Wednesday, April 28, 2010

“ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంస్థ” తొలి అధ్యక్షుడు శ్రీరంగం శ్రీనివాసరావు : వనం జ్వాలా నరసింహారావు

ఏప్రియల్ 30నుండి మే నెల1, 2010 వరకు జరుపుకుంటున్న
నూరేళ్ల శ్రీశ్రీ విరసం మహాసభల సందర్భంగా

భారత పౌర హక్కుల ఉద్యమానికి శ్రీకారం చుట్టిన అలనాటి
“ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంస్థ”
తొలి అధ్యక్షుడు శ్రీరంగం శ్రీనివాసరావు
వనం జ్వాలా నరసింహారావు

తెలుగు కవిత్వాన్ని స్వయంగా నడిపించిన ఒక శతాబ్దపు యుగ కవిగాను, మహాకవి గాను, తెలుగు సాహితీ-సాంస్కృతిక రంగాలపై అనూహ్యమైన ప్రభావం చూపిన అరుదైన వ్యక్తి గాను, అరసం-విరసం అధ్యక్షుడి గాను, అహర్నిశలు కమ్యూనిస్టుల పక్షాన నిలబడ్ట సామ్యవాదిగాను, "తెలుగు కవిత్వాన్ని ఖండించి-దీవించి-ఊగించి-శాసించి-రక్షించి” న మహా ప్రస్థానం సృష్టికర్త గాను, అలవోకగా అనువదించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ఏకైక రచయిత గాను, కవిత్వం ద్వారా మరో ప్రపంచాన్ని వీక్షించిన మహా మనీషిగాను, అంచనాలకు అందని వ్యక్తి గాను అందరికీ సుపరిచితుడైన మహాకవి శ్రీ శ్రీ అనబడే శ్రీరంగం శ్రీనివాసరావు భారత పౌర హక్కుల ఉద్యమానికి శ్రీకారం చుట్టిన అలనాటి "ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంస్థ (ఆంధ్ర ప్రదేశ్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్-ఏ.పీ.సి.ఎల్.ఏ) తొలి అధ్యక్షులనే సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. నా వరకు నాకు మాత్రం ఆ విషయాలను వివరంగా తెలియచేసిన వ్యక్తి, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు-రాజ్యసభ మాజీ సభ్యుడు-పేరొందిన ప్రజా వైద్యుడు-భారతదేశంలోనే పౌరహక్కుల ఉద్యమానికి నాంది పలికిన మేధావి డాక్టర్ వై. రాధాకృష్ణమూర్తి.

సోవియట్ యూనియన్, చైనా కమ్యూనిస్ట్ పార్టీల నడుమ తలెత్తిన సైద్ధాంతిక విభేదాల దరిమిలా, కారణాలేమైనప్పటికీ, భారత-చైనా దేశాల మధ్య 1962లోయుద్ధం జరిగింది. యుద్ధం నేపధ్యంలో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ అనుకూల వాదులుగా భావించబడిన పలువురిని దేశవ్యాప్తంగా పీడీ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అరెస్టయిన వారిలో పోలిట్ బ్యూరో సభ్యుల స్థాయినుండి, జిల్లా స్థాయి ముఖ్యనాయకుల వరకూ వున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆ పరిణామాల ప్రభావం ఖమ్మం జిల్లా మీద కూడా పడ్డాయి. తెలంగాణ సాయుధ పోరాట కాలంనుండే, కమ్యూనిస్టుల కంచుకోటగా, ఖమ్మం జిల్లాకు పేరుండడంతో, ఆ జిల్లాకు చెందిన ముఖ్యమైన నాయకులందరినీ నిర్బంధించింది ప్రభుత్వం. ఇదిలా వుండగా, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో తీవ్ర స్థాయిలో సైద్ధాంతిక చర్చ సాగుతున్న నేపధ్యంలో, అంతకు ఒక ఏడాది క్రితం నుంచి, ఖమ్మం పట్టణంలోని స్థానిక డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి (డాక్టర్ వై.ఆర్.కె) ఇంట్లో ప్రతి ఆదివారం సాయంత్రం పలువురు పార్టీ సభ్యులు-సానుభూతిపరులు "మార్క్సిస్ట్ ఫోరం" అనే వేదిక కింద సమావేశమై సిద్ధాంత పరమైన అనేక విషయాలపై చర్చించుకుంటుండేవారు. ఎవరు-ఎందుకు పెట్టారోగాని, అలా ఖమ్మంలో మార్క్సిస్ట్ ఫోరం ప్రతి ఆదివారం నిర్వహిస్తుండె సమావేశాలకు హాజరయ్యేవారిని "ఆదివారం సంఘం" అని ఎద్దేవాగా పిలవడం జరిగింది.

పార్టీపట్ల, సిద్ధాంతాలపట్ల సంపూర్ణ విశ్వాసమున్న డాక్టర్ వై.ఆర్.కె, తన వంతు కృషిగా, కమ్యూనిస్ట్ నాయకుల విడుదలకు-పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు చేయసాగారు. స్థానిక ఖమ్మం న్యాయవాదులైన బోడేపూడి రాధ, కె.వి.సుబ్బారావుల మద్దతు కోరారు. ఆ ముగ్గురి (మేధావి త్రయం అన్న పేరొచ్చింది వారికి)కలయిక భవిష్యత్ భారత పౌర హక్కుల ఉద్యమానికి నాంది కాబోతున్నట్లు ఆనాడు వారితో సహా ఎవరూ ఊహించలేదు. కలిసి ఉద్యమించడానికి అంగీకరించిన "మేధావి త్రయం", సాధ్యమైనంత త్వరలో విజయవాడలో ఒక సదస్సు నిర్వహించాలని, ఆ సదస్సులో పౌరహక్కుల సంస్థ స్థాపన ప్రక్రియను ప్రారంభించాలని, అదే రోజున బహిరంగ సభ జరిపి ప్రకటన చేయాలని నిర్ణయం తీసుకుంది. వారు జరుపదల్చుకున్న సదస్సుకు-బహిరంగసభకు ఆహ్వానించాలనుకున్న వారిలో ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు శ్రీపాద అమృత డాంగే (సీ.పీ.ఐ), ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ (సీ.పి.ఐ.ఎం) లు ముఖ్యులు. అతివాదుల్లో మితవాదులని భావించిన నంబూద్రిపాద్ ను, జ్యోతిబసును అప్పటికింకా నిర్బంధంలోకి తీసుకోలేదు ప్రభుత్వం. డాంగే, నంబూద్రిపాద్ లతో పాటు ఇంకెవరెవరిని పిలవాలన్న ఆలోచన చేసిన మేధావి త్రయం "శ్రీ శ్రీ” ని ఆహ్వానించాలని నిర్ణయించింది. జాతీయ స్థాయిలో పేరొందిన పౌరహక్కుల ఉద్యమ వాది జస్టిస్. ఎన్.సీ. ఛటర్జీని, ఉభయ కమ్యూనిస్టులకు సమాన దూరంలో వుంటున్న మాజీ పార్లమెంట్ సభ్యుడు కడియాల గోపాల రావును కూడా ఆహ్వానించాలని నిర్ణయం జరిగింది.

ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా విజయవాడ న్యాయవాది కే.వి.ఎస్.ఎన్ ప్రసాదరావు సారధ్యంలో, మేధావి త్రయం మార్గదర్శకత్వంలో, ఖమ్మం "ఆదివారం సంఘం" ఆశించిన రీతిలో పౌర హక్కుల ఉద్యమానికి విజయవాడ లోని "రైస్ మిల్లర్స్ సంఘం" భవనం వేదికగా శ్రీకారం చుట్టడానికి రంగం సిద్ధమయింది. అనుకున్నట్లు గానే నాలుగైదు వందల మంది డెలిగేట్స్ తో సదస్సు మొదలయింది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు చెందిన వారే కాకుండా పలువురు సానుభూతి పరులు హాజరయ్యారు సదస్సుకు. ఇక సదస్సులో నిర్ణయం తీసుకుని సాయంత్రం బహిరంగ సభలో వెల్లడి చేయడమొక్కటే మిగిలింది. ఇంతలో అక్కడ చోటుచేసుకున్న ఒక చిన్న సంఘటన చిలికి-చిలికి గాలివానయ్యి, సీపీఐ కి చెందిన కార్యకర్తలంతా సదస్సును బహిష్కరించి వెళ్లిపోయారు. అప్పటికే విజయవాడ చేరుకున్న తమ నాయకుడు డాంగేని కలిసి బహిరంగసభకు హాజరు కావద్దని విజ్ఞప్తిచేశారు వారంతా. చివరకు సాయంత్రం జరిగిన బ్రహ్మాండమైన బహిరంగసభకు సీపీఐ కి చెందిన వారెవరూ హాజరవ్వలేదు. సదస్సులో "ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంస్థ" ను నెలకొల్పాలని, ఉద్యమాన్ని ప్రతి జిల్లాకు తీసుకుపోవాలని తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగసభలో ప్రకటించారు.

ఏ.పీ.సీ.ఎల్.సి అధ్యక్షుడిగా శ్రీ శ్రీ ని, కార్యదర్శిగా కడియాల గోపాలరావును, ఉపాధ్యక్షులుగా న్యాయవాదులు కే.వి.సుబ్బారావు-కే.వి.ఎస్.ఎన్. ప్రసాదరావులను, సభ్యులుగా న్యాయవాది కర్నాటి రామ్మోహన్ రావు, డాక్టర్ వై.అర్.కే లతో సహా మరి కొంత మందిని ఎన్నుకున్నారు డెలిగేట్లు. సదస్సు తీసుకున్న నిర్ణయాలను, కార్యాచరణ పథకాన్ని బహిరంగ సభలో ప్రకటించారు. నలభై వేల మందికి పైగా హాజరయిన బహిరంగ సభ వేదిక మీదున్న ప్రముఖుల్లో ఎన్.సీ.ఛటర్జీ, ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్, శ్రీ శ్రీ, కడియాల గోపాలరావులు ముఖ్యులు. ఆ విధంగా మొట్టమొదటి పౌర హక్కుల ఉద్యమానికి అధ్యక్షుడిగా శ్రీ శ్రీ వ్యవహరించసాగారు కొన్నాళ్లపాటు. కేవలం నామమాత్రంగా వ్యవహరించడమే కాకుండా జిల్లాలలో జరిగిన బహిరంగసభలకు తప్పకుండా హాజరయ్యేవారు శ్రీ శ్రీ.

