Sunday, January 2, 2011

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు - ఎక్కడి గొంగళి అక్కడే నా?: వనం జ్వాలా నరసింహారావు

జనవరి 6, 2011 న అఖిల పక్ష సమావేశం జరుగనున్న నేపధ్యంలో ...
తారు మారైన "అభిప్రాయం - అధ్యయనం - తీర్పు" ప్రక్రియ
వనం జ్వాలా నరసింహారావు
(ఆంధ్ర జ్యోతి, 4-01-2011)

ఏమిటీ జాగు? ఎందుకీ జాగు? ఏడాది క్రితమే చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని “ప్రభుత్వ తీర్పు” గా ప్రకటించి, వెనక్కు తగ్గి, మళ్లీ అభిప్రాయ సేకరణకు, అధ్యయనానికి తెర లేపారు. అంతవరకు బాగానే వుంది... అభిప్రాయం , అధ్యయనం జరిగిన తర్వాత, తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత కమిటీ దన్నా కావాలి, లేదా, ప్రభుత్వానిదన్నా కావాలి తప్ప, రాజకీయ నాయకులది ఎలా అవుతుందో అర్థం కావడం లేదు. పరిష్కారం ప్రభుత్వం చేతుల్లో వుంటే, శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా, తీర్పు ప్రకటించాలి. అలా కాదు... రాజకీయ నాయకుల చేతుల్లో వుందని ప్రభుత్వం భావిస్తే, వారు శ్రీకృష్ణ కమిటీకి వెల్లడించిన అభిప్రాయాల సారాంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేయాలి. కాదు... తీర్పు ప్రజలదే అనుకుంటే, గతంలోకి ఒక్క సారి తొంగి చూడాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయ తల్చుకుంటే, పార్లమెంటులో సంబంధిత ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి.... పార్లమెంటులోని వివిధ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరపాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడమే ప్రభుత్వ నిర్ణయమైతే, ధైర్యంగా బయట పెట్టాలి... పర్యవసానానికి ఎదురు చూడాలి!

