Friday, January 24, 2014

అలనాటి ప్రపంచ స్థాయి మహా నాయకులను మరచిపోతున్నామా?:వనం జ్వాలా నరసింహారావు

మహా నాయకులను మరచిపోతున్నామా?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (26-01-2014)

శాంతి దూత జవహర్‌ లాల్‌ నెహ్రూ, సైనిక పరంగా ప్రతిష్ఠ తెచ్చిన ఇందిర, అమెరికా అధ్యక్షుల్లో కెనడీకి విశేష గుర్తింపు, జర్మనీ ఐక్యతకు కృశ్చేవ్‌ కృషి, చైనా విప్లవ నేత మావో సె టుంగ్‌, వియత్నాం విప్లవ నేత హో చి మిన్‌, తిరుగులేని నాయకుడు ఫిడల్‌ కాస్ట్రో, దక్షిణాఫ్రికా మహాత్మా గాంధీ- మండేలా 

          అలనాటి అంతర్జాతీయ స్థాయి "రోల్ మోడల్" నాయకత్వం, ఈ రోజుల్లో, ఒకనాటి లీలా జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతోంది. ఇక, ఇప్పుడే ఇలా వుంటే, బహుశా భవిష్యత్‍లో వారిని గుర్తుంచుకునే వారు అసలు మిగలరేమో! అలాంటి ఉద్దండ నాయకులు ప్రస్తుతం లేనే లేరని అనలేం కాని, ఆ స్థాయి రాజనీతిజ్ఞత, వారి తరహాలో తమ-తమ దేశాలకు ప్రాతినిధ్యం వహించిన తీరు, తమ దేశాల వాణినే కాకుండా వారి-వారి ప్రాంతాల గురించి ఆ మహా నాయకులు పడ్డ ఆరాటం, వ్యక్తిగతంగా, ఉమ్మడిగా తాము పోరాడుతున్న అంశాల విషయంలో వారు ప్రదర్శించిన నిబద్ధత, బహుశా, ప్రస్తుత అంతర్జాతీయ స్థాయి నాయకుల్లో లోపించిందనడం అతిశయోక్తి కాదు. దురదృష్టవశాత్తు, రాజనీతి శాస్త్రం అధ్యయనం చేసే నేటి తరం విద్యార్థులు కాని, వర్తమాన చరిత్ర కారులు కాని, ఆ మాటకొస్తే సాధారణ చదువరి కాని, యువత కాని, గత కాలం నాటి మహా నాయకుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్న దాఖలాలు అంతగా కనిపించడం లేదు. అప్పట్లో, అంతర్జాతీయ స్థాయిలో ఒక గోష్టి కాని, సమావేశం కాని, సదస్సు కాని, ప్రపంచ దేశాల సమ్మేళనం కాని, ఎప్పుడు-ఎక్కడ ఏ మూల జరిగినా, ఆ నిర్వహణలో కనిపించిన హంగూ-ఆర్భాటం, ఆనందం, అంగరంగ వైభవం ఇప్పట్లో లోపించిందనాలి. ఉదాహరణకు, బెల్ గ్రేడ్‌లో 1961 లో, జవహర్లాల్ నెహ్రూ, సుకర్ణో, నాజర్, ఎన్ క్రుమా, టిటో ల సారధ్యంలో పురుడు పోసుకున్న అలీనోద్యమ సదస్సు పేర్కొన వచ్చు. ఆ ఐదుగురు ప్రపంచ నాయకులు, అగ్రరాజ్యాల ఆధిపత్యం తగ్గించడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నం, అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధాన్ని నివారించడానికి తెర పైకి తెచ్చిన అలీనోద్యమం తీరుతెన్నులు, నేటి తరంవారు, కనీసం తెలుసుకోవాలన్న-అవగాహన చేసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయడం లేదే? అలానే 1955 నాటి జెనీవా సదస్సు గురించి కాని, ఆ రోజుల్లో జరిగిన ఐక్య రాజ్య సమితి సర్వ సభ్య సమావేశాల గురించి కాని, కామన్ వెల్త్ దేశాధి నేతల సమావేశాల గురించి కాని, బాండుంగ్ సమావేశంగా పిలుచుకునే ఆప్రో-ఏషియన్ సమావేశం కాని, 1954 లో జరిగిన జెనీవా సమావేశం కాని, అలాంటి మరెన్నో అంతర్జాతీయ సమావేశాల గురించి కాని నేటి తరం యువత తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం విచారకరం.

