Saturday, May 29, 2010

VII-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-7): వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-7
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

గతంలో ప్రభుత్వ పరంగా (దివంగత) ముఖ్యమంత్రి తో సహా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి నుంచి ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారుల వరకు, వారి అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశాలకు, ఫిబ్రవరి 4, 2010 న ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశానికి "ప్రభుత్వానికి ఇ.ఎం.ఆర్.ఐ పనితీరు పట్ల అవగాహనకు సంబంధించి" స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే, అప్పటి-ఇప్పటి సమీక్షా సమావేశాల మధ్య "నమ్మకం-అపనమ్మకం", "విశ్వాసం-వంచన" కు మధ్య ఎంత తేడా వుంటుందో అంత తేడా వున్నదని చెప్పొచ్చునేమో ! ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు ఇంతకంటే "పెను సవాలు" మరోటి లేదు. ఈ పరిస్థితిలో-ఆలోచనా ధోరణిలో మార్పురానంత కాలం అత్యవసర సహాయ సేవల అమలు గతంలో మాదిరి జరిగే అవకాశం లేదు. అటు ప్రభుత్వం, ఇటు ఇ.ఎం.ఆర్.ఐ అధికారులు ఆ దిశగా ప్రభుత్వం నియమించిన కమిటీతో తమ ఆంతరంగాన్ని అరమరికలు లేకుండా ఆవిష్కరించే ప్రయత్నం చేసితీరాలి. ఇరువురు భాగస్వాముల మధ్య "విశ్వాసం"-"నమ్మకం" కలగడం ముఖ్యం గాని కమిటీ సిఫార్సులు ముఖ్యంకానేకావు. అలాంటి (లోగడ వున్న మాదిరిగానే) విశ్వాసం-నమ్మకం ఇరువురు భాగస్వాముల మధ్య పునరుద్ధరించడానికి అవసరమైన తక్షణ చర్యలకు ప్రభుత్వం నియమించిన కమిటీ శ్రీకారం చుట్టడం ప్రధానం. అది జరక్కుండా, కాలయాపనకు దారితీసే "ప్రత్యామ్నాయాలను" ప్రతిపాదించడమే జరిగితే భవిష్యత్ లో 108-అత్యవసర సహాయ సేవలు కొనసాగినప్పటికీ, నాణ్యతా లోపం-పౌరులకు గతంలో మాదిరి సేవలు లభ్యం కాకపోవడం తప్పదేమో !

ఇ.ఎం.ఆర్.ఐ సంస్థతో మూడున్నర సంవత్సరాలు అనుబంధం వున్న వ్యక్తిగా, "ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ" ఆవిర్భావం నుంచి ఆరోహణ వరకు-ఉన్నత శిఖరాలకు చేరుకోవడం దాకా, నా వంతు (ప్రధాన?) భూమిక నిర్వహించిన వ్యక్తిగా, ఇ.ఎం.ఆర్.ఐ సమకూరుస్తున్న 108-అత్యవసర సహాయ సేవల విషయంలో ఆ సంస్థపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఒకప్పుడున్న "నమ్మకానికి-విశ్వాసానికి" సంబంధించిన ఒకటి-రెండు అంశాలను పేర్కొంటానిక్కడ.

