Tuesday, October 7, 2014

"ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు" పుస్తకానికి రాళ్లబండ కవితా ప్రసాద్ పీఠిక : ఈ గ్రంథం - ఛందః ప్రయోగ మందిరం

ఈ గ్రంథం - ఛందః ప్రయోగ మందిరం
రాళ్లబండి కవితా ప్రసాద్

          "శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, కల్పము, నిరుక్తము"...ఈ ఆరు షట్ శాస్త్రాలు. ఇవి అధ్యయనం చేసిన వాడే పండితుడు.
          ఈ రోజుల్లో "సి, సి-ప్లస్, ఒరాకిల్, జావా, శాఫ్, డాట్ నెట్, హ డూప్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్...." ఇవి శాస్త్రాలు. ఇవి నేర్చిన వాడే మేధావి! పండితుడు! ప్రయోజకుడు!
          ఇవి మాత్రమే నేర్చుకునే జాతికి షట్ శాస్త్రాలు ఉపయోగం లేనివి అని భావన. ఎంత దురదృష్టం! వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు, శాస్త్రాలు....అన్నీ సృష్టించుకుని, నేర్పి, నేర్చుకుని, ఒక సజీవ  మహా నాగరికతను నిర్మించుకున్న భారత జాతి ఇప్పుడు ప్రాణ రహితమైన నిర్జీవ విద్యలు నేర్చుకుని యంత్రాలుగా మారిపోవడం ఎంత విచిత్రం!
          ఇక యాంత్రిక సంస్కృతి - సజీవ సంస్కృతిని ఎంత చావు దెబ్బ తీస్తుంది!
          గతం నిర్మించిన మహా సాంస్కృతిక సౌధం కుప్ప కూలిపోతుంటే, కనీసం ఆ దృశ్యాలు చూడడం గానీ, శబ్దాలు వినడం గానీ, కూడా చేయలేని ఒక జాతిలో సభ్యులమై ఉన్నాం.
          అదలా ఉంచితే, షట్ శాస్త్రాలలో "ఛందస్సు" వేదాలను నడిపించేది. "ఛందౌపాదౌతు వేదశ్చ" అని శాస్త్రం. శరీరానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలాంటివో వాజ్మయ శరీరానికి గురు-లఘువులు అలాంటివి. చాలా సందర్భాలలో ఛందో రహితమైన కావ్య శరీరం శ్వాసించదు. పాఠకులను శాసించదు.
          ఛందస్సు ప్రాచీన మానవ పరిణిత మేధా సృష్టి!
          ఛందశ్శాస్త్రానికి ఒక గురు పరంపర ఉంది. "లయ" కారకుడైన మహాశివుడు ఆది శాస్త్రజ్ఞుడు. ఆయన బృహస్పతికి - గుహునికి చెప్పాడు. బృహస్పతి - ఇంద్రునికి, ఇంద్రుడు - శుక్రునికి, శుక్రుడు - మాండవ్యునికి, మాండవ్యుడు - సైతవునికి, సైతవుడు - యాస్కునికి, యాస్కుడు - పింగళునికి, పింగళుడు - గరుత్మంతునికి, ఛందస్సు బోధించినట్లు ఒక గురు పరంపర!
          ఇక గుహుని ద్వారా సనత్కుమారుడు, సనత్కుమారుని ద్వారా మళ్లీ బృహస్పతి, ఇంద్రుడు, వారి నుండి మళ్లీ పతంజలి, పతంజలి నుండి పింగళుడు, తద్వారా గరుత్మంతుడు...ఇదొక పరంపర!
          ఇలాంటి 30 రకాల ఛందో గురుపరంపరలున్నాయి!
          ఈ విషయమంతా "యుధిష్టిరమీమాంస" లో ఉన్నాయి. ఎంతో మేథా మథనం జరిగింతర్వాత పింగళుని దగ్గర సర్వ ఛందశ్శాస్త్రం నిక్షిప్తమైందని తెలుస్తోంది.
          మన దురదృష్టమేమంటే, పైన చెప్పిన గురుపరంపరలోని ఏ ఛందశ్శాస్త్రమూ మనకు మిగల్లేదు! ఒక్క పింగళుని ఛందశ్శాస్త్రం తప్ప! అదీ పాక్షికంగానే!
          పింగళుని కాల నిర్ణయం చాలా సందిగ్ధం. ఖచ్చితంగా క్రీస్తుకు పూర్వం వాడని కాదు. క్రీ. శ. 7 లేక 8 శతాబ్దాలవాడని చర్చ. ఎంత ముందుకు లాగినా క్రీ. శ. 800 నాటి వాడనే అందరూ ఒప్పుకున్నారు.
          పింగళుని ఛందశ్శాస్త్రాన్ని క్రీ. శ. 1150 లో ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు భాస్కరాచార్య తన గ్రంధంలో ఐదవ విభాగం నాల్గవ అధ్యాయంలో ఉపయోగించుకుని ద్విపద సిద్ధాంతం (Binomial Theory) చేశాడు. ఆ తర్వాత క్రీ. శ. 1303 లో చైనా వాళ్లకు చేరింది. క్రీ. శ. 1650 కి గాని పాస్కల్ కు చేరలేదు. ఆ తర్వాత ఆయన్నే తలకెత్తుకుని మోస్తున్నాం!
          వేల యేండ్ల చరిత్ర గల ఛందశ్శాస్త్రం ఈనాడు సుప్త చేతనావస్త (Hibernation) లో ఉంది. దీన్ని వెలికి తీసి ప్రచారం చెయ్యక పోవడం దేశ ద్రోహం కన్నా పెద్ద నేరం!


