Wednesday, September 24, 2014

ఐదారు దశాబ్దాల క్రితం వ్యవసాయం ఎలా వుండేది? వనం జ్వాలా నరసింహారావు

ఐదారు దశాబ్దాల క్రితం వ్యవసాయం ఎలా వుండేది?
వనం జ్వాలా నరసింహారావు

నా బాల్యం, యవ్వనం తొలినాళ్లు, అలనాటి తీపి జ్ఞాపకాలు ఒకటి వెంట మరొకటి గుర్తుకొస్తుంటాయి అప్పుడప్పుడు. మా ఊరు, ఆ వూళ్లోని కొఠాయి (రచ్చ బండ), మా రెండంతస్తుల భవనం, ఆ భవనం ముందున్న స్థలంలో తెలతెలవారుతుండగానే ఇద్దరు పని మనుషులు శుభ్రం చేసి కలాపు నీళ్లు చల్లడం, కిలోమీటర్ దూరంలోని ముత్తారం-అమ్మపేట గ్రామాలు, అక్కడి రామాలయం-వేంకటేశ్వర స్వామి గుడులు, పక్కనే వున్న మా పెదనాన్నగారి గ్రామం వల్లాపురం, మా కచ్చడం బండి, పెంట బండి, మేనా, వరి పొలాలు, మల్లె తోట, మామిడి తోట, మిరప-మొక్క జొన్న తోటలు, తోటలలోని మోటబావులు, జొన్న చేలు, చేలలోని దోసకాయలు, మంచె, మా పది అరకలు, పది జతల ఎద్దులు, పది-పన్నెండు మంది పాలేర్లు (జీతగాళ్లు అనే వాళ్లం), పాడి పశువులు, మేకలు, వరి గడ్డి వాములు, మా ఇంట్లో బావి, బావి పక్కనున్న నిమ్మ-అరటి చెట్లు, మా ఇంటి వెనుక వంట ఇంటి పక్కన ఉదయాన్నే మజ్జిగ చిలికే ప్రక్రియ, అందులో వచ్చిన వెన్న పూస తినడం, ఉదయాన్నే తిన్న చద్ది అన్నం-మామిడి వూరగాయ కారం, మా ఎనిమిదిమంది అన్న దమ్ములం-అక్క చెల్లెళ్లు కలిసి వెండి కంచాలలో భోజనాలు చేయడం, సరదాగా కీచులాడు కోవడం, సాయంత్రం ఇంటి ముందు నీళ్లు చల్లి నవారు-నులక మంచాలు వేయడం, వాటిపై పక్కలు వేయడం, మా పదిమంది కుటుంబ సభ్యులు-అడపాదడపా వచ్చే బంధువులు కబుర్లు చెప్పుకుంటా పడుకోవడం, పడుకోని ఆకాశంవైపు చూసి ఆనందించడం..... ....... ఇలా ఎన్నో విషయాలు గుర్తుకు రాసాగాయి. మా చిన్నతనంలో, మా మామిడి తోటలో కాసిన పండ్లను వైశాఖ మాసంలో పది మందికి పంచిపెట్టిన విషయం కూడా జ్ఞప్తికి వస్తోంది. ఆ రోజుల్లో మా తోటలో వందల-వేల సంఖ్యలో మామిడి పండ్లు కాసేవి. తిన్నన్ని తిని పది మందికి పంచడం ఆనవాయితీగా ప్రతి ఏడు చేసే వాళ్లం. సరే...ఇప్పుడా తోట లేదు.....పండ్లు లేవు. ఇటీవలే మా అబ్బాయి ఆదిత్య మామిడితోట కొనడం, గతంలోని మోతాదులో కాకపోయినా కొన్ని పండ్లనైనా పంచే అవకాశం దొరకడం మా అదృష్టమే.

