శ్రీ మహాభాగవత కథ-31 : ఖగోళ విషయ విస్తారం
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (14-04-2025)
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
బ్రహ్మాండమధ్యంలో ఉన్న సూర్యుడు ముల్లోకాలను తన తేజస్సుతో నింపి తపింప చేస్తూ, కామ్తిమంతం చేస్తున్నాడు. సూర్యుడికి ఏడాది సాగే నడకలో ఉత్తరాయణం దక్షిణాయనం, విషువం అనే మూడు గమనాలున్నాయి. ఉత్తరాయణంలో మీదికి వెళ్తాడు. దక్షిణాయనంలో కిందకు వెళ్తాడు. ఉత్తరాయణంలో మెల్లగా నడుస్తాడు కాబట్టి పగళ్లు ఎక్కువ, రాత్రుళ్లు తక్కువ. దక్షిణాయనంలో వేగంగా నడుస్తాడు కాబట్టి పగళ్లు తక్కువ, రాత్రుళ్లు ఎక్కువ. విషువంలో సమానం. రాత్రింబగళ్లు ఎక్కువ-తక్కువలు ఉండవు. సూర్యుడు మేషరాశిలోను, తులారాశిలోను ప్రవేశించినప్పుడు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. మేషంలోకి వచ్చినప్పటి మర్నాటి నుండి రోజు-రోజుకు పగలెక్కువ, రాత్రి తక్కువ అవుతుంటుంది. సూర్యుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య రాశుల్లో ప్రవేశించేటప్పుడు నెలకు ఒక్కొక్క ఘడియ పగటిపూట పెరుగుదల, రాత్రిపూట తరుగుదల ఉంటాయి. అలాగే, సూర్యుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం రాశుల్లోకి ప్రవేశించినప్పుడు నెలకు ఒక్కొక్క ఘడియ పగటిపూటలో తరుగుదల, రాత్రిపూటలో పెరుగుదల ఉంటాయి.
ఇలా దినాలు, ఉత్తరాయణం, దక్షిణాయనం, పెరగడం, తరగడం ఏర్పడుతున్నాయి. సూర్యుడు తన రథం మీద మానసోత్తర పర్వతం చుట్టూ తిరగడానికి ఒక పగలు, ఒక రాత్రి పూర్తవుతాయి. ఆ పర్వతం చుట్టు కొలత తొమ్మిది కోట్ల ఏభై ఒక్క లక్షల యోజనాలు. మానసోత్తర పర్వతానికి తూర్పు దిక్కున ఇంద్రుడి పట్టణం ఉన్నది. దాని పేరు దేవధాని. దక్షిణ దిక్కున యముడి పట్టణం ఉన్నది. దాని పేరు సంయమని. పడమటి వైపు వరుణుడి పట్టణం నిమ్లోచని ఉన్నది. ఉత్తరం వైపున చంద్రుడి పట్టణం విభావరి ఉన్నది. జ్యోతిశ్చక్రం భ్రమించడం వల్ల భూమిలో సూర్యుడు కనిపించడం ఉదయం, ఆకాశంలో కనిపించడం మధ్యాహ్నం, భూమిలోకి చొచ్చినట్లు కనిపించడం అస్తమయం, దూరంగా ఉండడం రాత్రి. ఈ ఉదయాస్తమయాదులు జీవుల ప్రవృత్తి, నివృత్తులకు హేతువులై ఉంటాయి.
సూర్యుడు ఇంద్రపురం నుండి యమపురానికి వెళ్లేటప్పుడు పదిహేను గడియలలో రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల డెబ్బై అయుదు వేల (2,37,75,000) యోజనాల దూరం దాటి వెళ్తాడు. యమపురి నుండి వరుణపురి, అట్నుంచి సోమపురి ఇలా పోతుంటాడు. ఇలా చంద్రగ్రహనక్షద్రాదులతో కూడి తిరుగుతూ వున్న సూర్యుడి రథచక్రానికి పన్నెండు అంచులు, ఆరు కమ్ములు, మూడు నాభులు ఉంటాయి. ఆ చక్రానికి సంవత్సరం అని పేరు. సూర్యుడి రథానికి ఒకటే చక్రం. ఈ ఏకచక్ర రథం ఒక్క ముహూర్త కాలంలో ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వెల యోజనాల మేర సంచరిస్తుంది.
సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు మేరు శిఖరం మొదలు మానసోత్తర పర్వతం వరకు వ్యాపించి ఉంటుంది. దీని పొడవు ఒక కోటి ఏభై ఏడులక్షల ఏభై వెల యోజనాలు. ఈ ఇరుసుకు గానుగ చక్రంలాగా, చక్రం అమర్చబడి, మానసోత్తర పర్వతం మీద సూర్యరథం తిరుగుతుంటుంది. ఇరుసు ఒకటి ఉత్తర ధ్రువం వైపు, ఇంకొకటి దక్షిణ ధ్రువం కింది దాకా ఉంటుంది. ఈ ఇరిసులు రెండింటి మీద ఈ చక్రం ధ్రువాల లో బిగించబడి ఉంటుంది. భూ పరిభ్రమణం వల్ల ఉత్తర-దక్షిణ ద్రువాలలో గాలి సుడిగుండాలు ఏర్పడుతాయి. అవే తాళ్లుగా ఆ తాళ్లతో ఇరుసులు ద్రువాలకు బిగించబడి ఉంటాయి. అ రథంలో సారథి కూర్చోడానికి అనువైన చోటు ముప్పైఆరు లక్షల యోజనాల పొడవు, తొమ్మిది లక్షల యోజనాల వెడల్పు కలిగినది. ఆ రథానికి కాడి కూడా ముప్పైఆరు లక్షల యోజనాల విస్తృతి కలిగి ఉంటుంది.
సూర్య రథానికి గాయత్రి మొదలైన ఏడు ఛందస్సులు (గాయత్రి, ఉష్ణిక్, త్రిష్ణువ్, అనుష్టుప్, జగతి, పంక్తి, బృహతి) గుర్రాలై ఉంటాయి. సూర్యుడికి ముందు అరుణుడు రథసారథిగా ఉంటాడు. వాలఖిల్యుడు మొదలైన 60 వేలమంది ఋషిశ్రేష్ఠులు సూర్యుడి ముందర సౌరసూక్తాన్ని స్తుతిస్తూ ఉంటారు. ఈ ఋషులు బొటన వేలు పైభాగం ఎంత ఉంటుందో అంతే శరీరం కలవారై ఉంటారు. ఇంకా ఎందరో మునులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, నాగులు, అప్సరసలు, పతంగులు మొదలైన వారంతా నెలనెలా వరుస క్రమంలో సూర్యుడిని సేవిస్తూ ఉంటారు. ఇంతమంది ఇలా సేవిస్తూ ఉంటే, సూర్యుడు తొంభై కోట్ల ఏభై ఒక్క లక్షల యోజనాల పరిమాణం ఉన్న భూమండలాన్ని అంతటినీ ఒక్క పగలు, రాత్రిలో సంచరించి వస్తూ ఉంటాడు. అంటే ఒక్క క్షణానికి రెండువేల యోజనాలు సంచరిస్తాడు.
మేరువుకు, ధ్రువానికి సూర్యుడు ప్రదక్షిణ చేయడం, రాశి చక్రం మీద సంచరించడం ఎలా కుదురుతుందన్న సందేహం కలగవచ్చు. అంటే, ఉత్తర ధ్రువం ఉండేది ఉత్తర దిశలో కదా, రాశి చక్రం ఉండేది భూమధ్య రేఖ మీద కదా, అలాంటప్పుడు, ఉత్తర ధ్రువానికి ప్రదక్షిణం, రాశి చక్రం మీద సంచరించడం ఏక కాలంలో ఎలా అన్నది అసలు సందేహం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒక్కటి ఉంది. అదే, సకలం భగవత్సృష్టి విలాసం అనే విషయం. ఇలాంటి సందేహాలను పూర్తిగా తీర్చగలగడం ఒక్క సర్వేశ్వరుడికే చేతనవుతుంది.
