Saturday, October 30, 2010

ఇందిరా గాంధి-ఆత్మ స్థయిర్యం, నిరంకుశ ధోరణి, రాజీ పడని మనస్తత్వం : వనం జ్వాలా నరసింహారావు

ఇందిరా గాంధి మరణించి అక్టోబర్ 31, 2010 కి
26 సంవత్సరాలైన సందర్భంగా

అస్థిర పాలన కంటే నియంతృత్వ ప్రజాస్వామ్యమే
మెరుగైందని తీర్పు చెప్పిన భారత ఓటరు
వనం జ్వాలా నరసింహారావు

ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో గోల్డెన్‌ టెంపుల్-హర్మందిర్ సాహిబ్ పై జరిగిన సైనిక దాడికి నిరసనగా, అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ లు జరిపిన కాల్పుల్లో ఇందిరా గాంధి హత్యకు గురై 26 సంవత్సరాలు నిండాయి. బియాంత్ సింగ్ ను ఇతర బాడీ గార్డులు తక్షణమే కాల్చి చంపగా, సత్వంత్ సింగ్ ను, హత్యకు కుట్రపన్నాడన్న అభియోగంపై కేహార్ సింగ్ ను, ఐదేళ్ల తర్వాత తీహారీ జైలులో ఉరితీశారు. ఇందిరా గాంధి మరణించి పాతికేళ్లు దాటినా జాతీయ-అంతర్జాతీయ రంగాలలో ఆమె మిగిల్చిన గుర్తులు అజరామరంగా అశేష ప్రజానీకం గుండెల్లో గూడుకట్టుకున్నాయి. కోట్లాది ప్రజలు అమెనెంతగా అభిమానించేవారో, అంత మోతాదులోనే, ఆమెలోని మంచి చెడులను నిశితంగా విమర్శించేవారు ఇప్పటికీ చాలామంది వున్నారు. ఆమె దో అరుదైన వ్యక్తిత్వం.

సుమారు పదహారేళ్ల పాటు భారత ప్రధాన మంత్రిగా వున్న ఇందిరా గాంధీ, దృఢమైన ఆత్మ స్థయిర్యం, నిరంకుశ ధోరణి, రాజీ పడని మనస్తత్వం కలబోసిన అరుదైన వ్యక్తిత్వంతో, సంక్లిష్టమైన పరిస్థితుల్లో వున్న దేశానికి, సమర్థవంతమైన పరిపాలనను అందించి చరిత్రలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగింది. సర్వేపల్లి రాధా కృష్ణన్, జకీర్ హుస్సేన్, వరాహగిరి వెంకట గిరి, ఫకృద్దీన్ అలీ అహమ్మద్, నీలం సంజీవరెడ్డి, జ్ఞానీ జైల్ సింగ్ లు రాష్ట్రపతులుగా వున్నప్పుడు ఆమె ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఆర్థిక, విదేశాంగ, సమాచార శాఖలను నిర్వహించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న "సిండికేట్" నాయకత్వాన్ని ధిక్కరించి, పార్టీని చీల్చి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. ఎమర్జెన్సీ అనంతరం ఓడిన కాంగ్రెస్ పార్టీని, మరో మారు చీల్చి, ఇందిరా కాంగ్రెస్ గా నామకరణం చేసి, రెండేళ్లకే మళ్ళీ అధికారంలోకి వచ్చి, పాలనా పగ్గాలను-పార్టీ పగ్గాలను తన చేతుల్లో వుంచుకుంది. తనకు ఎదురు లేకుండా, ఎదిరించిన వారికి పుట్ట గతులు లేకుండా, ఏకచ్ఛత్రాధిపత్యంగా, మకుటంలేని మహారాణిగా దేశాన్ని ఏలింది. నియంతృత్వ ప్రజాస్వామ్యమంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది.

