Tuesday, October 23, 2012

ఐక్య రాజ్య సమితి ఆవిర్భావం-పురోగతి: వనం జ్వాలా నరసింహారావు


అక్టోబర్ 24 న ఐక్య రాజ్య సమితి 67 వ ఆవిర్భావ దినం సందర్భంగా
వనం జ్వాలా నరసింహారావు

          అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక-సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమిష్టి కృషి లాంటి కార్యక్రమాలను చేపట్టి అమలు చేసేందుకు, ప్రపంచవ్యాప్తంగా వున్న పలు దేశాలు, సమష్టిగా ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్యసమితి. ప్రధమ ప్రపంచ సంగ్రామం ముగిసిన తర్వాత, ఏర్పాటు చేసుకున్న నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో విఫలం కావడంతో, దానికి ప్రత్యామ్నాయంగా, 1945లో ఐక్య రాజ్య సమితి స్థాపన జరిగింది. ప్రస్తుతం ఐక్య రాజ్య సమితిలో 193 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ఐక్య రాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. అవి: సర్వ ప్రతినిధి సభ, భద్రతా మండలి, సచివాలయం, ధర్మ కర్తృత్వ మండలి, ఆర్థిక-సాంఘిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం. సర్వప్రతినిధి సభలో ఐక్య రాజ్య సమితిలో చేరిన అన్ని దేశాలకు సభ్యత్వం ఉండగా, భద్రతామండలిలో 15 దేశాలకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. అందులో 10 దేశాలు రెండేళ్లకోసారి ఎన్నిక ద్వారా సభ్యత్వం పొందగా, మరో 5 దేశాలు శాశ్వత సభ్య దేశాలు. అవి: అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. దీని ప్రస్తుత ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్. ఐక్య రాజ్య సమితి స్థాపించబడిన అక్టోబరు 24వ తేదీని ప్రతి సంవత్సరం ఐక్య రాజ్య సమితి దినోత్సవం గా పాటిస్తారు.


          రెండవ ప్రపంచ యుద్ధం ఇంకా జరుగుతున్న సమయంలోనే, 1941 ఆగష్టులో అమెరికా అధ్యక్షుడు థియోడోర్ రూజ్‌వెల్ట్, బ్రిటిష్ ప్రధాని విన్‌ స్టన్ చర్చిల్ అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశమై అట్లాంటిక్ ఛార్టర్ అనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రాదేశిక సమగ్రత కాపాడడం, యుద్ధ భయాన్ని తొలగించడం, శాంతిని నెలకొల్పడం, నిరాయుధీకరణ వంటి ఎనిమిది అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందమే తరువాత ఐక్య రాజ్య సమితి సిద్ధాంతాలకు మౌలిక సూత్రాలుగా గుర్తింపు పొందింది. తరువాత 1944లో వాషింగ్టన్ లోని డంబార్టన్ ఓక్స్ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి ప్రకటన పత్రం ముసాయిదాను రూపొందించారు. దరిమిలా, 1945 ఫిబ్రవరిలో యాల్టా సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా నేతలు ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించాలని తీర్మానం చేశారు. ఆ తర్వాత చైనా, అలనాటి సోవియట్ యూనియన్-నేటి రష్యా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అమెరికా దేశాలు ఈ సమావేశం ఆధారంగా తయారుచేసిన ఛార్టర్‌కు ఆమోదముద్ర వేశాయి. నేటి వరకూ ఆ ఐదు దేశాలు భద్రతామండలిలో శాశ్వత  సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో 1945 ఏప్రిల్ 25నుండి జూన్ 26 వరకు జరిగిన అంతర్జాతీయ సమావేశంలో 50 దేశాల ప్రతినిధులు పాల్గొని ఐక్య రాజ్య సమితి ఛార్టర్‌పై సంతకాలు చేశారు. 1945 అక్టోబర్ 24న న్యూయార్క్ నగరంలో ఐక్య రాజ్య సమితి లాంఛనంగా ప్రారంభమైంది.


