Monday, July 8, 2013

1968 నాటి "ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం": వనం జ్వాలా నరసింహారావు

1968 నాటి 
"ప్రత్యేక తెలంగాణ 
రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం"
వనం జ్వాలా నరసింహారావు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కేవలం "భావించడం" మాత్రమే కాకుండా, దాన్ని సాధించడం కొరకు, రకరకాల మార్గాలను ఎంచుకోవడం ఆరంభమయింది 1956 నుంచే. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు మూడూ, ఆంధ్ర ప్రదేశ్ లో కలిసున్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన రాయితీలను తెలంగాణ ప్రాంతం వారికి మాత్రమే చట్ట రీత్యా కలిగించడం ద్వారా, తెలంగాణ వే()ర్పాటు నినాదాన్ని, పాలక పక్షం విజయవంతంగా పక్కదారి పట్టించగలిగింది మొదట్లో. పెద్దమనుషుల ఒప్పందమనీ, ఫజలాలీ సంఘం నివేదికనీ, ముల్కీ నిబంధనలనీ రకరకాల మార్గాలద్వారా తెలంగాణ కోరుకునే వారిలో కొన్ని ఆశలు రేకెత్తించి, కొన్నేళ్లు ఉద్యమాన్ని బలహీనపరచగలిగింది (కాంగ్రెస్) ప్రభుత్వం. తెలంగాణ ప్రాంతానికి వలసవచ్చిన కొందరు తెలంగాణే తరులు , ఎప్పుడైతే తమ "పరోక్ష దోపిడీ" విధానాన్ని "ప్రత్యక్ష దోపిడీ" విధానంగా మార్చడం మొదలయిందో, అప్పుడే దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజలలో "దోపిడీకి ఎదురుతిరగాలన్న కాంక్ష బలీయం కావడం మొదలయింది. క్రమేపీ ఉద్యమరూపంగా మార్పుచెంద సాగిందా కాంక్ష. బంగారు భవిష్యత్ పై కొండంత ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రాంత విద్యార్థులకు, తమ ఆశలు అడియాశలవుతాయేమోనన్న భయం పట్టుకుంది. ఆ భయంలోంచే ఉద్యమం రూపుదిద్దుకోవడం మొదలయింది. ఆ ఉద్యమ బీజమే, నాలుగు దశాబ్దాల క్రితం (మా) ఖమ్మం జిల్లాల్లో-ఖమ్మం, కొత్తగూడెం పట్టణాలలో, ఆరంభమైన "ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం". ఆ బీజమే "ఇంతై-ఇంతింతై-వటుడింతై" అన్న చందాన ఒక వట వృక్షమైంది. బలమైన గాలి వీచినప్పుడు కొమ్మలు విరిగినా, తిరిగి, బలం పుంజుకొని, ఉద్యమాన్ని సజీవంగా వుంచి తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా దూసుకుపోతుందానాటి-నేటి ఉద్యమం. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందన్న నమ్మకం కలిగినట్లే కలిగి, కనుమరుమగుతూ కవ్విస్తున్నది.

