Monday, July 9, 2012

పీవీపై నింద మోపడమంటే ఈర్ష్య-అసూయలకు పరాకాష్టే!: వనం జ్వాలా నరసింహారావు


పీవీపై నింద మోపడమంటే 
ఈర్ష్య-అసూయలకు పరాకాష్టే!
వనం జ్వాలా నరసింహారావు

పీవీపై అసత్య కథనాలు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (12-07-2012)

స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాజకీయ ప్రత్యర్థి "కీర్తి శేషులు" అర్జున్‌ సింగ్ "ఆత్మకథ-ఏ గ్రెయిన్ ఆఫ్ శాండ్ ఇన్ ద అవర్‌ గ్లాస్ ఆఫ్ టైమ్" పేరిట, పీవీతో అంతగా పరిచయమే లేని సీనియర్ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ పుస్తకం "బియాండ్ ద లైన్స్" పేరిట, ఆ మహనీయుడిపై బురద చల్లే కార్యక్రమానికి కొందరు ఇటీవల పనిగట్టుకుని మరీ శ్రీకారం చుట్టారు. పీవీ నరసింహారావు అంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు కోపమని, సోనియా అంటే పీవీకి సదభిప్రాయం లేదని, రాజీవ్ హత్యా-మరణానంతరం సోనియా గాంధీని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని చేద్దామన్న సూచనకు పీవీ వ్యతిరేకమని, ఇంజనుకు తగులుకుని రైలు పెట్టెలన్నీ దాని వెనకాలే వెళ్లినట్టు నెహ్రూ-గాంధీ కుటుంబం వెనుకే కాంగ్రెస్ పార్టీ వెళ్లడం దేనికని పీవీ ఆ సందర్భంగా ప్రశ్నించాడని, బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంలో ఆయన ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని కూర్చోవడమంటే రోమ్ తగలబడుతున్నప్పుడు నీరో ఫిడేలు వాయిస్తున్న దృశ్యం తనకు గుర్తుకొచ్చిందని అర్జున సింగ్ ఆరోపించారు తన ఆత్మకథలో. అసంపూర్తి గా మిగిలిపోయిన అర్జున సింగ్ గ్రంథాన్ని ఆయన సన్నిహితుడైన అశోక్ చోప్రా పూర్తి చేసే ప్రయత్నంలో భాగంగా మరికొన్ని సంచలనాత్మక విషయాలున్నాయి. సోనియా పట్ల పీవీ ప్రవర్తన తనకు రాజకీయాలంటేనే అసహ్యం వేసే స్థితికి తీసుకెళ్లిందని, ఐతే, కొద్ది సేపటికే పీవీ మనసు మార్చుకుని తానిచ్చిన ఆలోచనకు సానుకూలంగా స్పందించారని అర్జున సింగ్ పేర్కొనడం జరిగింది. రాసిన అర్జున సింగ్ కాని, ఎవరినుద్దేశించి రాయడం జరిగిందో ఆ నాయకుడు పీవీ నరసింహారావు కాని ఇప్పుడు మన మధ్య లేరు. ఆ పుస్తకంలోని నిజా-నిజాలు వారిద్దరన్నా చెప్పాలి, లేదా, వారి సమకాలీనులన్నా చెప్పాలి.

బాబ్రీ కూల్చివేత వార్త వినగానే తన మనసులో ఆ దృశ్యాలు కదిలాయని, ఆ విషాద ఘటన తాలూకు పరిణామాలు దేశ చరిత్రలో అంచనా వేయలేని స్థాయిలో ఉంటాయని తన మనసుకు అనిపించిందని, భారతదేశ "లౌకిక వ్యవస్థ" తీవ్రంగా దెబ్బతిన్నదన్న బాధ కలిగిందని, ఆ మనస్తాపంతోనే పీవీకి ఫోన్ చేస్తే, ఆయన అందుబాటులో లేరని సమాచారం అందిందని అర్జున్ సింగ్ పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా, మరొక్క అడుగు ముందుకు వేసి, బాబ్రీ మసీదును కూల్చడానికి ఒక రోజు ముందే, ఆ విషయాన్ని తాను పీవీకి చెప్పానని అర్జున్ రాసుకున్నారు. అయితే ఆయన ఆ అంశాన్ని అంత తీవ్ర విషయంగా పరిగణించడం లేదనే భావన తనకు కలిగిందని పేర్కొన్నారు. బీజేపీ, ఇతర హిందూత్వ అనుకూల సంస్థల కుట్రలు, కుతంత్రాలను ఎందుకు పట్టించుకోవడం లేదని పీవీని ఆయన ప్రశ్నించారట! ఒక విధంగా పీవీకి "కమ్యూనల్ కలర్" ఇచ్చే ఆరోపణ ఇది.



