Friday, June 20, 2025

వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-1 ..... వనం జ్వాలా నరసింహారావు

 వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-1

వనం జ్వాలా నరసింహారావు (20-06-2025)

ఈ ఏడాది (2025) ఆగస్టు నెల 8 వ తేదీతో 78వ సంవత్సరంలో అడుగిడుతున్న నేను, బాల్యం నుండి ఇప్పటిదాకా విద్యాభ్యాసంలోను, ఉద్యోగాలలోనూ, ఇతర వ్యాపకాలలోనూ, వృత్తి-ప్రవృత్తి పరంగానూ, చాలామంది వ్యక్తులతో కలిసిమెలిసి తిరిగే అవకాశం లభించింది. వీరిలో సామాన్యులు, మాన్యులు, అసామాన్యులు, వ్యవసాయదారులు, రైతుకూలీలు, ఎందరో రాజకీయ ప్రముఖులు, పాత్రికేయ దిగ్గజాలు, కవులు, రచయితులు, విజ్ఞాన ఖనులు, రాజ్యాంగపరమైన పదవుల్లో పనిచేసినవారు, అఖిలభారత సర్వీసులకు చెందిన ఐఏస్, ఐపీఎస్ లాంటి ఉన్నత అధికారులు, వైద్యులు, ఇంజనీర్లు, అధ్యాపక ఆచార్యులు, వాగ్గేయకారులు, తదితర వివిధ రంగాల ప్రముఖులు వున్నారు.

          బాల్యంలో ఖాన్గీ బడి, తరువాత మా గ్రామం, ఖమ్మంలో ప్రాధమిక, ఉన్నత విద్యాభ్యాసం; ఖమ్మం, హైదరాబాద్ లో కళాశాల విద్య; వ్యవసాయం చేసుకుంటూ, గ్రామ స్థాయి రాజకీయాలలో-ప్రత్యేకించి మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ సంబంధిత రాజకీయాలలో అవగాహన కలిగించుకుంటూ మా వూరి గ్రామీణ వాతావరణంలో జీవనం; నాగ్ పూర్ విశ్వ విద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యువేషన్ చదువుకునే రోజుల్లో పరిచయాలు మధురాతిమధురమైన జ్ఞాపకాలు.

అలాగే, ఖమ్మం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లైబ్రేరియన్ గా రు 230 లకు మొదటి ఉద్యోగం; మూడు నెలల తరువాత ఖమ్మం ప్రభుత్వ జూనియర కాలేజీకి ట్రాన్స్ఫర్ కావడంతో అక్కడ అదే ఉద్యోగం; అలా చేరిన మూడో ఏట ఉస్మానియా విశ్వ విద్యాలయంలో లైబ్రరీ సైన్స్ డిగ్రీ చదువు; పరీక్షలు రాయక పూర్వమే బిహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ పాశాలలో ఉద్యోగం రావడం, సుమారు 12 సంవత్సరాలు లైబ్రేరియన్ గా అక్కడే ఉద్యోగం చేయడం మరో గొప్ప జ్ఞాపకం.

తదనంతరం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కుముద్ బెన్ జోషి అధ్యక్షతన వున్న చేతన స్వచ్చంద సంస్థలో అడ్మినిస్ట్రేటివ్, ప్రాజెక్ట్ అధికారిగా (అనధికారికంగా పౌర సంబంధాలతో సహా) రాజ్ భవన్ లో సుమారు నాలుగు సంవత్సరాలు ఉద్యోగం; ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డికి పౌర సంబదాల అధికారిగా ఒక సంవత్సరంపాటు ఉద్యోగం; ఉమ్మడిరాష్ట్ర లేపాక్షి హస్తకళల అభివృద్ధి సంస్థలో పౌరసంబంధాలతో సహా రకరకాల విభాగాలకు సీనియర్ మేనేజర్ గా 10 సంవత్సరాలు సేవల సందర్భంగా పరిచయాలు ఎప్పటికీ మరచిపోలేని అనుభవాలు.  

దరిమిలా, మొదలు హస్తకళల అభివృద్ధి సంస్థ నుండి డిప్యుటేషన్ మీద, ఆ తరువాత కాంట్రాక్టు పద్ధతిన సుమారు 9 సంవత్సరాలు సీనియర్ ఫాకల్టీ, అదనపు డైరెక్టర్ గా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉద్యోగం; 56 ఏళ్ల వయసుకే రాజకీయకారణాల నేపధ్యంలో పదవీ విరమణ చేయాల్సి రావడంతో జీవనోపాధికోసం చిన్నా-చితకా అవకాశాలను వినియోగించుకోవడం; అందులో భాగంగా ఒక గౌరవ మంత్రికి ‘ఘోస్ట్ రచయితగా అనేక వ్యాసాలూ రాయడం; తరువాత కొన్నాళ్లకు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్, హైదరాబాద్ రీజనల్ కార్యాలయంలో డైరెక్టర్ గా ఉద్యోగం; ఆ తరువాత అత్యవసర సహాయ సేవలను అందించే ఇఎంఆర్ఐ 108 అంబులెన్స్ సంస్థలో ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య విభాగానికి లీడ్ పార్టనర్, కన్సల్టెంట్, సలహాదారుడిగా సుమారు నాలుగేళ్లు ఉద్యోగం; తరువాత 104 హెచ్ఎంఆర్ఐ సంస్థలో కన్సల్టెంట్ గా మరో నాలుగేళ్లు ఉద్యోగం నాటి విషయాలను, వ్యక్తులతో పరిచయాలను ఎప్పటికీ మరచిపోలేను.

చివరగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారి దగ్గర ఆయన ప్రధాన పౌర సంబంధాల అధికారిగా తొమ్మిదిన్నర సంవత్సరాలు కలిసిమెలిసి పనిచేసిన అపారమైన అనుభం ఆదినుంచి, చివరిదాకా అక్షరబద్ధం చేయడం ఒక గొప్ప అనుభూతి.