           యుద్ధాలు జరగకుండా చూడటం, అంతర్జాతీయ తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, సభ్య దేశాల మద్య స్నేహ సంబంధాలను పెంపొందించడం, అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించే ట్లు చూడడం, సాంఘిక అభివృద్ధి సాధించి మానవ జీవితాలను సుఖమయం చేయడం, ఐక్య రాజ్య సమితి ప్రధాన ఆశయాలు. 


ఐక్య రాజ్య సమితికి వున్న ఆరు ప్రధానాంగాలలో సర్వప్రతినిధి సభకు అత్యంత ప్రాముఖ్యముంది. ఈ సభలో సభ్యదేశాలన్నింటికీ ప్రాతినిధ్యం వుంటుంది. ప్రతి దేశానికి సమానంగా ఒక్క ఓటు ఉంటుంది. సమావేశాలకు ప్రతి సభ్యదేశం గరిష్టంగా ఐదుగురు సభ్యులను ప్రతినిధులుగా పంపవచ్చు. ఈ సభ సంవత్సరానికి ఒక పర్యాయం, సాధారణంగా సెప్టెంబరు మాసంలో, సమావేశమౌతుంది. సభ్యదేశాలు ఎన్నుకున్న వ్యక్తి సమావేశానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. కొత్తగా ఐక్యరాజ్యసమితిలో చేరదల్చుకున్న దేశాలకు ప్రవేశం కల్పించడానికి, భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశాలను ఎన్నుకోవడానికి ఈ సభకే అధికారముంది. సమితి ఆశయాలకు, లక్ష్యాలకు వ్యతిరేకంగా వ్యవహరించే సభ్యదేశాలను తొలగించే అధికారం కూడా ఈ సభకు ఉంది. అన్ని రంగాలలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం దీని కర్తవ్యం. ఈ సభ మూడింట రెండు వంతుల మెజారిటీతో నిర్ణయాలు చేస్తుంది. సర్వప్రతినిధి సభతో సమానంగా, ఆ మాటకొస్తే ఒకవిధంగా అధికంగా సమితిలో ప్రాధాన్యత వున్న మరో అంగం భద్రతా మండలి. సమితి ప్రారంభమయ్యేనాటికి ఇందులో సభ్యదేశాల సంఖ్య 11. ప్రస్తుతం 15 సభ్యదేశాలున్నాయి. అందులో 5 శాశ్వత సభ్యదేశాలు కాగా 10 రెండేళ్ల కాలవ్యవధి కొరకు ఎన్ని కయ్యే తాత్కాలిక సభ్యదేశాలు. అమెరికా, రష్యా, ఇంగ్లాండు, చైనా, ఫ్రాన్సు లు ఇందులో శాశ్వత సభ్యదేశాలు. ఈ శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం వుంటుంది. సమితి ప్రారంభమైనప్పటి నుంచి ఇందులో ప్రధానమైన రెండు మార్పులు చేశారు. ప్రారంభంలో ఆరు తాత్కాలిక సభ్యదేశాలుండగా దాని సంఖ్యను దరిమిలా పదికి పెంచారు. వీరిలో ఆసియా-ఆఫ్రికా దేశాలనుండి ఐదుగురు, లాటిన్ అమెరికా దేశాలనుండి ఇద్దరు, పశ్చిమ యూరప్ నుండి ఇద్దరు, తూర్పు యూరప్‌నుండి ఒక్కరు ఎన్నికవుతుంటారు. నేషనలిస్ట్ చైనా స్థానంలో కమ్యూనిస్ట్ చైనాకు శాశ్వత సభ్యత్వం కల్పించారు. తాత్కాలిక సభ్యదేశాలను సాధారణ సభ ఎన్నిక చేస్తుంది. ఏ దేశం కూడా వరుసగా రెండు పర్యాయాలు ఎన్నిక కాకూడదు. దీనికి అధ్యక్షుడు ప్రతి నెలా మారుతుంటాడు. భద్రతా మండలి ఆదేశాలను పాటించని సభ్య దేశాలపై అది ఆంక్షలు విధిస్తుంది. సైనిక చర్య కూడా చేపట్టే అధికారముంది.