రామలింగ రాజు గారి సారధ్యంలో ఆగస్టు నెల 2005 లో 108-అత్యవసర సహాయ సేవలను ఆరంభించిన రోజుల్లోనే (ఆ పాటికే రాష్ట్ర ప్రభుత్వం-ఇ.ఎం.ఆర్.ఐ మధ్య మొదటి అవగాహనా ఒప్పందం కూడా కుదిరింది), ఒక వైపు ఇ.ఎం.ఆర్.ఐ ని "రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సహాయ సేవలందించే" “నోడల్ ఏజన్సీ” గా గుర్తించిన ప్రభుత్వం, మరో వైపునుంచి అదే తరహా సేవలకు, కుటుంబ సంక్షేమ శాఖ నేతృత్వంలో శ్రీకారం చుట్టింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కార్యక్రమం కింద, కేంద్ర ప్రభుత్వ నిధులతో, రాష్ట్రంలోని ఎంపిక చేసిన నాలుగు జిల్లాల్లో-ఐ.టీ.డి.ఏ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా "గ్రామీణ అత్యవసర రవాణా పథకం" పేరుతో 122 అంబులెన్సులను ప్రవేశపెట్టింది. ఇ.ఎం.ఆర్.ఐ అధికారులు ఆ పని తమకు అప్ప చెప్పమని అడిగినా నాటి కుటుంబ శాఖ కమీషనర్, ఐఎఎస్ అధికారి శ్రీ చిట్టా బాల సత్య వెంకట రమణ, అంగీకరించలేదు. అచిర కాలంలోనే ఇ.ఎం.ఆర్.ఐ హైదరాబాద్ తో ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాల్లోను-పట్టణాల్లోను (50 కి పైగా) సొంత ఖర్చుతో 70 అంబులెన్సుల ద్వారా అత్యవసర సహాయ సేవలందించడం, ఆ సేవలకు జాతీయ-అంతర్జాతీయ గుర్తింపు రావడం జరిగింది. ఏ కమీషనరై తే (శ్రీ సీ.బి.ఎస్. వెంకట రమణ) "అనుభవం" లేదన్న కారణాన మొదటి దశ 122 అంబులెన్సులను ఇ.ఎం.ఆర్.ఐ కి అప్పగించడం కుదరదన్నా రో, అదే కమీషనర్, మిగిలిన 18 జిల్లాల్లో ప్రవేశ పెట్టదలిచిన 310 అంబులెన్సుల నిర్వహణ బాధ్యత అదే ఇ.ఎం.ఆర్.ఐ కి "అత్యంత నమ్మకంతో-విశ్వాసంతో" అప్పగించారు. అదో చారిత్రాత్మక నిర్ణయం. వాస్తవానికి అలనాటి కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సీ.బి.ఎస్. వెంకట రమణ గారి "నమ్మకం-విశ్వాసం" తో కూడుకున్న సాహసోపేత నిర్ణయమే ఈ నాటి రాష్ట్ర వ్యాప్త అత్యవసర సహాయ సేవలకు పునాది-నాంది. ఏమైందానాటి "నమ్మకం-విశ్వాసం" ? లోపం ఎవరిది ? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం వుంది.

310 అంబులెన్సుల నిర్వహణ బాధ్యతను ఇ.ఎం.ఆర్.ఐ కి అప్పగించడంలో సీ.బి.ఎస్ వెంకటరమణ గారి చొరవ-వేగం తో సరిసమానంగా ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం కూడా చొరవ తీసుకున్నట్లయితే, కనీసం నెల రోజుల ముందే రెండో ఎంఓయు పై సంతకాలు చేయడం జరిగేది. ఆ నిర్వహణ బాధ్యతను స్వీకరించడానికి ప్రభుత్వం ఇ.ఎం.ఆర్.ఐ విషయంలో ప్రదర్శించిన "విశ్వాసం-నమ్మకం", అంతే మోతాదులో, మొదట్లో ఇ.ఎం.ఆర్.ఐ ప్రదర్శించలేదు. బహుశా చైర్మన్ రాజు గారు ఆ విషయంలో వెంకట్ గారి కంటే వేగంగా స్పందించారని నా అభిప్రాయం. సీ.బి.ఎస్ గారు అంచెలంచెలుగా ఎంఓయు దశకు తీసుకొచ్చిన విధానం ముందు-ముందు వివరంగా తెలుసుకుందాం.