ఎప్పుడో, అప్పుడు తప్ప, దాదాపు నేను చదివిన, పనిచేసిన ప్రతి చోటా పరిచయాలు, వ్యక్తులతో అనుబంధాలు సంతృప్తికరంగానే వున్నాయని చెప్పడానికి ఏ విధమైన సంకోచం లేదు. నా స్నేహితుల విషయంలో నేను ఎలా ప్రవర్తించాలి అని వారనుకుంటారో, అలాగే నేను వుండడం వల్ల కావచ్చు, బహుశా, నా స్నేహితులు కూడా నా పట్ల అలానే ప్రవర్తించారు. అన్నిటికీ అతీతమైన కొందరు వ్యక్తులు ఎలాగూ వుంటారు కదా!!! సమాజంలో ఇలాంటివారికి ఇతరుల పట్ల ఈర్ష్యాసూయలు వుండడం సహజం. అది బలహీనత కావచ్చు, వారి నైజం కావచ్చు, చేతకానితనం కావచ్చు. అలాగే కొందరు సహోద్యోగ వ్యక్తులకు ఇతరుల వృత్తిపరమైన నైపుణ్యాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం కూడా లేకపోవచ్చు. మున్ముందు ఈ వివరాలు ఎలా నా చేయి తిరిగితే అలా విశ్లేషించాలనే తాపత్రయం దేనికి దారి తీస్తుందో ఇప్పుడు చెప్పడం కష్టం.

నా మూడో ఏట చదువు మా గ్రామం వనంవారి కృష్ణాపురంలో ప్రారంభమైంది. ఇప్పటి ప్రీ-స్కూల్, కెజి స్కూళ్ల లాగా మా చిన్నతనంలో (75 సంవత్సరాల క్రితం) గ్రామాలలో ఖాన్గీ బడులుండేవి. ఖాన్గీ బడి రోజులు అంతగా జ్ఞాపకం లేకపోవడానికి కారణం అప్పటి నా వయసు మరీ తక్కువ కావడమే. కాకపోతే అక్కడ నేర్చుకున్న, కంటస్థం చేసిన అనేకానేక పెద్ద బాలశిక్ష విషయాలు ఇప్పటికీ మరచిపోలేదు. తరువాత గ్రామంలో కొఠాయి (రచ్చబండ) దగ్గర ఒక పూరి పాకలో వున్న ప్రభుత్వ పాఠశాలలో మొదటి తరగతిలో చేర్పించారు నాన్న గారు. ప్రభుత్వ పాఠశాలలో చేరినప్పుడు, అది ఏకోపాధ్యాయ పాఠశాల. ఒకే ఉపాధ్యాయుడు పని చేసేవారు. కొద్ది కాలానికి మరో ఉపాధ్యాయుడిని పోస్ట్ చేశారు. ఒకరిని ‘పాత పంతులు గారు’ అని, మరొకరిని ‘కొత్త పంతులు గారు’ అని గ్రామంలో చిన్నా-పెద్దా అందరూ వారిని అత్యంత గౌరవంగా సంబోధించే వారు.

నా అసలు పుట్టిన తేదీని (ఆగస్ట్ 8, 1948) మార్పించి, పాఠశాల రికార్డులలో జులై 1, 1947 గా రాయించారు. ఐనప్పటికీ, నేను 1962 లో హెచ్ ఎస్ సీ (పదకొండవ తరగతి) పబ్లిక్ పరీక్షలు రాయడానికి ఒక ఏడాది వయస్సు తక్కువైతే, ‘ఏజ్ అండ్ హెల్త్ మెడికల్ సర్టిఫికేట్’ తీసుకోవాల్సి వచ్చింది. 1966 మార్చ్ లో నేను డిగ్రీ పరీక్షలు రాసేటప్పటికి నా వాస్తవ వయస్సు కేవలం 17 సంవత్సరాల 7 నెలలు మాత్రమే. ఖాన్గ్గీ బడి, పూరిపాక బడి చదువు, ఆ చిన్నతనం పరిచయాలు అదోరకమైన సంతృప్తి మిగిల్చాయి.  

వూరి బయట ‘పైలు పెంట’ అనే స్థలంలో పాశాలకు నూతన భవనం నిర్మించిన తరువాత, ఐదవ తరగతి వరకు ప్రాధమిక విద్య అక్కడ చదివిన రోజుల్లో గ్రామాల స్నేహితులు సహా ఉపాధ్యాయులు, తదితరులతో గడపడడం హాయిగా, అనుభూతితో కూడినదిగా వుండేది. ఆర్థికంగా అంతస్తులో అప్పట్లో నేను కొంచెం ఎక్కువ అయినప్పటికీ, నేను నా స్నేహితులతో కలిసి మెలిసి ఉండడం, వారు నాతో అరమరికరలు లేకుండా ఆప్యాయంగా వుండడం, ఏడున్నర దశాబ్దాల తరువాత కూడా మరువలేని మధురమైన జ్ఞాపకం. ఇప్పటికీ మావూరికి పోతే వీలుచూసుకుని గ్రామంలోని బాల్య స్నేహితుల్లో కొందరినైనా కలవడం నాకు సరదా. కేవలం సరదానే కాకుండా, అరమరికలేని ఆ పరిచయాలు అదోరకమైన సంతృప్తి మిగిల్చాయి.  

          అప్పట్లో, మా గ్రామం పాశాలలో ఆరవతరగతి లేనందువల్ల, జిల్లా కేంద్రమైన ఖమ్మం మామిళ్ళగూడెంలోని మా ఇంటి సమీపంలో వున్న ‘రికాబ్ బజార్ ఉన్నత పాశాలలో చేరాను. ఆరవతరగతి నుండి హెచ్ ఎస్ సీ (11 వతరగతి) ఆరు సంవత్సరాలు అక్కడే చదువుకున్న నాకు ఆ మధురమైన రోజులు జ్ఞప్తికిరాని రోజంటూ లేదు. ఆ ఆరేళ్ల కాలంలో కొందరు సహాద్యాయులు మొదటినుండి క్లాస్మేట్స్ కాగా, కొందరు ఆ తరువాత చేరడమో, మధ్యలో మానేయడమో జరిగేది. ప్రతి తరగతిలో మూడు సెక్షన్లు (ఏ, బి, హెచ్) వుండేవి. అప్పట్లో ఉర్దూ సెక్షన్ వున్న పాశాలలలో నేను చదువుకున్నది ఒకటి.

హెచ్ ఎస్ సీ చేరుకొని పబ్లిక్ పరీక్షలు రాసేనాటికి మూడు సెక్షన్లు కలుపుకుని కరెక్టుగా నూరుమంది విద్యార్థులం వుండేవాళ్లం. మా పాశాల నుండి పబ్లిక్ పరీక్షలకు వెళ్లిన బ్యాచుల్లో మాది రెండవది. మాముందు బ్యాచ్ నుండి పరీక్షలు రాసినవారిలో చాలామంది ఉత్తీర్ణులు కావడమే కాకుండా, మెడిసిన్, ఇంజనీరింగ్ లాంటి ఉన్నత చదువులు చదివి జీవితాలలో బాగా స్థిరపడ్డారు. ఇక మాభ్యాచ్ విషయానికొస్తే, పరీక్ష రాసిన వందమందిలో కేవలం 4 గురు సెకండ్ క్లాస్ లో, 5 గురు థర్డ్ క్లాస్ లో మాత్రమే పాసయ్యారు. నాతో సహా (నేను హయ్యర్ సెకండ్ క్లాస్) పాసైన తొమ్మిది మందిలో ఒక్కరు కూడా ఇంజనీరింగ్ కాని, మెడిసిన్ కానీ చదవలేకపోయారు. కాకపోతే, మాతో సహా దరిమిలా పాసైన ఇతరులతో సహా కొందరికి మంచి ఉద్యోగాలు దొరకడం, జీవితంలో స్థిరపడడం, కొందరు స్వర్గస్తులు కావడం జరిగింది. 

