరంగా ఇస్తున్న ప్రత్యక్ష నిర్వహణ వ్యయానికి సంబంధించిన విషయం. 2008-2009 ఆర్థిక సంవత్సరానికి, అప్పట్లో ఇ.ఎం.ఆర్.ఐ, ఒక్కో అంబులెన్సుకు సగటున ప్రతినెలా రు. 1, 18, 420 వ్యయమవుతుందని ప్రతిపాదించగా, దాన్ని పరిశీలించి-అంగీకరించిన ప్రభుత్వం, తన వంతు 95% వాటాగా రు. 1, 12, 499 చొప్పున ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. 502 అంబులెన్సులున్నప్పుడు అంగీకరించిన ఆ మొత్తం (రు. 1, 12, 499), తర్వాత సంఖ్య 652 కు చేరినప్పటికీ, ఆ తర్వాత ఆ సంఖ్య 802కు పెరిగినప్పటికీ, "విశ్వాసంతో-నమ్మకంతో" పునఃపరిశీలించకుండా చెల్లిస్తూ వస్తున్నారు. అది కూడా మొదట్లో మూడు నెలల అడ్వాన్సు ఒకే సారి ఇచ్చే సాంప్రదాయం వుండేది. జీ.వీ.కె యాజమాన్యం బాధ్యతలు స్వీకరించడానికి కొద్ది నెలల ముందు నుంచి నెల-నెలా అడ్వాన్సుల సాంప్రదాయానికి అంగీకరించింది యాజమాన్యం. 108 అత్యవసర సహాయ సేవల ఒడిదుడుకులకు ఇదో ప్రధాన కారణం.

ముసాయిదాలో 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి 100% పెంచి, ప్రతి నెలా ఒక్కో అంబులెన్సుకు రు. 1, 18, 420 వంతున ప్రభుత్వం భరించాలని ప్రతిపాదించింది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. అదనంగా మరో రు. 10 కోట్లు "మూల ధన వ్యయం" కొరకు కావాలని కోరింది. సంవత్సరానికి రు. 12 లక్షల కంటే ఎక్కువ (నెలకు లక్ష రూపాయలు!) వేతనం ఇవ్వాల్సిన ఉద్యోగుల జీత భత్యాలను మాత్రమే ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం భరిస్తుందని, మిగతా వారికి ప్రభుత్వమే ఇవ్వాలని మరో ప్రతిపాదన ఇచ్చింది. ఆర్థికంగా ప్రభుత్వంపై మరింత భారాన్ని పరోక్షంగా సూచించింది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. అడపాదడపా ఏదన్నా ఊహించని వ్యయం జరిగితే దాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని కోరింది. శిక్షణా కార్యక్రమాలన్నింటికీ అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని మరో ప్రతిపాదన. ఆర్థిక శాఖకు ఇది రుచించలేదు.

2008 సంవత్సరంలో ప్రభుత్వం అంగీకరించిన నెలసరి సగటు అంబులెన్సు నిర్వహణ వ్యయానికి అదనంగా రు. 8,833 లు (అంటే రు. 1, 27, 253) ఖర్చయ్యాయని లెక్కలు చూపించింది సంస్థ. అయితే అధికారిక లెక్కల పుస్తకాలలో ఆ వ్యయం సుమారు రు. 90, 000 మాత్రమే వున్నట్లు ఆర్థిక శాఖ దృష్టికొచ్చింది. ఎంఓయు లో అంగీకరించిన దానికంటే ఎందుకంత అదనంగా ఖర్చయ్యిందన్న అంశాన్ని పరిశీలించాలని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. సగటున ప్రతి నెలా అంబులెన్సుకు అయ్యే సరాసరి నిర్వహణ వ్యయం ఎంతుంటుందన్న విషయాన్ని "నిపుణులతో క్షుణ్ణంగా అధ్యయనం చేయించడం గాని" లేదా "టెండర్ విధానం ద్వారా వేలం పోటీ పద్ధతిన సరసమైన ధరను నిర్ణయించడం గాని" జరగాలని ఆర్థిక శాఖ అభిప్రాయం. 05.05.08 న కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందంలోని పలు అంశాలను మార్చవలసిన ఆగత్యాన్ని కూడా ఆర్థిక శాఖ ప్రశ్నించింది. వంద కోట్ల రూపాయలకు పైగా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నందున కుటుంబ సంక్షేమ శాఖలో "అంకిత భావం కలిగిన మానిటరింగ్ యూనిట్" ను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా అభిప్రాయ పడింది. నిధుల సేకరణకు "అడ్వర్టయిజింగ్" విధానం అవలంభించడం మంచిదని మరో సూచన చేసింది. ఇలా అడుగడుగునా ప్రభుత్వానికి అనుమానాలొస్తుంటే భవిష్యత్ లో ఏం జరుగబోతోంది ఊహించడం కష్టమే!

"రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సహాయ సేవలందించే" “నోడల్ ఏజన్సీ” గా 2005 లో ఇ.ఎం.ఆర్.ఐ ని గుర్తించిన ప్రభుత్వం, 2006 లో "గ్రామీణ అత్యవసర రవాణా పథకం" పేరుతో ప్రవేశ పెట్టదలిచిన అంబులెన్సుల నిర్వహణ బాధ్యతను కూడా "అత్యంత నమ్మకంతో-విశ్వాసంతో" అదే సంస్థకు అప్పగించారు. అదో చారిత్రాత్మక నిర్ణయం. వాస్తవానికి అలనాటి కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సీ.బి.ఎస్. వెంకట రమణ గారి "నమ్మకం-విశ్వాసం" తో కూడుకున్న సాహసోపేత నిర్ణయమే ఈ నాటి రాష్ట్ర వ్యాప్త అత్యవసర సహాయ సేవలకు పునాది-నాంది. ఏమైందానాటి "నమ్మకం-విశ్వాసం" ? లోపం ఎవరిది ? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం వుంది.

అప్పటి ఆర్థిక-ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రోశయ్య సమక్షంలో 22-09-2006 న అవగాహనా ఒప్పందం (ఎంఓయు) పై సంతకాలు చేశారు. పూర్తిగా తన స్వయం పర్యవేక్షణ కింద (నా సమక్షంలో) తానే తయారుచేసిన అవగాహనా ఒప్పందం "అవతారిక"లో ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ గురించి రాసిన వాక్యాలు ఆ సంస్థమీద ప్రభుత్వానికి అప్పట్లో వున్న"నమ్మకానికి-విశ్వాసానికి" అసలు-సిసలైన మచ్చుతునకలు. ఎంఓయు పూర్వ రంగంలో అలనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ జంధ్యాల హరినారాయణ్, అగర్వాల్ కు ముందున్న ఆరోగ్య వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ఐ.వి.సుబ్బారావు, ఉప కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యర్, ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కావడానికి-అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేయడానికి చేసిన కృషి-తీసుకున్న చొరవ "నమ్మకానికి- విశ్వాసానికి" ఉదాహరణలు. అదే "నమ్మకాన్ని-విశ్వాసాన్ని" ఐదేళ్ల తర్వాత ఇ.ఎం.ఆర్.ఐ కోల్పోవడానికి బలవత్తరమైన కారణాలుండి తీరాలి. అవి విశ్లేషించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వానికి-ఇటు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ అధికారులపైనుంది.

108-అత్యవసర సహాయ సేవల పటిష్ఠ అమలుకు ప్రభుత్వం ప్రదర్శించిన "విశ్వాసానికి- నమ్మకానికి" మరో మచ్చుతునక, జులై 12, 2007 న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె. హరినారాయణ్, నాటి ఆరోగ్య-వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి పరిశీలనార్థం పంపిన వివరణ. ఆ వివరణ పూర్వ రంగంలో ఇ.ఎం.ఆర్.ఐ-ప్రభుత్వం మధ్య కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం మేరకు, అప్పటికి సరిగ్గా నాలుగు నెలల క్రితం (8-2-2007 న) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన "ఇ.ఎం.ఆర్.ఐ సలహా సంఘం సమావేశం" జరిగింది. ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సహా పలువురు ఉన్నతాధికారులు ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆద్యతన భవిష్యత్ లో, ప్రభుత్వ పరంగా, ఇ.ఎం.ఆర్.ఐ కి 108-అత్యవసర సహాయ సేవల నిర్వహణ నిధులను దశలవారీగా పెంచడానికి నాంది జరిగిన చారిత్రాత్మక సలహా సంఘం సమావేశమది. అవగాహనా ఒప్పందం ఆధారంగా, ఒక్కో అంబులెన్సుకు రు. 68, 700 అవుతుందని నిర్ణయం తీసుకున్న సమావేశం అది. ఒక పథకం విషయంలో, ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ పై "ఎంతో విశ్వాసం-నమ్మకం" వుండబట్టే అలా వ్యవహరించడం జరిగిందని భావించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఉత్తర్వులు వచ్చిన కొద్ది రోజుల్లోనే, అత్యవసర సహాయ సేవల అంశం క్రమేపీ ముఖ్యమంత్రి దృష్టికి మరింత చేరువగా పోవడంతో, అక్కడినుంచి నిర్ణయాలు ఆయన కనుసన్నల్లో జరగడం మొదలయింది. అత్యంత ఆదరణ పొందిన సేవలుగా ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా, ఇతర రాష్ట్రాలకు కూడా పాకడానికి మాత్రం కారకుడు (దివంగత) ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" గాని, ఆ తర్వాత (దివంగత) ముఖ్యమంత్రి "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" గాని ఎంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ నిలబెట్టుకో గలిగిందనేది జవాబు దొరకని ప్రశ్న.

ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి జరిపిన మరో సమీక్షా సమావేశంలో, 108-అత్యవసర సహాయ సేవలందించడానికి ఇ.ఎం.ఆర్.ఐ కి, "ప్రత్యక్ష నిర్వహణ వ్యయం" కింద 95% వరకు ప్రభుత్వం భరించడానికి అంగీకరించింది ప్రభుత్వం. ఇ.ఎం.ఆర్.ఐ పై ప్రభుత్వానికున్న "విశ్వాసం-నమ్మకం" కొనసాగిందనడాని నిదర్శనంగా అప్పుడున్న వాటికి అదనంగా తొలుత 150 అంబులెన్సులు, మలి విడతగా మరో 150 అంబులెన్సులు, మొత్తం 802 అంబులెన్సులు సమకూర్చడం జరిగింది. 95% నిర్వహణ వ్యయం కింద ప్రభుత్వం ఎంత భరించాలన్న నిర్ణయం తీసుకోవడంలో నాటి ఆరోగ్య-వైద్య శాఖల ముఖ్య కార్యదర్శి పి. కె. అగర్వాల్ తీసుకున్న చొరవ ఇ.ఎం.ఆర్.ఐ పై ప్రభుత్వానికున్న"విశ్వాసానికి-నమ్మకానికి" మరో నిదర్శనం. ఆ మొత్తాన్ని ఒక్కో అంబులెన్సుకు రు. 1,12,499 గా నిర్ణయించి, ప్రభుత్వ పరమైన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 502 అంబులెన్సులున్నప్పుడు సగటున అయ్యే వ్యయం, 652కు, తర్వాత 802 కు పెరిగినప్పుడు, తగ్గుతుందన్న విషయం తెలిసిందే అయినప్పటికీ, బయటపడకుండా జాగ్రత్త పడ్డది ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. పారదర్శకతతో ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం వ్యవహరించి, వాస్తవ లెక్కలను ఏదో ఒక సందర్భంలో బహిర్గతం చేసినట్లయితే బాగుండేదేమో ! End of Part II

Monday, December 20, 2010

ఆచరణలో విఫలమవుతున్న "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం-I": వనం జ్వాలా నరసింహారావు

108 అత్యవసర సహాయ సేవలను
అర్థాంతరంగా ఆపుచేస్తామనడంలో ఔచిత్యం?- I
వనం జ్వాలా నరసింహారావు

అవగాహనా ఒప్పందం లేకుండా అత్యవసర సహాయ సేవలను అందిస్తున్నామని, నెల నెలా నిర్వహణ ఖర్చుల కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బుల కోసం కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని, ప్రభుత్వం నుంచి అనునిత్యం బెదిరింపులు-సాధింపులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ 108 అంబులెన్సు సేవలను నడపమని, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో వాటిని గత ఐదేళ్లు గా నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఇ.ఎం.ఆర్.ఐ) ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. ఆ వార్తకు స్పందించిన వైద్య-ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ పీవీ రమేశ్ ఇ.ఎం.ఆర్.ఐ అధికారులకు ఎంఓయు విషయంలో భరోసా ఇవ్వడంతో తాత్కాలికంగా సమస్య సమసిపోయినా, ఒక ఇ.ఎం.ఆర్.ఐ బోర్డు సభ్యుడి ప్రోద్భలం మేరకు, సిఇఓ సంతకంతో ప్రభుత్వానికి అలాంటి హెచ్చరిక వెళ్లడం వెనక బలమైన కారణాలుండవచ్చు. సిఇఓ లేఖ కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కైతే, సమస్య పరిష్కరించింది ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కావడం కూడా గమనించాల్సిన విషయం.

అసలేం జరుగుతున్నది? ప్రభుత్వ హామీలు, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ చైర్మన్ జీ.వీ.కె హామీలు కాగితాలకే పరిమితమా? యాజమాన్య నిర్వహణలో లోపాలున్నాయా? అధికారులు నిరాసక్తతను పరోక్షంగా ప్రదర్శిస్తున్నారా? పాతికేళ్ళ పైబడి యాజమాన్య నిర్వహణలో అపారమైన అనుభవం గడించిన సిఇవో, ప్రభుత్వానికి అలా హెచ్చరిక ఎందుకు చేయాల్సి వచ్చింది? అంబులెన్సుల సేవలు ఆగిపోతే నష్టపోయేది పేద వారే కాని ధనికులు కాదు. వ్యక్తిగత పట్టింపులకు, పంతాలకు అతీతంగా నిర్వహించాల్సిన సేవలు ఏ ఒక్కరి సొత్తో-సొమ్మో అనుకుని అలా హెచ్చరికలు జారీచేయడం ఎంతవరకు సమంజసం? ఏదో వంక చూపి, అత్యవసర సహాయ సేవలను నిలుపుదల చేస్తామని లిఖిత పూర్వ కంగా ఇవ్వడం నేరంగా పరిగణించాలి కదా!

108 అంబులెన్సుల ద్వారా అత్యవసర సహాయ సేవలందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ పని తీరుపై ఏడెనిమిది నెలల క్రితం ప్రభుత్వం ఒక కమిటీని నియమించినప్పుడే, ప్రభుత్వ ఆలోచనా సరళిలో కొంత మార్పు వస్తున్నట్లు భావించాలి. కమిటీని నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులో... "ప్రస్తుతం లభిస్తున్న అత్యవసర రవాణా సేవలకు ప్రత్యామ్నాయాలే మన్నా వున్నాయేమో పరిశీలించడంతో సహా అన్ని అంశాలను సమీక్షించి, సరైన సూచనలను-సలహాలను ఇవ్వాల్సింది" గా పేర్కొనడం భవిష్యత్ పరిణామాలకు సంకేతం కావచ్చు.

ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు ఇంతకంటే "పెను సవాలు" మరోటి లేదు. ఇరువురు భాగస్వాముల ఆలోచనా ధోరణిలో మార్పురానంత కాలం అత్యవసర సహాయ సేవల అమలు గతంలో మాదిరి జరిగే అవకాశం లేదు. భాగస్వాముల మధ్య "విశ్వాసం"-"నమ్మకం" కలగడం ముఖ్యం. అలాంటి (లోగడ వున్న మాదిరిగానే) విశ్వాసం-నమ్మకం పునరుద్ధరించడానికి అవసరమైన తక్షణ చర్యలకు ప్రభుత్వం నియమించిన కమిటీ చొరవ తీసుకున్న దాఖలాలు ఆ కమిటీ నివేదికలో పొందుపరిచినట్లు లేదు. అసలా నివేదికలో ఏముందో కూడా బహిర్గతం కాలేదు. అది జరక్కుండా, కాలయాపనకు దారితీసే "ప్రత్యామ్నాయాలను" ప్రతిపాదించడమే జరిగితే భవిష్యత్ లో 108-అత్యవసర సహాయ సేవలు కొనసాగినప్పటికీ, పౌరులకు గతంలో మాదిరి నాణ్యమైన సేవలు లభ్యం కాకపోవడం తప్పదేమో !

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అధ్యక్షతన జరిగిన చిట్టచివరి సమీక్షా సమావేశంలో (ఇ.ఎం.ఆర్.ఐ ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య కన్సల్టెంటు గా నేను కూడా వున్నాను), ప్రభుత్వంతో ఇ.ఎం.ఆర్.ఐ కుదుర్చుకున్న ఎంఓయు గడువు మే నెల 5, 2008 తో ముగిసినందున, దాని అమలును, తగు సవరణలతో అవసరమైనంత కాలవ్యవధి వరకు పొడిగించాలని, కొత్త ఎంఓయు పై సంతకాలు కావాలని ఆయన చేసిన సూచన ఇంతవరకు అమలు జరగలేదు. లక్షలాది ప్రాణాలను కాపాడవలసిన సంస్థ నిర్వహణ వ్యయం కొరకు విడుదల చేయాల్సిన నిధులను తెచ్చుకోవడంలోనే సంస్థ అధికారులు నెలంతా కాలం వెళ్లబుచ్చాల్సిన పరిస్థితులున్నాయిప్పుడు. నిర్వహణ వ్యయం భరించే విషయంలో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం సిద్ధాంత ప్రక్రియకు అనుగుణంగా, ప్రభుత్వం-ఇ.ఎం.ఆర్.ఐ తమ-తమ వంతు వాటాగా 95%-5% నిష్పత్తి విధానాన్ని పాటించాలని, యాజమాన్య పరమైన వ్యయం కింద ఇ.ఎం.ఆర్.ఐ పెడుతున్న ఖర్చును సంస్థ సమకూర్చాల్సిన 5% వాటాగా పరిగణించాలని, రాజశేఖర రెడ్డి సూచించారు. ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్య నిర్వహణ బాధ్యతలు స్వీకరించబోయే భావి సంస్థల-వ్యక్తుల (జీవీకే సంస్థ) నుంచి, లోగడ ఇ.ఎం.ఆర్.ఐ కున్న రుణాల మొత్తాన్ని తీర్చేందుకు తగు ఆర్థిక సహాయాన్ని పొందే ఏర్పాటు చేసుకోవాలని ఆయన స్పష్టంగా సూచించారు. అత్యవసర సహాయ సేవల నిర్వహణకు నియమించబడిన ఆపరేషన్స్ సిబ్బంది జీతభత్యాలు, ప్రతి నెల మొదటి తేదీన చెల్లించే విధంగా, ప్రభుత్వం అంగీకరించిన నిధులను విడుదల చేస్తుందని మినిట్స్ లో నమోదుచేశారు. మినిట్స్ లో పొందు పరచకపోయినా ముఖ్యమంత్రి చేసిన మరి కొన్ని విలువైన సూచనలు, ఎంత మేరకు అమలుకు నోచుకున్నాయన్న విషయాన్ని ధృవీకరించాల్సింది అటు ప్రభుత్వం-ఇటు ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం.

ఇ.ఎం.ఆర్.ఐ సంస్థతో మూడున్నర సంవత్సరాలు అనుబంధం వున్న వ్యక్తిగా, "ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ" ఆవిర్భావం నుంచి ఆరోహణ వరకు, ఉన్నత శిఖరాలకు చేరుకోవడం దాకా, నా వంతు భూమిక నిర్వహించిన వ్యక్తిగా, ఇ.ఎం.ఆర్.ఐ సమకూరుస్తున్న 108-అత్యవసర సహాయ సేవల విషయంలో ఆ సంస్థపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఒకప్పుడున్న "నమ్మకానికి-విశ్వాసానికి" సంబంధించిన ఒకటి-రెండు అంశాలను పేర్కొంటానిక్కడ.

ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియలో ప్రారంభమైన అత్యవసర సహాయ సేవలు, కులాలకు-మతాలకు-రాజకీయాలకు-సామాజిక వర్గాలకు-ధనిక, బీద తేడాలకు-స్త్రీ, పురుష భేదాలకు అతీతంగా లక్షల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయడం పలు జాతీయ-అంతర్జాతీయ సంస్థలను, పరిశోధకులను ఆసక్తి పరిచాయి. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యానికి సంబంధించి "ప్రయోగాత్మకంగా"-"ఆచరణాత్మకంగా" తొలుత భాష్యం చెప్పింది 108-అత్యవసర సహాయ సేవలను అందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ, అందుకు ప్రోద్బలం-ప్రోత్సాహం అందించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సారధ్యంలోని అలనాటి రాష్ట్ర ప్రభుత్వం. ప్రయివేట్ భాగస్వామి "లాభాపేక్ష" తో ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం-కొనసాగించడం ఆచరణ సాధ్యమవుతుందేమోగాని, "లాభాపేక్ష లేకుండా" ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం మనుగడ సాగించడం తేలికైన విషయం కాదు. అలా సాధ్య పడాలంటే భాగస్వామ్య పక్షాలైన ఇరువురి లో నిబద్ధత కావాలి. ఒకరిపై ఇంకొకరికి "విశ్వాసం-నమ్మకం" వుండాలి. "విశ్వసనీయత" కు ప్రాధాన్యత ఇవ్వాలి కాని, "వంచన" కు ఏ ఒక్కరు పాల్పడినా ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. పలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం సడలుతున్న నేపధ్యంలో సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రక్రియకు కూడా విఘాతం కలిగితే ఇబ్బందులకు గురయ్యేది సామాన్య ప్రజలే-వారిలోను ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారే. ఆ ప్రమాదం పొంచి వుంటే, దానికి బాధ్యులైన వారందరూ నేరస్తులే.

ప్రభుత్వ పరంగా ప్రజలకు లభిస్తున్న ఆరోగ్య-వైద్య రంగ సేవల నిర్వహణలోని లోటుపాటులను అధిగమించడానికి, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ దోహద పడుతుంది. అత్యవసర సహాయ సేవలను, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో సమకూర్చేందుకు ప్రభుత్వ, ప్రయివేట్ వ్యక్తులు కొందరు ఆంధ్ర ప్రదేశ్ లో చొరవ తీసుకోవడం, క్రమేపీ ఇతర రాష్ట్రాలకు వ్యాపించడం జరిగింది. అనవసర జాప్యాలకు, ప్రభుత్వ ఉద్యోగులలో కూరుకుపోయిన అలసత్వానికి అతీతంగా, ప్రభుత్వ పరంగా ప్రజలకు లభ్యమయ్యే అభివృద్ధి-సంక్షేమ పథకాలను మరింత మెరుగుగా-వేగవంతంగా అందించాలన్న ఆశయంతో, భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్న పలు ప్రజాస్వామ్య దేశాల్లో, ఐదారు దశాబ్దాల క్రితం నెలకొన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. సంస్కరణల పుణ్యమా అని, భారతదేశంలోని పలు ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేయడం జరిగింది. వాటి మూసివేతకు కొంత ముందు-వెనుకగా "ప్రభుత్వ ప్రయివేట్ సంయుక్త రంగంలో" స్థాపించిన పరిశ్రమలు (జాయింట్ వెంచర్లు) కూడా యాజమాన్య పరమైన బాలారిష్టాలకు గురై, మూసివేయడం జరిగింది.

మరో వైపు, ప్రయివేట్ రంగంలో నెల కొన్న అనేక సంస్థలు మెరుగైన సేవలను అందించడమే కాకుండా, లాభాలను ఆర్జించడం కూడ మొదలయింది. ప్రయివేట్ పరంగా మెరుగైన పౌర సేవలు లభ్యమవుతున్న నేపధ్యంలో, ప్రభుత్వ ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కేవలం ప్రభుత్వ పరంగా సమకూర్చడం కన్నా, ప్రయివేట్ తోడ్పాటు తీసుకోవడానికి అనువైన-సులువైన-ఆచరణాత్మకమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఫలితంగా రూపుదిద్దుకున్నదే "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం". ఈ ప్రక్రియలో రెండు రకాల భాగస్వామ్యాలు ఆచరణలోకి రాసాగాయి. దీర్ఘకాలిక ఉత్పాదకతను దృష్టిలో వుంచుకుని రూపొందించే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో, ప్రభుత్వ పరంగా తక్కువ పెట్టుబడులతో ఎక్కువ కార్యక్రమాలను అమలుచేసేందుకు, లాభాపేక్షతో పనిచేస్తున్న ప్రయివేట్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మొదటిది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, ప్రభుత్వ బాధ్యతగా అమలుపర్చాల్సిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలను, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో-తోడ్పాటుతో, మరింత మెరుగైన రీతిలో, లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థల భాగస్వామ్యంతో ప్రజలకు సమకూర్చడం రెండో తరహా భాగస్వామ్యం. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో సంక్షేమ కార్యక్రమాలను-అభివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు పరిచేందుకు-దీర్ఘకాలంగా కొనసాగించేందుకు, అవసరమైన ముఖ్య సాధనం, భాగస్వామ్య పక్షాల మధ్య అంగీకారంతో తయారు చేయబడే "ఎంఓయు-అవగాహనా ఒప్పందం".

ప్రభుత్వ శాఖలలోని నైపుణ్యం-నాణ్యతా పరమైన లోటుపాటులను, ప్రయివేట్ రంగంలోని (లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థల) ఆర్థిక పరమైన ఇబ్బందులను, ఉమ్మడిగా అధిగమించేందుకు, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం సరైన ప్రక్రియని ప్రభుత్వం గుర్తించింది. మౌలిక వసతులను ఏర్పాటు చేయగలిగే సామర్థ్యం, దానికి కావాల్సిన తొలి విడత పట్టుబడి సమకూర్చుకోగలిగే స్థోమత, సాంకేతిక పరిజ్ఞానం అమర్చుకోగల శక్తి గల, లాభాపేక్ష రహిత ప్రయివేట్ వ్యక్తులతో-సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని, తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలు అందించే ఆలోచన చేసింది ప్రభుత్వం. పరస్పర సంబంధ-బాంధవ్యాల విషయంలో, భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం-నిబద్ధత-హక్కులు-బాధ్యతల విషయంలో, ఎవరి పాత్ర ఏమిటన్న అంశం క్షుణ్ణంగా పరిశీలించాలని భావించింది ప్రభుత్వం.

పదకొండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో (2007-2012), ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆరోగ్య సేవలందించేందుకు, తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యయనం చేయడానికి, ప్రణాళికా సంఘం కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఒక కార్య నిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రజల ఆరోగ్య-వైద్య అవసరాలకు అనుగుణంగా సమర్థవంతమైన-మెరుగైన-నాణ్యమైన సేవలను పౌరులకు లభ్యమయ్యేలా చేసేందుకు, యావత్ వైద్య రంగం "జాతీయ సంపద" గా మలిచేందుకు, ఒక ప్రధానమైన సాధనంగా "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం" ఉపయోగించుకోవాలని, ఆ ప్రక్రియకు నిర్వచనం వివరిస్తూ పేర్కొంది ప్రణాళికా సంఘం. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలోని ప్రయివేట్ పదానికి పెడార్థాలు చెప్పరాదని, ఆరోగ్యరంగాన్ని పూర్తిగా "ప్రయివేటీకరణ" చేసి, బాధ్యతలనుంచి ప్రభుత్వం తప్పుకుంటున్నదని భాష్యం చెప్పొద్దని ప్రణాళికా సంఘం అభిప్రాయం వెలిబుచ్చింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ లక్ష్యాలు-ధ్యేయాలు చేరుకునేందుకు, అందులో ప్రధాన భాగమైన "గ్రామీణ అత్యవసర ఆరోగ్య రవాణా సేవల పథకం" అమలుకు-ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభమై పది రాష్ట్రాలకు పాకిన 108-అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడింది.

ఫిబ్రవరి 8, 2005 న సత్యం కంప్యూటర్స్ చైర్మన్ వ్యవస్థాపక అధ్యక్షుడుగా, ఇ.ఎం.ఆర్.ఐ ఆవిర్భావం జరిగింది. తన కుటుంబ సభ్యులే "ప్రమోటర్స్" గా అతి చాకచక్యంగా సొసైటీ నియమ-నిబంధనలను రూపొందించారు రాజు గారు. "భద్రత మీ హక్కు" అన్న నినాదంతో, ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థగా, ఒకే గొడుకుకింద-ఒకే వ్యవస్థ నిర్వహణలో, వైద్య-అగ్నిమాపకదళ-పోలీసు సంబంధిత అత్యవసర సహాయ సేవలను అందించేందుకు నెలకొల్ప బడిందే అత్యవసర యాజమాన్య నిర్వహణా పరిశోధనా సంస్థ. తొలుత ప్రభుత్వం నుంచి ఏ రకమైన ఆర్థిక సహాయం ఆశించకుండా, సగటు పౌరుడిపై ఏ విధమైన ఆర్థిక భారం పడకుండా, వీరు-వారు అనే తేడా లేకుండా, అందరికీ లభ్యమయ్యేలా నిర్వహించేందుకు ఉద్దేశించబడిన ఇ.ఎం.ఆర్.ఐ అందుకనుగుణంగానే తన లక్ష్యాలను-ధ్యేయాలను రూపొందించుకుంది. End of Part-I