సెప్టెంబర్ 19, 2006 న ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ అప్పటి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ పి. కె. అగర్వాల్ పేరుతో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు (జీ.ఓ.ఆర్.టీ 1242) లో పేర్కొన్న అంశాలు "నమ్మకానికి-విశ్వాసానికి" మొదటి ఉదాహరణ. "మాతా శిశు సంరక్షణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలను, పసి పిల్లలను, అవసరమైనప్పుడు అత్యవసర వైద్య సహాయం కొరకు, సమీప ఆసుపత్రికి చేర్చేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా యూరోపియన్ కమీషన్ సహకారంతో, గ్రామీణ అత్యవసర ఆరోగ్య రవాణా సేవలను ఆరంభించింది. అదే పధకాన్ని మిగిలిన అన్ని జిల్లాలకు పొడిగించాలని కుటుంబ శాఖ కమీషనర్ ప్రతిపాదన పంపారు. అందువల్ల మరో 310 అంబులెన్సుల ద్వారా మిగిలిన 19 జిల్లాల్లో అత్యవసర ఆరోగ్య రవాణా సేవలను అందించేందుకు అలాంటి సేవలందించడంలో ’గుర్తింపు తెచ్చుకున్న’ ఇ.ఎం.ఆర్.ఐ సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించాలని కమీషనర్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించి, కమీషనర్ ను తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అనుమతించింది" అని ఆ ఉత్తర్వులో పేర్కొంది ప్రభుత్వం. ఆ తర్వాత రెండు రోజులకు (22-09-2006 న) అప్పటి ఆర్థిక-ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రోశయ్య గారి సమక్షంలో అవగాహనా ఒప్పందం (ఎంఓయు) పై కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వెంకట రమణ, ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్ సంతకాలు చేశారు. పూర్తిగా తన స్వయం పర్యవేక్షణ కింద (నా సమక్షంలో) తానే తయారుచేసిన అవగాహనా ఒప్పందం "అవతారిక"లో ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ గురించి రాసిన వాక్యాలు ఆ సంస్థమీద ప్రభుత్వానికి అప్పట్లో వున్న"నమ్మకానికి-విశ్వాసానికి" అసలు-సిసలైన మచ్చుతునకలు. "ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, అంబులెన్స్ సేవలతో సహా అన్నిరకాల నాణ్యతా పరమైన అత్యవసర సహాయ సేవలందించడంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయంగా ఆ రంగంలో ప్రఖ్యాతి చెందిన ఏజెన్సీల తోడ్పాటుతో, సత్యం కంప్యూటర్ సంస్థ సాంకేతికపరమైన భాగస్వామ్యంతో ఆ సేవలను అమలుపరుస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థను రాష్ట్ర స్థాయి నోడల్ ఏజన్సీగా ప్రభుత్వం నియమిస్తున్నది" అని రాయడం-అదీ సంస్థ సేవలను అందించడం మొదలైన ఏడాది లోపునే అలా సంస్థను ప్రశంసించడం మామూలు విషయం కాదు. ఎంఓయు పూర్వ రంగంలో అలనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ జంధ్యాల హరినారాయణ, అగర్వాల్ కు ముందున్న ఆరోగ్య వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ఐ.వి.సుబ్బారావు, ఉప కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యర్, ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కావడానికి-అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేయడానికి చేసిన కృషి-తీసుకున్న చొరవ కూడా "నమ్మకానికి- విశ్వాసానికి" ఉదాహరణలు. అదే అగర్వాల్ గారి "నమ్మకాన్ని-విశ్వాసాన్ని" నాలుగేళ్ల తర్వాత ఇ.ఎం.ఆర్.ఐ కోల్పోవడానికి బలవత్తరమైన కారణాలుండి తీరాలి. అవి విశ్లేషించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వానికి-ఇటు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ అధికారులకు వుంది.

ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న 108-అత్యవసర సహాయ సేవల పటిష్ఠ అమలుకు ప్రభుత్వం ప్రదర్శించిన "విశ్వాసానికి- నమ్మకానికి" మరో మచ్చుతునక, జులై 12, 2007 న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె. హరినారాయణ, నాటి ఆరోగ్య-వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి పరిశీలనార్థం పంపిన వివరణ. ఆ వివరణ పూర్వ రంగంలో ఇ.ఎం.ఆర్.ఐ-ప్రభుత్వం మధ్య కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం మేరకు, అప్పటికి సరిగ్గా నాలుగు నెలల క్రితం (8-2-2007 న) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన "ఇ.ఎం.ఆర్.ఐ సలహా సంఘం సమావేశం" జరిగింది. ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సహా పలువురు ఉన్నతాధికారులు ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆద్యతన భవిష్యత్ లో, ప్రభుత్వ పరంగా, ఇ.ఎం.ఆర్.ఐ కి 108-అత్యవసర సహాయ సేవల నిర్వహణ నిధులను దశలవారీగా పెంచడానికి నాంది జరిగిన చారిత్రాత్మక సలహా సంఘం సమావేశమది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన నియమించిన "ఉప సంఘానికి", అత్యవసర సహాయ సేవల నిర్వహణకు అవుతున్న వ్యయానికి సంబంధించిన వివరాలను, ఉపసంఘం సమీక్షించి తగు విధమైన సిఫార్సులను ప్రభుత్వానికి చేసి, అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేసేందుకు ఒక సమగ్రమైన వివరణాత్మక నివేదికను ఇ.ఎం.ఆర్.ఐ రూపొందించింది. కమిటీకి సమర్పించిన నివేదికను అధ్యయనం చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన వివరణలో పేర్కొన్న అంశాలు:

• ఎంఓయు ప్రకారం అత్యవసర సహాయ సేవల నిర్వహణ కయ్యే వ్యయంలో ప్రభుత్వం భరిస్తానన్న అంశాలు:

• అంబులెన్సులలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాలు
• అంబులెన్సుల నిర్వహణ-మరమ్మతుల వ్యయం
• టెలిఫోన్, అద్దె, విద్యుత్ ఖర్చులు
• షెడ్యూల్డ్ కులాల, తెగల, దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాల, గర్భిణీ స్త్రీల, ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లల రవాణా కొరకయ్యే ఇంధన వ్యయం
• శిక్షణా కార్యక్రమాల వ్యయం
• పైన పేర్కొన్న అంశాలకు సంబంధించిన వ్యయం, అవగాహనా ఒప్పందం ఆధారంగా, ఒక్కో అంబులెన్సుకు రు. 68, 700 అవుతుంది. అంటే, రోజుకు సగటున రు. 2123-లేదా సగటున ట్రిప్పుకు రు. 400 అవుతుంది.
• తొలుత 310 అంబులెన్సుల, ఆ తర్వాత మరో 122 అంబులెన్సుల (మొత్తం 432) నిర్వహణకు, ఒప్పందానికి అనుగుణంగా వ్యయాన్ని భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మొత్తం సుమారు రు. 33 కోట్లుంటుంది. వీటి ద్వారా మొత్తం రాష్ట్రమంతా సహాయ సేవలను అందించవచ్చు
• ప్రతి అంబులెన్సులో ఆరుగురు (ఇ.ఎం.టి, పైలట్లు కలిసి) ఉద్యోగులతో సహా, ప్రతి పది అంబులెన్సులకు ఒక సూపర్వైజర్ వుంటారు
• అంబులెన్సుల నిర్వహణ-మరమ్మతులంటే, ప్రతి అంబులెన్స్ 40, 000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత టైర్ల మార్పిడి కయ్యే ఖర్చు
• ప్రతి అంబులెన్సుకు రోజుకు 25-30 టెలిఫోన్ కాల్స్
• ప్రతి 7 కిలో మీటర్లకు లీటర్ డీజిల్ చొప్పున సగటున రోజుకు 300 కిలోమీటర్ల వరకు
• వాస్తవ అంచనాల ఆధారంగా, సుమారు 70% లబ్దిదారులు షెడ్యూల్డ్ కులాల, తెగల, దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాల, గర్భిణీ స్త్రీల, ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లలకు చెందినవారు. వారి రవాణా కొరకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలి.
• ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ సొంతంగా కొనుగోలు చేసి నిర్వహణ వ్యయం భరిస్తున్న 70 అంబులెన్సులకు కూడా ప్రభుత్వ సహాయం అందించడం పరిశీలించాలి.
• జాతీయ ఆరోగ్య మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను పరిగణలోకి తీసుకుని, రాష్ట్రం సమకూర్చాల్సిన నిధుల విషయంలో నిర్ణయం తీసుకోవాలి.