క్లాస్మేట్స్ లలో బాగా గుర్తున్న, మేమంతా కలిసిమెలిసి ఆనందంగా, ఆప్యాయంగా. అలుపు అనేది ఎరుగకుండా బాల్యం గడిపిన వారి పేర్లు చాలా వరకు జ్ఞప్తికి వస్తున్నాయి. ఆ ఆరేళ్ల రికాబ్ బజార్ పాశాల విద్యాభ్యాస అనుభవం చెరిపేసినా చెరగని అపూర్వ జ్ఞాపకం. ఇప్పటికీ వీరిలో చాలామందిమి తరచూ కలవలేకపోయినా, ఏదో విధంగా పలకరించుకోవడం మాత్రం జరుగుతూనే వుంది. వీలుచిక్కినప్పుడల్లా, ఖమ్మం పోయినప్పుడల్లా, కొందరిని కలవడం నాకు సరదా.

పాశాల ఉపాధ్యాయుల విషయానికొస్తే వారు మా పట్ల చూపిన అభిమానం మాటల్లో వ్యక్తీకరించడం సాధ్యపడదు. ఉపాధ్యాయుల కంటే ఎక్కువగా చనువుగా వుండే ఒంటి కన్ను చప్రాసి ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తున్న సన్నిహితస్నేహితులే, మహానుభావులే. ‘బాపూజి బాల సమాజ్’, ‘లిల్లీపుట్ పార్టీ పేరుమీద పాశాల ఎన్నికల్లో పోటీ-ఓటమి, ఇలా అరమరికలు, భేషజాలు లేని ఆరోజులు కళాశాలలో చేరక మునుపు మదిలో మెదిలే మదురమైన జ్ఞాపకాలు. ఆ పరిచయాలు అదోరకమైన సంతృప్తి మిగిల్చాయి. కళాశాల చదువు రాజకీయ ప్రాధమిక పాఠాలను నేర్పిందికాని, పూర్తిస్థాయి రాజకీయవాసన తగలలేదు. వాసనలన్నీ సుగంధంగానే ఉండవు, దుర్గంధమూ ఉంటుంది. అదే జీవిత సత్యం. ఆ వివరాలు కొన్ని  మున్ముందు.  

Monday, June 16, 2025

The ECI’s Ineffectiveness: The Watchdog on a Leash : Vanam Jwala Narasimha Rao

 The ECI’s Ineffectiveness: The Watchdog on a Leash

Vanam Jwala Narasimha Rao

The Hans India (16-06-2025)

In a June 7, 2025 article, Leader of the Opposition in Lok Sabha and Senior Congress leader Rahul Gandhi made a serious allegation of ‘Industrial-Scale Rigging’ in the 2024 Maharashtra Assembly Elections. His claims were strongly rebutted by the Election Commission of India (ECI) dismissing as ‘completely absurd’ and aimed at defaming the Commission. In retaliation, Rahul Gandhi strongly objected to this rebuttal that came in the form of an unsigned note, raising questions about the transparency and accountability of the institution. Meanwhile, Congress MP Jairam Ramesh cautioned ECI to be ‘Independent and Transparent’ and avoid to speak through BJP president Nadda.        The ECI has long been regarded as one of India’s ‘Most Respected Constitutional Bodies’ entrusted with the vital task of ensuring conduct of free and fair elections to Lok Sabha, Rajya Sabha, State Legislative Assemblies, State Legislative Councils across the country, besides elections to the offices of the President and Vice President.

In addition, ECI also oversees the registration, recognition of political parties, regulation of party symbols, and their name changes. Chief Election Commissioner (CEC) and Election Commissioners (ECs) hold office for a term of six years or until they reach the age of 65, whichever comes earlier. Despite its constitutional mandate and legal autonomy, recent developments have led to growing public concerns over the ECI’s perceived ineffectiveness and declining impartiality.

Rahul Gandhi’s sharp criticism, in a way, reflects a broader sentiment that the ECI may no longer be functioning as the neutral, fearless guardian of democracy. Comprehension of ECI, and Political Parties, is an interesting study. CEC who heads the ECI and ECs can be removed only through a parliamentary impeachment. From ‘Day One’ when the Constitution was adopted on November 26, 1949, ECI and CEC have been maintaining fairly balanced approach, barring occasional biases for explicable and inexplicable reasons, but by and large it was a neutral approach.  

CEC was a ‘Single Member Institution’ from March 21, 1950 to September 30, 1993. However, Since October 1, 1993 it became a three-member body. Every state and union territory has a Chief Electoral Officer (CEO) representing the ECI. The CEC announces the schedule of elections after considering various factors. Despite all this well knitted structure, frequent allegations on ECI and indirectly on CEC, necessitates a study of Electoral System that includes political parties’ registration.

In most electoral systems, political parties are required to register before they can field candidates and contest in elections. Registering usually demands obligations that parties must meet. In order to register as a party, most electoral systems have established minimum eligibility requirements, usually based on having a certain number of registered voters as members.

Registration procedures also have restrictions on the party names. Categorizing parties either when they register or later, such as National, Regional etc. is also in vogue.

The registration process is governed by ECI, which begins with submission of an application on the party letterhead, enclosing required fee remittance details, bye-laws including formal constitution with a provision regarding periodical organizational elections at different levels with a mention of term of office, declaration of office bearers, minimum number of members, and affidavits committing to secularism and democracy. But this drama is more a procedural one, than substantive.

In effect, ECI itself remarkably limited its own powers giving an impression that they are largely procedural, but not punitive. This contradiction, apparently strong in electoral conduct, weak in party ethics, has created a wide chasm between legal norms and ground realities. The reason is simple: The ethical part in some form or other to be adhered by parties is conspicuously absent, and over a time ECI conducting elections and political parties’ changing interpretation on ECI role has become a subject of unequivocal controversy, and ambiguous refutes by ECI.

