Monday, August 9, 2010

కాంగ్రెస్‌లో ఎవరికి వారే, యమునా తీరే!-వనం జ్వాలా నరసింహారావు

-విభజించి పాలించే విధానం
-అధిష్ఠానాన్ని ఖాతరు చేయని రాష్ట్ర నేతలు
-సమ్మతి- అసమ్మతి ముఠాలు
-సీమాంధ్ర- తెలంగాణ విభేదాలు
-పార్టీని బలోపేతం చేసే దిశగా లేని చర్యలు
-ముదిరి పాకాన పడ్డ జగన్‌ వ్యవహారం

చివరికి, అనుకున్నది- అయినదీ ఒకటే అన్నట్లుగా ఉంది, నిన్న- మొన్న జరుగుతున్న సంఘటనలు విశ్లేషించి చూస్తే. జగన్‌ కాంగ్రెస్‌ను వదలక ముందే, ఆయనకు మద్దతుగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారనేది బయ టపడక ముందే, అలా పోవాలనుకున్న వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు ముందు కొచ్చారు చిరంజీవి. ఎలాగూ ఎంఐఎం అండ కాంగ్రెస్‌ పార్టీకి ఉండనే ఉంది. వాళ్లు మద్దతు ఇస్తామనడం బాగానే ఉంది కాని, రోశయ్య వెంటనే దానికి అంగీ కరించినట్లు మాట్లాడడమే కొంత అనుమానాలకు దారి తీస్తుందనాలి. ఒక వైపు తన ప్రభుత్వానికి ఏ ఢోకా లేదంటూనే, తక్షణం వచ్చిన ముప్పేమీ లేదంటూనే, ఔదార్యంతో ఎవరైనా మద్దతిస్తా మంటే తప్పకుండా తీసుకొంటామనడంలో అంతరార్థం మాత్రం- అసలు సిసలైన కాంగ్రెస్‌ వ్యవహార శైలిలోనే ఉందనాలి. ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ పార్టీలో సంభవి స్తున్న పరిణామాలు పార్టీని బలోపేతం చేసే దిశగా ఎంతమాత్రం సాగడంలేదు.

ఆ పరి ణామాలకు ఫలానా వారే బాధ్యులనడం, ఫలానా వ్యక్తులనే ఎత్తి చూపడం సాధ్యం కాదు. శ్రీ కృష్ణ కమిటీకి అభిప్రాయం చెప్పి వచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులు- మంత్రులతో సహా, తెలంగాణ వాదులను దేశ ద్రోహులు గా అభివర్ణించడాన్ని టీఆరెస్‌తో సహా, కాం గ్రెస్‌ తెలంగాణ నాయకులందరూ తప్పు బట్టారు. తమది దేశ ద్రోహమైతే, తమ ఉమ్మడి నాయకురాలు సోనియా గాంధీదీ దేశ ద్రోహమే అనే వరకూ కాంగ్రెస్‌ జగడం సాగింది. ఇలా బాహాటంగా ఒకరి నొకరు విమర్శించుకున్నప్పటికీ, క్రమశిక్షణ చర్యలు మ్రాతం ఏ ఒకరిద్దరు కాంగ్రెస్‌ నాయకులకో పరిమితమై పోవడం గమ నార్హం. అయినా క్రమ శిక్షణకు, క్రమ శిక్షణా రాహిత్యానికి మారు పేరైన నూట ఇరవై అయిదేళ్ల కాంగ్రెస్‌ పార్టీకి ఇవన్నీ మామూలే నంటున్నారు విశ్లేషకులు. సాక్షాత్తు రాజీవ్‌ గాంధీనే పార్లమెంటులో ఉరి తీయాలని అన్న వారికే కాంగ్రెస్‌ లో ఉన్న తాసనం వేయగా లేనిది, ఇతరుల క్రమశిక్షణ గురించి మా ట్లాడే అర్హత క్రమశిక్షణా సంఘానికి ఎక్కడిది అని ఒక సీనియర్‌ కాంగ్రెస్‌ వాది ప్రశ్నించే దాకా వెళ్లింది.