నక్షత్రాలతో, రాశులతో కూడిన కాలచక్రం ధ్రువానికి మేరువుకు ప్రదక్షిణం చేసేటప్పుడు, ఆ కాలచక్రం వెంట సంచరించే సూర్యాది గ్రహాలకు నక్షత్రాలతోను, రాశులతోను, ఉనికి ఉండడంతో చక్రగతి వల్ల, వాటంతట వాటికి ఉన్న గతుల వల్ల, రెండు గతులు ఉంటూ ఉంటాయి. ఆదిపురుషుడైన భగవానుడే, ఆ నారాయణుడే, లోకాలకు యోగ క్షేమాలను కూర్చడానికై సూర్యుడి రూపంలో మనకు దర్శనం ఇస్తున్నాడు. సూర్యుడు మూడు వేదాల స్వరూపం. నారాయణుడే సూర్యుడిగా ప్రకాశిస్తున్నాడు. ఆ పరమపురుషుడే తనను పన్నెండు విధాలుగా విభజించుకుని వసంతం మొదలైన ఆరు ఋతువులను ఆయా కాలాలలో జరిగే విశేషాల్ని బట్టి ఏర్పాటు చేశాడు. ఆ పరమపురుషుడు జ్యోతిశ్చక్రం లోపల ప్రవర్తిస్తూ తనదైన తేజస్సుతో సకల జ్యోతిర్గణాలను దీవింప చేస్తున్నాడు. మేషాది పన్నెండు రాశులలోను ఒక్కో మాసం వంతున ఒక సంవత్సరం సంచరిస్తాడు. ఆయన గమనంలోని విశేషమైన కాలాన్ని అయనాలుగా, ఋతువులుగా, మాసాలుగా, పక్షాలుగా, తిథులుగా వ్యవహరిస్తారు. రాశులలో ఆరవ అంశం ఆయన సంచరించినప్పుడు దానిని ఋతువు (అంటే సంవత్సరంలో ఆరవ వంతు, రెండు మాసాల కాలం) అని అంటారు. కాలచక్రంలో సూర్యుడు సగభాగం, అంటే, ఆరు రాశులలో సంచరించే కాలాన్ని అయనం అంటారు.
పూర్తిగా సూర్యుడు పన్నెండు రాశులలో సంచరించిన కాలం ఒక సంవత్సరం. ఈ సమగ్ర సంచారంలో శీఘ్రగతి, మందగతి, సమగతి అని మూడు గతి విశేషాలున్నాయి. ఈ గతి విశేషాలవల్ల తేడా కనిపించే సంవత్సరాన్ని సంవత్సరం, పరిసంవత్సరం, ఇళాసంవత్సరం, అనువత్సరం, ఇద్వత్సరం అని అయుదు విధాలుగా చెపుతారు. చంద్రుడు సూర్యకిరణాల కంటే లక్ష యోజనాలకు పైగా శీఘ్రంగా సంచరిస్తాడు. పక్షం, రాశి, నక్షత్రం, వీటి శేషాన్ని గ్రహిస్తూ ముందుకు సంచరిస్తూ చంద్రుడు పెరుగుతూ, తరుగుతూ ఉంటాడు. తద్వారా పగలు, రాత్రి కలగ చేస్తున్నాడు. చంద్రుడు ఒక నక్షత్రంలో 30 ఘడియలు ఉంటాడు. పదహారు కళలతో ఉంటాడు. చంద్రుడిని ‘సర్వసముడు’ అంటారు. చంద్రుడికి పైన లక్ష యోజనాల ఎత్తులో తారకలు గుమిగూడి మేరు శైలానికి ప్రదక్షిణంగా తిరిగి వస్తూ ఉంటాయి. అభిజిత్తు అనే నక్షత్రం కూడా ఈ తారా చక్రంలో ఉంది తిరుగుతూ ఉంటుంది. అశ్విని నుండి రేవతి వరకు 27 నక్షత్రాలే అని అనుకుంటాం. ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రాల మధ్యలో అభిజిత్తు అనే నక్షత్రం ఒకటి ఉంది. దీనితో కలిసి నక్షత్రాలు 28.
తారలన్నింటికి రెండు లక్షల యోజనాల పైన శుక్రుడు ఉంటాడు. శుక్రుడు, సూర్యుడు ఉండే రాశికి ముందు రాశిలోకాని, వెనుక రాశిలోకాని, అతడితో సమంగా కాని సంచరిస్తూ ఉంటాడు. జనులకు అనుకూలుడై వర్షాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. వర్షానికి ఆటంకం ఏర్పరిచే శక్తుల్ని తొలగించి శుభాలను ఇస్తాడు. అటుపైన రెండు లక్షల యోజనాల పైన బుధుడు చరిస్తున్నాడు. బుధుడు ఎప్పుడూ సూర్యుడికి దగ్గరగానే ఉంటాడు కాబట్టి కనపడడు. సూర్యుడితో దూరం ఎక్కువై ఎప్పుడైనా బుధుడు మన కంటికి కనిపిస్తే అతడి సాటిలేని మహిమ వల్ల ప్రజలకు పెనుగాలులు, క్షామం, దోపిడీలు మొదలైన భయాలు కలుగుతాయి. బుధుడు చంద్రుడి కొడుకు.
