Saturday, May 22, 2010

VI-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-6): వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-6
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

ఆశయం గొప్పది కావచ్చు. అమలు పరిచేవారు నిష్ణాతులే కావచ్చు- నిబద్ధత, అంకిత భావాలకు సాక్షాత్తు చిరునామా కావచ్చు. కాకపోతే, ప్రజాస్వామ్యంలో "అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు, సంబంధిత సమాచారాన్ని పొందే హక్కు" ప్రతి పౌరుడికి వుంది. దానికి తోడు, ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో 95% ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న 108-అత్యవసర సహాయ సేవలు లభ్యం కావటంలో ఏ మాత్రం అలసత్వం వున్నా కారణాలు తెలుసుకుని, ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ లింగ రాజు (సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో) హఠాత్తుగా బాధ్యతల నుంచి తొలగడం, ఆయన స్థానంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, "లోకోపకార దాతృత్వ” భావంతో పలు సంక్షేమ కార్యక్రమాలకు తన వంతు నిధులను సమకూరుస్తున్న జీ.వీ.కె సంస్థల అధిపతి శ్రీ జీ.వి.కృష్ణారెడ్డి, (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చొరవతో, చైర్మన్ గా రావడంతో, అత్యవసర సహాయ సేవలు అందచేయడంలో ఏ సమస్యలు రావని లబ్దిదారులు భావించారు. బహుశా ప్రభుత్వం కూడా అలానే భావించి వుంటుంది. అయితే, ప్రభుత్వం నాలుగు దశల్లో ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు సమకూర్చిన 732 అంబులెన్సులు-అంతకు ముందే ప్రయివేట్ భాగస్వామిగా ‘రామ లింగరాజు గారి ఇ.ఎం.ఆర్.ఐ’ జతకూర్చిన మరో 70 అంబులెన్సులు కలిపి మొత్తం 802 అంబులెన్సులు పౌరులకు సేవలందించాల్సి వుండగా, వాటిలో కనీసం 100 అంబులెన్సులు, వివిధ కారణాల వల్ల సేవలందించలేని స్థితిలో వుండడంతో అలా ఎందుకు "ఒడిదుడుకులకు లోను కావాల్సి వచ్చిందో" అర్థం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది ప్రభుత్వం. ఆ క్రమంలోనే బహుశా ప్రభుత్వ దృష్టికి మరికొన్ని అంశాలు వచ్చి వుండాలి.

108 అంబులెన్సుల ద్వారా అత్యవసర సహాయ సేవలందిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఇ.ఎం.ఆర్.ఐ) పని తీరుపై ఏప్రియల్ 2010 చివరి వారంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీని (హెల్త్, మెడికల్, కుటుంబ సంక్షేమ శాఖ-జీ.ఓ.ఆర్.టీ నంబర్ 594, తేదీ 28-04-2010) నియమించింది. కమిటీని నియమిస్తూ విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులో, 4-2-2010 న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం లో తీసుకున్న నిర్ణయాలను, 30-03-2010 న ప్రభుత్వ సలహాదారుడి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం లో తీసుకున్న నిర్ణయాలను, 3-4-2010 న కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ ప్రభుత్వానికి సమర్పించిన అభిప్రాయాన్ని ఉటంకించడం జరిగింది. అంటే సుమారు మూడు నెలలుగా ప్రభుత్వంలోని వివిధ స్థాయిలలో 108 అంబులెన్సు అత్యవసర సహాయ సేవల విషయంలో సుదీర్ఘమైన సమీక్షలు జరుగుతున్నాయనుకోవాలి. ఆ సమీక్షల్లో వారికి కావాల్సిన వివరణలు సరైన రీతిలో లభించి వుండలేదని కూడా భావించాలి. వాస్తవానికి, ప్రభుత్వానికి-ఇ.ఎం.ఆర్.ఐ కి మధ్య కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందంలోనే కనీసం మూడు-నాలుగు రకాల సమీక్షలకు అవకాశాలున్నాయి. మూడు-ఆరు నెలలకోమారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన, ప్రతినెలా ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన, జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన సమీక్షలు జరుగుతాయి. క్రమం తప్పకుండా కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సమీక్షలు నిర్వహిస్తుంటారు. ఇ.ఎం.ఆర్.ఐ నెల-నెలా నివేదికలు పంపిస్తుంటుంది. ఇన్ని రకాల సమీక్షలుండగా మళ్లీ మరో కమిటీ అవసరం వచ్చిందంటే పరిస్థితి తీవ్రంగా వుండడమో, లేక, జరగాల్సిన ప్రభుత్వ స్థాయి సమీక్షలు జరగకపోవడమో కారణమయ్యుండాలి.