పౌరహక్కుల ఉద్యమాన్ని బలీయంగా ముందుకు తీసుకెళ్లాలంటే, ఉద్యమ లక్ష్యాలను సాధించాలంటే, జిల్లా స్థాయి సదస్సులు-బహిరంగసభలు నిర్వహించాలని ఏ.పి.సీ.ఎల్.ఏ నిర్ణయించింది. తదనుగుణంగానే, కర్నూల్, అనంతపూర్, నల్గొండ జిల్లా సూర్యాపేటలలో సభలు జరిగాయి. మూడు చోట్లా ప్రధాన ఆకర్షణ సభలకు హాజరై చక్కటి ఉపన్యాసం చేసిన శ్రీశ్రీ నే. నవంబర్ 1965 మూడవ వారంలో నిర్వహించిన సూర్యాపేట సదస్సు అన్నింటిలోకి బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకునేవారు. సరిగ్గా అది జరిగిన వారం రోజులకు మేధావి త్రయాన్ని, వారితో పాటు కర్నాటి రామ్మోహన్ రావును, రాష్ర్ట్రవ్యాప్తంగా ద్వితీయ శ్రేణి కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ నాయకత్వాన్నిముందస్తునిర్భంద చట్టం కింద అరెస్టు చేసింది ప్రభుత్వం. వీరంతా అరెస్టయినప్పటికీ, ఆ తర్వాత పది రోజులకు అనుకున్న ప్రకారం న్యాయవాది ఏడునూతుల పురుషోత్తమ ఆవు ఆధ్వర్యంలో, నిర్వహించిన ఖమ్మం సదస్సుకు, నంబూద్రిపాద్, కడియాల గోపాల రావులు హాజరయ్యారు. శ్రీ శ్రీ రాలేదు. ఏ.పీ.సీ.ఎల్.ఏ ఆధ్వర్యంలో ఆ దశ పౌరహక్కుల ఉద్యమంలో నిర్వహించిన చివరి సదస్సు అదే.

ఖమ్మంలో అరెస్టయిన డాక్టర్ వై.ఆర్.కె ప్రభృతులను నిర్భంధించిన హైదరాబాద్ ముషీరాబాద్ జైల్‌లోనే వున్న మాకినేని బసవ పున్నయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లా రెడ్డి లాంటి ప్రముఖ నాయకులను కలిసే అవకాశం కలిగిందని డాక్టర్ రాధాకృష్ణమూర్తి అన్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా వున్న కాసు బ్రహ్మానందరెడ్డిని పెరోల్ పై విడుదలైన సుందరయ్యగారు కలుసుకున్నప్పుడు, "మీ అందరికంటే పౌర హక్కుల ఉద్యమం చేపట్టిన మేధావి త్రయం లాంటివారు ఎక్కువ ప్రమాదకరమైన వ్యక్తులు" అని వ్యాఖ్యానించారట. అంటే ఆనాటి శ్రీ శ్రీ అధ్యక్షతన చేపట్టిన పౌరహక్కుల ఉద్యమం ప్రభుత్వంపై అంత తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిందనాలి.

ఆ తర్వాత కాలంలో పౌరహక్కుల పరిరక్షణ ఉద్యమాన్ని జైలునుంచే నడపాలని భావించారు. "హెబియస్ కార్పస్ పిటీషన్" అనే ఆయుధాన్ని ఉపయోగించారు. కొందరు హైకోర్టును, మరికొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వై.ఆర్.కే, బోడేపూడి రాధలు సుప్రీం కోర్టులో పిటీషన్ వేసినందున వారిని భద్రతా కారణాల దృష్ట్యా నాటి ప్రభుత్వం విమానంలో ఢిల్లీకి తీసుకుపోయి తిహారీ జైల్లో వుంచింది విచారణ జరిగినంత కాలం. అప్పటికే తిహారీ జైలుకు హెబియస్ కార్పస్ విచారణకు తీసుకొచ్చిన వారిలో హరికిషన్ సింగ్ సూర్జిత్, ఏ.కె. గోపాలన్, బీ.టీ.రణదివే, మాకినేని బసవ పున్నయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, నాగభూషణం పట్నాయక్, హరే కృష్ణ కోనార్ లాంటి ప్రముఖ మార్క్సిస్ట్ నాయకులున్నారు. వారంతా, ఒక ప్రణాళిక ప్రకారం అనధికారికంగా పోలిట్ బ్యూరో సమావేశం జరుపుకునేందుకు తీహారీ జైలును వేదికగా ఉపయోగించుకున్నారు.

పిటీషన్ విచారణలో వుండగానే, పౌర హక్కుల ఉద్యమ ప్రభావం వల్లనో-దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయం నిర్భందాలకు వ్యతిరేకంగా వెల్లడవుతున్నందువల్లనో, కేంద్ర ప్రభుత్వం ఏప్రియల్ 29, 1965న, పీడీ చట్టం కింద అరెస్టయిన వారందరినీ విడుదల చేయాలని నిర్ణయం తీసుకొని, సుప్రీం కోర్టుకు ఆ విషయాన్ని తెలియచేసింది. ఆ విధంగా అంతా విడుదలయ్యారు. బహుశా ఆ విధంగా ఆలోచిస్తే, శ్రీ శ్రీ అధ్యక్షతన చేపట్టిన పౌరహక్కుల ఉద్యమం తన ప్రభావాన్ని చూపిందని అనాలి.

తర్వాత కాలంలో చాలా రోజులకు, బలమైన పౌరహక్కుల ఉద్యమాన్నొకటి నిర్మించాలన్న ఆలోచనొచ్చింది పుచ్చలపల్లి సుందరయ్య గారికి 1982లో. అదేదో కేవలం సీ.పి.ఎం నాయకత్వాన వుండేది కాకూడదని, ఐక్యరాజ్యసమితి మార్గదర్శకాలకు అనుగుణంగా, పార్టీ రహిత మేధావుల ఆధ్వర్యంలో వుండాలని భావించారాయన. నవంబర్ 1982లో రఘునాథ రెడ్డి అధ్యక్షుడిగా, డాక్టర్ వై.ఆర్.కే ప్రధాన కార్యదర్శిగా, సురవరం సుధాకర రెడ్డి-విఠల్ కార్యదర్శులుగా, అన్ని పార్టీలకు చెందిన కొందరు ప్రముఖులు కార్యవర్గ సభ్యులుగా పౌరహక్కుల సంస్థ ఆవిర్భావం జరిగింది. కారణాలే వైనా, 1989లో ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభ తర్వాత రఘునాథ రెడ్డి గవర్నర్ కావడంతో సంస్థ కార్యకలాపాలు ఆగిపోయాయి. అయితే ఉద్యమం ఆగిపోలేదు. కొనసాగుతూనే వుంది ఏదో ఒక రూపేణా.

కాలక్రమేణా ప్రభుత్వాల ఆలోచనా విధానంలోను మార్పు కనిపించ సాగింది. చట్ట పరంగా మానవ హక్కుల సంస్థలను ప్రభుత్వాలే ఏర్పాటు చేయడం మొదలయింది. జాతీయ మానవ హక్కుల కమీషన్, రాష్ర్ట స్థాయి హక్కుల కమీషన్లు ఏర్పాటయ్యాయి. పౌర హక్కుల ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం తన వంతుగా మానవ హక్కుల పరిరక్షణకు పూనుకుంది. ఇదంతా జరగడానికి కారణం అలనాటి శ్రీ శ్రీ సారధ్యంలో ఆవిర్భవించిన పౌర హక్కుల సంస్థే అనడం అతిశయోక్తి కాదేమో !

Monday, April 26, 2010

II-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-2) : వనం జ్వాలానరసింహారావు

అంతర్మధనం-2
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలానరసింహారావు

మే నెల 25, 2009న రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చూడడానికి ఒక పాత్రికేయుడిగా రాజ్ భవన్ కు వెళ్ళాను. వెంకట్ గారు వస్తే బాగుంటుందని నేను అనడంతో ఆయన కూడా వచ్చారు. ప్రమాణ స్వీకారం అయింతర్వాత ఇద్దరం కలిసి తెలిసిన ఒకరిద్దరిని కలుసుకుంటున్నప్పుడు సుబ్రహ్మణ్యం గారి దగ్గరనుంచి మర్నాడు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం గురించి ఫోన్ వచ్చింది వెంకట్ గారికి. మర్నాడు ఉదయం (మే నెల 26, 2009) పదకొండు గంటలకు సమావేశం జరిగింది. ఆరోగ్య-వైద్య శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శి జె.సత్యనారాయణ గారు, కమీషనర్ అనిల్ పునీఠ గారు, 108-104 సేవల ప్రభుత్వ సలహాదారు పీ.కె.అగర్వాల్, (ఆర్థిక శాఖ) సీనియర్ మంత్రి శ్రీ రోశయ్య, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఆ సమావేశంలో వున్నారు. సమావేశానికి ముందర ముఖ్య కార్యదర్శి సత్యనారాయణ గారి దగ్గర అందరం కలిసాం. ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గురించిన వివరాలను సత్యనారాయణ గారు మాతో చర్చించారు. ఆయనకు ఏం చెప్పాల్నో-ఏ విధమైన సహాయం ప్రభుత్వం నుంచి అవసరమౌతుందో అన్న విషయాలపై అందరం ఒక అవగాహనకు వచ్చాం. అయితే దివంగత ముఖ్యమంత్రి అవేవీ పట్టించుకోలేదు. కేవలం సీ.ఇ.ఓ ను తనకవసరమైన వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. సత్యనారాయణ గారు, అగర్వాల్ గారు చెప్పిన విషయాలను శ్రద్ధగా విన్నారు. తక్షణమే స్పందించారు. స్పందించి, జీ.వి.కె రెడ్డి గారికి ఫోన్ కలవమన్నారు.

ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, జీ.వీ.కె సంస్థల అధ్యక్షుడికి స్వయంగా ఫోన్ చేసి, అనునయంగా-ఆప్యాయంగా మాట్లాడుతూ, ఇ.ఎం.ఆర్.ఐ కి నిధులను సమకూర్చవలసిన ఆవశ్యకతను వివరించిన పద్ధతి నిజంగా శ్లాఘనీయం.ఆయన రాజనీతిజ్ఞతకు నిదర్శనం. "అన్నా... ఇంతకు ముందే నీతో చెప్పాను గదా! ఎన్నికల హడావిడిలో మరోమారు చెప్పడం కుదరలేదు. ఎవరో మహారాష్ర్ట్ర నుంచి పిరమిల్ అనే సంస్థ యాజమాన్యం ఇక్కడకు వచ్చి, మన 108 అత్యవసర సహాయ సేవల నిర్వహణలో ఎందుకు ప్రయివేట్ భాగస్వామి కావాలి? మీరందరూ లేరా? మా ప్రభుత్వానికి అత్యంత ఆదరణీయమైన ఈ పథకానికి యాజమాన్య పరంగాను, ప్రయివేట్ భాగస్వామ్య పరంగాను అవసరమైన నిధులను మీరెందుకు సమకూర్చకూడదు? సమకూర్చమని కోరుతున్నాను. ప్రభుత్వం ఎలాగూ 95% మేర నిర్వహణ పరమైన నిధులను సమకూరుస్తుంది కదా !" అని అన్నారాయన తో. అటువైపు నుంచి ఆయన ఏం మాట్లాడోకాని, ఇటునుంచి రాజశేఖర రెడ్డి గారు మాత్రం "తప్పక-తప్పకుండా" అన్న మాటలను పదే పదే ఉచ్చరించడం మాకు వినపడింది. బహుశా ముఖ్యమంత్రి నుంచి జీ.వీ.కె కొన్ని హామీలు కోరినట్లు మేమర్థం చేసుకున్నాం. అవేమై వుంటాయో కూడా నాకు కొంతమేరకు అవగాహన అయింది. ఏదేమైనా సంక్షోబంలో వున్న ఇ.ఎం.ఆర్.ఐని గట్టెక్కించడానికి రాజశేఖర రెడ్డి గారు తీసుసుకున్న చొరవ-అది వెంటనే ఫలితమివ్వడంతో, సంతోషంతో సమావేశం నుంచి బయటకొచ్చాం. బయటకొస్తూనే మంత్రివర్గ పోర్ట్ పోలియోల జాబితా చూసుకొని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పితాని సత్యనారాయణకు 108-104 శాఖలను కేటాయించినట్లు తెలుసుకున్నాం. ఆయన్ను కలవాలని నిశ్చయించుకున్నాం. బహుశా ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా, అత్యవసర సహాయసేవలకు ప్రత్యేకంగా ఒక మంత్రివర్గ శాఖను ఏర్పాటు చేయడం మన రాష్ర్ట్రంలోనే జరిగిందనాలి. ఆ ఘనత రాజశేఖర రెడ్డి గారిదే.

లంచ్ ముగించుకొనేలోపల, ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్ చెంగవల్లి గారు జీ.వీ.కె కు ఫోన్ చేసి ఆయన్ను ఆ సాయింత్రం (మే నెల 26, 2009) నాలుగు-అయిదు గంటల సమయంలో కలిసే ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశాన్నే చాకచక్యంగా "బోర్డ్ సభ్యుల సమావేశం" గా మలిచారు వెంకట్. ఈ లోగా 108-104 శాఖలకు కేటాయించిన కొత్త మంత్రిని మర్యాద పూర్వకంగా ఆయన నివాసానికి వెళ్లి కలుసుకున్నాం. అక్కడినుంచి జీ.వీ.కె కార్యాలయం వున్న తాజ్ కృష్ణా హోటల్ కు వెళ్లాం. ఇక్కడొక విషయం చెప్పాలి.

ఇ.ఎం.ఆర్.ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు రామలింగరాజు గారు సత్యం కుంభకోణంలో జైలుకెళ్లడానికి ముందర తన పదవికి రాజీనామా చేయడంతో, అంతవరకు ఆయన ఆహ్వానం మేరకు ఇ.ఎం.ఆర్.ఐ బోర్డ్ సభ్యులుగా వున్న వారందరూ ఒకరి వెంట ఒకరు రాజీనామాలు సమర్పించారు. చైర్మన్ ఎమిరిటస్ గా వున్న మాజీ రాష్ర్ట్రపతి కలాంతో సహా నలుగురు మినహా అందరూ రాజీనామా చేశారు. రాజీనామా చేసినవారిలో, భారత రత్న ఏ.పీ.జె అబ్దుల్ కలాం, రామరాజు, తరుణ్ దాస్, కె.వి.కమత్, క్రిష్ణా పాలెపు, కిరణ్ కార్నిక్ లున్నారు. రాజీనామా చేయంది నలుగురు మాత్రమే. సీ.ఇ.ఓ వెంకట్ తో కలుపుకుని కేవలం అయిదుగురు సభ్యులే ఇక బోర్డ్ లో మిగిలారు. రాజీనామా చేయని మెకన్జీ మాజీ ఎం.డీ రజత్ గుప్తా, కర్నెగీ మిలన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ రాజ్ రెడ్డి, లోక్ సత్తా నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ జయ ప్రకాశ్ నారాయణ, సుచిత్ర చైర్మన్ కృష్ణం రాజులను జీ.వీ.కె కార్యాలయానికి ఆహ్వానించారు వెంకట్. డాక్టర్ జయ ప్రకాశ్ నారాయణ, కృష్ణం రాజులు హాజరుకాగా, మిగిలిన ఇద్దరు కాన్ఫరెన్స్ కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

తాజ్ కృష్ణా సమావేశమందిరంలో సరిగ్గా సాయింత్రం అయిదు గంటలకు మొదలైన సమావేశం సుమారు గంటన్నర పైగా సాగింది. ఆరంభంలో వెంకట్ గత నాలుగు నెలలుగా ఆయన చేసిన ప్రయత్నాలు, అందులో భాగంగా జీ.వీ.కె సంస్థ ఇ.ఎం.ఆర్.ఐ కి తోడ్పడేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన వైనం, మధ్యలో పిరమిల్ ఆసక్త్గి కనబరచడం-వెనక్కు తగ్గడం, ఆ రోజున ముఖ్యమంత్రి జరిపిన సమీక్షా సమావేశపు వివరాలు, జీ.వీ.కే తోడ్పాటుతో ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించాల్సిందిగా ముఖ్యమంత్రి చేసిన సూచనకు సంబంధించిన వివరాలను బోర్డ్ సభ్యులకు తెలియచేశారు. సమావేశంలో కొద్దిసేపు సీ.ఇ.ఓ వెంకట్ తో పాటు, ఆయన సహచరులం కొందరం కూడా పాల్గొన్నాం. జీ.వీ.కె తన భావాలను, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ పట్ల-108 అత్యవసర సహాయ సేవల పట్ల తనకున్న గౌరవాన్ని, రాజుగారి పట్ల తనకున్న అభిమానాన్ని, ముఖ్యమంత్రి ఆదేశాల అమలు విషయంలో తనకున్న చిత్తశుద్ధిని, ఇ.ఎం.ఆర్.ఐ-ప్రభుత్వ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చేయాల్సిన కృషిని చక్కగా వివరించారు. ఎంతో బిజీగా వున్న ముఖ్యమంత్రిని ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్ అంత సులభంగా కలుసుగోగలిగి, సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకొచ్చి, పరిష్కార మార్గాన్ని త్వరితగతిన అన్వేషించగలిగినందుకు ఆయన్ను అభినందించారు. రాజీనామా చేయకుండా కొనసాగుతున్న రజత్ గుప్తాను, రాజ్ రెడ్డిని, జయప్రకాశ్ నారాయణను, కృష్ణంరాజును మున్ముందు కూడా సభ్యులుగా కొనసాగమని విజ్ఞప్తి చేశారు జీ.వీ.కె. బోర్డ్ సభ్యుల కోరిక మేరకు, తక్షణమే ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ గా జీ.వీ.కె పదవీ బాధ్యతలు స్వీకరించారు . ఆ సాయింత్రం ముఖ్యమంత్రిని కూడా కలిశారు ఆయన. రాజుగారు రాజీనామా చేసిన నాలుగున్నర నెలలకు, ఆ విధంగా, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు నూతన అధ్యక్షుడిగా జీ.వీ.కె బాధ్యతలు చేపట్టారు. మర్నాడు పత్రికలన్నీ ప్రముఖంగా ఈ వార్తను ప్రచురించాయి.