మా వూరి పేరు వనం వారి కృష్ణా పురం. ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో వుంది. ఒకప్పుడు ఖమ్మం తాలూకాలో వుండేది. గతంలో పాలేరు శాసనసభ నియోజక వర్గంలోను, ప్రస్తుతం మధిర నియోజక వర్గంలోను వుంది. కిలోమీటర్ దూరంలోని ముత్తారం రెవెన్యూ గ్రామానికి ఇది శివారు గ్రామం. ముత్తారంకు మరో శివారు గ్రామం కూడా వుంది. దాని పేరు కోదండరామపురం. ఈ మూడు గ్రామాలకు కలిపి మా వూరి పేరుమీద పంచాయతీ బోర్డు వుంది. మా పూర్వీకులు వనం కృష్ణరాయలు గారు కట్టించిన గ్రామమైనందున వూరికాపేరు వచ్చిందంటారు. ఇప్పుడైతే ఎక్కువమంది లేరు కాని, ఒకానొకప్పుడు, మా ఇంటి పేరు (వనం వారు) కుటుంబాలు సుమారు పాతిక వరకుండేవి మా వూళ్లో. కరిణీకం కూడా మా ఇంటి పేరువారిదే. ముత్తారం గ్రామంలో ఇటీవలే పునర్నిర్మించిన పురాతన రామాలయం కూడా వుంది.

మాకు మొదట్లో సుమారు నాలుగు వందల ఎకరాల భూమి వుండేది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో అమలైన కౌలుదారీ చట్టం-భూ సంస్కరణల చట్టం నేపధ్యంలో సుమారు రెండు వందల ఎకరాల భూమిని అమ్ముకోవాల్సి వచ్చింది. అలా వచ్చిన పైకంతో ఖమ్మంలో ఒక ఇల్లు, ఊళ్లో ఒక ఇల్లు కట్టించారు నాన్నగారు. అమ్మగా మిగిలిన రెండు వందల ఎకరాల భూమిలో సొంతంగా సేద్యం చేసేవారు నాన్న. పది మంది పాలేర్లు, పది అరకలు, నాలుగైదు ఎద్దుల బండ్లు, చిన్న కచ్చడం బండి, పది జతల ఎద్దులు, వాటికి పెద్ద కొష్టం, పాడి గేదెలు-ఆవులు, వందల సంఖ్యలో మేకలు.....ఇలా అంగరంగ వైభోగంగా వుండేది చిన్నతనంలో. కాలికి మట్టి అంటకుండా పెంచారు మమ్ములను.

మా నాన్నగారు చేస్తున్న వ్యవసాయానికి ప్రతిఫలంగా సుమారు 40 పుట్ల వడ్లు (పుట్టికి 75 కిలోల బరువుండే ఎనిమిది బస్తాలు), 20 పుట్ల జొన్నలు, 40-50 పుట్ల వేరు శనగ, 10 పుట్ల కందులు, 10 పుట్ల పెసలు, వీటికి తోడు మిరప కాయలు, పొగాకు, మామిడి పంట, మల్లెలు.....ఇలా... ప్రతి ఏటా పండేవి. మా భూమిలో సుమారు నలబై ఎకరాలను పాడి పశువుల మేత కొరకు బీడు భూమిగా వదిలే వాళ్లం. మా వూరి సరిహద్దు నుంచి పక్కనున్న మల్లన్నపాలెం సరిహద్దు వరకు వున్న భూమంతా మాదే! అందులో నల్ల రేగడి భూమి సుమారు నలబై ఎకరాలుండేది. వూరిపక్కనే పది ఎకరాల అంటు మామిడి తోట వుండేది. ఎకరం విస్తీర్ణంలో ముత్తారం దగ్గర ఐదారు పెద్ద నాటు మామిడి చెట్లు కూడా వుండేవి. ఆ చెట్లలో "పుట్ట మాకు" కాయలు కాసే చెట్టు ఒకటి వుండేది. ఆ కాయలనే వూరగాయలకు, పండిన తరువాత తింటానికి వాడే వాళ్లం. పచ్చిగా వున్నప్పుడు ఎంత పుల్లగా వుండేవో పండిన తరువాత అంతకంటే ఎక్కువ మోతాదులో తియ్యగా వుండేవి. నల్ల రేగడిలో జొన్న పంట వేసే వాళ్లం. ముత్తారం గ్రామ సరిహద్దులలోని వూర చెరువు కింద వరి పొలం సుమారు పాతిక ఎకరాలుండేది. అందులో వడ్లు పండేవి. వూర చెరువు లోపలి భాగం కూడా మా పట్టా భూమే. చెరువులోకి నీరు రాకపోతే, జనప పంట వేసే వాళ్లం. ఇప్పటికీ నా పేరు మీద, పోగా మిగిలిన ఏడెకరాల వరి పొలం (గుండ్ల పంపు) వుంది. అందులో ఏటా సుమారు రు. 50 వేల విలువైన పంట పండుతోంది. వల్లాపురం గ్రామ సరిహద్దుల్లోని "ఎర్రమట్టి చేను", ముత్తారం సరిహద్దుల్లోని "గుడిపాటి చేను", "జిట్టమర్రి చేను", మల్లన్న పాలెం సరిహద్దుల్లోని "రేగడి చేను", వూరి పక్కన వున్న బీడు అంచలంచలుగా అమ్మి వేశాం. "బోదుల సాహిబ్ చేను" తమ్ముడి అధీనంలో వుందింకా. అంటు మామిడి తోట లేదిప్పుడు. వరి పొలాలలో "బత్తులోరి పంపు", "నంది మిట్ట", "గుండ్ల పంపు" ఇంకా మిగిలున్నాయి.

