Sunday, January 30, 2022

శునస్సేపోఖ్యానం ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-93 : వనం జ్వాలా నరసింహారావు

 శునస్సేపోఖ్యానం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-93

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (31-01-2022)

"ఇలా అందరూ వెళ్లిపోగానే, తనింతవరకు తపస్సు చేస్తున్న వనంలో విఘ్నాలు కలుగుతున్నాయని, ఆ ప్రదేశాన్ని వదిలి మరింకెక్కడికైనా పోతానని అక్కడున్న వారితో అంటాడు విశ్వామిత్రుడు. ఏ దిక్కుకు పోతే బాగుంటుందని ఆలోచించి, విశాలమైన పడమటిదిక్కున మంచివనాలు, పుష్కరం వున్నందువల్ల, తీవ్రమైన తపస్సు చేయడానికి అక్కడకు పోతే తపస్సిద్ధికలుగుతుందని భావిస్తాడు. త్వరగా అక్కడకు పోవాలని, పోయి కేవలం ఫలాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ, భయంకరమైన తపస్సు చేయాలనీ, అలా చేయడంద్వారా తపస్సిద్ధన్నాకలగాలి-లేదా-మరణమన్నా రావాలి, అని నిశ్చయించుకుంటాడు. ఉత్కృష్ట మార్గంలో, ఇతరులకు కనీసం అనుకోడానికైనా సాధ్యపడని, అతిగొప్పదైన-కఠినమైన నిష్ఠలతో తపస్సు చేయడం ఆరంభించాడు విశ్వామిత్రుడు”.

విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న రోజుల్లోనే, అయోధ్యా నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. మనువు మునిమనుమడు, నభగుడి మనుమడు, నాభాగుడి కొడుకైన అంబరీషుడు పెద్దల మన్ననలుపొందేవిధంగా మాట్లాడుతాడని, క్రోధాన్ని జయించినవాడని, శ్రేష్ఠమైన న్యాయ మార్గంలో దోషాలను జయించినవాడని, సద్గుణాలే భూషణాలుగా కలవాడని, రాజశ్రేష్టుడనీ ప్రసిద్ధికెక్కాడు. అలాంటి అంబరీషుడు ఒక యాగాన్ని చేయాలని అనుకొని, చేస్తున్న సమయంలో, ఇంద్రుడు యజ్ఞ పశువును దొంగిలించాడు. యజ్ఞ పశువు పోతే, పోకుండా రక్షించుకోలేక పోతే, యజ్ఞాన్ని చేసేవాడికి దోషం తగులుందని చెప్పాడు ఋత్విజుడు. యజ్ఞపశువునన్నాతెమ్మని, దొరక్కపోతే యజ్ఞం కొరకు బలి కావడానికి ఒక మనిషినైనా తెమ్మని అంబరీషుడిని ఆదేశించాడు ఋత్విజుడు. యజ్ఞపశువును వెతికేందుకు అన్ని ప్రదేశాలలో వెతకసాగాడు అంబరీషుడు. కనీసం యజ్ఞం పూర్తి చేయించేందుకు ఒక మనిషైనా దొరకకపోతాడానని స్వయంగా వెతకనారంభించాడు".

