Tuesday, April 20, 2010

I-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-1): వనం జ్వాలానరసింహారావు

అంతర్మధనం-1
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలానరసింహారావు

గత అరవై సంవత్సరాలలో, స్వతంత్ర భారత దేశ చరిత్రలో అధికారంలో వున్న ఏ ప్రభుత్వమైనా తీసుకున్న విధాన నిర్ణయాలన్నింటికన్నా అత్యంత కీలకమైంది గా భావించదగింది బహుశా "లాభాపేక్ష రహిత ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం" అని ఘంటాపథంగా చెప్పొచ్చు. సరళీకృత ఆర్థిక విధానం కన్నా, ప్రపంచీకరణ కన్నా, కమ్యూనికేషన్ విప్లవం కన్నా... అలాంటి మరెన్నో విధానాలకన్నా క్రమేపీ అన్ని రంగాలలో ఆదరణ తెచ్చుకుంటున్నదీ ప్రక్రియ. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆలోచనా విధానానికి అనుగుణంగా రూపుదిద్దుకున్న ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియను, లాభాపేక్ష రహిత ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియగా ఆరోగ్య వైద్య రంగంలో ప్రవేశపెట్టి, ఊపిరి పోసి, ఊతమిచ్చి, కొత్త భాష్యం చెప్పి యావత్ భారతదేశానికి మార్గదర్శకంగా మలిచిన ఘనత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిగారి దే. అదే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన "రాజీవ్ ఆరోగ్య శ్రీ" పథకం. ఆ గొడుగు కింద అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న 108 అత్యవసర సహాయ సేవలు రాజశేఖరరెడ్డి గారికి మరీ ప్రీతిపాత్రమైనది. ఆరోహణ-అవరోహణల మధ్య మహాప్రస్థానం సాగిస్తున్న 108 అత్యవసర సహాయ సేవలు, ఈ రోజున, ఒక వైపు పది రాష్ట్రాలలోని నలభై కోట్ల జనాభాకు లాభం చేకూరుస్తుండగా, మరోవైపు ఆ సేవల ఆవిర్భావం జరిగి, అఖిల భారతావనికి మార్గదర్శకంగా నిలిపిన ఆంధ్ర ప్రదేశ్ లో, రాజశేఖరరెడ్డి గారు మరణించిన అచిరకాలంలోనే అనేకానేక కారణాలవల్ల అవే సేవలు ఒడిదుడుకుల్లో పడుతున్నాయన్న మీడియా కథనాలు అత్యవసర సహాయ సేవల లబ్దిదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.

రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ల మన్ననలను-అభినందనలను పొంది, కేంద్రప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వారు నియమించిన అఖిల భారత వైద్య బృందం వారి అధ్యయనంలో "కరుణామయి-కారుణ్య దేవతగా" అభివర్ణించబడిన "108 అంబులెన్స్" ఆవిర్భావం, పరిణామక్రమం, ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు ఆసక్తికరమైనవే కాకుండా పరిశోధకులకు అధ్యయనపరమైనవి కూడా. ప్రపంచంలోనే ప్రప్రధమంగా సత్యం రామలింగరాజు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గార్ల పుణ్యమా అని లక్షలాది ప్రాణాలను కాపాడడానికి ఉద్దేశించబడిన ఈ అత్యవసర సహాయ సేవలు "ఏ ఒక్కరి సొత్తో-సొమ్మో" కాదు-కాకూడదు. దాని ఆరంభ దశలో, అభివృద్ధి చెందుతున్న దశలో, ఉఛ్చ స్థాయికి చేరుకుని ఇబ్బందులకు లోనయినప్పటికీ సీ.ఇ.ఓ వెంకట్ సంస్థను-సేవలను కొనసాగించడానికి కష్టపడుతున్న దశలో, సేవలందిస్తున్న పది రాష్ట్ర్రాల్లో ఒక రాష్ట్ర్రం విడిపోయే ప్రయత్నం చేస్తున్న దశలో అనుబంధం వున్న వ్యక్తిగా, ఆందోళన చెందుతూ నాకు తెలిసిన వాస్తవాలను నా బ్లాగ్ లో వారం-వారం పొందుపరుస్తున్నాను.