Saturday, December 18, 2010

ఆదర్శ ఉపాధ్యాయుడు "మారం రాజు సత్యనారాయణ రావు" : వనం జ్వాలా నరసింహారావు

డిసెంబర్ 19, 2010 న "అధ్యాపక వృత్తిలో"
ఏబై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో

మాటల్లో ఆత్మీయతకు-చేతల్లో నిబద్ధతకు-ఆద్యంతం నిజాయితీకి
పర్యాయపదం మా "మారం రాజు సత్యనారాయణ రావు"
వనం జ్వాలా నరసింహారావు

ఖమ్మం కళాశాలలో పీయుసి, మొదటి రెండు సంవత్సరాల బీయెస్సీ డిగ్రీ కోర్సు పూర్తి చేసుకుని మిగిలిన ఏడాది చదువు కొనసాగించడానికి హైదరాబాద్ న్యూ సైన్స్ కాలేజీలో నేను చేరిన ఏడాదే, 1965 లో, ఖమ్మం కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా బదిలీ మీద వచ్చారు మారం రాజు సత్యనారాయణ రావు గారు. రావడంతోనే ఖమ్మం మామిళ్లగూడెంలో వున్న మా ఇంట్లో దక్షిణం వైపున్న మూడు గదుల్లో అద్దెకు చేరారు. అప్పట్లో మా ఇంట్లో కాలేజీ లెక్చరర్లు అద్దె కుండే ఆనవాయితీ కొంతకాలంగా సాగుతోంది. కొన్నాళ్లు ఎకనామిక్స్ లెక్చరర్ జగన్మోహన రావు గారు, ఇంగ్లీషు లెక్చరర్‌ కెవైఎల్ నరసింహారావు గారు, అంతకు ముందు మరో నరసింహారావు గారు మా ఇంట్లో అద్దెకుండేవారు. అయితే వారికీ మారం రాజు గారికి చాలా తేడా వుందనాలి. మిగిలిన వారిలా కాకుండా, అద్దె కొచ్చిన మరుక్షణం నుంచే మా కుటుంబీకులందరితో కలిసిమెలిసి పోయారు. ఆయన అద్దెకున్నాడని మేము కాని, మేము స్వంతదారులమని ఆయన కాని, ఆయన శ్రీమతి సీతమ్మ గారు కాని ఏనాడూ భావించలేదు. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. మారం రాజు సత్యనారాయణ రావు గారు మా అమ్మ వైపు సమీప బంధువై తే, ఆయన శ్రీమతి సీతమ్మ గారు మా నాన్న వైపు సమీప బంధువు కావడం కూడా ఇరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరగడానికి దోహదపడింది. రెండు వైపులా వున్న బంధుత్వం ప్రకారం ఆయన నాకు బాబాయి వరుసై తే, ఆమె నాకు పిన్ని వరుసయ్యేది. అలానే పిలుస్తుండేవాడిని నేను.

ఇంతలో 1966 మార్చ్ నెలలో నా డిగ్రీ చదువు పూర్తి చేసుకుని ఖమ్మం సమీపంలోని మా గ్రామం వనం వారి కృష్ణా పురం చేరుకున్నాను నేను. మూడు సంవత్సరాలు మా వూళ్లో గడిపినప్పటికీ, ఖమ్మం ఇంట్లో కూడా వుండడానికి వస్తుండేవాడిని. ఆ రోజుల్లో ఖమ్మం సమితి కింద వున్న మా గ్రామాల్లో రాజకీయ పోరు రాయలసీమ ముఠా తగాదాల మోతాదులో, వాటిని మరిపించే స్థాయిలో వుండేవి. కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గంతో, కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) తోడ్పాటుతో ఆధిపత్య పోరులో హత్యా రాజకీయాలు నడుస్తుండేవి. ఇరు పక్షాలకు చెందిన ముఖ్య నాయకులెందరో హత్యకు గురయ్యారు కూడా. అప్పట్లో సీపీఎం కు మా గ్రామాల్లో నాయకత్వం వహిస్తున్న స్వర్గీయ గండ్లూరి కిషన్ రావుకు మారం రాజు సత్యనారాయణ రావు గారి భార్య సీతమ్మగారు స్వయానా సోదరి కావడంతో, ఆయన మా ఇంటికి తరచూ వస్తుండేవారు. అదే రోజుల్లో మా వూళ్ళో వుంటున్న నాకు కూడా సీపీఎం పట్ల వున్న అభిమానంతో గ్రామ రాజకీయాల్లో ఆసక్తి కలగడం, కిషన్ రావు మీద గౌరవం వుండడం, మారం రాజు గారి దగ్గర కొచ్చే ఆయనను-ఆయన ద్వారా మారం రాజు గారిని తరచుగ కలవడానికి అవకాశం కలిగించింది. మారం రాజు గారు, నాకు తెలిసినంతవరకు ఏ పార్టీకి చెందిన వాడు కాదు. కమ్యూనిస్టులతో సహా అందరితో ను సన్నిహిత సంబంధాలుండేవి. కాకపోతే అధ్యయన పరంగా, రాజకీయ శాస్త్ర అధ్యాపకుడిగా మార్క్సిజం అన్నా-కమ్యూనిజం అన్నా వీలున్నప్పుడల్లా "మేధో మధనానికి" సిద్ధపడేవారు. బహుశా అదే మా ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యానికి దారి తీసిందనుకుంటాను. బహుశా మొదట్లో గండ్లూరి ప్రభావం, ఆ తర్వాత స్థానిక డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి గారి వంటి "మేధావుల" ప్రభావం ఆయన మీద కొంత పడి అధ్యయన పరంగా ఆ దృక్ఫదం వున్న వారితో ఇతరులకంటే కొంచెం ఎక్కువ సాన్నిహిత్యం కలిగుండా లి.

మారం రాజు సత్యనారాయణ రావు గారి విద్యార్థుల్లో కమలాపురం గ్రామానికి చెందిన వనం రంగారావు (నాకు బంధువు కూడా) ఒకరు. పొలిటికల్ సైన్స్ తరగతుల్లో ఆయన పాఠాలు చెప్పే విధానాన్ని ఎంతో అభిమానంగా-గౌరవంగా మా మిత్రులకు వివరించేవాడు. చక్కటి సందర్భోచిత ఉదాహరణలతో వర్తమాన రాజకీయాలకు అన్వయించుకుంటూ, పొలిటికల్ సైన్స్ - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పాఠ్య పుస్తకాల్లోని విషయాలను సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఎలా ఆయన చెప్పేవాడో మాకు వివరించేవాడు. మా ఇంట్లో వుంటున్న మారం రాజు గారి దగ్గరకు కాలేజీ అయింతర్వాత కూడా వచ్చి సందేహాలను తీర్చుకునేవాడు రంగారావు. ఆ రోజుల్లో ఆయన దగ్గర తాను నేర్చుకున్న విద్యే తనకెంతగానో తోడ్పడిందని ఇప్పటికీ అంటుంటాడు రంగారావు. నేను డిగ్రీలో సైన్స్ చదువుకున్నా, పోస్టు గ్రాడ్యుయేషన్ "పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్" లో చేయడానికి స్ఫూర్తి కలిగింది బహుశా సత్యనారాయణ రావు గారి సాన్నిహిత్యం వల్లనే అనాలి. ఆయన రాజకీయ శాస్త్రం లోని విషయాలను తీరికున్నప్పుడల్లా చెప్పే పద్దతికి ఆకర్షితుడనైన నేను, అవకాశం దొరకగానే ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో చేశాను.

నాకు అప్పుడప్పుడూ వర్తమాన రాజకీయాల గురించి, గత కాలం నాటి రాజకీయాలను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించడం గురించి, పత్రికల్లో వ్యాసాలు రాసే అలవాటుంది. నేనేదైనా అంశం గురించి రాయదల్చుకున్నప్పుడు, ఆ విషయాల్లో ప్రవేశం, ప్రావీణ్యం వున్న వారితో ముచ్చటించడం తప్పనిసరిగా చేస్తుంటాను. విషయ సేకరణకు నేను సంప్రదించే వారిలో అతి ముఖ్యుడు మారం రాజు సత్యనారాయణ రావు గారు. హైదరాబాద్ లో వుంటున్న వాళ్లబ్బాయింట్లో ఆయన వున్నప్పుడల్లా ఆయనతో ముచ్చటించడానికి వెళ్తుంటాను. కలిసినప్పుడల్లా ఒక ఆర్టికల్ రాయడానికి కావల్సినంత సమాచారం ఆయనిస్తుంటారు. ఇటీవల కాలంలో తరచుగా ఆయనను కలిసే అవకాశం దొరుకున్నదలా.

వారసత్వ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో ఎలా అంతర్భాగం అయ్యాయి, ఎలా ధిక్కార పర్వాల-అసంతృప్తి కాండల అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్థానం సాగింది అన్న విషయాన్ని గురించి నేను రాసిన ఆర్టికల్ కు విషయాన్ని సమకూర్చింది మారం రాజు గారే. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావపు తొలినాళ్లలోనే, పార్టీని-పార్టీ కార్య కలాపాలను ప్రభావితం చేసిన మితవాద భావాల "మాడరేట్ల" ప్రభావం క్షీణించి, మిలిటెంట్ భావాల వారి పలుకుబడి పెరగడంతో, 1907 లో పార్టీలో ఎలా చీలి కొచ్చింది నాకు వివరించింది ఆయనే. మాడరేట్ల "కన్వెన్షన్" బాల గంగాధర తిలక్ ప్రభృతులను పార్టీ నుంచి బహిష్కరించడంతో వారంతా "నేషనలిస్ట్ పార్టీ" పేరుతో సమావేశమైన నాడే , వంద సంవత్సరాల పూర్వమే ధిక్కార స్వరాలకు అంకురార్పణ జరిగిన విషయాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పింది మారం రాజు గారే. నీలం-కళా వెంకట్రావుల వ్యూహంలో, మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న ప్రకాశం పంతులు పదవి కోల్పోయి, కాంగ్రెస్ వదిలి, తిరిగి స్వగృహ ప్రవేశం చేసి, అదే సంజీవరెడ్డి ప్రోద్బలంతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి ఎలా అయింది, మద్య నిషేధం సాకుగా, సంజీవరెడ్డి బలపర్చిన ప్రకాశం పంతులు రాజీనామా చేయడంతో గవర్నర్ పాలన విధించిన విధానం, శాసన సభను రద్దుచేయడం నాకు చెప్పింది ఆయనే. కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పాగా పుల్లారెడ్డి, బొమ్మ కంటి సత్యనారాయణ రావు ప్రభృతులు నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా పార్టీని వదిలి, "డెమోక్రాటిక్ పార్టీ” ని స్థాపించిన వైనం ఆయనకు తెలిసినంతగా ఇతరులకు తెలవకపోవచ్చునేమో! బొమ్మ కంటి చెప్పిన "హైదరాబాదు స్వాతంత్ర్య పోరాటం" నేను రాయడానికి ప్రోత్సహించింది మారం రాజు గారే.

