Thursday, December 5, 2019

యుద్ధకాండ మందర మకరందం....."మధుర మధురమే తత్ మంగళం మంగళానామ్" : చిలకపాటి విజయ రాఘవాచార్యులు


యుద్ధకాండ మందర మకరందం
అనువక్త-వాచవి, వనం జ్వాలా నరసింహారావు
శ్రీరామ రామ రామ
"మధుర మధురమే తత్ మంగళం మంగళానామ్"
చిలకపాటి విజయ రాఘవాచార్యులు
శ్రీరామాయణము’ ‘ఆదికవి’ వాల్మీకి మహర్షి ప్రణీతము. సంస్కృత భాషలో ప్రథమ రచనము. ఇది ‘ఆంధ్రవాల్మీకి’ రామాయణము. తొలిసారిగా తెలుగు భాషలో వాల్మీకి రామాయణమునకు యధాతథముగా శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు (అనగా వాసుదాసుగారు) పద్య గద్యములతో రచించిన సత్య, ధర్మ, జ్ఞానపీఠము. దీనిని ప్రస్తుతము కడప-తిరుపతి మార్గములో గల ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి వారికి వాసుదాసస్వామి వారు అంకితమిచ్చి, తాము తరించి, మనవంటి శ్రీరామదాసులకు శ్రీరామానుగ్రహము కలుగునట్లు అనుగ్రహించినారు. కాగా వాసుదాస స్వామి వారు వాల్మీకి రామాయణమునకు పద్యకావ్యముగా మూల విధేయముగా వ్రాసి, వారే ‘మందరము’ అను పేరుతో ప్రతి పదార్థ, విశేషార్థ తాత్పర్యములతో చక్కని తెలుగు భాషలో రచించడము జరిగినది.  వంద సంవత్సరాలు దాటినది.  భారత జాతికే ప్రతిష్టాత్మకమైన  ‘భారతరత్న’, ‘జ్ఞానపీఠ’ పురస్కారాలకు సర్వదా పాత్రమైన రచనము ఈ ‘మందరము’ నిర్మాత ఆంధ్రవాల్మీకి వాసుదాసస్వామివారు.  లక్షలమంది తెలుగువారు మందరాన్ని పఠించి ధన్యులైనారు, ఇంకా అవుతూనే వున్నారు.   శ్రీరామాయణ క్షీరసాగరాన్ని ‘మందరం’ మధించింది. ఆ దివ్య పీయూషాన్ని స్వర్ణ కలశంలో భద్రపరచి మనకందరికీ ఆప్యాయంగా అందించింది.  అయితే కాలాంతరంలో వస్తోన్న మార్పుల వలన ఆనాటి భాష, భావం, శైలి, స్వరూపం, తాత్పర్యం ఈనాటి తరానికి కించిత్తు క్లిష్టమన్పిస్తూండడంతో, ‘ఆంధ్రవాల్మీకి’  మన వనం జ్వాలా నరసింహరావు గారిలో ‘పరకాయ ప్రవేశం’ చేశారు.  శ్రీరామాయణ   పారాయణ పరాయణులైన వనం శ్రీనివాసరావు గారి పుత్రరత్నం జ్వాలా నరసింహరావుగారు.  సంస్కార సంపన్నమైన భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి భక్తి ప్రపత్తులు. జన్మతః సంతరించుకున్న భద్ర వారసత్వం వారిది!  కొంచెం ఆలశ్యంగానైనా, జీవనయానంలో ‘వాల్మీకం’ జ్వాలా నరసింహారావు గారిని ఆవహించింది.   ఇప్పటి ఈ వాసుదాసస్వామి వారి ‘మందరా’నికి మకరందంగా, మధురాతి మధురమైన చక్కని తెలుగు నుడికారంతో షట్కాండయుక్తంగా వారిని వాల్మీకి రామయాణాన్ని రుచి చూపించే ‘వాచవి’ గా, మందరానికి  ‘అనువక్త’ గా మలచి, శ్లోక సముచ్ఛయాల జోలికి సోకకుండా, మజ్గళప్రదమైన మధురధారగా నడిపించింది.  ఇది ‘శ్రీరామప్రభావ’ మహిమ! 