జనవరి 8, 2009 రోజు నాకింకా జ్ఞాపకముంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు ఆ రోజున అన్న ప్రతి మాటా-ఇచ్చిన భరోసా పదే-పదే జ్ఞప్తికొస్తూనే వున్నాయి. ఆ క్రితం రోజున ఇ.ఎం.ఆర్.ఐ వ్యవస్థాపక అధ్యక్షుడు భైర్రాజు రామలింగ రాజు గారు, సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో జైలుకెళ్లాల్సి వచ్చింది. తక్షణమే 24 గంటల వ్యవధిలో, వైద్య-ఆరోగ్య శాఖ అధికారుల సమక్షంలో, ఇప్పటి ముఖ్యమంత్రి-అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య హాజరుకాగా, రాజశేఖరరెడ్డి, ఇ.ఎమ్.ఆర్.ఐ అధికారులను పిలిపించి 108 అత్యవసర సహాయ సేవలందించే విషయంలో నిశితంగా సమీక్షించారు. తప్పులెంచడానికి గాని, మమ్మల్ని మందలించడానికి గాని జరిపిన సమీక్ష కాదది. రాజు గారు వాస్తవానికి అప్పటికే ఇ.ఎం.ఆర్.ఐ చైర్మన్ పదవికి రాజీనామా ప్రకటించడంతో, సీ.ఇ.ఓ వెంకట్ చెంగవల్లి-ఆయన లీడర్షిప్ బృందం అయోమయానికి గురై, సమీప భవిష్యత్ లో అత్యవసర సహాయ సేవలను అందించడంలో ఎలాంటి ఒడిదుడుకులకు లోను కావాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్న సందర్భమది.

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిగారికి ఇష్టమైన పథకాలన్నింటిలో కి అత్యంత ప్రీతిపాత్రమైన "రాజీవ్ ఆరోగ్య శ్రీ" లో భాగమైన 108 అత్యవసర సహాయ సేవలను అమలుపర్చే ఇ.ఎం.ఆర్.ఐ సంస్థలో పనిచేస్తున్న సందర్భంగా ఆయన్ను చాలా సార్లు కలుసుకున్నాను. ప్రతి సమావేశంలోనూ, ఆయన వ్యక్తిత్వం, అంకిత భావం, ఆయన చెప్పే ప్రతి మాటల్లోనూ ప్రస్ఫుటంగా కనిపించేది. ఆ సమావేశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల-అధికారులకిచ్చిన ఆదేశాల వల్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ-ఆ రాష్ట్రంలో అమలవుతున్న పథకం స్ఫూర్తితో ఇతర రాష్ట్రాలలోనూ లక్షకు పైగా ప్రాణాలు కాపాడబడ్డాయి. భవిష్యత్ లో లక్షలాది ప్రాణాలను రక్షించడానికి దోహద పడ్డాయి. యావత్ భారత దేశానికే ఆదర్శ ప్రాయంగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆరంభమయిన 108 అత్యవసర సహాయ సేవలు, ప్రస్తుతం పది రాష్ట్రాలకు పాకాయి. కేవలం 70 అంబులెన్సులతో ప్రారంభమై, రాజశేఖరరెడ్డి నిర్ణయాల వల్ల, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు పథకం అమలు చేసేందుకు ప్రపంచంలోనే రికార్డు స్థాయికి చేరే విధంగా 800 కి పైగా అంబులెన్సులను ప్రభుత్వం సమకూర్చింది. అలా జరగడానికి ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమే కీలకమనాలి.

జనవరి 8, 2009 న జరిగిన సమీక్షా సమావేశానికి మా సీ.ఇ.ఓ తో కలిసి ఎప్పటిలాగే నేనూ వెళ్లాను. మిన్ను విరిగి మీద పడ్డా-ఎటువంటి పరిస్థితులెదురైనా ఆ సేవలు ఆగిపోకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలను అటు ప్రభుత్వాధికారులకు-ఇటు మాకూ ఇచ్చారాయన. అవసరమైతే, ప్రభుత్వం అప్పటివరకూ భరిస్తున్న 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి నూరు శాతానికి పెంచడానికి సిద్ధమేనన్నారు. యాజమాన్య వాటాగా (ప్రయివేట్ భాగస్వామ్యంగా) అప్పటివరకూ ఇ.ఎం.ఆర్.ఐ భరిస్తున్న ఖర్చులను కూడా, తప్పదను కుంటే ప్రభుత్వమే సమకూరుస్తుందని హామీ ఇచ్చారాయన. అయితే అప్పట్లో ఆర్థిక మంత్రిగా వున్న రోశయ్య గారు, పూర్తిగా ప్రభుత్వమే భరించడమంటే, అది ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు విరుద్ధమవుతుందని, విమర్శలకు దారితీస్తుందని సూచించారు. ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్ చెంగవల్లి కూడా, ప్రయివేట్ భాగస్వామ్యం కింద అప్పటివరకూ భరిస్తూ వస్తున్న ఖర్చును ఏదో విధంగా సమకూర్చుకునేందుకు శాయ శక్తులా కృషి చేస్తామనీ, దానికొరకు నాలుగు నెలల సమయం కావాలనీ కోరారు. ప్రయివేట్ భాగస్వామ్య వాటా ఖర్చు కింద తక్షణం ఎంత కావాల్సి వస్తుందని వెంకట్ ను అడిగారు ముఖ్యమంత్రి. జవాబుగా ఆయన అయిదు కోట్లన్నారు. నిర్ణయాన్ని వాయిదా వేయడానికి ముందు రాజశేఖర రెడ్డి గారన్న మాటలు నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనం అనాలి. "రోశయ్య గారూ, పోనీ ఒక పని చేద్దాం. ప్రభుత్వ పరంగా ఇవ్వడం విధానానికి విరుద్ధమన్న విమర్శ వస్తుందని మీరు భావిస్తే, మనమే ఎవరన్నా తెల్సినవాళ్ల ద్వారా ఇ.ఎం.ఆర్.ఐ కి అవసరమైన ఆ అయిదు కోట్ల రూపాయలు ఏర్పాటు చేద్దాం" అన్నారు. ఎంత మంచి మనసాయనదో ఆ మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు.