          మూడో అంగం సచివాలయం. ఐక్యరాజ్యసమితి సచివాలయ కార్యాలయం సమితి వ్యవహారాలు నిర్వహించే కార్యనిర్వాహక విభాగం. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. ఇందులో పది వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తారు. సచివాలయ ప్రధానాధికారిని సెక్రటరీ జనరల్ అంటారు. సమితికీ-దాని వివిధ విభాగాలకు, అనుబంధ సంస్థలకు కావాల్సిన సమాచారం, అధ్యయనం, సదుపాయాలు వంటి విషయాలు సచివాలయం అధ్వర్యంలోనే నిర్వహించబడతాయి. ప్రతిభ, నిజాయితీ, పనితనం, వివిధ ప్రాంతాలకు సముచితమైన ప్రాతినిధ్యం అనే అంశాల ప్రాతిపదికగా సమితి ఉద్యోగుల ఎంపిక జరుగుతుంది. నాలుగో అంగం ధర్మ కర్తృత్వ మండలి. కొన్ని పాశ్చాత్య దేశాల వలస పాలన క్రింద కొనసాగిన భూభాగాల ప్రయోజనాలను కాపాడడం ఈ మండలి లక్ష్యం. ఇక్కడి ప్రజలను స్వీయ ప్రతిపత్తికి లేదా స్వయం పాలనకు లేదా స్వాతంత్ర్యానికి సిద్ధం చేయడం ఈ మండలి బాధ్యత. ఇది సంవత్సరానికి రెండు సార్లు సమావేశమవుతుంది. ఇందులో మూడు రకాల సభ్యత్వాలు ఉన్నాయి. అవి: ధర్మ కర్తలుగా కొన్ని దేశాలను పాలిస్తున్న దేశాలు, భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలు, మూడేళ్ల కాల పరిమితికి ఎన్నికైన దేశాలు. ఐదోది ఆర్థిక, సాంఘిక మండలి. ఇది సాధారణ సభ అధ్వర్యంలో పని చేస్తుంది. ఇందులో 54 మంది సభ్యులుంటారు. ఈ మండలి ఏటా రెండుసార్లు సమావేశమవుతుంది. ప్రజల జీవన స్థాయిని మెరుగు పరచడం, విద్య, సాంస్కృతిక, ఆరోగ్య రంగాలలో అంతర్జాతీయ సహకారానికి కృషి చేయడం, మానవ హక్కులను సమర్థించడం వంటివి ఈ మండలి ఆశయాలు. ఇక చివరిది-ఆరోది అంతర్జాతీయ న్యాయస్థానం. దీనిని సాధారణంగా "ప్రపంచ న్యాయస్థానం" అని అంటారు. ఐక్యరాజ్యసమితి యొక్క ప్రాధమిక తీర్పులను ప్రకటించే అంగం ఇది. దీని కేంద్రం నెదర్లాండ్ లోని హేగ్ నగరంలో గల, శాంతి సౌధం. దీని ప్రధాన కార్యక్రమం, సభ్యదేశాల ద్వారా సమర్పించబడిన "న్యాయపర వాదనలు" ఆలకించి తీర్పు చెప్పడం. అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రెండూ వేరు వేరు సంస్థలు. వీటి రెండింటికి ప్రపంచ పరిధి వుంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు 1945లో ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా స్థాపించబడింది. 1946 నుండి పనిచేయడం ప్రారంభించింది. 