భారత జాతీయ కాంగ్రెస్‌కు ఆంగ్లేయుల ‘విభజించి పాలిం చే విధానం’ వారసత్వంగా అబ్బిందనాలి. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకులతో సహా సాధారణ కార్యకర్తలకు కూడా అధిష్ఠానం అంటే ఏ మాత్రం భయం లేకుండా పోతుందేమో అనిపిస్తోంది. ఒక వైపు రోశయ్య- జగన్‌ వర్గాలుగా, మరో పక్క సీమాంధ్ర-తెలంగాణ వాదు లుగా, ఇంకో దిక్కున ఒకే ప్రాంతంలోని సమ్మతి- అసమ్మతి ముఠాలుగా, ఒకే జిల్లాలో రెండు చీలికలుగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు బాహాటంగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. అధిష్ఠానం కూడా తన వంతు రెచ్చగొట్టే విధానం అవలంబి స్తున్నదేగాని, పరిస్థితులను చక్కదిద్దుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. కాకపోతే, అప్పుడప్పుడూ, ఒకరిద్దరి మీద తాత్కాలికంగానో- తాత్కాలిక శాశ్వతం గానో వేటు వేయడం జరుగుతున్నది. అంబటిపై తక్షణ చర్యైనా- పాల్వాయిపై అర్థంలేని మౌనమైనా, గోనె-యాష్కీల మధ్య తలదూర్చక పోవ డమైనా, రాయపాటి- కన్నా విభేదాలను నాన్చడమైనా, సర్వే- శంకర్రావులను పురిగొల్పడమైనా అధిష్ఠానం ఎత్తుగడల్లో భాగమేనేమో !

వైఎస్‌ జగన్మోహన రెడ్డి, ఏది జరిగినా తన మంచికేనన్న దృక్పథంతో, ఓదార్పు యాత్ర పేరుతో జనంలోకి దూసుకుపోతున్నాడు. ఈ సుదీర్ఘ యాత్రలో- చాలా భాగం సంయమనంతో ఉపన్యాసాలిచ్చినప్పటికీ, మనసులో మాట బయట పెట్ట దల్చుకున్నప్పుడు, వెనుకా-ముందు చూడకుండా మాట్లాడడం భవిష్యత్‌ సంకేతాలకు నిదర్శనమనవచ్చు. సహనం కోల్పోయే సమయం ఆసన్నమైందన్న సంకేతాలనూ ఇస్తున్నాడు. మొత్తమ్మీద జగన్‌ వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఓదార్పు యాత్రలో ఆయనేం మాట్లాడాడన్నది ప్రధానం కానేకాదు. ఆయన వేరు కుంపటి పెట్టినా- పెట్టక పోయినా మునుపెన్నడూ లేని విధంగా పార్టీ సంక్షోభంలో పడిపోతున్నదనడంలో అతిశయోక్తి లేదు. ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చిన ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ఒక్కసారి ఓడితే మళ్ళీ అధికారంలోకి రాలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే ఆ మినహాయిం ఉంది ఇంతవరకు. బహుశా ఇక ముందు ఇక్కడ కూడా, జాతీయ కాంగ్రెస్‌ మనుగడ ఏదో ఒక ప్రాంతీయపార్టీపై ఆధారపడే రోజు లు రాబోతున్నాయేమో!

ఆంధ్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి, దివంగత ముఖ్యమంత్రి తనయుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సహచరుడు, కాపు వర్గానికి చెందిన నాయ కుడు అంబటి రాంబాబును, పార్టీనుంచి సస్పెన్షన్‌ చేసిన వైనం కాంగ్రెస్‌ శ్రేణుల్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా విమర్శలు చేశాడన్న ఆరోపణతో రాంబాబును సస్పెండ్‌ చేసింది అధిష్ఠానం. అంతేకాదు, జగన్‌ ఓదార్పు యాత్రలో రోశయ్యపై చేసినట్లు మీడియాలో వచ్చిన వ్యాఖ్యలపై నివేదికలు కూడా తెప్పించుకుంటామని మొయిలీ అన్నారు. జగన్‌ ధిక్కార ధోర ణిని సహించబోమన్న సందేశం ఆయన మాటల్లో స్పష్ఠంగా వ్యక్తమైంది. అంత టితో ఆగకుండా జగన్‌ మరో వీరాభిమాని, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ కార్యదర్శి గట్టు రామచందర్రావుకు ఉద్వాసన జరిగింది. మరో జగన్‌ వీరాభిమాని కొండా సురేఖ- రోశయ్యను చేతకాని సీఎం అంటూ పత్రికలకెక్కారు. వీరందరినీ సస్పెండ్‌ చేస్తున్నట్లు కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది. వారిదే క్రమశిక్షణా రాహిత్యమంటూ అంబటి అండ్‌ కంపెనీ పత్రికలకెక్కింది. రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్‌లో వినిపిస్తున్న ధిక్కార స్వరాలు, అసంతృప్తి జ్వాల లు భారత కాంగ్రెస్‌ నూట పాతికేళ్ల చరిత్ర గుర్తుకు తెస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీలో ముఠా పోకడలు, అధిష్ఠానాన్ని ధిక్కరించడం, పార్టీని వీడిపో వడం, స్వగృహ ప్రవేశం చేసి- గతంలో కంటే ప్రాధాన్యత సంపాదించుకోవడం వంటివి ఆది నుంచీ కనిపిస్తున్నవే. మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రకాశం పంతులును దింపడానికి నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావు ఒకటయ్యా రని అంటారు. నీలం-కళా వెంకట్రావుల వ్యూహంలో ముఖ్యమంత్రి పదవి కోల్పో యి, కాంగ్రెస్‌ను వదిలి వెళ్లిపోయిన ప్రకాశం, స్వగృహ ప్రవేశం చేసి, సంజీవరెడ్డి ప్రోద్బలంతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యారు. మద్య నిషేధం సాకుగా, సంజీవరెడ్డి బలపర్చిన ప్రకాశం పంతుల ఓటమి దిశగా కొందరు కాంగ్రెస్‌ నాయ కులు పావులు కదిలించారు. ఓడిన ప్రకాశం రాజీనామా చేయడంతో గవర్నర్‌ పాలన విధించడం, శాసన సభను రద్దుచేయడం జరిగింది. అవన్నీ ముఠా రాజకీ యాలే. దరిమిలా, నీలం సంజీవరెడ్డి స్థానంలో బెజవాడ గోపాల రెడ్డి పీసీసీ అధ్య క్షుడయ్యారు.