         జ్వాలా’ గారు నాకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృధ్ధి సంస్థలో (Dr MCR HRDI AP), సహవ్రతులే గాక సహవాసులు కూడా!  నిద్ర లేచింది మొదలు నిద్రపోయేవరకు అవిశ్రాంత వక్త. వ్యాసకర్త  ‘గోష్టీప్రియ’ కర్త.  ఒకవిధంగా, నిత్యసంధ్యానుష్టానాల క్రమశిక్షణ అటుంచితే, బహుముఖీనమైన కార్యక్రమాల వ్యగ్రత వారిది.  అలాంటి వారిచేత శ్రీసీతారామచంద్రులు 16 సంవత్సరాల కృషిగా (2004-19) ఈనాటికి ఆరుకాండలకూ యథానువాదరూపంలో  ‘ఆంధ్రవాల్మీకి రామాయణా’ నికి అనువక్తవ్యంగా ఆరుగ్రంథాలను సుప్రసిద్ధ ఆధ్యాత్మిక మాసపత్రిక  ‘దర్శనమ్’ సౌజన్యంతో మనకు అందిస్తున్నారు.  జ్వాలా గారి జీవితంలో ఇది ఒక సువర్ణాధ్యాయం!

         భారతీయులకు భగవద్గీత - శ్రీరామాయణం - శ్రీమధ్భాగవతం - శ్రీమద్భారతం మహా పవిత్రగ్రంథాలు. ఇవి వేదంతో సమానమైన ప్రతిపత్తి కల్గినవి. వ్యాసవాల్మీకాదులు అనుగ్రహించిన అక్షరనిక్షేపాలు.  భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యానికి దివ్యజ్యోత్సులు. బ్రతుకు బాటలో వెలుగులు నింపిన దివిటీలు.  ధర్మమార్గదర్శకాలు. శ్రీ రామాయణం ఆదికావ్యం.   భారతం ఇతిహాసం. భాగవతం పురాణం.  ఈ మూడు శ్రీహరి అవతార కథాకథనాలు.  భగవద్గీత సాక్షాత్తూ భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖారవిందం నుండి జాలు వారిన మధుర సుధాస్వాదనం. శ్రీరామాయణం శ్రీరామచంద్రుడ్ని, సీతమ్మ తల్లినీ ప్రధానంగా పెట్టుకుని ధర్మసంస్థాపనానికీ, ధర్మరక్షణకూ, సనాతన ధార్మిక సూత్రాలకూ రక్షాబంధనం చేసిన మహాకావ్యం.   భారతీయులకు ప్రాణస్పందనం శ్రీసీతారామగుణగానం!  దీనిని వేదానికి ‘ఉపబృంహణం’ అంటారు.

         ఇక భారతం ‘పంచమవేదం’గా ఆరాధించబడిన జాతీయనేపథ్య ఆంతరంగిక కథాగానం!  లోకరీతిని వివిధ కోణాలలో వివరిస్తూనే, సామాన్య ధర్మాలను, విశేషధర్మాలను ఉపదేశించే వ్యాసపీఠం, జ్ఞానదీపం, జయసంహిత!

         భాగవంతం పురాణరత్నం  ‘‘బాగవతం... భాగవతం... భాగవతం..’’ అంటేనే చాలు, ఎప్పటికైనా ‘బాగు అవుతాం’ అని లోకోక్తి. భాగవతం భగవంతుని చరితం.  ఎవరు ఆ భగవంతుడు? అంటే  ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’ అని నిష్కర్ష.   శ్రీ కృష్ణ స్వామే భగవంతుడు. ఆయనే జగన్నాటక సూత్రధారి, శ్రీ కైవల్యప్రధాత.  ధాత విధాత... విధాతకు పిత. తాత. త్రాత. జగత్రాత. వ్యాస మహర్షి సంస్కృత భాషలో 18వేల శ్లోకాలలో దీనిని రచించారు.  మన భాగ్యం పండినది. పోతనామాత్యుల వారు దీనికి 8984 పద్యగద్యాలలో చక్కని చిక్కని తెలుగు భాషలో ఆంధ్రీకరించి అందించారు.

