Monday, December 6, 2021

ఆర్ధిక నిపుణుడి ఆరోగ్యసేవలు : వనం జ్వాలా నరసింహారావు

 ఆర్ధిక నిపుణుడి ఆరోగ్యసేవలు

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (07-12-2021)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ స్వర్గీయ రోశయ్యతో నాకున్న సాన్నిహిత్యం సుమారు మూడు దశాబ్దాలకు పైగానే. బహుశా ఆ సాన్నిహిత్యంతోనే రోశయ్య ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాలుగైదు రోజుల్లో, కలవడానికి సమయం కేటాయించమని కార్యాలయ సిబ్బందిని కోరకుండానే, ఆయనను కలిసేందుకు మితృడు భండారు శ్రీనివాస రావుతో కలిసి వెళ్లాను. కలవడానికి ధైర్యంగా వెళ్ళిన మేము ఆయన గారి ముందు గదిలో కూర్చొన పోతుండగా, ముఖ్యమంత్రిని కలిసిన వ్యక్తి ఒకరు లోపలి నుంచి బయటకొస్తున్నప్పుడు తలుపు తీయడంతో, మమ్మల్ని చూసిన రోశయ్య, పేర్లు పెట్టి పిలిచి మమ్మల్ని రమ్మన్నారు. ముఖ్యమంత్రికి నమస్కారం చేసి, మర్యాదపూర్వకంగా ఆయనను కలవడానికి, అభినందనలు వ్యక్తిగతంగా చెప్పడానికి మాత్రమే వచ్చామని, ఆ రెండూ అయ్యాయి కనుక వెళ్తామని చెప్పాం. సున్నితంగా మా కోరికను తిరస్కరించి, మమ్మల్ని కూచోమని అనడమే కాకుండా, ఎప్పటి రోశయ్య గారి లాగానే, మాట్లాడారు గంటకు పైగా.

ఆ తర్వాత నేను అమెరికాలో మా పిల్లలతో వున్నప్పుడు దసరా, సంక్రాంతి పండుగలకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఫోన్ చేసినప్పుడు, ఇంకే ముఖ్యమంత్రి కూడా (బహుశా) కేటాయించనంత సమయం నాతోను, అక్కడుంటున్న మా అమ్మాయితోను మాట్లాడడానికి కేటాయించడం, ఆత్మీయంగా కుశల ప్రశ్నలు అడగడం, ఆయన నిరాడంబరానికి నిదర్శనం. ఒక ముఖ్యమంత్రి, అందునా అప్పట్లో వున్న పరిస్థితుల్లో, ఫోన్లో దొరకడం, సంభాషించడం నా లాంటివారెప్పుడూ మరిచిపోలేని మరుపు రాని సంఘటన.

రోశయ్యతో నాకు మొదటిసారి దగ్గరగా పరిచయం 1989 లో అయింది. అంతకుముందు కలిసినా అంతగా పరిచయం చేసుకునే అవకాశం కలగలేదు. అప్పట్లో నేను గవర్నర్ కుముద్ బెన్ జోషి దగ్గర పనిచేస్తున్నప్పటికీ, పాత్రికేయ ప్రవృత్తితో వున్న సంబంధం నన్ను స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డితో పరిచయానికి దారితీసింది. అదే క్రమంలో, చెన్నారెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కావడంతో నేనాయనకు మరింత చేరువయ్యాను. ఎన్ టీ రామారావు సారధ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించడానికి పటిష్టమైన నాయకత్వం కొరకు పీసీసీ అధ్యక్షుడిగా చెన్నారెడ్డిని నియమించడంతో, ఆయనకు ఆ లక్ష్యంలో తోడ్పడిన ముఖ్యుల్లో ప్రథముడైన రోశయ్యతో పరిచయం కలిగింది. 1989 సంవత్సరాంతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చెన్నారెడ్డికి అన్ని విషయాల్లో చేదోడుగా వుండేవారు రోశయ్య.

ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం, చెన్నారెడ్డి ముఖ్యమంత్రి కావడం, రోశయ్య ఆయన మంత్రివర్గంలో చేరడం జరిగింది. ఎన్నికల ముందు పరిచయమైన చెన్నారెడ్డి నన్ను "ముఖ్యమంత్రి పౌర సంబంధాల అధికారి" గా నియమించారు. నా నియామకం గురించి మొట్టమొదట రోశయ్య గారికి తెలియచేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ముఖ్యమంత్రి పీఅర్ఓ గా ప్రతి దినం రోశయ్యను కలిసే అవకాశం, విధి నిర్వహణలో ఆయన సూచనలు-సలహాలు తీసుకోవడం నిరంతరం జరిగేది. ఆ తర్వాత రాజకీయాలకు సంబంధించిన ఉద్యోగం ఏదీ నేను చేయకపోయినా, ఆయనను మధ్య-మధ్య కలవడం జరుగుతుండేది. ఆయన మంత్రిగా లేనప్పుడు కూడా చాలా పర్యాయాలు కలిసి ఆయన సహాయం కోరితే కాదనలేదెప్పుడు. 1994-2004 మధ్య కాలంలో, కాంగ్రెస్ ప్రతిపక్షంలో వున్నప్పుడు శ్రీనివాసరావు తో కలిసి చాలా సార్లు కలిశాను. అప్పడు ఎలా కలివిడిగా మాట్లాడేవారో, ఇప్పుడూ అంతే.

2004 లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉద్యోగ విరమణ చేసి, ఏడాది తర్వాత, 108 అత్యవసర సహాయ సేవలు నిర్వహిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థలో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ఇన్-చార్జ్ గా చేరాను. ఆ మధ్యలో, నేను ఆయనను కలిసిన ప్రతిసారీ, నాకేమైనా సహాయం కావాలా అని అడిగేవారు. ఇ.ఎం.ఆర్.ఐ లో చేరిన మొదటి వారంలోనే, ఒకే కంపార్ట్ మెంటులో రైల్లో ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఆయన్ను కలవడం, నా ఉద్యోగం విషయం చెప్పడం, ఆ సేవల గురించి ఆయన నోటి వెంట వివరంగా వినడం జరిగింది. నేను చేరక ముందు, ఆగస్టు 15, 2005 న ఆ సేవలు లాంఛనంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రారంభించినప్పుడు ఆయన అక్కడున్న విషయం కూడా చెప్పారు రోశయ్య. ఆర్థిక శాఖకు అదనంగా, ఆరోగ్య-వైద్య-కుటుంబ సంక్షేమ శాఖకు కూడా రోశయ్య గారే మంత్రి. 108 అత్యవసర సహాయ సేవలకు సంబంధించి, అవసరమైనప్పుడల్లా ఆయనను కలిసే అవకాశం కలిగింది. తొలుత కేవలం ప్రయివేట్ నిధులతోనే నడుస్తున్న ఆ సేవలను ఒకే రోజున ఒంగోలు, చీరాలలో ఆయన ప్రారంభించారు. చీరాల సభలో మాట్లాడుతూ, జిల్లాకు కోటి రూపాయల వంతున 23 కోట్ల రూపాయలను బడ్జెట్లో మున్ముందు కేటాయించడానికి ప్రభుత్వ సంసిద్ధతను మొట్టమొదటి సారిగా బహిరంగంగా ప్రకటించింది రోశయ్య గారే. ఇచ్చిన మాట ప్రకారం 2007-2008 బడ్జెట్లో 23 కోట్లు కేటాయించారు. ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం ఉన్నప్పటికి, రాజశేఖర రెడ్డి దృష్టిలో అప్పటికింకా వివరంగా పడలేదాసేవల విషయం.