వాస్తవానికి వ్యవస్థాపక అధ్యక్షుడు రామలింగ రాజు గారు ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ గా రాజీనామా చేసిన నాటినుంచి (జనవరి 7, 2009) జీ.వీ.కె ఆ పదవి చేపట్టిన రోజు (మే నెల 26, 2009) వరకు బాహ్య ప్రపంచానికి అంతగా అవసరంలేని-పట్టని పలు ఇబ్బందులకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ లోనైంది. అయినా ఒక్క రోజుకూడా 108 అత్యవసర సహాయ సేవలు, ఒక్క క్షణం కూడా ఆపబడలేదు. వెంకట్ కు, ఆయన సహచర యాజమాన్య బృందానికి, నెల-నెలా జీతాలు వచ్చినా-రాకపోయినా, అంబులెన్స్ లో పని చేసే పైలట్లకు-ఇ.ఎం.టీ లకు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (కాల్ సెంటర్) లో పని చేసే కమ్యూనికేషన్-డిస్పాచ్ ఉద్యోగులకు, ఇతర కింది స్థాయి వుద్యోగులకు (జిల్లా మేనేజర్లతో సహా) ఒకటి-రెండు రోజులు ఆలస్యమైనా ప్రతినెలా జీతాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ, ఐ.టి సంస్థ సత్యం సంక్షోభంలో పడిందని, ఆ కంపెనీ వ్యవస్థాపకుడు రామలింగ రాజు నెలకొల్పిన (ప్రజలకు ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో 108 అత్యవసర సహాయక సేవలందించే) అత్యవసర యాజమాన్య పరిశోధనా నిర్వహణ సంస్థ (ఇ.ఎం.ఆర్.ఐ) గతంలో మాదిరిగా ఇకముందు కూడా సేవలనందిస్తుందా అనే సందేహాన్ని వ్యక్తపరచని పత్రిక-ఛానల్ లేదనే చెప్పొచ్చు. జనవరి 7, 2009న రామలింగ రాజు తన పదవికి రాజీనామా చేసిన మర్నాడే-అంటే జనవరి 8, 2009న మన రాష్ర్ట్రంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ లాంటి హామీలనే జనవరి 9, 2009న కర్నాటక, గుజరాత్, ఉత్తరాంచల్ ప్రభుత్వాలు ఇచ్చాయి. ఆ తర్వాత ఒకటి-రెండు రోజుల్లో 108 అత్యవసర సహాయ సేవలు లభ్యమవుతున్న మిగతా రాష్ర్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా అవసరమైతే నూటికి-నూరు శాతం నిర్వహణ పరమైన నిధులిస్తామని ప్రకటించాయి. రాజశేఖర రెడ్డి గారిని కలిసి వచ్చిన మరుక్షణం నుంచే ఇ.ఎం.ఆర్.ఐకి ప్రయివేట్ భాగస్వామిగా నిధులను సమకూర్చ గలిగే ఆసక్తి వున్న వ్యక్తుల-సంస్థల కొరకు వెంకట్-ఆయన సహచరులు ప్రయత్నాలు చేయసాగారు. సంక్షోభం వుందని పత్రికలన్నీ ఎలుగెత్తి చాటుతున్నా, కొత్తగా మేఘాలయ రాష్ర్ట్రంలో ఫిబ్రవరి 2, 2009 న 108 అత్యవసర సహాయ సేవలు ప్రారంభించాం.

అయితే ఇ.ఎం.ఆర్.ఐ పడుతున్న ఇబ్బందులు ఒకరికి చెప్పుకోలేనివి. ఒక విధంగా "మింగలేకా-కక్కలేకా"అన్న చందాన వున్నటువంటివి.

మే నెల 26, 2009 న డాక్టర్ జీ.వీ.కె రెడ్డి ఇ.ఎం.ఆర్.ఐ గవర్నింగ్ బోర్డ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పది రోజులకు జూన్ 3, 2009 న బోర్డ్ సమావేశమైంది. వివిధ రంగాలలో నిష్ణాతులుగా ప్రసిద్ధికెక్కిన మరో ముగ్గురు ప్రముఖ వ్యక్తులను బోర్డ్ సభ్యులుగా చేర్చుకున్నారు. అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన మాజీ ఇండియన్ అడ్మినిస్ర్టేటివ్ సర్వీసెస్ అధికారి డాక్టర్ అబిద్ హుస్సేన్, మాజీ సీ.బి.ఐ డైరెక్టర్-మాజీ జాతీయ మానవ హక్కుల కమీషన్ డైరెక్టర్ జనరల్ డీ.ఆర్. కార్తికేయన్, ఎల్ అండ్ టీ సంస్థ మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్-మాజీ ప్రెసిడెంట్ ఏ. రామకృష్ణ లను అప్పుడున్న అయిదుగురు సభ్యులకు అదనంగా బోర్డ్ సభ్యులుగా జీ.వీ.కె ఆహ్వానించారు . అంతే కాకుండా, జీ.వీ.కె సంస్థ పక్షాన, చైర్మన్ గా డాక్టర్ జీ.వీ.కె రెడ్డి-ఆయన భార్య శ్రీమతి ఇందిర కృష్ణారెడ్డి-వైస్ చైర్మన్ గా ఆయన కుమారుడు శ్రీ జీ.వీ. సంజీవరెడ్డి-సభ్యుడుగా శ్రీ ఎస్. భూపాల్ కూడా వుండే ఏర్పాటు చేశారు.

ఆ వెంటనే సమావేశమైన బోర్డ్ సభ్యులు, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ పేరును ఇకముందు "జీ.వీ.కె. ఇ.ఎం.ఆర్.ఐ"గా మార్చాలని నిర్ణయించారు. అలా మార్చడం వల్ల "ప్రాణాలను కాపాడే అత్యవసర సహాయక సేవలు మరింత పటిష్ఠ పడేందుకు జీ.వీ.కె నిబద్ధత ప్రతిబింబిస్తుందని, తద్వారా సేవలందించడం మరింత వేగవంతంగా-నైపుణ్యంగా-ఆచరణాత్మకంగా-పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని" బోర్డ్ సభ్యులు అభిప్రాయ పడ్డారు. దేశం నలుమూలలకూ అత్యవసర సహాయ సేవలు విస్తరించేందుకు తన వంతు కృషి చేస్తానని, అవి మరింత పటిష్ఠ పడేలా చర్యలు తీసుకుంటానని నూతన అధ్యక్షుడు పత్రికాముఖంగా ప్రకటన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి ఎగువగా, ఇనుమడించిన పారదర్శకతతో-ఆధునిక యాజమాన్య, నాయకత్వ సిద్ధాంతాలకనుగుణంగా అత్యవసర సహాయక సేవలను జీ.వీ.కె. ఇ.ఎం.ఆర్.ఐ అందిస్తుందని వైస్ చైర్మన్ గా నియమితులయిన సంజీవరెడ్డి ప్రకటించారు. మిగతా సభ్యులందరూ వారికి వంతపాడారు.

మరెందుకీ సంస్థ-అది అందిస్తున్న అత్యవసర సహాయ సేవలు ఇబ్బందులకు లోను కావాలి? అసలేం జరుగుతున్నది?ప్రభుత్వ హామీలు-జీ.వీ.కె హామీలు కాగితాలకే పరిమితమా? లేక యాజమాన్య నిర్వహణలో లోపాలున్నాయా? పోనీ అధికారులు రాజశేఖర రెడ్డి లేని లోటును పరోక్షంగా ప్రదర్శిస్తున్నారా? ఒకవైపేమో "నిబద్ధత “ను కలిగున్న జీ.వీ.కె-మరో వైపేమో రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేరుస్తానంటున్న ముఖ్యమంత్రి రోశయ్య గారు-108 శాఖను నిర్వహిస్తున్న మంత్రి గారేమో సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి (జగన్మోహన్ రెడ్డి గారి) అనుయాయుడు-అన్నింటికన్నా మించి పాతికేళ్ళ పైబడి యాజమాన్య నిర్వహణ అనుభవం, కష్ట కాలంలో బాధ్యతలు నైపుణ్యంతో నెరవేర్చిన సీ.ఇ.ఓ వెంకట్. అంగట్లో అన్నీ వున్నా... అల్లుడి నోట్లో శని అన్న చందాన వుంది అత్యవసర సహాయ సేవలు. ఈ సేవల కొనసాగింపు ప్రభుత్వ (లాభాపేక్ష లేని) ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకే ఒక పెను సవాలు. వ్యక్తిగత పట్టింపులకు-పంతాలకు అతీతంగా నిర్వహించాల్సిన-అమలు చేయాల్సిన ఈ సేవలు కేవలం ఏ ఒక్కరి సొత్తో-సొమ్మో కావు-కాకూడదు.

