Saturday, May 3, 2014

రామాయణంలో ఏముంది? ఆంధ్ర వాల్మీకి రామాయణం ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

రామాయణంలో ఏముంది?
ఆంధ్ర వాల్మీకి రామాయణం ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం యథా వాల్మీకంగా పూర్వ కాండలతో ఉత్తర కాండను కూడా కలిపి రచించిన ఏకైక వ్యక్తి కీర్తి శేషులు వావివిలికొలను సుబ్బారావు (వాసు దాసు) గారు. రామాయణం అంటే ఏమిటి, ఆంధ్ర వాల్మీకి రామాయణం ఎందుకు చదవాలి, అనే అంశాలను స్వయంగా వాసు దాసు గారే ఆయన పీఠికలో వివరించారు. రామాయణాన్ని చక్కగా తెలిసినవారు-అర్థం చేసుకోగలిగిన వారు మాత్రమే లోకానికి అందలి విషయాలను వివరించ సమర్థులు. అందరికీ అది సాధ్యమయ్యేది కాదు. "శ్రీ రామాయణం" అంటే, లక్ష్మీరమణుడైన శ్రీమన్నారాయణుడి మాయా మానుషావతారమైన శ్రీరామ చరిత్రనీ, శ్రీ లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవి చరిత్రనీ అర్థం. దంపతుల మాదిరిగా, వారి "అభిధానంబులు అనపాయంగా" వుండినట్లే, తత్త్వమెరిగిన మహాత్ముడు వాల్మీకి మహర్షి, తను రచించిన ఆది కావ్యానికి శ్రీ రామాయణం అని పేరు పెట్టాడు. ఇందులో సీతాదేవి మహాత్మ్యాన్ని విశేషించి చెప్పడంవల్ల వాల్మీకి మహర్షే, శ్రీ రామాయణాన్ని "సీతాయాశ్చరితం మహత్తు" అని వెల్లడిచేశాడు. శ్రీరాముడు భగవంతుడన్న అర్థం, హారంలోని సూత్రంలాగా, రామాయణంలోని ఏడు కాండల్లోనూ వ్యాపించి వుంది. రామాయణాన్ని చదివేవారందరు, ఈ అర్థాన్ని మనస్సులో పెట్టుకొని, ఇందులోని ప్రతి అంశాన్ని-ప్రతి వాక్యాన్ని హెచ్చరికతో శోధించాలి. ఇలా ఆసక్తిగా శోధించిన వారికి-పరీక్షించిన వారికి మాత్రమే, వాల్మీకి రామాయణానికి-ఇతర రామాయణాలకు (ఆ మాటకొస్తే, ఏ భాషలో వున్న ఏ గ్రంథాలకు) గల తారతమ్యం, వాల్మీకి రామాయణంలోని గొప్పదనం తెలుస్తుంది.

          శ్రీ రామాయణం మహాకావ్యం. పుట్టుకతోనే కాకుండా గుణంలో కూడ అదే మొదటిది. దానిలోని గుణాలు, రహస్యాలు తెలుసుకోవాలంటే వాల్మీకికి గాని, సర్వజ్ఞుడికి గాని మాత్రమే సాధ్యమవుతుంది. శ్రీమద్రామాయణంలో ఉత్తమోత్తమ మహాకావ్య లక్షణాలెన్నో వున్నాయి. వర్ణనలెన్నో వున్నాయి. రామాయణం గానం చేసినా, పఠించినా మనోహరంగా వుంటుంది. రామాయణంలో శృంగారం లాంటి నవ రసాలున్నాయి. అందులో శృంగార రసం "సంభోగ శృంగారం". వాల్మీకి వాక్యామృత రసాన్ని నిరంతరం ఆస్వాదన చేసిన భవభూతి వర్ణించినట్లు ఇందులో హాస్యం, కరుణ, వీర, రౌద్రం, భయానక, బీభత్సం, అద్భుతం, శాంతం రసాలను కనుగొన వచ్చు. రామాయణంలో శబ్దాలంకారాలు తరచుగా కనబడవు. అంత్యానుప్రాసలు కొన్ని చోట్ల వున్నాయి. శ్రీమద్రామాయణం స్వభావోక్త్యలంకారాలకు పుట్టిల్లు. వర్షాన్ని వర్ణన చేసిన సందర్భంలో మన ఎదుట వర్షం కురుస్తున్నట్లే వుంటుంది. హేమంతాన్ని వర్ణిస్తుంటే, మనకు మంచులో తడుస్తున్నామా అనిపిస్తుంది. తన వర్ణనా చాతుర్యంతో వాల్మీకి, పాఠకులను, తన చేతిలో బొమ్మలా చేసి, ఇష్టమొచ్చినట్లు ఆడుకుంటాడు. వాల్మీకి మరో ప్రత్యేకత "ఉత్ప్రేక్ష". అలానే ఆయన వాడిన శ్లేషాలంకారాలు. శ్లేషాలంకారానికి చక్కటి ఉదాహరణ వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకం. దాన్ని ఆంధ్ర వాల్మీకి రామాయణంలో అనువదిస్తూ వాసు దాసుగారు ఇలా రాశారు.

"తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక
ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల
గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు
కామమోహిత ముం జంపు కారణమున"

ఒక బోయవాడు క్రౌంచ మిథునంలో వున్న మగ పక్షిని చంపడం, ఆడ పక్షి అది చూసి దుఃఖించడం, పరమ దయామయుడైన వాల్మీకి అది చూసి, బోయవాడు చేసిన అధర్మ కార్యానికి కోపగించి అతడిని శపించడం జరిగింది. ఆ శాపమే రామాయణ ఉత్పత్తికి కారణమైంది. దీనికి భగవత్ పరంగా ఒక అర్థం వుంది. రామాయణంలోని ఏడు కాండల అర్థం-కథ ఇందులో సూక్ష్మంగా సమర్థించబడింది. అలంకార శాస్త్రంలో ఎన్ని అలంకారాలు చెప్పబడ్డాయో, అవన్నీ వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) రామాయణంలో వున్నాయి. వాల్మీకి అసమాన కవితా చాతురి వర్ణనాతీతం. మరొక్క ఉదాహరణ చిత్రాలంకార ఉపయోగం. అలంకారాల వరకెందుకు? సాధారణ విషయాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఏదో ఒక చమత్కారాన్ని కనబరిచేవాడు. వాల్మీకి రామాయణంలోని పాత్రలు-పాత్రధారుల వాక్కులు, ఆయా పాత్రల చిత్త వృత్తి గుణాలను తెలియచేసేవిగా, సందర్భోచితంగా, వారున్న అప్పటి స్థితికి అర్హమైనవిగా వుంటాయి. పాత్ర గుణ మహాత్మ్యానికి అసంగతమైన వాక్యాలు ఆయా పాత్రల నోటినుంచి వెలువడవు. శ్రీరాముడు భగవంతుడన్న అభిప్రాయం వాల్మీకి పదే పదే చెప్పుకుంటూ పోయాడు రామాయణంలో.


వాల్మీకి రామాయణమనే "కలశార్ణవం" లో రత్నాలను వెదికేవారు, మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది వాల్మీకి శైలి-విధానం. అది తెలుసుకోలేక వెతకడం మొదలుపెట్టితే, చీకట్లో తారాడినట్లే. ఒక విషయం గురించి చెప్పాల్సిందంతా ఒకచోట చెప్పడు. కొన్ని సందర్భాలలో ఆ విషయానికి సంబంధించిన ప్రస్తావనే వుండదు. అదే విషయం మరెక్కడో సూచన ప్రాయంగా వుండొచ్చు. ఒక్కోసారి విపులంగా విశదీకరించబడి వుండొచ్చు. ఆయన చేసిన వర్ణనలను బట్టి, ప్రయోగించిన పదజాలాన్ని బట్టి, పాఠకులు ఊహించుకోవచ్చు. ఒకే విషయం, ఒకటి కంటె ఎక్కువ సార్లు చెప్పితే, ఒక్కోసారి ఒక్కోరకమైన విశేషంతో చెప్పబడుతుంది. ఇలాంటి చిత్రాలు అనేకం వుంటాయి. వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) రామాయణం "ధ్వని కావ్యం". కావ్యానికి ప్రధానమైంది ధ్వని. కావ్యానికి ప్రాణం ధ్వని. ధ్వని లేని కావ్యం శవంతో సమానం. రామాయణంలో ధ్వని విశేషంగా వుంది. కావ్యమంతా ధ్వన్యర్థం వుండడమే కాకుండా, పలు శ్లోకాలకు విడిగా ధ్వన్యర్థం వుంది. రుతు వర్ణనలలో ధ్వని స్ఫురిస్తుంది. శ్రీ రామాయణంలోని కవితా చమత్కృతిని విశదీకరించాలంటే, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంతెందుకు ! కాళిదాసు, భవభూతి అంత గొప్ప వాళ్లు కావడానికి రామాయణమే కారణం. వాళ్లు రామాయణాన్ని ఎన్ని సార్లు చదివారో గాని, వారి కవితా వల్లి "వాల్మీకి వాక్సుధాసేచనం" లో జీవించి, వృద్ధి పొందిందనడం నిర్వివాదం. శ్రీ విశిష్టాద్వైతం మతోద్ధారకుడైన శ్రీ రామానుజాచార్యులు పద్దెనిమిది పర్యాయాలు గురు ముఖంగా రామాయణాన్ని పఠించి వ్యాఖ్య రాశారు.

