Wednesday, December 19, 2012

సోమవారం! తస్మాత్ జాగ్రత్త!?: వనం జ్వాలా నరసింహారావు


సోమవారం! తస్మాత్ జాగ్రత్త!?

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచిక (24-03-1991)

          నాగరిక ప్రపంచంలో గుండె జబ్బుతో హఠాత్తుగా మరణించడం సర్వ సాధారణ విషయమై పోయింది. 40-50 సంవత్సరాల మధ్య వయస్కుల్లో ఇది బాగా కనిపిస్తున్నది. ఎండా కాలంలో ఆకాశంలో మెరుపులాగా చెప్పా పెట్టకుండా గుండె జబ్బు చావులు విపరీతంగా సంభవిస్తున్నాయి.

          వాస్తవానికి, మనిషి శరీరంలో ఈ వ్యాధి లక్షణాలు మనకు తెలియకుండానే, మన అశ్రద్ధ మూలంగా వృద్ధి చెందుతుంటాయి. పనిభారం, వాతావరణ తీవ్రతలు, మద్యం సేవించడం, ఈ వ్యాధిని బయట పడేసి మరణానికి దారితీస్తుంది.

          పరిశోధకులు ఆరు ప్రధానమైన కారణాలను, గుండె జబ్బు ద్వారా మరణానికి హఠాత్తుగా దారి తీసేవిగా పేర్కొన్నారు.

          అనవసరమైన అకారణ భావోద్రేకం వల్ల మానసిక ఒత్తిడులు పెరిగి, గుండె ఆగిపోయి మనిషి మరణించవచ్చు. ఉదాహరణకు, ఒకతని వ్యవహారంలో, అతను ఆడే బేస్ బాల్ గేమే, అతడి పాలిట మరణమైందని తేలింది. ఈ అకారణ ఉద్రేకాలు, మనిషి గుండెల్లో ఒక విద్యుత్ ఘాతంలా తగిలి, హృదయ కోశం నుంచి రక్తం సరఫరా అయ్యే ప్రక్రియ ఆగి పోయే ప్రమాదముంది. దీన్నే "ఎరిధ్ మియాస్" అంటారు. దీనికి గురై బ్రతికిన బోస్టన్‌కు చెందిన  117 మందిని ప్రశ్నించినప్పుడు దీనికి గురికావడానికి 24 గంటల ముందు, వీరిలో చాలామంది మానసిక అల జడులకు లోనయ్యారని తేలింది. వీరిలో ఒకరు, బేస్ బాల్ ఆటను టెలివిజన్‌లో చూస్తూ, తన దేశం ఓటమిని సహించలేక, గుండె జబ్బుకు గురి కావాల్సి వచ్చిందట. అందుకే 10 నిమిషాలకు మించి ఏ విషయంలోనూ అతి ఉత్సాహం చూపించి, అనవసర ఉద్రేకాలకు గురి కావద్దంటున్నారు పరిశోధకులు.  

          మరో కారణం: మంచు తుఫానులు. శరీరానికి ఎక్కువ చలి వేస్తున్నప్పుడు, రక్తనాళాలు ఇరుకై, రక్తప్రసరణ ఆగిపోవచ్చు.


          "ఏంజినో సెక్టోరిస్" అనే హృద్రోగ సంబంధమైన ఛాతీ నెప్పులున్న వారు ఈ రకమైన ప్రమాదానికి లోనయ్యే వీలు ఎక్కువగా వుంటుందని డాక్టర్లు చెపుతున్నారు.

          రాత్రి వేళల్లో మితిమీరిన ఆహారం తినడం కూడా గుండె జబ్బులకు దారితీయవచ్చు. బ్రిటన్‌లో హఠాత్తుగా గుండె ఆగి మరణించిన వంద కేసులను పరిశీలించినప్పుడు 25 శాతం వరకు, భోజనం చేసిన గంటలోపులో మరణించారని తేలింది. భోజనంలోని కొవ్వు పదార్థాలు, కార్డియో వాస్క్యులర్ సిస్టంపైన దుష్పరిణామాలు తేవచ్చు. మొత్తం మీద రిస్క్ ఎంత వుందో అంచనా వేయలేక పోయినా, రాత్రివేళ భోజనంలో తీసుకునే కొవ్వు పదార్థాలు, నిద్రావస్థలో వున్నప్పుడు, జీర్ణప్రక్రియ జరుగుతుండే సందర్భంలో, ఇరుకుగా వున్న రక్తనాళాలు మరింత ఇరు కయ్యే ప్రమాదముంది. అదే బ్రిటీష్ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం, ఈ వంద మందిలో, మరో నాలుగు వంతుల మంది, చనిపోవడానికి కొంత సేపు క్రితం వరకూ మద్యం సేవిస్తున్నట్లు వెల్లడైంది.

          మరో ఆసక్తికరమైన కారణం, నమ్మ శక్యం కానిది, కెనడా దేశపు శాస్త్రజ్ఞుల పరిశోధనలో బయటపడింది. వారు తెలుసుకున్న దానిని బట్టి, హృద్రోగ మరణాలలో 75 శాతం సోమవారం ఉదయం సంభవించినవే! వారారంభంలో మొదటి పని దినం సోమవారం కావడమే దీనికి కారణం అంటున్నారు వీరు. రెండవ ప్రపంచ యుద్ధంలో, పైలట్ శిక్షణ కొరకు అర్హులైన 3983 మందిని వీరు అధ్యయనం చేసినప్పుడు, వీరిలో గుండే జబ్బు వచ్చినవారిలో అత్యధికులు సోమవారం ఉదయం మృత్యువాతన పడ్డారు.

          ఇదిలా వుండగా, సోమవారం ఉదయమే కానక్కరలేదు-ఏ ఉదయమైనా ఇది జరగవచ్చని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కార్డియాలజిస్ట్ జేమ్స్ ఇ ముల్లర్ అన్నారు. ఆయన అధ్యయనం చేసిన 847 హృద్రోగ మరణాలలో, ఎక్కువ భాగం ఉదయం ఆరు గంటలకు సంభవించినవేనట. ఒక్కొక్కప్పుడు రెండు-మూడు గంటలు, అటు-ఇటుగా సంభవించాయి.

          యూరోప్, సోవియట్ యూనియన్ శాస్త్రజ్ఞుల పరిశోధనలలో కూడా హృద్రోగ మరణాలు ఉదయం పూటే ఎక్కువ అని తేలింది.

          కారణాలు ఏవైనా, ఎన్నైనా, మన జాగ్రత్తల్లో మనం వుండడం మంచిది.

          (21 సంవత్సరాల క్రితం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో రాసిన వ్యాసం ఇది)

1 comment:

  1. మొత్తానికి మీ రచనే కాదు, రమణి(బొమ్మ)కూడ మా గుండె వేగాన్ని పెంచింది. attack,attack!

    ReplyDelete