Tuesday, March 2, 2021

పరిమితులు లేని పరోక్ష ఉపాధి : వనం జ్వాలా నరసింహారావు

 పరిమితులు లేని పరోక్ష ఉపాధి

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (03-03-2021)

తెలంగాణ రాష్ట్రం విషయంలో, ఆ మాటకొస్తే యావద్భారతదేశంలో కానీ, ప్రపంచంలో కానీ, ఉపాధి కల్పన లేదా ఉద్యోగాల నియామకం పట్ల మేధావుల్లో, మేధావేతరులలో ఉన్న భావన, దృక్పథం కొంతమేరకన్నా పునరాలోచన చేయాల్సిన, పునర్నిర్వచించాల్సిన సమయమిది. కేవలం గణాంకాల, గుణాంకాల ఆధారంగా, ప్రభుత్వశాఖల్లో కానీ, ప్రభుత్వేతర లేదా ప్రభుత్వరంగ సంస్థలలో చేపట్టిన, పూర్తిచేసిన నియామకాలు, ఉద్యోగాలు మాత్రమే ఉద్యోగాలు కాదని, సద్విమర్శకులు, కువిమర్శకులు గ్రహించాలి. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఒకటి కాదు వంద విధాల  జీవనోపాధికి మార్గం సుగమం చేసే క్రమంలో, తద్వారా అసలు-సిసలైన ఉద్యోగభద్రత సృష్టించే క్రమంలో తెలంగాణలో అనేకానేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, అమలు చేయడం, చేస్తుండడం జరిగింది. తద్వారా ప్రజల నెలవారీ, వార్షిక ఆదాయం పెంపొందించడంతో వారిని భద్రతగా, భరోసాగా చేసి, తమ కాళ్లమీద తాము నిలబడగలిగేట్లు చేసింది కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదంతా గణాంకాల రూపంలో చూపిస్తే లక్షలాది మందికి లబ్ది చేకూర్చినట్లు రుజువవుతుంది.  

         తెలంగాణ  సమాజానికి ఏం కావాలి? వాటిని ఎలా సమకూర్చాలనే విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కు పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, ఇంకా చెప్పాలంటే రాష్ట్రసాధన ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నప్పటినుండి సంపూర్ణ అవగాహన, ఆలోచన స్పష్టంగా వున్నది. ప్రజలందరి సంపద, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని దానిని ఏ రకంగా పెంపొందించాలి  అన్న  అవసరాన్ని ఆయన నిరంతరం ఆలోచిస్తూ, అధ్యయనం చేస్తూ, ఆ దిశగా నిర్వచిస్తూ, రూపకల్పన చేస్తూ, వృద్ధిచేస్తూ, అమలుపరుస్తూ, తదనుగుణమైన సలహాలు, సూచనలిస్తూ పకడ్బందీ ప్రణాళికతో విజయపథాన ముందుకు సాగుతున్నారు.

కేసీఆర్ ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సుపై శ్రద్ధ వహించటం పట్లే దృష్టి కేంద్రీకరించారు కాబట్టే, దీర్ఘకాలిక ప్రయోజనాలే ధ్యేయంగా సంపద సృష్టించడం మీద పథకాలన్నీ రూపకల్పన చేశారు. ఆయన రూపొందించిన పథకాలన్నీ ఒకవైపు తక్షణ ప్రయోజనాలు సమకూరుస్తూనే, మరోవైపు శాశ్వతంగా, స్వయంచాలకంగా ఉపాధి కల్పనకు బాటలు వేశాయి.  ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఇటీవలికాలంలో కొందరు చాలా తప్పుగా నిర్వచించడం దురదృష్టం. సంపద సృష్టి, సామాజిక భద్రత, ప్రజల్లో జీవించగలమన్న ధీమా కలిగించడం, తెలంగాణ రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా వనరులను సద్వినియోగం చేయడం, ఎవరికాళ్లమీద వారిని నిలబడే విధంగా చేయడం ముఖ్యం కానీ, ఏదో చదువుకున్న కొందరికి మాత్రమే కొన్ని ఉద్యోగాలు ఇచ్చి, ఇదే ఉపాధి కల్పన అనడం సరైనది కాదు. సమాజంలో వున్న అన్నిరకాల వారికి-వారు చదువుకున్నా, చదువుకోక పోయినా, ఉపాధి కల్పన కలిగించడమే లక్ష్యంగా ఉండాలి. సరిగ్గా ఇదే జరుగుతున్నది తెలంగాణ రాష్ట్రంలో.