నేను మూడు సంవత్సరాల పాటు, మా గ్రామంలో వుండి వ్యవసాయం చేయించాను. రాజకీయాలలో కూడా చురుగ్గా పాల్గొన్నాను. వ్యవసాయపు పనులు వేసవి కాలంలోనే మొదలయ్యేవి. పొలాలకు పెంట తోలే ప్రక్రియతో వ్యవసాయపు పనులు మొదలయ్యేవి. ఉగాది పండుగ కల్లా రాబోయే సంవత్సరానికి పాలేర్లను (జీతగాళ్లను) కుదుర్చుకునే వాళ్లం. ఆ రోజుల్లో పెద్ద పాలేరుకు సంవత్సరానికి పది నుంచి పన్నెండు బస్తాల జొన్నలిచ్చేవాళ్లం. జొన్నల ధర పెరిగినా, తగ్గినా అదే జీతం. మిగిలిన వాళ్లకు ఎనిమిది బస్తాలవరకిచ్చేవాళ్లం. వీరిలో కొందరిని వ్యవసాయ పనులకు, కొందరిని పాడి పశువులను కాసేందుకు, ఒకరిద్దరిని ఇంటి పనులకు ఉపయోగించుకునే వాళ్లం. మొదలు మా పాడి పశువుల వల్ల పోగైన పెంటను తోలే వాళ్లం. ఆ పెంటను నిలవ చేయడానికి మా పాత ఇంటిలోని స్థలాన్ని ఉపయోగించుకునే వాళ్లం. సుమారు నాలుగైదు వందల బండ్ల పెంట మా పశువుల ద్వారా పోగైంది వుండేది. మాకున్న ఐదు ఎద్దుల బండ్లను ఆ పని అయ్యేంతవరకు పెంట బండ్లలా వాడే వాళ్లం. దీనికి అదనంగా మా గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాలలో పొలాలు లేని వారి దగ్గర నుంచి పెంట ఖరీదు చేసి కొని పొలాలకు తోలే వాళ్లం. చెల్లింపులన్నీ ధాన్యం రూపేణగానే జరిగేది. పక్కనే వున్న మల్లన్నపాలెం గ్రామంలో అంతా యాదవులే (గొల్లలు) వుండేవారు. వారి దగ్గర "జీవాలు" (గొర్రెలు) వుండేది. వందల సంఖ్యలో వుండే జీవాలను పొలాలలో రాత్రింపగళ్లూ వుంచేవాళ్ళం. అదీ ఖరీదుకే. అలా వుంచడం వల్ల పొలాలలో జీవాల పెంట పోగయ్యేది. అది పొలాలకు ఎరువులాగా ఉపయోగపడుతుంది. అప్పట్లో రసాయనిక ఎరువుల వాడకం అలవాటు ఇంకా సరిగ్గా కాలేదు. ఇళ్లలో పోగైన పెంటను, జీవాల పెంటను మాత్రమే ఎరువులాగా వాడే వాళ్లం. అదనంగా, చెరువు పూడిక తీసి మట్టిని పొలాలకు తోలే వాళ్లం. తెల్లవారు జామునుంచే పెంట బండ్లను కట్టే ప్రక్రియ మొదలయ్యేది. మధ్యాహ్నం పన్నెండు (రెండు జాములు అనే వాళ్ళు) గంటల సమయం వరకు తోలి ఇళ్లకు తిరిగి వచ్చే వాళ్ళు జీతగాళ్లు. పొద్దున్నే చద్ది అన్నం తినే వాళ్ళు. నేను కూడా అప్పుడప్పుడు పెంట బండి తోలేవాడిని. మధ్యాహ్నం సుమారు రెండు గంటల పాటు వాళ్ల ఇళ్లకు వెళ్లి భోజనం చేసి వచ్చి, ఎడ్లకు దానా వేయడం, నీళ్లు పెట్టడం లాంటివి చూసుకునేవారు. ఆ సంవత్సరానికి కావాల్సిన వ్యవసాయ పనులకు సంబంధించిన వాటిని ఒక గంట-రెండు గంటల పాటు చూసుకునేవారు. ఉదాహరణకు తాళ్లు పేనడం. మళ్లీ నాలుగు గంటల ప్రాంతంలో పెంట బండ్ల కార్యక్రమం మొదలయ్యేది. వెన్నెల రోజుల్లో రాత్రుళ్లు కూడా బండ్లు తోలేవారు. ఇలా తొలకరి జల్లులు కురిసే వరకు కొనసాగేది.