ప్రభుత్వం నియమించిన కమిటీ తన పని ప్రారంభించింది. వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ చైర్మన్ గా, రవాణా శాఖ సంయుక్త కమీషనర్, ఏ.పి.ఎస్.ఆర్.టీ.సి కి చెందిన సాంకేతిక నిపుణుడు, ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి, ఆరోగ్య-వైద్య-కుటుంబ శాఖ ఉప కార్యదర్శి, ఆరోగ్య శాఖ రవాణాధికారి, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థకు చెందిన మేనేజ్‌మెంట్ నిపుణులొకరు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కళాశాలకు చెందిన మేనేజ్‌మెంట్ నిపుణులొకరు, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ సీనియర్ అధికారి సభ్యులుగా వుంటారీ కమిటీలో. ఎన్.ఆర్.హెచ్.ఎం ప్రోగ్రాం అధికారి కమిటీ కన్వీనర్. కమిటీ పరిశీలనకు-సిఫార్సులకు సంబంధించిన (కింద పేర్కొన్న) అంశాలను కూడా ఉత్తర్వులో పేర్కొన్నారు వైద్య-ఆరోగ్య శాఖ కార్యదర్శి పీ.వీ.రమేశ్.

ప్రభుత్వానికి. ఇ.ఎం.ఆర్.ఐ కి మధ్య 05.05.08 న కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం గడువు ఏడాది తర్వాత ముగిసి, 30.09.09 వరకు పొడిగించినప్పటికీ, తిరిగి ఎం.ఓ.యు కుదుర్చుకోవాల్సిన అవసరం వుంది కనుక, దాన్ని రూపొందించుకునే ముందు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు:

• సంబంధిత అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ అంబులెన్స్ నెల-నెలా నిర్వహణ వ్యయాన్ని నిర్ణయించడం
• సగటున ఒక్కో అంబులెన్స్ ట్రిప్పుకు కేవలం 450-475 రూపాయల మధ్య సరిపోతాయని ఇ.ఎం.ఆర్.ఐ అధ్యయన నివేదికలో పేర్కొన్నప్పటికీ, ముసాయిదా ఎం.ఓ.యు లో ఆ వ్యయాన్ని పెంచి 594 రూపాయలుగా చూపించిన అంశాన్ని పరిశీలించడం
• నిర్వహణ వ్యయంలో 5% వాటాను జీ.వీ.కె ఇ.ఎం.ఆర్.ఐ భరించాల్సిన అంశాన్ని పరిశీలించడం
• 01-04-2009 నుండి 31-12-2009 వరకు తన వంతు 95% వాటాగా కుటుంబ సంక్షేమ శాఖ జీ.వి.కె ఇ.ఎం.ఆర్.ఐ కి విడుదల చేసిన రు. 74, 33, 44, 742/- (సుమారు 74.34 కోట్ల రూపాయలు)లో, రు. 12, 21, 30, 052/-(సుమారు 12.22 కోట్ల రూపాయలు) ప్రభుత్వ అనుమతి లేకుండా సంస్థ వాడుకుందన్న(సూపర్వైజర్ల జీతాలకు, బాంక్ వడ్డీకి, కొనుగోలు-విక్రయదారుల అప్పు కింద వ్యయం చేయడానికి) అంశంపై సమీక్ష
• ఎం.ఓ.యు లో పేర్కొనని అంశాలకు సంబంధించిన వాటిపై ప్రభుత్వ నిధులను జీ.వీ.కె ఇ.ఎం.ఆర్.ఐ వ్యయం చేస్తుందన్న అంశంపై పరిశీలన
• ఎప్పటికప్పుడు ఏదైనా సంబంధిత అంశం పై పరిశీలన జరుపదల్చుకుంటే అలా చేసే అవకాశం