"ఇలా తిరుగుతూ, ఎవరినీ బలాత్కారంగా తేవడానికి ఇష్టపడని అంబరీషుడికి ఒకనాడు, భార్యా-పిల్లలున్న ఋచీకుడనే ముని (విశ్వామిత్రుడి తోబుట్టువు భర్త) కనిపిస్తాడు. అతడికి లక్ష ఆవులిస్తానని, తన యజ్ఞాన్ని రక్షించేందుకు ఆయన కొడుకుల్లో ఒకడినిఇవ్వమని ఆయనకు నమస్కరించి, ప్రార్తించాడు. పోయిన యజ్ఞపశువుకొరకు ప్రపంచమంతా గాలించినా ఫలితం లేకపోయిందని, దానికి బదులుగా మనిషిని వుంచాల్సి వచ్చిందనీ, తన ముగ్గురి కొడుకుల్లో ఒకడిని ఇవ్వమని అంటాడు. ఆయనేమిచ్చినా తన ప్రేమకు పాత్రుడైన పెద్దకొడుకునివ్వలేనని ఋచీకుడనగానే, ఆయన భార్య, శునకుడనే తమ కనిష్ట పుత్రుడంటే తనకెంతో ఇష్టమని కాబట్టి వాడినీ అమ్మమని అంటుంది. ఆ మాటలను విన్న వారి నడిమి కొడుకు శునస్సేపుడు, తన ప్రాణమిచ్చి రాజు యజ్ఞాన్ని కాపాడుదామనుకుంటాడు. తనను తీసుకొని పొమ్మని, ఆయనిస్తానని చెప్పిన లక్ష ఆవులను తండ్రికివ్వమని శునస్సేపుడనగానే, ఆలస్యం చేయకుండా, ధర్మ ప్రీతితో తన వెంట అతడిని తీసుకునిపోయాడు అంబరీషుడు. మార్గమధ్యంలో మధ్యాహ్నమైనందున వారిరువురు ఒక పుష్కర తీరం దగ్గర కాసేపు ఆగారు".

(లోకంలో సాధారణంగా పెద్దకొడుకుపై తండ్రికి, పిన్న వాడిపై తల్లికి ప్రేముంటుంది. నడిమి కొడుకుపై తల్లితండ్రులకిద్దరికీ ప్రీతి వుండదంటారు. ఈ విషయంలో ఋషీశ్వరులు కూడా అందరివలెనే ప్రవర్తిస్తారనడానికి ఇదొక ఉదాహరణ).

విశ్వామిత్రుడి శరణుజొచ్చిన శునస్సేపుడు

         "ఎండవేడికి తాళలేక మార్గమధ్యంలో ప్రయాణం ఆపు చేసి, రాజు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, శునస్సేపుడు పరుగెత్తుకుంటూ, సమీపంలో ఋషీశ్వరుల మధ్యనున్న మేనమామ విశ్వామిత్రుడి దగ్గరకు పోయాడు. అలసటతోనూ, ఎండవేడివల్లనూ, పరుగెత్తుకుంటూ రావడం వల్లా, తటాలున వస్తూనే మామ విశ్వామిత్రుడి ఒళ్లో వాలాడు. తనగతి ఏమని చెప్పాలని, తనను మన్నించి అతడే కాపాడాలని, తల్లితండ్రులున్నా వారు తనను రక్షించలేరని, వారున్నా లేనట్లేనని, ఏదో విధంగా ఆలోచించి రాజు కోరిక నెరవేరేటట్లు-తను తపస్సు చేసి స్వర్గానికి పోయేటట్లు చేయమని విశ్వామిత్రుడిని ప్రార్థించాడు శునస్సేపుడు. తను అర్థాయువుతో చనిపోకుండా, దీర్ఘాయువుగా జీవించేటట్లు చేయమంటాడు. తను బతకదల్చుకుంది కామంకోసం కాని, భోగంకోసం గాని కాదని, స్వర్గానికి పోవడానికి కావల్సినంత తపస్సుచేయడానికేనని అంటూ, తను ఆపదపాలుకాకుండా, ఆయన బిడ్డలను కాపాడినట్లే తనను కూడా రక్షించమని కోరాడు”.