మా జీతగాళ్ల పేర్లు కొందరివి ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. అచ్చయ్య అనే వ్యక్తి జీవనాధారం కొరకు ఎక్కడి నుంచో మా వూరికి నా చిన్నతనంలో వలస వచ్చాడు. మా నాన్న గారికి అతను నచ్చాడు. ఆయన దాదాపు పాతిక సంవత్సరాలకు పైగా మా పెద్ద పాలేరులాగా వుండేవాడు. మిగిలిన జీతగాళ్లందరు ఆయనను "అచ్చయ్యగారు" అని సంబోధించేవారు. మా నాన్నకు కుడి భుజంలాగా వుండేవాడు. మేం ఎన్నడూ ఆయనను పాలేరులాగా చూడలేదు. మా ఇంటి సొంతమనిషిలాగా చూసుకునే వాళ్లం. గౌరవించేవాళ్ళం. ఆయనకు భార్యా పిల్లలు లేరు. మా ఇంట్లోనే వుండేవాడు. ఆయన తరువాత ఆ పనికి దాసరి తిరుపతయ్యను పెట్టుకున్నాం. తరువాత కొన్నాళ్లు చాగంటి నారాయణ, ముండ్ర చంద్రయ్య ఆ పని చేశారు. దరిమిలా చాగంటి నారాయణ మా గ్రామ సర్పంచ్‌గా కూడా ఎన్నికయ్యాడు. ముండ్ర చంద్రయ్య కుమారుడు అప్పారావు కూడా గ్రామ సర్పంచ్ అయ్యాడు. వెంకులు ఇంటి పని చూసేవాడు. చెన్నయ్య అనే మరొక జీతగాడు వుండేవాడు. రోజంతా పని చేయడమే కాకుండా జీతగాళ్లు రాత్రుళ్లు మా ఇంటి ముందర నిద్రపోవడానికి వచ్చే వాళ్ళు. వాళ్లను పొద్దున్నే లేపి పొలం పనులకు పురమాయించేవాళ్ళం. ఇంటి పని చూసుకునే వెంకులు గేదెల, ఆవుల పాలు పితకడం, కవ్వంతో పెరుగు చిలికి మజ్జిగ చేయడం, అంట్లు తోమడం లాంటి పనులు చేసేవాడు. ప్రతి రోజు ఉదయం మా ఇంట్లో తయారైన మజ్జిగను తీసుకెళ్లేందుకు కొందరొచ్చేవారు. వాళ్లు ఇంట్లో తాము తినేందుకు జొన్నలు దంచుకుని, మా గేదెలు-ఆవులు తాగేందుకు మా ఇంటికి వచ్చి దాని తొక్కు వంచి పోయేవారు. బదులుగా మజ్జిగ (చల్ల అనే వాళ్లం) తీసుకు పోయే వాళ్లు. వేసవి కాలంలో, మా ఇంటి వెనుక కుండలో వుంచిన మజ్జిగను కడుపు నిండా ఎన్నో సార్లు తాగే వాళ్లం. ఇంట్లో పని చేయడానికి కుదుర్చుకున్న జీతగాడిని బట్టలు ఉతకడానికి వాడుకోక పోయే వాళ్లం. ఉదయాన్నే చాకలి వచ్చి విడిచిన బట్టలు తీసుకెళ్లి వూరి బయట వున్న వాగులోనో, చెరువులోనో వుతికి సాయంత్రం తెచ్చే వాళ్లు. మా ఇంట్లో వంట వండడానికి కూడా ఒకరుండేవారు

