Wednesday, December 4, 2019

వాసుదాస విరచిత శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.....యుద్ధకాండ మందర మకరందం : అనువక్త-వాచవి, వనం జ్వాలా నరసింహారావు


వాసుదాస విరచిత శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం,
యుద్ధకాండ మందర మకరందం
అనువక్త-వాచవి, వనం జ్వాలా నరసింహారావు
ముందుగా నా మాట
పదహారు సంవత్సరాల యజ్ఞం పూర్తయింది. 2003 లో మా రెండో అమ్మాయి కిన్నెర సిన్సినాటి (అమెరికా) లో వున్నప్పుడు దాని కూతురు ప్రసవ సమయంలో సహాయంగా వుండడానికి  దంపతీ సమేతంగా వెళ్లిన నేను హైదరాబాద్ లో మొదలుపెట్టిన సుందరకాండ మందర మకరందం పుస్తకాన్ని పూర్తిచేసాను. కొంతకాలానికి, మిత్రుల, సన్నిహితుల ప్రోత్సాహంతో బాలకాండ మొదలుపెట్టాను. అయితే, కారణాలు ఏమైనప్పటికీ, ఆ తరువాత చాలాకాలానికి గాని, అంటే, 2009 లో మా అబ్బాయి ఆదిత్య అమెరికా సాన్ ఫ్రాన్సిస్కో నగరంలో వున్నప్పుడు, మా మనవరాలు కనక్ పుట్టే సమయంలో అక్కడికి పోయినప్పుడు, బాలకాండ మందర మకరందం పూర్తి చేయగలిగాను. అది తీసుకుని ఒక పబ్లిషర్ దగ్గరికి వెళ్తే మొత్తం రామాయణాన్ని రాసిన తరువాత అన్నీ కలిపి ముద్రిస్తానన్నాడు. అదోక ఛాలెంజ్ లాగా తీసుకున్నాను. అన్ని కాండలు రాయాలని నిశ్చయించుకున్నాను. బాలకాండ మొదటి ముద్రణ చిన జీయర్ స్వామి దయతో జరిగింది.

తరువాత అయోధ్య కాండ మందర మకరందం మొదలుపెట్టాను. అది సాగనివ్వదని పలువురు చెప్పిన మాట నిజమేమో అన్నట్లుగా అది పూర్తి చేయడానికి చాలా కాలం పట్టింది. దాన్ని హైదరాబాద్ లో, సింగపూర్ లో కూడా రాశాను. కాని చివరకు 2017 లో మరోమారు అమెరికా పర్యటనకు సాన్ ఫ్రాన్సిస్కో, హ్యూస్టన్ నగరాలకు అబ్బాయి, అమ్మాయిల దగ్గరికి వెళ్లినప్పుడు పూర్తి చేయగలిగాను. తరువాత రెండేళ్ళు అమెరికా రావడం కుదరలేదు. అరణ్యకాండ మందర మకరందం, కిష్కింధ కాండ మందర మకరందం హైదరాబాద్ లోనే పూర్తి చేశాను. యుద్ధకాండ మొదలు పెట్టాను. కాని అది కూడా అమెరికాలోనే పూర్తి కావాలని వుందేమో! అమెరికా రావడం (2019 నవంబర్) పూర్తి చేయడం జరిగింది. ఆ విధంగా మొత్తం రామాయణం ఆరు కాండలు రాయడానికి పదహారేళ్ల సుదీర్ఘ కాలం పట్టింది. నేను రామాయణం రాయడానికి పూర్వ రంగం వుంది.        
 
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రెండు దశాబ్దాల క్రితం అదనపు సంచాలకుడిగా పనిచేస్తున్న రోజుల్లో అక్కడి ప్రభుత్వ క్వార్టర్స్లో నివసిస్తుండే వాడిని. మా పొరుగునున్న శ్రీమాన్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు లేచింది మొదలు నిద్ర పోయేదాక రామనామం తప్ప దేని మీద మనస్సు పోనీయడు. ప్రతినిత్యం రామాయణ పారాయణం చేస్తూ వుంటాడు. నా కంటే వయస్సులో చిన్న వాడైనా, జ్ఞానవృధ్ధుడు. నా నిత్య కృత్యాలు చాలవరకు ఆయనకు నచ్చవు. నేనంటే మాత్రం ఇష్టం. ఆయన ఉదయం అనుష్టానం చేసుకుంటుంటే, చనిపోయిన మా నాన్న స్వర్గీయ వనం శ్రీనివాసరావు గారు గుర్తొచ్చేవారు. నాన్నగారు వాసుదాసు గారు రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణం, మందరం అన్ని కాండల్నీ, కనీసం పాతిక సార్లకు పైగా పారాయణం చేసినవారు. వాసుదాసుగారూ ఆయన శిశ్యులు సుబ్బదాసుగారూ (దాసశేషుడు) ఖమ్మం జిల్లాలోని వనంవారి కృష్ణాపురం గ్రామంలో వున్న మా ఇంట్లో వారి పాదాలు మోపి మా ఇంటిని పావనం చేసారు.