సంపద పెంచడం, దాన్ని ప్రజల సంక్షేమానికి పంచడం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత ఆరున్నర సంవత్సరాల కాలంలో అపారమైన సంపద సృష్టించడం జరిగింది. మన దేశాన్ని సంక్షేమ రాజ్యంగా నిర్వచించాం. సంక్షేమ రాష్ట్రం అనేది ప్రభుత్వానికి ఒక రూపం, దీనిలో సమాన అవకాశం, సంపద సమాన పంపిణీ సూత్రాల ఆధారంగా రాష్ట్రoలోని పౌరుల ఆర్థిక, సామాజిక శ్రేయస్సును పరిరక్షిస్తుంది. ఆ దిశగా ప్రోత్సహిస్తుంది. సంక్షేమ రాజ్యం అనేది పాలనా విధానం, దీనిలో రాష్ట్రం లేదా సామాజిక సంస్థలు  స్థాపించిన సమూహం దాని పౌరులకు ప్రాథమిక ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఒకానొక నిర్వచనం ప్రకారం, సంక్షేమ రాజ్యంలో ప్రభుత్వం తన పౌరుల వ్యక్తిగత, సామాజిక సంక్షేమానికి బాధ్యత వహిస్తుంది. సంక్షేమ రాజ్యం  ప్రాథమిక లక్షణం సామాజిక బీమా. దాంతో ప్రజలకు ధీమా. కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రం విషయంలో ఈ ప్రాథమిక భావనలన్నీ వందకు వందశాతం దక్కించుకున్నాయి.

ఈ సైద్ధాంతిక సందర్భం నేపథ్యంలో, ఉద్యోగం లేదా లాభదాయకమైన ఉపాధి పొందడం అనే వాటి మధ్య వ్యత్యాసాన్ని, ఏది సరైనది అనే విషయాల్ని అర్థం చేసుకోవాలి. ప్రపంచంలోని ఏ  దేశమూ, దేశంలోని ఏ రాష్ట్రమూ ప్రభుత్వ రంగంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగేపని కాదు. ఆయా రాష్ట్ర పరిస్థితులను బట్టి, ప్రభుత్వానికి అవసరమైన కొన్ని వేల ఉద్యోగాలను మాత్రమే ఇవ్వడానికి వీలున్నది. కానీ నిరుద్యోగులందరికీ ఉద్యోగం ప్రభుత్వ పరంగా ఇవ్వడం వీలుకాదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సంపదను సృష్టించి, తద్వారా ప్రతివారూ తమకనుకూలమైన ఉపాధిని తామే సమకూర్చుకునే వీలు కలిగించడమే సరైన ప్రత్యామ్నాయం. ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుతున్నది.

తెలంగాణ ప్రభుత్వం ఓవైపు భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలుచేస్తూనే మరోవైపు ప్రజలపై భారం పడకుండా ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి సొంత ఆదాయం రూ.35వేల కోట్లు కాగా ప్రస్తుతం రూ.80వేల కోట్లకు పెరిగింది. సొంత రాబడుల వృద్ధిరేటులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలువడం మరో విశేషం. ఇతర రాష్ర్టాల ఆదాయ వృద్ధి రేటు సగటున 9.7 శాతం ఉండగా, తెలంగాణ ఆదాయ వృద్ధిరేటు 16 శాతంగా ఉన్నది. తెలంగాణ ఏర్పడినప్పుడు బడ్జెట్‌ లోటు రూ.5,547 కోట్లు కాగా ఆ మరుసటి సంవత్సరం నుంచే  పరిస్థితి తారుమారై మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించింది. నేటికీ వరుసగా మిగులు రాష్ట్రంగానే  నిలుస్తున్నది.  రాష్ర్టాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు పూర్తిస్థాయి ఫలితాలిచ్చాయి.