         అలాగే వ్యాసప్రోక్తమైన మహాభారతం లక్షాధికశ్లోకయుక్తమైనది. కాగా కవిత్రయం వారు ఆంధ్రీకరించి 21,507 పద్యగద్యాలలో హృద్యంగా ఆవిష్కరించారు. ఇక వాల్మీకి విరచితమైన శ్రీరామాయణం - ఆదిలో శతకోటి శ్లోక ప్రవిస్తరం కాగా - 24 వేల శ్లోకాలతో అనుగ్రహించారు.  శ్రీ రామాయణ, భారతాలు సంస్కారశోభితమైన మన వైదిక భారతీయ జాతికి నేత్రద్వయమైతే, భాగవతం మాత్రం హృదయసీమయే! ఈ మూడింటినీ కలిసి శ్రీ వైష్ణవులు రహస్యత్రయ సౌరభం’  అంటారు. అందుకే ఇవి హిరణ్యనిధి. 

         ఆంధ్రవాల్మీకి’ వాసుదాసస్వామి వారి మందరానికి జ్వాలాగారు అందించిన రుచులు (ఆయన ‘వాచవి’కద) ఆరు కాండలలో విస్తరించిన విశదవివరణమే నిదర్శనం.  మొదట వారు ‘సుందరకాండ’ ను సాంప్రదాయిక మర్యాదనునసరించి జుల నెల 2004 లో వ్యాఖ్యానం చేశారు.  సుందరకాండలో మొత్తం 68 సర్గలుండగా, దేనికదే ప్రత్యేకంగా 68 కథాంశాలుగా వివరిస్తూనే, చివరలో సుందరకాండ పారాయణ క్రమాన్నీ, ప్రాశస్త్యాన్ని వివరించారు. సుందరకాండ ‘బాపు’ గారి చక్కని చిత్రాలతో విశేష ఆదరణ పొంది, ప్రస్తుతం నాల్గవ ముద్రణకు సిద్ధమౌతోంది.   ఇది జ్వాలా గారి తొలి  శ్రీరామాయణ రచనం.   ఆనాటి MCR HRDI AP డైరెక్టర్ జనరల్, మహర్షిసత్తములు అయిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్, ఐ.ఎ.ఎస్. దీనిని ఆవిష్కరించారు.  నేను పుస్తక పరిచయ వాక్యాలను విన్నవించాను. 


         ఆ తరువాత క్రమంగా బాలకాండ, ఆయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధా కాండ, ప్రస్తుతం యుధ్దకాండలకు అనువక్తగా మందరాన్ని అందంగా వాచానువాదనం చేస్తూ వచ్చారు.   జూలై 2010లో బాలకాండను మెదట శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు ‘జీయరు శతాబ్ది శతగ్రంథమాల’లో భాగంగా ముద్రింపించి మజ్గాళాశాసనాలను అనుగ్రహించడం గమనార్హం! గణనార్హం! సత్సంప్రదాయానికీ, సనాతన ధర్మపథానికి నిలువుటద్ధంగా భాసించే ‘జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్’ ప్రచురణం సర్వజనామోద ప్రమోదం అయింది.   శ్రీ స్వామి వారి మాటలలో ‘తెలుగులో - ఆంగ్లంలో సమాన ప్రతిభ కల్గి ఉండటంతో సవ్యసాచిలా తమ వ్యాఖ్యానాన్ని అతి విలువైన సమాచారంతో నింపిన’ జ్వాలా వారు అభినందనీయులు! ఆ ఆతరువాత బాలకాండను రెండో మారు కూడా ముద్రించారు.