అలనాటి అంతర్జాతీయ స్థాయి అగ్ర నాయకుల పేర్లలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి: జవహర్లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరా గాంధీ, జాన్ ఫిట్జ్ గెరాల్డ్ కెన్నెడీ, నికితా కృశ్చేవ్, చార్లెస్ డి గాలె, డేవిడ్ బెన్ గ్యూరియన్, ఆయన వారసురాలు గోల్డా మీర్, మార్షల్ టిటో, గమాల్ అబ్దుల్ నాజర్, చౌ-ఎన్-లై, మావో సేటుంగ్, సిరిమావో బండార నాయికే, విల్లీ బ్రాండ్ట్, సుకర్ణో, క్వామే ఎన్ క్రుమా, ఫిడల్ కాస్ట్రో, హోచిమిన్, నెల్సన్ మండేలా.....లాంటి వారు.

వివరాల్లోకి పోతే....జవహర్లాల్ నెహ్రూ, భారత ప్రప్రధమ ప్రధాన మంత్రి. ఆ పదవిలో ఆయన ఆగస్ట్ 15, 1947 నుంచి మే 27, 1964 వరకు-ఆయన మరణించేంత వరకున్నారు. ఐక్య రాజ్య సమితి విధానాలకు ఆయన తన సంపూర్ణ మద్దతిచ్చేవారు. ప్రపంచ వ్యాప్తంగా, శాంతిత్వ వాదనకు, ఆయన పేరు పర్యాయపదం అనవచ్చు. అలీనోద్యమ వ్యవస్థాపకుడిగా, అలనాటి అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యా దేశాల ఆధిపత్యాన్ని ఎదిరించిన వాడిగా, ఆ రెండు దేశాలకు చెందకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలు మధ్యే మార్గాన్ని అనుసరిచేట్లు చేసిన వాడిగా, చరిత్రలో ఆయనో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. 1954 లో పొరుగునున్న చైనా దేశంతో "పంచశీల" పేరుతో శాంతి-సహజీవనం దిశగా ఒప్పందం చేసుకున్నాడాయన. ఆయన కూతురు ఇందిరా గాంధీ కూడా తండ్రి మార్గంలోనే అంతర్జాతీయ స్థాయి నాయకురాలిగా ఆయన తదనంతరం పేరు తెచ్చుకుంది. భారత దేశానికి మొదటి పర్యాయం మూడో ప్రధాన మంత్రిగా 1966-1977 మధ్య కాలంలో, ఆ తరువాత ఆరవ ప్రధాన మంత్రిగా 1980 నుంచి 1984 లో ఆమె హత్యకు గురయ్యేదాకా ఇందిరాగాంధీ పని చేశారు. ఆమె కాలంలో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దేశంగా భారత దేశానికి పేరొచ్చింది. రాజకీయ, ఆర్థిక, సైనిక పరంగా దక్షిణ ఏషియా ప్రాంతంలో ఒక గొప్ప రాజ్యంగా అవతరించింది భారత దేశం. బంగ్లాదేశ్ ఆవిర్భావం, పాకిస్తాన్ పై భారత్ గెలుపు ఆమె నేతృత్వంలో సాధించినవే. అలీనోద్యమానికి కూడా అమె చేసిన కృషి అమోఘం. అలానే పాలస్తీనా విమోచనోద్యమానికి ఆమె ఇచ్చిన మద్దతు మరువరానిది.