సరిగ్గా ఇలాంటిదే-ఇదే సమయంలో, సందర్భం అనేదేదీ లేకుండా, బహుశా ఇలా కలిమిడిగా చేద్దామని ఆలోచించి మరీ చేశారన్న భావన కలిగే విధంగా, కులదీప్ నయ్యర్ పుస్తకంలోని కొన్ని భాగాలను మీడియాకు వెల్లడించడం జరిగింది. బురదజల్లుడు కార్యక్రమం ఆ విధంగా కొనసాగించే ప్రక్రియకు ఆయనా తయారయ్యారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో, అర్జున్ సింగ్ చేసిన ఆరోపణను కులదీప్ నయ్యర్ మరి కొంచెం విస్తరించి చెప్పారు. పీవీ "నిష్క్రియగా" కూర్చొన్నారనేదే వారిరువురి ఆరోపణ. తనకున్న సమాచారం ప్రకారం "బాబ్రీ మసీదు కూల్చివేతకు పీవీ మౌనంగా అంగీకారం తెలిపారు" అనేది కులదీప్ నయ్యర్ ఆరోపణ. ఆ సమాచారమేంటో ఇదమిద్ధంగా చెప్పకుండా డొంక తిరుగుడుగా చెప్పే ప్రయత్నం చేశారు ఆయన స్థాయి సీనియ పాత్రికేయుడు. కరసేవకులు మసీదును కూల్చడం మొదలుపెట్టగానే పీవీ పూజలో కూర్చున్నారని, చిట్టచివరి రాయిని కూడా తొలగించిన తర్వాతే ఆయన పూజనుంచి లేచారని, పూజ జరుగుతుండగా పీవీ అనుచరుడొకరు వచ్చి ఆయన చెవిలో మసీదు కూల్చివేత అయిపోయిందని చెప్పారని తన పుస్తకంలో రాసుకున్నారు. తనకందిన సమాచారానికి ఆధారంగా దివంగత సోషలిస్టు నాయకుడు మధు లిమాయేను పేర్కొన్నారు. తన పుస్తకంలోని "నరసింహారావు ప్రభుత్వం" అనే అధ్యాయంలో మసీదు కూల్చివేతకు నిరసనగా మత కల్లోలాలు జరుగుతున్నప్పుడు పీవీ కొందరు సీనియర్ పాత్రికేయులను తన ఇంటికి పిలిచిన విషయం; మసీదు కూల్చివేతను ఆపడానికి తన ప్రభుత్వం వీలైన ప్రతి ప్రయత్నమూ చేసిందని చెప్పిన విషయం; తాను లక్నోకు సీఆర్ పీ దళాలను పంపినా వాతావరణం అనుకూలించని విషయం; లాంటివి పేర్కొన్నారు. పీవీ అంటే సోనియా గాంధీకి ఇష్టం లేని విషయాన్ని కులదీప్ నయ్యర్ సహితం రాశారు. పార్టీ పగ్గాలు, ప్రధాని పదవిని పీవీ చేపట్టడం సోనియాగాంధీకి ఎప్పుడూ ఇష్టం లేదనే సంగతినీ వెల్లడించారు. సోనియా "మత తత్వ శక్తులు రాజకీయాలను ఆక్రమిస్తున్నాయని" వెలిబుచ్చిన ఆవేదనకు ప్రాధాన్యం ఇస్తూ రాసిన కులదీప్ నయ్యర్, మతతత్వంపై పోరాడాలంటే సోనియా రాజకీయాలలో చేరక తప్పదని, అందుకు ఆమె చేతుల్లో వున్న ఏకైక ఆయుధం కాంగ్రెస్ పార్టీనే నని ఆనాడే తాను అంచనా వేశానని నయ్యర్ రాసుకున్నారు. దీని సారాంశం కూడా పీవీ కమ్యూనలిస్టేనని!

