ఇందిర, మోదీ .... ఇద్దరూ ఇద్దరే !
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (22-05-2025)
{ఇందిరా గాంధీ యుద్ధ-దౌత్య
నిర్ణయాలు భారత్ ను శక్తివంతమైన దేశంగా నిలిపాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలో జాగరూకతతో,
వ్యూహాత్మకంగా, ఒక్కొక్క అడుగు ముందుకు వేయాల్సి వచ్చింది.
అమెరికా విదేశీ విధానంలో సంభవించిన మార్పులు,
అంతర్జాతీయ స్థితిగతులే దీనికి కారణం} –
సంపాదకుని క్లుప్త వ్యాఖ్య
భారతదేశం-పాకిస్తాన్
మధ్య 1971 యుద్ధం, బంగ్లాదేశ్ ఆవిర్భావం, 2025 ఆపరేషన్ సిందూర్, ఈ రెండు సందర్భాలలోనూ, భారత్-అమెరికా దేశాల మధ్య నెలకొన్న దౌత్య సంబంధాలు
ప్రపంచ రాజకీయాలమీద ప్రభావం చూపాయి. భారత ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ నుండి నరేంద్ర మోదీ దాకా, అమెరికా దేశాధ్యక్షులు రిచర్డ్ నిక్సన్ నుండి డొనాల్డ్ ట్రంప్ దాకా, నేతృత్వ
శైలుల తేడాలు, దౌత్య నైపుణ్యాలు, సమకాలీన రాజకీయ వ్యూహాలు, పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద చర్యలను అరికట్టే
దిశగా భారతదేశం ఎదుర్కొన్న సవాళ్ళు, రాజకీయ
దృష్టికోణాల ప్రభావం విశ్లేషించడం ఒక సవాలే. (ఇది ఒక అర్థవంతమైన ఆలోచన అనాలి)
1971 లో అమెరికా
అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అనుసరించిన పాకిస్తాన్ పక్షపాత దౌత్యతంత్రం; 2025 లో ట్రంప్ అహంభావ, అనిర్ణయాత్మక రాజకీయ వైరుధ్యం,
రాజకీయ దౌత్య అధ్యయనాల్లో చర్చకు రావాల్సిన అంశాలు. నిక్సన్కు యాహ్యా ఖాన్ మీద
ప్రేమలేకపోయినా, అమెరికా ప్రయోజనాల కోణంలో పాకిస్తాన్ను వెనకేసుకుని
సహాయం అందించాడు. నిక్సన్ వైఖరి వైవిద్యభరితమైన అమెరికా రాజకీయ శైలికి దర్పణం
పట్టేలా, స్పష్టంగా
కనిపించే దౌత్య వ్యవహారం. భారత ఇష్టా-అయిష్టాలతో నిక్సన్ కు సంబంధం లేదనాలి. ట్రంప్
ప్రతిస్పందన వ్యక్తిగత ఆడంబరం. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల మధ్య విజయం
తననే వరించినట్లు, కాల్పుల విరమణకు తానే కారకుడినని, అట్టహాసంగా,
ఆర్భాటంగా ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ను భాధ్యతారాహిత్య నేతగానే చూడాలి. అణ్వాయుధ
ఉద్వేగాలకు ఆస్కారమున్న భారత ఉపఖండం విషయంలో, అగ్రరాజ్యాధినేతగా ప్రదర్శించాల్సిన గంభీరత,
వ్యూహాత్మకత చతురత ట్రంప్ మాటలలో, నడతలో ఇసుమంతైనా కనిపించలేదు. ఇది దౌత్యానికి,
దౌత్యనీతికి విరుద్ధం.
ఇందిరా గాంధీ
నేతృత్వంలోని వ్యూహాత్మక, యుద్ధ-దౌత్యనీతి నిర్ణయాలు భారతదేశాన్ని
శక్తివంతమైన దేశంగా నిలిపాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలో జాగరూకతతో, వ్యూహాత్మకంగా, ఒక్కొక్క అడుగు ముందుకు వేయాల్సి వచ్చింది.