కథ మళ్లీ మొదటికొచ్చింది. కర్ణుడి చావుకు ఎందరో కారణమైనట్లు నేతి ఈ దుస్థితికి కూడా అందరూ కారకులే. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, నవంబర్ 2009 ఆఖరు వారంలో, తన చివరి పోరాటంగా ప్రకటించి, "తెలంగాణ రాష్ట్రం" ఏర్పాటు ప్రకటన వెలువడేంతవరకు, వెనక్కు తగ్గేది లేదని అంటూ, ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. దీక్షకు కూచునే లోపునే ఆయన్ను అరెస్టు చేయడం, ఖమ్మం జైలుకు తరలించడం, అక్కడి జైలులోనే ఆయన దీక్ష కొనసాగించడం-ఆసుపత్రిలో చేర్పించడం, దీక్ష విరమించాడని ప్రకటించడం, దాన్ని ఆయన ఖండించడం నాటకీయంగా ఒకదాని వెంట ఒకటి జరిగాయి. చివరకు, మానవ హక్కుల కమీషన్ ఆదేశాల మేరకు కె.సీ.ఆర్ ను హైదరాబాద్ నిమ్స్ కు 108 అంబులెన్స్ లో తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో, ఆందోళన చెందిన అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వం-యూపీఏ ప్రభుత్వం, డిసెంబర్ 9, 2009 న కేంద్ర హోం మంత్రి చిదంబరంతో కర్ర విరగ కుండా-పాము చావకుండా వుండే రీతిలో "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం" అన్న అర్థం వచ్చే ఒక ప్రకటన చేయించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు, "సమైక్యాంధ్ర-ప్రత్యేకాంధ్ర" ఉద్యమాల పేరుతో హింస చెలరేగడంతో మరో ప్రకటన వెలువడింది. అనంతరం, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి జనవరి 5, 2010 న చిదంబరం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి, సమస్య పరిష్కారాన్ని కనుగొనడం రాజకీయ పార్టీల బాధ్యతగా చిత్రీకరించి, తాత్కాలికంగా చేతులు దులిపేసుకున్నారు. ఆ నాడు సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధుల్లో (పార్టీకి ఇద్దరు చొప్పున) ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన వారు తప్ప మిగతా ఎవరూ, స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాల్సిందే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. కాకపోతే ఆ పార్టీ నాయకులతో సహా అందరు కూడా చర్చల కొన సాగింపుకు "ప్రత్యక్షంగానో, పరోక్షంగా నో" అంగీకరించడంతో దరిమిలా శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. కాలయాపనకు శ్రీకారం చుట్టడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన నాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదానికి శ్రీకారం చుట్టడం ద్వారా ఆ ప్రాంత ప్రజలు “తమ తీర్పు” ను ఆ నాడే ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగి ఐదు దశాబ్దాలు దాటినా, తెలంగాణ ప్రాంత వారందరిలో, విడిపోయి- "తెలంగాణ" రాష్ట్ర ఏర్పాటు జరిగి, ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలోనే వుంటూ, అన్నదమ్ములలాగా మెలుగు తే మంచిదన్న భావన బలంగా నాటుకు పోయింది. ఆ నినాదమే, ఒక లక్ష్యంగా - ధ్యేయంగా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాల్సిందే అన్న స్థాయికి చేరుకోవడం "తమ తుది తీర్పు" గా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారంటే, పాలకవర్గాలు ఆ నినాదానికున్న ఆదరణను సరిగ్గా అంచనా వేయడం లేదనే అనాలి. కాకపోతే డిసెంబర్ తొమ్మిదో తేదీన, అప్పట్లో నెలకొన్నపరిస్తితులు చేజారిపోతుంటే, వ్యూహాత్మకంగా చిదంబరంతో యు పీ ఏ సర్కారు ఒక కంటి నీటి తుడుపు ప్రకటన చేయించి, ఉద్యమాన్ని పక్కదారి మళ్లించి, రాష్ట్రంలో చిచ్చు రగిలించి, మళ్లీ వెనక్కు తగ్గి, మరో ప్రకటన ఆ చిదంబరంతోనే చేయించి చోద్యం చూస్తున్నది. శ్రీకృష్ణ కమిటీ వేయడాన్ని తెలంగాణ ప్రజలు ఓర్పుతో, సహనంతో, భవిష్యత్ మీద నమ్మకంతో సహించి అంగీకరించారే తప్ప రాష్ట్రాన్ని సాధించుకోవడం చేతకాక ఒప్పుకో లేదు. కమిటీ నివేదిక తర్వాత కూడా మళ్లీ ఆట మొదలెడితే ఫలితాలు ఎలా వుండబోతున్నాయో ఎవరూ వూహించలేరేమో!

తెలంగాణ రాష్ట్రం తప్ప ఇంకేమిచ్చినా అంగీకరించడానికి ససేమిరా ఒప్పుకోని ఆ ప్రాంతంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు, ప్రత్యేకమైన రాయితీలను చట్ట రీత్యా - రాజ్యాంగ పరంగా కలిగించడం ద్వారా, తెలంగాణ వే(ఏ)ర్పాటు నినాదాన్ని మరో మారు పక్కదారి పట్టించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటే అంతకంటే దారుణం ఇంకోటి లేదు. పెద్దమనుషుల ఒప్పందమనీ, ఫజలాలీ సంఘం నివేదికనీ, ముల్కీ నిబంధనలనీ రకరకాల మార్గాలద్వారా తెలంగాణ కోరుకునే వారిలో కొన్ని ఆశలు రేకెత్తించి, కొన్నేళ్లు ఉద్యమాన్ని బలహీనపరచగలిగింది (కాంగ్రెస్) ప్రభుత్వం. ఇక ఇప్పుడా అవకాశం లేనే లేదు. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో "తెలంగాణ ప్రజా సమితి" పేరుతో, 1971 సాధారణ ఎన్నికల్లో రాజకీయ పార్టీగా బరిలోకి దిగిన తెలంగాణలోని అన్ని స్థానాలకు పోటీచేసి, 11 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రజాభిప్రాయం తెలంగాణ ఏర్పాటేనని స్పష్టంగా ఓటర్లు తెలియచేశారు. అంత కంటే " తుది తీర్పు" ఇంకేమైనా వుందా? ఆ తీర్పు తర్వాత ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ, అధ్యయనం చేయాల్సిన అవసరం వుందా? ఐనా శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుకు పరిణితి చెందిన తెలంగాణ ప్రజలు ఒప్పుకున్నారు. ఆ కమిటీ తీర్పు తెలంగాణ ఏర్పాటుకు విరుద్ధంగా వుంటే వారు ఒప్పుకుంటారని ప్రభుత్వం భావించడం కన్నా పొరపాటు మరొక టి లేదు.