         అయోధ్యాకాండ, యుధ్దకాండలు విస్త్రుతమైనవి.   అయోధ్యాకాండ 119 సర్గలతో 4315 శ్లోకాలతో నడిచే కథనం. ఇది నవంబరు 2017లో ఆవిష్కరించబడింది. అప్పటికే జ్వాలాగారు ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యధౌరంధర్యవ్యగ్రతలో వున్నా, శ్రీరామానుగ్రహం వల్ల చక్కగా వాసుదాసస్వామివారిని ‘సరళీకరించి’ లోక వ్యవహార భాషలో ‘మందరించారు’! మహా సహస్రావధాని మాడుగల నాగఫణిశర్మ గారు  ‘రామాయణంలోని అన్ని కాండలకు వాచవి వ్రాయుదురు గాక! ’ అని ఆశీర్వందించారు.  నిజానికి వాసుదాస్వామి వారు 110 సంవత్సరాల క్రితం  తమ 70 ఏట రోజుకు 20 గంటలు శ్రమించి ‘మందరాన్ని’ నిర్మించారు.  నేను ముందే మనవి చేసినట్లు వాసుదాసస్వామి వారే జ్వాలా గారిని ఆవహించి పరకాయ ప్రవేశం చేసి వుండకపోతే, జ్వాలా గారి బహుముఖ కార్యక్రమాల చక్రబంధంలో ఈ రామాయణం వ్రాయడం సాధ్యమయ్యేదా?! అయోధ్యకాండ భాషలో, భావంలో, భావప్రకటనంలో ‘కండ’ కలిగిన కలకండ కొండ! ఆధ్యంతములూ శ్రీరామ గుణసాగరతరంగములే ప్రతిధ్వనిస్తూంటాయి. వాటికి సంక్షిప్త సుంధరవచనానువాద పీయూషం  రసరమ్యకోశం!

         ఇక అరణ్యకాండ నవంబర్ 2018లో వెల్వడింది. ఇది అనుష్టానకాండ. అద్భుతమైన ఆర్షధర్మాలనూ,  ధర్మసూక్ష్మాలను నిష్కర్షించిన మహర్షి మహోపదేశమే అరణ్యకాండ. 

         జ్వాలాగారి అనువచనం అరణ్యకాండలో మరింత సుధాస్వాదమైంది. ప్రముఖ పాత్రికేయులు కావడం వల్ల సామాన్య పాఠకులకు అవగాహనా సౌలభ్యంగా వుండే విధంగా వారు మందరమకరందాన్ని మరింత మధురాయమానం గావించారు.  ముద్రాపకులు, ప్రచురణకర్తలు అయిన ‘దర్శనమ్’ మాసపత్రికాధిపతి శ్రీమాన్ మరుమాముల వేంకటరమణ శర్మ బొమ్మల గణేష్ తోడ్పాటుతో అద్భుతమైన ముఖచిత్రంతో, అందమైన అచ్చులో అందగించేలా ఆవిష్కరించడం అభినందనీయం!

         ఇక కిష్కింధకాండ జూలై 2019లో అచ్చుపడి, ముచ్చటగా బాపు శైలిలో గణేష్ ముఖచిత్రంతో ఆవిష్కరణ అయింది. ‘మందరం’ తెలుగువారి నిరుపమభాగ్య సంపద.  శ్రీరామానుగ్రహ ప్రాప్తికి దివ్యసాధనం.  జ్వాలా గారి రచన కేవలం ‘మందర’ వ్యాఖ్యానానికే పరిమితం కాలేదు. వాసుదాసస్వామి వారు ప్రయోగించిన ఛందోవృత్తాలు, సాహితీపిపాసికి  ‘వసంత కుసుమాకరాలు’, ‘పూర్ణచంద్రోదయాలు’.  జ్వాలాగారు వీటిని ప్రత్యేకించి చూసి, ఈ వృత్తాలను, వ్యాకరణ గ్రంథులను సైతం అవలోకనం చేసి వేరొక గ్రంథం వ్రాయడం జరిగింది.  శ్రీరామకథామృతపానం అలా వుంచితే, మందరంలో వాసుదాస స్వామివారు ప్రస్తావించిన అనేక రహస్యాలు, విశేషాలు, శాస్త్రాలు ఒక మహా విజ్ఞాన సర్వస్వంగా భాసిస్తాయి.    ఆ మహానుభావులు వాల్మీకి రామాయణాన్ని 108 సార్లు పారాయణం చేశారు.    ఆ వేళ శ్రీ సీతారాములకు ఏ  విధంగా వనవాసానంతరం మహా సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని సురలు, మహర్షులు, సకల దేవతా గణాలు నిర్వహించాయో, యథాతథంగా  ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి సన్నిధిలో 500 నదీ జలాలను తెప్పించి మహా సామ్రాజ్య పట్టాభిషేకాన్ని జరిపించిన ‘శతాభిషేకి’ వారు. ఇప్పటికీ అక్కడ వారు ప్రతిష్టించిన శిలాఫలకం మనకు స్పూర్తిమంతం చేస్తోంది.