శ్రీమద్వాల్మీకి రామాయణం మంత్రనిధానం. ఇందులో అనేకానేక మంత్రాలు ఉద్ధరించబడి వున్నాయి. అందువల్లే, వాల్మీకి రామాయణం పారాయణం చేసేవారు, "అంగన్యాస కరన్యాసాదులతో" యథావిధిగా చదివి, వారి వారి కోరికలు నెరవేర్చుకుంటారు. సద్భావంతో సుందర కాండ పారాయణం చేసి కార్య సిద్ధిని పొందనివారు ఇంతవరకు లేరు. ఉత్తర కాండలో చెప్పినట్లు, రామాయణమంతా గాయత్రీ స్వరూపమే. గాయత్రిలోని 24 అక్షరాలను, ప్రతి వేయి శ్లోకాలకు ఒక అక్షరం చొప్పున శ్లోకం ఆరంభంలో చెప్పబడింది. ఏడు కాండలలో ఏడు వ్యాహృతులు వివరించడం జరిగింది. ఈ గాయత్రీ విధానాన్ని నారదుడే స్వయంగా వాల్మీకి మహర్షికి, రామాయణంతో పాటే ఉపదేశించాడు. " తప స్స్వాధ్యాయ నిరతం, తపస్వీ వాగ్విదాంవరమ్, నారదం పరిపప్రఛ్చ, వాల్మీకిర్మునిపుంగవమ్" అని గాయత్రిలోని మొదటి అక్షరంతో శ్లోకాన్ని ప్రారంభించి, "జనశ్చ శూద్రోపి మహత్త్వ మీయాత్" అని గాయత్రి కడపటి అక్షరంతో సర్గను ముగించాడు వాల్మీకి. అంధ్ర వాల్మీకంలో, మూలంలో వున్నట్లు "తపమున స్వాధ్యాయంబున, నిపుణుని...  .....  తమి గావించెన్" అన్న పద్యంతో ప్రారంభించి, "యథావిధి విన్న బఠింప నారయన్" అని ముగించబడింది. కామ్యార్థమైనా, మోక్షార్థమైనా, రామాయణం పారాయణం చేసినవారి కోరికలు నెరవేర్చే శక్తి, రామాయణానికి వుండడానికి కారణం, అది భగవత్ కథ కావడానికి అదనంగా సర్వజ్ఞుడైన వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) కూర్చిన బీజాక్షరాల మహాత్మ్యమే.

శ్రీమద్రామాయణం వేదంతో సమానమైందే కాకుండా వేదమే అనాలి. వేదమే అయినప్పుడు, వేదంతో సమానమైందని ఎలా అనవచ్చునంటే, వేదంలోని వర్ణాలనే, అనులోమ-విలోమాలుగా మార్చి, వేద ప్రసిద్ధమైన రామ కథను చెప్పడంవల్ల ఇది వేదమే అయింది. వేదాల్లోని అర్థాలున్నందువల్ల వేదంతో సమానమైంది. అందువల్లనే, వేద పఠనం అవశ్యంగా చేయాల్సిన కార్యక్రమాల్లో, రామాయణ పఠనం నియమితమైంది. శత కోటి, అంటే 24 గాయత్రీ బీజాక్షరాలతో కూడిన 24,000 గ్రంథాల రామాయణంలోని ప్రతి అక్షరానికి మహా పాతకాలను నాశనం చేయగల శక్తిగలదని కొందరంటారు. కొందరేమో, శత కోటి రామాయణాన్ని వాల్మీకి సంగ్రహంగా చెప్పాడంటారు. ఇలాంటి మహిమ రామాయణంలో వుండడానికి కారణమేంటో ఆలోచించాలి. వాల్మీకి సూత్రాన్ననుసరించి, రామాయణం వేద స్వర సముద్ధృతంగా-సర్వశ్రుతులందున్నట్లుగా తెలుస్తోంది. వాల్మీకి రచించిన 24,000 శ్లోకాలలో, యజుర్వేదంలోని 1 29 290 పదాలే కాకుండా, రుగ్వేదం, సామవేదం, అధర్వ వేదాలలోని పదాలు కూడా అనులోమ-విలోమంగా కూర్చబడిందన్న రహస్యం తెలుసుకోవచ్చు. యజుర్వేదానికి ప్రాముఖ్యం ఇవ్వడానికి కారణం, శ్రీరాముడు యజుర్వేది కావడమే.