అమెరికా విదేశీ విధానంలో సంభవించిన మార్పులు,
వ్యక్తిగత రాజకీయ వ్యతిరేకతలు,
అంతర్జాతీయ స్థితిగతులే దీనికి కారణం. భారత్ తన స్వాతంత్ర్య, భద్రతా
ప్రయోజనాలను సమగ్రంగా పరిరక్షిస్తూ, భవిష్యత్తులో కూడా దౌత్య వ్యవహారాల్లో
తెలివితేటలు, ధైర్యం,
పట్టుదలతో ముందుకు సాగే తరహాలో
అడుగడుగునా వ్యవహరించడం మోదీ నాయకత్వ లక్షణాల కారణానే. నిక్సన్ను ధీరోదాత్తంగా ఎదుర్కొన్న
ఇందిరా గాంధీ, భారత్కు చారిత్రాత్మక విజయాన్ని అలవోకగా
సమకూర్చారు. వర్తమాన
వాతావరణానికి అనుగుణంగా, ట్రంప్ అనిశ్చితి నేపథ్యంలో, నరేంద్ర మోదీ
అత్యంత జాగ్రత్తగా, స్వల్ప స్పందనతో సమయానుకూలంగా వ్యవహరించాల్సి
వచ్చింది. అమెరికా ఆదేశాలకు ఏమాత్రం లొంగకుండా,
ప్రాదేశిక, దేశీయ
అవసరాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఫలితం విషయానికొస్తే, ఇందిరా, మోదీలు ఇరువురూ, వారి వారి పరిస్థితులకు అనుగుణంగా విజయాన్నే సాధించారు.
నిక్సన్
వ్యూహాత్మక అమెరికాకు ప్రతినిధి. మద్యవర్తిత్వం చేస్తున్నానని చెప్పుకున్న ట్రంప్
చరిత్రతో సంబంధం లేకుండా, ప్రాదేశిక సమస్యల సంక్లిష్టతను పట్టించుకోకుండా,
అవగాహనా రాహిత్యంతో వ్యవహరించారు. నిక్సన్ వైఖరి చర్చనీయాంశమే అయినప్పటికీ, అది
సంస్థాగత పాలనాచట్రానికి అనుగుణంగా ఉండేదని చెప్పుకునేవారు. ట్రంప్ వ్యాఖ్యలు
అమెరికా స్థాయికి ఏమాత్రం తగని విదేశాంగ విధానాన్ని వ్యక్తిగత ఆకాంక్షలుగా మలచే
ఆందోళనకర దృక్పథాన్ని ప్రతిబింబించాయి.
భారతదేశం, అమెరికాలు
కాలక్రమంలో పరిస్థితులకు అనుగుణంగా మార్పుకు గురయ్యాయి. భారత్ ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో
అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతుంటే, అమెరికా దౌత్యం గణాంకాల చట్రంలో ఇరుక్కుపోయిన వ్యూహంగా, లాభనష్టాల బేరీజువేసుకుని, ఆకస్మిక, అసందర్భ ప్రదర్శనల
దిశగా జారిపోయినట్టూ కనిపించింది. 1971 యుద్ధం ద్వారా భారత్ ఉపఖండంలో తన ప్రాదేశిక
ఆధిపత్యాన్ని దృఢపరచుకున్నది భారత దేశం.
2025 పాక్, భారత్ సంఘర్షణ ‘ప్రదర్శనాత్మక దౌత్యానికి’ ఉన్న పరిమితులను బహిర్గతం చేసింది.
నిక్సన్-ట్రంప్, ఇందిరా-మోదీల
మధ్య తారతమ్యాన్ని, వారి రాజకీయ ధోరణులను, దౌత్య విధానాలను, ఒకే ధారలో పరిశీలిస్తూ 1971-2025 మధ్యన చోటుచేసుకున్న విభిన్న భౌగోళిక-రాజకీయ
ఘట్టాలను విశ్లేషణ చేయడం అవసరం. నిక్సన్, ట్రంప్లు భారత్-పాకిస్తాన్ సంక్షోభాలకు ఎలా
స్పందించారు? ఇందిరా,
మోదీల ప్రతిస్పందనలు ఎలా భిన్నంగా
అభివ్యక్తమయ్యాయి? అనేవి పరిశోధనకు అనువైన అంశాలు. ‘కోల్డ్ వార్’ దశ నుండి,
ప్రపంచీకరణ, తదనంతర దశల వరకు రెండు భిన్న కాలగతులను కలిపి
చూడడం, వ్యూహాత్మక దౌత్యం, ప్రదర్శనాత్మక దౌత్యం మధ్య
తేడాను విశ్లేషించడం, దేశవాళీ స్థాయిలో ఇందిరా, మోదీ
నేతల బలాన్ని, అంతర్జాతీయ వ్యవహారాలకు ఎలా అన్వయించారో గమనించడం, భారత
వ్యూహాత్మక ప్రయోజనాల కోణంలో అమెరికా నాయకత్వాన్ని విశ్లేషణతో చూపడంలంటి అంశాలన్నీ
పరిశోధనకు తగినవే.