          ప్రత్యేక ఒప్పందాల ద్వారా ఏర్పడిన ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థలు అంతర్జాతీయ ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా, వైద్య రంగాలలో పని చేస్తుంటాయి. ఐక్య రాజ్య సమితి అంగాలలో ఒకటైన "ఆర్ధిక, సామాజిక మండలి" ఈ అనుబంధ సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఇందులో యునెస్కో-ఐక్య రాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ ప్రధానమైంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ రాజధాని పారిస్. ఈ సంస్థను 1946 నవంబరు 4 స స్థాపించారు. విద్య, విజ్ఞానం, సంస్కృతి రంగాలలో అంతర్జాతీయ సహకారానికి, ప్రగతికి, శాంతియుత సంబంధాలకు ఈ సంస్థ కృషి చేస్తుంది. దీని ప్రధాన అంగాలు మూడు. మొదటిది: సాధారణ సభ (జనరల్ కాన్ఫరెన్సు), రెండోది: కార్యనిర్వాహక బోర్డు (ఎగ్జిక్యూటివ్ బోర్డు), మూడోది: మంత్రాలయం (సెక్రెటేరియట్). కార్యనిర్వాహక బోర్డు, సాధారణ సభ ద్వారా నాలుగేండ్ల కాలపరిమితి కొరకు ఎన్నుకోబడుతుంది. దీని డైరెక్టర్ జనరల్ కూడా నాలుగేండ్ల కాల పరిమితికి ఎన్నుకోబడతాడు. దీనిలో పనిచేసే సిబ్బందిలో మూడింట రెండు వంతుల మంది పారిస్ లోనే తమ కార్యక్రమాలను నిర్వహిస్తుండగా, మిగతా వారు ప్రపంచంలోని పలు దేశాలలో వున్న యునెస్కో కార్యాలయాలలో తమ విధులను నిర్వహిస్తారు. ప్రపంచ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కావలసిన శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధిని యునెస్కో ప్రధానంగా ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం న్యూఢిల్లీ, కైరో, జకార్తా, మాంటివిడియో, వెనిస్ లలో కార్యాలయాలున్నాయి. ప్రస్తుతం యునెస్కో లో 192 దేశాలకు సభ్యత్వం ఉంది.


          ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి లేదా ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి-యునిసెఫ్, 1946 డిసెంబరు 11న ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూయార్కు నగరం. ప్రస్తుతం దీనిని ఐక్య రాజ్య సమితి బాలల నిధి అని మాత్రమే వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో పిల్లలు, వారి తల్లుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. ఐక్య రాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం-యుఎన్డిపి అనే మరో సంస్థ 1965 నవంబరు 22న స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం న్యూయార్కు నగరం. అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటి సంపదను వృద్ధి చేసుకొనేందుకు అవసరమైన శిక్షణ, వైజ్ఞానిక సహాయ కార్యక్రమాలకు ఈ సంస్థ నిధులు సమకూరుస్తుంది. 1990 నుండి యు.ఎన్.డి.పి. యేటా మానవాభివృద్ధి నివేదికను విడుదల చేస్తుంది. ఐక్య రాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం-యుఎన్ఇపి, స్వీడన్ రాజధాని స్టాక్‌ హోమ్ లో 1972 జూన్ 5 న నిర్వహించిన పర్యావరణ సదస్సు ఫలితంగా రూప దిద్దుకొంది. ఆహార, వ్యవసాయ సంస్థ-ఎఫ్‍ఏ‍ఓ ప్రధాన కార్యాలయం రోమ్ నగరంలో ఉంది. 1945 అక్టోబరు 16న కెనడా దేశపు క్విబెక్ నగరంలో జరిగిన సమావేశంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ కారణంగానే ఏటా అక్టోబరు 16ను ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. పౌష్టికాహారం అందించడం, జీవన ప్రమాణాలు మెరుగు పరచడం, గ్రామీణ ప్రజల స్థితిగతులను అభివృద్ధి చేయడం, ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడిని, పంపిణీని మెరుగు పరచడం ఈ సంస్థ లక్ష్యాలు. అంతర్జాతీయ కార్మిక సంస్థ-ఐఎల్ఓ కేంద్ర కార్యాలయం స్విట్జర్లాండు దేశం జెనీవాలో ఉంది. 1919 ఏప్రిల్ 11న నానా జాతి సమితి అనుబంధ సంస్థగా ఈ సంస్థ ఏర్పాటయ్యింది. అనంతరం ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థగా రూపు దిద్దుకొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికుల జీవన ప్రమాణాలు స్థాయిని పెంపొందించడానికి ఈ సంస్థ కృషి చేస్తోంది. 1969లో ఈ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.