కె. చంద్రశేఖర రావు "తెలంగాణ రాష్ట్ర సమితి" (టీ ఆర్ ఎస్) ని స్థాపించి ప్రత్యేక రాష్ట్ర వుద్యమాన్ని వ్యూహాత్మకంగా, అహింసా మార్గంలో, మేధావులను కలుపుకుని పోతూ, యావత్ భారతదేశంలోని భిన్న దృక్పధాల రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలను నెలకొల్పుకుంటూ, ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తూ, పదేళ్లు గా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అడపాదడపా ఇతర పార్టీల మీద, పార్టీ నాయకుల మీద దురుసుగా విరుచుకుని పడినా, లక్ష్య సాధన కొరకు అందరితో రాజీ పడుతున్నారు. మహబూబాబాద్ పర్యటనకు వెళ్తున్న జగన్ ను అడ్డుకునే విషయంలోను, విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తి వేయించే విషయంలోను, అలాంటి మరి కొన్ని ఉమ్మడి అంశాలలోను కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు ప్రకటించడానికి వెనుకాడ లేదు. తనకు అప్రతిష్ఠ తెస్తున్నదని భావించిన తాగుడుకు స్వస్తి చెపుతున్నట్లు టీవీ ఛానళ్లద్వారా ప్రకటించాడు. చావో-తెలంగాణా రాష్ట్ర సాధనో తేల్చుకుంటానన్నాడు. ఆమరణ నిరాహార దీక్ష చేబట్టబోతున్న విషయాన్ని నెలరోజులముందే ప్రకటించాడు. అనుకున్నట్లే-అనుకున్న రోజునే-అనుకున్న చోటునే నిరాహారదీక్ష చేసేందుకు వెళ్తున్న ఆయన్ను నిర్భందంలోకి తీసుకుంది ప్రభుత్వం. ఖమ్మం జైలుకు తరలించింది. నిరాహార దీక్ష కొనసాగుతుండగానే, ఆయన ఆరోగ్యం క్షీణించింది. హైదరాబాద్ "నిమ్స్" కు కోర్టు ఆదేశాల మేరకు-మానవహక్కుల సూచనమేరకు తీసుకొచ్చింది ప్రభుత్వం. తెలంగాణ అంతా నిరసన జ్వాలలు పెల్లుబుకాయి. శాంతి-భద్రతల పరిస్థితి క్షీణించసాగింది. పరిస్థితి చేజారిపోతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం-యూ పీ యే ఛైర్ పర్సన్ సోనియా, చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చిదంబరంతో "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలవుతుంది" అన్న ప్రకటన చేయించింది కేంద్రం. కేసీఆర్ దీక్ష విరమించాడు. తెలంగాణ వస్తుందని భావించిన వారందరికీ అప్పటికి నిరాశే మిగిలింది.