ఇంటర్మీడియట్, బియ్యే, ఎంఏ (పొలిటికల్ సైన్స్) హైదరాబాద్ నిజాం కళాశాలలో ముగించుకున్న మారం రాజు సత్యనారాయణ రావు గారు "ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గాల" మీద 1979-1983 మధ్య కాలంలో పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ తెచ్చుకున్నారు. ఆయనకు "పీహెచ్‌డీ" వచ్చిన విషయం అందరికి తెలిసే అవకాశం వున్నా, తన పరిశోధనలో భాగంగా ఎవరెవరి ని కలిసిందనే విషయం బహుశా చాలామందికి తెలియకపోవచ్చునేమో! ఆయన కలిసి విషయ సేకరణలో అభిప్రాయాలు పొందిన ప్రముఖుల్లో నలుగురు మాజీ ముఖ్యమంత్రులు, స్వర్గీయులు కాసు బ్రహ్మానంద రెడ్డి, పీవీ నరసింహా రావు, టంగుటూరి అంజయ్య, కోట్ల విజయ భాస్కర రెడ్డి వున్నారు. పీవీ గారిని కలిసినప్పుడు మిగతా విషయాలకు అదనంగా "భూ సంస్కరణల" విషయం ప్రస్తావనకొచ్చింది. జవాబును దాటవేసిన పీవీ, ఆ విషయాలను గురించి నిష్పక్షపాతంగా తెలుసుకోవాలంటే, తన చుట్టు పక్కలున్న వారిని, తన ఆంతరంగికులైన వ్యక్తిగత కార్యదర్శిని, ఆఖరుకు తన డ్రైవర్‌ను కలిస్తే బాగుంటుందని సూచించాడట. కాసు బ్రహ్మానందరెడ్డి ఆయన అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెప్పడమే కాకుండా, మరిన్ని వివరాలకు ఆయన మంత్రివర్గ సహచరుడైన రొండా నారపరెడ్డి గారిని కలవమని సలహా ఇవ్వడం, ఆయనను కలిసి మారం రాజు గారు తనకు అవసరమైన సమాచారాన్ని సేకరించడం జరిగింది. సత్యనారాయణ రావు గారు కలిసిన మరో ప్రముఖ వ్యక్తి స్వర్గీయ కల్లూరి చంద్రమౌళి గారు. ఎడిన్ బరో లో పీహెచ్‌డీ చేసిన కల్లూరి ఒక పల్లెటూరు రైతులా మారం రాజు గారితో ముచ్చటించారు. ఆయన కలవడానికి వెళ్లిన సత్యనారాయణ రావు గారికి "అల్లుడి మర్యాదలు" చేశారాయన. విజయభాస్కర్ రెడ్డిని కలిసేందుకు వెళ్లారట. ఆయన కలిసిన రోజున బిజీగా వున్న విజయభాస్కర్ రెడ్డి, మర్నాడు రమ్మని చెప్పారట. మర్నాడు కూడా ఆయన బిజీగా వుండొచ్చుకదా అన్న సందేహం వ్యక్త పరిచారు మారం రాజు. వెంటనే, తన ఆంతరంగిక సిబ్బందిలో ఒకరిని పిలిచి, మర్నాడు మారం రాజు వచ్చిన సమయంలో, తాను "బాత్ రూమ్” లో తప్ప ఎక్కడున్నా-ఎవరితో మాట్లాడుతున్నా, ఆయనను తన దగ్గరకు తీసుకురమ్మని ఆదేశాలిచ్చారట. ఆయన మాట ప్రకారమే, ఐదారు గంటల సమయం మారం రాజు గ్రంధం కొరకు కేటాయించారట. అదీ, విజయభాస్కర్ రెడ్డి "కమిట్‌మెంట్" అన్నారు సత్యనారాయణ రావు గారు నాతో.

1960 లో ఎంఏ పూర్తిచేసిన మారం రాజు గారు మొదట సిద్దిపేట కాలేజీలోను, తర్వాత రాజమండ్రి, ఖమ్మం, నల్గొండ, సత్తుపల్లి కళాశాలలలోను పొలిటికల్ సైన్స్ లెక్చరర్ గా పనిచేశారు. రెండవ పర్యాయం ఖమ్మంలో పనిచేస్తున్నప్పుడు అప్పటి సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి రాం రెడ్డి గారు సత్యనారాయణ రావు గారి ప్రతిభను గుర్తించి, అక్కడ పనిచేసేందుకు ఆయనను ఒప్పించారు. డాక్టర్ మారం రాజు సత్యనారాయణ రావు అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో ఒక్క ఉపకులపతి పదవి మినహా అన్ని పదవులను నిర్వహించారు. రిజిస్ట్రార్ గాను, రాజకీయ శాస్త్రం విభాగానికి ఆచార్యుడు గాను పనిచేసే రోజుల్లో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిశోధనాత్మక గ్రంథం రాశారు. రాజకీయ శాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలపై పుస్తకాలు రాశారు. 1983 ఎన్ టీ ఆర్ ఎన్నికల విజయంపై "ఎన్నికల రాజకీయాలు" అనే పరిశోధనాత్మక గ్రంథం రాశారు. ఇందిరా గాంధీ మెదక్ లోక్ సభకు పోటీ చేసి గెలిచినప్పుడు, ఎన్నికల ముందు, ఎన్నికల అనంతరం నియోజక వర్గంలో అధ్యయనం చేసేందుకు మారం రాజు గారు విస్తృతంగా పర్యటించారు. నారాయణ్ ఖేడ్ సమీపంలోని ఒక గ్రామంలో మొత్తం ఆరువందల ఓట్లలో ఒకే ఒక్క ఓటు ఇందిరకు పడడం ఆశ్చర్యం కలిగించిందంటారాయన. ఆ గ్రామ పెద్ద (వకీల్ సాబ్) చెప్పిన వారికే తాము వోటు వేశామని గ్రామస్తులు చెప్పిన విషయాన్ని ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటుంటారు మారం రాజు గారు.

మారం రాజు సత్యనారాయణ రావు గారిది విలక్షణమైన వ్యక్తిత్వం. తనకు చేతనైనంత సహాయపడాలనే మనస్తత్వం ఆయనను చాలా మందికి సన్నిహితుడిని చేసింది. పాతిక-ముప్పై సంవత్సరాల క్రితం మా బంధువుల ఇళ్లల్లో వివాహాలు జరిగినప్పుడు, ఇప్పటిలా కాకుండా, అనేక విషయాల్లో "బరువు బాధ్యతలు" నిర్వహించాల్సిన వ్యక్తుల అవసరం బాగా వుండేది. ఇప్పటిలా అప్పట్లో అన్నీ కాంట్రాక్టుకు ఇచ్చే ఆనవాయితీ లేదు. నాకు తెలిసినంతవరకు, చాలా పర్యాయాలు, చాలా మందికి ఆ విషయాల్లో తోడ్పడి "ఆదుకున్న వ్యక్తి" మారం రాజు సత్యనారాయణ రావు గారు. వివాహాల్లో ఆడ పెళ్లి వారి పక్షాన "నిలబడి", మగ పెళ్ళి వారికి కావాల్సిన సామానులను బధ్ర పరిచిన "స్టోర్స్" బాధ్యతను ఏ ఇబ్బందులు కలగకుండా అను క్షణం నిర్వహించే "ఆత్మీయుడు" గా మారం రాజు సత్యనారాయణ రావు గారిని జ్ఞాపకం చేసుకోని బంధువులు బహుశా మాలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదే మో!