రాజకీయాలకు నిలయమైన కుటుంబంలో జన్మించి, రాజకీయాల్లో మునిగితేలుతుండె వాతావరణంలో పెరిగి, జవహర్లాల్ అడుగుజాడల్లో బహుముఖ రంగాల్లో తీర్చి దిద్దబడి, అవకాశం వచ్చిన వెంటనే అత్యున్నత పదవిని పొంది, తండ్రికంటే మిన్నగా ఆ పదవికి వన్నె తెచ్చి, అధికారంలో వున్నా-లేకపోయినా అత్యంత బలీయమైన శక్తిగా గుర్తింపు పొంది, వైరి వర్గాలను నామరూపాలు లేకుండా చేయగలిగే స్థాయికెదిగి, తనకు తానే సాటి అనిపించుకున్న ఇందిరా గాంధీతో పోల్చతగ్గవారు చాలా అరుదుగా వుంటారనడం అతిశయోక్తి కాదే మో! తండ్రి చాటు బిడ్డగా వుంటూ, అనధికారిక ఆంతరంగికురాలిగా ఎదుగుతూ, కూతురుగా వారసత్వ అధికారాన్ని వంశపారంపర్యంగా-తరతరాలుగా, తమ కుటుంబీకులకే దక్కే విధంగా వ్యూహం పన్నిన ఇందిరా గాంధీ, నవ భారత వర్తమాన చరిత్రలో వేరెవరూ సాధించలేని దాన్ని అవలీలగా సాధించగలిగిన వ్యక్తిగా చిర స్థాయిగా మిగిలిపోతుంది. విధి వక్రీకరించి, సంజయ్ గాంధీని ప్రధాన మంత్రిగా తేలేకపోయిన ఇందిర, తన తదనంతరం రాజీవ్ గాంధీ ప్రధాని కావడానికి రంగం సిద్ధం చేసింది. భవిష్యత్‌లో ఆ పరంపర కొనసాగడానికి చేయాల్సిన దంతా చేసింది.

ఇందిర ప్రియదర్శిని బాల్యమంతా ఒంటరితనంతోనే గడపాల్సి వచ్చింది. అలహాబాద్ లోని ఆమె కుటుంబం వుంటుండే ఇల్లు స్వాతంత్ర్య సంగ్రామానికి ప్రధాన కార్యాలయంగా వుండేది. తాత, తండ్రి తరచుగా జైలుకెళ్ళి వస్తుండడం ఇందిరా గాంధీకి గుర్తున్న విషయాల్లో ముఖ్యమైంది. చిన్న పిల్లల ఆట వస్తువులు కాని, ఆటలు కాని ఆమెకు తెలియవు. ఆడిన ఆటల్లా, ఒక నాయకురాలిగా, మూడేళ్ల వయసులోనే బల్లపైకెక్కి, ఇంట్లో పనిచేసే వారందరికీ రాజకీయ ఉపన్యాసాలివ్వడం-తనను తానే జోన్ ఆఫ్ ఆర్క్ లాగా ఊహించుకోవడం. పెద్ద వారెవరూ అందుబాటులో లేనందున, యువరాణిలా ఎదుగుతున్న ఇందిరలో ఒకరకమైన అహంభావం పెరిగినట్లు ఆమే ఒక సందర్భంలో చెప్పింది. ఇంటిమీద పోలీసు దాడులు జరగడం, సాధారణ జీవనం కొరవడడం, ఇంట్లో వారిని అరెస్టు చేసి జైలుకు పట్టుకెళ్లడం లాంటివి నిత్యం ఆమెకు అనుభవంలోకి వచ్చేవి.

అణుయుగంలో, అంతరిక్ష యుగంలో భారతదేశాన్ని అడుగు పెట్టించిన ఘనత ఇందిరా గాంధీదే. సోవియట్ వ్యోమ నౌకలో భారతీయులను పంపడానికి చొరవ తీసుకుంది ఆమే. ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ను ఘోరంగా ఓడించి, దానిలో అంతర్భాగంగా వున్న ప్రాంతాన్ని విడిపోయేందుకు దోహదపడి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారకురాలై, ప్రపంచంలో భారతదేశాన్ని ఒక బలీయమైన శక్తిగా రూపుదిద్దిన ఘనత కూడా ఇందిరా గాంధీదే. అంతర్జాతీయ రంగంలో ఎవరి పక్షం వహించదని, తమ విదేశాంగ విధానం "భారత అనుకూల విధానం" అనీ ఎలుగెత్తి చాటి చెపుతూ, అలీన విధానాన్ని పాటించే దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్ళింది ఇందిరా గాంధీ. సోవియట్ యూనియన్ తో మైత్రి చేసినప్పటికీ, అమెరికా వ్యతిరేకిగా ముద్ర పడకుండా జాగ్రత్త పడింది. అవసరమైనప్పుడు, తప్పదనుకున్నప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఎదురు తిరిగి తన సత్తా ఏమిటో నిరూపించింది.

ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా మలిచే ప్రయత్నంలో అప్రయత్నంగానే నిరంకుశత్వం అలవరచుకుంది ఇందిరా గాంధీ. రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బలమైన కేంద్రం దిశగా ఆమె విధానాలు రూపుదిద్దుకోసాగాయి. పార్టీ పరంగా కూడా నియంతృత్వ ధోరణులే అవలంబించసాగింది. తన పార్టీకి చెందిన ముఖ్యమంత్రులను ఇష్టమొచ్చిన రీతిలో మార్చడం, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురి చేయడం, అధికారాలను కేంద్రీకరించడం ఆనవాయితీగా మారిపోయింది. కమ్యూనిస్టు వ్యతిరేకతతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఇందిర, కాంగ్రెస్ లోని సిండికేట్ పై విజయం సాధించడానికి వామ పక్షాలను కలుపుకుంది. "కమ్యూనిజం" కంటే "కమ్యూనలిజం" వల్లే ప్రమాదం అంటూ అలనాటి జనసంఘ్ లాంటి పార్టీలను ఎదగకుండా చేసింది. ఎప్పుడైతే, ఎమర్జెన్సీ విధింపుకు వ్యతిరేకంగా కాంగ్రేసేతర పార్టీలన్నీ ఏకమయ్యాయో, వారూ-వీరూ అనే తేడా లేకుండా, తన విధానాలను వ్యతిరేకించిన అందరినీ జైళ్లకు పంపడానికి వెనుకాడలేదు. ఇరవై సూత్రాల ఆర్థిక ప్రణాళికైనా, గరీబీ హటావో పథకమైనా, బాంకుల జాతీయ కరణైనా, గ్రామీణ బాంకుల స్థాపనైనా, రాజ్యాంగ సవరణలైనా, సవరణలలో భాగంగా అవతారికలో "సామ్యవాదం, లౌకిక వాదం" అన్న పదాలను చేర్చడమైనా, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రాధమిక హక్కులకంటే ముఖ్యమైనవని చెప్పడమైనా, మరేదైనా, ఏమి చెప్పినా-చేసినా, ఇందిరా గాంధీ మనసులో మాట ఒకటే. భారత దేశానికి నాయకత్వం వహించగలిగేది తానే అని-తాను దానికోసమే జన్మించానని ఆమె నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆమె అనుకున్న కార్యం సాధించడానికి దేనికైనా వెనుకాడక పోయేది. ఆ నమ్మకమే ఆమె గెలుపుకు సోపానాలయ్యాయి-ఓటమికి కారణాలయ్యాయి.

ఇందిరా గాంధీలో సహనం, అసహనం సమపాళ్లలో వుండేవని, ఎప్పుడు దూకుడుగా వ్యవహరించే దో, ఎప్పుడు నిశ్శబ్దంగా పనులు చక్కబెట్టే దో, ఎందుకు ఒంటరిగా వుండదలుచుకునేదో, ఎప్పుడు-ఎందుకు ఏ పని చేసే దో కనుక్కోవడం అంత తేలిక కాదని మీడియాలో కథనాలొచ్చేవి. ఒకరిని చేరదీయడంలోను, ఇంకొకరిని పక్కన పెట్టడంలోను, ఆమెకు ఆమే సాటి. అమెరికా అధ్యక్షుడుగా పనిచేసిన రిచర్డ్ నిక్సన్ ఆ దేశ ప్రయివేట్ పౌరుడిగా, ప్రధాని ఇందిరను కలిసిన సమయంలో, ఇరవై నిమిషాలు గడిచిన తర్వాత, ఇంకెంత సేపు ఆ సమావేశం కొనసాగుతుందని, నిక్సన్ వెంట వచ్చిన విదేశాంగ ప్రతినిధిని హిందీలో అసహనంగా ప్రశ్నించిందట ఆమె. ప్రశ్న హిందీలో వేసినా, దాని గూడార్థాన్ని గ్రహించిన నిక్సన్ సంభాషణను త్వరగా ముగించి వెళ్ళాడని అనధికార వార్తగా పత్రికలు ప్రచురించాయి అప్పట్లో. అందులోని నిజానిజాలు ఎంతవరకో గాని, ఆమెలోని అసహనం పాలు ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువై, ఇంటర్వ్యూలలో ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడమో, నిశ్శబ్దం పాటించడమో, అదో రకంగా నవ్వు ముఖం పెట్టడమో, ఎదురు ప్రశ్నలు వేయడమో చేసేదని విశ్లేషకులు అంటుండేవారు.

