Saturday, October 27, 2018

శూర్పణఖ ప్రేరేపణతో శ్రీరాముడితో యుద్ధానికి పోయిన ఖరుడు ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-32 : వనం జ్వాలా నరసింహారావు


శూర్పణఖ ప్రేరేపణతో శ్రీరాముడితో యుద్ధానికి పోయిన ఖరుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-32
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (28-10-2018)

         భయంకరంగా గట్టిగా ఏడ్చుకుంటూ, జనస్థానంలో వున్న ఖరాసురుడి దగ్గరకు వచ్చిన శూర్పణఖను (రాక్షస నాశనానికి కారకురాలు కాబోతున్న) చూసి ఖరుడు ఇలా అన్నాడు. “ఎందుకే మళ్ళా ఏడుస్తూ వచ్చావు? నువ్వు కోరినట్లే, నీ ఇష్టప్రకారమే, మిక్కిలి శూరులైన రాక్షస శ్రేష్టులను నీ వెంట పంపానుకదా? ఇంకా ఎందుకు ఏడుస్తావు? ఆ పద్నాలుగు మంది నేనంటే భక్తికలవారు. చెప్పిన కార్యం చేయక మానరు. మిక్కిలి ధీరులు. అనురాగం కలవారు. యుద్ధంలో ఓటమి ఎరుగానివారు-పరులకు జయించరానివారు. అయ్యో! నాథా అని ఆడుపాములాగా పొరలి-పొరలి ఏడుస్తున్నావెందుకే? ఏ కారణాన ఏడుస్తున్నావు? ఉన్న విషయం చెప్పు. దీనురాలివై, అయ్యో! నాకు దిక్కెవరూ లేరని ఏడుస్తూ వున్నావెందుకు? నేనున్నాను కదే నీకు దిక్కు. అక్కడ ఏం జరిగిందో చెప్పవే. భయం వదలవే”.

ఇలా ఖరుడు అనగానే, కన్నీళ్లు చేత్తో తుడుచుకొని, లేచి కూర్చొని, తోడబుట్టినవాడిని చూసి, “నా పగ తీర్చడానికి నువ్వు బలవంతులైన పద్నాలుగు మంది రాక్షసులను పంపిన మాట వాస్తవమే. అయినప్పటికీ నువ్వు పంపిన వారందరూ రాముడి పదునైన, భయంకరమైన బాణాలకు చీల్చబడ్డ శరీరాలతో క్షణకాలంలో నిలబడి చచ్చిపోయారు. అది చూసిన నేను, అక్కడ వుంటే నన్నేం చేస్తారో అన్న భయంతో, గాలి వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చానిక్కడికి. అప్పుడు పుట్టిన వణుకు ఇప్పటికీ తగ్గలేదు. ఖరుడా చూడు, నా మాట అసత్యమేమో? గొప్ప విషాదమనే మొసళ్ళను, మహా భయమనే అలలను కల పెద్ద దుఃఖం అనే సముద్రంలో మునిగిన నన్ను లేవదీయి. నీ పనికోసం పోయిన రాక్షసుల మీద, తోబుట్టువైన నామీద, నీకు కొంచెమైనా దయ నిజంగా వుంటే, నువ్వు రాముడిని ఎదిరించి, యుద్ధం చేసే ధైర్యం వుందా? వుంటే, ఏదీ చూద్దాం...తక్షణమే ఆ రాక్షసులపాలిటి ముల్లైన రాముడిమీదకు యుద్ధానికి బయల్దేరు”.

“చనిపోయిన రాక్షసుల మీద, బతికున్న నా మీద, దయ లేకున్నా, రాముడిని ఎదిరించి యుద్ధం చేసే ధైర్యం లేకున్నా, నాతో పాటు నువ్వు కూడా ఇంట్లోనే వుండు. నేను ఏడుస్తుంటా...నువ్వు సంతోషంగా నవ్వుతుండు. ఆయన నిశాట కంటకుడు కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చున్నా వదిలిపెట్టడు. ఎప్పటికైనా పక్కనున్న ముల్లు గుచ్చుకోకుండా వుంటుందా? నాకు శత్రువైన శ్రీరామచంద్రమూర్తిని నువ్వు చంపడానికి ప్రయత్నం చేయకపోతే, నువ్వు చూస్తుండగానే, నీ ఎదుటనే ప్రాణాలు వదులుతా. ముక్కు-చెవులు కోయించుకొని కూడా పగ తీర్చుకోలేని ఈ అవమానపు బతుకు బతకడంకంటే చావడం మేలు కదా? నా ఆరాటం కొద్దీ నేను చెప్తున్నా కానీ వాస్తవం ఆలోచిస్తే, నువ్వు నీ సైన్యంతో పోయినా యుద్ధ భూమిలో ఆయన ఎదుట నిల్వలేవని అనిపిస్తున్నది. ఆయన బలం, ఆయన ధైర్యం ఎక్కడ? పిరికిపందవు, దుర్బలుడివి, నువ్వెక్కడ?

