Thursday, October 4, 2012

హియర్ ఈజ్ తెలంగాణా!: వనం జ్వాలా నరసింహారావు


హియర్ ఈజ్ తెలంగాణా!

సూర్య దినపత్రిక (07-10-2012)
దారులు వేరైనా గమ్యమొక్కటే 
నమస్తే తెలంగాణ (07-10-2012)
వనం జ్వాలా నరసింహారావు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ ఏళ్లతరబడి సాగుతున్న ఉద్యమం మరో మలుపు తిరిగింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఢిల్లీలో సుమారు నెల రోజులపాటు భైటాయించి తనదైన శైలిలో లాబీయింగ్ చేయడం, మరో వైపు, ఆయన కనుసన్నలలో కాకుండా, ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సాగర హారం చోటుచేసుకోవడం ఆ మలుపులో కీలక ఘట్టాలు. "ఇదిగో తెలంగాణ"-"అదిగో తెలంగాణ" అంటూ చంద్రశేఖర రావు గత కొంతకాలంగా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాను జరిపిన చర్చలపట్ల సంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారాయన. తాము చర్చలకు వ్యతిరేకం కామంటూనే, కేవలం చర్చలద్వారానే మాత్రం కాకుండా ఉద్యమాలు కూడా కొనసాగాలని ఐక్య కార్యాచరణ పట్టుబట్టి మరీ సాగర హారాన్ని నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమిస్తున్న-లాబీయింగ్ జరుపుతున్న నేతల మాటే మో కాని, ప్రజల మాట మాత్రం ఒకటే! రాష్ట్రం ఎవరి ద్వారా-ఎలా ఏర్పాటు అవుతుందనేది వారికి అనవసరం. వారికి కావలసిందల్లా తమ రాష్ట్రం తమకు కావాలి-అంతే! ఈ నేపధ్యంలోనే లాబీయింగైనా, సాగర హారమైనా విశ్లేషించుకోవాలి.


సుమారు నెల రోజుల క్రితం, తనకు కాంగ్రెస్ నేతల దగ్గర నుండి ఆహ్వానం అందిందని చెపుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడానికి, చర్చల నిమిత్తమై చంద్రశేఖర రావు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆయన (ఆయన మాటల్లోనే చెప్పుకోవాలంటే) అందరికీ తెలిసిన విధంగా కాంగ్రెస్ అధిష్టానం దూతలైన వయలార్ రవిని, గులాం నబీ ఆజాద్‌ని, ఆస్కార్ ఫెర్నాండెజ్‌ను కలుసుకుని చర్చలు జరిపారు. కొందరిని ఒకసారి కంటే ఎక్కువ సార్లు కూడా కలుసుకున్నారు. అందరికీ తెలియకుండా మరెందరినో కలుసుకున్నానని స్వయంగా ఆయనే అంటున్నారు. ఒకవైపు హైదరాబాద్ లో సాగర హారం నిర్వహిస్తుంటే, బాధ్యతగల నాయకుడిగా ఆయన ఢిల్లీలో వుండిపోవడం విమర్శలకు దారితీసింది. ఆయనేదో తప్పు చేస్తున్నట్లు పలువురు మాట్లాడారు కూడా. అసలు సాగర హారంలో తెలంగాణ రాష్ట్ర సమితి పాల్గొనే విషయం కూడా మొదట్లో ప్రశ్నార్థకం ఐంది. సాగర హారం మరో ఐదారు రోజుల్లో జరగబోతుందనగా, తెరాస నాయకుల ప్రకటనలు దానికి అనుకూలంగా వెలువడ్డాయి. చివరకు కేసీఆర్ కూడా తన మద్దతు ప్రకటించారు. సాగర హారం విజయవంతంగా ముగిసింది.