 1968 లో తెలంగాణ ప్రజా పోరాటానికి "రక్షణల ఉద్యమం" పేరుతో ఖమ్మం జిల్లా పాల్వంచ థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రంలో అంకురార్పణ జరిగింది. కొత్తగూడెం సింగరేణి సంస్థలో పనిచేస్తుండే ఒక చిరుద్యోగి సర్వీసుకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంలో అతడు తెలంగాణ వాడు కావడంవల్ల జరిగిన తీరని అన్యాయంవల్ల, ఆయన సహోద్యోగులందరూ కలిసి తమ న్యాయమైన హక్కులకొరకు పోరాటం సాగించారు. ఆ పోరాటమే చిలికి చిలికి గాలివానగా మారి, జిల్లా అంతటా పాకి, ఖమ్మం పట్టణం చేరుకుంది. ఖమ్మం స్థానిక కళాశాలలో చదువుకుంటున్న "రవీంద్రనాథ్" (మా జూనియర్) అనే విద్యార్థి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ "గాంధి చౌక్" లోని గాంధి విగ్రహం దగ్గర ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. నాకు తెలిసినంతవరకు అతడే మొట్టమొదటి సారిగా తెలంగాణకొరకు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నవ్యక్తి. ఆ నేపధ్యంలో నాకు గుర్తున్నంతవరకు, హక్కుల రక్షణ సమితి పక్షాన ఒక ప్రతినిధి వర్గం ముఖ్యమంత్రిని కలుసుకుని విజ్ఞాపన పత్రం సమర్పించారు. వారి విజ్ఞాపనకు ముఖ్యమంత్రి స్పందించిన తీరు సరైందిగా లేదని భావించిన ప్రతినిధి వర్గంలోని ప్రముఖులు తెలంగాణ విడిపోవడమే సమస్యకు పరిష్కారంగా భావించారు.

కొత్తగూడెం-ఖమ్మంలో ఉద్యమం మొదలవడానికి సుమారు ఆరు నెలల క్రితం, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోని "" హాస్టల్లో, నాటి విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి (నా కంటే ఏడాది సీనియర్) రూమ్ లో, మాజీ లోక్ సభ సభ్యుడు అప్పట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి, స్వర్గీయ మల్లికార్జున్ తో సహా పలువురు విద్యార్థి నాయకులు సమావేశమయ్యారు. "విద్యార్థి కార్యాచరణ కమిటీ" పేరుతో ఒక సంస్థను నెలకొల్పి ప్రత్యేక తెలంగాణ కొరకు ఉద్యమించాలని తీర్మానించారు. వాస్తవానికి శ్రీధర్ రెడ్డి, భవిష్యత్ లో రూపు దిద్దుకోనున్న, బ్రహ్మాండమైన వేర్పాటు ఉద్యమానికి తొలి రాష్ట్ర స్థాయి నాయకుడనాలి.

ఆయన నాయకత్వంలోని విద్యార్థులందరూ స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని కలిసి, ఉద్యమానికి నాయకత్వం వహించమని కోరారు. వందేమాతరం రామచంద్ర రావు వేసిన ఎన్నికల పిటీషన్ లో, ఉన్నత న్యాయస్థానం తీర్పు చెన్నారెడ్డికి వ్యతిరేకంగా వచ్చిన నేపధ్యంలో, ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడైనందున, తన రాజకీయ పునరావాసానికి ప్రయత్నం చేస్తున్న రోజులవి. చెన్నారెడ్డి ఉద్యమానికి నాయకత్వం చేపట్టడానికి ముందే, ఉద్యమం వూపందుకోవడం-మధ్యలో ఖమ్మంలో విద్యార్థి వుద్యమం మొదలవడం, ఒకటి వెంట ఒకటి జరిగాయి. చెన్నారెడ్డి నాయకత్వం వహించడానికి పూర్వమే జరిగిన ఉద్యమంలో శ్రీధర్ రెడ్డి, బద్రి విశాల పిట్టి, మల్లికార్జున్, ఆమోస్ లాంటి ప్రముఖులు అరెస్ట్ కావడం-జైలుకెళ్లడం జరిగింది. ఆ ఉద్యమం సాగుతున్న రోజుల్లోనే మాజీమంత్రి స్వర్గీయ మదన్ మోహన్ నాయకత్వంలో "తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ " పేరుతో మరో సంస్థ ఆవిర్భవించింది. చివరకు అన్నీ కలిసి ఉమ్మడిగా ఉద్యమించాయి. ఏకమైన సంస్థలన్నీ కలిసి మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో "తెలంగాణ ప్రజా సమితి" పేరుతో బ్రహ్మాండమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపాయి.

