Wednesday, April 1, 2020

సీతారామ కళ్యాణం సందేశం : వనం జ్వాలా నరసింహారావు


సీతారామ కళ్యాణం సందేశం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర ప్రభ దినపత్రిక (02-04-2020)

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం బాల కాండలో సీతా కల్యాణ ఘట్టం చదువుతున్నంతసేపూ, యావత్భారత దేశంలో జరిగే హిందూ సాంప్రదాయ వివాహాలు పదే-పదే గుర్తుకొస్తాయి. నాకే కాదు అది చదివిన వారికెవరికైనా అలా గుర్తుకు రావడం సహజం. హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక వివాహం జరగాలన్నా, జరిపించాలన్నా పెళ్ళికి ముందు, పెళ్ళిలో, పెళ్లైన తర్వాత చోటుచేసుకునే ప్రతి విషయానికి సంస్కృతీ-సాంప్రదాయ పరంగానే కాకుండా శాస్త్రీయ కోణంలో ఆలోచించినా ఎన్నో అర్థాలు స్ఫురిస్తాయి. బాల కాండలో సీతా కల్యాణ ఘట్టం పూర్వరంగంలో, వివాహ సమయంలో, ఆ తరువాత జరిగిన తంతు అందరూ తెలుసుకోవాల్సిందే.

విశ్వామిత్రుడి ఆదేశం ప్రకారం శ్రీరాముడు అవలీలగా జనక మహారాజు దగ్గరున్న శివ ధనుస్సు వింటిని అరచేత్తో పట్టుకొని, అల్లెతాటిని బిగువుగా లాగుతుంటేనే, విల్లు ఫెల్లుమని రెండుగా విరిగిపోతుంది. ఇది చూసిన జనకుడు, సీత దశరథ కుమారుడు శ్రీరామచంద్రుడిని భర్తగా పొందడంవల్ల తమ జనక కులానికి కీర్తి సంపాదించిపెట్టినట్లైందని అంటాడు  విశ్వామిత్రుడితో. "నా కూతురు వీర్య శుల్క అని నేను చేసిన ప్రతిజ్ఞ ఫలించింది. నేనన్న మాట ప్రకారం, నా ప్రాణంకంటే ప్రియమైన భూపుత్రి సీతను గొప్ప గుణాలున్న శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం చేస్తాను" అని జనకుడు సీతను రాముడికి ధారాదత్తం చేసే ప్రయత్నం చేయగా, సీతను వివాహమాడడానికి తనకు ఇంకా తండ్రి ఆజ్ఞలేదని అంటాడు రాముడు.

విశ్వామిత్రుడి ఆదేశం మేరకు, మిథిలకు రమ్మని ఆహ్వానిస్తూ, దశరథుడి దగ్గరకు దూతలను పంపాడు జనకుడు. దూతలు అందించిన వార్తను విన్న దశరథ మహారాజు వామదేవ, వశిష్ఠాదులను, మంత్రులను పిలిపించి "మన శ్రీరామచంద్రుడి బల పరాక్రమం చూసి, మెచ్చిన జనకుడు, తనకూతురునిచ్చి వివాహం చేయనున్నాడు. జనకుడు తలపెట్టిన కార్యం మీకు సమ్మతమైతే, ఆలస్యం చేయకుండా పయనమై పోదాం" అనగా మంత్రులందరు ఇది తగిన కార్యమేనని, మంచి సంబంధమేనని అన్నారు.

మర్నాడు దశరథుడు చతురంగ బలాలతో, వాసుదేవుడు, వశిష్టుడు, జాబాలి, కాశ్యపుడు,  మార్కండేయుడు, కాత్యాయనుడు లాంటి పెద్దలతో కలిసి బయలుదేరి విదేహనగరం చేరుకుంటాడు. ఆయన రాకను తెలుసుకున్న జనకుడు స్వాగతం పలికి, "నా పుణ్యం మంచిదైనందున, సూర్య వంశపు రాజులతో వియ్య మాడే అవకాశం కలిగింది. మిక్కిలి బలవంతులైన మీతో బంధుత్వం కలుస్తున్నందువల్ల మా వంశం అతి పూజ్యమైంది" అంటాడు. వివాహానికి సన్నాహాలు మొదలయ్యాయి. మర్నాడుదయం, జనకుడి ఆహ్వానాన్ని అందుకుని దశరథుడు ఋషులతో బంధువులతో కలిసి జనకుడున్న చోటికి పోయి, ఆయనకు వశిష్టుడిని చూపించి, ఇక్ష్వాకువంశానికి ఆయన కులగురువనీ, తమ గురించి చెప్పాల్సిన విషయాలన్ని ఆయన చెప్తాడనీ అంటాడు.