ఇలాంటి, అలాంటి మహనీయుడు మా బాబాయి మారం రాజు సత్యనారాయణ రావు బాబాయి గారు "అధ్యాపక వృత్తిలో" ఏబై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో నమస్కార పూరిత అభినందనలు తెలియ చేసుకుంటున్నాను. 1983 లో ఆయనకు "ఉత్తమ ఉపాధ్యాయుడి" పురస్కారం వచ్చిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, ఆయనను అభిమానించే అందరికీ ఆ విషయాన్ని మరో మారు గుర్తు చేస్తున్నాను. నా భార్య శ్రీమతి విజయ లక్ష్మి, నా కూతురు టీవీ 9 ప్రేమ మా పిన్ని సీతమ్మ గారి (మా అమ్మాయి ప్రేమగా "తాతమ్మ" అని పిలిచే ది) తో వున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

Monday, December 6, 2010

"104 సంచార వాహన సేవలు" - అపోహలు, ఆరోపణలు, వాస్తవాలు: వనం జ్వాలా నరసింహారావు



వనం జ్వాలా నరసింహారావు, కన్సల్టెంటు హెచ్ఎంఆర్ఐ

లాభాపేక్ష రహిత ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో, ఆరోగ్య నిర్వహణ-పరిశోధనా సంస్థ (హెచ్‍‍ఎంఆర్ఐ) సమకూరుస్తున్న "104 సంచార వాహన సేవల" (నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవలు) నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు బదలాయించింది. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ విడుదల చేసిన ఉత్తర్వులో పర్యవేక్షణ బాధ్యతలను జాయింట్ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వ భవిష్యత్తులో ఏర్పాటు చేయబోతున్న కమ్యూనిటీ హెల్త్ న్యూట్రిషన్ క్లస్టర్లకు 104 సంచార వాహన సేవలను అనుసంధానించనున్నట్లు కూడా పేర్కొంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా సేవలను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు, కొత్త యాజమాన్య విధానాన్ని రూపొందించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) కు మూడు కిలోమీటర్ల ఆవల ఉండే గ్రామాల్లో ప్రసూతి, మాతా శిశు సంరక్షణ, దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, హృద్రోగం, రక్తపోటు, మూర్ఛ వంటి వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య పరీక్షలు-మందుల పంపిణీ కోసం నిర్ధారిత తేదీల్లో ఆయా గ్రామాల్లోకి వెళ్లేందుకు "104 సంచార వాహన సేవలు" ఏర్పాటు చేసి వాటి నిర్వహణ భాద్యతను హెల్త్ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ కు అప్పచెప్పింది ప్రభుత్వం 2009 లో. వాహనాలలో పనిచేస్తున్న నాలుగు రకాల సిబ్బంది (డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లేబొరేటరీ టెక్నీషియన్, ఫార్మసిస్ట్), "హెచ్‍‍ఎంఆర్ఐ యాజమాన్యంతో కొన్ని విషయాల్లో విభేదించి" నవంబర్ 9 నుంచి సమ్మెకు దిగారని, సమ్మె పరిష్కారానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, మూడు వారాలకు పైగా "104 సంచార వాహన సేవలు" స్తంభించి పోయాయని, అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం ప్రారంభించిన సేవల నిర్వహణలో అవరోధాలొస్తే, వాటిని అధిగమించడానికి, ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం, బాధ్యత ప్రభుత్వానికుందనే విషయం ఎవరూ కాదనరు. కాకపోతే, 104 సంచార వాహన సేవల సిబ్బంది సమ్మెను విరమింప చేయడంలో హెచ్ఎంఆర్ఐ యాజమాన్యం విఫలమైందని, విధుల నిర్వహణలో సక్రమంగా వ్యవహరించలేదని వస్తున్న వార్తలు వాస్తవం కాదు.

104 సంచార వాహన సేవలు ఆరంభించడానికి ఒక నేపధ్యం వుంది. దాని వెనుక ఒక మహత్తర ఆశయం వుంది. రాష్ట్రంలోని సుమారు 1600 కు పైగా వున్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, 12000 కు పైగా వున్న ఉప కేంద్రాలు వివిధ కారణాల వల్ల అనుకున్న రీతిలో ఆరోగ్య వైద్య సేవలందించే స్థితిలో లేకుండా పోవడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) కు మూడు కిలోమీటర్ల ఆవల వున్న సుమారు 24000 కు పైగా గ్రామాల ప్రజలు కనీస ఆరోగ్య వైద్య సదుపాయాలకు కూడా నోచుకోక పోవడం అనే నగ్న సత్యాన్ని ఆరోగ్య నిర్వహణ-పరిశోధనా సంస్థ (హెచ్‍‍ఎంఆర్ఐ) గుర్తించి "నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవల" పథకం నమూనాను రూపొందించింది. అప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో ఇఎంఆర్ఐ ఆధ్వర్యంలో 108 అత్యవసర సహాయ సేవలు, హెచ్‍‍ఎంఆర్ఐ ఆధ్వర్యంలో 104 (1056) ఆరోగ్య సమాచార హెల్ప్ లైన్ సేవలు ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో రూపు దిద్దుకుని విజయవంతంగా నడుస్తున్నాయి. 2008 జులై-ఆగస్ట్ నెలల్లో హెచ్‍‍ఎంఆర్ఐ కి చెందిన వైద్య-యాజమాన్య నిపుణులు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డికి "నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవల" పథకం నమూనాను వివరించడానికి వెళ్లారు. అప్పటి ఆర్థిక శాఖ మంత్రి - ఇటీవల వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య, ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పీకే అగర్వాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె. హరినారాయణ, నాటి హెచ్ఎంఆర్ఐ సంస్థ చైర్మన్ రామలింగ రాజుల సమక్షంలో నమూనా పథకం పరిశీలనా సమావేశం జరిగింది. పవర్ పాయింట్ ప్రజంటేషన్ మొదటి స్లయిడ్ చూస్తూనే పథకం గురించి అర్థం-అవగాహన చేసుకున్న డాక్టర్ రాజశేఖర రెడ్డి "ఐ యాం సోల్డ్" అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విధి విధానాలను రూపొందించిన తర్వాత ప్రభుత్వం, హెచ్‍‍ఎంఆర్ఐ సంస్థతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుని "నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవల" ను పైలట్ గా ఆరంభించి కొనసాగించింది.

పథకం అమలు విషయంలో జరిగిన చర్చలో ముఖ్యమైంది సంచార వైద్య వాహనాలలో డాక్టర్లు వుండాలా-వద్దా అనే విషయం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో నియమించబడిన డాక్టర్లలో చాలా మంది అసలు డ్యూటీలో చేరక పోవడమో, చేరిన వారు ఆ గ్రామాల్లో వుండకపోవడమో, వున్న కొద్ది మంది వీలైనంత త్వరలో పట్టణాలకు బదిలీ చేయించుకుని వెళ్లడమో, ఎవరైనా పట్టుదలగా పని చేద్దామనుకుని వుంటే వారికి కనీస మౌలిక సదుపాయాలు ఆసుపత్రులలో లేకపోవడమో అందరికీ తెలిసిన విషయం. ఇక ఉప కేంద్రాల విషయానికొస్తే అవి కేవలం నామ మాత్రంగానే పనిచేసేవి. వున్న 1600 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసేందుకు వైద్యులు కరువైనప్పుడు సంచార వాహనాల్లో పనిచేసేందుకు ఎవరూ ముందుకు రారనేది ముఖ్యమంత్రితో సహా అందరూ గుర్తించారు. వాహనాల్లో వైద్యులు లేకపోయినా, హైదరాబాద్ లోని 104 కాల్ సెంటర్ కు అనుబంధంగా పనిచేస్తున్న డాక్టర్ల తోడ్పాటుతో, సుశిక్షుతులైన సిబ్బందిని వాహనాల్లో పంపి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన మందులు ఫార్మసిస్టు ద్వారా పంపిణీ జరగాలని నిర్ణయం జరిగింది. ప్రభుత్వం తో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం మేరకు శాయశక్తులా మారుమూల గ్రామాల్లో నివసించే పేద వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, మందులు పంపిణీ చేయడం హెచ్ఎంఆర్ఐ ఒక సామాజిక బాధ్యతగా తీసుకుంది. అందరికీ ఆరోగ్యం అన్న మహత్తర ఆశయంతో, చిత్త శుద్ధితో, అంకిత భావంతో 104 సంచార వాహన సేవలు నిరంతరాయంగా అందించిన హెచ్ఎంఆర్ఐ ఏ నాడూ వెన్ను చూపలేదు.

నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవల పరిధిలోకి సుమారు నాలుగు కోట్ల మంది గ్రామీణులను తీసుకురావాలనే లక్ష్యంగా కార్యక్రమం అమలు బాధ్యతలను చేపట్టిన హెచ్ఎంఆర్ఐ సంస్థ, దాన్ని పూర్తి స్థాయిలో సాధించడం జరిగింది. హైదరాబాద్ మినహా మిగతా 22 జిల్లాల్లో 475 సంచార వాహనాల ద్వారా, 22500 సర్వీసు పాయింట్లలో, సమ్మెకాలం మినహా అన్ని రోజుల్లోను నిరంతరాయంగా సేవలందించింది సంస్థ. ఏ మాత్రం రహదారి సౌకర్యాలు లేని మారుమూల కుగ్రామాలకు, తండాలకు, గిరిజన ప్రాంతాలకు వాహనాలు పోయి సేవలందించాయి. గోదావరి పాపికొండలు పరిసర ప్రాంతాలలో పడవలోనే ఆరోగ్య సేవలందించడం జరిగింది. సుమారు రెండు కోట్ల నలబై లక్షల మంది ప్రజలు ఇప్పటి వరకు ఈ సేవల ద్వారా లబ్ది పొందారు. వీరిలో సుమారు 13 లక్షల మంది గర్భిణీ స్త్రీలు, 15 లక్షల మంది పిల్లలు, 30 లక్షల మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, 3 లక్షల 50 వేల మంది చక్కెర వ్యాధి పీడితులు, 7 లక్షల మంది రక్త పోటుతో బాధ పడేవారున్నారు. సుమారు 23 లక్షల పాఠశాల విద్యార్థులు కూడా లబ్ది పొందిన వారిలో వున్నారు. రోగ నిర్ధారణ తర్వాత వీరు, సగటున ఆరేడు పర్యాయాలు, సంచార వాహనాల సహాయం పొందారు. ప్రతి గర్భిణీ స్త్రీ సగటున మూడు సార్లు వాహనం దగ్గర కొచ్చి సేవలను పొందింది. లబ్ది పొందిన వారిలో అధిక సంఖ్యా కులు వెనుక బడిన వర్గాలకు, షెడ్యూల్డు కులాలు-తెగలకు చెందిన వారే.