1968 (నవంబర్-డిసెంబర్ నెలల్లో అనుకుంటా) లో జరిగిన "రక్షణల అమలు" ఉద్యమానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహాయం చేసినవారిలో అలనాటి తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు జె. చొక్కా రావు, రాష్ట్ర పంచాయితీ మండలి అధ్యక్షుడు జలగం వెంగళరావు, నూకల రామచంద్రారెడ్డి, జి. సంజీవరెడ్డి వున్నారు. వారి అనుయాయులు కొందరు అలనాటి ఉద్యమంలో పాల్గొన్నారు కూడా. క్రమేపీ టి. అంజయ్య, ఎం. ఎం. హాషిం, జి. వి. సుధాకర్ రావు, బి. రాజారాం, కె. ఆర్. ఆమోస్, ట్. సదా లక్ష్మి, ఎస్. బి. గిరి లాంటి వారు కూడా ప్రజా సమితి సమావేశాలలో చురుగ్గా పాల్గొనడం మొదలెట్టారు. కొన్నాళ్లకు కొండా లక్ష్మణ్ బాపూజి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపధ్యంలో ఉద్యమం క్రమేపీ మిలిటెంటుగా మార సాగింది. హింసాత్మకంగా మారిన ఉద్యమంలో మూడొందల మంది పైగా యువకులు, విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారు. కోదాడ, నందిగామలలో జరిగిన కొన్ని దుర్ఘటనలు నల్గొండ, వరంగల్ విద్యార్థులను రెచ్చగొట్టాయి. మొత్తం మీద అరాచకాలు ప్రబలిపోసాగాయి.

పునాదులు కదిలిన ప్రభుత్వం పోలీసుకు సహాయపడేందుకు, సైన్యాన్ని పిలిపించింది. సైనికులు పోలీసుల సహకారంతో పాశవికంగా ప్రవర్తించారని నాటి పత్రికలు పేర్కొన్నాయి. ఎందరో విద్యార్థులను, అమాయకులను జైళ్లలో నిర్బంధించారు. వేలాదిమంది తెలంగాణ ప్రజా సమితి నాయకులు, విద్యార్థి నాయకులు జైళ్లలో బంధించబడిన దరిమిలా, రెచ్చిపోయిన ప్రజలు ఉద్యమాన్ని ఉదృతం చేశారు. పరిస్థితిని అదుపులో తేవడానికి వ్యూహాత్మకంగా నాటి ప్రధాని ఇందిరా గాంధి, కొందరు తెలంగాణ ప్రముఖులతో ఢిల్లీలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆహ్వానించబడినవారిలో తెలంగాణ వాదులు డాక్టర్ చెన్నారెడ్డి (అప్పటికింకా ప్రజా సమితి నాయకత్వం స్వీకరించలేదు), కొండా లక్ష్మణ్ బాపూజి, రామచంద్రారెడ్డి, చొక్కా రావు లతో పాటు ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చే పలువురున్నారు. ప్రతిపక్షాల నాయకులను కూడా ఆహ్వానించారు. అసలు సిసలైన పలువురు తెలంగాణ ప్రజా సమితి నాయకులను పిలవలేదు. మదన్ మోహన్ జైల్లో వున్నారప్పుడు. మరోవైపు తెలంగాణ ప్రాంతమంతా సత్యాగ్రహ శిబిరాలు వెలిశాయి. సామూహిక నిరాహార దీక్షలు మొదలయ్యాయి. ఢిల్లీ సమావేశంలో ఏ అంగీకారం కుదరలేదు. ప్రధాని ఏకపక్షంగా ఒక అష్ట సూత్ర కార్యక్రమాన్ని ప్రకటించడం, దాన్ని  డాక్టర్ చెన్నారెడ్డి, రామచంద్రారెడ్డి, చొక్కా రావులు సంయుక్తంగా వ్యతిరేకించడం జరిగింది