         కిష్కింధకాండలో అనువక్త క్రొత్తదనాన్ని నింపడం జరిగింది. శాబ్ధికపారమ్యాన్నీ,  శ్రీరామావతార వైభవాన్ని వివరిస్తూనే,  ఇది  ‘జ్ఞానకాండ’ అన్న విషయాన్ని నవీకృతం చేశారు.   ఇది నిజానికి హనుమకాండ! కిష్కింధకాండలోనే ప్రథమంగా ‘హనుమ’ దర్శనమిస్తారు  శ్రీరామలక్ష్మణ సమేతులై! ఇందులో వర్ణనలు విశేషం.  వర్షఋతువర్ణనం, భౌగోళిక, ప్రాదేశిక వర్ణనం, వాలివధ విషయమై  ‘ధర్మచర్చ’, లౌకిక, ధర్మవివరణం - ఇలాంటి  మహా విషయాలు ఆలోచనామృతాలుగా నడిపిస్తాయి. వీటిని అనువచనం చేయడం క్లిష్టమే అయినా ‘వాగ్విదాంవరుని’ చలవతో జ్వాలాగారు సమర్ధంగా వ్యక్తపరచగలిగారు.  24 పుటలలో ‘రామాయణంలో ఏముంది - ఆంధ్రవాల్మీకి రామాయణం ఎందుకు చదవాలి?’’ అన్న పీఠిక ఇందులో ప్రతివారు చదివి తీరవలసిన మంచి విషయం !

         ఇక యుద్ధకాండ. చాలా పెద్దకాండ.  ఆరవకాండ.  శ్రీరామపట్టాభిషేకంతో శుభ సమాప్తి.  దీని తరువాత ఉత్తరకాండ కూడా వున్నది.   కానీ దానిని  వాల్మీకి మహర్షి రచించాడనే విషయంలో  భేదాభిప్రాయాలున్నాయి.  ఏది ఏమైనా, ఉత్తరకాండ పారాయణం సంప్రదాయంగా తోచదు. యుద్ధకాండ 131వ సర్గ శ్రీరామపట్టాభిషేక సర్గ. దానితోనే శ్రీరామాయణ పారాయణానికి మజ్గాళాశాసనం.

         యుధ్ధకాండ  కథాంశం కంటే యుద్ధవర్ణనలు ఎక్కువ.   పాఠకులకు క్లిష్టంగా ఉంటుంది.    దీనిని అనువక్త  క్లుప్తంగా సుందరీకరించారు.    ప్రతి సర్గకు తనదైన శైలిలో వ్యాఖ్య వ్రాస్తూనే  పాఠక సౌలభ్యాన్ని దృష్టిలో వుంచుకొని మూలానికి, కథా సూత్రానికి భంగం కలుగనిరీతిలో  వ్రాయడం జరిగింది. మందరం మొత్తాన్నీ నవలా పఠనంగా నడిపించినందువలన  యుద్ధకాండలో కూడా మూలకథకు విధేయంగానే రచన సాగింది. అయితే చివరి సర్గలను కొంచెం విశేషంగా వ్యాఖ్యానిస్తే భవ్యంగా వుండేదనిపిస్తోంది. ఎలాగైతే ఏమి గాని, వాసుదాసస్వామి వారి చలవ జ్వాలాగారిపై  ప్రసరించింది.   వారిచేత తాను పలికిన కథను తాతగారు మనవడికి కథ చెప్పినట్లుగా జ్వాలాగారి చేత పలికించారు వాసుదాస స్వామి. ఇది జ్వాలా గారు చేసుకున్న సుకృతము.  శ్రీరామానుగ్రహఫలము.