ఈ సేవలన్నీ అందించడానికి హెచ్ఎం ఆర్ఐ యాజమాన్యానికి క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న మూడు వేల మంది సిబ్బంది, వారిని పర్యవేక్షించిన జిల్లా స్థాయి సీనియర్ ఉద్యోగులు తోడ్పడ్డారు. నవంబర్ 10, 2010 వరకు ఏ ఒక్కరు కూడా అలసత్వం ఏ సందర్భంలోను కనబర్చలేదు. మరెందుకు వారంతా సమ్మె చేశారు? సమ్మే చేయాల్సిన ఆగత్యం ఏమిటి? యాజమాన్యం పొరపాటే మైనా వుందా? ఎవరైనా పురికొల్పారా? వారు ఆశించిందేమిటి? చివరకు జరిగిందేమిటి? ఆరోగ్య వైద్య రంగంలో సంస్కరణల పేరుతో "కమ్యూనిటీ హెల్త్ న్యూట్రిషన్ క్లస్టర్ల" పథకం అమలు చేసేందుకు కొద్ది నెలల క్రితం రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆ పథకాన్ని 104 సంచార వాహన సేవలకు అనుసంధానం చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేసింది. సంస్కరణల పేరుతో ప్రభుత్వం తీసుకు రాదల్చిన మార్పుల వివరాలను, క్లస్టర్లకు 104 సంచార వాహన సేవల అనుసంధానం చేసే ఆలోచనను, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆ సేవలను నిర్వహిస్తున్న హెచ్ఎంఆర్ఐ యాజమాన్యానికి తెలియ చేసినట్లయితే బాగుండేదేమో! నిర్ణయం తీసుకునే ముందు వారితో చర్చించి వుండాల్సింది.

మాతా శిశు ఆరోగ్య సంరక్షణ మెరుగు పరచడం, పౌష్టికాహార లోపాలను అధిగమించడం ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య వైద్య రంగంలో ప్రవేశపెట్ట దల్చిన సంస్కరణలలో భాగంగా "సాముదాయిక ఆరోగ్య పౌష్టికాహార క్షేత్రాల" ను (కమ్యూనిటీ హెల్త్ న్యూట్రిషన్ క్లస్టర్లు-సీ హెచ్ ఎన్ సీ) గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పాలని భావించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వైద్య సేవలందించాల్సిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు (పీ హెచ్ సీ) దాదాపు నిర్వీర్యమై పోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పదల్చుకున్న "సీ హెచ్ ఎన్ సీ" లు, గ్రామాలు-పీ హెచ్ సీ), సబ్ సెంటర్ల మధ్య సరాసరి అనుసంధానం కలిగించే వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని ఆ పథకం రూపకర్త, ఆరోగ్య-వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీవీ రమేశ్ ధృఢంగా నమ్ముతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన నున్న 360 సాముదాయిక ఆరోగ్య పౌష్టికాహార క్షేత్రాలలోని ఒక్కొక్క క్లస్టర్ ద్వారా లక్ష-రెండు లక్షల మధ్య జనాభాకు, సమగ్ర ప్రాధమిక ఆరోగ్య సేవలు లభించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. "సీ హెచ్ ఎన్ సీ" కి కేంద్ర బిందువుగా వుండే "సాముదాయిక ఆరోగ్య కేంద్రం" (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) లేదా ఏరియా ఆసుపత్రి, దాని చుట్టు పక్కలున్న నాలుగు నుంచి పది వరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు రిఫరల్ యూనిట్ గా పనిచేస్తుంది. క్లస్టర్ పరిధిలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల-ఉప కేంద్రాల పనితీరును పర్యవేక్షించే బాధ్యత క్లస్టర్ ఆసుపత్రిలో వుండే క్లస్టర్ ఆరోగ్యాధికారికి వుంటుంది. 2011 సంవత్సరానికల్లా ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఇరవై నాలుగు గంటలు పనిచేసే దిగాను, దాని చుట్టు పక్కలున్న ప్రతి ఉప కేంద్రానికి నెలకు రెండు పర్యాయాలు వెళ్ళి ఆరోగ్య సేవలందించే "పీ హెచ్ సీ సంచార వాహనం" గాను వుండే విధంగా ప్రణాళిక సిద్ధం చేసింది ప్రభుత్వం. ఆ వాహనాలలో డాక్టర్ వుండే ఏర్పాటు కూడా చేసింది.

ప్రాధమిక ఆరోగ్య వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలు గ్రామీణ ప్రజలకు ఉపయోగ పడడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హెచ్ఎంఆర్ఐ యాజమాన్యం తన సంపూర్ణ సహకారాన్ని ప్రకటించింది. క్లస్టర్ పథకంలో భాగంగా ఆరంభం కానున్న "పీ హెచ్ సీ సంచార వాహనం" 104 సంచార వాహన సేవలకు ప్రత్యామ్నాయం కాబోతున్న విషయం క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సుమారు మూడు వేల మంది హెచ్ఎం ఆర్ఐ సిబ్బందికి అధికారికంగా తెలియకపోవడం, జిల్లా స్థాయి అధికారుల నుంచి అనధికారికంగా తప్పుడు సమాచారం అందడం, వారిలో ఉద్యోగ రీత్యా అభధ్రతా భావం నెల కొనడానికి దారితీసింది. సంస్కరణలలో రానున్న మార్పుల విషయంలో పెద్దగా చర్చ జరగలేదు. క్షేత్ర స్థాయి సిబ్బందిలో పెరుగుతున్న అసహనాన్ని గమనించిన హెచ్ఎం ఆర్ఐ యాజమాన్యం, సరైన సమాచారం అధికారికంగా పొందేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విస్తృత స్థాయిలో సంస్కరణల విషయంలో చర్చ జరుగుతే బాగుంటుందని భావించిన హెచ్ఎంనఆర్ఐ యాజమాన్యం ఈ విషయాన్ని పలువురు విజ్ఞుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. నాటి ముఖ్యమంత్రి రోశయ్యతో సహా, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడును, టిఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర రావును కలిసింది.

ఈ నేపధ్యంలో 104 సంచార వాహన సేవల అమలులో హెచ్ఎంఆర్ఐ సంస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందానికి అనుగుణంగా ఏప్రియల్ 2010 నుండి అక్టోబర్ 2010 వరకు సంస్థకు అందాల్సిన రు. 110 కోట్లకు గాను ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమీషనర్ విడుదల చేసింది కేవలం రు. 57 కోట్లు మాత్రమే. మూడు నెలల నిర్వహణ వ్యయాన్ని ఒకే సారి ముందస్తుగా విడుదల చేయాల్సిన ప్రభుత్వం ఆ నిబంధనకు కట్టుబడలేదు. "ఏపీహెచ్ఎంహెచ్ఐడీసీ" నుంచి సరఫరా కావాల్సిన మందులు నాలుగైదు నెలలుగా సకాలంలో అందడం జరగలేదు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వాహన సిబ్బంది గ్రామాల్లోకి పోయినప్పుడు ప్రజల నుంచి నిరసన ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కలిగాయి. క్లస్టర్ పథకం అమలవుతే ఉద్యోగ భద్రత వుండదని భావించిన సిబ్బంది మరికొన్ని సాకులు చూపి సమ్మెకు దిగింది. వారి డిమాండ్లన్నీ నెరవేర్చడం కష్టమైనవే కాకుండా, హెచ్ఎంఆర్ఐ పరిధిలో లేనటువంటివి. ప్రభుత్వం తీసుకున్న చొరవ కూడా సమ్మె పరిష్కారానికి దోహద పడలేదనే విషయం ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులో కూడా స్పష్టంగా వుంది. సమ్మెను పరిష్కరించి 104 సంచార వాహన సేవలను పునరుద్ధరించేందుకు యాజమాన్యం చేతనైనంత చేసింది. ట్రేడ్ యూనియన్ నాయకులతో చర్చలు జరిపింది. ఆ యూనియన్ అనుబంధ పార్టీ సీపీఎం నాయకులకు , మాజీ ముఖ్యమంత్రికి , ప్రస్తుత ముఖ్యమంత్రి సభాపతిగా వున్నప్పుడు ఆయనకు విజ్ఞప్తి చేసింది. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, ఇప్పటి ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి సేవలు పునరుద్ధరించమని విజ్ఞప్తి చేసింది యాజమాన్యం.

పరిష్కార మార్గం కొరకు యాజమాన్యం చేయని ప్రయత్నం లేదు. ఏ కలెక్టర్లకైతే ప్రస్తుతం నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం అప్పగించిందో, వారిలో పలువురి సహాయాన్ని సమ్మె ప్రారంభమైన తొలినాళ్లలోనే సంస్థ కోరింది. ఇప్పటి ఏర్పాటు అప్పుడే చేసి వున్నట్టయితే కనీసం ఇన్నాళ్లన్నా సేవలు ఆగకుండా కొనసాగేవి కదా! కలెక్టర్లు రంగంలోకి దిగినట్లయితే సమ్మె ఇన్నాళ్లు కొనసాగక పోయేదేమో! కేవలం హెచ్ఎంఆర్ఐ వైఫల్యం కారణంగానే సమ్మె కొనసాగిందనడం ఎంతవరకు భావ్యం? అవగాహనా ఒప్పందంలో అంగీకరించిన మేరకు నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోతే, దాని ప్రభావం ఉద్యోగుల జీతభత్యాలపై పడితే, దానిని కూడా హెచ్ఎంఆర్ఐ వైఫల్యంగా భావించాలా? మందుల పంపిణీ చేయాల్సిన బాధ్యతున్న ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోతే దానిని హెచ్ఎంఆర్ఐ వైఫల్యంగా చిత్రించవచ్చా?

సమ్మె ప్రభావం అంతగా లేదని వాదించేవారికొక విజ్ఞప్తి. నిరక్షరాస్యులైన నిరుపేద ప్రజలకు తమకేంకావాలో వారికే తెలియని వారెందరో వున్నారు. కనీస వైద్య సౌకర్యం కూడా నోచుకోని అమాయక గ్రామీణులు తమ గ్రామానికి సంచార వాహనం వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా ఇస్తే ఆనందిస్తారు. రాని రోజున ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలుసుకునే తీరికా-ఓపికా వారికి లేదు. అలాంటి నాలుగు కోట్ల మంది అభాగ్యులకు 104 సంచార వాహన సేవలు మొదలయ్యేంతవరకు అలాంటి సేవలుంటాయనే విషయమే తెలియదు. కలెక్టర్ల ఆధ్వర్యంలో తాత్కాలికంగా నిర్వహించ తలపెట్టిన 104 సంచార వాహన సేవలు కాని, క్లస్టర్ పథకంలో భాగంగా ఆరంభం కానున్న "పీ హెచ్ సీ సంచార వాహన సేవలు" కాని ప్రజలకు ఇప్పటికంటే ఎక్కువ మేలు చేయగలిగితే, వారిపై ఎక్కువ ప్రభావం చూపగలిగితే ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే!