జాన్ కెన్నెడీ జనవరి 20, 1961 నుంచి నవంబర్ 22,1963 వరకు, అమెరికా దేశపు 35 వ అధ్యక్షుడుగా, తాను హత్యకు గురయ్యేవరకు పనిచేశారు. ఆయన కాలంలోనే "బే ఆఫ్ పిగ్స్" దాడి, క్యూబన్ మిస్సైల్ సంక్షోభం, బెర్లిన్ గోడ నిర్మాణం, ఆఫ్రికా-అమెరికా పౌర హక్కుల ఉద్యమం తో సహా వియత్నాం పైన యుద్ధంలో అమెరికా మితిమీరిన జోక్యం చోటు చేసుకున్నాయి. అతి పిన్న వయసులోనే అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన కెన్నెడీ, అచిర కాలంలోనే ప్రపంచ స్థాయి అగ్రనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన కుటుంబం మీద పెరల్. ఎస్. బక్ రాసిన పుస్తకంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి. ఆయన తదనంతరం అమెరికాకు ఎంతో మంది అధ్యక్షులు వచ్చినప్పటికీ ఆయన కొచ్చిన గుర్తింపు ఇంతవరకు మరెవ్వరికీ రాలేదనవచ్చేమో! అగ్రరాజ్యంగా అమెరికా ఆయన నేతృత్వంలోనూ, ఆ తరువాత కాలంలోనూ వెలుగొందుతున్న నేపధ్యంలో, మరో అగ్ర రాజ్యంగా, అమెరికాకు పోటీగా వున్న సోవియట్ యూనియన్‌కు ప్రధాన మంత్రిగా నికితా కృశ్చేవ్ వుండేవారు. మార్చ్ 14, 1953 నుంచి అక్టోబర్ 14, 1964 వరకు ఆయన ఆ పదవిలో వున్నారు. జర్మనీ ఐక్యత కొరకు కృశ్చేవ్ నిరంతరం కృషి చేసేవారు. నవంబర్ 1958 లో ఆయన ఆ దిశగా అమెరికాకు, ఇంగ్లాండుకు, ఫ్రాన్స్ దేశానికి ఒక అల్టిమేటం కూడా ఇచ్చారు. తక్షణమే, ఆరు నెలలు గడిచే లోపున తూర్పు-పశ్చిమ జర్మనీ దేశాలతోను, సోవియట్ యూనియన్ తోను శాంతి ఒప్పందం చేసుకోమని కోరాడు కృశ్చేవ్. అలా జరగని పక్షంలో, సోవియట్ యూనియన్ తనంతట తానే తూర్పు జర్మనీతో శాంతి ఒప్పందం చేసుకుంటుందని కూడా హెచ్చరించాడు.

చార్లెస్ డి గాలె ఫ్రాన్స్ ఐదవ గణతంత్ర రాజ్య వ్యవస్థాపకుడి గాను, ఆ దేశానికి 1959-1969 మధ్య కాలంలో అధ్యక్షుడి గాను, ఫ్రెంచ్ సైన్యాధినేతగాను, ప్రముఖ రాజనీతిజ్ఞుడిగాను, ఆ రోజుల్లో యావత్ ప్రపంచానికి చిరపరిచితుడు. 1958 లో ఫ్రెంచ్ రిపబ్లిక్ స్థాపన జరగడానికి చాలా కాలం క్రితమే, ఆ దేశానికి, 1945 లోనే ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడానికి కారణ భూతుడు డి గాలె. నాటో సైనిక కూటమి నుంచి ఫ్రాన్స్ దేశాన్ని ఉపసంహరించుకోవడమే కాకుండా, ఐరోపా సమాజంలో బ్రిటన్ దేశానికి ప్రవేశం కలగకుండా వీటో అధికారాన్ని ఉపయోగించిన వ్యక్తి డి గాలె. అమెరికా, సోవియట్ యూనియన్ దేశాల మధ్య సమతుల్యం పాటించుకుంటూ, ఒక పటిష్టమైన దేశంగా ఫ్రాన్స్ ను అభివృద్ధి చేయాలన్న విషయంలో డి గాలె ఎన్నడూ రాజీపడలేదు. అలాగే...ఇజ్రాయిల్ కు చెందిన గోల్డా మీర్, బెన్ గ్యూరియన్ లు. ఆ దేశ నాల్గవ ప్రధాన మంత్రిగా మార్చ్ 17, 1969 నుండి జూన్ 3, 1974 వరకు అధికారంలో వున్న గోల్డా మీర్ ను ఇజ్రాయిల్ రాజకీయాలలో "ఐరన్ లేడీ" గా అభివర్ణించే వారు. 1969 లోను, 1970 తొలినాళ్లలోను, గోల్డా మీర్ అనేక మంది ప్రపంచ నాయకులను కలిసి ఆమె కలలు కన్న రీతిలో, మధ్య ప్రాచ్య ప్రాంతంలో శాంతి స్థాపనకు కృషి చేశారు. ఆమెకు ముందు ప్రధానిగా పని చేసిన డేవిడ్ బెన్ గ్యూరియన్ ఇజ్రాయిల్ రాజనీతిజ్ఞుడిగాను, జాతి పిత గాను ప్రసిద్ధికెక్కాడు. ప్రప్రధమ ఇజ్రాయిల్ ప్రధాన మంత్రిగా మే 17, 1948 నుండి జనవరి 26, 1954 వరకు, ఆ తరువాత కొంత విరామం తీసుకుని తిరిగి నవంబర్ 3, 1955 నుండి జూన్ 26, 1963 వరకు బెన్ గ్యూరియన్ పనిచేశారు. 1948 లో జరిగిన అరబ్-ఇజ్రాయిల్ యుద్ధంలో తన దేశానికి నాయకత్వం వహించడమే కాకుండా, వివిధ జ్యూయిష్ సైనిక సంస్థలను, ఇజ్రాయిల్ సైన్యాన్ని కలిపి సమైక్యంగా పోరు సల్పారు.