          ***           ***         ***       ****       ****      ****    ***   ***  
          కావ్య భవనానికి ఛందశ్శాస్త్రం "ఆర్కిటెక్చర్" లాంటిది. ఆ శాస్త్రం తెలిసి రచించిన కావ్యానికి, తెలియక రచించిన కావ్యానికి హస్తిమశకాంతరం ఉంటుంది.
          ఋషి కాని వాడు కవి కాలేడు. "నా నృషిః కురుతే కావ్యం" అని అందరికి తెలిసిందే.
          "ఋషి" అంటే గడ్డాలు పెంచుకుని తపస్సు చేసుకునే వృద్ధుడు కాడు. ఋషి ఒక "ఆధ్యాత్మిక సాప్ట్ వేర్ శాస్త్రవేత్త" లాంటి వాడు! అతనికి మహాదర్శన శక్తి ఉంటుంది. వాల్మీకి ఒక మహర్షి! మహా కవి! కవిత్వము, ఛందస్సు ఏక కాలంలో స్పురించింతర్వాత కవిత్వం అందులోకి ప్రవేశిస్తుందా? అనేది ఒక చర్చ.
          మహా కవులకు కవిత్వం ముందుగా దర్శనమిస్తుంది. అదే ఛందస్సులో ప్రవేశిస్తుంది.
          మామూలు కవులు ముందుగా ఛందస్సును వేసుకుని దాని కింద అక్షరాలు, పదాలు పేరుస్తూ, వారివారి అదృష్టం మేరకు కవిత్వం అందులోకి ప్రవేశిస్తుంది.
          అందుకే, కవి ఛందశ్శాస్త్రవేత్తగా మారితే మహా కావ్యాలు సృష్టిస్తాడు. ఛందశ్శాస్త్రవేత్త కవిగా మారితే పద్య కవిగా మిగుల్తాడు.
          వాల్మీకి మహర్షి! మహా కవి!
          ఈ నేపధ్యంలో తెలుగు సాహిత్యాన్ని పవిత్రం చేసిన మరో మహర్షి, మహా కవి, ఆంధ్ర వాల్మీకి శ్రీ వావిలికొలను సుబ్బారావు (వాసు దాసు) గారు.
          ఆయన రచించిన శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం మహాకావ్యం "మందరం".
          వాల్మీకి 24000 శ్లోకాలలో రామాయణం రచిస్తే, ఆంధ్ర వాల్మీకి  24000 పైచిలుకు తెలుగు పద్యాలలో రచించారు ఆంధ్ర వాల్మీకాన్ని.
          నాటి వాల్మీకికి అనుష్టుప్ ఛందం అలవోకగా పలికితే, నేటి ఆంధ్ర వాల్మీకికి అనంతమైన ఛందస్సులు అద్భుతంగా దర్శనమిచ్చాయి.
          ఛందశ్శాస్త్రంలో విశేష ఛందస్సులు కూడా సువర్ణ సజీవ పద్య విగ్రహ మూర్తులుగా రూపుదిద్దుకున్నాయి. "మందరం" లో వైదిక ఛందస్సులు ఏడింటిని కలుపుకుని లౌకిక ఛందస్సులు 26 ప్రచలితంగా ఉన్నాయి. ఛందశ్శాస్త్రంలో 13 కోట్ల 42 లక్షల 17 వేల 726 వృత్తాలున్నాయి. ఇవికాక అర్ధ, సమ, విషమ బేధాల ప్రకారం లెక్క తీస్తే అనంతం! ఇన్ని కోట్లలో ఇప్పటివరకు కవులు వాడిన వృత్తాల సంఖ్య 700 కు మించవు. వీటిల్లో సంస్కృత కవులు వాడినవి వందకు మించవు. తెలుగు కవులు వాడినవే ఎక్కువ.
          అందరికీ తెలిసిన ఉత్పల, చంపక, మత్తేభ, శార్దూలం, మత్తకోకిల, పంచ చామరం....మొదలైనవి. ఇవి కాక కందం, తేటగీతి, ఆటవెలది, సీసం, మధ్యాక్కర వంటి జాతి, ఉపజాతి వృత్తాలు 26 ఛందస్సులు దాటినవి. (అంటే పాదానికి ఇరవై ఆరు అక్షరాలు దాటిన) ఉద్దురు మాలా వృత్తాలు, లయగ్రాహి, లయవిభాతి మొదలగునవి ఎన్నో ఉన్నాయి.
          ఇన్ని కోట్ల వృత్తాలలో ఏ వృత్తం, ఏ కవిని, ఏ రీతిగా అనుగ్రహిస్తుందనేది ఒక మహా రహస్యం.