రోశయ్య ఆరోగ్య శాఖను నిర్వహిస్తున్నప్పుడే, అంతవరకు 108 అత్యవసర సహాయ సేవలకు అసలే అందని నిధుల స్థానంలో, నిర్ణీత మొత్తంలో కొంత నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వ పరంగా సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు మధ్య ఆయన సమక్షంలో సెప్టెంబర్ 2006 లో అవగాహనా ఒప్పందం కుదిరింది. రోశయ్య చొరవతో సాధ్యమైన ఆ సంఘటన అత్యవసర సహాయ సేవలకు సంబంధించినంతవరకు ఒక చారిత్రాత్మక మలుపు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయనకు సలహాదారుడుగా పనిచేస్తున్న అధికారి, పీకె అగర్వాల్, అప్పట్లో ఆరోగ్య-వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి. ఒప్పందం ప్రకారం నిధులకు తోడు 432 అంబులెన్సులను కూడా సమకూర్చింది ప్రభుత్వం. క్రమేపీ రోశయ్య ద్వారా దివంగత ముఖ్యమంత్రికి చేరువైన సేవల నిర్వహణకు, మరిన్ని అంబులెన్సులను చేర్చడంలోను, నిర్వహణ నిధులను 95% వరకు పెంచడంలోను కీలక పాత్ర పోషించింది రోశయ్యే. గ్రామీణ ప్రాంతాలకు సహాయ సేవలను విస్తరించడానికి జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం నుంచి, ఆ సేవలకు అంబులెన్సులను పెంచినప్పుడల్లా సంబంధిత కార్యక్రమంలో పాలు పంచుకోవడం వరకు, అడిగినప్పుడల్లా కాదనకుండా ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ప్రాంగణానికి రావడం దాకా, నిధుల విడుదలలో ఆలస్యమైనప్పుడల్లా తోడ్పడంతో సహా, ఎల్ల వేళలా ఆయన సహకారం కొరకు కలిసినప్పుడల్లా ఒకే రకమైన ఆత్మీయ స్పందన దొరికేది.

సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ రామలింగ రాజు జైలుకెళ్లడంతో, జనవరి 8, 2009 , దివంగత ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలన్నీ రోశయ్య సలహాతోనే తీసుకున్నారు రాజశేఖర రెడ్డి. తిరిగి నాలుగు నెలల అనంతరం 108 అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ప్రయివేట్ భాగస్వామిగా బాధ్యతలు చేపట్టమని జీవి కృష్ణారెడ్డితో రాజశేఖర రెడ్డి మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన సంప్రదించింది రోశయ్యనే. ఆ నాలుగు నెలల మధ్య కాలంలో వచ్చిన పెద్ద అవాంతరం రోశయ్య జోక్యం చేసుకోవడంతో తప్పింది. ఇ.ఎం.ఆర్.ఐ ఖాతాలో వున్న సంస్థ నిధులను యాక్సెస్ బాంక్ స్తంభింపచేయడంతో తలెత్తిన సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న రోశయ్యను కలవడం, ఆయన సహాయం కోరిన వెంటనే ఆయన దానిని పరిష్కరించడం జరిగింది. జీవీ కృష్ణారెడ్డి కంటే ముందు ప్రయివేట్ భాగస్వామిగా వచ్చేందుకు ఉత్సాహం చూపించిన పిరమల్ సంస్థ చైర్మన్ అజయ్ పిరమల్ కోరిక మేరకు, అడిగిన వెంటనే తన ఇంట్లో ఆయన కలుసుకునేందుకు సమయం కేటాయించడమే కాకుండా, అత్యవసర సహాయ సేవల గురించి "బ్రాండ్ అంబాసిడర్" లాగా ఆయనకు వివరించారు రోశయ్య. తనకున్న కొన్ని పరిమితుల వల్ల ఇ.ఎం.ఆర్.ఐ బాధ్యతలు స్వీకరించలేక పోయిన అజయ్ పిరమల్, మరో స్వచ్చంద సంస్థ పై ఆసక్తి కనబరిచి, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి కలిసినప్పుడు నేను కూడా ఆ సంస్థ అధికారులతో కలిసి వెళ్లాను. మళ్ళీ అదే అత్మీయత చూపారు రోశయ్య గారు.