అర్జున సింగ్, కులదీప్ నయ్యర్ తమ ఆత్మకథలలో రాసిన మాటలను వాస్తవాలుగా ఎంతవరకు పరిగణించవచ్చు? వాస్తవ దూరం ఐతే అవి నిజాలు కావని చెప్పేదెవరు? అర్జున్ సింగ్ కాని, పీవీ నరసింహా రావు కానీ, కులదీప్ నయ్యర్ ప్రస్తావించిన మధు లిమాయే కాని మన మధ్య లేరు. కాకపోతే, పీవీ హయాంలో బాధ్యతాయుతమైన స్థానాలలో పనిచేసిన వారిలో పలువురు ఇంకా జీవించే వున్నారు. బాబ్రీ మసీదు సంఘటన కూల్చివేత పూర్వ రంగంలో, ఉత్తర రంగంలో ఆయనతో ఆ విషయాలను ప్రత్యక్షంగానో-పరోక్షంగానో పంచుకున్న వారూ లేకపోలేదు. మధులిమాయేను కోట్ చేసిన కులదీప్ నయ్యర్, అసలాయన ఆ క్షణంలో పీవీ సమీపంలో వున్నారా? లేరా? అన్న విషయాన్ని కూడా ధృవీకరించుకున్నట్లు లేదు. సరిగ్గా ఇవే విషయాలను పీవీ హయాంలో (మరో ఐదుగురు ప్రధాన మంత్రులతో సహా) న్యాయ శాఖ కార్యదర్శిగా పనిచేసి ఆయనకు "రాజ్యాంగ పరమైన" అనేక విషయాల్లో నిర్మొహమాటమైన సూచనలిచ్చిన పీసీ రావు, అదే విధంగా పీవీకి మీడియా సలహాదారుగా మాత్రమే కాకుండా ఆయనకు అనేక విషయాలలో ఆంతరంగికుడుగా పనిచేసిన పీవీఆర్‍కె ప్రసాద్ స్వయానా హైదరాబాద్ మీడియాకు వివరించడం జరిగింది. అర్జున సింగ్-కులదీప్ నయ్యర్ రాసినవన్నీ అసత్య కథనాలేనని, పీవీపై కడుపు మంటతో వారీ పని చేశారని వారి మాటల్లో వ్యక్తమైంది. బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన సమయంలో, అలనాటి వాస్తవాలకు వీరు ప్రత్యక్ష సాక్షులు. తమతో పాటు నాటి కేంద్ర హోం శాఖ కార్యదర్శి మాధవ్ గోఖలే, కాబినెట్ కార్యదర్శి రాజగోపాల్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్ వైద్య, పీవీ ఆంతరంగిక కార్యదర్శి ఏఎన్ వర్మ, కేంద్ర హోం మంత్రి ఎస్‍బీ చవాన్ వున్నారని వీరన్నారు. మరి వారందరికీ తెలియని విషయాలు మధులిమాయేకు ఎలా తెలిశాయో అర్థం కాని ప్రశ్న.  వారి రాతలన్నీ పీవీ ప్రతిష్టను దిగజార్చేటందుకేనన్నది కూడా వారి మాటల్లో వ్యక్తమైంది. ప్రధాని పదవి ఆశించి భంగపడిన అర్జున్ సింగ్‌కు పీవీపై ఎప్పుడూ కోపమేనని అంటూ ఆయన అలా రాశారంటే ఆ కోణంలో అర్థం చేసుకోవచ్చు కాని, కులదీప్ నయ్యర్ కూడా లా రాయడం దురదృష్టం అన్నారు.

బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో పీవీ పూజ గదిలో వున్నారని చేసిన ఆరోపణ చాలా హాస్యాస్పదమైంది గా పీవీఆర్‍కె, పీసీ రావులు పేర్కొన్నారు. అర్జున్ సింగ పీవీ వ్యతిరేకైతే, కులదీప్ నయ్యర్ పీవీని ఏనాడూ దగ్గరనుంచి చూడలేదని, అలనాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ చేసిన తప్పులకు పీవీని బాధ్యుడుగా చేయడం తగదని అన్నారు. వారన్నట్లుగా పీవీని రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరోతో పోల్చడం చాలా తప్పు. అసలు పీవీ నరసింహారావు ఇంట్లో పూజ గదే లేదట. కూల్చివేత సంఘటన జరిగిన డిసెంబర్ ఆరవ తేదీన పీవీ రోజంతా ఉన్నతాధికారులతో సమీక్ష జరుపుతూనే వుంటే ఇక పూజ గదిలో కూర్చోడం ఎలా జరిగింది? పీవీ ఏ పని చేసినా రాజ్యాంగ బద్ధమైందేతేనే చేసేవారట. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని దింపి రాష్ట్రపతి పాలన ఒక రోజు ముందట విధించడమంటే, రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేయడమే! అలా చేయనందున ఈ రోజున ఆయనపై అసత్య ఆరోపణలు చేసి "కమ్యూనలిస్ట్" అనే ముద్ర వేయడం తగని పని. పీవీ ఏ నాడూ రాజ్యాంగాన్ని అతిక్రమించలేదు.