          26 ఛందస్సుల పేర్లే చిత్రం. ఉక్త, అత్యుక్త, మధ్య, ప్రతిష్ట, సుప్రతిష్ట, గాయత్రి, ఉష్ణిక్కు, అనుష్టుప్పు, బృహతి, పంక్తి, త్రిష్టుప్పు, జగతి, అతిర్ గతి, శక్వం, అతి శక్వం, అష్టి, అత్యష్టి, ధృతి, అతి ధృతి, కృతి, ప్రకృతి, ఆకృతి, ఎకృతి, సంకృతి, అధికృతి, ఉత్కృతి.....వీటికి పేర్లు ఎవరు పెట్టారు? వీటితో ఉత్పన్నమైన 13 కోట్ల పైచిలుకు వృత్తాలకు ఎవరు పేరు పెడతారు? ఎలా పెట్టాలి? అనేది ఒక మహా చర్చ!
          ఉదాహరణకు "ఉష్ణిక్కు" అంటే, తలపాగా అని అర్థం. ఆ పేరు ఎందుకు వచ్చింది? ఇది ఏడవ ఛందస్సు. " ఉష్ణిక్ ఉత్ స్నాతా భవతి - ఉత్ స్నాతా - గాయత్రితః, చతుర్బిరక్షరైః ఉద్యేష్టితా ఇవ - ఉష్ణీషిణీవా ఇత్యాపమకమ్, అధవా ఉష్ణీషిణీ ఉష్ణిషవతీ - ఇవ ఇల్యాపమకం. ఉపమా నిబంధనం నామ".
          అంటే, గాయత్రి యొక్క మూడు పాదాల మీద నాలుగు అక్షరాలు తలపాగా లాగా ఉంటుంది కనుక గాయత్రి తర్వాత వచ్చే ఈ ఛందస్సుకు ఉష్ణిక్కు అని పేరు వచ్చిందట. చక్కని ఊహ!
          ఈ విషయం నిరుక్తంలో ప్రతిపాదించారు. అంటే ఛందస్సులకు పేర్లెలా వస్తాయి అన్నది అతి ప్రాచీనతమమైన చర్చ.
          కుమార సంభవం కావ్యంలో కాళిదాస మహాకవి రతీ విలాపంలో "వియోగిని" వృత్తంతో రచించారు.
          కల్పవృక్షంలో సాగరులు భూమిని త్రవ్వే సందర్భంలో విశ్వనాథవారు "మేదిని" వృత్తంతో రచించారు. అదొక నామౌచిత్యం. పద్యాల పేర్లు కూడా ఒకే ఛందస్సుతో వేర్వేరు పేర్లు ఛందశ్శాస్త్రవేత్తలు సూచించారు.
          పింగళుడు సూచించిన "కుసుమతలతావేల్లిత" వృత్తాన్ని భరతుడు చిత్రలేఖ అన్నాడు.
అలాగే "తరలము" వృత్తానికి ధృవ కోకిల అనే పేరు కూడా ఉంది. నిజానికి మత్త కోకిల, ధృవ కోకిల అక్కా చెల్లెళ్లు....ఉత్పల-చంపకాల్లా, మత్తేభ-శార్ధూలాల్లా, మానిని-కవిరాజవిరాజితాల్లా!
ఇంత ఉపోద్ఘాతమెందుకంటే, "మందరం" లోని ఛందః ప్రయోగాలపై ఒక మహోన్నత పరిశోధనా గ్రంథాన్ని మీరు చదవబోతున్నారు. దీని కర్త ప్రఖ్యాత పాత్రికేయులు, జగమెరిగిన అధికారి, సాహితీవేత్త శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు.
          ఈ గ్రంథ రచన ఒక తపస్సులా చేశారు శ్రీ వనం జ్వాలా నరసింహారావు. ఎన్నెన్నో గ్రంథాలు చూశారు. సునిశితంగా ఛందస్సుని గణించారు. ప్రతి వృత్తాన్ని పరిశీలించి లక్ష్య లక్షణ సమన్వయం చేశారు.
          ఆంధ్ర వాల్మీకి ఛందోహృదయాన్ని అందంగాను, సలక్షణం గాను, ఆవిష్కరించారు శ్రీ జ్వాలా వారు.
          కేవలం ఛందస్సుతో సరిపుచ్చకుండా, "మందరం" లో ఇంతవరకు ఎవ్వరూ శోధించని అక్షర, పద్య, సంఖ్యా రహస్యాలను కనుక్కున్నారు. ఏ విశ్వవిద్యాలయమైనా ఈ గ్రంథానికి పి హెచ్ డి ఇవ్వవచ్చు. అత్యుత్తమ పరిశోధన అంతటా సప్రామాణిక తపస్సులా రచన సాగింది.
          గాయత్రీ మంత్రాన్ని రామాయణంలో వాల్మీకి ప్రతిష్టించారు. అలాగే మందరంలో "రామాయనమః" రామ పంచాక్షరి మంత్రాన్ని సంఖ్యా శాస్త్ర రహస్యాలు శోధించి పట్టుకున్నారు శ్రీ జ్వాలా నరసింహారావు గారు. ఇది అపూర్వం. ఆశ్చర్య జనకం!