Furthermore, ECI rarely dares to touch any political party on issues of dishonest promises and observations, except sticking to the rule book regarding Model Code, Expenses, Affidavits, Offensive or Hate Speeches etc. that too during the election process. ECI literally sleeps throughout the period between election and election and does not bother at all as to what any political party does particularly with reference to promises galore, whether they were implemented or not.

Beyond registration and symbol allocation, ECI’s authority is nominal. It does not possess field machinery or legal mandate to investigate practices that are not in conformity, unless a formal complaint backed by evidence is made. ECI never intervenes on defections and intra-party coups, MLAs defect en masse form breakaway factions, and destabilize governments, unless there is a formal complaint. Ideological betrayals or opportunistic splits are not in its purview.

The visible unethical practice of eleventh-hour distribution of B-forms, including to overnight defectors, just before nomination submission on the last day, or at times withdrawals deadline, is literally a tool of coercion and favor, especially practiced by hereditary or centralized leaderships. ECI simply mandates format, it cannot question rationale behind deciding candidature. Internal sabotage, backroom deals, or caste calculations, remain opaque and unchallengeable processes in real time.

In essence, the ECI’s ‘Ineffectiveness is Akin to a Watchdog on a Leash’ in party ethics. It ensures elections are conducted on time, and that certain procedural norms are followed. But it cannot legally intervene in how parties are created, funded, split, or manipulated unless the matter is framed as a technical dispute. The larger rot, in ideology, internal democracy, leadership monopoly, forced memberships, and unregulated funding, lies outside its control. Whether the ‘Industrial-Scale Rigging’ as alleged by Rahul to be attributed to ECI or Government remains a million-dolor question.

Despite this inefficiency of ECI, in the vast and often turbulent arena of political parties, there have been shining examples of best practices that elevated democratic values, next practices that signaled evolving norms, and individuals who led parties not just to electoral success but to moral and institutional maturity. These instances provide blueprints for what political leadership can and should be. It is beyond doubt that, in the often-unpredictable theatre of Indian democracy, political parties serve as principal vehicles of public representation, policy formulation, and power negotiation.

ECI in January 2017 published a book, ‘Unfolding Indian Elections-Journey of the living democracy’ that documented interesting facts on Indian Elections. Post Independence and with Universal Adult Suffrage, first general elections were held for Lok Sabha and State Legislative Assemblies simultaneously during 1951-52. Every citizen above 21 years (18, since 2014 elections) of age was eligible to vote. The enormous task to enroll every adult citizen was fairly a grand success.

Spending money or buying votes in the first general elections, the whole process of which took place from September 10, 1951 to June 4, 1952, was an anathema. Global community witnessed these elections with great interest. World had taken notice of subsequent elections also in India and journalists, politicians and observers from numerous countries descended upon India to see its novel experiment of adult suffrage.

First CEO Sukumar Sen oversaw the elections. Indelible ink for application on voter’s fingers was developed by Indian Council of Scientific and Industrial Research. Metal and wooden boxes were used to receive ballots. Each candidate was assigned one box then. Strangely some voters regarded ballot boxes as objects of worship and dropped flowers and some dropped papers writing something.

From Sukumar to present CEO Gyanesh Kumar it has been a long and successful journey. However, Rahul Gandhi’s allegation of ‘Industrial-Scale Rigging’ by this highly reputed constitutional body, propelled ECI into a dilemma and major concern of sustenance of its unbiased standing in future. Let us hope that, ECI which seldom established its powers earlier, and no hope of exhibiting in future, despite parties and candidates fail to observe its essential directives, such as election expenditure and malpractices, transforms effective.  

Sunday, June 15, 2025

త్రిపురాసుర సంహారం, చతుర్విధ వర్ణాశ్రమ ధర్మాలు ..... శ్రీ మహాభాగవత కథ-40 : వనం జ్వాలా నరసింహారావు

 త్రిపురాసుర సంహారం, చతుర్విధ వర్ణాశ్రమ ధర్మాలు

శ్రీ మహాభాగవత కథ-40

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (16-06-2025)

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

మయాసురుడి వల్ల ఒకానొక సందర్భంలో మహేశ్వరుడి మహిమాన్వితమైన యశస్సుకు మచ్చకలిగింది. వివరాల్లోకి పోతే.... దేవతల పరాక్రమానికి తట్టుకోలేని రాక్షసులు ఒకడుగు వెనక్కు వేసి, మయుడి చాటున దాక్కున్నారు. దుర్మార్గుడైన మయుడు బలిష్టమైన పూడు పురాలను రాక్షసులకు నిర్మించి ఇవ్వడంతో వారందులో ప్రవేశించి యథేఛ్చగా తిరుగుతూ లోకాలను ఇబ్బందులకు గురిచేశారు. లోకపాలకులు మహేశ్వరుడి శరణుజొచ్చారు. ఆయన వారికి అభయమిచ్చి ఒక దివ్యబాణాన్ని త్రిపురాలమీద వేశాడు. దాన్నుండి అనేక వేల బాణాలు పుట్టి త్రిపురాలను కప్పివేశాయి. ప్రాణాలు కోల్పోయిన రాక్షసులను మయుడు సిద్ధరసం బావిలో పడేయడంతో వారు బతికి మరింత రెచ్చిపోయారు. అప్పుడు విష్ణుమూర్తి పాడి ఆవు రూపం ధరించి, బ్రహ్మను గోవత్సంగా మార్చి, బావిలోని అమృతాన్ని తాగాడు. రాక్షసులు, వారితోపాటు మయుడు దుఃఖించసాగారు. అప్పుడు శివుడు విడిచిన ఒక బాణం దెబ్బకు త్రిపురాలు కాలిపోయాయి. త్రిపురాసుర సంహారంతో సమస్త ప్రజలు సంతోషించారు. శివుడు కైలాసానికి వెళ్లిపోయాడు. 