ఎన్నికల రణరంగంలో తలమునకై వున్నా, ఎప్పటికప్పుడు, 108 అత్యవసర సహాయ సేవలందించే సంగతి మరిచిపోలేదాయన. ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి-మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయగానే, మర్నాడు, ఇజ్రాయిల్ దేశానికి పోవడానికి ముందర మే నెల చివరి వారారంభంలో తిరిగి సమీక్ష జరిపారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత సీ.ఎం చేసిన మొట్ట మొదటి సమీక్షా సమావేశం అదే. 108 సేవలు తమ పార్టీ గెలుపుకు కారణమయ్యాయని, 108-104 సేవలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశానని కూడా మాకు చెప్పారప్పుడు. "ఏం జరుగుతుంది వెంకట్? ఎవరన్నా ప్రయివేట్ భాగస్వామి దొరికాడా" అని సమీక్ష మొదలవుతూనే అడిగారు. దైవమే ఆయన నోటి నుంచి ఆ ప్రశ్న వేయించిందని భావించాం మేం.

వాస్తవానికి మా పరిస్తితి అప్పటికే అగమ్య గోచరంగా వుంది. వివరాల్లోకి పోయే ముందర ప్రస్తుతానికి క్లుప్తంగా ప్రస్తావిస్తానవి. రామలింగరాజు గారి స్థానంలోకి ఎవరినన్నా "దాత" ను సంపాదించుకునేందుకు వెంకట్ గారు పడని పాట్లు లేవు, ఎక్కని-దిగని "గడప" లేదు. ఏ పుట్టలో ఏ పాముందోనని అన్ని పుట్టలని స్పర్శించాడాయన. మధ్యలో రాజుగారు ఏర్పాటు చేసిన "బోర్డ్ మెంబర్లు" అయిదారుగురు తప్ప ఒక్కరొక్కరే రాజీనామా చేశారు. నిర్వహణ ఖర్చులెలానో ప్రభుత్వ నిధులతో సర్దుకు పోగలిగినా, యాజమాన్య పరంగా నెలనెలా చెల్లించాల్సిన సీనియర్ల జీతాలు అప్పటికి మూడు నెలలుగా చెల్లించడం సాధ్య పడలేదు. అయినా వెంకట్ గారి నాయకత్వంలో నమ్మకమున్నందున ఒకారు కూడా సంస్థను వదిలి పోలేదు. అయితే కొందరిలో నిరాశ చోటు చేసుకో సాగింది. ఈ నేపధ్యంలో సరిగ్గా మే నెల 23, 2009 చావు కబురు చల్లగా అందింది వెంకట్ గారికి. అప్పటివరకూ ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ బాధ్యతలు స్వీకరిస్తారనుకున్న ముంబాయికి చెందిన "పిరమిల్" చేతులెత్తేశారు. సంస్థ లోని కొన్ని లోటుపాట్లను ఎత్తిచూపిస్తూ (వివరాలు ముందు ముందు తెలుసుకుందాం) తనకు రాజు గారి స్థానంలోకి రావడం సాధ్యపడదని తేల్చి చెప్పారు. ఇక మిగిలిన ఆశ హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త జీ.వి.కృష్ణారెడ్డి గారు. అయితే అప్పటివరకూ ఆయన ఎటువంటి ఆశాజనకమైన సంకేతాలను ఇవ్వలేదు. అయినా వెంకట్ గారికి-ఆయన బృందంలోని మాకు ఆశ చావలేదు. వెంకట్ గారి బాధను అర్థం చేసుకున్న నాకు ముఖ్యమంత్రి దగ్గరనుంచి కబురొస్తే బాగుంటుందని అనిపించింది. అనుకున్నట్లే ఆయన కార్యదర్శి-ఇ.ఎం.ఆర్.ఐ సబ్జెక్ట్ ను చూస్తున్న స్వర్గీయ సుబ్రహ్మణ్యం గారి దగ్గరనుంచి ముఖ్యమంత్రిగారి సమీక్షకు సంబధించిన పిలుపొచ్చింది వెంకట్ గారికి. అదే ఇజ్రాయెల్ వెళ్లే ముందర సీ.ఎం జరిపిన సమావేశం.