గత ఆరున్నర సంవత్సరాలుగా కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, విధానాలు, ప్రజోపయోగ పథకాలను నిశితంగా పరిశీలిస్తే, ప్రతి కొలమానికలోను సంపదను సృష్టించడం, స్వయం ప్రతిపత్తి  లక్ష్యంగా ప్రజలను తీర్చిదిద్దడం అనే రెండింటినీ ప్రభుత్వం ప్రాతిపదికగా ఎంచుకున్నదని స్పష్టమవుతున్నది. కెసిఆర్ ప్రభుత్వంలోని ఏ పథకాన్ని, కార్యక్రమాన్ని తీసుకున్నప్పటికీ సంపదను సృష్టించడానికి దానితో అనుసంధానించటానికీ అవకాశం, ఆస్కారం కనిపిస్తుంది.

ఉదాహరణకు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలు తీసుకుంటే, అవి పరిమితి లేనంతగా ఆర్థిక కార్యకలాపాలను అంతర్లీనంగా కలిగి ఉన్నాయనేది స్పష్టం. మరింత వివరాల్లోకి పొతే, పల్లె ప్రగతి కింద ప్రతి గ్రామ పంచాయతీకి శిథిలాలను, వ్యర్థాలను డంప్ చేయడానికి, మొక్కలకు నీరు పోయడానికి, ట్రాలీ, ట్యాంకర్‌తో కూడిన ఒక ట్రాక్టర్ సమకూర్చబడింది. ట్రెయిలర్, ట్యాంకర్‌తో ప్రతీ ట్రాక్టర్ కార్యాచరణ వల్ల కనీసం ముగ్గురు వ్యక్తులకు ఉపాధి అవకాశాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 84 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఈ ట్రాక్టర్లు ఉండేవి. కానీ, స్వరాష్ట్రంలో ఈ రోజు వందకు వందశాతం 12,769 గ్రామాలకు ట్రాలీ, ట్యాంకర్‌తో కూడిన ట్రాక్టర్లను సమకూర్చుకున్నాం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నిగ్రామాల్లో ఎన్ని వేల మందికి ఉపాధిని సృష్టించిందో మనమంతా ఆలోచించ దగ్గ అంశం. దీన్ని మనం ఉద్యోగ కల్పనగా పరిగణించకూడదా? వీరందరికీ ఉద్యోగం ఇచ్చినట్లా.. ఇవ్వనట్లా?

అదేవిధంగా వంశపారంపర్య వృత్తులను సాధికారపరచడానికి ఉద్దేశించిన కార్యక్రమాలను తీసుకుందాం. అవి గొర్రెల పెంపకం, చేపల పెంపకం, పండ్ల తోటలు, పాడి పరిశ్రమకు ఇచ్చే ప్రోత్సాహకాలు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక సెలూన్లు (క్షౌరశాలలు) తెరవడానికి సహాయం చేయడం ఇంకా, స్వర్ణకారులే తమ వర్క్‌షాప్ ద్వారా అమ్మకపు దుకాణాన్ని పెట్టుకోవడానికి సహాయం చేయడం వంటివి కొత్త ఉపాధి అవకాశాలను కలిగించాయి. అనేక నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా జలాశయాల్లో చేపల సంపదను అభివృద్ధి చేశారు. తెలంగాణ రాష్ట్రం మాంసం, చేపలను ఇతర రాష్ట్రాలకు  దేశాలకి ఎగుమతి చేయడం ప్రారంభించే రోజు చాలా దూరంలో లేదు. ఇవన్నీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆర్థిక కార్యకలాపాలను పెంచుతాయి, ఇది వ్యక్తిగత సంపదను, మార్కెట్ సంపదను రెండింటినీ సృష్టిస్తుంది. దీన్ని మనం ఉద్యోగ-ఉపాధి కల్పనగా పరిగణించకూడదా?