• ఆంధ్ర ప్రదేశ్ లో అమలవుతున్న అత్యవసర రవాణా సేవలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో అమలుకు సంబంధించి వాటి అమలు తీరుతో ఇక్కడి వాటిని పోల్చి చూడడం. ప్రస్తుతం లభిస్తున్న "అత్యవసర రవాణా సేవలకు" ప్రత్యామ్నాయాలే మన్నా వున్నాయేమో పరిశీలించడంతో సహా అన్ని అంశాలను సమీక్షించి, సరైన సూచనలను-సలహాలను రెండు వారాల్లోపు కమిటీ ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులో పేర్కొంది ప్రభుత్వం.

4-2-2010 న ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు జరుపుతున్న 108 అత్యవసర (వైద్య) సహాయ సేవలను పర్యవేక్షించడానికి కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక పర్యవేక్షక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వైద్య, అత్యవసర ఆరోగ్య సేవలకు "ఏ మాత్రం ఆటంకం కలగని విధంగా వ్యయం మదింపు జరగవలసి ఉందని" ప్రభుత్వం అభిప్రాయపడింది. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంతో అమలు జరుపుతున్న ఇ.ఎం.ఆర్‌.ఐ-108 అత్యవసర (వైద్య) సహాయ కార్యక్రమాల అమలులో నిరంతర పర్యవేక్షణ అవసరమని ప్రభుత్వం భావించింది. సామాన్య ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత, అత్యవసర వైద్య సేవలలో పొరపాట్లకు, అక్రమాలకు తావులేకుండా వుండేటందుకే నిరంతర పర్యవేక్షణ అవసరమని ముఖ్యమంత్రి కె. రోశయ్య అభిప్రాయపడ్డారు. అదే సమీక్షా సమావేశంలో 108 వాహనాల వినియోగంలో జరుగుతున్న అదనపు వ్యయాన్ని నియంత్రించవలసి ఉందని కూడా ప్రభుత్వం భావించింది. గతంలో ఒకొక్క వాహనం సగటున రోజుకు 10 ట్రిప్పులు తిరిగేదని, ఇప్పుడు ఆ సంఖ్య 6 కు తగ్గినందున ఆ మేరకు వ్యయం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 108 అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ప్రయివేట్ భాగస్వామిగా జి.వి.కే సంస్థను "ఖరారు చేయడానికి" మరికొంత సమయం పడుతుందని కూడా సంబంధిత శాఖ మంత్రి పితాని సత్యనారాయణ సమీక్షా సమావేశంలో పేర్కొనడం విశేషం.

నిపుణులు, సీనియర్‌ అధికారులతో పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమీక్ష అనంతరం మంత్రి మీడియాకు తెలిపారు. ఇ.ఎం.ఆర్‌.ఐ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడంతో సహా ఇతర సంబంధిత అంశాలను కూడా పర్యవేక్షక కమిటీ పరిశీలించగలదని మంత్రి పాత్రికేయులకు చెప్పారు. మెరుగైన, సుస్తిర అత్యవసర వైద్య సేవల కోసం ప్రయివేటు భాగస్వామ్యాన్ని ఎంపిక చేయడంలో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించిందని కూడా ఆయన అన్నారు. సంబంధిత శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, సలహాదారుడు పి. కె. అగర్వాల్‌, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్‌. వి. సుబ్రహ్మణ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్‌ అనిల్‌ పునీత, ఇ.ఎం.ఆర్‌.ఐ సీ.ఇ.ఓ వెంకట్‌ చెంగవల్లి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

30-3-2010 న ప్రభుత్వ సలహాదారుడి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే 3-4-2010 న కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ ప్రభుత్వానికి తన అభిప్రాయాన్ని తెలియచేసి వుండొచ్చు. పర్యవసానంగా, ముఖ్యమంత్రి రోశయ్య సంబంధిత శాఖ మంత్రి పితాని కలిసి 4-2-2010 న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు, కమీషనర్ నివేదికకు అనుగుణంగా కమిటీ నియామకం జరిగిందని భావించాలి.