అలా జరక్కుండా, కాలయాపనకు దారితీసే "ప్రత్యామ్నాయాలను" అమలు పరచడమే జరిగితే భవిష్యత్ లో 104 సంచార వాహన సేవలు కొనసాగినప్పటికీ, నాణ్యతా లోపం-పౌరులకు గతంలో మాదిరి సేవలు లభ్యం కాకపోవడం తప్పదేమో ! ఇలాంటి సేవలు, అలసత్వం వల్లనో, నిధుల కొరత వుందనో, కేంద్రం నుంచి నిధులు సకాలంలో అందడం లేదనో, సంస్కరణలు అమలు పరచడంలో భాగంగా సేవలను కుదించాలనో, కొత్త భాష్యం చెప్పాలనో.... మరింకేదో తలపెట్టే ప్రయత్నమో చేయడం జరుగుతే, నష్టపోయేది అమాయక ప్రజలే!

ప్రభుత్వ పరంగా చాలాకాలం నుంచీ ప్రజలకు లభిస్తున్న ఆరోగ్య-వైద్య రంగ సేవల నిర్వహణలోని లోటుపాటులను అధిగమించడానికి, సంస్కరణలే శరణ్యమని, ఆ రంగంలోని నిపుణులు నిర్ధారించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలనే సరైన రీతిలో నిర్వహించలేని స్థితిలో వుందని గుర్తించింది ప్రభుత్వం. ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా గ్రామీణ-గిరిజన ప్రాంతాలలో పనిచేయడానికి వైద్యులు కావల్సినంత సంఖ్యలో ముందుకు రావడం లేదు. ఈ నేపధ్యంలో, సామాన్యుడికి-అ సామాన్యుడికి మధ్య ఆరోగ్య-వైద్య సేవలు లభించడం విషయంలో అంతరాలు పెరిగాయి. ప్రయివేట్ సామర్థ్యాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సిన అవసరం వచ్చింది. సంస్కరణలకు నాంది పలికింది ప్రభుత్వం. సంస్కరణలలో ప్రధానంగా పేర్కొనాల్సింది ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ ద్వారా ఆరోగ్య-వైద్య సేవల కల్పన. "జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్" ఈ ప్రక్రియకు ఊతమిచ్చింది. అలాంటి ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆరంభమై ఇంతవరకు నిరంతరాయంగా ప్రజలకు లభ్యమవుతున్న సేవలు పూర్తిగా ప్రభుత్వం ద్వారానే లభించాలను కోవడం ఎంతవరకు సమంజసమో భవిష్యత్తే నిర్ణయిస్తుంది.

Friday, November 19, 2010

Supreme Court Dismisses Public Interest Litigation against EMRI-108: V. Jwala Narasimha Rao

Supreme Court Dismisses
Public Interest Litigation against EMRI-108

V. Jwala Narasimha Rao
Former Advisor EMRI-108
Public Private Partnership

The Supreme Court on Thursday (18th November) dismissed a PIL which involved allegations against Emergency Management and Research Institute (EMRI), funded by the former Satyam chief, B. Ramalinga Raju. The apex court while dismissing the PIL observed that state governments are in a better position to make and implement policies regarding award of ambulance and emergency services contract.

The petitioners, Ambulance Access Foundation India, had alleged that a number of states had awarded contracts to EMRI funded by Raju, for running Ambulance and Emergency Response Services without observing proper procedure. The petitioner had sought adoption of transparent and fair process in awarding the contracts for running Ambulance and Emergency Response Service.

Rejecting the PIL, the apex court observed, "We are of the considered view that it would be appropriate that the various issues raised in this matter would be examined by the respective State Governments, who will be in a better position to examine and implement them depending upon the specific needs of those states like disease burden, health infrastructure, road connectivity etc."

The petitioners had alleged that there was discrimination in the awarding of the contract as no open tender was invited violating the spirit of Article 14 of the Constitution of India. Shri F.S. Nariman, learned senior counsel appearing for EMRI submitted that some of the States have already entered into MOU with EMRI and they have a well laid monitoring and review mechanism consisting of Advisory Council headed by the Chief Secretary and other senior secretary level officers of the State.

Learned senior counsel also submitted that issues and grievances raised by the petitioners have to be addressed before the respective State Governments. Learned counsel also submitted that there is no illegality in the process of entering into MOUs by the States.

The Supreme Court observed, "If there is any irregularity in the tendering process, already adopted by the various states, the same can be brought to the notice of the respective State Governments." The apex court also said that it is open to the petitioners and other aggrieved persons to approach the respective High Courts, if found necessary, as these courts would be in a better position to effectively supervise, taking into consideration, the local conditions and requirements.

Ten States have already entered into MOUs with EMRI for developing and operationalizing Emergency Response Services in their States.

Emergency Management and Research Institute (EMRI), a non-profit organization, is India’s largest, professional, integrated emergency management, research and training institute. Through a single toll – free emergency number 108, any individual, in any emergency situation be it Medical, Police and Fire emergency can call and get help in an average of 20 minutes. The 108 Emergency Response Services is dedicated to help save lives in an emergency. It has now has a fleet of 2,600 ambulances covering 400 million population in 9 states. It has so far saved 285,115+ lives with the help of 16,058+ employees and responded to 9.6 million+ emergencies.

COPY OF THE JUDGMENT

2010 STPL (Web) 947 SC Ambulance Access Foundation India vs. Union of India

2010 STPL (Web) 947 SC SUPREME COURT OF INDIA

(S. H. KAPADI, K. S. PANICKER RADHAKRISHNAN & SWATANTER KUMAR, JJ.)

AMBULANCE ACCESS FOUNDATION INDIA & ANR (Petitioner)

VERSUS

THE UNION OF INDIA AND OTHERS (Respondent)

Writ Petition (Civil) No. 518 of 2008­Decided on 18­11­2010.

Ambulance/Emergency Response Service

JUDGMENT

K.S. Panicker Radhakrishnan, J.­ This public interest litigation petition has been filed under Article 32 of the Constitution of India seeking a writ of mandamus directing Respondent No.1, Respondent Nos.2 to 13 and Respondent Nos.27 to 44 to put in a place a transparent and fair process in awarding the contracts for running Ambulance/Emergency Response Service in their respective jurisdiction. Petitioners submit that some of the States have already entered into and/or are considering awarding the nominated contracts and /or `tailor made' EOI process to Respondent No.14 to run Ambulance/Emergency Response Services in their respective jurisdictions in the name of saving human lives using funds under the National Rural Health Mission (NRHM) of the Union of India, which according to the petitioner will violate Article 14 of the Constitution of India.

1 Petitioners have stated that Respondent Nos.2 to 9 and 12 ­States have already entered into MOU with Respondent No.14 for developing and operationalizing Ambulance/Emergency Response Service in their State. Further it is also stated that Respondent No.13, the State of Maharashtra has approved the MOU with Respondent No.14 without any formal competitive bidding process or any transparency whatsoever in the MOU signing process.

2 In response to the notice issued by this Court few States have already filed their counter affidavit/response giving reasons for entering into MOU with the 14th respondent.

3 Learned counsel appearing for the petitioner urged that Union of India should lay down some guidelines in the matter of awarding and administration of MOUs/Contracts for emergency medical services in various states in public interest. Learned counsel submitted that they have made some suggestions which do not meet with the approval of the 1st respondent, fully. The stand of the counsel for the 1st respondent is that there are matters which are primarily to be considered by the respective State Governments.

4 Shri F.S. Nariman, learned senior counsel appearing for Respondent No.14 submitted that some of the States have already entered into MOU with Respondent No.14 and they have a well laid monitoring and review mechanism consisting of Advisory Council headed by the Chief Secretary and other senior secretary level officers of the State. Learned senior counsel also submitted that issues/grievances raised by the petitioners have to be addressed before the respective State Governments who are already seized of the matter. Learned counsel also submitted that there is no illegality in the process of entering into MOU by some of the States. For example, it was pointed that State of Gujarat has enacted the Gujarat Infrastructure Development Act 1999 as amended by Gujarat Infrastructure Development Act 2006 which permits selection by direct negotiations. Reference was also made to the Karnataka Transparency in Public Procurement Act 1999 under which there are provisions for selecting a particular person or group for implementing various government schemes without inviting tenders.

1 We are of the considered view that it would be appropriate that the various issues raised in this matter would be examined by the respective State Governments, who will be in a better position to examine and implement them depending upon the specific needs of those states like disease burden, health infrastructure, road connectivity etc. Further, petitioners have also contended that the awarding of contract to Respondent No.14 was discriminatory and contrary to the spirit of Article 14 of the Constitution of India since no open tender was invited before awarding the contract to Respondent No.14.

2 We are of the view that if there is any irregularity in the tendering process, already adopted by the various states, the same can be brought to the notice of the respective State Governments. Further, it is also open to the petitioners and other aggrieved persons to approach the respective High Courts, if found necessary, so that those courts would be in a better position to effectively supervise, taking into consideration, the local conditions and requirements. With the above observations the writ petition is disposed of.

................................................CJI

(S. H. KAPADIA)

...................................................J.

(K. S. PANICKER RADHAKRISHNAN)

...................................................J.

(SWATANTER KUMAR)

New Delhi;

November 18, 2010.

(Respondents Number 1-14 are: Union of India, State Governments of AP, Gujarat, MP, Tamil Nadu, Rajasthan, Uttarakhand, Goa, Assam, Haryana, Punjab, Karnataka, Maharashtra and EMRI-108 Services respectively)

Supreme Court Judgments @ www.stpl­india.in