Friday, September 8, 2017

మడులు, దడులకు వ్యతిరేకం కాళోజీ : వనం జ్వాలా నరసింహారావు

సెప్టెంబర్ 9, 2017 న కాళోజీ 103 వ జయంతి సందర్భంగా

మడులు, దడులకు వ్యతిరేకం కాళోజీ
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (09-09-2017)

స్వర్గీయ కాళోజీ నారాయణరావు గారి ఆత్మకథ "ఇదీ నా గొడవ" ను నేను గత పది-పదిహేను సంవత్సరాలలో అనేక సార్లు చదివాను. అందులో ఆయన చెప్పిన ప్రతి అంశమూ, పది మంది తెలుసుకోవాల్సిందే! అసలా పుస్తకం ఇప్పుడు దొరుకుతుందో? లేదో? తెలియదు. మొన్నీ మధ్య  ఒక టెలివిజన్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, కాళోజీని అతి దగ్గరగా ఎరిగిన ఒక పెద్ద మనిషి, తనకా పుస్తకం చదవాలని ఎన్నేళ్లగానో వున్నప్పటికీ, ఆ పుస్తకం లభ్యం కానందున వీలుపడలేదని అన్నాడు. అప్పుడనిపించింది...ఎందుకు అందులోని విషయాలను కనీసం కొన్నైనా, పంచుకోకూడదని. అందుకే ఇది.. ఆసక్తి గల వారికి ఇదొక అవకాశం. ఆ పుస్తకంలోని కొన్ని విషయాలు...ఒక్కొక్కటే...

మడులు దడులు కట్టుకోవడానికి కాళోజీ వ్యతిరేకం. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెపుతారు ఆయన. దివంగత ముఖ్యమంత్రి అంజయ్య తెలుగు భాష మీద ఎలా గల్లంతు లేచింది, ఎలా కార్టూనులు వచ్చిందీ తెలియచేస్తారు. ఒకరి భాష విషయంలో, యాస విషయంలో ఎగతాళి చేస్తే అతడి ఆత్మాభిమానం దెబ్బతింటుంది అని అంటారు.

"జీవితంలోనైనా, సాహిత్యంలోనైనా మడులూ, దడులు కట్టుకోడం, గీతలూ, గిరులు గీసుకోవడం సరికాదని నేను భావిస్తను. మనం ఎప్పుడో ఒకప్పుడు బతుకు తెరువుకోసం ఎక్కడెక్కడికో పోతుంటం. 3ఎవరెవరితోనో వుంటూంటం. మనం అప్పుడు అక్కడ మందిలో ఒకరుగనే కలిసిమెలసి వుండాలె. నేను వేరు, వారు వేరు అనేటి ఆలోచనలే తప్పు. కాని బాగా చదువుకున్నోళ్లు, పెద్ద పెద్దోళ్లు కూడా ఇలాంటి ఆలోచనల్లోంచి అంత తేలిగ్గా బయటపడలేరు. తమకు అనుకూలమైన, తమకిష్టమైన మార్పు అయితే సంస్కారవంతమైన దనుకోడం, తమ కిష్టం కానిదైతే భ్రష్టమైన దనుకోడం, చెడిపోయిందనుకోడం తప్పు. తన విషయంలో, తన అలవాట్ల విషయంలో, తన చర్యల విషయంలో అయితె ఇంకో అభిప్రాయం మంచిది కాదు. నా ఇజంగేయంలో దీన్నే ఎండగట్టిన.....భాష, సాహిత్యం, సంస్కృతి, మనల్ని (తెలుగువాండ్లని) ఒకటి గనే వుంచెగద. నన్నయ్య మహాభారతం, పోతన భాగవతం, పెద్దన మనుచరిత్ర, విశ్వనాథ ఆంధ్ర ప్రశస్తి, రాయప్రోలు ఆంధ్రావళి, అడవి బాపిరాజు గోన గన్నారెడ్డి, అన్నే తెలుగు పుస్తకాలే. అవీ ఇవీ కూడా మనవే అని అప్పుడూ అనుకున్నం. ఇప్పుడూ అనుకుంటం. వాండ్లు వేరు, మనం వేరు అనే భావం తెలంగాణా వాండ్లకి ఎన్నడూ లేదు. కాని, వీండ్లూ మనవాండ్లే, వీండ్లదీ మన భాషే, వీండ్లదీ మన జీవిత విధానమే, అనేటి భావాలు, మా గురించి పైనుంచి వచ్చినోళ్లకి వుండేటివి కాదు. కాని తెలంగాణ లోపటి పరిస్థితి వేరు......కృష్ణదేవరాయలు, రాజరాజ నరేంద్రుడు, నన్నయ్య భట్టులాగా ప్రతాపరుద్రుడు కూడా మన తెలుగువాడేనని మేమనుకునెటోళ్లం. నన్నయ్య తెలుగువాడు, తిక్కన తెలుగువాడు, ఎల్లయ్య తెలుగువాడు, పుల్లయ్య తెలుగువాడు అని మా అభిప్రాయం. సాహిత్యంతో పరిచయమున్న పది మందికే ఇది పరిమితం".