ఆక్స్ ఫర్డ్ లో చదువుకుంటున్న రోజుల్లో బ్రిటీష్ లేబర్ పార్టీ విద్యార్థి విభాగం కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే ది. రెండవ ప్రపంచ యుద్ధం రోజుల్లో, రెడ్ క్రాస్ వాలంటీర్ గా చేరి, కొంతకాలం అంబులెన్స్ డ్రైవర్ కూడా పనిచేసింది. స్వదేశానికి తిరిగొచ్చే సమయంలో ఆమె వెంట, చిన్ననాటి స్నేహితుడు, కాంగ్రెస్ పార్టీలో అప్పటికే చురుగ్గా పాల్గొంటున్న అలహాబాద్ పాత్రికేయుడు ఫిరోజ్ గాంధీ కూడా వున్నారు. తామిద్దరం వివాహం చేసుకుంటామని ఇందిర ప్రకటించడంతో కుటుంబ సభ్యులు ఇబ్బందికి లోనయ్యారు. ఇరువురి దీ ఒక మతం కాదు-ఒక కులం కాదు. అయినా, ఇద్దరి వివాహం జరగడం, కొద్ది కాలంలోనే ఇరువురు జైలు జీవితం గడపాల్సి రావడం, ఆ తర్వాత విడుదలై వైవాహిక జీవితం గడపడం, రాజీవ్-సంజయ్ లు పుట్టడం ఒకటి వెంట ఒకటి జరిగింది నాలుగేళ్లలోపు.

జైలులో వున్న తండ్రి జవహర్లాల్ నెహ్రూ తనకు రాసిన ఉత్తరాలలో వర్తమాన ప్రపంచ చరిత్రతో పాటు ప్రాచీన, భవిష్యత్ దర్శనం కలిగే విధంగా ఎన్నో విషయాలను ఇందిరా గాంధీ తెలుసుకోగలిగింది. సంజయ్ గాంధీ పుట్టిన సంవత్సరంలోనే నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తండ్రి దగ్గరకు వచ్చే వారికి ఆతిథ్యం సమకూర్చే బాధ్యతలను, అనధికారికంగా ఇందిర చేపట్టాల్సి వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగింది. ఇష్టంగానో-అయిష్టంగానే ఆమె తన బాధ్యతలను కర్తవ్య పరాయణ తో నిర్వర్తించింది. తండ్రితో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం ఏర్పడడంతో, ఆమె అవసరం నెహ్రూకు కూడా పెరిగి పోవడంతో, ఫిరోజ్ తో గడిపే వీలు తగ్గి, చివరకు వేర్వేరుగా జీవించే పరిస్థితి కలిగింది. ఆయన చనిపోయేంతవరకూ అంతే కొనసాగింది.

జవహర్లాల్ ను కలవడానికొచ్చిన దేశ-విదేశీయ ప్రముఖులు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, పాత్రికేయులు, విద్యావేత్తలు, సామాజిక శాస్త్రజ్ఞులు, ఆయన పక్షాన ఆతిథ్య బాధ్యతలు బిడియంగా చేపట్టిన ఇందిరను, తండ్రి చాటు బిడ్డగా నెహ్రూ కూతురుగానే చూసేవారు. ఆమె రాజకీయ పాత్ర పోషించకుండా వుండలేని పరిస్థితికి చేరుకుంది. జవహర్లాల్ వెంట దేశ-విదేశాల్లో కలిసి తిరగడంతో, లక్షలాది మంది భారతీయులకు, చాలా మంది విదేశ ప్రముఖులకు, ఇందిరా గాంధీ సుపరిచితురాలైంది. 1955 లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీకి ఎన్నుకోవడంతో, జాతీయ స్థాయిలో స్వతంత్రంగా గుర్తింపు లభించినట్లయింది. నాలుగేళ్ల అనంతరం, నాలుగు పదుల వయస్సులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఇందిర, ఏడాది కాలంలో తన రాజకీయ సమర్థతను, కాఠిన్యాన్ని ప్రదర్శించిందనాలి. ప్రపంచ చరిత్రలోనే ప్రప్రధమంగా బాలట్ ద్వారా అధికారంలోకి వచ్చిన కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేయించడంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత జరిగిన ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయం సాధించి పెట్టింది. ఇందిరా గాంధీ మరో సారి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సుముఖత చూపలేదు. తండ్రి మరణానంతరం, లాల్ బహదూర్ మంత్రివర్గంలో సమాచార-ప్రసార శాఖను చేపట్టింది. శాస్త్రి హఠాన్మరణం దరిమిలా, కాంగ్రెస్ అధిష్టానం ఇష్టం వున్నా లేకపోయినా, ఇందిరను ప్రధాన మంత్రిని చేశారు. ఇక అక్కడి నుంచి ఇందిర అధ్యాయం మొదలైంది. ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాలణ మొదలైంది ఆమె నేతృత్వంలో.

