Monday, January 10, 2011

మీడియాపై ఆంక్షలా? లక్ష్మణ రేఖలా? స్వీయ నియంత్రణలా? మార్గదర్శకాలా?: వనం జ్వాలా నరసింహారావు

మీడియాపై ఆంక్షలా? లక్ష్మణ రేఖలా? స్వీయ నియంత్రణలా? మార్గదర్శకాలా?
వనం జ్వాలా నరసింహారావు

హద్దులు గీసేది ఎవరనేదే పేచీ - యథార్థాలు తెలపకపోతే పుకార్లదే రాజ్యం
వాస్తవాలు దాస్తే ఎలా! - ఉద్యమాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగమేనా?
స్వయం సంయమనమే ఉత్తమం
(సూర్య దినపత్రిక : 12-01-2011)

కేబుల్‌ నియంత్రణ చట్టం ప్రకారం హింసాత్మక సంఘటనలు ప్రసారం చేయరాదన్న నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ (ఎన్‌బీయే) నిబంధనలను-హైకోర్టు ఆదేశాలను పాటించాలని మాత్రమే చెప్పాం కాని, మీడియాపై ప్రభుత్వపరంగా ఎటువంటి ఆంక్షలు విధించలేదని హైదరాబాద్ నగర పోలీస్‌ కమిషనర్‌ అంటుండగా, అది వాస్తవం కాదని మీడియాకు చెందిన పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ’ఎన్‌బీయే’ మార్గదర్శకాలను అమలుచేసేందుకు కొన్ని ఛానళ్లు మాత్రమే అంగీకరించాయని, మీడియాలో కూడా "సీమాంధ్రుల" ప్రభావం వల్ల వాస్తవాలు వెలుగు చూపకుండా పరోక్షంగా "ఆంక్షల-మార్గదర్శకాల ముసుగు" లో తెలంగాణ సాధన ప్రక్రియకు అడ్డుతగులుతున్నారని కొందరంటున్నారు. ఏదేమైనా కొన్ని ఛానళ్లకు నోటీసులందిన వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపధ్యంలో, మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలన్న డిమాండుతో, “తెలుగు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్” ఆవిర్భవించడం, ఆ సంస్థకు రాష్ట్రంలోని ప్రధాన వార్తా ఛానళ్ల ప్రముఖుల మద్దతుండడం గమనించ దగ్గ విషయం. ఈ సంస్థ మార్గదర్శకాలకు, ఇంతవరకూ జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ’ఎన్‌బీయే’ సంస్థ ఆదేశాలకు వ్యత్యాసం ఏమేరకుంటుందో చూడాలి.

అసలింతకీ అమల్లో వున్నాయని అందరూ భావిస్తున్నవి, "ఆంక్షలా"? "లక్ష్మణ రేఖలా"? "స్వీయ నియంత్రణలా"? "మార్గదర్శకాలా"? ఎవరికి వారే తమ ప్రయోజనాలకు అనుగుణంగా-అనుకూలంగా మలుచుకుంటున్న "ముసుగులా"?. ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో మీడియా నిర్వహించాల్సిన పాత్ర గురించి, వారి బృహత్తర బాధ్యత గురించి, పరాయి వారు తమపై ఆంక్షలు విధించే బదులు వారే స్వయం సంయమనం పాటించే అంశం గురించి, రాజ్యాంగ బద్ధంగా మీడియా వారికున్న స్వాతంత్ర్యం గురించీ చర్చ నిరంతరం కొనసాగుతూనే వుంది. ప్రభుత్వ తప్పొప్పులను విమర్శించే హక్కు మీడియాకుందంటూనే, ఆ హక్కుకు "హద్దులుండాలి" అని అనడం సబబే మో కాని, ఆ హద్దులకు "ఎల్లలు" ఎవరు-ఎలా గీయాలనే విషయంలోనే పేచీ వస్తున్నది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి 2004 లో అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే, ఒకటి రెండు పత్రికలపై ఆయనకున్న వ్యతిరేకత-ఒకటి రెండు పత్రికలకు ఆయన పట్ల వున్న వ్యతిరేకత నేపధ్యంలో, "మీడియాకు లక్ష్మణ రేఖ" అన్న అంశంపై చర్చ జరుగుతుండేది. "వార్తలకు, వ్యాఖ్యలకు" తేడా లేకుండా పత్రికలు ప్రచురించడం వల్ల, పాఠకులు అయోమయానికి గురై, వ్యాఖ్యలనే వార్తలనుకుంటున్నారని, అప్పట్లో ఆయన ఒకటి రెండు పత్రికలపై విమర్శలు గుప్పించే వారు. ఆయన అన్న దాంట్లో ఎంత నిజముందో పక్కన పెడితే, ఇప్పుడున్న ప్రభుత్వం, అసలు వార్తలనే "నిభందనలకు-ఆంక్షలకు-మార్గదర్శకాలకు" లోబడి ప్రచురించాలనీ, ఛానళ్లలో ప్రసారం చేయాలని అంటే, అదెలా అర్థం చేసుకోవాలన్నదే ప్రశ్న! యదార్థంగా జరిగిన-జరుగుతున్న సంఘటనలను, వ్యాఖ్యానం జోడించకుండా, ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యతను కూడా మీడియాను నిర్వర్తించ నీయకపోతే, అసత్యాలు-పుకార్లు చోటుచేసుకునే ప్రమాదం వుంది. వాస్తవాలు దాచడమంటే, పరోక్షంగా అవాస్తవాలు బయటపెట్టమని అనడమే!