"మేం తెలుగువాండ్లం, మాది తెలుగు భాష, మాది తెలుగు సాహిత్యం అని మాకు చాలా గొప్పగా వుండేటిది. తెలంగాణా, రాయలసీమ - రెండూ కూడా కలిసి వుంటేనే అది తెలుగు రాష్ట్రమవుతది. మొదటి నుంచీ తెలుగు భాషకీ, సంస్కృతికీ, సాహిత్యానికి ఈ మూడు ప్రాంతాల వాండ్లూ కలిసికట్టుగనే తోడ్పడిన్రు. కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడినంక మాత్రమే మనం రాజకీయంగ ఒకటైనం. ఈ మాట మర్చిపోయి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు తెలంగాణా వాండ్లు తెలుగువాళ్లే కాదన్నట్టు ఒక వ్యవహారముండేటిది గద! ఎవరిదాకానో ఎందుకు? ముఖ్యమంత్రి అంజయ్య (తెలంగాణా) తెలుగు మీద ఎంత గల్లంతు లేచిందీ! ఎన్ని కార్టూనులచ్చినై? అంజయ్య తెలుగు ఎంతచదువుకున్నడు అనేటిది అనవసరం. అతని ఇంట్లో భార్యా బిడ్దలతో గానీ, బయట ఇరుగు పొరుగుతో గానీ, తెలుగులోనె మాట్లాడిండు గద! అతని మాతృ భాష (తెలుగు) లో ఆరణాల కూలీగా కొన్ని వేల కూలీ సభల్లో మాట్టాడిండు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిండు. ఆరణాల కూలీగా పని చేసినోడు ముఖ్యమంత్రి కాకూడదా? కూలీల మాటలు తెలుగు భాష కాదనా? అందరిదీ తెలుగే. అందరం తెలుగోండ్లమే......రావి శాస్త్రి విశాఖ భాషని తెలుగు కాదని మేమూ, నల్గొండ వాండ్లది వేరే యాస కాబట్టి అది తెలుగు కాదని వరంగలోడు, వరంగల్ వానిది తెలుగుకాదని బెజవాడ వాడు, బెజవాడ వానిది తెలుగు కాదని రాయలసీమవాడు - ఇట్లనుకుంటపోతె మన మధ్య సహృద్భావం ఎట్టొస్తది? మనమందరం తెలుగువాండ్లం అని చెప్పే ఎమోషనల్ ఇంటిగ్రేషన్ - అత్మీయత ఏముంటది? ఒకని భాష విషయంలో, యాస విషయంలో, తిండి విషయంలో ఎగతాళి చేస్తే అతని ఆత్మాభిమానం దెబ్బతింటది. దానికి వెల కట్టలేం....."


హైదరాబాద్ రేడియోలో బాలల కార్యక్రమంలో తెలంగాణా పిల్లలు పాల్గొనే అవకాశం రాకపోవడాన్ని ఆయన విమర్శించారు. ఎలా కేవలం రెండు జిల్లాల భాషనే ఇతరులపై రుద్దే ప్రయత్నం జరిగిందో కూడా వివరిస్తారు.