1956 లో విశాలాంధ్రగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం అవతరించింది. ముఖ్య మంత్రి పదవికోసం పోటీ మొదలైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి మద్దతు బెజవాడకు, బూర్గుల, విబి రాజుల మద్దతు నీలం సంజీవరెడ్డికి లభించింది. ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు నీలంకే మద్దతు పలికారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. బెజవాడ గోపాలరెడ్డి ఆర్థిక మంత్రిగా సర్దుకోవాల్సివచ్చింది. నీలం సంజీవరెడ్డి బలాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి లాగ డమే మంచిదని భావిం చిన జవహర్లాల్‌ నెహ్రూ, పథకం ప్రకారం యుఎన్‌ ధేబర్‌ స్థానంలో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా 1960లో నీలంను నియ మించారు. 1962 లో, ఎన్నిక లొచ్చే సమయానికల్లా సంజీవరెడ్డిని తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి పంపారు. ఆయన వారసుడిగా 1964 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అయింతర్వాత, మళ్లీ ము ఠా రాజకీయాలకు తెర లేచింది.

ముల్కీ కేసులో తీర్పుపై పీవీ వ్యాఖ్యలకు నిరసనగా తలెత్తిన ఉద్యమ ఫలితంగా ఆయన పదవి కోల్పోవడం, ఆయన స్థానం లో కొన్నాళ్లకు జలగం ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఎమ ర్జెన్సీ కాలంలో ఇందిర విధేయుడుగా పేరు తెచ్చుకున్న జలగం, ఆ తర్వాత ఇందిర మంత్రివర్గంలో హోం మినిస్టర్‌ గా పని చేసిన బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్‌లో చేరాడు. 1978 శాసనసభ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్‌ (నేటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌-ఐ)ని మర్రి చెన్నారెడ్డి విజయ పథంలో నడిపించగా, వెంగళ రావు కాంగ్రెస్‌ పరాజయం పాలైంది. చెన్నారెడ్డి మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన మాజీ ప్రధాని ఇందిరకు ఖమ్మంలో కనీసం గెస్ట్‌ హౌజ్‌ కూడా ఇవ్వని వెంగళరావు మళ్ళీ ఇందిర పంచన చేరి కేంద్రంలో మంత్రిపదవి అనుభవించారు. పీసీసీ అధ్యక్షుడుగా పని చేశారు.

ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతో, ముఖ్యమంత్రుల మార్పిడికి శ్రీకారం చుట్టడం జరిగింది. బహిరంగంగానే, అసమ్మతికి అధిష్ఠానం ప్రోత్సాహం లభిం చేది. అసమ్మతి పుణ్యమా అని అంజయ్య, భవనం, విజయ భాస్కర రెడ్డి ముఖ్య మంత్రులయ్యారు. 1983 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ను, 1989లో మరో పర్యాయం పీసీసీ అధ్యక్షుడుగా, గెలిపించిన చెన్నారెడ్డి, ముఖ్య మంత్రి కావడానికి అధిష్ఠానం ఆశీస్సులు తప్పనిసరైంది. మళ్ళీ అసమ్మతి... మళ్ళీ ధిక్కార స్వరాలు.. ఏడాదికే ఆయన స్థానంలో, నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి ముఖ్య మంత్ర య్యారు.

ఆయన్నూ ఉండనివ్వలేదు అధిష్ఠానం. మరో మారు విజయ భాస్కర రెడ్డి ని ముఖ్య మంత్రిని చేసి, తెలుగు దేశం ఇంకో మారు అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది. అప్పట్లో అసమ్మతిని, ధిక్కార స్వరాన్ని వినిపించిన డా రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసినా, కాంగ్రెస్‌ను అధికా రంలోకి తేవడానికి మరో పది సంవత్సరాలు పట్టింది. ఆయన రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయింతర్వాత, ఆకస్మికంగా మరణించడంతో, ఆరేళ్లుగా వినిపించని ధిక్కార స్వరాలు మళ్లీ మొదలయ్యాయి.

No comments:

Post a Comment