         “నాకేంటి? బలశౌర్యాలు లేకపోవడం ఏంటి? దేవతలను జయించానంటావా? అట్లయితే ఏదీ...నీ బాల శౌర్యాలు చూద్దాం. వెంటనే శ్రీరామచంద్రుడిని యుద్ధంలో ఎదుర్కోవడానికి సైన్యంతో బయల్దేరు. అలా చేయలేకపోతే, బలం, ధైర్యం లేని పిరికిపందకు ఈ దండకాటవి ఎందుకు? ఓరీ కులదూషకా! రాక్షస కులానికి అపకీర్తి తేవడానికి పుట్టావా? ఇక ఇక్కడ ఆలశ్యం చేస్తే, రాముడు రానే వస్తాడు. అదిగో రాముడు వస్తున్నాడు....నిన్నిక్కడే పూడుస్తాడు. మరెక్కడికైనా పరుగెత్తు. నా ముక్కు-చెవులు కోసి నన్నిలా అవమానించిన వీరుడిని, రఘువంశనాయకుడిని, శ్రీరామచంద్రమూర్తిని, ఆయన తమ్ముడు లక్ష్మణుడిని నువ్వేమని భావిస్తున్నావురా? సామాన్య మనుష్యులు అనుకుంటున్నావా? పది మంది, నూరు మంది ఆయన్ను గెలవగలరని అనుకుంటున్నావా?” అని శూర్పణఖ పెద్ద నగారా వాయించినట్లు కడుపు మీద బాదుకుంటూ, ఏడుస్తుంటే రాక్షస నాయకుడు ఖరుడు సమాధాన పరచాడు.


         శూర్పణఖ నిందా వాక్యాలకు, తన పౌరుషాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన మాటలకు జవాబుగా ఖరుడు “నా తోబుట్టువైన నిన్ను అవమాన పర్చారన్న అవమానం వల్ల కలిగిన కోపం, పొంగిపోయే సముద్రాన్ని అణచడం సాధ్యం కానట్లే, తగ్గించడం సాధ్యం కాదు. నీచ మనుష్యులను, చచ్చిన వాళ్లతో సమానమైన వారిని, నేను లక్ష్య పెట్తానా? వాడిని నేను చంపాల్సిన పని లేదు. వాడి దుష్ట చేష్టల వల్ల వాడే లోకంలో చంపబడుతాడు. ఇలాంటివాడు ఇలా చేసి చచ్చాడని పేరు మాత్రం నిలుస్తుంది. ఎందుకు ఏడుస్తావు? ఏడవ వద్దు. ఇదిగో ఇప్పుడే పోయి తమ్ముడితో సహా రామచంద్రుడిని నా పదునైన బాణాలతో, కఠినమైన కత్తితో చంపుతా. ఆ దుష్టుడి వేడి-వేడి నెత్తురు నీ పగతీరేదాకా జుర్రుకో” చెప్పగానే శూర్పణఖ సంతోషించింది. తమ్ముడిని మరీ-మరీ పొగిడింది. వాడు కూడా మరింత విర్రవీగుతూ, దూషణుడు అనే పౌరుషం, కోపం కల సేనానాయకుడిని పిలిచి యుద్ధానికి సన్నద్ధం కమ్మన్నాడు.

         బలంతో భయంకరమైన వేగం కలవారిని, యుద్ధంలో వీపు చూపించని వారిని, సాహసవంతులను, నల్లటి మేఘం వన్నె దేహం కలవారిని, దయలేనివారిని, హింస చేయడానికి ఇష్ట పడేవారిని, సింహంలాగా పరాక్రం కలవారిని, తన ఇష్టప్రకారం నడిచేవారిని, రణప్రయత్నం కలవారిని, భయంకరమైన బలం కలవారిని, పద్నాలుగువేల రాక్షసులను శీఘ్రంగా సమకూర్చమని దూషణుడిని పురమాయించాడు ఖరుడు. విల్లులు, బాణాలు, కత్తులు, ఇతర అనేక ఆయుధాలు కల తన రథాన్ని తీసుకురమ్మన్నాడు. పౌలస్త్య వంశంలో పుట్టిన రాక్షసుల ముందు తానూ పోతానన్నాడు. తన వెనుక సైన్యాన్ని రమ్మన్నాడు. శ్రీరామచంద్రుడికి చావుకూడేట్లు చేసి జయం పొంది లోకంలో ప్రసిద్ధికెక్కుతానన్నాడు.

         ఖరుడు ఇలా చెప్పగా దూషణుడు ప్రళయకాలం నాటి సూర్యుడితో సమానమై, నానా వర్ణాల గుర్రాలు కట్టిన రథాన్ని అతడి ముందు నిలిపాడు. దాని మీదకు కోపంతో ఎక్కాడు ఖరుడు. ఖరుడు రథం ఎక్కగానే, దూషణుడు పెద్ద సేనతో ఖరుడి పక్కన నిలిచాడు. సైన్యాన్ని కదలమని ఖరుడు ఆజ్ఞాపించాడు. ఆ వెంటనే వేగంగా సేన బయల్దేరింది. ఆ ధ్వనికి అడవిలో మృగాలు తత్తరపాటుతో ఎటూ పోవడానికి దారితోచక తికమకలాడాయి. కొన్ని భయంతో మూర్చపోయాయి. సలాకులు, ముద్గారాలు, కత్తులు, గండ్రగొడ్డళ్ళు, బాకులు, వజ్రాయుదాల లాంటి కత్తులు, బల్లాలు, ఇనుపకట్ల గుదియలు, విల్లులు, బాణాలు చేతుల్లో ధరించి, చూసేవారికి భయంకరమైన వేషాలతో, భూమి గడగడ వణకుతుంటే పద్నాలుగు వేలమంది రాక్షసులు బయల్దేరారు. ఖరుడి మనసెరిగిన అతడి సారథి సైన్యం వెంట తీవ్రంగా రథాన్ని తోలాడు. ఆ రథం గమనవేగం వల్ల పుట్టిన ధ్వని భూమి నాలుగు దిక్కులా వ్యాపించింది. ఖరుడు కోపంతో, కఠినమైన గొంతుతో సారథిని త్వరితగతిన రథాన్ని తోలమని పురమాయించాడు.

No comments:

Post a Comment