మా శ్రీమతికి మా నాన్న గారి పూజ-పునస్కారాల వారసత్వం వచ్చింది. నాకంతగా అబ్బ లేదు. ప్రక్కనున్న విజయరాఘవ గారినీ,  ఆయన భక్తి సంబంధమైన మాటలను ఎప్పుడూ వింటుంటే ఆమె: " మీరు అన్న గారి మార్గంలోనన్నా పోతారు, లేదా, ఆయన మీ దారికన్నా వస్తారు" అనేది, మేమిద్దరం చర్చించుకుంటుంటే. అదే నిజమైంది కొద్ది రోజుల్లో. నేను రామాయణం చదువుతాను, మీదగ్గరుంటే ఇవ్వండి, అయితే వాసుదాసు గారు వ్రాసిన ఆంధ్రవాల్మీకి రామాయణం మాత్రమే కావాలన్నాను. అలా అడగటానికీ, అదే కావాలంటానికీ, ప్రత్యేక కారణం ఏమీ లేదు. కాకపోతే నా చిన్న తనంలో, మా నాన్న గారు "మందరం" పారాయణం చేస్తుంటే చూశాను కనుక అది మాత్రమే రామాయణమేమో అనుకున్నాను. ఆయితే నేను రామాయణం చదువుతానంటే ఆయన కొన్నాళ్ళు నమ్మలేదు. నేనూ గట్టిగా అడగనూలేదు. ఆయన ఇవ్వనూ లేదు. నేను ఆలోచన వచ్చిన వెంటనే చదవటమూ జరగలేదు.


         మళ్ళీ నిత్య జీవితం. దైనందిన చర్యలు. మధ్యలో మా జిల్లాలోనే వున్న భద్రాచల రాముడినీ, పొరుగు రాష్ట్రంలో ఉన్న శ్రీరంగనాధ స్వామినీ, దర్శించుకొనే భాగ్యం కలిగింది, డిసెంబర్ 2002-జనవరి 2003 లో. "శ్రీ రామావతార సమయంలో శ్రీ సీతా రాముల దర్శనం ఏదోవిధంగా కలగందే ఈ జన్మలో శ్రీరంగనాధుని (శ్రీరంగం) దర్శనం కలగనే కలగదు" అన్నారు విజయరాఘవ గారు. జనవరి 15, 2003 న తన ఇంట్లోకి పిల్చి, స్నానం చేసి రమ్మని, వాసుదాసుగారి శ్రీమదాంధ్రవాల్మీకి రామాయణం సుందరకాండ మందరం నా చేతిలో పెట్టారు. రామాయణం మొత్తం చదవడం తర్వాత, ముందిది చదవమన్నారు. ఎందుకంటే, రామాయణం పఠనమో, పారాయణమో సుందరకాండ తోనే మొదలెట్టాలన్నారు. అవునేమోననుకుని చదవడం ప్రారంభించాను.

         సరీగ్గా పది రోజుల్లో ఆసాంతం చదివాను. ఏరోజుకారోజు, వీలున్నప్పుడల్లా చదివేవాడిని. చదివిన విషయ సారాంశం ఎప్పటికప్పుడు బడి పిల్లాడిలా, విజయరాఘవ గారికి అప్ప చెప్పే వాడిని. వశిష్ఠుడి నోట బ్రహ్మర్షి అంటేనే విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడట! నేను చదువుతున్నానన్న నమ్మకం ఆయనకు కలిగితేనే నాకెందుకో తృప్తనిపిన్చేది. పదిరోజుల్లో చదవడం గొప్ప కాదు. నన్ను ప్రేరేపించి, ప్రోత్సహించి చదివించిన ఆయన గొప్పతనం అది. వాల్మీకి సంస్కృతంలో వ్రాసిన ఇరవైనాలుగు వేల శ్లోకాలను ఎప్పుడంటే అప్పుడు ప్రతిపదార్థంతో సహా అప్పచెప్పగల సమర్ధుడాయన!

ఆరువందల డెబ్భై పేజీల పద్య-గద్య-ప్రతిపదార్ధ తాత్పర్య సహిత సుందరకాండ మందరాన్ని చదవడానికైనా, పారాయణం చేయడానికైనా, నాలాంటి చాలామందికి తీరికా, ఓపికా వుండదేమో అనిపించింది. తెలుగు భాషలో కనీస ప్రావీణ్యత వున్నవారికి అర్ధమయ్యే రీతిలో వాసుదాసుగారి సుందరకాండ మందరాన్ని, ఆయనే "వక్తగా", నేను కేవలం "వాచవిగా"-"అనువక్తగా" సంక్షిప్తీకరించి నలుగురికీ అందించగలుగుతే బాగుంటుందేమో అనుకున్నాను. అలా రాస్తూ వచ్చి ఇప్పటికి పూర్వకాండలు మొత్తం ఆరు పూర్తి చేయగలిగాను. సహృదయులు ప్రోత్సహించాలని ప్రార్థన.
వనం జ్వాలా నరసింహారావు

No comments:

Post a Comment