"......... మన విద్యా శాఖ వారు వాడుక భాషలో పాఠ్య పుస్తకాలు పెడ్తమన్నరు. అవి ఎవరి వాడుక భాషలో రాయిస్తరు? కృష్ణా, గుంటూరు జిల్లాల వాడుక భాష అయితే వరంగల్ పోరడు ఎట్ట చదువుతడు?దీని వల్ల తర తరాల ప్రజకి ఎంతో ద్రోహం జరుగుతది. ఇవాళ పాఠ్య గ్రంధాలకి పరిమితమైన భాష రేపు ప్రభుత్వ కచేరీలకు, కోర్టులకు కూడా పాకుతుంది. ప్రామాణిక భాష అనో, శిష్టవ్యావహారిక భాష అనో పేర్లు పెట్టి ఒక గ్రాంధికాన్ని అందరి మీద రుద్దాలని ప్రయత్నం. నువ్వేదైనా పేరు పెట్టు. నీ వాడుక భాషలో నువ్వు రాస్తే నీ జిల్లా వాడికి సౌలభ్యం వుంటుంది. తక్కిన జిల్లాల వాండ్లు ఎన్నేళ్లు తపస్సు చేసినా నీ వ్యావహారికం, నీ యాస వాండ్లు రాయలేరు. ఇవాళ సినిమా భాష, పత్రికా భాష, టి. వి. ల భాష ఎవరిది? రెండు జిల్లాల వాండ్లదే కదా? అన్నిట ఈ రెండు జిల్లాల వాండ్లే ముందుంటరు. తక్కిన జిల్లాల వాండ్లు ఏ నాటికైనా ముందుకు రావడానికి వీల్లేదు. వారికి అడుగడుగున అసౌకర్యం. అడుగడుగునా కష్టమే......మన తెలంగాణా వాండ్లు ఏం మాట్టాడరాదు. ఏవో లెక్కలు చూపిస్తరు........హైద్రాబాద్ రేడియోలో బాలల కార్యక్రమం వుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన (1956) నాటినుంచీ ఈ నాటి (1985) దాకా అంటే దాదాపు 30 ఏండ్లపాటు బాలల కార్యక్రమాలు వందలు వేలు జరిగి వుండాలె కదా. వీటిల్లో తెలంగాణా పిల్లలు (ఆడ మగ) ఎందరు పాల్గొన్నారు? ప్రతి ప్రోగ్రాంల 15 మందో, 20 మందో పాల్గొంటే అందుల తెలంగాణా పిల్లగాండ్లేరి? వాండ్ల వాడుక భాష ఏది? వాండ్లు కనపడరు. వాండ్ల భాష వినపడదు......బిరుదురాజు రామరాజు పిల్లలు, పల్లా దుర్గయ్య పిల్లలు, సినారె పిల్లలు ఎన్నడైనా  బాలానందంల పాల్గొన్నరా? వీండ్లంత పెద్ద పెద్దోండ్లు - వీండ్ల పిల్లలకే గతిలేకపోతే తక్కినోండ్ల పిల్లల గురించి చెప్పేటిదేముంటుంది?మాట్టాడాల్సిన పనే లేదు. ఎందుకంటే రేడియో అన్నయ్య, అక్కయ్యల పాటా, మాటా, యాస ఏదీ తెలంగాణాది కాదు.....".

సర్దార్ జమలాపురం కేశవరావు గారంటే కాళోజీకి అమితమైన గౌరవం. ఆయన మాటలు, చేతలు ఆయనకెంతో నచ్చాయి. తనతో ఆయన జైల్లో వున్నప్పుడు జరిగిన సంఘటనను, ఆయన వుదాత్తతను వివరించడంతో పాటు ఆయన ఆంధ్ర మహాసభ అధ్యక్షుడైనప్పుడు తను రాసిన గేయాన్ని ఆత్మ కథలో ప్రస్తావించారు. తానూ, జమలాపురం ఒకేసారి వరంగల్ నుంచి ఎన్నికల బరిలో దిగిన విషయం, ఎలా ఓడిన విషయం కూడా చెప్పారు.