ఇంత కూలంకషంగా, ఒక పథకం విషయంలో, ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ పై "ఎంతో విశ్వాసం-నమ్మకం" వుండబట్టే అలా వ్యవహరించడం జరిగిందని భావించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకున్న నిర్ణయంతో 2007-2008 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి (నిర్ణయం తీసుకుంది జులై నెలలో అయినప్పటికీ అమలు ఏప్రియల్ నుంచే జరిగింది) అప్పటి కయ్యే ఖర్చులో 60% పైగా నిర్వహణ వ్యయం ప్రభుత్వ పరంగా లభించింది. పైగా రాజుగారిచ్చిన 70 అంబులెన్సులకు కూడా నిర్వహణ వ్యయం ప్రభుత్వమే భరించ సాగింది. వాస్తవానికి ఒక్కో అంబులెన్సుకు ప్రభుత్వం సమకూర్చిన రు. 68, 700 పైన ఇ.ఎం.ఆర్.ఐ కి అదనంగా ఎంత ఖర్చయిందో అనే విషయం "ఇదమిద్ధంగా ఇంత" అని ప్రభుత్వానికి సంస్థ విశ్లేషణాత్మకంగా ఎప్పుడో ఒకప్పుడు వివరణ ఇచ్చి వుంటే బాగుండేదేమో. నాకు తెలిసినంతవరకు ఏ నాడూ అలా చేసి వుండలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఉత్తర్వులు వచ్చిన కొద్ది రోజుల్లోనే, అత్యవసర సహాయ సేవల అంశం క్రమేపీ ముఖ్యమంత్రి దృష్టికి మరింత చేరువగా పోవడంతో, అక్కడినుంచి నిర్ణయాలు ఆయన కనుసన్నల్లో జరగడం మొదలయింది. అలా జరగడం లాభానికి దారి తీసిందా-నష్ఠానికి దారి తీసిందా అంటే చెప్పటం కష్ఠమవుతుంది. జవాబు ఏదైనా, అత్యంత ఆదరణ పొందిన సేవలుగా ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా, ఇతర రాష్ట్రాలకు కూడా పాకడానికి మాత్రం కారకుడు (దివంగత) ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" గాని, ఆ తర్వాత (దివంగత) ముఖ్యమంత్రి "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" గాని ఎంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ నిలబెట్టుకో గలిగిందనేది జవాబు దొరకని ప్రశ్న.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక్కో అంబులెన్సుకు నెలకు రు. 68, 700 నిర్వహణ వ్యయం కింద ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్న పక్షం రోజులకు, రామలింగ రాజు గారి అధ్యక్షతన పనిచేస్తున్న మరో సంస్థ హెచ్.ఎం.ఆర్.ఐ కి సంబంధించిన అంశాలను చర్చించేందుకు ముఖ్యమంత్రి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో సరిగ్గా ఏం జరిగిందో ఏమో గాని, హెచ్.ఎం.ఆర్.ఐ సంస్థతో పాటు, ఇ.ఎం.ఆర్.ఐ కి కూడా నిర్వహణ వ్యయంలో 95% వ్యయాన్ని ప్రభుత్వం భరించడానికి అంగీకరించిందన్న అభిప్రాయానికి సీ.ఇ.ఓ వెంకట్ వచ్చారు. అదే విషయాన్ని ధృవీకరించుకునేందుకు, నేను తోడు రాగా వెంకట్ గారు, ఆగస్ట్ 13, 2007 న ప్రధాన కార్యదర్శిని కలిసేందుకు వెళ్లాం. నెల రోజుల క్రితం ఎంతో "విశ్వాసంతో-నమ్మకంతో" ప్రభుత్వ పరంగా భరించాల్సిన నిర్వహణ వ్యయం విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్న ప్రధాన కార్యదర్శి హరినారాయణ, కొంత అసహనానికి గురయ్యారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం హెచ్.ఎం.ఆర్.ఐ సంస్థ విషయంలోనే గాని ఇ.ఎం.ఆర్.ఐ విషయంలో కాదని స్పష్టం చేశారు. నిర్వహణ వ్యయానికి సంబంధించి అధ్యయనం చేసి, స్వయంగా ఆయన తీసుకున్న నిర్ణయానికి ఇ.ఎం.ఆర్.ఐ కట్టుబడకుండా, అంత తక్కువ వ్యవధిలో, పెంచమని కోరకుండా వుండాల్సింది వెంకట్. అయితే ఆర్థిక పరంగా అప్పటికే ఇ.ఎం.ఆర్.ఐ ఇబ్బందుల్లో వున్నదన్న సంగతి ఆయన ఎవరికి చెప్పుకోగలరు? యాజమాన్య పరంగా రాజు గారు ఇవ్వాల్సిన నిధులను సమకూర్చడం జరగడం లేదన్న విషయం వెంకట్ ఎలా బయట పెట్టగలరు? ఏదేమైనా, ఎంత అసహనానికి గురైనా, ఇ.ఎం.ఆర్.ఐ అందిస్తున్న అత్యవసర సహాయ సేవల విషయంలో అదే "విశ్వాసంతో-నమ్మకంతో", విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి అంగీకరించారాయన.

ఇ.ఎం.ఆర్.ఐ అంతర్గత ఆర్థిక పరమైన విషయాల వ్యవహారం అప్పట్లో నాకంతగా తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. బాంక్ దగ్గర అప్పు చేసిన సంగతి కూడా తెలియదు. సంస్థ వ్యవహారమంతా క్షుణ్ణంగా తెలిసిన వెంకట్ ఎటువంటి ఇబ్బందులకు అత్యవసర సహాయ సేవలు లోను కాకుండా వుండేందుకు ఆది నుంచీ చేసిన "విశ్వ ప్రయత్నాలలో భాగంగా" నే ఆ నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని 95% నిర్వహణ వ్యయం గురించి పట్టుబట్టి వుండాలి. ఆ నాటి సమావేశంలో వెంకట్ గారు ప్రదర్శించిన ఓర్పు-నేర్పు, చివరకు హరినారాయణ గారిని ఆ విషయం మర్నాడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి పరోక్షంగా ఒప్పించిన విధానం ఆయన సామర్థ్యానికి చక్కటి నిదర్శనం. ఆ నాటి సంఘటన నాకింకా జ్ఞాపకం వుంది.

No comments:

Post a Comment