Tuesday, April 20, 2010

I-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-1): వనం జ్వాలానరసింహారావు

అంతర్మధనం-1
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలానరసింహారావు

గత అరవై సంవత్సరాలలో, స్వతంత్ర భారత దేశ చరిత్రలో అధికారంలో వున్న ఏ ప్రభుత్వమైనా తీసుకున్న విధాన నిర్ణయాలన్నింటికన్నా అత్యంత కీలకమైంది గా భావించదగింది బహుశా "లాభాపేక్ష రహిత ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం" అని ఘంటాపథంగా చెప్పొచ్చు. సరళీకృత ఆర్థిక విధానం కన్నా, ప్రపంచీకరణ కన్నా, కమ్యూనికేషన్ విప్లవం కన్నా... అలాంటి మరెన్నో విధానాలకన్నా క్రమేపీ అన్ని రంగాలలో ఆదరణ తెచ్చుకుంటున్నదీ ప్రక్రియ. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆలోచనా విధానానికి అనుగుణంగా రూపుదిద్దుకున్న ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియను, లాభాపేక్ష రహిత ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియగా ఆరోగ్య వైద్య రంగంలో ప్రవేశపెట్టి, ఊపిరి పోసి, ఊతమిచ్చి, కొత్త భాష్యం చెప్పి యావత్ భారతదేశానికి మార్గదర్శకంగా మలిచిన ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిగారి దే. అదే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన "రాజీవ్ ఆరోగ్య శ్రీ" పథకం. ఆ గొడుగు కింద అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న 108 అత్యవసర సహాయ సేవలు రాజశేఖరరెడ్డి గారికి మరీ ప్రీతిపాత్రమైనది. ఆరోహణ-అవరోహణల మధ్య మహాప్రస్థానం సాగిస్తున్న 108 అత్యవసర సహాయ సేవలు, ఈ రోజున, ఒక వైపు పది రాష్ట్రాలలోని నలభై కోట్ల జనాభాకు లాభం చేకూరుస్తుండగా, మరోవైపు ఆ సేవల ఆవిర్భావం జరిగి, అఖిల భారతావనికి మార్గదర్శకంగా నిలిపిన ఆంధ్ర ప్రదేశ్ లో, రాజశేఖరరెడ్డి గారు మరణించిన అచిరకాలంలోనే అనేకానేక కారణాలవల్ల అవే సేవలు ఒడిదుడుకుల్లో పడుతున్నాయన్న మీడియా కథనాలు అత్యవసర సహాయ సేవల లబ్దిదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ల మన్ననలను-అభినందనలను పొంది, కేంద్రప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వారు నియమించిన అఖిల భారత వైద్య బృందం వారి అధ్యయనంలో "కరుణామయి-కారుణ్య దేవతగా" అభివర్ణించబడిన "108 అంబులెన్స్" ఆవిర్భావం, పరిణామక్రమం, ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు ఆసక్తికరమైనవే కాకుండా పరిశోధకులకు అధ్యయనపరమైనవి కూడా. ప్రపంచంలోనే ప్రప్రధమంగా సత్యం రామలింగరాజు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గార్ల పుణ్యమా అని లక్షలాది ప్రాణాలను కాపాడడానికి ఉద్దేశించబడిన ఈ అత్యవసర సహాయ సేవలు "ఏ ఒక్కరి సొత్తో-సొమ్మో" కాదు-కాకూడదు. దాని ఆరంభ దశలో, అభివృద్ధి చెందుతున్న దశలో, ఉఛ్చ స్థాయికి చేరుకుని ఇబ్బందులకు లోనయినప్పటికీ సీ.ఇ.ఓ వెంకట్ సంస్థను-సేవలను కొనసాగించడానికి కష్టపడుతున్న దశలో, సేవలందిస్తున్న పది రాష్ట్ర్రాల్లో ఒక రాష్ట్ర్రం విడిపోయే ప్రయత్నం చేస్తున్న దశలో అనుబంధం వున్న వ్యక్తిగా, ఆందోళన చెందుతూ నాకు తెలిసిన వాస్తవాలను నా బ్లాగ్ లో వారం-వారం పొందుపరుస్తున్నాను.

జనవరి 8, 2009 రోజు నాకింకా జ్ఞాపకముంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు ఆ రోజున అన్న ప్రతి మాటా-ఇచ్చిన భరోసా పదే-పదే జ్ఞప్తికొస్తూనే వున్నాయి. ఆ క్రితం రోజున ఇ.ఎం.ఆర్.ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు భైర్రాజు రామలింగ రాజు గారు, సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో జైలుకెళ్లాల్సి వచ్చింది. తక్షణమే 24 గంటల వ్యవధిలో, వైద్య-ఆరోగ్య శాఖ అధికారుల సమక్షంలో, ఇప్పటి ముఖ్యమంత్రి-అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య హాజరుకాగా, రాజశేఖరరెడ్డి, ఇ.ఎమ్.ఆర్.ఐ అధికారులను పిలిపించి 108 అత్యవసర సహాయ సేవలందించే విషయంలో నిశితంగా సమీక్షించారు. తప్పులెంచడానికి గాని, మమ్మల్ని మందలించడానికి గాని జరిపిన సమీక్ష కాదది. రాజు గారు వాస్తవానికి అప్పటికే ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ పదవికి రాజీనామా ప్రకటించడంతో, సీ.ఇ.ఓ వెంకట్ చెంగవల్లి-ఆయన లీడర్షిప్ బృందం అయోమయానికి గురై, సమీప భవిష్యత్ లో అత్యవసర సహాయ సేవలను అందించడంలో ఎలాంటి ఒడిదుడుకులకు లోను కావాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్న సందర్భమది.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిగారికి ఇష్టమైన పథకాలన్నింటిలో కి అత్యంత ప్రీతిపాత్రమైన "రాజీవ్ ఆరోగ్య శ్రీ" లో భాగమైన 108 అత్యవసర సహాయ సేవలను అమలుపర్చే ఇ.ఎం.ఆర్.ఐ సంస్థలో పనిచేస్తున్న సందర్భంగా ఆయన్ను చాలా సార్లు కలుసుకున్నాను. ప్రతి సమావేశంలోనూ, ఆయన వ్యక్తిత్వం, అంకిత భావం, ఆయన చెప్పే ప్రతి మాటల్లోనూ ప్రస్ఫుటంగా కనిపించేది. ఆ సమావేశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల-అధికారులకిచ్చిన ఆదేశాల వల్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ-ఆ రాష్ట్రంలో అమలవుతున్న పథకం స్ఫూర్తితో ఇతర రాష్ట్రాలలోనూ లక్షకు పైగా ప్రాణాలు కాపాడబడ్డాయి. భవిష్యత్ లో లక్షలాది ప్రాణాలను రక్షించడానికి దోహద పడ్డాయి. యావత్ భారత దేశానికే ఆదర్శ ప్రాయంగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆరంభమయిన 108 అత్యవసర సహాయ సేవలు, ప్రస్తుతం పది రాష్ట్రాలకు పాకాయి. కేవలం 70 అంబులెన్సులతో ప్రారంభమై, రాజశేఖరరెడ్డి నిర్ణయాల వల్ల, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు పథకం అమలు చేసేందుకు ప్రపంచంలోనే రికార్డు స్థాయికి చేరే విధంగా 800 కి పైగా అంబులెన్సులను ప్రభుత్వం సమకూర్చింది. అలా జరగడానికి ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమే కీలకమనాలి.

జనవరి 8, 2009 న జరిగిన సమీక్షా సమావేశానికి మా సీ.ఇ.ఓ తో కలిసి ఎప్పటిలాగే నేనూ వెళ్లాను. మిన్ను విరిగి మీద పడ్డా-ఎటువంటి పరిస్థితులెదురైనా ఆ సేవలు ఆగిపోకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలను అటు ప్రభుత్వాధికారులకు-ఇటు మాకూ ఇచ్చారాయన. అవసరమైతే, ప్రభుత్వం అప్పటివరకూ భరిస్తున్న 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి నూరు శాతానికి పెంచడానికి సిద్ధమేనన్నారు. యాజమాన్య వాటాగా (ప్రయివేట్ భాగస్వామ్యంగా) అప్పటివరకూ ఇ.ఎం.ఆర్.ఐ భరిస్తున్న ఖర్చులను కూడా, తప్పదను కుంటే ప్రభుత్వమే సమకూరుస్తుందని హామీ ఇచ్చారాయన. అయితే అప్పట్లో ఆర్థిక మంత్రిగా వున్న రోశయ్య గారు, పూర్తిగా ప్రభుత్వమే భరించడమంటే, అది ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు విరుద్ధమవుతుందని, విమర్శలకు దారితీస్తుందని సూచించారు. ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్ చెంగవల్లి కూడా, ప్రయివేట్ భాగస్వామ్యం కింద అప్పటివరకూ భరిస్తూ వస్తున్న ఖర్చును ఏదో విధంగా సమకూర్చుకునేందుకు శాయ శక్తులా కృషి చేస్తామనీ, దానికొరకు నాలుగు నెలల సమయం కావాలనీ కోరారు. ప్రయివేట్ భాగస్వామ్య వాటా ఖర్చు కింద తక్షణం ఎంత కావాల్సి వస్తుందని వెంకట్ ను అడిగారు ముఖ్యమంత్రి. జవాబుగా ఆయన అయిదు కోట్లన్నారు. నిర్ణయాన్ని వాయిదా వేయడానికి ముందు రాజశేఖర రెడ్డి గారన్న మాటలు నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనం అనాలి. "రోశయ్య గారూ, పోనీ ఒక పని చేద్దాం. ప్రభుత్వ పరంగా ఇవ్వడం విధానానికి విరుద్ధమన్న విమర్శ వస్తుందని మీరు భావిస్తే, మనమే ఎవరన్నా తెల్సినవాళ్ల ద్వారా ఇ.ఎం.ఆర్.ఐ కి అవసరమైన ఆ అయిదు కోట్ల రూపాయలు ఏర్పాటు చేద్దాం" అన్నారు. ఎంత మంచి మనసాయనదో ఆ మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు.

ఎన్నికల రణరంగంలో తలమునకై వున్నా, ఎప్పటికప్పుడు, 108 అత్యవసర సహాయ సేవలందించే సంగతి మరిచిపోలేదాయన. ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి-మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయగానే, మర్నాడు, ఇజ్రాయిల్ దేశానికి పోవడానికి ముందర మే నెల చివరి వారారంభంలో తిరిగి సమీక్ష జరిపారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత సీ.ఎం చేసిన మొట్ట మొదటి సమీక్షా సమావేశం అదే. 108 సేవలు తమ పార్టీ గెలుపుకు కారణమయ్యాయని, 108-104 సేవలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశానని కూడా మాకు చెప్పారప్పుడు. "ఏం జరుగుతుంది వెంకట్? ఎవరన్నా ప్రయివేట్ భాగస్వామి దొరికాడా" అని సమీక్ష మొదలవుతూనే అడిగారు. దైవమే ఆయన నోటి నుంచి ఆ ప్రశ్న వేయించిందని భావించాం మేం.