        "శ్రీమహిజాధవుండు జడ చేతనజీవనధాత సద్గరీ
        యో మరభూరుహంబు సమ దారివిదారణశీలి భక్తవా
        రామృతదాత సంభృతశ రాసకరాంబుజు డొంటిమిట్టశ్రీ
        రాము డమాయవర్తనుడు రక్తి గ్రహించుత మన్నమస్కృతుల్"

          నాల్గవ పాదంలో 1, 4, 5, 17, 18 అక్షరాలు కలిపితే "రామాయనమః" వస్తుంది. మూడవ పాదంలో చివరి అక్షరం "శ్రీ" కలిపితే "శ్రీ రామాయనమః" వస్తుంది. అది షడక్షరి అవుతుంది. ఇలాంటి ఎన్నో విశేషాలు చక్కటి శైలితో రచించారు రచయిత.
          ధర్మార్థకామమోక్షాలను సత్వరం లభింపచేసేది రామాయణం. పఠనం, శ్రవణం, ప్రవచనం, రచనం, దృశ్యీకరణం, శబ్దీకరణం, చర్చ....ఇలా ఏ రూపంలోనైనా రామాయణాన్ని అనుష్టిస్తే ధర్మార్థ కామమోక్షాలు కరతలామాలకాలౌతాయి.
ఈ శ్రేణిలోనే శ్రీ జ్వాలా నరసింహారావు గారు కొత్తగా రహస్య పరిశోధనాన్ని చేర్చారు.
"ఆంధ్ర వాల్మీకి" వాసు దాసు గారి "మందరాన్ని" శోధించి రచించిన రహస్య సంపుటి ఈ గ్రంథం.
          వాసు దాసు గారి సుమారు 40 రకాల ఛందస్సులు ఈ కావ్యంలో వాడారు. సమయోచితంగా, సందర్భోచితంగా, ఛందః ప్రయోగం జరిగింది.
          వాల్మీకి కోకిల తమసా నదిలో స్నానానికి వెళుతున్న సందర్భంలో వాసు దాసు గారు "మత్తకోకిల" రచించారు.
          వాల్మీకికి బ్రహ్మ ప్రత్యక్షమైన సందర్భంలో సృష్టికర్తకు "పంచ చామరం" తో సేవించారు.
          దశరథ మహారాజు ఋష్య శృంగుని వద్దకు వెళ్లే సందర్భంలో ఆరాజగమనానికి సరిపోయే "ప్రహరణ కలిత" వృత్తాన్ని తీసుకున్నారు.
          ఇలా కథ గమనానికి అనుగుణంగా వాసు దాస మహాకవి ప్రయోగించిన ఛందస్సులన్నింటినీ ఒక చోట చదవడం ఒక గొప్ప అనుభూతి.
          బహుశా తెలుగు-సంస్కృత సాహిత్యాలలో ఇలాంటి ప్రయత్నం, గ్రంథ రూపంలో రావడం ఇదే ప్రథమమని నా భావన. పెద్ద పెద్ద వ్యాసాలతో, శోధనలతో క్వాచిత్కంగా సృశించి వదిలి వేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. కానీ గ్రంథ రూపంలో ఒక మహాకావ్యంపై, దానిలోని ఛందస్సు విశ్వరూపాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి. ఆ ప్రయత్నాన్ని శ్రీ జ్వాలా నరసింహారావు గారు చేసి పరిపూర్ణంగా సఫలీ కృతులయ్యారు.
          వాసు దాసు గారు కావ్యాంతంలో "సుగంధి" వృత్తంలో కాండలో ఎన్ని పద్యాలున్నాయో రహస్యంగా చెప్పారు. శ్రీ జ్వాలా నరసింహారావు గారు ఆ రహస్యాన్ని కూడా పాఠకులకు తెలియచేశారు.

