Saturday, October 1, 2022

కేంద్ర నిరంకుశత్వానికి కేసీఆర్ స్వస్తి వాక్యం! ..... వనం జ్వాలా నరసింహారావు

 కేంద్ర నిరంకుశత్వానికి కేసీఆర్ స్వస్తి వాక్యం!

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (01-10-2022)

         సమయోచితంగా, సందర్భానుసారంగా, తనదైన శైలిలో అద్భుతమైన రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తూ, తెలంగాణ రాష్ట్ర శాసనసభ వేదికగా, రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ప్రధాని నరేంద్ర మోదీని తరచూ ‘విశ్వగురువు అని సంభోదిస్తూ, ఆయన సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ఆదినుండీ అవలంభిస్తూ వస్తున్న వివక్షతా వైఖరిని, పలుసందర్భాలలో అవలంభిస్తున్న అప్రజాస్వామిక విధానాలను, ఆవిష్కరించారు. ‘భరతమాత గుండెకు గాయ’మౌతుందన్నారు. రాష్ట్రం ఏర్పాటైన నాటినుండే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయాలను, కేంద్రం రాష్ట్రాల హక్కులను హరించే విధానాన్ని వివరిస్తూ కేసీఆర్ చేసిన విమర్శలు, నగ్నసత్యాలు. సెప్టెంబర్ 12, 2022 న శాసనసభలో విద్యుత్తు అంశంపై జరిగిన స్వల్ప వ్యవధి చర్చకు సమాధానం ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ క్రమంలో లేవనెత్తిన అంశాలు భావితరాల వారి ఉపయోగం కొరకు భద్రపరచాల్సిన చారిత్రాత్మక విషయాలు.  

         ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణా ప్రజానీకానికి వెనువెంటనే కేంద్రం భయంకరమైన అన్యాయం చేసిందని గుర్తుచేశారు కేసీఆర్. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలకు భిన్నంగా ఘోరాతిఘోరంగా నరేంద్రమోదీ ప్రభుత్వం మొట్టమొదటి కేంద్రమంత్రిమండలి సమావేశంలో, అప్రజాస్వామికంగా తెలంగాణ గొంతును నులిమేసే విధంగా రాష్ట్రానికి చెందిన ఏడు మండలాలను అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించడంతో పాటు, 460 మెగావాట్ల సీలేరు హైడ్రో విద్యుత్ పవర్ ప్రాజెక్టును కూడా వారికి ధారాదత్తం చేసిందని అన్నారు కేసీఆర్. తెలంగాణాలో రైతులు ఎక్కువగా భూగర్బ జలాలమీద ఆధారపడుతారు. గతిలేని పరిస్థితుల్లో బోరుబావులు తవ్వి వ్యవసాయం చేయాల్సి వచ్చేది. వీటికి అధిక మోతాదులో విద్యుత్ అవసరం వుంటుంది.         

రాష్ట్ర విభజన సందర్భంగా బిల్లు చివరి దశకు చేరుకునే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సోనియాగాంధీ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు తెలంగాణ హక్కుల గురించి కొట్లాడారు. తెలంగాణకు విద్యుత్ వాడకం ఎక్కువని, అవసరం మేరకు విద్యుత్ లభ్యం లేదని, అందువల్ల విద్యుత్ కేటాయింపులలో తమకు అధికంగా కేటాయించాలని వాదించారు. ఫలితంగా అధికంగా 53% పైగా తెలంగాణాకు కేటాయించారు. దాని దృష్ట్యా దిగువ సీలేరు పవర్ ప్రాజెక్టు తెలంగాణాకు కేటాయించడం జరిగింది.

         ఈ నేపధ్యంలో రాష్ట్ర విభజన తరువాత పరిస్థితిలో చాలా తేడా వచ్చింది. దురదృష్టం ఏమిటంటే కేసీఆర్ ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక పూర్వమే, ప్రధాని మోదీ అప్పటి అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మగా మారిపోయి తెలంగాణాకు చెందిన ఏడు మండలాలను అప్రజాస్వామికంగా, ఆయన మంత్రివర్గం మొట్టమొదటి సమావేశంలో చేసిన తీర్మానికి అనుగుణంగా, ఆర్డినెన్స్ తెచ్చి అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. సాధారణంగా ఇలాంటి కీలకమైన అంశాలు శాసనసభ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సభ దృష్టికి తీసుకురావాలనీ, అలా చేయకుండా, కర్కశంగా, క్రూరంగా ఏడు మండలాలను, వాటితో పాటు సీలేరు పవర్ ప్లాంటును ఆర్డినెన్సు ద్వారా తెలంగాణా నుండి వేరు చేశారని అన్నారు సిఎం కేసీఆర్. అలా మొదలైంది తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష, అన్యాయం.  