యుగోస్లేవియా విప్లవకారుడిగా, ఆ దేశ రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందిన మార్షల్ టిటో, 1945 నుండి 1980 లో ఆయన చనిపోయేంత వరకు వివిధ హోదాలలో తన దేశానికి ఎనలేని సేవ చేశాడు. నెహ్రూ, నాజర్, ఎన్ క్రుమా, సుకర్ణో లతో కలిసి అలీనోద్యమ ప్రధాన నాయకుడిగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. అలీనోద్యమ ప్రప్రధమ సెక్రటరీ జనరల్ గా ఆయన ఎంపికయ్యారు. 1943-1963 మధ్య కాలంలో, సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియా ప్రధాన మంత్రిగా, ఆ తరువాత 1953-1980 మధ్య కాలంలో తొలుత అధ్యక్షుడిగా, పిదప యావజ్జీవిత అధ్యక్షుడిగా అధికారంలో వున్న ఆయన అంతర్జాతీయ స్థాయిలో కూడా తిరుగులేని నాయకుడని పేరు తెచ్చుకున్నాడు. ఇక గమాల్ అబ్దుల్ నాజర్ విషయానికొస్తే...ఆయన, ఈజిప్ట్ దేశానికి రెండవ అధ్యక్షుడిగా జూన్ 23, 1956 నుండి సెప్టెంబర్ 28, 1970 న చనిపోయేంత వరకు వున్నారు. అగ్ర రాజ్యాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, 1956 లో "సూయజ్‌ కెనాల్ కంపెనీ"  ని జాతీయం చేయడంతో ఈజిప్ట్ లోను, మొత్తం అరబ్ ప్రపంచంలోను తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందాడు. సిరియాతో కలిసి "యునైటెడ్ అరబ్ రిపబ్లిక్" ను స్థాపించాడాయన. ఆయన మరణం ప్రపంచ నాయకులనెందరినో కదిలించింది. యావత్ అరబ్ ప్రపంచానికి చెందిన నేతలు ఆయన అంత్య క్రియలకు హాజరయ్యారు. జోర్డాన్ రాజు హుస్సేన్, పాలస్తీనా విమోచనోద్యమ నాయకుడు యాసర్ అరాఫత్ బహిరంగంగా కంట తడి పెట్టుకున్నారు. లిబియాకు చెందిన కల్నల్ గడాఫి ఉద్వేగంతో రెండు పర్యాయాలు స్పృహ తప్పి పడిపోయాడు!

"పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా" ప్రప్రధమ ప్రధాన మంత్రిగా చౌ-ఎన్-లై అక్టోబర్ 1949 నుండి జనవరి 1976 లో చనిపోయేంతవరకు పదవిలో కొనసాగారు. కొరియా యుద్ధం నేపధ్యంలో, పశ్చిమ దేశాలతో శాంతి కొరకు ఆయన పాకులాడాడు. 1954 లో జరిగిన జెనీవా సమావేశంలో ఆయన కూడా పాల్గొన్నారు. అమెరికాతో, తైవాన్‌తో, సోవియట్ యూనియన్‌తో, భారత దేశంతో, వియత్నాంతో తలెత్తిన సంఘర్షణల నేపధ్యంలో, చౌ-ఎన్-లై సామరస్య పూరకంగా సమస్యలను పరిష్కరించుకునే దిశగా కొన్ని విధాన పరమైన నిర్ణయాలను తీసుకున్నాడు. ఆయన మెంటర్...నాయకుడు, మావో సేటుంగ్ 1949 లో "పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా" వ్యవస్థాపకుడు. 1921 లో ఆవిర్భవించిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకులలో మావో ఒకరు. మార్క్స్, లెనిన్‌ల సరసన కమ్యూనిజాన్ని వ్యాపింప చేయడంలో కృషి చేసిన త్రిమూర్తులలో ఆయనొకరు. ప్రపంచ చరిత్రకు ఆయన చేసిన తోడ్పాటు చరిత్ర గతినే మార్చిందనాలి. పాలస్తీనా నాయకుడిగా, పాలస్తీనా విమోచన సంస్థ అధ్యక్షుడిగా యాసర్ అరాఫత్ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. పాలస్తీనా జాతీయ అథారిటీకి ప్రధమ అధ్యక్షుడిగా ఆయన జులై 5, 1994 నుండి నవంబర్ 11, 2004 వరకు పనిచేశారు. పాలస్తీనా స్వయం ప్రతిపత్తి కొరకు తన జీవితాంతం ఇజ్రాయిల్‌తో ఆయన పోరాటం సాగించాడు. అసలు ఇజ్రాయిల్ ఉనికే వద్దన్న అరాఫత్ ఆ తరువాత రాజీపడి, ఐక్య రాజ్య   సమితి తీర్మానానికి అనుగుణంగా తన విధానాన్ని 1988 లో మార్చుకున్నాడు. శ్రీలంక ప్రధానిగా సిరిమావో బండారు నాయిక ఎన్నో సార్లున్నారు. 1960-1965, 1970-1972, 1972-1977, 1994-200 మధ్య కాలంలో ఆమె ప్రధానిగా పనిచేయడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