         అన్ని కాండలను సాంగోపాంగంగా సంక్షిప్తీకరించిన చక్కని తృప్తితో... వీలైతే యధావిధేయంగా చిన్నపిల్లలకు  కథ చెప్పే విధంగా మరింత క్లుప్తసుందరంగా ‘శ్రీరామాయణ మందరా’న్ని వ్రాయాలని జ్వాలా గారికి సూచిస్తున్నాను.   అలాగే తెలుగు - ఆంగ్ల భాషలలో చేయి తిరిగిన రచయిత గనుక ఈ ‘వాచవి’ ని ఆంగ్లీకరించే ప్రయత్నం చేయాలనీ,  దానివల్ల విదేశియులకు సైతం వాసుదాసస్వామి వారిని, వారి మందరాన్నీ అనుసంధానించగలిగే భాగ్యం వారికి లభిస్తుందని నా ఆశంస!

         ఇక్కడ వాసుదాసస్వామి వారి గురించి ప్రస్తావించాల్సి వుంది.   శ్రీవారి జీవిత విశేషములను గురించి జ్వాలా నరసింహరావుగారు సంక్షిప్తంగా ఇందులోనే వివరించడం జరిగినదికద! 

         వావిలికొలను సుబ్బారావుగారే ‘వాసు’ దాసస్వామి. వారిది భారద్వాజ గోత్రము. ఆపస్తంబ సూత్రము.  గోల్కొండ వ్యాపారి శాఖకు చెందిన శ్రీవైష్ణవ సంప్రదాయస్థులు. విశిష్టాద్వైతులు.   పంచసంస్కారపరులైన నియోగి బ్రాహ్మణులు. వీరికి 15 ఏటనే క్షయరోగము సంభవించగా, పినతండ్రి లక్ష్మణరావు గారు సంరక్షించిరి. 73 సంవత్సరములు జీవించిరి. కాగా 47వ సంవత్సరమున భార్య రంగనాయకి గారు పరమపదించిరి. వాసుదాస స్వామి ఎన్నో మహాగ్రంథములను రచించిన మహానుభావులు.   వాటిలో ఆర్యకధా నిధులు.   హితచర్యమాలికా గ్రంథములు ధర్మశాస్త్ర సందేశములతో నిండినవి.  వారు స్థాపించిన  ‘భక్తి సంజీవని’ మాసపత్రిక అవిచ్ఛిన్నముగా సాగుచున్నది.  వాసుదాసస్వామి 108 పర్యాయములు శ్రీమద్రామాయణ పారాయణము, 108 శ్రీ సీతారామ కళ్యాణములు, 108 సామ్రాజ్య పట్టాభిషేకములు చేసిన మహా తపస్వి.

         శ్రీరామాయణము ధర్మశాస్త్రము.  ఇందులో రాజ, ప్రజా, పతి, సతీ, భ్రాతృ, పుత్ర, భృత్య, మిత్ర ధర్మములున్నవి.  శ్రీ రామాయణమ మంత్రశాస్త్రము.  ఇందులో ప్రతి అక్షరమూ మంత్రమేనని పెద్దల తీర్పు.  సుందరకాండకు మించిన మహామంత్రభాగము ప్రపంచములో మరొకటి లేదుకద!  గాయత్రీ బీజ సంయుతమని రామాయణమునకు ప్రసిద్ధి.  గాయత్రీ మంత్రమందలి  24 అక్షరములే  శ్రీరామాయణమందు 24 వేల శ్లోకములలో నిక్షిప్తమైనవి.

         శ్రీ వాసుదాసస్వామి వారు గుంటూరు జిల్లా తెనాలి సమీపములో నడిగడ్డపాలెము గ్రామమునందొక ఆశ్రమమును స్థాపించి, నిర్వహించినారు.  తదుపరి శ్రీశ్రీశీ శ్రీమన్నారాయణ (పెద్ద) రామానుజ జీయర్ స్వామి వారు, క్రమముగా శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి వారు దానిని నిర్వహించుచున్నారు. 