తమ ధోరణికి అనుకూలించడనుకున్న మొరార్జీ ప్రధాన మంత్రి కాకూడదనే ఆలోచనతో, తమ అదుపు ఆజ్ఞల్లో-కనుసన్నల్లో నడుచుకుంటుదన్న ధీమాతో కామరాజ్ నాడార్, నిజలింగప్ప, నీలం సంజీవరెడ్డి లాంటి వారు ఇందిరా గాంధీ వైపు మొగ్గు చూపారే కాని, భవిష్యత్ లో ఆమె నుంచి పొంచి వున్న ప్రమాదాన్ని పసికట్ట లేకపోయారు. అనిశ్చిత పరిస్థితుల నడుమ, ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించడంతో భవిష్యత్ పై దృష్టి సారించింది ఇందిరా గాంధీ. జాతీయ స్థాయిలో యావత్ భారత దేశ ప్రజలంగీకరించే ఏకైక నాయకురాలు తానేనని గ్రహించింది ఆమె. పార్టీ ప్రక్షాలణకు సమయం ఆసన్నమైందని, ప్రజలకు తాను మరింత చేరువ కావాలంటే, సామ్యవాద పంథాలో పయనించడం మినహా మార్గం లేదని విశ్వసించింది. తదనుగుణంగా ప్రభుత్వ పథకాల రూపకల్పనకు అంకురార్పణ చేయసాగింది.

అకస్మాత్తుగా మరణించిన రాష్టపతి జకీర్ హుస్సేన్ స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో పార్టీలోని విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఇందిరా గాంధీని విమర్శించే నీలం సంజీవరెడ్డిని ఇందిర వ్యతిరేక కాంగ్రెస్ అధిష్టాన వర్గం అభ్యర్థిగా నిర్ణయించింది. ఆయననే ప్రతిపాదించిన ఇందిరా గాంధీ, ఓటింగులో, స్వతంత్ర అభ్యర్థి వీవీ గిరికి మద్దతును బహిరంగంగానే ప్రకటించి, తన వారందరినీ ఆయనకే ఓటెయ్యమని సూచించింది. ఆమే నెగ్గింది. నీలం ఓటమి పాలయ్యారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు, తన వ్యతిరేక వర్గానికి చెందిన మొరార్జీ దేశాయ్ ని మంత్రివర్గంలోంచి వెళ్లిపోయే పరిస్థితులు కలిపించింది. క్రమశిక్షణను ఉల్లంఘించిందన్న ఆరోపణపై, వృద్ధ నాయకత్వం ఆమెను పార్టీ నుంచి తొలగించడంతో, వారందరినీ అభివృద్ధి నిరోధక శక్తులు గాను-సామ్యవాద పథకాలను అడ్డుకునేవారి గాను చిత్రించింది ఇందిరా గాంధీ. పార్లమెంటరీ పార్టీ ఆమె పట్ల విశ్వాసం ప్రకటించడంతో, ఆమె ప్రధాన పదవికి ఢోకా లేకపోగా, పార్టీ చీలిపోయింది. ఇందిర పార్టీని చీల్చింది. ఏడాది ముందే 1971 లో ఎన్నికలకు పోయి, అఖండ విజయం సాధించి పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించింది.