         ఇది జరిగిన రోజునే తాను నరేంద్ర మోదీని ఈ దేశంలో ‘పెద్ద ఫాసిస్ట్’ ప్రధాన మంత్రి అని తీవ్రంగా విమర్శించానని, అలా విమర్శించిన మొట్టమొదటి వ్యక్తి తానేనని స్పష్టం చేశారు కేసీఆర్. అలా విమర్శించిన వార్త అప్పట్లో మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అప్పటికింకా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయని కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర బంద్ కు కూడా పిలుపిచ్చారు. ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడి, ప్రమాణ స్వీకారం చేయకుండా, అధికారంలో వుండి రాష్ట్ర బంద్ కు పిలుపిస్తారా? అని కొందరు ప్రశ్నించారు. ఇస్తాం, తప్పదని, ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయాలని కేసీఆర్ జవాబిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఆ రోజున విజయవంతంగా బంద్ పాటించి నిరసన వ్యక్తం చేసింది. ఆ తరువాత అనేక పర్యాయాలు మండలాల విషయం పక్కన పెట్టయినా కనీసం సీలేరు పవర్ ప్లాంటే వెనక్కు ఇవ్వమని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసినా ఆయన పరిశీలించలేదు. చాలా కర్కశంగా పోయారన్నారు కేసీఆర్.

         తెలంగాణ పట్ల అలా ఆరంభమైన వివక్ష, అన్యాయం నిరంతరాయంగా కొనసాగుతూనే వున్నది. ఈ మధ్యనే కొన్ని రోజుల క్రితం అంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ విద్యుత్ బకాయీలు చెల్లించాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలు వివక్షకు, అన్యాయానికి పరాకాష్ట. అలాగే విద్యుత్, నీటిపారుదల రంగాలకు ఆర్యీసీ, పీఎఫ్సి సమకూర్చాల్సిన రుణాల విషయంలో కేంద్ర చూపిన వివక్ష. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. 

         ప్రధాని మోదీ అవలంభిస్తున్న నిరంకుశ పాలనా విధానాలను విమర్శిస్తూ, పార్లమెంటులో ఏకపక్షంగా ప్రవేశపెట్టిన కేంద్ర విద్యుత్ బిల్లును ప్రస్తావించారు కేసీఆర్. విద్యుత్ సంస్కరణల పేరుతో తీసుకొస్తున్న ఈ బిల్లు వల్ల ఒక్క తెలంగాణాలోనే 98 లక్షల కుటుంబాలు ఇబ్బందులకు గురవుతాయి. వీరిలో రైతులు, దళితులు, గిరిజనులు, లాండ్రీలు, సెలూన్లు, కోళ్లఫారాలు, చేనేత రంగ కార్మికులు, చిన్న పరిశ్రమల వారుంటారు. వాస్తవానికి ఇవి విద్యుత్ సంస్కరణలు అనే అందమైన ముసుగు. ప్రజలను, పేదలను, రైతులను విద్యుత్ వాడుకునే ప్రతి ఒక్కరినీ దోచుకునే ఒక దుర్మార్గం. వ్యవసాయం నడవకుండా చేసి కార్పొరేట్ గద్దలకు ధారాదత్తం చేయడం దీనివెనుక దాగివున్న అసలు కుట్ర అని అన్నారు కేసీఆర్.

         పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిని ఎంచుకున్న భారత దేశంలో రాజ్యాంగపరంగా అనేక రక్షణలున్నాయని, వాటికి తోడు కాలక్రమేణా నెలకొల్పబడిన సాంప్రదాయాలు కూడా వున్నాయని, అయితే దురదృష్టవశాత్తు రాజ్యంగ నిర్మాతైన అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించిననాటి స్ఫూర్తిని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో రోజుకింత కాలరాస్తున్నారని అంటూ కేసీఆర్, ఒకవేళ అంబేడ్కరే ఇప్పుడు బతికుంటే ఎంత కొట్లాడేవారో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇప్పుడు లేకపోవడం మన దురదృష్టం అన్నారు.

            పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ఒక బాధ్యత అనీ, ఏ ప్రభుత్వమైనా పరిపాలనలో బాధ్యాతయుతంగా నడుచుకోవాలని అంటూ, కేసీఆర్ రాజ్యాంగపరమైన ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. భారత రాజ్యాంగం కేంద్రం పరిధిలో వుండేలా కేంద్ర జాబితా అని, రాష్ట్రాల పరిధిలో వుండేవిధంగా రాష్ట్రాల జాబితా అని, ఇరువురు కలిసి సంప్రదించుకుని  చేసే విధంగా ఉమ్మడి జాబితా అని పొందుపరిచారు. విద్యుత్ అంశం అనేది ఉమ్మడి జాబితాలో వున్నది. దీనిమీద కేంద్రం పెత్తనం లేదు. దురదృష్టవశాత్తు రాష్ట్రాలతో సంప్రదింపులు చేయకుండా, అసలే అడగకుండా, మాటమాత్రమైనా చెప్పకుండా విద్యుత్ బిల్లులలాంటి అనేక బిల్లులను ఏకపక్షంగా పార్లమెంటులో ప్రవేశపెట్టడం, చట్టాలుగా చేయడం మామూలైపోయింది. ఇది రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధం. ఈ విధంగా రాష్ట్రాల పట్ల చూపుతున్న వివక్షపట్ల దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు కేసీఆర్.

         పార్లమెంటు ఉభయసభలలో బిల్లులపై చర్చ జరగడం అరుదైపోయింది. ప్రతిపక్ష సభ్యులు ఎవరైనా లేచి మాట్లాడుదామని అనుకుంటే, ప్రయత్నం చేస్తే, వారిని మాట్లాడనివ్వకుండా మూకదాడులు చేస్తున్నారు. ఒక్క ప్రతిపక్ష సభ్యుడు లేస్తే వందమంది అధికార సభ్యులు లేచి రకరకాల పేర్లు పెట్టి అరవడం, వాళ్ల నోరు మూయించడం, వాళ్లు మాట్లాడేది రికార్డులలోకి పోకుండా చూడడం, ఆ అరుపుల మధ్య గందరగోళ పరిస్థితులలో బిల్లును పాస్ చేసుకుని, చట్టాలను తెస్తున్నారని విమర్శించారు కేసీఆర్.

         అనేక విషయాలలో ఇవ్వాళ కేంద్రంలో ఏంజరుగుతున్నదని ప్రశ్నించారు. ఉదాహరణకు, కేంద్రమంత్రులు, ప్రధానమంత్రి అవివేకత వల్ల, అసమర్ధ విధానాల వల్ల, అవివేక చర్యల వల్ల, దేశం మొత్తం ఫుడ్ సెక్టార్ ప్రమాదంలో పడే పరిస్థితి కలిగిందని హెచ్చరించారు. కేంద్రానికి జాతీయ, అంతర్జాతీయ విఫణి విషయంలో శాస్త్రీయమైన అంచనా, అవగాహన ఎంతో వుండాలి. పంటలు ఏవిధంగా పండుతున్నాయి, మార్కెట్ ట్రెండ్స్ ఏమిటి అనే ముందు చూపు వుందా ఈ కేంద్ర ప్రభుత్వానికి అని ప్రశ్నించారు. ఆ అవివేక ప్రభుత్వ చర్యల వల్ల, అసమర్ధ విధానాల వల్ల, దూరదృష్టి లేకపోవడం వల్ల, ఇతరులు చెపితే వినే లౌక్యం లేకపోవడం వల్ల, సహనశీలత కోల్పోయి అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఇలాంటి దుర్మార్గమైన ఫలితాలు తేవడంతో రైతుల నోట్లో మన్ను పడుతున్నదన్నారు.

         దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను, ముఖ్యంగా జాతీయ జండానే మార్చేస్తాం అని కొందరంటున్న మాటలను ఆవేదనతో, బాధతో ప్రస్తావిస్తూ, ఇది మహాత్ముడు పుట్టిన గడ్డేనా? మహాత్ముడు పుట్టిన నేలమీద ఈ మరుగుజ్జుల మాటలు వినాల్సిన ఖర్మనా మనది? ఎక్కడి నుండి దాపురించారు ఈ మరుగుజ్జులు, దీనికోసమేనా అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాసింది? ఇదేనా స్ఫూర్తి? అని అన్నారు కేసీఆర్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ దేశంలో ఏకపార్టీ మాత్రమే వుంటుందని, వేరే పార్టీలను వుంచమని, వుండకుండా చేస్తామని నిస్సిగ్గుగా ఇటీవల చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ తీవ్రంగా ఆక్షేపిస్తూ, అలా చేసిచూడమని, తక్షణమే అన్ని పార్టీలను నిషేధించమని, దేశంలో ఎవరి సంగతి ఏమిటో తెలుస్తుందని సవాలు విసిరారు.