హితులతో-మంత్రులతో-పురోహితులతో కూడి వున్న జనకుడితో వశిష్టుడు సూర్యవంశక్రమాన్ని వివరించాడు. "అవ్యక్తసంభవుడు, నిత్యుడు, అవ్యయుడైన చతుర్ముఖ బ్రహ్మకు మరీచి జన్మించాడు. మరీచికి కశ్యపుడు, ఆయనకు వివస్వంతుడు, ఆయనకు మనువు, ఆయనకు ఇక్ష్వాకుడు కలిగారు. ఇక్ష్వాకుడి రాజధాని అయోధ్య" అంటూ మొదలుపెట్టి, చివరలో అంబరీషుడుకి నహుషుడు, అతడికి యయాతి, అతడికి ఆభాగుడు, అతడికి అజుడు, అతడికి బలశాలైన దశరథుడు కొడుకులుగా పుట్టారు" అని సూర్యవంశ క్రమాన్ని సవివరంగా తెలియచేశాడు. దశరథుడి కుమారులే శ్రీరామలక్ష్మణులనీ, వీరి వంశం ఆదినుండి పరిశుద్ధమైందనీ, వీరందరు అసమాన ధర్మరతులు, వీరులనీ, సత్యమంటే ప్రీతికలవారనీ అంటూ, శ్రీరామచంద్రుడికి, లక్ష్మణుడికి సరితూగే గుణగణాలుగల తన ఇరువురు పుత్రికలను ప్రేమపూర్వకంగా ఇచ్చి వివాహం చేయమని, ఇది తన మనవి అని కోరాడు జనకుడిని.

         ఇక్ష్వాకుల వంశ క్రమం వివరించిన వశిష్టుడితో జనక మహారాజు తనవంశక్రమాన్ని కూడా వినిపించాడు. తమ వంశానికి పూర్వీకుడు ధర్మాత్ముడైన "నిమి" అనీ, అతడి కొడుకు మిథి అనే మహాత్ముడే ఈ మిథిలా పురాన్ని కట్టించాడనీ, ఆయనే మొదటి జనకుడనీ, ఆ పేరే తమ వంశంలో "జనకుడు" అని రాసాగిందనీ, అదే వంశ నామం అయిందనీ అంటాడు.  మిథి కొడుకు దగ్గరనుంచి మొదలెట్టి, మహారోముడికి స్వర్ణరోముడు, అతడికి హ్రస్వరోముడు , హ్రస్వరోముడికి తను తన తమ్ముడు కుశధ్వజుడు కొడుకులమని వంశ క్రమాన్ని వివరించిన జనకుడు దశరథుడితో, ముమ్మాటికి తన ఇద్దరు కూతుళ్లను ఆయన ఇద్దరు కుమారులకిస్తానని చెప్పాడు. మూడు రోజుల తర్వాత ఉత్తర ఫల్గుని నక్షత్రం వస్తుందనీ, ఆ రోజున వివాహం చేద్దామనీ అంటాడు.

         ఆ రాత్రి కొడుకులతో వినోదంగా గడిపి దశరథుడు, మర్నాడు ఉదయం తూర్పు తెల్లవారుతుండగానే, కాల కృత్యాలు తీర్చుకొని పెళ్లిజరిపించేందుకై ఏర్పాటుచేసిన ఉత్సవ శాలకు చేరుకున్నాడు. అందమైన ఆభరణాలను ధరించి, కంకణం కట్టుకొని, రామచంద్రమూర్తి మంచి ముహూర్తంలో తమ్ములతో కలిసి వచ్చాడక్కడకు. వశిష్టుడు, ఇతర మునీంద్రులు ముందుండి తమ వెంట వస్తుంటే అందరూ కలిసి లోపలికి వెళ్లారు. అలా ప్రవేశిస్తుండగానే వశిష్టుడు జనక రాజును చూసి, దాత కొరకు దశరథుడు వేచి వున్నాడని చెప్పాడు. ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు ఒకచోట వున్నప్పుడే తదుపరి తతంగం జరుగుతుందని అంటూ, ఆయన స్వధర్మమైన, దాత చేయాల్సిన కార్యమైన పెళ్లి జరిపించమని వశిష్టుడు జనకుడికి తెలియచేశాడు.