భారత-పాకిస్తాన్ యుద్ధంలో, ఇందిర నేతృత్వంలోని భారతదేశం అఖండ విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఉపఖండంలో తిరుగులేని శక్తిగా భారత దేశానికి పేరు తెచ్చింది. ఇందిరా గాంధీని ద్వేషించే అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ తన సంపూర్ణ మద్దతును పాకిస్తాన్ కు ఇచ్చిన నేపధ్యంలో, యుద్ధానంతరం ఆయనకొక ఘాటైన ఉత్తరం రాసిందామె. లక్షలాది మంది తూర్పు పాకిస్తాన్ శరణార్థులు సరిహద్దులు దాటి భారత దేశానికి వచ్చి పడుతుంటే, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తమకుందని, ఆ కర్తవ్య నిర్వహణలో యుద్ధం చేయాల్సి వస్తే, తాను చేసిన తప్పేమిటో స్పష్టం చేయాలని నిక్సన్ ను ప్రశ్నించింది. ఆ తర్వాత కొద్ది నెలలకు జరిగిన రాష్ట్ర శాసన సభల ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఆమె ప్రభ వెలగ సాగింది. ఆమె ఆరోహణ పర్వం కొనసాగుతుండగానే, అవినీతి ఆరోపణలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులొచ్చాయి. నైతిక విలువలకు కట్టుబడడం లేదని శత్రువులు ఆమెను విమర్శించ సాగారు. ఆమెకు మద్దతు పలుకుతున్న కొందరు స్వపక్షీయులు కూడా వారితో గొంతు కలిపారు. గోరు చుట్టుపై రోకటి పోటులా, అలహాబాద్ హైకోర్టు, లోక్ సభకు ఆమె ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించింది. తక్షణమే ఆమె రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండు చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బంధించి, అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అంతర్గత బధ్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించింది. స్వతంత్ర భారత దేశంలో చీకటి రోజులకు తెరలేపింది ఇందిరా గాంధీ.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, పౌరుల ప్రాధమిక హక్కులు హరించిందని, పత్రికా స్వాతంత్ర్యం కాల రాసిందని దేశ విదేశాల ప్రముఖుల విమర్శలను లెక్క చేయని ఇందిర రాజ్యాంగాన్ని తిరగ రాసింది. తనకు వ్యతిరేకంగా వచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పునుంచి ఊరట పొందింది. విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది. దేశ సమైక్యతకు-సమగ్రతకు ముప్పు వాటిల్లిందని, రోగికి చేదు మందిచ్చి బ్రతికించిన విధంగానే, అత్యవసర పరిస్థితి విధింపు తాత్కాలికమే అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఆర్థిక, రాజకీయ సుస్థిరత కొరకు, జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేసింది. మీడియాపై మరిన్ని ఆంక్షలు విధించింది. అరెస్టు చేసిన రాజకీయ ఖైదీలను విచారణ లేకుండా జైళ్లలో నిర్బంధించడానికి తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంతో ఇందిరకు మరింత బలం చేకూరింది. మరిన్ని రాజ్యాంగ సవరణల ద్వారా, అవధులు లేని అధికారాలను ఇందిరా గాంధీ తన సొంతం చేసుకుంది. ఆమె ప్రతిపాదించిన అసాధారణ రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోదం లభించింది. జనవరి 1977 లో ఎన్నికల నిర్ణయం ప్రకటించి, ప్రజలపై-ప్రజా శక్తిపై తనకు అపారమైన విశ్వాసం వుందని, మార్చ్ నెలలో ప్రజల నిర్ణయం కొరకు ఎన్నికలు జరుగుతాయని అన్నది. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. భారత దేశం బలీయమైన శక్తిగా ఎదగడానికి బలమైన కేంద్ర ప్రభుత్వం, సుస్థిరమైన కేంద్ర ప్రభుత్వం అవసరమని స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ కాలం నుండి ప్రోత్సహిస్తూ వస్తున్న చిన్న కొడుకు సంజయ్ గాంధీని రాజ్యాంగేతర శక్తిగా ఎదగడానికి తోడ్పడింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయనను ప్రవేశ పెట్టింది. వారసత్వానికి బాటలు వేసింది.