విల్లీ బ్రాండ్ట్ జర్మనీ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, రాజనీతిజ్ఞుడు. 1969-1974 మధ్య కాలంలో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఛాన్స్ లర్‍ గా పనిచేశారు. పశ్చిమ జర్మనీ, సోవియట్ అనుకూల దేశాల మధ్య సయోధ్య కుదిరించడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, 1971 సంవత్సరానికి విల్లీ బ్రాండ్ట్ కు నోబెల్ శాంతి బహుమానం లభించింది. ఇండోనేషియా ప్రధమ అధ్యక్షుడిగా పనిచేసిన సుకర్ణో, ఆ పదవిలో 1945 నుండి 1967 వరకు, అంటే 22 సంవత్సరాల పాటు కొనసాగారు. 1960 వ దశకంలో ఇండోనేషియాను వామపక్ష భావాల దిశగా మళ్లించి, ఇండొనేషియన్ కమ్యూనిస్ట్ పార్టీకి తన పూర్తి మద్దతిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో తన దేశానికి ప్రాముఖ్యత-గుర్తింపు తెచ్చేందుకు, సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా మూడో ప్రపంచ దేశాలను కూడగట్టాడాయన. అలీనోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. క్వామే ఎన్ క్రుమా ఘనా దేశానికి తిరుగులేని నాయకుడుగా వుండేవారు. బ్రిటీష్ వలస రాజ్యంగా వున్న ఘనాకు 1957 లో స్వాతంత్ర్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించిన ఎన్ క్రుమా ఆ దేశానికి ప్రధమ అధ్యక్షుడి గాను, ప్రధమ ప్రధాన మంత్రి గాను పనిచేశారు. ఆఫ్రికన్ యూనిటీ సంస్థ వ్యవస్థాపకుల్లో ఆయనొకరు. 1963 సంవత్సరంలో లెనిన్ శాంతి బహుమతిని అందుకున్నారు ఎన్ క్రుమా. వియత్నాం కమ్యూనిస్ట్ విప్లవ నాయకుడిగా ప్రసిద్ధికెక్కిన హో చి మిన్ ఆ దేశాధ్యక్షుడిగా 1945-1969 మధ్య కాలంలోను, ప్రధాన మంత్రిగా 1945-1955 మధ్య కాలంలో పనిచేశారు. వియత్నాం స్వాతంత్ర్యం కొరకు 1941 నుంచి పోరాటం సాగించిన హో చి మిన్, కమ్యూనిస్ట్ పాలనలోని వియత్నాం ప్రజాస్వామ్య రిపబ్లిక్ ను 1945 లో స్థాపించారు. 1954 లో ఫ్రాన్స్ దేశాన్ని ఓడించిన ఘనత ఆయనదే.

ఎలిజబెత్ రాణి తర్వాత బహుశా ఎక్కువ కాలం అధికారంలో వున్న వ్యక్తి ఫిడల్ కాస్ట్రోనే. లాటిన్ అమెరికాలో కాస్ట్రోను మించిన కమ్యూనిస్ట్ నాయకుడు మరొకరు లేరు. కమ్యూనిస్ట్ విప్లవ పంథాపై ఆయనకు గట్టి పట్టుంది. జనవరి 9, 1959 నుండి ఫిబ్రవరి 19, 2008 వరకు ఆయన క్యూబాకు తిరుగులేని నాయకుడు. అప్పటి నుంచి తానే పదవిని ఆశించనని, చేపట్టనని ప్రకటన చేశారు. ఇటీవలే చనిపోయిన నెల్సన్ మండేలా గురించి ఎంత చెప్పినా తక్కువే. దక్షిణాఫ్రికా మహాత్మా గాంధీగా ఆయన్ను పిలిచేవారు. అలాంటి మహా నాయకులు అరుదుగా వుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే, గత కాలంలో ఇలాంటి మహా నాయకులు మరికొందరుండవచ్చు....ఏరీ అలాంటి నాయకులిప్పుడు?


No comments:

Post a Comment