ఐతే, సాగర హారానికి ఎదురైన అడ్డంకులు ఇన్నీ-అన్నీ కావు. ప్రజాసంఘాలను, రాజకీయ పార్టీలను, వ్యక్తులను, ఉద్యమకారులను, వివిధ వ్యవస్థలను కలుపుకుపోవడానికి ఐకాస నాయకులు చేసిన కృషి అభినందనీయం. నిర్వహణ మరో వారం రోజులుందనగా, ప్రభుత్వం రక-రకాల పద్ధతులతో తనదైన శైలిలో మోకాలడ్డుకోవడం ఆరంభమైంది. అంతర్జాతీయ స్థాయి జీవ వైవిధ్య సదస్సు ఆరంభానికి, వినాయక నిమజ్జనానికి మధ్యన, సెప్టెంబర్ 30 న తలపెట్టిన సాగర హారాన్ని వాయిదావేసుకొమ్మని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందన్న ప్రచారాన్నీ లేవదీసింది. శాంతి-భద్రతల సమస్య తలెత్త వచ్చన్న అనుమానాన్నీ బయట పెట్టింది. వాయిదా వేసుకోవాలని ఐకాస నాయకులకు నచ్చ చెప్పే బాధ్యతను తెలంగాణ ప్రాంత మంత్రులపై పెట్టాడు ముఖ్యమంత్రి. ససేమిరా అన్న ఐకాస నాయకులు, సాగర హారం నిర్వహణకు ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నాలు చేశారు. పోలీస్ కమీషనర్‌ను, ఇతర పోలీసు ఉన్నతాధికారులను కలిసి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అనుమతి ఇవ్వడానికి నిరాకరించిన పోలీసు పెద్దలు, తమదైన శైలిలో ఒక అనుమానాన్ని కూడా బయట పెట్టారు. నగరంలోని సీమాంధ్రుల ఆస్తులపై దాడి జరిగే ప్రమాదం ఉన్నదని దాని సారాంశం. మరోవైపు తెలంగాణ మంత్రులను తెర పైకి తెచ్చారు ఐకాస నాయకులు. అనుమతి ఇప్పించే బాధ్యతను వారికి అప్ప చెప్పారు వారు. ప్రభుత్వ అనుమతితో మార్చ్ నిర్వహిస్తే, శాంతిభద్రతల సమస్య అంతగా వుండదని ఐకాస నాయకులు భావించి వుండవచ్చు. అదే విషయాన్ని ప్రభుత్వానికీ, తమ పక్షాన వకాల్తా పుచ్చుకున్న తెలంగాణ మంత్రులకు వారు చెప్పి వుండవచ్చు



ఏదేమైతేనేం....మంత్రుల కృషి ఫలించింది. ముఖ్యమంత్రి చొరవతో పోలీసు అధికారులు సాగర హారానికి అనుమతి ఇచ్చారు. అది షరతులతో కూడిన అనుమతి అని వారంటే, కాదు....తామే షరతులకు అంగీకరించలేదని ఐకాస నాయకులన్నారు. కాని.. చివరకు జరిగిందేంటి? ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో కనీ-వినీ ఎరుగని రీతిలో పోలీసుల అరాచకం చోటు చేసుకుంది. నిర్భంద కాండ రాజ్యమేలింది. ఎక్కడికక్కడ బారికేడ్లు, చెక్ పోస్టులు వెలిశాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో భీభత్సంగా యుద్ధకాండ చోటుచేసుకుంది. సాగర హారం జరిగే చోటుకు ర్యాలీగా వెళ్లకూడదన్న ఆంక్షలు విధించిన పోలీసులు, ఎక్కడివారిని అక్కడే నిలిపి వేశారు. ఒక్కరొక్కరే సాగర హారం నిర్వహించే స్థలానికి చేరుకోవాలన్న అసంబద్ధ నిబంధనను విధించి దారుణంగా ప్రవర్తించారు. మార్చ్ జరపాల్సిన స్థలాన్ని "జలియన్‌వాలాబాగ్" చేశారు. అన్ని వైపుల నుంచీ అక్కడకు చేరే మార్గాలను మూసి వేశారు. ఐనప్పటికీ, పోలీసు కంచెలను చేదించుకుంటూ, బారికేడ్లను అధిగమించుకుంటూ, వందల-వేల సంఖ్యలో తెలంగాణ వాదులు-ఉద్యమకారులు సాగర తీరానికి చేరుకున్నారు. లక్షలాది మంది సమక్షంలో మార్చ్ విజయవంతంగా నిర్వహించబడింది. చివరకు, పోలీసుల భాష్పవాయువు ప్రయోగం, లాఠీ ఛార్జ్ సాగర హార స్థలానికి కూడా చేరుకునే దాకా పరిస్థితి వచ్చింది. నేతల ఉపన్యాసాల అనంతరం, రాత్రి పొద్దుపోయింతర్వాత మార్చ్ ముగిసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. మొత్తం మీద ఐకాస నాయకుల పరంగా శాంతియుతం గాను, పోలీసుల పరంగా అశాంతియుతంగాను సాగర హారం సమాప్తమైంది. బహుశా ప్రపంచ చరిత్రలోనే అత్యంత శాంతియుతంగా నిర్వహించిన మార్చ్ లాగా చరిత్రపుటల్లోకి ఎక్కిందంటే అతిశయోక్తి కాదేమో! సాగర హారం పిలుపిచ్చినప్పటినుంచి ఆ రోజున ఏదో జరగబోతోందన్న ఆశ చాలామంది తెలంగాణ వాదులలో మొలకెత్తింది. తెలంగాణకు సంబంధించి ఏదో ఒక ప్రకటన మార్చ్ మొదలెట్టక ముందే వెలువడవచ్చన్న ఆశా కలిగింది. ఇవేవీ జరగలేదు. చివరకు లక్షలాది మంది ఉద్యమకారులు-తెలంగాణ వాదులు పీవీ ఘాట్ వద్ద గుమికూడినప్పటికి కూడా అలాంటిదేమీ జరగలేదు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే మార్చ్ కు అనుమతినిచ్చినప్పటికీ, ఐకాస నాయకులు, ఆ స్థలాన్ని వీడలేదు. ఏదో ఒక ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడేంతవరకు అక్కడ నుంచి కదలడం లేదని ఐకాస అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. దీనికి కినుక వహించిన తెరాస నాయకులు సభాస్థలి నుంచి నిష్క్రమించారు. బహుశా వారి వెంటనే తెరాస పార్టీ అభిమానులు కూడా ఒక్కరొక్కరే వెళ్లిపోయి వుండాలి. మొత్తం మీద, వ్యూహం మార్చుకున్న ఐకాస నాయకులు అర్ధరాత్రి సమయానికి మార్చ్ ను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడికది సమాప్తమయింది. కధ సుఖాంతమయ్యేటప్పటికి నిర్వాహకులతో సహా, పోలీసు వర్గాల వారు కూడా వూపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి ప్రభుత్వ అనుమతే లభించక పోయినట్లయితే, పరిస్థితి మరో విధంగా వుండే అవకాశాలుండేవి. కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పినట్లు మార్చ్ ప్రశాంతంగానే ముగిసిందనాలి. పోలీసులు తెలంగాణా వాదుల మీద కనబర్చిన అతి ఉత్సాహం మాత్రం పలు విమర్శలకు దారితీసిందనాలి.


హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా వుంటే అక్కడ ఢిల్లీలో వున్న చంద్రశేఖర రావు కాలికి బలపం కట్టుకుని మరీ తన లాబీయింగ్ కొనసాగించాడు. భారత దేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో-అందునా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో లాబీయింగ్ చేయడం, ప్రభుత్వంపై ఒత్తిడులు తేవడం సర్వ సహజం. అదే పని చంద్రశేఖర రావు చేస్తే తప్పేంటి? వాస్తవానికి చంద్రశేఖర రావు, తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించినప్పటినుంచీ లాబీయింగ్ చేస్తూనే వున్నారు. ఒకవైపు పన్నెండేళ్లు ఉద్యమాన్ని మొక్కవోని ధైర్యంతో నడుపుతూనే, మరోవైపు తనదైన శైలిలో ఢిల్లీ స్థాయిలో రక-రకాల పద్ధతుల్లో లాబీయింగ్ చేసుకుంటూ వస్తున్నారు. జాతీయ స్థాయిలోని అత్యధిక రాజకీయ పార్టీల మద్దతును తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కూడగట్టగలిగారు. ఆ మాటకొస్తే భారతీయ జనతా పార్టీ కాని, భారత కమ్యూనిస్ట్ పార్టీ కాని ఈ రోజున పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో దూకిందంటే అది చంద్రశేఖర రావు లాబీయింగే అనాలి. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా మార్చాలన్న ఉద్దేశంతోనే 2004 లో కాంగ్రెస్ పార్టీతోను, 2009 లో తెలుగు దేశం పార్టీతోను ఎన్నికల ఒప్పందం కుదుర్చుకున్నాడు చంద్రశేఖర రావు. ఈ రోజున కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు కాని, తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలు కాని తెలంగాణకు అనుకూలంగా ఉద్యమిస్తున్నారంటే అది చంద్రశేఖర రావు లాబీయింగే అనాలి. ఆ లాబీయింగ్‍లో భాగంగానే ఆయన వయలార్ రవిని, ఆజాద్‌ను, ఆస్కార్ ఫెర్నాండెజ్‌ను కలిసుండాలి. కాకపోతే రెండు నాల్కల ధోరణి అవలంబించే వయలార్ రవి లాంటి కాంగ్రెస్ నాయకులు "వేరీజ్ తెలంగాణ" అంటూ ఎకసెక్కం చేయడం, ఆ తరువాత సారీ చెప్పడం మామూలే.