ప్రతి పక్షాలన్నీ ఏకమయ్యాయి. ఆమె అనుంగు సహచరుడు జగ్జీవన్ రాం కూడా బాంబు పేల్చాడు. ప్రతి పక్షాల సరసన చేరాడు. జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ లోని యంగ్ టర్క్స్ కూడా వారితో జత కట్టారు. నియంతృత్వ పాలనకు స్వస్తి చెప్పాలని, మకుటంలేని మహారాణిని ఓడించాలని జనతా పార్టీ ఎన్నికల్లో పిలుపిచ్చింది. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంగా, జనతా పార్టీ ఓటర్ల ముందుకు పోయింది. మార్చ్ 20, 1977 న జరిగిన లోక సభ ఎన్నికలలో ఇందిరా గాంధీని ఆమె నియోజక వర్గంలోను, ఆమె సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశంలోను దారుణంగా ఓడించారు. కలగాపులగం లాంటి కాంగ్రేసేతర పార్టీల కలయికతో ఏర్పడిన జనతా ప్రభుత్వానికి, ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో ఉప ప్రధాన మంత్రిగా చేసిన మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా సారధ్యం వహించారు. ప్రజల తీర్పును శిరసా వహిస్తానని, ప్రజల సేవలోనే గడుపుతానని అంటూ పదవికి రాజీనామా చేసింది ఇందిరా గాంధీ.

ఎమర్జెన్సీ అక్రమాలపై విచారణ చేయడానికి జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్ ముందు హాజరవడానికి ఇందిర నిరాకరించింది. అది తన వ్యక్తిగత నిర్ణయం కాదని, రాజ్యాంగ బద్ధంగా, మంత్రివర్గం సిఫార్సుపై, పార్లమెంటు ఆమోదం లభించిన చర్య అని ఆమె స్పష్టం చేసింది. కమీషన్ ఏర్పాటుకు చట్ట బద్ధత లేదన్నది. అవినీతి ఆరోపణలపై జనతా ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసింది. బెయిలు తీసుకోమని ప్రభుత్వం ఇచ్చిన సలహాను ఆమె నిరాకరించింది. ఆమె అరెస్టుకు తగిన కారణాలు ప్రభుత్వం చూపలేక పోయిందని, ఆమెను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నాలు తిరిగి ప్రారంభించింది. తన పార్టీలో తనకు వ్యతిరేకంగా వున్న వారితో బంధాలు తెంచుకుని, మరో మారు పార్టీని చీల్చి, కాంగ్రెస్ (ఐ) ని స్థాపించింది. అదే అసలు సిసలైన భారత జాతీయ కాంగ్రెస్ గా ప్రకటించింది.

కర్నాటకలోని చిక్ మగలూర్ నుంచి ఇందిరా గాంధీ లోక సభకు ఎన్నికవడంతో, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) అఖండ విజయం సాధించడంతో ప్రజలు ఆమెకు తిరిగి బ్రహ్మ రధం పట్ట సాగారు. మాజీ ప్రధానిగా తనను వేధించడం తగదని పార్లమెంట్ లోపలా-వెలుపలా పదే పదే జనతా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఒకానొక సందర్భంలో, లోక్ సభలో సుదీర్ఘ చర్చ అనంతరం, ఇందిరా గాంధీ సభ్యత్వం రద్దుచేయాలని, సమావేశాలు ముగిసేవరకు అరెస్ట్ చేయాలని, ప్రధాని మొరార్జీ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. పార్లమెంట్ హాలును వదిలి వెళ్లనని, తననక్కడే అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తూ భీష్మించుకుని కూచుంది ఇందిరా గాంధీ. అరెస్ట్ చేయడానికి వచ్చిన అధికారులకు నమస్తే చెపుతూ వారి వెంట వెళ్లింది. ఆమె అరెస్టుకు నిరసనగా లక్షలాది మంది అభిమానులు ఆందోళన చేశారు. అరెస్టయ్యారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే ఆమెను విడుదల చేసింది ప్రభుత్వం. ఆమెను వదిలి వెళ్లిన కాంగ్రెస్ నేతలు, ప్రజల నుండి లభిస్తున్న అభిమానాన్ని గమనించి తిరిగి ఆమె పంచన చేరారు. ఇంతలో అంతర్గత వైరుధ్యాల మధ్య జనతా ప్రభుత్వం కూలిపోయే దశకు చేరుకుంది.