త్రిపురాసుర సంహార విషయాన్ని ధర్మరాజుకు చెప్పిన నారదుడు, దానికి కొనసాగింపుగా, ఆయన నారాయణుడి ద్వారా బదరీవనంలో విన్నసనాతన ధర్మాన్ని, వర్ణాశ్రమ ధర్మాలను గురించి వివరించాడు. నారదుడు చెప్పిన విషయ సారాంశం: అన్ని వర్ణాలవారికి సత్యం, దయ, ఉపవాసం మొదలైన దీక్షలతో పాటు, సదాచారం, ఓరిమి, మంచి-చెడ్దల తెలివి, సంతృప్తి, మృదు స్వభావం, ప్రాణుల్లో పరమాత్మను దర్శించడం, శ్రీమన్నారయణ స్మరణ లాంటి ముప్ఫై లక్షణాలు కలిగి వుండాలి. సంస్కారాలకు భంగం కలగకుండా బ్రాహ్మణుడు మంత్రయుక్తంగా కర్మలు చేయాలి. శాస్త్రంలో విధించబడ్డ యజ్ఞాలు చేయడం-చేయించడం లాంటి ఆరు కర్మలు బ్రాహ్మణుడు విధిగా నిర్వహించాలి. అలాగే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు శాస్త్రం చెప్పిన రీతిలో వారి-వారి ధర్మాలను నెరవేర్చాలి.  దొంగతనం, హింస లాంటివి ఎవరికీ తగవు. స్త్రీ తన ధర్మాన్ని, పురుషుడు తన ధర్మాన్ని శాస్త్రం చెప్పిన రీతిలో ఆచరించాలి. సాత్త్విక ధర్మంతో ఎప్పుడూ వంశాచార క్రమంగా తనకు విధించబడ్డ ధర్మాన్ని తప్పక ప్రవర్తించే మానవుడు మెల్లగా స్వభావసిద్ధమైన కర్మాచరణను విడిచి, ముక్తిని పొందుతాడు. పుట్టుకతో మానవుడి కులాన్ని నిర్ణయించాల్సిన అవసరం లేదు. అంతరింద్రియ, బహిరింద్రియ నిగ్రహాదులు మొదలైన లక్షణాల ఆచరణతో గుర్తించాలి.

బ్రహ్మచర్యంలో వున్నవాడు మంచి నడవడితో, మూడు సంధ్యలలో బ్రహ్మరూప గాయత్రి మంత్రాన్ని జపించాలి. దేవతార్చన చేయాలి. ఇంద్రియాలను వశపర్చుకుని సత్యాన్నే మాట్లాడాలి. ఆత్మస్వరూపం తెలుసుకున్న జీవుడు తానూ ఈశ్వరుడు ఒకటేనని గ్రహించాలి. సత్ప్రవర్తనతో తన ధర్మం నిర్వర్తించిన వాడే ఉత్తమ గృహస్తుడు. బ్రాహ్మణుడు గృహస్తాశ్రమాన్ని స్వీకరించి, గురువుల వద్ద విద్యనభ్యసించి, నియమనిష్టలతో వుండాలి. అలాగే, వానప్రస్థ జీవనంలో వున్నవారికి కూడా మునులు కొన్ని ధర్మాలను బోధించారు. అవి విధిగా నెరవేర్చాలి. గృహస్థ ధర్మాన్ని వదిలిన తరువాతే వానప్రస్థ ధర్మాన్ని స్వీకరించాలి. దైవయోగం వల్ల వృద్ధాప్యం వచ్చిన తరువాత, అంతా పరమాత్మలో లయం చేయాలి. పరబ్రహ్మంలో లీనం కావాలి. వానప్రస్థ ధర్మాలను ఆచరిస్తూ ఇంకా బతికున్నట్లయితే అన్ని బంధాల నుండి విడివడి సన్న్యసించాలి. ఇక అప్పటి నుండి దేహమాత్రావిశిష్టుడై జీవించాలి. పరమాత్మలో విశ్వాన్ని చూస్తూ, సత్యాసత్యమైన విశ్వంలో పరబ్రహ్మమైన ఆత్మను చూస్తూ, మృత్యువు సత్యమని తెలుసుకుంటూ, కాలనికై ఎదురు చూస్తూ, పరమహంస తత్త్వాన్ని పొంది జీవబ్రహ్మైక్య భావనతో మెలగాలి.

నారదుడు చెప్పడం కొనసాగిస్తూ చతుర్విధ ఆశ్రమాల ధర్మాలను చెప్పాడిలా: గృహస్థ ధర్మంలో వున్నవాడు చేసే పనులన్నీ వాసుదేవార్పణంగా చేయాలి నారాయణుడి దివ్యమైన అవతార కథలను వినాలి. ధన, ధాన్య నిధులు దైవ సంకల్పం అనుకుని వాటి పట్ల అభిమానం పెంచుకోకూడదు. పంచ యజ్ఞాలు చేసి, అనంతరం పరమాత్మను అర్చించి, జీవుడు బతుకు సదుపాయాన్ని చక్కగా నిర్వర్తించాలి. అతిథి శుశ్రూష చేసి ధర్మమార్గంలో ఈశ్వరుడిని గెలవాలి. అందరినీ సంతృప్తి పరచాలి. ముఖ్యమైన రోజుల్లో ఆయా తిథుల ప్రకారం పుణ్యకాలాలలో జపహోమ స్నాన వ్రతాలను చేయాలి. దేవతలకు, బ్రాహ్మణులకు పూజలు సంతర్పణలు చేయాలి. శ్రాద్ధ కర్మలు విధిగా చేయాలి. కురుక్షేత్రం, ప్రయాగ, కాశి, రామేశ్వరం లాంటి పుణ్యక్షేత్రాలను దర్శించాలి.   

సమస్త లోకాలకు విష్ణువే దైవం. ఇక ఆ విష్ణువుకు దైవం, మూడు వేదాలను చదివిన, సర్వ ప్రాణుల్లోను అచ్యుతుడిని దర్శించిన, ముల్లోకాలను తన పాదధూళితో పవిత్రం చేయగల బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి సంతోషంగా సంతర్పణ జరిగితే అధికంగా శ్రాద్ధవిధి చేయాల్సిన అవసరం కూడా వుండదు. బ్రాహ్మణులు వారి-వారి కర్మలను మాత్రం యధావిధిగా ఆచరించాలి. ఏ ఆశ్రమంలో చేయాల్సినవి ఆ ఆశ్రమంలో తప్పక చేసి తీరాలి. బ్రహ్మచారి తన ఆశ్రమవిధికి తగిన ఆచారమైన వ్రతాన్ని విడువకూడదు. గృహస్థ ధర్మాన్ని ఆచరించేవారు ప్రతిదినం చేసే పనులు మానాకూడదు. వానప్రస్థుడై తపస్సు చేయాలనుకునేవాడు జనపదంలో నివసించకూడదు. సన్న్యాసికి, అంటే సర్వసంగపరిత్యాగికి స్త్రీ సాంగత్యం పనికిరాదు.