శ్రీమద్రామాయణంలోని కాండలలో వేదాక్షరాలు ఎలా వున్నాయో పరిశీలించితే, బాల కాండ ప్రధమ సర్గ నుంచి ఐదో సర్గ వరకు రెండో శ్లోకం దాకా, నారదుడు ఉపదేశించిన విధానం రాసి, తర్వాతనే బ్రహ్మ ప్రత్యక్షం కావడంతో కథా భాగం వుంది. బాల కాండ 5 సర్గ 3 వ శ్లోకం నుంచి, అయోధ్య కాండ 115 వ సర్గ వరకు యజుర్వేదం. అయోధ్య కాండ 116 వ సర్గ మొదలు, అరణ్య కాండ 74 వ సర్గ వరకు ఋగ్వేదం. అరణ్య కాండ 75 వ సర్గ మొదలు సుందరకాండ 48 వ సర్గ వరకు సామవేదం. సుందర కాండ 49 వ సర్గ మొదలు ఉత్తర కాండ 36 వ సర్గ వరకు అథర్వ వేదం. ఉత్తర కాండ 37వ సర్గ మొదలు చివర వరకు ఉపనిషత్తు-అంటే శాంతి. ఈ విధంగా 647 సర్గలలో 23635 శ్లోకాలు, 776794 అక్షరాలున్నాయి. రామాయణం ఒక మహత్తరమైన సాంఖ్య శాస్త్రం. "కాదినవాది సూత్రాల" ప్రకారం అక్షరాల కొచ్చే సంఖ్యలను బట్టి చూస్తే, రామాయణంలో ఎన్నో చిత్రాలు కనిపిస్తాయి.

అవతార సంఖ్య...7, రామాయణ కాండ సంఖ్య....7, యుద్ధం జరిగిన రోజుల సంఖ్య...7, రామాయణ యుద్ధంలో ముఖ్య మైన పురుషుల సంఖ్య (రామ, లక్ష్మణ, హనుమ, విభీషణ, రావణ, కుంభకర్ణ, ఇంద్రజిత్తులు)...7. పారాయణం చేసే వారికి ముఖ్యంగా నియమిత మైన సర్గల సంఖ్య 7. వ్యాహృతులు 7. ఇలా ఈ ఏడవ సంఖ్య మహిమ అద్భుతం. "శ్లోక శతై" అని వాల్మీకి చెప్పినట్లు, బాల కాండం మొదటి సర్గ మొదటి శ్లోకం (తప స్స్వాధ్యాయ...) లోని అక్షరాల కొచ్చే సంఖ్యలను కూడితే 100 వస్తుంది. 100 సంఖ్య ప్రథమ సర్గలోని శ్లోకాల సంఖ్య. రామాయణంలోని సప్త సంఖ్యా నియమాన్ని గ్రహించిన వ్యాస భగవానులు నిజ రచిత గ్రంథానికి "జయ" అని పేరు పెట్టాడు. "జయ" అంటే 18. భారతంలోని పర్వాలు 18. యుద్ధం జరిగింది 18 రోజులు. రణ శూరులు 18 మంది. భగవద్గీతలో 18 అధ్యాయాలున్నాయి. ఇలా ఆలోచిస్తే, మహర్షులందరి మార్గాలు ఒక్కటేననిపిస్తుంది. సీతారాముల వియోగం గురించి, కలిసి వుండడం గురించి అయోధ్యా కాండలో చెప్ప బడింది. మిగిలిన కాండలలో కొంత కాలమన్నా వియోగం గురించి చెప్పబడింది. కాబట్టి "సీత, రామ" నామాల సంఖ్యలు కలిపితే (సీత=67 + రామ=52) 119 వస్తుంది. అయోధ్య కాండలో 119 సర్గలున్నాయి. ఇలాంటి చిత్రాలు ఎన్నెన్నో వాల్మీకి రామాయణంలో నిక్షేపం చేశాడు.

No comments:

Post a Comment