         శ్రీ వాసుదాసస్వామి వారు తరువాత తమ శిష్యులైన శ్రీ దాసశేషస్వామి వారు (యామర్తి సుబ్బారావుగారు 1890-1968), క్రమముగా శ్రీ శేషదాసస్వామి వారు (ఉలిచి ఆదిశేషయ్యగారు), శ్రీ నారాయణదాస స్వామివారు (ముదిగొండ సత్యనారాయణ గారు), ప్రస్తుతము శ్రీ రామానుజ దాసస్వామి వారు (వడ్లమూడి శ్రీమన్నారాయణ మూర్తిగారు)  ఆచార్యత్వము వహించుచున్నారు.   శ్రీ వాసుదాసస్వామి వారు తెనాలి - గుంటూరు మార్గములో గల అంగలకుదురు నందు శ్రీ కోదండ రామసేవక సమాజమును స్థాపించిరి. ఆ ఆశ్రమము ప్రస్తుతము పంచమ గురుస్థానీయులైన  శ్రీరామానుజదాసస్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ ఉలిచి సీతారామశర్మ (పట్టాభి), అర్చకస్వాములైన శ్రీ బలభద్రపాత్రుని సుబ్బారావు ప్రభృతుల సహాయ సహకారములతో దినదిన ప్రవర్థమానముగా నిర్వహించబడుచున్నది. వాసుదాస స్వామివారి  శ్రీరామాయణాది (మందరం)  గ్రంథములన్నియూ ఇచ్చట లభించుచున్నవి.   శ్రీ రామచంద్రస్వామి కైంకర్యముగా శ్రీ ఆత్మకూరి వేంకటశ్రీమన్నారాయణ గారు ఇటీవలనే మందర సంక్షిప్త ప్రతులను ఆంగ్లీకరించి ప్రాచుర్యము కల్పించినారు.

         అయోధ్యలోగల ‘వాల్మీకి మందిర్ (భవన్)’ లో  వాసుదాసస్వామి వారి ‘మందరము’ చక్కగా భద్రపరచబడి ఆరాధింపబడుచున్నది. వాసుదాస స్వామి వారు విశ్వవిఖ్యాతిగాంచిన ‘నోబెల్’  పురస్కారానికో, ‘భారతరత్న’ కో,  జ్ఞానపీఠ’ పురస్కారమునకో అర్హతనొందిన మహా విజ్ఞాన ప్రభాసంపన్నులు. పరిపూర్ణ శ్రీరామానుగ్రహ ప్రాప్తులు.  శ్రీ సీతారాముల కటావీక్షణములు శ్రీ జ్వాలా నరసింహరావు గారిపై ప్రసరించడము, వారి చేత మందరమునకు మందిరముగా ‘వాచవి’ గావించడమూ శ్రీ రామానుగ్రహ ఫలమే! దానివల్ల జ్వాలాగారు ధన్యులైనారు. వారి పితృపితామహప్రపితామహ పరంపరయూ తరించినది.  పుణ్యాత్ములైన  జ్వాలా నరసింహరావు గారిని శ్రీ సీతారామశ్రీచరణ పురస్సర అభినందనచందనము సమర్పిస్తూ విరమిస్తున్నాను.  

శ్లో||    భారద్వాజ కులోద్భవం వరకవిం శ్రీరామచంద్రాత్మజం
శ్రీవత్సాన్వయ నారసింహ కరుణాసంలబ్ధమంత్రోత్తమమ్|
సీతారామ పదాంబు జాత యుగళీ ధ్యానైక నిష్ఠారతం
వాల్మీకిం వరదేశికం గుణనిధిం శ్రీ వాసుదాసంభజే||
శ్లో||   యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే|
తావత్ రామాయణకథా లోకేషు ప్రచరిష్యతి ||

విజయవాడ                                       శ్రీరామ - రామానుజదాసానుదాసుడు
3 డిసెంబరు, 2019                              చిలకపాటి విజయ రాఘవాచార్యులు
                                                 ప్రిన్సిపల్ (రిటైర్డు) ఎ.పి. గురుకుల డిగ్రీ కళాశాల,
                                       పూర్వ కార్యదర్శి, హిందూ ధర్మ పంచారపరిషత్తు, టిటిడి.

No comments:

Post a Comment