శరీరమే ఒక రథం. దాన్ని నడిపే సారథి బుద్ధి. ఇంద్రియ సమూహం గుర్రాలు. మనస్సు పగ్గం. ప్రాణాలైన పదివాయువులు బండి ఇరుసు. ధర్మ-అధర్మ వర్తనాలు బండి చక్రాలు. చిత్తం పెద్ద మోకు ముడి. శబ్ద స్పర్శ రూపాదికాలు రథం తిరిగే ప్రదేశాలు. ’నేను-నాది’ అనే అహంకారంతో కూడిన జీవుడు రథంలో వుండే పురుషుడు. మహనీయమైన ఓంకారం విల్లు. నిర్మలుడైన జీవాత్మ బాణం. శుభాన్ని చేకూర్చే బ్రహ్మం తగిన లక్ష్యం. రాగద్వేషాలు, లోభ-మోహ-మద-మాత్సర్యాదులు బద్ధ శత్రువులు. మానవ శరీరమైన రథాన్ని తన వశంలో వుంచుకోవాలి. రాగద్వేషాది శత్రువులను శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో సంహరించాలి. ఓంకారమనే విల్లులో నిర్మలుడైన జీవుడనే బాణాన్ని ఎక్కుపెట్టి బ్రహ్మమనే లక్ష్యం మీద గురిపెట్టాలి. అహంకార రథంలోని జీవుడు దాన్ని నడిపే ప్రయత్నం మాని, సహజమైన బ్రహ్మానందంలో వుండాలి. అలాంటి భాగ్యం దొరకనప్పుడు జీవుడనే రథికుడిని కర్మమార్గంలో నడిపించి విషయాలనే శత్రువుల మధ్య పడవేస్తాయి. అప్పుడు జీవుడిని సంసారం అనే నూతిలో పడవేస్తారు శత్రువులు.     

వేదంలో ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అని రెండు విధాలు చెప్పబడింది. ప్రవృత్తి మార్గం వల్ల పునర్జన్మలు కలుగుతే, నివృత్తి మార్గం వల్ల మోక్షం లభిస్తుంది. ప్రవృత్తి కర్మలలో ఇష్టం, పూర్తం అని రెండు మార్గాలున్నాయి. అందులో వున్నవాడు మళ్లీ-మళ్లీ జన్మలను ఎత్తుతుంటాడు. నివృత్తి మార్గంలో వున్నవాడు ఇంద్రియాలను జయించి, ఆత్మస్వరూపుడై మోక్షాన్ని పొందుతాడు. ప్రవృత్తి, నివృత్తి మార్గాలను ఎవరైతే అర్థం చేసుకోగలరో వారు మోహాన్ని పొందరు. భావాద్వైతం, క్రియాద్వైతం, ద్రవ్యాద్వైతం అని మూడున్నాయి. కార్యకారణాలలో వస్తువు ఒకటే అని తెలిసి, ఏకత్వభావనతో, భేదం లేదని నిశ్చయించడం భావాద్వైతం. మనస్సుతో, వాక్కుతో, శరీరంతో చేసిన కర్మలన్నీ ఫలాల తారతమ్యం ఎంచక పరబ్రహ్మకు అర్పించడం క్రియాద్వైతం. కొడుకులు, మిత్రులు, భార్య మొదలైన జీవులకు, తనకు, దేహానికి లోపల పంచభూతాత్మకత్వంతో అనుభవించేవాడు ఒకడే అనే పరామర్థ లక్షణంతో, కోరికలు-ద్రవ్యం ఇవి ఒకటే అని భావించడం ద్రవ్యాద్వైతం. ఆత్మతత్త్వానుసంధానం చేసేవాడు ఈ భేదాలను వదులుకోవాలి. 

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

 

 

Saturday, June 14, 2025

సమకాలీన రాజకీయాలను అర్థం చేసుకోవడమెలా? : వనం జ్వాలా నరసింహారావు

 సమకాలీన రాజకీయాలను అర్థం చేసుకోవడమెలా?

వనం జ్వాలా నరసింహారావు 

మనతెలంగాణ దినపత్రిక (14-06-2025)

ప్రజాస్వామ్యంలో విమర్శ ఎప్పటికీ కీలకమే. బాధ్యతారాహిత్యంగా, రాజకీయపరమైన అసంబద్ధ విమర్శలు చేస్తే అది హానికరమవుతుంది. ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ముసురు మేఘంలా విస్తరించిన రాజకీయపరమైన విమర్శ సంస్కృతి, సంబంధిత చర్చలను సహితం నిర్వీర్యం చేస్తోంది. ప్రతిపక్షమనేది అంటే అహర్నిశలూ, మంచికీ-చెడుకీ విమర్శించే శబ్దకాలుష్య వేదికకాదు. శాస్త్రీయంగా, సమగ్రంగా, రాజనీతిజ్ఞంగా, ప్రజాఅభివృద్ధికోణంలో, అంశాల అధ్యయనం ఆధారంగా,  నిర్మాణాత్మకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేదిగా, జవాబు రాబట్టేదిగా వుండాలి. విపక్షం 'ఒత్తిడి పెంచే' వ్యవస్థ కారాదు.

ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు, ప్రభుత్వాధినేతలకు, పాలానాపరంగా, తీసుకునే నిర్ణయాలకు ఆర్ధిక, సామాజిక కోణం వుంటాయి. అది తప్పనిసరి. వారు ఏపార్టీవారైనా, తీసుకున్న నిర్ణయం ఒక్కోసారి వ్యయభారం కావచ్చు. రాజకీయ ఒత్తిడీ కావచ్చు. తక్షణమే ప్రజలకు అర్ధం కాని ప్రయోజనాల కోసం కావచ్చు. సమతూక విశ్లేషణ జాకరూకతతో చేయాలి. నిర్ధారించుకున్న తరువాతే అంశాలవారీగా విమర్శించాలి.

తెలంగాణలో ఇటీవల ముగిసిన మిస్ వరల్డ్ పోటీల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిమీద వచ్చిన విమర్శలేకావచ్చు,  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అమరావతి ప్రాజెక్టు వ్యవహారంలో వ్యయపరమైన బాధ్యాతారాహిత్య విమర్శలేకావచ్చు, తెలంగాణ మాజీముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ ఆయనమీద వచ్చిన విమర్శలే కావచ్చు, ఆహ్వానించదగ్గవికాదు.

భారత జాతీయ రాజకీయ పార్టీలుకానీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీనుండి చీలిపోయి వెలసిన పలు ప్రాంతీయ పార్టీలుకానీ, ఇతర రకాలుగా ఆవిర్భవించిన జాతీయపార్టీని పేరులో చేర్చుకున్న ప్రాంతీయ పార్టీలుకానీ, ఆసాంతం భారత రాజకీయ వ్యవస్థ కానీ, ప్రజల సంకల్పానికి, ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా, ప్రతిరూపంగా, ప్రజాస్వామ్య విలువల ఆధారంగా నిర్మితమవ్వాల్సిన మౌలిక ప్రణాళికకు సుదూరంగా, అధికారమే ధ్యేయంగా పయనిస్తున్నాయి. మానవతా దృక్కోణం, సామాజిక సంస్కరణపట్ల నిబద్ధత మృగ్యమైంది.