వాస్తవానికి మా పరిస్తితి అప్పటికే అగమ్య గోచరంగా వుంది. వివరాల్లోకి పోయే ముందర ప్రస్తుతానికి క్లుప్తంగా ప్రస్తావిస్తానవి. రామలింగరాజు గారి స్థానంలోకి ఎవరినన్నా "దాత" ను సంపాదించుకునేందుకు వెంకట్ గారు పడని పాట్లు లేవు, ఎక్కని-దిగని "గడప" లేదు. ఏ పుట్టలో ఏ పాముందోనని అన్ని పుట్టలని స్పర్శించాడాయన. మధ్యలో రాజుగారు ఏర్పాటు చేసిన "బోర్డ్ మెంబర్లు" అయిదారుగురు తప్ప ఒక్కరొక్కరే రాజీనామా చేశారు. నిర్వహణ ఖర్చులెలానో ప్రభుత్వ నిధులతో సర్దుకు పోగలిగినా, యాజమాన్య పరంగా నెలనెలా చెల్లించాల్సిన సీనియర్ల జీతాలు అప్పటికి మూడు నెలలుగా చెల్లించడం సాధ్య పడలేదు. అయినా వెంకట్ గారి నాయకత్వంలో నమ్మకమున్నందున ఒకారు కూడా సంస్థను వదిలి పోలేదు. అయితే కొందరిలో నిరాశ చోటు చేసుకో సాగింది. ఈ నేపధ్యంలో సరిగ్గా మే నెల 23, 2009 చావు కబురు చల్లగా అందింది వెంకట్ గారికి. అప్పటివరకూ ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ బాధ్యతలు స్వీకరిస్తారనుకున్న ముంబాయికి చెందిన "పిరమిల్" చేతులెత్తేశారు. సంస్థ లోని కొన్ని లోటుపాట్లను ఎత్తిచూపిస్తూ (వివరాలు ముందు ముందు తెలుసుకుందాం) తనకు రాజు గారి స్థానంలోకి రావడం సాధ్యపడదని తేల్చి చెప్పారు. ఇక మిగిలిన ఆశ హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త జీ.వి.కృష్ణారెడ్డి గారు. అయితే అప్పటివరకూ ఆయన ఎటువంటి ఆశాజనకమైన సంకేతాలను ఇవ్వలేదు. అయినా వెంకట్ గారికి-ఆయన బృందంలోని మాకు ఆశ చావలేదు. వెంకట్ గారి బాధను అర్థం చేసుకున్న నాకు ముఖ్యమంత్రి దగ్గరనుంచి కబురొస్తే బాగుంటుందని అనిపించింది. అనుకున్నట్లే ఆయన కార్యదర్శి-ఇ.ఎం.ఆర్.ఐ సబ్జెక్ట్ ను చూస్తున్న స్వర్గీయ సుబ్రహ్మణ్యం గారి దగ్గరనుంచి ముఖ్యమంత్రిగారి సమీక్షకు సంబధించిన పిలుపొచ్చింది వెంకట్ గారికి. అదే ఇజ్రాయెల్ వెళ్లే ముందర సీ.ఎం జరిపిన సమావేశం.

సంస్థా పరంగా-యాజమాన్య నిర్వహణ పరంగా ఇ.ఎమ్.ఆర్.ఐ ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులను అర్థం చేసుకున్న రాజశేఖర రెడ్డి, జీ.వీ.కె సంస్థల అధ్యక్షుడికి స్వయంగా ఫోన్ చేసి, ప్రయివేట్ పరంగా లోగడ సత్యం కంప్యూటర్స్ చైర్మన్ ఇచ్చిన విధంగానే ఇ.ఎం.ఆర్.ఐ కి నిధులను సమకూర్చమని చెప్పారు. ఆ రోజే మేము ఆయనను కలుసుకోవడం, ఆయన ఒప్పుకోవడం. ఇ.ఎం.ఆర్.ఐ దరిమిలా జీ.వీ.కె ఇ.ఎం.ఆర్.ఐ గా మార్పు చెందడం జరిగింది.

ఇంతవరకూ బాగుంది. ఇది జరిగి ఏడాది కావస్తుంది. ఆ సమావేశంలో ప్రస్తుత ముఖ్యమంత్రితో సహా సంబంధిత అధికారులందరూ వున్నారు. ఆ తర్వాత రాజుగారి స్థానంలోకి జీ.వీ.కె ప్రవేశించారు. అంటే ఎటువంటి ఇబ్బందికి 108 అత్యవసర సహాయ సేవలు గురి కాకూడదనే కదా ! మరెందుకు మీడియాలో ఈ కథనాలొస్తున్నాయి? ప్రభుత్వ నిధులు సక్రమంగా అందడం లేదనుకోవాలా?జీ.వీ.కె అనుకున్న రీతిలో సహాయం అందించడం లేదా? దివంగత ముఖ్యమంత్రికి అత్యంత ప్రీతిపాత్రమైన అత్యవసర సహాయ సేవలు ఒడిదుడుకుల్లో పడడం నిజమేనా?ఒడిదుడుకులకు కారణాలు ఏమై వుండవచ్చు?

వివరాల్లోకి పోవాలంటే వారం వారం చదవాల్సిందే !

Sunday, April 18, 2010

Need for Permanent “Health and Emergency Care Developmental Fund”: Vanam Jwala Narasimha Rao

Rededicate to Health-Care
Honor the Commitments of
Former CM Rajashekhar Reddy

Appeal to Chief Minister Rosaiah
Vanam Jwala Narasimha Rao

I am shocked to see an un-believable news report in a regional television channel that the state government has decided to put on hold its share promised for the life-saving and preventive Emergency and Health schemes respectively, introduced and implemented during former Chief Minister Rajashekhara Reddy’s tenure. Having associated for more than three and half years with one of these revolutionary schemes that saved 50000+ lives in Andhra Pradesh, and continue to associate with the second now, I have every reason to express my concern when attempts are said to have been made to dislodge them.

Yes, I am talking in particular, about the most popular 108 emergency response services - the first of its kind Public Private Partnership, pre-hospital care based ambulance services in our state, which forced several state governments to replicate and introduce and run in their respective states as efficiently as in this state. Media has also been reporting for over a week that there is un-rest among a section of associates working in two very important Healthcare Institutions, EMRI (Emergency Management and Research Institute) and HMRI (Health Management and Research Institute). Preliminary enquiries by media confirm that either non-revival of the funding pattern or non-release of agreed operational expenditure in advance as per MoU norms or cuts in the unit costs on some pretext or other has become a regular phenomenon being resorted by the concern departmental heads supported by the concern Minister. The private partner is left with no option except delaying the monthly payments like salaries not to speak of annual incremental hikes. Hence the unrest in some quarters as reported in the media could be true.

The two Institutions EMRI and HMRI-one to provide 108 emergency response services and the other 104 Health Information Help Line & Fixed Date Health Service respectively are the two most successful Transformational Institutions conceived and developed in the state while Dr Rajshekhar Reddy was Chief Minster. Many thinkers and doers-some behind-have been associated in defining, conceiving, designing, developing, implementing and replicating these health-care schemes. The day is not far-off when these schemes would become instrumental in putting Hyderabad and Andhra Pradesh in the world Health-Care Map as the key Hub of reforms.

Dr. AP Ranga Rao as the Principal Advisor to EMRI, besides conceiving the idea, helped in establishing a state of the art Emergency Response System in Andhra Pradesh which paved the way for 10 more states to adopt it catering to 80 million populations. His role included providing concept, Architecture, design, algorithms, processes, monitoring tools and advocacy with Government. Thanks to EMRI and the forward thinking governments in 10 states in India, today, in almost half of India any person, round the clock, when in emergency, can be confident of transportation facility to be reached to the nearest medical stabilization center within the GOLDEN HOUR, through a net work of Pre-hospital care based Ambulances, by just dialing toll-free 108 number.

EMRI aims to provide emergency management in a way similar to, or exceed the 9-1-1 system in United States of America. The vision of EMRI is to provide leadership through Public (Not-for-profit) Private Partnership-PPP framework to respond to emergency calls round the clock and save lives meeting global standards in Emergency Management, Research and Training.

Dr Ranga Rao also as the Chief Advisor to HMRI helped in launching and scaling two very important healthcare interventions namely a 24X7 Health Help Line and the Fixed Date Health Service (FDHS). The Health Helpline provides Medical Triage and Advice, Counseling to people seeking help for psychological problems and provides information on health providers with the help of 150+ directories through 104 toll-free telephone. FDHS serves the 4.2 Crore population through a Mobile Health Unit which visits a habitation once a month focusing on pregnant women, children and the elderly.

Both EMRI and HMRI as non-profit organizations were established by the state IT icon Ramalinga Raju of erstwhile Satyam Computers Limited-now the Tech-Mahindra. Ironically, today Raju who “made the things happen” by establishing EMRI is a tainted IT icon. But, his passion to serve the people and save their lives through this unique 108 and prevent health related problems through 104 and FDHS is appreciable.

Dr Ranga Rao’s efforts and Raju’s vision of saving lives and preventing health related problems were supported and are being implemented right from day-one by another management brain behind-Dr Balaji Utla, who was initially with EMRI and moved to HMRI later and continues as its CEO till today passing through all the hard times. Venkat Changavalli as CEO of EMRI from the day the first PPP MoU was signed with AP Government five years ago in the presence of Dr Rajashekahara Reddy, through his management expertise initiated and successfully expanded EMRI to 10 states. He continues to lead EMRI despite Raju’s absence.