ఏదీ సమయం సందర్భం లేకుండా జరగదు. ప్రస్తుతం జరుగుతున్నది కూడా అదే. శ్రీకృష్ణ కమిటీ నివేదిక చేసిన ఆరు సూచనలలో తెలంగాణ కోరుకునేవారికి సంబంధించినంతవరకు ప్రధానమైంది ఒకే ఒక్కటి. అదే ఐదో సూచన. తెలంగాణ లోని మెజారిటీ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారన్న వాస్తవం చెప్తూ, "తప్పని పరిస్థితుల్లో-అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యమైతే" తెలంగాణ-సీమాంధ్రలుగా రాష్ట్ర విభజన జరగాలని కమిటీ అభిప్రాయపడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలన్న చిరకాల డిమాండ్ నేపధ్యంలో, రాష్ట్ర విభజన జరగకపోతే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొనసాగే ప్రమాదముందని కమిటీ హెచ్చరిస్తుంది. "నేర్పుగా, చాకచక్యంగా, దృఢంగా" ప్రభుత్వం ఉద్యమాన్ని”అదుపు చేయగలిగితే" తప్ప ఉద్యమం ఎదుర్కోవడం కష్టమవుతుంది కనుక, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమే ఉత్తమం అని చెప్తూ, శాంతి భద్రతల సమస్య తలెత్తే విషయాన్ని ప్రస్తావించింది. బహుశా శ్రీకృష్ణ కమిటీ భావించి-సూచించిన "నేర్పుగా, చాకచక్యంగా, దృఢంగా" ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంలో భాగమే ఈ ఆంక్షలు, లక్ష్మణ రేఖలు, స్వీయ నియంత్రణలు, మార్గదర్శకాలు అనుకోవాలేమో!

ఇవన్నీ కాసేపు పక్కన పెడితే... ఇటీవలి కాలంలో, మీడియా వ్యవహరించే తీరులో, ఊహించని ధోరణులు-విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని విజ్ఞులు, మేధావులు, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాలు, పాత్రికేయ నాయకులు కొందరు అభిప్రాయ పడుతున్నారు. సమాజంపై ఈ మార్పు ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదముందని కూడా వారి అభిప్రాయం. అలా అభిప్రాయ పడుతున్న వారి పరోక్ష సూచనే "లక్ష్మణ రేఖలు" అన్న సిద్ధాంతానికి మార్గం చూపాయి. అయితే, లక్ష్మణ రేఖ అంటే, నియంత్రణ కాదని-కాకూడదని, మీడియా కూడా ఇతర ప్రజాస్వామ్య వ్యవస్థల వలెనే, ప్రజలకు "జవాబుదారీగా-బాధ్యతాయుతంగా-పారదర్శకంగా" పనిచేసేందుకు దోహద పడేది మాత్రమేనని సర్ది చెప్పుకున్నారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల ప్రభుత్వాలన్నీ మీడియాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ, అడపాదడపా ఆంక్షలు విధించకుండా వుండడం జరగదు. భారత రాజ్యాంగం భావ స్వేచ్ఛ ప్రసాదించినప్పటికీ, ఆ స్వేచ్ఛ "నిష్పాక్షికంగా, బాధ్యతాయుతంగా" వినియోగించుకోవడానికి, ప్రభుత్వ పరమైన నియంత్రణలకంటే స్వయం సంయమనం పాటించడమే మేలు. మన రాష్ట్రంలో ఆవిర్భవించిన “తెలుగు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్” స్వయం సంయమనం పాటించే దిశగా చర్యలు తీసుకుంటే అభినందించాల్సిందే.