కమిటీ నియమించడానికి పూర్వ రంగంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, సంబంధిత శాఖ మంత్రి మీడియాకు వివరించిన వ్యవహార శైలిని క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇ.ఎం.ఆర్.ఐ పని తీరుపై మంత్రిగారో-ప్రభుత్వమో-ముఖ్యమంత్రో కొంత అసంతృప్తిగా వున్నారని విశదమవుతుంది. దానికి కారణాలు అనేకం వుండవచ్చు. సమీక్షా సమావేశానికి హాజరయిన ఇ.ఎం.ఆర్.ఐ అధికారులు ఆ రోజునే ఆ విషయంలో ఒక అవగాహనకు వచ్చి, సంబంధిత అధికారులతో-అనధికారులతో చర్చించి, కమిటీ నియమించే దాకా పరిస్థితిని రాకుండా జాగ్రత్త పడితే బాగుండేదేమో ! మంత్రి మీడియాకు చెప్పిన అంశాలను, కమిటీ భవిష్యత్ లో ప్రభుత్వానికి చేయాల్సిన సూచనలకు సంబంధించి ఉత్తర్వు చివర పేర్కొన్న అంశాన్ని నిశితంగా పరిశీలిస్తే, 108-అత్యవసర వైద్య సహాయ సేవలను పౌరులకు అందించే విషయంలో ప్రభుత్వ ఆలోచనా సరళిలో కొంత మార్పు వస్తున్నట్లు భావించాల్సి వస్తుంది. ఉదాహరణకు మంత్రి పితాని సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ... "108 అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ప్రయివేట్ భాగస్వామిగా జి.వి.కే సంస్థను ఖరారు చేయడానికి మరికొంత సమయం పడుతుంది" అని, "మెరుగైన, సుస్తిర అత్యవసర వైద్య సేవల కోసం ప్రయివేటు భాగస్వామ్యాన్ని ఎంపిక చేయడంలో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది" అని చెప్పడం గమనించాల్సిన విషయం. అదేవిధంగా, కమిటీని నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులో... "ప్రస్తుతం లభిస్తున్న అత్యవసర రవాణా సేవలకు ప్రత్యామ్నాయాలే మన్నా వున్నాయేమో పరిశీలించడంతో సహా అన్ని అంశాలను సమీక్షించి, సరైన సూచనలను-సలహాలను ఇవ్వాల్సింది" గా పేర్కొనడం కూడా భవిష్యత్ పరిణామాలకు సంకేతంగా భావించాల్సి వస్తుంది.

ఆర్థిక శాఖ లేవనెత్తిన పలు అంశాలను దృష్టిలో వుంచుకోవాలని కూడా ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. ఇంతకూ ఆర్థిక శాఖ లేవనెత్తిన ఆ పలు అంశాలను నిశితంగా పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడ్తాయి. లోగడ ఇలా జరగలేదు. ఇప్పుడు జరగడానికి కారణాలు వుండితీరాలి. నూతన అధ్యక్షుడుగా జీ. వి. కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ పేరు ముందర జీ.వి.కె అని చేర్చి, 05.05.08 న కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం స్థానంలో (గడువు ముగిసినందున) "ప్రభుత్వానికి-జీ.వి.కె ఇ.ఎం.ఆర్.ఐ కి మధ్య నూతన ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య అవగాహనా ఒప్పందం” (పి.పి.పి ఒప్పందం అని దానికి పేరు పెట్టారు) ముసాయిదాను తయారు చేసి, పరిశీలన కొరకు ప్రభుత్వానికి సమర్పించింది సంస్థ. గతంలో ప్రభుత్వం-ఇ.ఎం.ఆర్.ఐ మధ్య కుదుర్చుకున్న మొదటి (ఏప్రియల్ 2, 2005) ఎంఓయు విషయంలో గాని, రెండో (సెప్టెంబర్ 22, 2006) ఎంఓయు విషయంలో గాని, మూడో (అక్టోబర్ 5, 2007) ఎంఓయు విషయంలో గాని, నాలుగో (మే 5, 2008) ఎంఓయు విషయంలో గాని ఏ విధమైన "కొర్రీలను" ప్రభుత్వం వేయలేదు. వేసే అవకాశం-అవసరం, అప్పట్లో ఆ విషయాన్ని చూస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ (ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య సంబంధిత) అధికారులు ప్రభుత్వానికి ఇవ్వలేదు. ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య పక్షాలకు చెందిన అధికార ప్రతినిధులు కూర్చొని-చర్చించి ముసాయిదాను ఖాయపరిచే సాంప్రదాయం వుండేది. "విశ్వాసం-నమ్మకం" అనే ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రధాన ప్రాతిపదిక ఆధారంగా ఎంఓయు లన్నీ ఖరారయ్యాయి. మొట్టమొదటి సారిగా "కొర్రీల సాంప్రదాయానికి" అవకాశం ఇచ్చింది (జీ.వి.కె) ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. ఇలా జరగకుండా వుండాల్సింది. ఇంతకూ (జీ.వి.కె) ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం ప్రభుత్వానికి సమర్పించిన ముసాయిదా ఎంఓయు లో వున్న అంశాలేంటి ? వాటి విషయంలో ఆర్థిక శాఖ లేవనెత్తిన అభ్యంతరాలేంటి ? పరిశీలించుదాం.