ఆంధ్ర ప్రాంతంలో, "ప్రత్యేక ఆంధ్ర" కావాలని కోరిన ఒకనాటి నాయకులు, పంథాను మార్చుకొని, "సమైక్య ఆంధ్ర" అన్న నినాదం లేవదీశారు. విజయవాడ లోక్ సభ సభ్యుడు ఒక అడుగు ముందుకు వేసి "సమైక్య ఆంధ్ర" కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం-మానుకోవడం జరిగిపోయింది. ఆంధ్ర-రాయలసీమకు చెందిన అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు-ఎంపీలు రాజీనామా అస్త్రాలను సంధించారు. సమావేశమైన రాష్ట్ర శాసనసభ అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఆంధ్ర-రాయలసీమలో శాంతి భద్రతలు క్షీణించాయి. కేంద్రం మీద ఒత్తిళ్లు పెరిగాయి. చిదంబరం మరో ప్రకటన చేయాల్సివచ్చింది. అన్ని వర్గాల వారిని సంప్రదించిన తర్వాత ఏకాభిప్రాయ సాధనతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు జరుగుతుందని దాని సారాంశం. అదెప్పుడో అప్పటికీ-ఇప్పటికీ "చిదంబర రహస్యం" గానే మిగిలిపోయింది. ఇంతలో తెలంగాణకు చెందిన అన్ని పార్టీల వారు ఒకటయ్యారు. చట్ట సభలకు ఎన్నికైన వారితో సహా, అన్ని స్థాయిలలో ఎన్నికైన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు సమర్పించారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైంది.

ఎనిమిది వందల పేజీల శ్రీకృష్ణ కమిటీ నివేదికలో, అఖిల పక్షం సమావేశానికి చిదంబరం ఆహ్వానించిన రాజకీయ పార్టీల అభిప్రాయాలు లేవా? అవన్నీ క్రోడీకరించి, రెండు-మూడు పేజీల సంక్షిప్త సమాచారంగా చేసి, ప్రభుత్వ అభిప్రాయాన్ని- ముసాయిదా తీర్పును దానికి అనుబంధంగా చేర్చి, పార్లమెంటులోని వివిధ రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించి, తమ నిర్ణయం ప్రకటించి, వారి సమాధానం తెలుసుకొని, ముందుకు సాగుతే మంచిది. అలా కాకుండా, జనవరి 5, 2010 నే పునరావృతం చేస్తే ఫలితం శూన్యం. అంతగా పిలవ తల్చుకుంటే, ఇదే ప్రక్రియను రాష్ట్రానికి చెందిన ఎనిమిది రాజకీయ పార్టీల అధ్యక్షులతో మాత్రమే చేస్తే సరిపోతుంది. "ఒక పార్టీ-ఒక అభిప్రాయం" అన్న సిద్ధాంతాన్ని పాటించాలి తప్ప, అఖిల పక్ష సమావేశం ఒక చర్చా వేదికగా మార్చే ప్రయత్నం చేయకూడదు. అలా చేయడమంటే, ప్రభుత్వ నిర్ణయం వాయిదా వేసి, శాశ్వతంగా ఉద్యమానికి అంకురార్పణ చేయడమే! శాశ్వతంగా శాంతి భద్రతల సమస్యను ప్రభుత్వ పరంగా సృష్టించడమే! అంటే, ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చినట్లే!

చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి.... కాదను కుంటే...ధైర్యంగా చేయమని చెప్పాలి... జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాలి. నాన్చు డు ధోరణి ప్రజాస్వామ్యానికే విఘాతం.

1 comment:

  1. chestam cheyyam ani cheppedi nayakulu, uppudunnadi vennemuka leni dagulbajilu. matam, kulam, prantam , bhasha to kaalam gadipe telivyna vyaparula kootami.
    I dont know past and I dont care past. gata 10yrs lo asalyna praja samasyalanu parishkarincha vallu okkarina veellalo vunnara? KCR to saha!!!

    inkorakam ga chooste naanchadame asalayina parishkaram , dochuku tine vaallu takkuva mandi vuntaru.

    ReplyDelete