ఈ నేపధ్యంలో ఒక్క సారి గతం నెమరేసుకుంటే మంచిదేమో! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన నాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదానికి శ్రీకారం చుట్టబడిందనాలి. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలుగు వారందరికీ న్యాయం జరుగుతుందని (ఆనాడు) కొందరు భావిస్తే, తమను-తమ ప్రాంత ప్రజలను తెలంగాణే తరులు దోపిడీకి గురిచేస్తారని-తమ సామాజిక, సాంస్కృతిక, భాషా విలువలను ఇతర ప్రాంతాల "తెలుగువారు" ఎద్దేవా చేస్తారని, తెలంగాణ కావాలని కోరుకున్న పలువురు (ఆనాడే) అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగి ఐదు దశాబ్దాలు గడిచినా, కారణాలు ఏమైనా-సహేతుకమైన వైనా, కాకపోయినా-తెలంగాణ ప్రాంత వాసులందరికి కాకపోయినా, చాలామందికి, విడిపోయి, "తెలంగాణ" రాష్ట్ర ఏర్పాటు జరిగి, ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలోనే వుంటూ, అన్నదమ్ములలాగా మెలుగుతే మంచిదన్న భావన మటుకు బలంగా నాటుకు పోయింది. అలా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటున్న వారిలో ఐదు దశాబ్దాల క్రితమే ఆ నినాదం లేవనెత్తిన ఆ తరం వారితో సహా, తరాలు మారినా రెండో తరం-మూడో తరం వారూ, ఒక వంశపారంపర్య నినాదంలాగా-లక్ష్యం, ధ్యేయం లాగా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాలని కోరుకుంటున్నారంటే, పాలకవర్గాలు ఆ నినాదానికున్న ఆదరణను సరిగ్గా అంచనా వేయడం లేదనే అనాలి


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కేవలం "భావించడం" మాత్రమే కాకుండా, దాన్ని సాధించడం కొరకు, క్రమేపీ, రకరకాల మార్గాలను ఎంచుకోవడం ఆరంభమయింది 1956 నుంచే. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు మూడూ, ఆంధ్ర ప్రదేశ్ లో కలిసున్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన రాయితీలను తెలంగాణ ప్రాంతం వారికి మాత్రమే చట్ట రీత్యా కలిగించడం ద్వారా, తెలంగాణ వే()ర్పాటు నినాదాన్ని, పాలక పక్షం విజయవంతంగా పక్కదారి పట్టించగలిగింది మొదట్లో. పెద్దమనుషుల ఒప్పందమనీ, ఫజలాలీ సంఘం నివేదికనీ, ముల్కీ నిబంధనలనీ రకరకాల మార్గాలద్వారా తెలంగాణ కోరుకునే వారిలో కొన్ని ఆశలు రేకెత్తించి, కొన్నేళ్లు ఉద్యమాన్ని బలహీనపరచగలిగింది (కాంగ్రెస్) ప్రభుత్వం. తెలంగాణ ప్రాంతానికి వలసవచ్చిన కొందరు తెలంగాణే తరులు , ఎప్పుడైతే తమ "పరోక్ష దోపిడీ" విధానాన్ని "ప్రత్యక్ష దోపిడీ" విధానంగా మార్చడం మొదలయిందో, అప్పుడే దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజలలో "దోపిడీకి ఎదురుతిరగాలన్న కాంక్ష బలీయం కావడం మొదలయింది. క్రమేపీ ఉద్యమరూపంగా మార్పుచెంద సాగిందా కాంక్ష. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో "తెలంగాణ ప్రజా సమితి" పేరుతో బ్రహ్మాండమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపాయి. నాడు ఉవ్వెత్తున లేచిన ఉద్యమం మోసంతో అణచబడింది. నాయకులు మోసం చేస్తున్నా, తాము మోసగించ బడుతున్నామని తెలంగాణ వాసులు గ్రహించినా, అధిక సంఖ్యాక ప్రజల్లో తెలంగాణ రాష్ట్రం కావాలన్న కోరిక, సాధించి తీరాలన్న పట్టుదల మాత్రం పెరిగిందే కాని తగ్గలేదు. కాకపోతే సరైన సమయం కొరకు ఎదురుచూచారు. నాయకులెవరైనా ఉద్యమం మళ్లీ ఆరంభించి-నడపక పోతారానని ఎదురు చూడసాగారు. రాజకీయ స్వార్థం కోసమైనా ఎవరైనా తమకండగా వుండకపోతారానని భావించసాగారు. వారి కోరిక నెరవేరింది