తొలకరి వానలు మొదలవ్వగానే పొలం పనులలో కొంత మార్పు వచ్చేది. వరి పొలాలకు కావాల్సిన నారు చల్లడం, పునాస పంటలకు పొలాలను నాగళ్లతో దున్నడం, దంతెలతో దున్నడం జరిగేది. వర్షాలు కురిసే తీరుతెన్నుల ఆధారంగా పొలం పనులలో మార్పులు చేర్పులు జరుగుతుండేవి. వర్షాలు ఆగుతే మిగిలిన పెంటను తోలడం కొనసాగించేవారు. వేరు శనగ, అందులో కంది పంటలు వేసే వాళ్లం. చెరువులకు నీళ్లు రావడం జరుగుతే వరి నాట్లు వేసే వాళ్లం. ఆ తరువాత జొన్న పంట వేసే వాళ్లం. వరి నాట్లు వేయడం నాకింకా బాగా గుర్తుంది. నాట్లు వేయడానికి ముందర పొలాన్ని మొదలు నాగళ్లతో, తరువాత బురద నాగళ్లతో దున్నడం జరిగేది. సాధారణంగా మా గ్రామంలో వరి నాట్లు మహిళలే వేసేవారు. పాటలు పాడుకుంటూ, హుషారుగా నాట్లు వేసేవారు. నాట్ల రోజుల్లో నేను భోజనం పొలం దగ్గరకే తెప్పించుకుని చేసేవాడిని. అక్కడ చెరువు నీళ్లే తాగేవాడిని. ఆ నీరు తాగడానికి భయమేసేది కాదు. ఇప్పుడైతే మరి మినరల్ వాటర్! నాట్లు పడ్డ తరువాత దశలవారీగా పొలాలకు నీరు పెట్టడం జరిగేది. ఒక్కో సారి రాత్రుళ్లు పోయి వంతుల వారీగా నీళ్లు పెట్టే వాళ్లం. నీళ్లు సరిపోకపోతే పొలాలలో ఒక పక్కన కొంత లోతు వరకు తవ్వి, నీటిని తీసి చేది పోయడం జరిగేది. వరి కొంత పెరిగిన తరువాత కలుపు తీయడం జరిగేది. మూడు-నాలుగు నెలల తరువాత కోతల సీజన్ ఆరంభమయ్యేది. కోయడం, గూళ్లు వేయడం, సమయం చూసుకుని, వాతావరణం అనుకూలించినప్పుడు నూర్పిడి చేయడం, తూర్పార పట్టడం, చివరకు వరి ధాన్యాన్ని ఇంటికి తోలడం జరిగేది. ఈ ప్రక్రియ జరిగినన్నాళ్లు వరి పొలంలోనే రాత్రుళ్లు నిద్రించే వాళ్ళం. ఆ ఆనందం ఇప్పుడు తలుచుకుంటుంటే ఒక మధురానుభూతిలాగా అనిపిస్తోంది. నాటు కూలి, కోత కూలి, ఇతర కూలి అంతా ధాన్యం రూపేణగానే. ఎకరానికి ఐదారు కుండల ధాన్యం కూలీగా వుండేది. రేట్లు పెంచమని అడపాదడపా కూలీలు ఆందోళన చేసే వాళ్లు కూడా. కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిగా నేను వాళ్లకు మద్దతిచ్చేవాడిని. నాట్ల సీజన్లో, కోతల సీజన్లో ఇతర ప్రాంతాల నుంచి కూడా కూలీలు వచ్చేవారు.