          జెనీవాలో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యు‍హెచ్‍ఓ, 1948 ఏప్రిల్ 7న ప్రారంభమైంది. స్విట్జర్లాండు దేశం జెనీవాలో దీని కేంద్ర కార్యాలయం ఉంది. అలెగ్జాండ్రియా, బ్రెజవిల్లే, కోపెన్ హెగెన్, మనీలా, న్యూఢిల్లీ, వాషింగ్టన్ నగరాలలో దీని ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందించడం, అంటు వ్యాధుల నివారణ ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. అందుకోసం వైద్య పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. మలేరియా, క్షయ, మశూచి వంటి వ్యాధులను నిర్మూలించడానికి ఈ సంస్థ కృషి చేసింది. ఎయిడ్స్ వ్యాధి నిరోధానికి ప్రస్తుతం చాలా కృషి చేస్తున్నది. ఐక్య రాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ-యునిడో, సమితి సాధారణ సభకు చెందిన అంగంగా 1966 నవంబరు 17న ఏర్పాటయ్యింది. 1985లో ప్రత్యేక సంస్థగా గుర్తించారు. ప్రధాన కార్యాలయం ఆస్ట్రియా దేశపు వియన్నాలో ఉంది. అభివృద్ధి చెందుతున్న, బాగా వెనుకబడిన దేశాల పారిశ్రామికీకరణకు, సంబంధిత పాలసీలకు ఈ సంస్థ సహకరిస్తుంది.


          ఇతర సంస్థలలో పేర్కొనాల్సింది: ఐక్య రాజ్య సమితి శరణార్థుల హైకమిషనర్ (శరణార్థుల పరిరక్షణ ఈ సంస్థ ప్రధాన ధ్యేయం. ఈ సంస్థకు 1954, 1981 సంవత్సరాలలో నోబెల్ శాంతి బహుమతి లభించింది), విశ్వ తపాలా సంఘం - యూనివర్సల్ పోస్టల్ యూనియన్ప్రపంచ వాతావరణ సంస్థ - వరల్డ్ మీటియొరలాజికల్ ఆర్గనైజేషన్అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (2005లో ఈ సంస్థకు, దాని అధ్యక్షుడు మహమ్మద్ అల్-బరాదీకి సంయక్తంగా నోబెల్ శాంతి బహుమతి లభించింది), ఐక్య రాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సదస్సు, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్అంతర్జాతీయ పునర్వ్యవస్థీకరణ, అభివృద్ధి బ్యాంకు లేదా ప్రపంచ బ్యాంకుఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, మల్టిలేటరల్ ఇన్వెస్ట్ మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, అంతర్జాతీయ ద్రవ్య నిధి - .ఎమ్.ఎఫ్


          అఫ్గానిస్తాన్‍ నుంచి 1989 లో సోవియట్ సేనల ఉపసంహరణ విషయంలోను, 1992 లో కాంబోడియాలో యుద్ధ విరమణ పర్యవేక్షణ సందర్భంలోను, 1989 లో నికార్‍గుహలో ఎన్నికల పర్యవేక్షణ వ్యవహారంలోను, కాంగో విషయంలోను, సైప్రస్ వ్యవహారంలోను, ఇరాక్-ఇరాన్ యుద్ధంలో మిలిటరీ అబ్జర్వర్‌గా వ్యవహరించే విషయంలోను, ఇలాంటి మరి కొన్ని సందర్భాలలోను ఐక్య రాజ్య సమితి పాత్ర చెప్పుకో దగ్గది.  అదే విధంగా డిసెంబర్ 10, 1948 న సమితి ఆమోదించిన విశ్వవ్యాప్త మానవ హక్కుల పరిరక్షణ తీర్మానం, ఐక్య రాజ్య సమితి తీసుకున్న నిర్ణయాలలో అత్యంత ప్రాముఖ్యమైంది గా చెప్పుకోవాలి. ప్రతి ఏడాది ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల దినంగా జరుపుకుంటున్నాం. జనవరి 31, 1976 న ఆర్థిక-సామాజిక-సాంస్కృతిక హక్కుల అంతర్జాతీయ ఒడంబడిక అమల్లోకి వచ్చింది. అదే విధంగా అంతర్జాతీయ సామాజిక-రాజకీయ హక్కుల ఒడంబడిక మార్చ్ 23, 1976 న అమల్లోకి వచ్చింది. 


అరవైయ్యేడేళ్ల ఐక్య రాజ్య సమితి చరిత్రలో మేలెంత జరిగిందో చెప్పడం కష్టమేమో కాని కీడు జరగలేదనే అనాలి.

1 comment:

  1. This is so useful for me and others also �� �� �� it is about aikya rajya samiti(which is stopping third world war)

    ReplyDelete