కె. చంద్రశేఖర రావు, "తెలంగాణ రాష్ట్ర సమితి" ని స్థాపించడంతో, తెలంగాణ కావాలని కోరుకుంటున్న వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. కేసీఆర్ వుద్యమాన్ని వ్యూహాత్మకంగా, అహింసా మార్గంలో, మేధావులను కలుపుకుని పోతూ, యావత్ భారతదేశంలోని భిన్న దృక్పధాల రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలను నెలకొల్పుకుంటూ, ఒకరకంగా ఏకాభిప్రాయాన్ని సమకూర్చు కొనడంలో, మునుపెన్నడూ-ఎవరూ సాధించని విజయాన్ని సాధించారని చెప్పాలి. 2004 ఎన్నికల్లో పకడ్బందీ వ్యూహంతో, వై ఎస్ ఆర్ నాయకత్వంలోని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుని, ఇటు శాసనసభలోనూ-అటు పార్లమెంటు లోనూ బలమైన శక్తిగా కేసీఆర్ ఎదిగి, టీ ఆర్ ఎస్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు తేగలిగాడు. కేంద్రంలో సోనియా దృష్టిని ఆకర్షించి, ఆమెకు సన్నిహితుడై, మంత్రివర్గంలో కీలకమైన పదవిని పొంది, ఢిల్లీ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసుకుంటూ పోగలిగాడు. పార్టీలో తనకు ఎదురు తిరిగిన ప్రత్యర్థులను నామరూపాలు లేకుండా చేయగల సమర్థుడుగా ఎన్నో మార్లు నిరూపించుకున్నాడు. అవసరమైనప్పుడు సోనియాకు ఎదురు తిరిగి తనంటే ఏంటో నిరూపించి చూపాడు. తన సత్తా చూపడానికి ఎన్ని మార్లైనా పదవికి అలవోకగా రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించగలిగాడు. తనకు తానే సాటి అని చెప్పకనే చెప్పాడు


బహుశా ఈ నేపధ్యంలో, ఒకవైపు చంద్రశేఖర రావు లాబీయింగ్, మరోవైపు ఐకాస లాంటి ప్రజా సంఘాల ప్రత్యక్ష ఉద్యమాలు తెలంగాణ రాష్ట్ర సాధనకు దోహదపడతాయని భావించవచ్చు. "వేరీజ్ తెలంగాణ" అనే వారికి ఇదే సమాధానం! "హియర్ ఈజ్ తెలంగాణా"!

1 comment:

  1. .... తెలంగాణ ప్రాంతానికి వలసవచ్చిన కొందరు తెలంగాణే తరులు , ఎప్పుడైతే తమ "పరోక్ష దోపిడీ" విధానాన్ని "ప్రత్యక్ష దోపిడీ" విధానంగా మార్చడం మొదలయిందో,....

    ఈ మాటలకి అర్థం యేమిటండీ?
    ఉదరపోషణార్థం యెవరైనా సరే, పోల నుద్యోగికి దూరభూమి లేదు అని వలస పోతుంటారు. అలా వలసవచ్చిన వారే ప్రత్యక్ష దోపిడీదారులని తమ ఉద్దేశ్యమా? లేక మీరు చాలా జగ్రత్తగా వాడిన 'కొందరు' అనే మాటను అడ్డు పెట్టుకుని, అబ్బే కొందరే, చాలా మంది పాపం మంచోళ్ళేనేమో అంటారా?

    పొరుగూరికి ఉద్యోగార్థం పోవటం దోపిడీ అయితే, ఎవరి ఊళ్ళో వాళ్ళే పడుండాలి కాని వేరే ఊరికి పోవటం తప్పు అని సిథ్థాంతీకరిస్తున్నారని అనుకోవలసి వస్తుంది. అది చాలా అన్యాయమైన సూత్రీకరణ అని నా ఉద్దేశం.

    ReplyDelete