ఇలా ఎప్పుడు ఏది అడిగినా కాదనని రోశయ్య అనుకోని పరిస్థితుల కారణంగా, రాజశేఖర రెడ్డి అకాల మరణంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కొణిజేటి రోశయ్య, ఐదు దశాబ్దాల క్రితం 1968లో విధాన మండలి సభ్యుడిగా ఎన్నికై చట్టసభలో అడుగు పెట్టారు. శాసన మండలిలో ప్రతిపక్షనేతగా వ్యవహరించిన ఆయన వాగ్దాటికి అడ్డుకట్ట వేయడానికి, 1983 లో అధికారంలోకి వచ్చిన ఎన్ టీ రామారావు మండలిని రద్దు చేసేంత వరకు, ఆయన విధాన సభ సభ్యుడుగా కొనసాగారు. తెనాలి, చీరాల నియోజక వర్గాలనుంచి శాసనసభకు, నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్ సభకు కూడా ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో తొలిసారిగా 1979 లో, తదుపరి ఎందరో ముఖ్యమంత్రుల దగ్గర, మంత్రివర్గ సభ్యుడిగా, కీలకమైన శాఖలు నిర్వహించిన అనుభవజ్ఞుడు రోశయ్య. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 1995-97 మధ్య కాలంలో సమర్థవంతంగా పనిచేశారు. పాతికేళ్ల విరామం తర్వాత మరో మారు శాసనమండలి సభ్యుడుగా 2009 లో ఎన్నికయ్యారు. ఏ శాసన మండలి సభ్యుడిగా చట్ట సభల్లో ప్రవేశించారో, అదే మండలి సభ్యుడిగా, రోశయ్య సెప్టెంబర్ 3,2009 న ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. బహుముఖ ప్రజ్ఞా శాలైన రోశయ్యకు 2007 అక్టోబర్‌లో ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ పట్టా ఇచ్చింది. ఎన్జీ రంగా శిష్యుడిగా చెప్పుకునే రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ను, 16 సార్లు శాసనసభలో ప్రవేశపెట్టిన అప్రకటిత "ఆర్థిక రంగ నిపుణుడు" కొణిజేటి రోశయ్య. వరుసగా రెండు పర్యాయాలు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ ప్రవేశపెట్టి రికార్డు సాధించారు.

ఎల్లప్పుడూ తెల్లటి ఖద్దరు దుస్తులనే ధరించే రోశయ్య ఆజానుబాహుడు. గంభీరమైన కంఠస్వరం ఆయన సొత్తు. సంయమనం ఆయన ఆస్తి. ఆయన పంచె కట్టు తెలుగు దనానికే ప్రతీక . గిట్టని వారు సహితం ఆయన్ను ఫలానా వారి గ్రూపుకు చెందిన వ్యక్తిగా వేలెత్తి చూపలేదు. మహాత్మా గాంధి సిద్ధాంతాలైన అహింస-సత్య శీలతకు ఆయన పర్యాయ పదం అనవచ్చు. రోశయ్య తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో విలక్షణమైన రాజనీతిజ్ఞుడిగా, అందరి వాడుగా, క్రమ శిక్షణ గల కాంగ్రెస్ వాదిగా మన్ననలను పొందారు. ఆశించని ముఖ్య మంత్రి పదవి, రోశయ్యకు దక్కడంతో, "అజాత శత్రువు" గా ఆయనకున్న పేరును, కొందరు అసూయాపరులు మలినం చేసే ప్రయత్నాలు ఉద్దేశపూర్వకంగా చేయడాన్ని, లౌక్యంతో-ఓర్పుతో-నమ్రతతో, అనుభవం నేర్పిన ధైర్యంతో ఎదుర్కున్నారాయన.

మూడు దశాబ్దాల పాటు మంత్రిగా పనిచేసిన అనుభవంతో, ముఖ్యమంత్రిగా, తనదైన శైలితో విధాన పరమైన నిర్ణయాలను తీసుకుంటూ, చెరిపినా చెరగని ముద్ర ప్రభుత్వ పాలనపై వేశారాయన. క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి, ఒకటి వెంట మరొక సంక్షోభం రోశయ్యను వెంటాడాయి. అనుకోని రాజకీయ అనిశ్చిత పరిస్థితుల లాంటి సంక్షోభాలను ఎదుర్కోని, ధైర్యంతో నిలదొక్కుకొని, పాలనను గాడిలో పెట్టారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంలో ఆయన చూపిన చొరవ అభినందనీయం.

తమిళనాడు గవర్నర్ గా వున్నప్పుడు ఒక పర్యాయం నేను భండారు శ్రీనివాసరావు, ఎమ్మెస్ శంకర్ తొ కలిసి చెన్నై రాజ్ భవన్ లో ఆయన్ను కలవడానికి ఉదయం పూట వెళ్లాం. ఆయన అప్పుడే మార్నింగ్ వాక్ ముగించుకుని కాఫీ తాగుతూ మాతో గంటకు పైగా ముచ్చటించారు. ఆయన ఆప్యాయత, నిరాడంబరత ఎన్నటికీ మరచిపోలేం.

No comments:

Post a Comment