వి. బి. రాజు చొరవతో, ఉద్యమంతో సంబంధం వున్న నాయకులతో ప్రధాని చర్చలు జరపడానికి రంగం సిద్ధమైంది. మదన్ మోహన్, వెంకట్రామరెడ్డి, ఎస్. బి. గిరి, మల్లిఖార్జున్, శ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి ప్రభృతులకు ఆహ్వానాలు అందాయి. అణచివేత విధానాన్ని, హింసా కాండను కొనసాగిస్తున్న ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రయోజనం లేదని భావించిన నాయకులు ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఈ దశలో డాక్టర్ చెన్నారెడ్డి రంగప్రవేశం చేశారు. తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించారు. అదే సందర్భంలో విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి పోటీ ప్రజా సమితిని స్థాపించి తన వ్యతిరేకతను వ్యక్త పరిచాడు. చెన్నారెడ్డి అధ్యక్ష పదవిని చేపట్టగానే, ప్రజా సమితి రాజకీయంగా బలాన్ని పుంజుకుంది. కొన్ని వనరులు కూడా చేకూర సాగాయి. ఉద్యమం కూడా తీవ్రమైంది. సాయుధ పోలీసుల రక్షణ లేకుండా ముఖ్యమంత్రి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. కొంతకాలానికి ఎన్. జీ. వోల సంఘం నాయకుడు ఆమోస్‍ను ఉద్యోగం నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సత్యాగ్రహాలు చేసి కొన్ని వందల-వేల మంది అరెస్ట్ అయ్యారు. లాఠీ చార్జీలు నిత్యకృత్యమయ్యాయి. పరిస్థితి రోజురోజుకు దిగజారిపోసాగింది. రాజధాని హైదరాబాద్‌లో కర్ఫ్యూ విధించబడింది. ఢిల్లీలో వున్న ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు చొక్కా రావును వెంట పెట్టుకుని ప్రధాని ఇందిరాగాంధి, హుటాహుటిన ఒకనాడు హైదరాబాద్ వచ్చింది. నగరంలో రాత్రికి రాత్రే పర్యటించి తెల్లవారు ఝామున ఢిల్లీ వెళ్లి పోయారు.  

కొద్ది దినాల తరువాత, ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది. దాంతో పాటే మరో విడత చర్చలకు చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ ప్రభృతులను ప్రభుత్వం ఆహ్వానించింది. చర్చలవలన ఏ ఫలితం చేకూరలేదు. ఉద్యమం నిలుపు చేయాలని మొరార్జీ దేశాయ్, వై. బి. చవాన్ ప్రభుత్వ పక్షాన కోరడం, అది అసంభవమని చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ లు స్పష్టం చేయడం జరిగింది. హైదరాబాద్ తిరిగి వచ్చిన నాయకులకు ఘన స్వాగతం లభించింది. ఇదిలా వుండగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జి. వెంకట స్వామిపై హత్యా ప్రయత్నం జరిగింది. ఆ హత్యా ప్రయత్నాన్ని నిరసిస్తూ ఆ మర్నాడు తెలంగాణ అంతటా సంపూర్ణ హర్తాళ్ జరిగిందిడాక్టర్ జి. ఎస్. మెల్కోటే, సంగం లక్ష్మీబాయి తమ రాజీనామా లేఖలను ప్రజా సమితి అధ్యక్షుడికి అందచేశారు. అదే రోజు రాత్రి నారాయణ గుడాలోని స్నేహితుడు డాక్టర్ సుదర్శన రెడ్డి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న డాక్టర్ చెన్నారెడ్డిని ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్టు చేసి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించసాగారు పోలీసులు. చెన్నారెడ్డితో పాటే, ఏడెనిమిది మంది శాసన సభ సభ్యులను, సుమారు పాతిక మంది ఇతర ప్రముఖులను కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. మరుసటి రోజునుంచి వందల సంఖ్యలో విద్యార్థి నాయకులను ప్రజా సమితి కార్యకర్తలను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. పోలీసులు చెన్నారెడ్డిని తీసుకెళ్తున్న కారును సూర్యాపేటలో ఆందోళనకారులు అడ్డగించారు కొద్ది సేపు. చెన్నారెడ్డి స్థానంలో మదన్ మోహన్ ప్రజా సమితి అధ్యక్షుడయ్యాడు. ఆయనను కూడా అరెస్ట్ చేసిన తరువాత సదా లక్ష్మి ఆ బాధ్యతలు నిర్వహించారు.