బుధుడికి పైన రెండు లక్షల యోజనాల దూరంలో భూమికి పుత్రుడైన అంగారకుడు చరిస్తున్నాడు. యితడు ఒక్కొక్క రాశి దాటడానికి మూడు పక్షాల సమయం పడుతుంది. ఇలా పన్నెండు రాశులను దాటుతాడు. ఒక్కోసారి వెనక్కు వచ్చి మళ్లీ ముందుకు వెళ్తూ ఉంటాడు. వక్రగాతిలోనూ, శుభగ్రహయోగం లేనప్పుడూ అంగారకుడు (కుజుడు) ప్రజలకు పీడల్ని కలిగిస్తాడు. కుజుడికి రెండు లక్షల యోజనాల పైన బృహస్పతి చరిస్తాడు. ఇతడు ప్రతి రాశిలోను ఒక్కో సంవత్సరం ఉంటాడు. యితడు దేవతల గురువు. వక్రగాతిలో లేనప్పుడు బ్రాహ్మణులకు అనుకూలుడై ఉంటాడు. సూర్యుడి కొడుకు శని. యితడు బృహస్పతికి రెండు లక్షల యోజనాల పైన చరిస్తూ ఉంటాడు. ఒక్కో రాశిలో 30 నెలలు సంచారం చేస్తాడు. లోకాలకు పీడా కలిగిస్తాడు. శనికి పైన 11 లక్షల యోజనాల దూరంలో సపర్షి మండలం ఉన్నది. వీరు బ్రాహ్మణులకు సకల లోకాలకు మేలు చేస్తారు. సప్తర్షి మండలానికి పైన 13 లక్షల యోజనాల దూరంలో శింశుమార చక్రం ఉంది. ఇది అన్నింటికంటే పైన ఉంటుంది.
విష్ణువు పదం శింశుమార చక్రం. భక్తుడైన ధ్రువుడు ఇంద్రుడు, అగ్ని, కశ్యప ప్రజాపతి మొదలైన ప్రముఖులతో నిత్యమూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. అన్ని జ్యోతిర్గ్రహ నక్షత్ర మండలాలకు నిశ్చలమైన ఆధారంగా భగవానుడు ధ్రువుడిని స్థిరంగా నిలిపాడు. నక్షత్రాలు, సూర్యాది గ్రహాలూ, మేధి స్తంబంలా ఉన్న ధ్రువుడికి దగ్గరగా కొన్ని, దూరంగా కొన్ని, బాగా వెలుపలగా కొన్ని, ఉండేట్లు వాయువు ప్రేరణ వల్ల కల్పాంతం వరకు పరిభ్రమిస్తూ ఉంటాయి. అంతరిక్షంలో గ్రహాలన్నీ ప్రకృతి పురుష సంయోగం వల్ల ఏర్పడిన ఒక విచిత్రమైన కర్మగతి నడిపిస్తూ ఉంటే నేలమీద పడకుండా సంచరిస్తున్నాయి.
‘శింశుమార చక్రం’ సకల దేవతలతో నిండి వున్న వాసుదేవుడి దివ్యదేహం. వలయాకార సర్పంలాగా ఉన్న ఈ శింశుమార చక్రం తోక చివరన ముందుభాగంలో ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు ఉంటారు. తోకకు మూలంలో ధాత, విధాత ఉంటారు. కటి ప్రదేశంలో సప్తర్షులు ఉంటారు. కుడువైపున సుడిగా తిరిగి ఈ శింశుమారం ఉంటుంది. అలా దక్షిణావర్తంగా వలయాకారంగా ఉన్న శరీరం కల శింశుమారానికి దక్షిణం వైపు ఉత్తరాయణ నక్షత్రాలు అంటే అభిజిత్తు నుండి పునర్వసు వరకు (14) ఉంటాయి. ఎడమవైపు దక్షిణాయన నక్షత్రాలు పుష్యమి నుండి ఉత్తరాషాఢ వరకు ఉంటాయి. వీపు వైపున దేవా, మైన, అజవీథి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల సమూహం), కడుపున ఆకాశగంగ, ఉత్తర భాగంలో పునర్వసు, పుష్యమి నక్షత్రాలు (కుడు-ఎడమ తుంట్ల లాగా) ఉంటాయి. ఔనర్వాసు నక్షత్రం ఉత్తరాయణానికి చివరది. పుష్యమి దక్షిణాయానానికి మొదటి నక్షత్రం.