వశిష్టుడితో జనకుడు, ఇతర ఋశీష్వరులతో కలిసి త్రిలోకాభిరాముడైన రామచంద్రమూర్తికి శీఘ్రంగా-సంతోషంగా వివాహ సంబంధమైన కార్యాలన్నీ జరిపించమని అన్నాడు. అలానే జరిపిస్తామన్న వశిష్టుడు, తనకు సహాయంగా విశ్వామిత్రుడు, శతానందుడు (జనకుడి పురోహితుడు) తోడుండగా వివాహ సంబంధమైన కార్యక్రమం చేపట్టాడు. చలువ పందిరిలో శాస్త్ర ప్రకారం వేదిని తీర్చి, పూలతో-పరిమళ ద్రవ్యాలతో దానిని అలంకరించి, మెరుస్తున్న బంగారు పాలికలతో, మొలకెత్తిన శుభకరమైన అడుగులేని పాత్రలతో, జిగుళ్లుగల మూకుళ్లతో, ధూపమున్న ధూప పాత్రలతో, స్రుక్కులు, స్రువాలు, అర్ఘ్యం పేలాలతో నిండిన స్వచ్ఛ పాత్రలతో, పచ్చని అక్షతలతో వేదిని నింపాడు వశిష్టుడు. మంత్రాలు పఠిస్తూ, పరిశుద్ధమైన దర్భలను పరిచి, శాస్త్రోక్తంగా వేదిలో అగ్నిని వుంచి, వశిష్టుడు హోమం చేశాడు.

సీతా కల్యాణ ఘట్టం
" సీతను సర్వాభరణో, పేతను దా నిలిపి నగ్ని కెదురుగ గౌస
ల్యా తనయున  కభిముఖముగ,  క్ష్మాతలనాథుండు రామచంద్రున కనియెన్ "

         అన్ని విధాలైన అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతను, అగ్నికి ఎదురుగా-శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగానిలువ బెట్టిజనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో ఇలా అన్నాడు:

ఈ సీత నాదుకూతురు, నీ సహధర్మచరి దీని నిం గై కొనుమా
కౌసల్యాసుత, నీకును భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్ "

         "కౌసల్యా కుమారా, ఈ సీత నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో. నీకు జగత్ ప్రసిద్ధమైన మేలు కలుగుతుంది. నీకు శుభం కలుగుతుంది. మంత్రపూర్వకంగా ఈమె చేతిని నీ చేత్తో పట్టుకో. రామచంద్రా, పతివ్రత, మహా భాగ్యవతి అయిన నీ సీత, నీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి వుండదు" అని అంటూ, మంత్రోచ్ఛారణతో పవిత్రవంతములైన జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోశాడు.

         తర్వాత, జనక మహారాజు లక్ష్మణుడివైపు చూసి, "లక్ష్మణా ఇటు రా. దానంగా ఊర్మిళను స్వీకరించు. ప్రీతిపూర్వకంగా ఇస్తున్నాను. ఈమె చేతిని ప్రేమతో గ్రహించు" మని కోరాడు. ఊర్మిళను లక్ష్మణుడికిచ్చిన తర్వాత, భరతుడిని మాండవి చేతిని, శత్రుఘ్నుడిని శ్రుతకీర్తి చేతిని గ్రహించమని ప్రేమతో పలికాడు జనకుడు. ఇలా నలుగురు కన్యలను దశరథుడి నలుగురు కొడుకులకు ధారపోసి, జనకుడు రాజకుమారులతో, దోష రహితమైన మనసున్న వారందరు సుందరులైన భార్యలతో కలిసి, సౌమ్య గుణంగలవారిగానూ, సదాచార సంపన్నులుగానూ కమ్మని అంటాడు. జనక మహారాజు మాటలను విన్న దశరథుడి కుమారులు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, తండ్రి అనుమతితో భార్యల చేతులను తమ చేతుల్లో వుంచుకొని, సంతోషాతిషయంతో, మలినంలేని భక్తితో, అగ్నికి, వేదికి, మౌనీశ్వరులందరికి, రాజులకు భార్యలతో కలిసి ప్రదక్షిణ చేసారు. వివాహం శాస్త్ర ప్రకారం ప్రసిద్ధంగా జరిగింది. పూలవాన కురిసింది. ఆకాశంలో దేవ దుందుభులు ధ్వనించాయి. దేవతా స్త్రీలు నాట్యం చేసారు. గంధర్వ కాంతలు పాడారు. మంగళ వాద్యాలు మోగుతుంటే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణ చేయడంతో పెళ్లి తంతు ముగిసింది. తమ భార్యలతో దశరథ కుమారులు విడిది ఇళ్లకు పోవడంతో, వారివెంట దశరథుడు, వశిష్ఠ విశ్వామిత్రాది మునీశ్వరులతో, బందువులతో విడిదికి పోయారు.