(జీ.వి.కె) ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం రూపొందించిన ముసాయిదా ఒప్పందం ప్రతిపాదనలో ప్రధానమైంది నెల-నెలా సగటున ఒక్కో అంబులెన్సుకు ప్రభుత్వ పరంగా ఇస్తున్న ప్రత్యక్ష నిర్వహణ వ్యయానికి సంబంధించిన విషయం. 2008-2009 ఆర్థిక సంవత్సరానికి, అప్పట్లో ఇ.ఎం.ఆర్.ఐ, ఒక్కో అంబులెన్సుకు సగటున ప్రతినెలా రు. 1, 18, 420 వ్యయమవుతుందని ప్రతిపాదించగా, దాన్ని పరిశీలించి-అంగీకరించిన ప్రభుత్వం, తన వంతు 95% వాటాగా రు. 1, 12, 499 చొప్పున ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. 502 అంబులెన్సులున్నప్పుడు అంగీకరించిన ఆ మొత్తం (రు. 1, 12, 499), తర్వాత సంఖ్య 652 కు చేరినప్పటికీ, ఆ తర్వాత ఆ సంఖ్య 802కు పెరిగినప్పటికీ, "విశ్వాసంతో-నమ్మకంతో" పునఃపరిశీలించకుండా చెల్లిస్తూ వస్తున్నారు. అది కూడా మొదట్లో మూడు నెలల అడ్వాన్సు ఒకే సారి ఇచ్చే సాంప్రదాయం వుండేది. జీ.వీ.కె యాజమాన్యం బాధ్యతలు స్వీకరించడానికి కొద్ది నెలల ముందు నుంచి నెల-నెలా అడ్వాన్సుల సాంప్రదాయానికి అంగీకరించింది యాజమాన్యం. 108 అత్యవసర సహాయ సేవల ఒడిదుడుకులకు ఇదో ప్రధాన కారణం. ముసాయిదాలో 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి 100% పెంచి, ప్రతి నెలా ఒక్కో అంబులెన్సుకు రు. 1, 18, 420 వంతున ప్రభుత్వం భరించాలని ప్రతిపాదించింది (జీ.వి.కె) ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. అదనంగా మరో రు. 10 కోట్లు "మూల ధన వ్యయం" కొరకు కావాలని కోరింది. సంవత్సరానికి రు. 12 లక్షల కంటే ఎక్కువ (నెలకు లక్ష రూపాయలు !) వేతనం ఇవ్వాల్సిన ఉద్యోగుల జీత భత్యాలను మాత్రమే (జీ.వి.కె) ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం భరిస్తుందని, మిగతా వారికి ప్రభుత్వమే ఇవ్వాలని మరో ప్రతిపాదన ఇచ్చింది. ఆర్థికంగా ప్రభుత్వంపై మరింత భారాన్ని పరోక్షంగా సూచించింది (జీ.వి.కె) ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. అడపాదడపా ఏదన్నా ఊహించని వ్యయం జరిగితే దాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని కోరింది. శిక్షణా కార్యక్రమాలన్నింటికీ అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని మరో ప్రతిపాదన. వీటన్నిటినీ అధిగమించిన ఆర్థిక భార ప్రతిపాదన రాజు గారు చైర్మన్ గా తొలగిన సమయానికి ఇ.ఎం.ఆర్.ఐ ఇరుక్కుపోయిన సుమారు రు. 120 కోట్ల "అప్పుల ఊబి". ఆర్థిక శాఖకు ఇది రుచించలేదు.