ఆర్ద్ర, ఆశ్లేషలు కుడి-ఎడమ పాదాల వెనక భాగంలో ఉంటాయి. కుడి పాదంలో ఆర్ద్ర, ఎడమ పాదంలో ఆశ్లేష ఉంటాయి. ముక్కుకు కుడివైపు కన్నంలో అభిజిత్తు, ఎడమవైపు కన్నంలో ఉత్తరాషాఢ ఉంటాయి. కుడి కంటిలో శ్రవణం, ఎడమ కంటిలో పూర్వాషాఢ ఉంటాయి. కుడి-ఎడమ చెవుల్లో ధనిష్టా, మూలలు ఉంటాయి. మఖ నుండి అనూరాధ వరకు ఉన్న ఎనిమిది దక్షిణాయన సంబంధమైన నక్షత్రాలు ఎడమ పక్కనున్న ఎముకల్లోను, కుడి పక్కనున్న ఎముకలలో మృగశీర్ష నుండి ప్రతిలోమ క్రమంలో పూర్వాభాద్ర వరకు గల ఉత్తరాయణ సంబంధమియన్ ఎనిమిది నక్షత్రాలు ఉంటాయి.
కుడి భుజంలో జ్యేష్ఠ, ఎడమ భుజంలో శతభిషం ఉంటాయి. ఉత్తరపు దౌడలో అగస్త్యుడు, దక్షిణపు దౌడలో యముడు ఉంటారు. ముఖంలో అంగారకుడు, గుహ్యంలో శని, మెడ వెనుక భాగంలో గురుడు, రొమ్ములో రవి, నాభిలో శుక్రుడు, మనస్సులో చంద్రుడు, వక్షోజాలలో అశ్వినీ దేవతలు, ప్రాణాపానాలలో బుధుడు, గళంలో రాహువు, శరీరంలోని అన్ని భాగాలలోను కేతువు, రోమాలలో అన్ని తారకలు, హృదయంలో నారాయణుడు ఉంటారు. ఇది సర్వ దేవతామయుడైన పుండరీకాక్షుడి దివ్య దేహం. ఈ శింశుమార చక్రం ఎంతో పవిత్రమైనది. ఈ జ్యోతిస్స్వరూపంలో వెలుగొందే శింశుమార విగ్రహాన్ని “వందనం, వందనం” అని నుతించాలి.
సూర్యుడికి కింద వైపున పదివేల యోజనాల దూరంలో రాహు గ్రహం అపసవ్య మార్గంలో ఉంటుంది. రాహువు రాక్షసాధముడు, అమరత్వానికి అర్హుడు కాడు. సూర్యమండలం వ్యాసం పదివేల యోజనాల విస్తృతి కలది. చంద్ర మండలం వ్యాసం పన్నెండువేల యోజనాలు. పర్వకాలాలలో రాహువు సూర్య మండలాన్ని కాని, చంద్ర మండలాన్ని కాని పూర్తిగా కప్పుతాడు. దాన్ని చూసి భూమ్మీద వుండే జనులు గ్రహణం పట్టిందని అంటారు. విష్ణువు సుదర్శన చక్రం వస్తుందేమో అన్న భయంతో ఐదారు గడియల లోపు రాహువు గ్రహణాన్ని విడిచి వెళ్తాడు. రాహువుకు పదివేల యోజనాల కింద పిశాచాలు, రాక్షసులు సేవిస్తుంటే, యక్షులు, భూతప్రేతాలు చరిస్తూ ఉంటారు. యక్ష, భూత, ప్రేతాలు చరించే అంతరిక్షానికి కింద మేఘ మండలం ఉన్నది. ఇది గాలికి చరిస్తూ ఉంటుంది. మేఘ మండలానికి కింద భూమండలం ఉన్నది.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)