ఇక వేరు శనగ పంట వ్యవహారం మరో విధంగా వుండేది. విత్తనాలు తయారు చేయించే ప్రక్రియతో మొదలయ్యేది. ఇంటికి కూలి వాళ్లను పిలిచి, క్రితం సంవత్సరం పండిన వేరు శనగ కాయలను కొలిచి, వాటినుంచి విత్తులను తీయమని వాళ్లకు చెప్పే వాళ్లం. వాళ్లలో కొందరు తమ ఇంటికి తీసుకెళ్లి చేసేవారు, కొందరు మా ఇంట్లోనే చేసేవారు. సాయంత్రం కల్లా వాళ్ల-వాళ్ల సామర్ధ్యాన్ని పట్టి కుండెడో-రెండు కుండలో కాయ కొట్టి విత్తులను తీసే వాళ్లు. వాళ్ళకు కూలీ ధాన్యం రూపేణగానే ముట్టేది. విత్తులు తీసేటప్పుడు కొంత భాగం పప్పు అయ్యేది. ఆ పప్పుతో శనగ నూనె చేయించి ఇంట్లో ఉపయోగించే వాళ్లం. వర్షాలు పడగానే, భూమిని దున్ని అదను కుదిరినప్పుడు "ఎద" పెట్టే వాళ్లం. ఒకడు ఎద గొర్రు తోలుతుంటే, పక్కన నడుచుకుంటూ మరొకరు, శనగ విత్తులను, భూమిలోకి గొర్రు పైభాగంలోంచి భూమిలో పడేలా పోసేవారు. అతి క్లిష్టమైన ఈ ప్రక్రియ అందరికీ చేత కాదు. పైగా శనగ విత్తులతో పాటు కంది విత్తనాలు కూడా ఒక పద్దతి ప్రకారం ఎద పెట్టాలి. శనగ పంట ముందు చేతికొస్తుంది. ఆ తరువాత రెండు నెలలకు కంది పంట వస్తుంది. శనగ విత్తనాలు మొలకెత్తిన నెల రోజుల తరువాత పై పాటు చేయాలి. ఇది కూడా కష్టమైన పనే. పై పాటు చేసే అరకలను అందరూ తోలలేరు. ఎద్దుల కాళ్ల కింద మొక్కలు నలిగి పోకుండా, అరక కింద చెట్లు పడ కుండా తోలాలి. అదెంతో ముచ్చటేసేది. మూడు నెలల తరువాత కూలి వాళ్లతో శనగ మొక్కలను భూమి నుంచి పీకించి కాయలను వేరు చేయించే వాళ్లం. మరో రెండు నెలలకు కంది కళ్ళం వేసి ఆ పంటను కూడా తెచ్చుకునే వాళ్లం. ఇక మరో పంట జొన్న. వీటినే పచ్చ జొన్నలనే వాళ్లం. ఇటీవల కాలంలో నీటి పారుదల ప్రాజెక్టులు వచ్చిన తరువాత జొన్న పంట దాదాపు ఎవరూ వేయడం లేదు. దీనికి కూడా ఎద పెట్టడం వుంటుంది. జొన్న పంట తయారైన తరువాత కోసి, కట్టలు కట్టించే వాళ్లం. కూలీ కింద కట్టలనే ఇచ్చే వాళ్లం. ప్రతి ఐదు కట్టలకు ఒక కట్ట కూలీ కింద పోయేది. ఇక ఆ తరువాత జొన్న గూడు వేయించడం, కంకి కోయించి తొక్కించడం, తూర్పార బట్టడం, ధాన్యాన్ని ఇంటికి-మార్కెట్‌కు చేర్చడం జరిగేది.