ఇది ప్రజాస్వామ్యమేనా? కేంద్ర హోంమంత్రి నుండి ఇంత అప్రజాస్వామికమైన మాట భారతదేశం భరించవచ్చునా? ఇది ధర్మమేనా? భారదేశాన్ని నడిపించే పెద్దలు మాట్లాడే మాటలేనా ఇవి? అని ప్రశ్నించారు. సహిష్ణతకు, సహనానికి మారుపేరై, అహింసతో స్వరాజ్యం తీసుకువచ్చిన నేల ఇది అని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వానికి రెండుసార్లు జరిగిన ఎన్నికలలో ఏభైశాతం ఓట్లుకూడా రాలేదని, కేవలం 36% ఓట్లతో రాజ్యమేలుతున్నదని, అలాంటప్పుడు దేన్ని చూసుకుని ఇంత అహంకారమని, చరిత్రలో హిట్లర్, ముస్సోలినీ, నెపోలియన్ లాంటివారు కాలగర్భంలో కలిసి పోయారని గుర్తుచేశారు. అధికారం నెత్తికెక్కి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే కాలమే కఠినంగా సమాధానం చెపుతుందని హెచ్చరించారు కేసీఆర్.

ఒకింత భావోద్వేగానికి గురైన సిఎం కేసీఆర్, గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ పుట్టిన ఈ నేలమీద, శాంతికి, సహజీవనానికి మారుపేరైన ఈ దేశంలో కొందరు ప్రబుద్ధుల ప్రేలాపనలు వింటుంటే భరతమాత గుండెకు గాయమౌతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు చాలాబాద పడుతున్నారన్నారు. ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన భారతదేశం నుండి ఎవరైనా విదేశాలకు వెళ్తే ‘నువ్వు గాంధీ పుట్టున దేశం నుండి వచ్చావా? ఆయన చాలా గొప్పవ్యక్తి అని అంటారని చెప్పారు కేసీఆర్. అటువంటి దేశంలో వుంటున్న మనకు ఎదురవుతున్న అనుభవం ఏంటి? అప్రజాస్వామికంగా, కిరాతకంగా, రాజ్యంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, దౌర్జన్యంగా వ్యవహరిస్తూ, ఎన్నికైన ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్నారని తప్పుబట్టారు కేసీఆర్.

దేశంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇంతపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎవరో కొందరు చేస్తున్న బెదిరింపులకు ఎవరూ భయపడరని, ఇంత సువిశాల దేశంలో ప్రజాస్వామ్య మనుగడకోసం ఎన్నో అనుభవాలు, ఎన్నో సందర్భాలున్నాయని, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఒక తిరుగుబాటుచేసి పిలుపునిస్తే 40-50 రోజుల్లో జైల్లో నుండి పుట్టిన జనతా పార్టీ ఈ దేశంపైన జెండా ఎగురవేసిందని, అదే ప్రజాస్వామ్యం శక్తి అని, సమయం వచ్చినప్పుడు మళ్లీ ప్రజలు ఆ శక్తినే ప్రదర్శిస్తారని తీవ్రంగా హెచ్చరించారు. ఈ బీజేపీ ప్రభుత్వం శాశ్వతం కాదని మరో 18-20 నెలలు మాత్రమే అధికారంలో వుంటుందని, దాన్ని దేవుడు కూడా కాపాడలేరని, వందశాతం ప్రజాస్వామ్య వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపుతామని, తాను త్వరలోనే జాతీయా పార్టీ స్తాపిస్తానని అన్నారు కేసీఆర్.

మోదీ ప్రభుత్వాన్ని పలు విషయాలలో విమర్శిస్తూ సుదీర్ఘంగా ప్రసంగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చివరగా తన రాజనీతిజ్ఞతను సుస్పష్టంగా ప్రదర్శించారు. ‘వెరీ సారీ, నేను దుఃఖంతో చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను. సంతోషపూర్వకంగా చెప్పేది కాదు. ఈ దేశ కేంద్ర ప్రభుత్వాన్ని నిందించవలసి రావడం నా బ్యాడ్ లక్ అనుకుంటున్నాను. ఇట్లాంటి పరిస్థితి సంభవించడమే చాలా దురదృష్టకరం. ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దుష్టసమయం ఎవరికీ కూడా రావద్దు. ఇవ్వాళ శాసనసభలో ఒక ముఖ్యమంత్రి లేచి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే దిక్కుమాలిన పరిస్థితి రావడానికి ఎవరు బాధ్యులు?అన్న ప్రశ్నతో ఆయన ప్రసంగం ముగిసింది.  

1 comment:

  1. "నాటకాలరాయుడు" అని ఒక సినిమాపేరు. ఈయనకూ సరిపోతుంది.

    ReplyDelete