ఒక్క విషయం మాత్రం వాస్తవం అనక తప్పదేమో. ఇటీవల కాలంలో, సామాజిక ప్రయోజనాలను కాపాడవలసిన మీడియా, ఆ పని చేస్తూనే, అది అనుకూలించనప్పుడు, కార్పొరేట్ గొంతును మాత్రమే వినిపిస్తున్నదని సర్వత్రా చర్చనీయాంశమైంది. మీడియా మొత్తం అలా, అన్ని వేళలా చేస్తున్నదని చెప్పలేం కాని, దాని ధోరణిలో సరికొత్త నిర్వచనాలు, సరికొత్త విలువలు, సరికొత్త ప్రాధాన్యతలు చోటు చేసుకోవడం మాత్రం కాదనలేం. ఎలెక్ట్రానిక్ మీడియా ప్రభావిత పాత్రికేయ రంగంలోని కొంత భాగం, తన విశ్వసనీయతను కోల్పోతున్నదనడానికి పలు ఉదాహరణలు దొరుకుతాయనవచ్చు. ఈ ధోరణికి తోడు, ఎలెక్ట్రానిక్ మీడియాలో నెల కొన్న పోటీ, మీడియా విశ్వసనీయతకు సవాలుగా మారింది. సంక్లిష్టమైన సామాజిక ప్రయోజనం కలిగే అంశాలను తగ్గించి ప్రసారం చేయడం, పైపై మెరుగులకు అనవసర ప్రాధాన్యతను ఇవ్వడం, సంచలన వార్తల కొరకు పరుగులు తీయడం, ఆ వార్తలను తమ ఛానల్ కంటే ముందుగా ఇతరులు ప్రసారం చేస్తారేమోనన్న ఆందోళనతో దృఢ పరచుకోకుండానే "బ్రేక్" చేయడం తరచుగా జరగడంతో మీడియా విశ్వసనీయత కోల్పోయేందుకు దారితీస్తున్నది. అలాంటప్పుడు, స్వయం సంయమానికి మించిన లక్ష్మణ రేఖలు కాని, ఆంక్షలు కాని, నియంత్రణలు కాని ఎంతవరకు ఆ విశ్వసనీయతను కాపాడ కలుగుతాయి?

భారత రాజ్యాంగంలో, "ఎగ్జిక్యూటివ్-జుడీషియరీ-లెజిస్లేచర్" వ్యవస్థలు ఎటువంటి కట్టుబాట్లకు, అదుపులు-అన్వయాలకు లోబడి తమ తమ కర్తవ్యాలను నిర్వహించాలో స్పష్టంగా వివరించబడింది. అయినా, అప్పుడప్పుడూ, ఆయా వ్యవస్థలను అత్యున్నత స్థాయిలో అజమాయిషీ చేసేవారి "యాక్టివిజం" వల్ల, అనుకోకుండానే అనర్థాలు కలగడం, వాటి పర్యవసానాలు పౌరుల మీద ప్రతికూల ప్రభావం చూపడం తెలిసిన విషయమే. కాకపోతే, రాజ్యాంగ బద్ధమైన ఆ వ్యవస్థలు తమ తప్పులను దరిమిలా సరిదిద్దుకోవడం కూడా జరిగింది. పోనీ పునఃపరిశీలన చేయడం జరిగింది. ఉదాహరణకు, జనవరి మొదటి వారంలో పౌర హక్కులకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక కీలకమైన తీర్పును తీసుకోవచ్చు. దాదాపు 35 సంవత్సరాల క్రితం, ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు "కార్యనిర్వాహక వ్యవస్థ-ఎగ్జిక్యూటివ్" దేశాన్ని కాపాడే బాధ్యత స్వీకరిస్తుందని, ఆ వ్యవస్థ చేపట్టిన చర్యలు, వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగాయనో, మరేదో కారణానో సవాలు చేయడం సరికాదని, "వ్యక్తి స్వేచ్ఛ చట్ట పరిధికి లోబడి, నియంత్రించబడి" వుంటుందని అలనాటి సుప్రీం కోర్టు న్యాయ మూర్తులు తీర్పిచ్చారు. అయితే, అత్యున్నత న్యాయస్థానానికి చెందిన ఆ నలుగురు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు వల్ల, భారీ సంఖ్యలో దేశ పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని, తిరిగి అదే అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పడం, ప్రజాస్వామ్యంలో ప్రాధమిక హక్కుల పరిరక్షణ దిశగా మరో అడుగు ముందుకు వేసేందుకు దోహద పడుతుందనాలి. "ఫోర్త్ ఎస్టేట్" గా పిలవబడే మీడియా విషయంలో రాజ్యాంగపరంగా "అదుపులు-అన్వయాలకు" వీలు కలిగించలేదు. అందుకే రాజ్యాంగంలో పొందుపరచిన పౌరుల "భావ ప్రకటనా స్వేచ్ఛ" అనే ప్రాధమిక హక్కును, స్వీయ నియంత్రణ లాంటి "అదుపులు-అన్వయాలకు" (Self Imposed Checks and Balances) లోబడి ఉపయోగించుకుంటే బాగుంటుందేమో.