ఇది జరిగిన కొన్నాళ్లకు, ఉద్యమం ఇంకా ఉదృతంగా కొనసాగుతున్న నేపధ్యంలోనే, బి. వి. గురుమూర్తి మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరి కొందరి మంత్రుల రాజీనామాను ఆపు చేసేందుకు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వ్యూహాత్మకంగా తన రాజీనామాను అధిష్టానానికి సమర్పించారు. ఆ రాజీనామాను తమ విజయంగా భావించిన లక్షలాది మంది తెలంగాణ వాదులు రోడ్ల పైకొచ్చి పండుగ చేసుకున్నారు. ఊరేగింపులు, సభలు, సమావేశాలు జరుపుకున్నారు. పరిస్థితి పోలీసుల అదుపు తప్పే స్థాయికి చేరుకుంది మరో మారు. ముఖ్యమంత్రి తరహాలోనే కొందరు తెలంగాణ మంత్రులు కూడా రాజీనామా చేశారు. రాజీనామా అయితే చేశాడు కాని, పదవిలో కొనసాగడానికి కాసు చేయని ప్రయత్నం లేదు. అధిష్టానం దూతలుగా హైదరాబాద్ వచ్చి, ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ పేరుతో కాసుకు మద్దతు కూడగట్టారు కామరాజ్ నాడార్, నిజలింగప్పలు. బ్రహ్మానంద రెడ్డి కొనసాగాడు. ఆయన మంత్రివర్గంలో జె. వి. నరసింగ రావుకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు.

ఆ తరువాత జరిగిన శాసన సభ సమావేశాలలో, గవర్నర్ ఖండూభాయ్ దేశాయ్ ప్రసంగం, అర్థాంతరంగా ముగిసింది. జై తెలంగాణ నినాదాలతో సభ మార్మోగింది. సమావేశాలు జరుగుతుండగా, కొందరు విద్యార్థులు అసెంబ్లీ ఆవరణలో ప్రవేశించి, మంత్రులపై కోడి గుడ్లు, టొమాటోలు విసిరారు. మరో సంఘటనలో ఒక యువకుడు పోలీసు కంట్రోల్ రూమ్‌పైన బాంబు విసిరాడు. అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న నాయకుల విడుదలకు న్యాయ పరమైన చర్యలు తీసుకున్నారు. చివరకు డిటెన్యూలందరినీ విడుదల చేయాలని హైకోర్టు తీర్పిచ్చింది. దరిమిలా ఉద్యమ ఉదృతి అనేక కారణాల వల్ల తగ్గింది.


1971 సాధారణ ఎన్నికల్లో "టీ పీ ఎస్" పేరుతో రాజకీయ పార్టీగా బరిలోకి దిగిన తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణలోని అన్ని స్థానాలకు పోటీచేసి, 11 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రజాభిప్రాయం తెలంగాణ ఏర్పాటేనని స్పష్టంగా ఓటర్లు తెలియచేశారు. అప్పుడే నైతికంగా తెలంగాణ ఏర్పాటు జరిగిపోయుండాల్సింది. కాని జరగలేదు. నాయకత్వం మరో మారు ఉద్యమానికి వెన్ను పోటు పొడిచింది. నాటి ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చెన్నారెడ్డి తన ప్రజా సమితిని విలీనం చేశారు. తెలంగాణ ఏర్పడడానికి బదులు మరికొన్ని రాయితీలను ఉపశమనంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఉవ్వెత్తున లేచిన ఉద్యమం మోసంతో అణచబడింది. ఉద్యమంలో పాలుపంచుకొని రాజకీయ లబ్ది పొందిన పలువురు నాయకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పదవులనుభవించారు-ఇంకా అనుభవిస్తూనే వున్నారు. కొంద రైతే వారసత్వంగా అనుభవిస్తున్నారు. కాకపోతే వారిలో కొందరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే తమ ఉనికిని కాపాడుకునేందుకు, ప్రజలు తమను మరిచిపోకుండా వుండేందుకు, అడపాదడపా "తెలంగాణ" అంటూ గొంతు చించుకుంటుంటారు. ఇటీవల పదవులకు రాజీనామా చేస్తున్న కొందరు కాంగ్రెస్ నాయకులు "ఆ కోవకు" చెందినవారే. వారికి కావాల్సింది "రాజకీయ భద్రత" గాని, తెలంగాణ ఏర్పాటు కాదు.