బంగ్లాదేశ్ ఆవిర్భావాన్ని
ప్రపంచం ఆశ్చర్యంతో వీక్షిస్తుండగా, ప్రధాని ఇందిరాగాంధీ అమెరికా అధ్యక్షుడు రిచర్డ్
నిక్సన్కు ఆవేదనతో, ఆవేశంతో రాసిన ఉత్తరాన్ని 1971
డిసెంబర్ 17న న్యూయార్క్ టైమ్స్ ‘మిసెస్ గాంధి
రైట్స్ టు ప్రెసిడెంట్: యూఎస్ కుడ్ హేవ్ ఎవర్టెడ్ వార్’ శీర్షికతో ప్రచురించింది. దశాబ్దాలపాటు గుర్తుంచుకునే అపూర్వమైన
‘దౌత్యపూరిత సంభాషణగా’ భావించాల్సిన ఆ ఉత్తరంలో, ఇందిరాగాంధి
‘మేము ఖచ్చితంగా తప్పెక్కడ చేశామో మీరు చెప్పగలరా నిక్సన్?’
అని అమెరికాను ధీటుగా, సూటిగా
ప్రశ్నించారు. పక్షపాతంపై
వ్యంగ్య స్పందనగా కాకుండా, సహేతుకమైన విమర్శగా నిలిచిందది.
ఇందిరాగాంధీ
ఆవేశానికి చాలా కారణాలున్నాయి. అమెరికా అధ్యక్షుడు నిక్సన్ పాకిస్థాన్కు
అనుకూలంగా వ్యవహరించడం, తూర్పు పాకిస్థాన్లో రాజకీయ పరిష్కారాన్ని సాధించడానికి ఇందిరాగాంధీ
హెన్రీ కిసింజర్కు ఇచ్చిన సూచనలు విఫలం కావడం, అమెరికా అణుసంయుక్త నౌక
బంగాళాఖాతంలోకి ప్రవేశించడం, అమెరికా నుంచి వెలువడిన వ్యాఖ్యలన్నీ భారతదేశంపై కక్షపూరితంగా
వుండే భావనను కలిగించడం, ఇవన్నీ కలిసి,
ఇందిరాగాంధీ నిక్సన్ కు ఉత్తరం రాయడానికి దారితీశాయి. ఈ లేఖను ఆమె నేరుగా
అధ్యక్షుడు నిక్సన్కు పంపారు.
అంతర్జాతీయంగా
ఒంటరిదైనా, ఇందిరాగాంధీ నాయకత్వంలో భారతదేశం 1971 యుద్ధంలో
గెలిచింది. సోవియెట్ యూనియన్తో స్నేహ ఒప్పందం,
స్వదేశి ఆయుధ బలం ఆధారంగా బంగ్లాదేశ్ను
స్థాపించగలిగింది. గెలుపు తరువాత కూడా ఆమె ఓర్పుతో, సంయమనంతో, రాజనీతిజ్ఞతతో వ్యవహరించారు.
‘మాకు ఎటువంటి పాకిస్థాన్ భూభాగం అవసరం లేదు. తూర్పు పాకిస్తాన్గా ఉండి, ఇప్పుడు
బాంగ్లాదేశ్గా మారిన భూభాగం పట్లా,
పశ్చిమ పాకిస్తాన్ భూభాగం పట్లా మాకు
ఎలాంటి ఆకాంక్ష లేదు’ అని
ఆమె స్పష్టం చేశారు. ‘మాకు శాశ్వత శాంతి కావాలి, కానీ పాకిస్థాన్ దీనికి సిద్ధంగా ఉందా?’
అనే ప్రశ్న సంధించారు. రాజకీయ
పరిష్కారాన్ని సాధించేందుకు అమెరికా తన శక్తి,
ప్రభావం, అధికారాలను వినియోగించి ఉండినట్లయితే, భారత్, పాకిస్తాన్
మధ్య యుద్ధం తప్పించగలిగేది అని ఇందిరా గాంధీ తన లేఖలో పేర్కొన్నారు.