వివాహమైన మర్నాటి ఉదయం, అయోధ్యకు పోయేందుకు తమకు అనుమతినివ్వమని జనకుడిని కోరాడు దశరథుడు. సరేనన్న జనకుడు, దశరథ మహారాజుతో కలిసి,  తాను కొంతదూరం ప్రయాణంచేసి-వారందరిని సాగనంపి, ఆయన అనుమతితో తన ఇంటికి తిరుగు ప్రయాణమై పోయాడు.

సీతా కల్యాణ ఘట్టం ముందర, కల్యాణ సమయంలో, ఆ తర్వాత జరిగిన తంతు చదువుతుంటే కొన్ని ముఖ్యమైన విషయాలు అర్థమవుతాయి. శివ ధనుస్సును విరిచిన శ్రీరాముడికి తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం సీతనిచ్చి వివాహం చేస్తానని జనకుడన్నప్పటికీ, తనకు తండ్రి ఆజ్ఞ ముఖ్యమంటాడు రాముడు. అంటే పెద్దల ఆజ్ఞ లేకుండా, వారికి తెలియకుండా వివాహం చేసుకోకూడదనే విషయం అర్థమవుతున్నది. జనకుడు వెంటనే దశరథుడి సమ్మతి పొందడానికి దూతలను పంపాడు. దశరథుడు కూడా ఆ విషయాన్ని తన సన్నిహితులందరికీ తెలియచేసి, వారి సమ్మతితోనే మిథిలకు బయల్దేరాడు. అంటే వివాహానికి బంధు, మిత్రుల ఆమోదం కూడా ముఖ్యమేనని అర్థం. విదేహనగరం చేరుకున్న దశరథుడికి, ఆయన వెంట వచ్చిన పెద్దలకు జనకుడు స్వాగతం పలికిన విధానం కూడా సందేశాత్మకమైందే.

         ఇక దశరథుడి పక్షాన వశిష్టుడు, జనకుడి పక్షాన స్వయంగా ఆయనే, వారి, వారి వంశ క్రమాన్ని వివరించారు. కన్యను ఇచ్చుకొనేటప్పుడు, పుచ్చుకొనేటప్పుడు, అధమ పక్షం మూడు తరాల వంశ జ్ఞానం ప్రధానంగా తెలుసుకోవాలి. నేపధ్యం తెలుసుకోకుండా కన్యను ఇవ్వకూడదు, తీసుకొననూ కూడదు. వివాహంలో వధూవరుల నేపధ్యం అవశ్యంగా తెలియాలి. తొలుత తల్లి నేపధ్యం, తర్వాత తండ్రి నేపధ్యం పరీక్షించాలి. వివాహ విషయంలో పది రకాల వంశం వారిని గురించి తెలుసుకోవాలని శాస్త్రం చెపుతున్నదన్న సంగతి విదితమవుతుందిక్కడ.

ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని, ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా, అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై, సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివిధ కులాలను బట్టి, ప్రాంతాలను బట్టి కొద్ది తేడాలున్నప్పటికీ, స్థూలంగా భారతదేశంలో జరిగే హిందూ వివాహాలన్నీ ఒక పద్ధతిలోనే ఉంటాయి.

No comments:

Post a Comment