10 comments:

  1. ఉప ముఖ్య మంత్రి పదవి లభిస్తున్దనుకున్న ఓ నాయకురాలు డిసెంబెర్ 9 న తెలంగాణా ప్రకటన రాగానే .. హైదరాబాద్ లో జరిగిన విజయోత్సవ సభలో బోనం ఎత్తుకొని హడావుడి చేశారు .. ఆ తరువాత ముఖ్యమంత్రి కనుసన్నల్లో మేడల సాగారు .. మల్లి తెలంగాణా వస్తుందనే నమ్మకం కలగా గానే ఇప్పుడు మేం 94 నుంచే తెలంగాణా కోసం పోరాడుతున్నామని చెబుతోంది . ఏ ఉద్యమం లో నైనా ఉద్యమించేది ఒకరు ప్రయోజనాలు పొందేది ఒకరు

    ReplyDelete
  2. నాటి ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చెన్నారెడ్డి తన ప్రజా సమితిని విలీనం చేయటం వలన ఉద్యమం మోసంతో అణచబడింది. ఇవ్వన్నీ మీ వ్యాసంలోని మాటలే. కాని మోసం ఎవరిది? పైపై దృష్టికి ఇందిరా గాంధీదని అనిపిస్తుంది. కాని నిజంగా ఇది చెన్నారెడ్డి చేసిన మోసం కాదా? నాకు గుర్తున్నంతవరకు, నాడు రాష్ట్రంలో మంత్రిపదవి వదలుకుని కేంద్రానికి ఇందిర ఆహ్వానం మేరకు వెళ్ళి, కోర్టు తీర్పు పుణ్యమా అని కేంద్రంలో పదవీ ఊడి, రాజకీయంగా నిరుద్యోగి అయిన చెన్నారెడ్డి తెలంగాణా ఉద్యమానికి సారధ్యం వహించింది తన రాజకీయమైన ఉనికిని పదిలంగా కాపాడుకోవటానికే కాదంటారా?

    తెలంగాణాను ఆంధ్రప్రాంతవాసులు మోసం చేసారన్న వాదన అటుంచితే, తెలంగాణా నాయకులే‌ అడ్డంగా మోసం చేయలేదా? దానికీ సీమాంద్ర నాయకుల మోసమే‌ కారణమా?

    ReplyDelete
    Replies
    1. చిన్న సవరణ. ఇందిరమ్మ తెలంగాణాకు మోసం చేస్తే చెన్నారెడ్డి చేసింది ద్రోహం.

      ఆంద్ర ప్రాంతం "వారు" తెలంగాణాను మోసం చేసారని ఎవరూ అనలేదండీ. This accusation is only against very few Andhra people (e.g. big landlords, crony capitalists, senior burocrats & politicos).

      తెలంగాణా చరిత్ర నిండా వెన్నుపోటులే. వీటిలో ఎన్నో తెలంగాణా నాయకులు పొడిచిన పోట్లే. నమ్మినవాడే నట్టేట్ట ముంచిన గుర్తుల వల్లే కెసిఆర్ మీద ప్రజలకు పూర్తి నమ్మకం రావడం లేదు.