అర్ధ శతాబ్దం
తర్వాత, 2025లో చరిత్ర మరోలా పునరావృతమైంది. ఒకవైపు, నరేంద్ర
మోదీ నేతృత్వంలోని భారత్, ప్రపంచీకరణ, సంకీర్ణ ప్రభుత్వ రాజకీయాలపై ఆధారపడినదిగా
మారింది. మరోవైపు, పాకిస్తాన్ను ప్రపంచ వేదికలపై ఒంటరిపరిచే
పనిలో బిజీగా ఉంది. అప్పటి భారత్ ‘ఒంటరిగా నిలబడి గెలిచిన దేశం’ కాగా ఇప్పటి భారత్
‘సహచరులతో కలిసి గెలవాలనుకునే దేశం.’ ప్రధానమంత్రి
మోదీ నాయకత్వంలో విజయవంతమైన ఆపరేషన్ సిందూర్, భారతదేశ సామర్థ్యాన్ని, ప్రపంచానికి చాటిచెప్పింది. తాను కోరుకున్న
లక్ష్యాలను సాధించిన తరువాత పాకిస్తాన్ అభ్యర్ధన మేరకు కాల్పుల విరమణకు
అంగీకరించింది. పిలవని పేరంటంలాగా, అమెరికా
అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారంలో పాలుపంచుకునే ప్రయత్నం చేశాడు. నిక్సన్ లాగా వ్యూహాత్మకంగా కాదు. సోషల్ మీడియా
వేదికగా అసందర్భ ప్రకటనలు చేశాడు. అసలాయన ప్రవర్తనే, విపరీతంగా,
భిన్నంగా కనిపించింది. తానే మాట్లాడి, ఇరు దేశాలమీద వ్యక్తిగతంగా ఒత్తిడి పెంచి, కాల్పుల విరమణ కోసం ఒప్పించానని ప్రకటించారు. దీనికి
ఆధారం లేదు. స్పష్టమైన ప్రక్రియ కూడా కనిపించలేదు. నమ్మదగ్గదిగా కాకుండా, వాస్తవాన్ని
దూరంగా చూపిస్తూ, అంతర్జాతీయ స్థిరత్వం కన్నా, అమెరికా అంతర్గత రాజకీయాలలో
తనకు మెప్పు లభించేలా ట్రంప్ వ్యవహార శైలి
నడిచింది.
ఓర్పు, నేర్పు, చిత్తశుద్ధి, రాజకీయ పరిపక్వతతో ఇందిరాగాంధీ నిక్సన్కు
ధీటుగా సమాధానం చెప్పి, దేశాన్ని గౌరవంతో ముందుకు నడిపించారు. భారత్ ఒక
గ్లోబల్ శక్తిగా ఎదిగిపోయింది. అమెరికాతో వ్యవహరించాల్సిన అవసరం వచ్చినప్పుడు, అధ్యక్షుడు
ట్రంప్ నమ్మదగిన వ్యక్తి కాదని మోదీ గుర్తించి వుంటారు. అందుకే మోదీ ట్రంప్ మాటలను
పట్టించుకోకుండా, ‘రాజకీయం కాదు, యుద్ధం
కాదు’ అనే వ్యూహంతో వ్యవహరించారు. భారతదేశం
అంతర్జాతీయంగా ఎంతో ఎత్తుకు ఎదిగింది. 1971లో ప్రపంచంలో తన స్థానం కోసం పోరాడిన
భారత దేశం, 2025లో ప్రపంచంలో తన గౌరవాన్ని ప్రస్ఫుటంగా నిలబెట్టుకునే
స్థాయికి వచ్చింది.
రెండు సందర్భాలూ
భారతదేశానికి ఒకే పాఠాన్ని నేర్పాయి. అంతర్జాతీయ వ్యవహారాల్లో శాశ్వత మిత్రులూ, శాశ్వత
శత్రువులూ ఉండరని. శక్తి, సామర్ధ్యాన్ని, మైత్రిని,
విశ్వసనీయతను సమపాళ్లలో నైపుణ్యంగా
వినియోగించగల నాయకత్వమే నిర్ణయాత్మకమవుతుంది. ఇందిరాగాంధీ భారత్ను
పునర్నిర్వచించారు. మోదీ, అంతర్జాతీయ సంబంధాలను నూతన దిశగా తీసుకెళ్లారు. ఇద్దరూ
ఇద్దరే. ఇద్దరిదీ రాజనీతిజ్ఞతే. ఇద్దరూ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో
నిలబెట్టినవారే.
ఇ.గాంధీ తరువాత నేతలసలు లేరన్నట్టుంది మోడీ వచ్చేదాక :)
ReplyDelete