సంస్థా పరంగా-యాజమాన్య నిర్వహణ పరంగా ఇ.ఎమ్.ఆర్.ఐ ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులను అర్థం చేసుకున్న రాజశేఖర రెడ్డి, జీ.వీ.కె సంస్థల అధ్యక్షుడికి స్వయంగా ఫోన్ చేసి, ప్రయివేట్ పరంగా లోగడ సత్యం కంప్యూటర్స్ చైర్మన్ ఇచ్చిన విధంగానే ఇ.ఎం.ఆర్.ఐ కి నిధులను సమకూర్చమని చెప్పారు. ఆ రోజే మేము ఆయనను కలుసుకోవడం, ఆయన ఒప్పుకోవడం. ఇ.ఎం.ఆర్.ఐ దరిమిలా జీ.వీ.కె ఇ.ఎం.ఆర్.ఐ గా మార్పు చెందడం జరిగింది.

ఇంతవరకూ బాగుంది. ఇది జరిగి ఏడాది కావస్తుంది. ఆ సమావేశంలో ప్రస్తుత ముఖ్యమంత్రితో సహా సంబంధిత అధికారులందరూ వున్నారు. ఆ తర్వాత రాజుగారి స్థానంలోకి జీ.వీ.కె ప్రవేశించారు. అంటే ఎటువంటి ఇబ్బందికి 108 అత్యవసర సహాయ సేవలు గురి కాకూడదనే కదా ! మరెందుకు మీడియాలో ఈ కథనాలొస్తున్నాయి? ప్రభుత్వ నిధులు సక్రమంగా అందడం లేదనుకోవాలా?జీ.వీ.కె అనుకున్న రీతిలో సహాయం అందించడం లేదా? దివంగత ముఖ్యమంత్రికి అత్యంత ప్రీతిపాత్రమైన అత్యవసర సహాయ సేవలు ఒడిదుడుకుల్లో పడడం నిజమేనా?ఒడిదుడుకులకు కారణాలు ఏమై వుండవచ్చు?

వివరాల్లోకి పోవాలంటే వారం వారం చదవాల్సిందే !

6 comments:

  1. 108 ద్వారా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి అందిన వైద్య సేవలు, మామూలు ప్రజలకు అందిన సేవలు గురించి చెప్పుకోవాలంటే అంతు లేదు. నేను స్వయంగా రెండు సంఘటనలు చూసాను. ఒక సారి మా ఇంటి దగ్గిర జరిగిన ఓ చిన్న రోడ్డు ప్రమాదం గురించి ఫోన్ చేసిన ఇరవై నిముషాల్లో వచ్చేశారు. దెబ్బ తగిలిన మనిషికి ఫస్టు ఎయిడ్ చేసి హాస్పిటల్ కు తీసుకు వెళ్లారు. మరోసారి నడికుడి స్టేషన్ లో ఓ పెద్దాయనకు ఊపిరాడకపోతుంటే వెంటనే వచ్చి రైల్లోనుంచి దింపి తీసుకు వెళ్ళారు. ఇట్టి సంస్థను కాపాడడానికి కార్పొరేటు సంస్థలు ముందుకు రాక తప్పదు. వాళ్ళు కూడా సోషల్ రెస్పాన్స్ బిలిటీ అంటూ చెప్తుంటారు కదా!

    ReplyDelete
  2. Thank You... But How do we go about this?

    ReplyDelete
  3. రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్పొరేట్ ఆసుపత్రుల జేబులు నింపటానికే అని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తుంటాయి. వాళ్ళు ఉనికి కోసం ఇలాంటి ఎన్నిమాటలు చెప్పినా ఈ పథకం మాత్రం పేదవాడికో వరం. కాకపోతే దాన్ని నిర్వహణకు బాధ్యులైన అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ఇంకా చాలా మందికి సేవలు అందించగలదు.

    రోడ్డు మీద విషం తాగి ఒక వ్యక్తి పడిపోయి ఉంటే నేను 108 కి ఫోన్ చేసి అతన్ని సకాలంలో హాస్పిటల్ కి చేరేలా చేశాను.

    ReplyDelete
  4. Venkat ChangavalliApril 22, 2010 at 6:14 PM

    Dear Jwala garu,

    Excellent initiative. Congratulations! Very well captured.

    Regards
    Venkat

    ReplyDelete
  5. Bhandaru Ramachandra RaoApril 22, 2010 at 6:16 PM

    Dear Narasimharao garu,
    Good beginning.
    B.RAMACHANDRARAO

    ReplyDelete