          సుగంధి:      రామ చంద్ర గోత్ర చంద్ర రమ్యపద్య గేయమా
                        నామలోత్తర ప్రచార యాదిదేవ శ్రీహరీ
                        రామ యొంటిమిట్టధామ రాజకన్య కాలస
                        ద్వామభాగ దివ్యభోగ వాసు దాససేవథీ

          ఇందు తొలి రెండు పాదాలలో ఈ కాండలో (ఉత్తర) 1713 పద్యాలున్నాయన్న రహస్యముంది. రామ అంటే 3, చంద్ర అంటే 1, గోత్ర అంటే 7, చంద్ర అంటే 1.
          "అంకానాం వమతో గతిః" సూత్రం ప్రకారం వెనుకనుండి వేస్తే 1713 పద్యం సంఖ్య వస్తుంది. ఇలాగే ఎన్నో మంత్ర శాస్త్ర రహస్యాలు, కావ్య శాస్త్ర రహస్యాలు, ఛందశ్శాస్త్ర రహస్యాలు సునిశితంగా శోధించి రచించినదీ పరిశోధనాత్మక గ్రంథం.
          అలాగని ఇది సాధారణ పాఠకులకు ఏదో శాస్త్రం చదువుతున్నామన్న భావన కలగదు. ఇది జనరంజకమైన శైలి సాగే గ్రంథం. ఎన్నెన్నో వినూత్న విషయాలను ప్రాథమిక స్థాయి నుండి పరాకాష్ట స్థాయి వరకు నేర్చుకుంటున్నామన్నఅనుభూతి కలుగుతుంది.
          గణ స్వరూపం దగ్గర నుంచి రామాయణం యొక్క సద్గుణ స్వరూపం దాకా ఈ గ్రంథం మనకు పరిచయం చేస్తుంది.
          ఒక కావ్యం చదువుతున్నట్లు, ఒక వ్యాసం చదువుతున్నట్లు, ఒక శాస్త్రం చదువుతున్నట్లు, మూడు అనుభూతులు ఒకే సారి కలిగించేలా ఈ రచన సాక్షాత్కరిస్తుంది.
          ఛందశ్శాస్త్రం కనుమరుగై పోతుందన్న భయావహమైన ప్రస్తుత స్థితిలో సంప్రదాయ ప్రియులను ఇది అభయ హస్తాన్ని ప్రసాదిస్తుంది.
          తెలుగు సాహిత్యంలో విశేష ఛందస్సులు రచించిన ఇటీవలి కవులందరిపైనా ఇలాంటి పరిశోధన జరగాలి. అలాంటి ప్రయత్నం శ్రీ జ్వాలా నరసింహారావు గారే చేయగలరు. విశ్వవిద్యాలయంలో ఒక శాఖ చేయాల్సిన పనిని శ్రీ రావు గారు ఒంటి చేతి మీద చేయడం, అదీ తాను అమెరికాలో వుండగా చేయడం గొప్ప విషయం.
          ఆంజనేయుడు హిందూ మహా సముద్రాన్ని దాటి సీతాదేవిని అన్వేషించారు. శ్రీ జ్వాలా నరసింహారావు గారు పసిఫిక్ మహా సముద్రాన్ని లంఘించి వెళ్లి ఛందో రహస్య సీతమ్మను అన్వేషించారు.
          శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారికి అస్మదుపాస్య దేవత సకల శుభాలను కలిగించాలని ప్రార్థిస్తూ.....
         
          డాక్టర్. రాళ్లబండి కవితా ప్రసాద్
        సంచాలకులు, భాషా సాంస్కృతిక శాఖ
        తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

No comments:

Post a Comment