వారసత్వ రాజకీయాన్ని, ప్రచార ఆడంబరాన్ని, మితిమీరిన వ్యయాన్ని, ప్రజాకర్షణను, ఎంచుకునే వ్యవస్థలయ్యాయి రాజకీయపార్టీలు. నైతిక బీజాల నుంచి పురుడుపోసుకున్న జాతీయ రాజకీయ పార్టీలు సహితం, చిత్తశుద్ధిని సంపూర్ణంగా కోల్పోయి, మానవ-నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చాయి. ఏకొద్దిమందో మినహాయించి, రాజకీయనాయకులు అధికారంలో ఉన్నా, బాధ్యాతాయుతంగా మెలగాల్సిన ప్రతిపక్షంలో ఉన్నా, తమ వైఖరిలో స్పష్టతను కోల్పోయి, ప్రత్యర్థులను అసంబద్ధంగా వ్యతిరేకించే బాండ్ మేళంగా మారారు.

రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించే ఆలోచనలు ఆ పార్టీవారి నుంచే ఒకవైపు, అలాగే కొనసాగించాలన్న స్వీయవర్గీయ పూనికలు మరోవైపు, అసమ్మతి-సమ్మతిలాగా తలపడడంవల్ల, ప్రజాస్వామ్య బలహీనత స్పష్టమవుతున్నదేమో అన్న భావన కలుగుతున్నది. రాజకీయ సంక్లిష్టతను ఆవిష్కరించడమైనా, రాజకీయపార్టీల, నాయకుల ధోరణుల విశ్లేషణ అయినా, సమకాలీన రాజకీయ గమనాన్ని అర్థం చేసుకోవడమైనా, ఇబ్బంది కలిగించే అంశాలే. రాజకీయ పార్టీలు ఓటు కోసం పోటీ చేసే యంత్రాలు కారాదు, కాకూడదు. ప్రజల సంకల్పానికి, అభీష్టానికి ప్రతిరూపమైన వేదికలు మాత్రమే కావాలి.

స్వాతంత్ర్యోద్యమ సమయంలో చర్చలు మాత్రమే జరిపే వేదికగా ఆరంభమైన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, దరిమిలా బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చినతరువాత, అధికారం సుదీర్ఘకాలం అనుభవించినాక, ఉద్యమస్ఫూర్తికి దూరమై, అలసత్వానికి, అంతర్గత విభజనలకు, కుమ్ములాటలకు, అధికారం లభించాల్సిందే అన్న భావానికి లోనై, చివరకు మృదుమధురమైన ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ పార్టీదిప్పుడు మరుగునపడ్డ ఒక అధ్యాయం,   

భారత ప్రజాస్వామ్యం కుటుంబ వారసత్వ రాజకీయంగా మారిపోయింది. నాయకుల కొడుకులు, కూతుళ్లు, వారి పిల్లలు, దగ్గరి బంధువులు, తరాలుమారినా, వారసత్వంగా, రాజకీయపార్టీల కుటుంబ లిమిటెడ్ కంపెనీలమాదిరిగా కుర్చీలను ఆక్రమిస్తున్నారు. ఎదురు తిరిగితే నొక్కిపడేస్తున్నారు. మిగతావారిని హెచ్చరించడం జరుగుతున్నది. వంశపారంపర్యాన్ని ప్రోత్సహించటమే రాజకీయధర్మంగా, నైతికతగా మారింది. ప్రజాస్వామ్య వికాసాన్ని తిరోగామిగా మార్చివేసింది. జవహర్‌లాల్ నెహ్రూ తన తండ్రి మోతీలాల్ స్థానంలో ఎఐసీసీ అధ్యక్షుడిగా ఎంపికైననాడే ఇది మొదలైంది. అదే ధోరణి ఇతరులకు స్ఫూర్తిగా మారింది.

వంశపారంపర్య రాజకీయ ధోరణి కారణంగా, కొత్తవారికి పార్టీల్లో స్థానం దొరకడం అసాధ్యమవుతోంది. ప్రజలు నాయకులకే ఓటు వేస్తున్నట్టు కనిపిస్తున్నా, ఆ నాయకులను ఎన్నుకునే అవకాశమే లేదు. ఇది ప్రజాస్వామ్య మూల సూత్రాలకు విరుద్ధం. దేశాన్ని  ప్రభావితం చేసిన కొన్ని పార్టీలు ప్రాంతీయ స్థాయిలో కీలకపాత్ర వహించాయి. రాష్ట్రాల ఆశయాలు, సామాజిక సమీకరణాలు, ప్రజల ఆకాంక్షలతో ముడిపడి అవి ఎదిగాయి. ఇవి ప్రజల అభిమతానికి ప్రతిరూపంగా మొదలై, అధికారం సాధించగలిగాయి. తర్వాత అవి కూడా ఏకవ్యక్తి ఆధిపత్యంలోకి మళ్లాయి.

పార్టీల నమోదు విషయానికొస్తే, భారత ఎన్నికల సంఘం విధించిన కాగితం నిబంధనల ఆధారంగా ఎవరైనా ఒక పార్టీని, ఆమాటకొస్తే ఎన్నిపార్టీలనైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. అవసరం లేకపోయినా ముందస్తుగా రిజిస్టర్ చేసి, పేరును అమ్ముకునే సందర్భాలు సర్వసాధారణం. పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా? అధ్యక్షుడిని ఎన్నుకునే స్వేచ్ఛ సభ్యులకు ఉందా? సభ్యుల జాబితా నవీకరణ జరుగుతున్నదా? పార్టీ నైతిక విధానాలు కట్టుబాట్లుగా అమలవుతున్నాయా? అనే ప్రశ్నలకు జవాబులే లేవు. భారత ఎన్నికల సంఘం  గుర్తింపు ఇచ్చే విషయంలో తప్ప, పార్టీ నైతికతను పర్యవేక్షించాలనే బాధ్యత పెద్దగా తీసుకోదు. జాతీయపార్టీల రాష్ట్రాధ్యక్షుల ఎంపికలో ఎన్నికలు నామమాత్రంగా కూడా జరగవు. సభ్యుల అభిప్రాయం అవసరం లేదు.