జులై 1979 లో మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. దానికి కారణ భూతుడైన చరణ్ సింగ్ కు మద్దతు పలికి, వ్యూహాత్మకంగా ఆయన ప్రధాన మంత్రి కావడానికి తోడ్పడింది ఇందిరా గాంధీ. తనపై మొరార్జీ ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలను ఉపసంహరించుకోవడానికి నిరాకరించిన చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని విశ్వాస తీర్మానంలో ఓటమి పాలు చేసింది. ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా వున్న చరణ్ సింగ్ ఆచరణలో ఇందిర ప్రతినిధిగానే పాలన చేశాడనాలి. జనవరి 1980 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ (ఐ), మూడింట రెండు వంతుల మెజారిటీతో అఖండ విజయం సాధించింది. సుస్థిరతా-అస్థిరతా అన్న నినాదంతో ఇందిరా గాంధీ ఎన్నికల బరిలో దిగి గెలిచింది. సుస్థిరతే ముఖ్యమని భారత దేశ ఓటర్లు స్పష్టం చేశారు. అస్థిర పాలన కంటే, నియంతృత్వ ప్రజాస్వామ్యమే మెరుగైందని ఓటర్లు తీర్పిచ్చారు. దాని రూపకర్త ఇందిరా గాంధీని మరో మారు ప్రధానిని చేశారు.

6 comments:

  1. మీ వ్యాసము చాలా వివరణాత్మకముగా ఉన్నది.ధన్యవాదాలు.

    భారత దేశములో భజనపరులకి,కోటరీల సంస్కృతికి ఆధ్యురాలు ఇందిరాగాంధి."అవసరమైతే ఆమె ఇంటిని కూడా ఊడ్వటానికి వెనకాడను" అన్న ఒక వ్యక్తిని దేశాధ్యక్షునిగా చేసిన మహానాయకురాలు. కాని ఆవిడలో గొప్పతనము ఏమంటే, ప్రజలు దానిని ఓ పెద్ద విషయముగా పరిగణించలా. మళ్ళీ మళ్ళీ ఆమెను గెలిపించటానిక వెనకాడలేదు. అలాగే వాజపాయిలాంటి ప్రతిపక్ష నాయకుని ద్వారా కనకదుర్గ అనికూడా అనిపించుకోగలిగిన విలక్షణమైన నాయకురాలు.

    ReplyDelete
  2. జ్వాలా నరసింహం గారూ!
    నమస్కారం సార్!
    మీ బ్లాగ్ మా బోటి వారికి ఒక పాఠశాల.ధన్యవాదాలు .ఇందిరా గాంధీ గారిని గురించి ఎన్నో విషయాలు ఒక చోటే సంక్షిప్తంగా చెప్పారు.మరో సారి రాజకీయ పునశ్చరణ తరగతులకు వెళ్లి వచ్చినట్లుంది .

    ReplyDelete
  3. మీ ఇద్దరికీ నా ధన్యవాదాలు.
    జ్వాలా నరసింహారావు

    ReplyDelete
  4. జాకీర్‌హుస్సేన్, వి వి గిరి , ఫక్రుద్దిన్ ఆలీ అహమ్మద్,జైల్‌సింగ్, లను ఆమే దేశాధ్యక్షులు గా నియమించింది గదండీ. అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసింది .అవినీతి అంతర్జాతీయ ఫినామినా అని దేశం లో అవినీతి విజ్రుంభించడానికి దోహద పడింది .పంజాబ్ లో బింద్రన్‌వాలాను స్రుష్టించి భస్మాసుర హస్తం తన నెత్తి మీదే పెట్టుకొంది .కాశ్మీర్ సమస్య ను పరిష్కరించే సువర్ణావకాశాన్ని పోగొట్టుకొంది. డైనాస్టీ పాలన కు బీజం వేశి ప్రస్తుత మన దుస్థితి కి కారణం అయింది . సమస్యలు స్రుష్టించి వాటి దుష్ఫలితాలకు బలయిపోతే దేశం కోసం త్యాగం చేసినవాళ్ళెలా అవుతారో నాకర్ధం కాని విషయం .

    ReplyDelete
  5. i want indhira gandhi 20 సూత్రాల పథకము

    ReplyDelete