అల్లుడి మాటలు విన్న విశ్వామిత్రుడు తన కొడుకులతో, అతడు బాలుడనీ-రక్షించమని అర్థిస్తున్నాడని-భయపడి తన శరణుజొచ్చాడని అంటూ, వాళ్లల్లో ఎవరైనా ఒకడు అతడి బదులుగా రాజువెంట పోయి, అతడికి ప్రాణబిక్ష పెట్టమని అంటాడు. తన మాట గౌరవించాలని కూడా అంటాడు. వారిలో ఎవరన్నా అతడి బదులుగా వెళ్తే రాజు యజ్ఞం నెరవేరుతుందని, దేవతలు సంతోషిస్తారని, అతడి ప్రాణం నిలుస్తుందని, తన మాటా దక్కుతుందని, కాబట్టి తను చెప్పినట్లు చేయమని కోరతాడు. విశ్వామిత్రుడి కొడుకులందరూ ముక్తకంఠంతో ఆయన కోరికను తిరస్కరించారు. తన బిడ్డలను బలిపెట్టి ఇతరుల బిడ్డను కాపాడడమంటే, స్వార్జిత మధురా హారం మాని, నిషిద్ధమైన కుక్క మాంసం తినడమేనని అహంకారంగా జవాబిచ్చారు వారు తండ్రికి".

"కొడుకులందరు ఒక్క మాటగా, తన కోరికను మన్నించక పోవడంతో, విశ్వామిత్రుడికి కోపమొచ్చింది. తను అవునన్నది వారెలా కాదంటారని, కొంచెమైనా వారికి భయం లేకుండా పోయిందనీ, తండ్రి మాట జవదాటడం ధర్మ విరుద్ధమనీ, తన మాట అతిక్రమించి వారింక బతకలేరని అంటూ, వశిష్ఠుడి కొడుకులలాగానే వాళ్లు కూడా కుక్క మాంసం తింటూ-నీచమైన మనస్సుతో, వెయ్యేళ్లు అల్లాడమని శపించాడు. అలా పట్టరాని కోపంతో కొడుకులను శపించి, విశ్వామిత్రుడు మంత్రించిన విబూదిని శునస్సేనుడికి పెట్టి అతడిని భయపడొద్దని చెప్పాడు. యజ్ఞంలో అతడిని విష్ణు సంబంధమైన యూపానికి కట్టినప్పుడు, అగ్నిని చూస్తూ-ఆలస్యం చేయకుండా, ’ఇమ మ్మే వరుణ’ అనే రెండు మంత్రాలను జపించమంటాడు. (ఒక మంత్రం ఇంద్రస్తుతి-ఇంకొకటి ఉపేంద్రస్తుతి)”.

మంత్రాలను ఉపదేశించి, తని చెప్పిన ప్రకారం అవి చదివితే, రాజు యజ్ఞం సఫలమవుతుందనీ, ఆయన జీవితాశయం నెరవేరుతుందని అంటాడు విశ్వామిత్రుడు. ఆ మంత్రాలను గ్రహించి, శెలవు తీసుకుని వెళ్లాడు శునస్సేపుడు. అంబరీషుడి దగ్గరకు పోయి, అతడిని యజ్ఞ దీక్ష వహించమని కోరాడు. పురోహితుడు చెప్పినట్లే దీక్ష వహించాడు అంబరీషుడు. బ్రాహ్మణులు శునస్సేపుడి మెడలో పూదండలు వేసి, ఎర్రటి వస్త్రాలను కట్టి, దర్భలతో అల్లిన తాళ్లతో అతడిని యూపస్తంబానికి కట్టారు. అతడేమాత్రం భయపడకుండా తనలోలోన మంత్రాలను స్మరించాడు. తనను ఆశ్రయించిన వారిని రక్షించే విష్ణువు, రాజుకు యజ్ఞ ఫలం-బాలుడికి దీర్ఘాయువు ఇమ్మని ఇంద్రుడికి చెప్పగా ఆయన ఆజ్ఞానుసారం ఇంద్రుడు మెచ్చి, శునస్సేనుడికి దీర్ఘాయువునిచ్చి, రాజుకు యజ్ఞ ఫలాన్నిచ్చాడు. అగ్నితేజుడైన విశ్వామిత్రుడు వెయ్యేళ్లు, ప్రపంచమంతా పొగిడే విధంగా, గాఢమైన తపస్సు చేశాడు".

No comments:

Post a Comment