రాజకీయ పార్టీలు నిజంగా ప్రజాసేవ, సిద్ధాంత నిశ్చయత, ప్రజాస్వామ్య సాధికారత అనే బీజాలతో ఏర్పడాలి. కానీ ఆ ఆత్మవిశ్వాసాన్ని తేవాలంటే చట్టాలు సరిపోవు. ప్రజల ఒత్తిడి, సంస్థాగత పర్యవేక్షణ, అవగాహన గల ఓటర్ల సమర్ధించగల శక్తి అవసరం. రాజకీయాల్లో ఒక్కో సంచలనం కనిపించడమే కాదు, దాని వెనుక దాగిన వ్యూహాలు, చైతన్యాలు, వాస్తవాలు, ఇవన్నీ తలచుకోవడానికి ఉద్దీపన కలిగిస్తాయి. ఆర్ద్రతతో కూడిన గాఢమైన భిన్నత్వాల నడుమ, కల్వకుంట్ల కవిత తన తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌కు రాసిన, వ్యక్తిగతంగా భావించిన లేఖ, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం, విచిత్రమైన రాజకీయ శైలికి నిదర్శనం.

ఈ లేఖను కొందరు రాజకీయ విశ్లేషకులు భావోద్వేగపు సంకేతంగా, మరికొందరు, వ్యూహాత్మక పదవి కోసం లభించని ప్రయత్నంగా అభివర్ణించారు. అది వాస్తవంగా తిరుగుబాటా? లేక అలక్ష్యంగా, అర్థవంతమైన ఒప్పుకోలు సంకేతమా? అనే ప్రశ్న ప్రశ్నగానే మిగిలింది. ఆ లేఖలో కనిపించే స్పష్టతలు, పలుచోట్ల అస్పష్టతలు, ఇవన్నీ కలిపి అది ఒక లోతైన వ్యూహాన్ని సూచిస్తున్నదా అనే అనుమానం కూడా కలుగుతున్నది. భవిష్యత్తులో ‘అధికారంలోకి వచ్చినప్పుడు గద్దెపై ఎవరు కూర్చోవాలి?’ అని కవిత సంధించిన పరోక్ష ప్రశ్న వర్తమాన రాజకీయ సంక్లిష్టతల్లో ఓ భవిష్య దిశ కోసం వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగేమో?

కేసీఆర్ వ్యూహాత్మకంగా పార్టీలోని అంతర్గత వ్యతిరేకతను అణిచే మార్గంలో వెళ్లారా, వెళ్తున్నారా? అన్నది అన్వేషణార్హమైన విషయం. ‘నా నాయకుడు కేసీఆరే, ఇంకెవ్వరూ అంగీకరించను’ అనే కవిత వ్యాఖ్య, దీనికి నిదర్శనం. అధికారాన్ని కోల్పోయినప్పటికీ, బీఆర్‌ఎస్ పార్టీపై కేసీఆర్ ది సడలని పట్టు. మాటల కన్నా మౌనాన్ని, వేదికల కన్నా వ్యూహాలను, భక్తుల కన్నా నిబద్ధతను ప్రాధాన్యంలో ఉంచే విధంగా ఆయన వైఖరి, ఉండటం వల్ల, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది,  ఆయన్ను దగ్గరిగా గమనిస్తున్న పార్టీ నేతలకు కూడా అస్పష్టమే!

భారతదేశ మహిళలు రాజకీయ ప్రస్తానం స్వాతంత్ర్యోద్యమ కాలంలో  విలువల సిద్ధాంతాల ప్రాతిపదికగా ఆరంభమైంది. స్వాతంత్ర్యానంతరం ఎక్కువమందే కుటుంబ వారసత్వం, సామాజిక స్వప్రయోజనాలు, వ్యక్తిగత ఆకాంక్షలు, అధికారలక్ష్యం వంటి నేపధ్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొందరివి అద్భుత విజయాలైతే, మరికొందరివి దారుణమైన పరాజయాలు. మహిళా నాయకత్వం బలమైన, ఘనమైన చరిత్రను నిర్మించుకుంటూ, పునర్నిర్మించుకుంటూ పురుషులతో సమానంగా, ఆ మాటకొస్తే అధికంగా సాగుతున్నది. ఇందిరాగాంధీ నుండి శర్మిళ, కవితల ప్రయత్నాలు కూడా ఆదారిలోనే. ఫలితాలు వేర్వేరు కావచ్చు.

కవితకు తన తండ్రి కేసీఆర్ ద్వారా లభించిన వారసత్వం, నాయకత్వం, రాజకీయంగా ఒక గుర్తింపును ఇచ్చింది. తెలంగాణ జాగృతి వంటి సాంస్కృతికసంస్థల ద్వారా ఆమె నేతగా ఎదగగలిగారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా  అనుభవం, తననీస్థానానికీ తెచ్చిన పార్టీ నాయకత్వంమీదనే తిరుగుబాటు చేసేదాకా తీసుకుని వెళ్లింది. ‘నేను మౌనంగా ఉండను, నా భవిష్యత్ దిశలో స్పష్టత కావాలి’ అనే సంకేతాన్ని ఆమె స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీతో విలీన ప్రతిపాదన ఉన్నట్లు కవిత చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్ కు అనుకూలంగా ధర్నాలు చేయడం వ్యూహమా?

తమ ఎదుగదలకు కారణమైన నాయకత్వాన్ని అర్థం చేసుకోవడంతోపాటు, తార్కికంగా ప్రశ్నించటం, భావోద్వేగంతో సరిపుచ్చుకోకుండా, దృఢంగా భవిష్యత్తుకు బాటలు వేసుకోవడం అలవర్చుకోవాలి. ప్రజాస్వామ్యం రాజకీయాల్లో ఇంటిపేరుకంటే పరిపక్వత, వారసత్వంకంటే లక్ష్య స్పష్టత, వివిధరకాల ప్రభావం కన్నా ప్రజల నమ్మకం, ప్రజలలో స్థానం సంపాదించటం ప్రధానమైనవి. ఆ దారిలోనే, ఉజ్వల భవిష్యత్ వుండే అవకాశాలున్న కవితకు కావలసింది ఆమె స్వంత ధైర్యం, ప్రజలతో తనదైన మానవీయ సంబంధం మాత్రమే. వంశపారంపర్యంగా వచ్చిన హోదా, పదవి, అవకాశం, తలుపులు తెరచినా, పోటీలో నిలబెట్టేది వాస్తవికతే. విమర్శ అవసరం, వ్యూహం అవసరం, నాయకత్వం మీద తిరుగుబాటూ అవసరమే. దేనికైనా ప్రదర్శనాత్మక చిత్తశుద్ధి, ప్రజల పట్ల పరిపూర్ణ బాధ్యత కూడా తప్పనిసరనే నిజం మరువకూడదు.