"నేను వరంగల్ జైల్లో (1947) ఉన్నప్పుడు నిజాం మీద అంతిమ పోరాటం జరుగుతుండె. కాంగ్రెస్ ఉద్యమం, కమ్యూనిస్ట్ ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతున్నయి. అట్టనె వాటితో పాటు ప్రభుత్వ నిర్బంధం కూడా పెచ్చు పెరిగి పోయింది.......నా మీద పెట్టిన కేసు తీర్పు ప్రకారం నాకు సంవత్సరంన్నర శిక్ష. ఆ తీర్పొచ్చే సమయానికి తొమ్మిది నెల్ల నుంచీ నేను జైల్ల వున్న. చిన్న కట్టెపుల్లకి జండా పెడ్తె నేను పోయి పక్కనె నిలబడ్డను. జెండా వందనం చేస్తినని నా మీద కేసు. నిజానికి నేను నిలబడ్డనె గాని వందనమైతె చెయ్యలేదు. ఇది వాస్తవం. శిక్ష ఖాయం చేసి నన్ను బారక్ ల వేసిన్రు. జమలాపురం కేశవ రావు, హీరాలాల్ మోరియా, వల్లభి (అయితరాజు) రామా రావు, పాల్వంచ రంగారావు, ఊటుకూరు నారాయణ రావు, సి. వెంకట రావు, అప్పి వెంకట రాజయ్య-ఇలా పది, పదిహేను మంది వున్నం లోపట. వాండ్లతో పాటు నన్నూ పెట్టిన్రు......ఈ పదిహేను మందితోనె గడపాలె....బాగా తినెటోళ్లం. ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం నాలుగు వరకు చదువుకునెటోండ్లం. అప్పి రాజయ్య గారు ప్రహ్లాద చరిత్ర బాగా చదివి వినిపించేటిది. మోతుకూరి నారాయణ రావుగారు కూడా పురాణాలు బాగా చదివెటోడు. అందరికంటె పెద్దవాడు, మొదటి నుంచీ ఉద్యమంల వున్నవాడు కష్ట నష్టాలు ఓర్చినవాడు జమలాపురం కేశవ రావుగారు. వల్లభాయ్ పటేలుకి లాగానే ఈయనక్కూడా సర్దార్ బిరుదుండేది. అందరి బదులు తనొక్కడే పని చేస్తుండేవాడు. ఆయన తీరే అంత. చెత్తగిన పడివున్నప్పుడు ఎవరికి చెప్పినా వూడుస్తరు. కాని ఎవరికి చెప్పకుండా చీపురు తీసుకుని తనె వూడ్చెటోడు. ఒకరోజు నేను లోపలికి పోయి చూసేవరకు ఆయన వూడుస్తున్నడు. వల్లభి రామారావు అనే ఆయన కూచుని వున్నడు. ’ఏమయ్యా రామారావ్! పెద్దన్న అట్ల వూడుస్తుంటే నువ్వు కూచున్నవ్?అని అడిగిన. ’! అన్ని పనులూ తనే చేస్తున్నననే గొప్పదనం, కీర్తికోసం చేస్తున్నడు. చెయ్యనీఅని ఆయన అనగానే. ఈడ్చి చెంప మీద కొట్టిన. రామారావును ఓదార్చి నన్ను కోప్పడ్డరు కేశవ రావుగారు. అదీ ఆయన వుదాత్తత!"

"కందిలో సర్దార్ జమలాపురం కేశవరావు అధ్యక్షతన ఆఖరి ఆంధ్ర మహాసభ (1946 మే 10, 11 తేదీలలో) జరిగింది. నేనందులో పాల్గొన నందువల్ల కేశవరావు గారి గురించి ఒక గేయం రాసి మిత్రులతోటి అక్కడ చదవమని చెప్పి పంపిన. ఆ గేయం: ’ముస్తాబు చేసుకుని మోటర్ల వూరేగు మురిపెంబు నీ కేమి లేదన్నా...మొండి చేతుల అంగి మోకాలు దాక నీ మొలగుడ్దతోటి తిరుగు కేశన్న!...పల్లె బాటల బాధ ప్రజలతో బాటు నీ బరికాళ్లకె (చెప్పులు లేని కాళ్లు) బాగ గురుతన్నా!...సర్దారు నామంబు సహజ నామంబుగా సరిపోయింది నీకు కేశన్నా!...దిద్ది తీర్చని జుట్టు, ముద్దులొలకని మోము, పెద్దవానికి లోటు కావన్నా!...జబ్బులేని ఒళ్లు, డబ్బులేని జేబు, మబ్బులేని మనసు నీదన్నా!’. జమలాపురం కేశవరావు గారికి వెంకటపతి, నాగేశ్వర్రావు అని ఇద్దరి శిష్యులుండెటోళ్లు. ఈ ముగ్గురూ కలిసి తెలంగాణాలో ఊరూరా తిరుగుతూ, (అటుకులో, బొంగు పేలాలో, బుక్కుకుంటూ, బెల్లం నములుకుంటూ) ఆంధ్ర మహాసభ గురించి ప్రచారం చేసిండ్రు. వాండ్లు తిరగని వూరు లేదని చెప్పవచ్చు. జమలాపురం కేశవరావు  గారు ఆజానుబాహుడు. ధోతి పైకి చెక్కుకునెటోడు. మంచి ఆహార పుష్టిగల మనిషి. ఏది దొరికితే అది తిని, నేలమీద పడుకునీ, బండలమీద పడుకునీ, కాగితాలు పరచుకుని వాటిమీద పడుకుని తిరిగినవాడు....ప్రహ్లాదునిది హరి భక్తి. వీండ్లది ప్రజా భక్తి. ప్రజాసేవకు సర్వం అంకితం చేసిచేసి తిరిగెటోళ్లు. పట్టుదల, కార్యదీక్ష, చొరవ, త్యాగం గల వాండ్ల కృషి వల్లనే ఈ ప్రజా వుద్యమాలు నడిచినై.....అసలు కార్యకర్తలు మాత్రం జమలాపురం లాంటి వాళ్లే".