పీవీని అప్రతిష్ట పాలు చేయడం ఇవ్వాళ కొత్తేమీకాదు. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం, పీవీ నరసింహారావుకు వ్యతిరేకంగా జార్ఖండ్ ముక్తి మోర్చాకు ముడుపులు ఇచ్చారన్న కేసులో పీవీ శిక్షార్హుడని న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పుడు మీడియాలో ఆ విషయం ప్రముఖంగా ప్రచురించారు. "అవినీతికి అర దండాలు" అని, "చెరసాలకు మాజీ ప్రధాని" అని, "ఆర్థిక సంస్కరణల శిల్పికి మూడేళ్ల జైలు శిక్ష" అని శీర్షికలు పెట్టారు. న్యాయమూర్తి అజిత్ బరెహోక్ తన తీర్పులో, కఠిన పదజాలాన్ని వాడి, పీవీ చేసిన ప్రయత్నం భారత రాజ్యాంగ స్ఫూర్తికే వ్యతిరేకమని, ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమనీ పేర్కొన్నారు. కాని ఆ తరువాత ఏమైంది? ఐదారు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో శతాబ్దాల అనుభవాన్ని సంపాదించి, పలువురికి పంచిపెట్టిన మేధావి, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా చిరునవ్వు వీడని థీశాలి ముఖంలో కొన్ని సెకనులు మాత్రమే ఆందోళన కనిపించింది. పీవీ నేరం చేశారో-లేదో తరువాత వెలువడిన తీర్పులే తేల్చాయి. ఏ ఒక్క దాంట్లో నూ ఆయన నేరస్తుడుగా మిగలలేదు. కొన్నాళ్లకు పై కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. బహుశా ఇప్పుడు పీవీ జీవించి వున్నట్లయితే అర్జున్ సింగ్-కులదీప్ నయ్యర్ రాతలకు అలానే చిరునవ్వు నవ్వేవాడేమో!

ఇంతకీ పీవీ చేసిన తప్పేంటి? ఆలోచనలలో, అమలులో, విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనబడిన ఈ వ్యక్తి, అపర చాణక్యుడుగా అందరూ స్తుతించిన ఈ వ్యక్తి, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా ప్రతిపక్షాలతో సహా ఖండ-ఖండాంతర ఆర్థిక నిపుణులనుండి ప్రశంసలనందుకున్న ఈ వ్యక్తి చేసిన పెద్ద పొరపాటు, బహుశా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని-నెహ్రూ కుటుంబేతర వ్యక్తిగా-ఐదేళ్లు కలిగించడం, విశ్వాస ఘాతకులకు వందేళ్ల చరిత్రను అంకితం చేయడం! తొలి దక్షిణాది వ్యక్తిగా ప్రధాని పీఠాన్ని అందుకుని, అందులో ఐదేళ్ల పాటు కొనసాగడం చాలా మందికి అందునా ఉత్తరాది వారికి నచ్చలేదు. నెహ్రూ కుటుంబానికి చెందనివాడు, దక్షిణాది వాడు, ముఖ్యమంత్రిగా కూడా పూర్తికాలం పనిచేయలేనివాడు, కనీస మెజారిటీ సభ్యుల మద్దతు కూడా లేకుండా ప్రధాని పదవిని చేపట్టి నెగ్గు కొచ్చినవాడు కావడంతో, పీవీని దెబ్బతీసే ప్రయత్నం రవై ఏళ్ల కిందటే మొదలైందంటే అతిశయోక్తి కాదేమో!

భారతావనిలో కులాలు, మతాలు, భాషలు అటుంచి, ఉత్తరాదివారు-దక్షిణాదివారు అనే తేడాలు ఏ స్థాయికి చేరుకున్నాయో అవగాహన చేసుకోవాలంటే, చరిత్రపుటల్లోకి ఎక్కి-విశ్వవ్యాప్త మన్ననలందుకున్న మహనీయుడు పీవీ లాంటి వ్యక్తిని ఎలా అధఃపాతాళానికి తొక్కే ప్రయత్నాలు చేసారో తెలుసుకోవడమే! అర్జున్ సింగ్‍లు, కులదీప్ నయ్యర్‍లు ఇప్పుడా కోవకు చెందిన వారే.

3 comments:

  1. భజనపరులే తప్పించి మంచివారు గుర్తింపబడనపుడు జరిగేవి ఇవే కదా!

    ReplyDelete
  2. view the new video about PV
    http://www.youtube.com/watch?v=DtAB-hWtznY

    JHRao

    ReplyDelete