Much greater than these souls, was the former Chief Minister of Andhra Pradesh, Dr Y S Rajasekhara Reddy, who understood well the importance of the scheme as a doctor to save people of his state. The first-ever Public-Private Partnership health scheme started paying rich dividends as it helped save thousands of people. The concept inventor, the entrepreneur Raju, the management experts and the former Chief Minister ably supported by the then Chief Secretary J. Harinarayana as well as the then Principal Secretary Health PK Agarwal and Commissioners CBS Venkataramana & Anil Punitha carried forward the scheme further. If the EMRI concept was to help people trapped in emergency situations like ‘accidents’ or ‘sudden sickness’ reaching quickly to hospitals to provide emergency care free of cost, then the HMRI is meant to provide other than emergency health care.

In brief, These PPP Models-the Emergency Health Transportation, Health Information Help Line, Fixed Day Mobile Health Clinics and Telemedicine Center have resulted in either saving lives in emergency or helped people to plan to save their own lives preventively.

These two schemes were incorporated into the government’s Rajiv Arogya Sree, which also provides insurance cover, and are being implemented successfully in the state government. These schemes not only won many accolades from the Centre, but also from international community. As a hardcore doctor, the former Chief Minister thought providing basic Medicare is the responsibility of the government and agreed to fund cent operational expenditure (which progressively was raised from nominal to Cent Percent with his personal initiative and intervention).

Chief Minister Rosiah who as Helath Minister and Finance Minister not only supported the schemes but also provided the required funds for all the schemes under the Rajiv Arogyashri.

Other states were quick to replicate in their respective states. Believe it or, one should not shy away if a developed nation and world’s super power United States of America, too had taken a leaf out of our health scheme as the second non-white leader introducing similar Health Bill in that country.

But, today, if one has to go by the channel’s report and media stories, the 108 services are being starved of funds and the government apparently is in a mood to stop its share to support the scheme. GVK who agreed to shoulder the Private Part of the responsibility, as per the channel reports is also passive in providing funds as far as AP is concerned for reasons better known to him. Well what is the truth behind the news is anybody’s guess.

I am sure and confident that, Rajashekara Reddy’s successor, K Rosaiah, who promised not to dilute the schemes of his predecessor would initiate steps to see that the PPP services in the Health and Emergency sector are not suffered even for a minute. He as the one who evinced keen interest as the Health Minister to sign the MoU s would shoulder the responsibility to prove the Channel’s report and media stories are wrong. He should check the facts whether the Finance and Family Welfare departments have stopped funding these two unique institutions, which wedded for yeoman service.

The best way to channelize the funds would be to create a Permanent “Health and Emergency Care Developmental Fund” by pooling NRHM, State Government and Private Contributions from many but not from one single source. For such huge schemes one Raju or one GVK means "dependence in uncertainty". The operational Expenditure need to be finalized through consensus between EMRI-HMRI management and Government well in advance before the financial year commences and the agreed fund has to be deposited in a Bank account to be Jointly operated by CEO s of EMRI, HMRI and Commissioner Family Welfare. Accountability mechanisms could be worked out.

Such an arrangement do not require a Private Partner like GVK but would certainly require management experts as CEOs like Dr Balaji Utla and Venkat Changavalli. Let the PPP concept be dynamic and not static for ever with the boundaries well defined.

Any deviation from the implementation of the scheme that, brought name and fame, besides great satisfaction of serving the people in true sense and any delay in releasing operational expenditure, would send wrong signals to the people. What would be the outcome of it cannot be assessed. If these schemes fail now in future it would be difficult to bring them back again.

Friday, April 16, 2010

లగడపాటిది సమైక్యవాదమా? వితండవాదమా?అమాయకత్వమా?: వనం జ్వాలానరసింహారావు

రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేందుకు లగడపాటి లాంటి సమైక్యతా వాదులు ఏం చేశారు?
ఎటువంటి భరోసా ఇచ్చారు? ఎన్ని రకాల చులకన-గేలి చేశారు?
వనం జ్వాలానరసింహారావు

"బత్తీస్ మార్ ఖాన్, చత్తిస్ మార్ ఖాన్" అని మా చిన్నతనంలో ఒక సరదా గేమ్ ఆడే వాళ్లం. తెలిసీ-తెలియని వయసులో ఒకేసారి ఈగలను అన్యాయంగా చంపడంలో నైపుణ్యం ప్రదర్శించే ఆట అది. సరిగ్గా అలాంటి గేమే ఆడుతున్నారు లగడపాటి తన "సమైక్య వాదం" తో. ఎన్ని ఎక్కువ నివేదికలిస్తే అంత గొప్ప అనుకుంటున్నారాయన. అందులో ఎన్ని ఎక్కువ పేజీలుంటే, తన తెలివి తేటలకు అంత నిదర్శనమని కూడా భావిస్తున్నట్లుంది. వాస్తవానికి తానేం చేస్తున్నాడని కనీసం ఒక్కసారైనా ప్రజా ప్రతినిధిగా ఆలోచించిన దాఖలాలు కనపడడం లేదు ఆయన వాదనలు వింటుంటే. "ఎందుకిన్ని నివేదికలిచ్చావయ్యా"అని అడుగుతే, సమాధానం ఇస్తూ రెచ్చిపోయి, మరో రెండు నివేదికలిస్తానంటాడు. "అందులో ఏముందండీ"అని ప్రశ్నిస్తే, సూటిగా సమాధానం ఇవ్వకుండా, తెలంగాణ వాదులు (ముఖ్యంగా టీ ఆర్ ఎస్ ను వుద్దేశించి) అవాస్తవాలు చెపుతున్నారనీ-ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొడుతున్నారనీ-అనేక విషయాల మీద వక్రీకరించి శ్రీకృష్ణ కమిటీ ముందు పెడుతున్నారని, అవన్నీ నిర్వీర్యం చేయడానికి తాను దశలవారీగా వారం-వారం ఒక నివేదిక ఇస్తున్నానని అంటారు. ఆయన సమైక్యతా వాదనలో స్పష్టత లేదనీ-నివేదికలన్నీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాదాన్ని బలపరుస్తున్నాయని ఆయన దృష్టికి తెస్తే, ఎదురు ప్రశ్నిస్తారు తప్ప వివరణ ఇవ్వనే ఇవ్వరు. ఎప్పుడో నవంబర్ 1, 1956 ముందు సంగతులను, మహరాష్ట్ర-కర్నాటక రాష్ట్రాలలోని పూర్వ హైదరాబాద్ జిల్లాల విషయాన్ని అసందర్భంగా ప్రస్తావించి వితండ వాదాన్ని-అమాయకత్వాన్ని బయట పెట్టుకుంటారు. ప్రతిరోజు ఆయన గారు ఏదో ఒక ఛానల్ లో కనిపించి ఇదే అమాయకత్వాన్ని-వితండవాదాన్ని ప్రదర్శిస్తుంటారు. ఒక్కోసారి మరింత రెచ్చిపోయి, కే సీ ఆర్ ను బహిరంగ చర్చకు రమ్మంటూ సవాలు విసిరి ఇంకో నివేదిక తయారీలో నిమగ్నమైపోతారు. ఆ క్రమంలోనే ఇటీవల ఒక సందర్భంలో మాట్లాడబోయి, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ముందు అవాక్కయి పోవడంతో ఆ తర్వాత మరే ఛానల్స్ లోను ఎక్కువగా కనిపించడం లేదు.

అసలు విషయానికొస్తే ఆ రోజు జరిగిన చర్చలో లగడపాటి, అమర్ తో పాటు దళిత వుద్యమ నాయకులు ప్రభాకర్ కూడా వున్నారు. వాద-ప్రతివాదనలు ఉదృత రూపం దాల్చడానికి ముందు, రాజగోపాల్ నివేదికల వుద్దేశాన్ని తప్పుబడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర్ర నినాదాన్ని నీరు కార్చే ప్రయత్నంలో భాగంగానే, మహరాష్ట్ర-కర్నాటక లోని జిల్లాలను అక్కడినుంచి విడగొట్టి తెలంగాణలో కలపే విషయాన్ని సమైక్యవాదులు తెర పైకి తెస్తున్నారన్నారు అమర్. ఇంతకూ తెలంగాణ కావాలని వుద్యమం చేసేది ఆంధ్రప్రదేశ్ లో వున్న తెలంగాణ ప్రాంతం వాళ్లే కాని, పక్క రాష్ట్రాల వాళ్లు కాదనే విషయం లగడపాటికి తెలియదా? ఏమో ! అదే విధంగా, సమాజంలో ప్రజాస్వామ్యాన్ని బతికించిన దళితులు-అట్టడుగు వర్గాల వాళ్లు-పేదల స్థితిగతుల గురించి, వాటికీ-సమైక్య వాదానికీ వున్న సంబంధాల గురించి లగడపాటి తన నివేదికల్లో ఏమన్నా ప్రస్తావించారా అని ప్రభాకర్ అడిగిన దానికి కూడా సూటిగా వివరణ ఇవ్వలేదాయన. కరీంనగర్ లోగాని, కృష్ణా జిల్లా లోగాని దళితుల అణచివేతలో ఒకే విధంగా వ్యవహరించాయని, కాకపోతే తెలంగాణలో నెలకొన్న పటేల్-పట్వారీ వ్యవస్థ మూలాన వారు అక్కడ మరింత దోపిడీకి గురయ్యారని, అయినా ఎక్కడున్నా వారి పరిస్థితి ఒకటే అని ఏదో చెప్పబోయారే తప్ప సమైక్య వాదానికి దానికీ వున్న సంబంధం కానీ, అవి నివేదికల్లో పొందుపరిచిన విషయం కానీ వివరించలేదు. మధ్యలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అమలు పరిచిన సంక్షేమ కార్యక్రమాల ప్రస్తావన తెచ్చి వాదనను మరో వైపు మళ్లించారు. అదే విధంగా, మహారాష్ట్ర-కర్నాటక ప్రాంతాలకు, భారత-పాకిస్తాన్ ప్రాంతాలకు మరో రకమైన పోలిక తెచ్చే ప్రయత్నం కూడా చేశారు. అసలు విషయమైన తెలంగాణ దళితుల ఆకాంక్ష గురించి ఆయనకు పట్టినట్లు లేదు. 54 సంవత్సరాల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 14 సంవత్సరాల కాలం తప్ప మిగతా కాలం అంతా పాలించిన "లగడపాటి కాంగ్రెస్ పార్టీ" దళితులకు సమైక్య రాష్ట్రంలో మేలు జరుగుతుందా? ప్రత్యేక రాష్ట్రంలో మేలుజరుగుతుందా అన్న విషయాన్ని లగడపాటి తన నివేదికల్లో పట్టించుకోలేదని చర్చలో ప్రస్తావనకొచ్చింది. అందుకే తెలంగాణ ప్రాంత దళితులు, తాము విడిపోతా మంటున్నారు కదా అని ప్రశ్నిస్తే దానికీ సమాధానం సరిగ్గా ఇవ్వలేకపోయారు రాజగోపాల్ గారు.