"జమలాపురం కేశవరావు ఉత్తమోత్తముడు. సామాన్యుల్లో సామాన్యుడు. అసామాన్యుల్లో అసామాన్యుడు. 13 వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడాయనే. తర్వాత కాంగ్రెస్ లో కూడా ప్రముఖుడయిండు. జిల్లా కాన్ఫరెన్సులకి అధ్యక్షుడయిండు. ఆ మహానుభావుడు తాను అధ్యక్షుడిగా వున్న చోట, తన సహచరులతో పాటు పదేసి రోజులు కాంపు వేసి కూర్చుని గుంజలు పాతడం, పందిళ్లు వేయడం, తడికలు కట్టడం దగ్గర్నుంచీ ప్రతిదీ తాను కూడా చేసెటివాడన్న మాట. అతన్ని పెద్దన్నాఅని పిల్చెటోన్ని.....1952 లొ వరంగల్లులో నేను పార్లమెంటు అభ్యర్థిగా నిలబడ్డా. ఆ పార్లమెంటరీ నియోజక వర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా వర్ధన్నపేట నుంచి సర్దార్ జమలాపురం కేశవరావు పోటీ చేసిండు - కాంగ్రెస్ అభ్యర్థిగా. అటువంటి మహానుభావుడు, త్యాగి, ఉద్యమ శక్తిగలవాడు, కాంగ్రెస్ లోపట ఉండేటువంటి కుళ్లు, ద్వేషంతోటి ఓడిపోయిండు. కమ్యూనిస్ట్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు గెలిచిండు. పార్లమెంటు సీటూ గెలిచిండు. అది వుంచుకుని అసెంబ్లీ సీటు రిజైన్ చేసిండు....వర్ధన్నపేట బై ఎలక్షన్ లలో కేశవరావు గారు మళ్లీ నిలబడి ఓడిపోయిండు. కాంగ్రెస్ లో భేదాభిప్రాయాల వల్ల కేశవరావు ఓడిపోయిండు....కేశవరావు స్థానికుడు కాదు. ఆయనకి మధిర లోనో, ఎర్రుపాలెంలోనో టికెట్ ఇస్తే తప్పకుండా గెలిచెటోడు. కాని టికెట్లు ఎలాట్ చేసినోండ్లు కుట్ర చేసిన్రు. హయగ్రీవా చారికి, బొమ్మకంటి సత్యనారాయణకి టికెట్లు రాకపోవడం గమనించాలె. కేశవరావు గారు మంచి నడి వయసులోనె చచ్చిపోయిండు".

ఇలా వుంటాయి ఆయన చమత్కారాలు.

{తూర్పు మల్లారెడ్డి, ఎబికె. ప్రసాద్, వాసుదేవరావు (ఉదయంలో ఉన్నప్పుడు), స్మైల్, మరికొందరు కాళోజీ అభిమానులు రికార్డు చేసిన కాసెట్ల ఆధారంగా ("మనిషి కథ" పేరుతో ముందుమాట రాసింది వరవరరావు) వెలువడిన కాళోజీ ఆత్మకథ "ఇదీ నా గొడవ" నుంచి సేకరణ-జ్వాలా}


No comments:

Post a Comment