(జీ.వి.కె) ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం ప్రతిపాదించిన అంశాలపై ఆర్థిక శాఖ తన అభిప్రాయాలను షరాలను (Remarks) నిక్కచ్చిగా పేర్కొంటూ, "కొర్రీలు" వేసింది. 2008 సంవత్సరంలో ప్రభుత్వం అంగీకరించిన సగటు అంబులెన్సు నిర్వహణ వ్యయాని కంటే అదనంగా రు. 8,833 లు (అంటే రు. 1, 27, 253) ఖర్చయ్యాయని లెక్కలు చూపించింది సంస్థ. మరోవైపు లెక్కల పుస్తకాలలో ఆ వ్యయం సుమారు రు. 90, 000 మాత్రమే వున్నట్లు ఆర్థిక శాఖ దృష్టికొచ్చింది. ఎంఓయు లో అంగీకరించిన దానికంటే ఎందుకంత అదనంగా ఖర్చయ్యిందన్న అంశాన్ని పరిశీలించాలని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. సగటున ప్రతి నెలా అంబులెన్సుకు అయ్యే సరాసరి నిర్వహణ వ్యయం ఎంతుంటుందన్న విషయాన్ని "నిపుణులతో క్షుణ్ణంగా అధ్యయనం చేయించడం గాని" లేదా "టెండర్ విధానం ద్వారా వేలం పోటీ పద్ధతిన సరసమైన ధరను నిర్ణయించడం గాని" జరగాలని ఆర్థిక శాఖ అభిప్రాయం. 05.05.08 న కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందంలోని పలు అంశాలను మార్చవలసిన ఆగత్యాన్ని కూడా ఆర్థిక శాఖ ప్రశ్నించింది. వంద కోట్ల రూపాయలకు పైగా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నందున కుటుంబ సంక్షేమ శాఖలో "అంకిత భావం కలిగిన మానిటరింగ్ యూనిట్" ను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా అభిప్రాయ పడింది. నిధుల సేకరణకు "అడ్వర్టయిజింగ్" విధానం అవలంభించడం మంచిదని మరో సూచన చేసింది. ఇలా అడుగడుగునా ప్రభుత్వానికి (జీ.వి.కె) ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్య నిర్వహణ విషయంలో అనుమానాలొస్తుంటే భవిష్యత్ లో ఏం జరగబోతోందో ఊహించడం కొంచెం కష్టమే మరి !

2 comments:

  1. Dear Sir,

    As a professional working in development sector, my observations about EMRI particularly post Satyam fiasco is that more emphasis placed on the systems rather than improving the processes which ultimately led to the current crisis. Is is correct? for example no where focus was laid on reducing the operational cost and improving the effectiveness where as thrust was on cost cutting. As a senior person, you will know the difference between reduction of cost vs cost cutting. More over lot of thrust was focussed more on governance rather than the management (post YSR era). Kindly comment...

    ReplyDelete
  2. You are absolutely correct. Though cost cutting results in reduction of costs, essentials on the name of cost cutting is not desirable. If you read further I hinted at "unnecessary expenditure" which caused the present financial crisis. Management at different levels failed even in governance and every possible reason I am trying to analyse and put before persons like you who can spare few minutes in "keeping alive" 108 services rather "killing" because of one or two vested interests.
    Please come out of your "anonymity" and discuss for rectifying mistakes.
    Jwala with tanks

    ReplyDelete