చిదంబరం డిసెంబర్ ప్రకటన తర్వాత అందరికంటే ముందు ఎందుకు లగడపాటి రాజీనామా చేశారని, ఎందుకు కే సీ ఆర్ కు పోటీగా నిరాహార దీక్షకు పూనుకున్నారని, వీటికి సంబంధించి నివేదికల్లో ఏమన్నా ప్రస్తావన వుందా అని ప్రశ్నిస్తే, ఆ సమాధానం కూడా వింతగానే వుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో అంతర్లీనంగా సమైక్య భావన వుందని, కలిసి వుండాలన్న తహ-తహ నిజాం కాలం నుంచే నాటుకు పోయిందని మరో రహస్యం వెల్లడి చేశారు. దరిమిలా హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విడగొట్టి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రదేశ్ లో చేర్చి విశాలాంధ్ర ఏర్పాటు చేశారని, అప్పట్లో తెలంగాణ జిల్లాలతో సహా అందరూ "విశాలాంధ్ర" కు అనుకూలంగా తీర్మానం చేశారని బల్ల గుద్ది చెప్పడం మరో విశేషం. "తెలుగు తల్లి గర్భ సంచిలోంచి సమైక్యత వాదం పుట్టుకొచ్చింది" అని, దానికి తాను బలం చేకూరుస్తున్నానని (అందుకే తాను అవతరించినట్లు) గొప్పలు చెప్పుకున్నారు. ఇక ఇక్కడ నుంచి వాద-ప్రతివాదనలు వేడెక్కాయి. సీమాంధ్ర ప్రాంతం వారు తమ వ్యాపార లావాదేవీలను కాపాడుకోవడానికి డిసెంబర్ తొమ్మిది తర్వాత సమైక్య వాదన పుట్టుకొచ్చిన విషయం వాస్తవం కాదా అని లగడపాటిని వివరణ అడుగుతే, దానికి సమాధానం ఇవ్వకుండా, పెద్దమనుషుల ఒప్పందం ఏ విషయంలోనూ, ఎప్పుడూ (ఒక్క ఉపముఖ్యమంత్రి విషయంలో తప్ప) ఉల్లంఘన జరగలేదని మరో వితండ వాదన తెర పైకి తెచ్చారు. రాజగోపాల్ ఎప్పుడైతే అలా వర్తమాన చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయడం మొదలెట్టారో తెలంగాణ వుద్యమం గురించి ఆయనకు కొంత వివరించడం మంచిదని ఆ దిశగా తన వాదనను వినిపించారు సీరియస్ గా అమర్.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన నాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదానికి శ్రీకారం చుట్టబడిందని, తమను-తమ ప్రాంత ప్రజలను తెలంగాణే తరులు దోపిడీకి గురిచేస్తారని, తమ సామాజిక-సాంస్కృతిక-భాషా విలువలను ఇతర ప్రాంతాల "తెలుగు వారు" ఎద్దేవా చేస్తారని, తెలంగాణ కావాలని కోరుకున్న పలువురు ఏనాడో అభిప్రాయపడ్డారని, అయినా "విశాలాంధ్ర" ఏర్పాటు జరిగిందని, ఆ నిర్ణయంలో భాగంగానే హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, అది జరిగి ఐదు దశాబ్దాలు గడిచినా, కారణాలు ఏమైనా-సహేతుకమైన వైనా, కాకపోయినా-తెలంగాణ ప్రాంత వాసులందరికి కాకపోయినా, చాలామందికి, విడిపోయి, "తెలంగాణ" రాష్ట్ర ఏర్పాటు జరిగి, ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలోనే వుంటూ, అన్నదమ్ములలాగా మెలుగుతే మంచిదన్న భావన మటుకు బలంగా నాటుకు పోయిందని మరొక్కమారు చరిత్రను గుర్తుచేశారు అమర్. 1969 లో ఉవ్వెత్తున లేచిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం గురించి, 1970 నాటి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం గురించి, 350మంది తెలంగాణ ప్రాంతం వారు మరణించిన సంగతి వివరిస్తూ, అమర్ గత 30-40 సంవత్సరాల కాలంలో ఇంత జరుగుతున్నా, లగడపాటి లాంటి సమైక్యవాదులు, ఇరు ప్రాంతాల ప్రజలు కలిసి వుండాలన్న భావనను ముందుకు తీసుకెళ్లడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయకపోగా, రెచ్చగొట్టే చర్యలెన్నో చేపట్టారన్నారు. ఒకవేళ కలిసుంటే బాగుంటుందేమో అనుకునే కొంత మందిలో కూడా అ భద్రతా భావాన్ని పెంపొందించారని గుర్తుచేశారు. విడిపోదామన్న ఆకాంక్ష మరింత బలీయమై, ఈ రోజు గ్రామ-గ్రామానికి పాకి, ప్రతి తెలంగాణ వ్యక్తి, తమకు అన్నివిధాల అన్యాయం జరుగుతుందని ఎలుగెత్తి అరుస్తుంటే, ఈ సమైక్యవాదులు ఏమని నచ్చచెప్తారని ప్రశ్నిస్తే దానికి సమాధానం రాజగోపాల్ దగ్గర్నుంచి రాలేదు.

ఇరు ప్రాంతాలు విడిపోవాలని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరగాలని కోరుతూ అనేకానేక పాటలు-గేయాలు-జానపదాలు-నాటకాలు వెలువడ్డాయని, సెమినార్లు నిర్వహించబడ్డాయని, కలిసుండాలన్న సమైక్యతా వాదులు ఇలాంటివి చేసిన దాఖలాలు ఒక్కటైనా ఎందుకు లేవని దళిత నాయకుడు ప్రభాకర్ ప్రశ్నిస్తే దానికీ జవాబు రాలేదు లగడపాటి నుంచి. ఎన్నికల్లో అన్ని పార్టీలు తెలంగాణ ఇస్తామని ప్రకటించ లేదా అని నిలదీస్తే అవాక్కై పోయారు పాపం. ఇక ఇలా కాదను కొన్న లగడపాటి మరో వితండవాదాన్ని-ఖలిస్తాన్ ఉద్యమాన్ని ప్రస్తావించి చర్చలో పాల్గొన్న వారితో పాటు చూస్తున్న మాలాంటి వారి ఆగ్రహానికి కూడా గురయ్యారు. పంజాబ్ రాష్ట్రం నుంచి ఖలిస్తాన్ విడిపోయి ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఒకటేనని పోల్చడంతో ఆయనకు ఘాటుగా సమాధానం చెప్పాల్సి వచ్చింది.

ఖలిస్తాన్ తో తెలంగాణ ఉద్యమాన్ని పోల్చడాన్ని తీవ్రమైన తప్పుగా పరిగణించారు అమర్. భారత దేశాన్నుంచి విడిపోవాలన్న ఖలిస్తాన్ ఉద్యమానికి, భారత దేశంలోనే వుండాలన్న తెలంగాణ ఉద్యమానికి వ్యత్యాసం తెలుసుకోలేక పోవడం రాజగోపాల్ లాంటి వారు చేస్తున్న కుట్రలో భాగమే అని, ఇలాంటి వాదనలు రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడానికి ఎలా దోహదపడ్తాయని, ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్న తెలంగాణ ప్రజలను సీమాంధ్రులు తమ సరసకు తెచ్చుకునే ప్రయత్నం ఇదేనా అని ఎదురుదాడికి దిగితే తప్పించుకునే మార్గం కూడ కనపడలేదు లగడపాటికి ఆరోజు జరిగిన చర్చలో.

చివరగా:
"ఖలిస్తాన్-తెలంగాణ ఉద్యమాలు ఒకరకమైనవి కావు లగడపాటి గారు. ఖలిస్తాన్ ఉద్యమం ఎందుకు జరిగిందో చదువుకుని హోమ్ వర్క్ చేసి మరీ చర్చల్లో పాల్గొనండి రాజ్ గోపాల్ గారూ..."

"రెండు సార్లు పార్లమెంట్ కు ఎన్నికైన వాళ్లు మాట్లాడే పద్ధతి ఇదేనా? ఆలోచించండి !"

"రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచేందుకు లగడపాటి లాంటి సమైక్యతా వాదులు ఏం చేశారు? ఎటువంటి భరోసా ఇచ్చారు? ఎన్ని రకాల చులకన-గేలి చేశారు?"

"ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పక్కదారి పట్టించే ’బూచి’ ని చూపించకండి !"

"ఎన్నికల్లో గెలుపు-ఓటములు ఉదాహరణలుగా తీసుకుని తెలంగాణ వాదనను బలహీనంగా చిత్రించకండి !"