వ్యక్తి భావ ప్రకటనా స్వేఛ్చకుండాల్సిన పరిమితులు-హద్దులు రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. పౌరుల భద్రత, వైద్య పరమైన విషయాలు, నీతి వర్తన లాంటి అంశాల్లో గందరగోళం సృష్టించే పరిస్థితులకు వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛ దారితీయకూడదు. ఒక పౌరుడి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, మరో తోటి పౌరుడి స్వేచ్ఛకు భంగం కలిగించ కూడదు. ఏ విధంగానైతే బహుళ ప్రయోజనాలకు ఒక వ్యక్తి స్వేచ్ఛ భంగం కలిగించ రాదో, అలానే, మీడియా స్వేచ్ఛ కూడా వుంటే మంచిదేమో. ఆ ప్రయోజనాలేంటో, ఆ పరిమితులేంటో నిర్ణయించుకోవాల్సింది విశ్వసనీయత కాపాడుకోవాల్సిన మీడియానే. బహుశా ఆ బాధ్యతను, రాష్ట్రంలోని ప్రధాన వార్తా ఛానళ్ల ప్రముఖుల చొరవతో ఆవిర్భవించిన “తెలుగు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్” చేపడ్తుందని ఆశించుదాం. End.

3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. OK Media in the hands of vested interests is not showing whats happening in Osmania University. Is it possible to thwart agitation that is supposed to engulf entire Telangana Region immediately after 31st December, 2010. Where is that spontaneous agitation supposed to erupt! Media has earlier hyped up every single normal event and now they are compelled to desist from such cheap journalism.

    ReplyDelete
  3. ఔనన్నా కాదన్నా మీడియా చానళ్ళు ...
    స్వచ్చంద సంస్థలో , సేవా ట్రస్ట్ లో కావు కదా...
    హిట్ల తో హిట్టయ్యే ప్రైవేటు వ్యాపారమది...
    వ్యాపారమంటేనే సగం అబద్దం...
    నిజాలని నిజాలుగా చూపమనడం వారికి అసంబద్దం...
    వాటిని చూస్తూ అపోహలో బ్రతకడం మన ప్రారబ్ధం...

    "మూడవ ప్రపంచ యుద్దం రాబోతుందా?
    మనిషికి మళ్ళీ తోక రాబొతుందా?
    సోనియా మళ్ళి ఇటలీ వెళ్ళి పోతారా
    వైఎస్ ఉత్‌ప్రేరకాలని వాడి పాదయాత్ర చేపట్టారా?
    అవుననే చేబుతున్నాయీ తాజా-పరొశోదనలు! ఇలాంటి ఆసక్తికర అంశాల కై చూస్తూ ఉండండి .. నిరంరంతర ...బ్లా బ్లా బ్లా !"...

    ఇల్లాంటి ఊహావాదాలు, బాధావాదాలు(sadism)...

    ముసుగొలో, లొసుగులని బాగా ఉపయోగించుకుంటున్నాయ్ ఆన్నీ చానళ్ళు...

    వీటికన్నా ఆ "సప్తగిరిలో", అంతరాయం లో వచ్చే ఆ రెయింబొ కలర్స్ చూస్తూ కూర్చొవడం బెట్టర్....

    ReplyDelete