      Delete
  3. ఖమ్మం జిల్లాలో తెలంగాణా వారు లేరనీ, తెలంగాణవాదం వినిపించదనీ ప్రచారం చేసే మూర్ఖులకు మీ టపా చెంప చెళ్ళుమనిపించింది థాంక్సండీ.

    ReplyDelete
  4. మీ బ్లాగు ని "పూదండ" తో అనుసంధానించండి.

    www.poodanda.blogspot.com

    ReplyDelete
  5. ౧౯౬౮ లో జరిగిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమ పూర్వాపరాలను మీకు గుర్తున్నంతవరకు విశదంగా వివరించారు!శ్రీధర్ రెడ్డి ఉస్మానియాలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ M .A లో నా classmate కాకుండా అనుంగు మిత్రుడు!అప్పుడే ప్రజాభీష్టాన్ని అనుసరించి ప్రత్యేక తెలంగాణాను ఏర్పరచక ఇందిరాగాంధీ రాజకీయంగా అతి పెద్ద పొరపాటు చేసింది!చెన్నారెడ్డికి పదవులిచ్చి చేరదీసి ఉద్యమాన్ని కాలరాచింది!తెలంగాణలో అతి పటిష్టమయిన చెన్నారెడ్డి అంతటివాడు కూడా మేనేజ్ చేసి manipulate చేయవచ్చునని తెలంగాణా నాయకులేవరికీ అప్పట్లో వెన్నెముకలే లేవని రోబో లవలె ఏది చెబితే అది చేస్తారని స్వార్తమేగాని ప్రజాహితం పట్టదని ప్రపంచానికి నిరూపించింది!ఉద్యమం పెను ఉప్పెన ఐ ఉవ్వెత్తున ఎగసి తోమ్మిదివందలమంది యువకుల ఆత్మాహుతికి కారణమయింది!తెలంగాణా రావడానికి ఇపుడు ప్రజలు బొంతపురుగునయినా అసహ్యించుకోకుండా ముద్దు పెట్టుకోవడానికి సైతం సిద్ధంగా ఉన్నారు!తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కాకుండా ఇక ఎవ్వరూ ఆపలేని స్థితికి చేరుకుంది!జేజేమ్మయినా ఇప్పుడు తెలంగాణా ఇచ్చి తీరాల్సిందే!!!

    ReplyDelete
  6. వనంవారూ,
    నా వ్యాఖ్యను ప్రచురించ తిరస్కరించారే!
    మీకు తగిన కారణం ఉండే ఉంటుంది అని భావిస్తాను.
    మీ బ్లాగు, మీ యిష్టం.

    ReplyDelete
  7. శ్యామలీయం గారికి,
    నేను ప్రచురించకపోవడం అన్న సమస్యే లేదండీ. మీ కామెంట్ చూసిన తర్వాత, "స్పాం" లోకి వెళ్లి చూస్తే అక్కడ మీ వ్యాఖ్యానం వుంది. వెంటనే "నో స్పాం" అని క్లిక్ చేసాను. ఎందుకో ఇంతవరకు రాలేదు. చాలా బాగుంది మీ కామెంట్. దయచేసి మరో మారు రాయగలరు.
    క్షమించండి,

    ReplyDelete
  8. Subramanyam Nuti:
    You put together lot of facts - but you did not mention why and who created this concert of separation?
    Ravana burned himself in the fire of Moha. When there were no states, it was single land and shared the culture and language, in different forms. How come all of a sudden this became source of separation? There are traitors everywhere who deceive public and paint it with a gory picture. We, public are the ultimate suffers of these Am surprised to see how people fall into this trap of supporting this devastating cause. Appreciate your understanding.

    ReplyDelete
    Replies
    1. Separatism in India started in 1953 with Andhra. It is now coming to a full circle!

      Delete