ఈ పంటలకు తోడు మేం మిరప తోట వేసే వాళ్లం. మధ్యలో బంతి పూల చెట్లు వేసే వాళ్లం. మా ఇంటి పక్కనే తోట వుండేది. అందులో ఒక పక్క మల్లె తోట కూడా వుండేది. తోటలో మోట బావి వుండేది. మోట తోలడం కూడా కష్టమైన పనే. మోట తోలడానికి కట్టిన ఎద్దులను వెనుకకు నడిపించుకుంటూ, భావి ముందరకు తీసుకెళ్లాలి. భావిలో మోట బక్కెట్ (చాలా పెద్దగా వుంటుంది) పూర్తిగా మునిగి నీరు నిండే లాగా ఎద్దులను వెనక్కి తేవాలి. అప్పుడు మునిగి-నిండిన బకెట్ పైకి రావడానికి ఎద్దులను ముందుకు తోలాలి. బకెట్ కట్టిన తొండం లోంచి నీరు భావిదగ్గరున్న కాలువలో పడి ప్రవహించుకుంటూ మిరప చెట్లను తడుపుకుంటూ పోతుంది. మోట తోలడం సరదాగా కూడా వుంటుంది. అలానే పొగాకు పంట కూడా వేసే వాళ్లం. వూరి బయట వున్న మరో తోటలో మొక్క జొన్న వేసే వాళ్లం. కొన్నాళ్లు దినుసు గడ్డలు, వుల్లి గడ్డలు కూడా సాగు చేశాం. క్యాబేజీ, కాలీ ఫ్లవర్ లాంటి కూరగాయలతో సహా ఎన్నో రకాల కూరగాయలను కూడా పండించాం. ఇక మామిడి తోట సరేసరి. జొన్న చేలల్లో పప్పు దోసకాయలుండేవి. అవి అక్కడనే కొడవలితో కోసుకుని, మంచెపైకెక్కి కూచుని తినే వాళ్లం. జొన్న వూస బియ్యం కూడా కొట్టించుకుని, పలుకు రాళ్ల నిప్పులో వేడి చేసుకుని తినే వాళ్లం. చేనులో దొరికే పెసలు తినే వాళ్లం.


ప్రతి పంటకు "పరిగ" అని వుండేది. మాకు జీతగాళ్లే కాకుండా, ఒకరిద్దరు మేమిచ్చే వార్షిక కూలీ మీద ఆధారపడి జీవించే వాళ్లున్నారు. వాళ్లు మాకు అవసరమైన చిల్లర పనులను చేసేవారు. ఉదాహరణకు మా జీత గాళ్లకు కావాల్సిన పాదరక్షలను తయారు చేసే వారుండేవారు. మా పొలాలకు నీరు పెట్టే నీరుకాడుండేవాడు. మా ఇంటి ముందు అలకడానికి కావాల్సిన ఎర్ర మట్టిని తెచ్చి పెట్టేవాడుండేవాడు. మా బట్టలుతికే వాళ్లు. మేమిచ్చే సమాచారాన్ని మా వూరి నుంచి ఇతర గ్రామాలకు తీసుకెళ్ళే మనిషి. ఇలా... కొందరుండేవారు. మా పొలాలలో పంటను మేం తీసుకెళ్ళిన తరువాత, పొలంలో మిగిలిన దాన్ని "పరిగ" అంటారు. అదంతా వాళ్లకే చెందుతుంది. పరిగ కూడా చాలా మోతాదులోనే వుంటుంది ఒక్కో సారి.

1 comment:

  1. మీ వ్యవసాయం, ఆ నాటి అనుభవాలు చాలా బాగున్నాయండి. ఎంతైనా మెట్ట వ్యవసాయం....మెట్ట వ్యవసాయమే. తరి కింద సాగు చేసే వరి. ఎప్పుడూ ఒకటే పంట కదా. అదీ కాక ఇప్పుడంతా కోతమిషన్లు..ట్రాక్టరే కదా.
    మీ అనుభవాలు మరిన్ని వివరించగలరు.

    ReplyDelete