రైతులకు ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం అందించే రైతుబంధు వంటి మరో ప్రధాన పథకాన్ని తీసుకోండి. ప్రతి రైతుకు సంవత్సరంలో రెండు పంటలకు కలిపి ఎకరానికి రు.10,000 ఇచ్చే పంటసాయం వల్ల రైతు తన వ్యవసాయ పనుల్లో మరికొందరిని పనుల్లోకి తీసుకొని మరింత పంట పండిస్తాడు. ఇలా ప్రతి రైతుకు అదనంగా వ్యక్తులు అవసరమే కదా. ఇలా అంచనా వేస్తే అదంతా ఉపాధికల్పన కిందా రాదా? ఇది ఉపాధి, ఉద్యోగాలను సమకూర్చడం కాదా?

భారీ, మధ్య, చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం కూడా ఎక్కువ మంది ఉద్యోగులకు అవకాశం కల్పించే జాబితాలోనే చేరుతుంది. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత, వాటిని నిర్వహించడానికి మనకి పెద్ద మానవ శ్రమశక్తి అవసరం. వ్యవసాయ రంగంలో యాoత్రీకరణ కూడా ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. ఇది ఉపాధి కాదా? రైతు బీమా ఒక సామాజిక ధీమా. ఈ పథకం కింద అర్హులైన రైతులు ఏ కారణంతోనైనా సరే మరణిస్తే, 10 రోజుల్లో ఆ రైతుల కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సొమ్ము అందుతున్నది. ఈ విధంగా కుటుంబ పెద్దను కోల్పోయిన ఏ దిక్కూ లేకుండా ఉన్న వేలాది కుటుంబాల సభ్యులను వారి స్వంత కాళ్లమీద నిలబెట్టి, వారి జీవనోపాధికి అవకాశం కల్పించింది ఈ పథకం.

రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి కొరకు, ఏదైనా మూల్యాంకనం కోసం, తలసరి లెక్కింపు వాస్తవ స్థానాన్ని ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట డిమాండ్ తో పాటు విద్యుత్ వినియోగం కూడా అంతకంతకూ పెరుగుతున్నది. 2014లో తెలంగాణలో 39,866 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగగా, 2019-20 నాటికి వినియోగం 68,674 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అంటే ఆరున్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో పెరుగుదల 28,808 మిలియన్ యూనిట్లు ఉండగా, పెరిగిన శాతం 72 నమోదైంది. ఇది వ్యక్తి యొక్క సంపదకు, ఆర్థిక పరిపుష్టికి బలానికి సూచిక. విద్యుత్ రంగంలో సంస్కరణలు, పునర్నిర్మాణం.. శాశ్వత విద్యుత్ సంక్షోభం నుండి విద్యుత్ మిగులు పంచే రాష్ట్రానికి దోహద పడడమే కదా. వేలాది మంది నైపుణ్యం పొందిన, నైపుణ్యం లేని ప్రజలకు లాభదాయకమైన ఉపాధి పొందడానికి విస్తారమైన అవకాశాలను తెరిచింది.

నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన నినాదాలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నేడు ఆ మూడు రంగాలలో విశేష ప్రగతిని సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేనాటికి 2013-14లో తలసరి ఆదాయం రూ.1,12,162 ఉండేది. 2019-20 నాటికి ప్రస్తుత ధరలవద్ద రూ. 2,28,216 వరకు పెరిగింది. తలసరి ఆదాయం పెరుగుదల రూ.1,16,054కాగా, పెరిగినశాతం 103.46గా నమోదైంది. తలసరి ఆదాయంలో ఆనాడు దేశంలో 14వ ర్యాంకులో ఉండగా, నేడు మనం 5వ ర్యాంకు వరకు చేరుకున్నాం. అదేకాలంలో రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) 2014 లో రూ.4.51 లక్షల కోట్లు కాగా, 2019-20 కల్లా రూ.9.69 లక్షల కోట్లకు పెరిగింది. ఆ విధంగా జేఎస్డీపీ వృద్ధి రేటు 12.60 శాతం చేరుకుంది. ఇంత వేగవంతమైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రం దేశంలో మరొకటి ఉండకపోవచ్చన్నది ఆర్థిక నిపుణుల అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రంలో గొప్ప సంపద సృష్టి జరిగిందనడానికి మరో సూచిక.

అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవలసిన అవసరo పట్ల కేసీఆర్ దృష్టి కేంద్రీకరించడం వల్ల ఆయన రూపకల్పన చేసిన పథకాలు, విధానాలు, కార్యక్రమాలన్నీ ఈ దిశగానే రూపొందించబడ్డాయి. ఆ రకంగానే అమలు చేయబడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడంతోపాటు, అదనపు జిల్లాలను, అదనపు  రెవెన్యూ డివిజన్లను, అదనపు మండలాలను, అదనపు గ్రామ పంచాయతీలను, అదనపు మున్సిపాలిటీలను, అదనపు  కార్పొరేషన్లను,  అదనపు పోలీస్ కమిషరేట్లను, అదనపు పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.  ఇలాంటి పాలనా సంస్కరణలతో సీఎం కెసిఆర్ తను సంకల్పించినట్లుగానే అనేక ఉద్యోగాలను సృష్టించారు. ఇది మరింత సంపదని సృష్టించింది. వైకుంఠధామాలు, స్మశానవాటికలు, సమీక్కృత మాంసాహార, శాఖాహార మార్కెట్లు, గ్రామగ్రామాన నర్సరీలు, రైతు వేదికలు ఏర్పాటు చేయడం, మొదలైనవన్నీ ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించాయి.

చేనేత రంగంలో తీసుకున్న సంక్షేమ, అభివృద్ధి చర్యల వల్ల ఈ రంగాన్ని కష్టాల నుండి బయటకు తీయడమే కాక, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా సహాయపడ్డాయి. ఈ రంగానికి తోడ్పడటానికి, రెసిడెన్షియల్ సహా అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు తమకు అవసరమైన పాఠశాల దుస్తులు, చేనేత/ విద్యుత్ మగ్గం రంగాల నుంచే కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో చేనేత రంగం జోరును పెరిగి, మరింత ఉపాధి, సంపద సృష్టికి దారితీసింది. ఇన్నిరంగాల వారీగా విశ్లేషణ చేస్తే, ఫలితాలు మనసును కదిలించేవిగా ఉంటాయి. కెసిఆర్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న తెలంగాణ రాష్ట్రం మరింత సంపద సృష్టిని ఎలా సాధించిందో నిరూపిస్తుంది  తద్వారా ఎక్కువ ఉద్యోగాలు  మరింత లాభదాయకమైన ఉపాధి, జీవనోపాధి పొందేందుకు దోహదపడుతుంది.

ఒకవైపు సంపదను అపారంగా సృష్టిస్తూనే, మరోవైపు గత ఆరున్నరేళ్లలో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో మొత్తం 1,32,899 ఉద్యోగాలివ్వడం జరిగింది. ఐటి రంగంలో 5.82 లక్షలు, పారిశ్రామిక రంగంలో 14.96 లక్షల మంది ఉద్యోగాలు పొందారు. మొత్తంగా ప్రభుత్వ, ప్రభుత్వేతర ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలన్నింటినీ కలిపి లెక్కిస్తే 22 లక్షల వరకు అవుతున్నాయనేది ఎవరూ కాదనలేని నిజం.

ఈ విధంగా చూస్తే తెలంగాణాలో సృష్టించబడ్డ సంపద పరోక్షంగా అనేక రంగాల్లో ఉద్యోగ-ఉపాధి కల్పనకు దోహదపడుతుందనడంలో అతిశయోక్తి లేదు.

 

No comments:

Post a Comment