Wednesday, December 26, 2012

తెలుగు భాష - సాహిత్యాల కలయిక నేపధ్యమే మానవతావాదం: వనం జ్వాలా నరసింహారావు


తెలుగు భాష - సాహిత్యాల 
కలయిక నేపధ్యమే మానవతావాదం

వనం జ్వాలా నరసింహారావు

 మానవతావాదం అనాదిగా సాగుతున్న ఒక మహోద్యమం. సంస్కృతీ-సాహిత్యాల సాంప్రదాయిక నేపధ్యం మీద ఆధారపడి వుండే రీతిలో మానవతావాద ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. మేధావులు, సాహిత్యాభిలాషులు, శాస్త్రీయ దృక్ఫధంతో ఆలోచన చేసిన పలువురు, శతాబ్దాల పూర్వమే, మానవ విలువల పరిరక్షణకు ఆరంభించిన ఆ మహోద్యమం ఈ నాటికీ ప్రత్యక్షంగా-పరోక్షంగా వాటిని కాపాడేందుకు దోహదపడుతూనే వుంది. క్రైస్తవమత మానవతావాదమనీ, సాంస్కృతిక మానవతావాదమనీ, సాహితీ మానవతావాదమనీ, రాజకీయపరమైన మానవతావాదమనీ, మతపరమైన మానవతావాదమనీ రకరకాల పేర్లతో-ఎవరికి నచ్చిన విధంగా వారు పిలువసాగారు. రామరాజ్యమైనా, గ్రామరాజ్యమైనా, కార్మికరాజ్యమైనా, శ్రామికరాజ్యమైనా.. .. ... ... మానవతా దృక్పథం కలిగిందైతేనే, మానవ విలువలకు అర్థముంటుంది. అలా కానప్పుడు, ఏదో ఒక రూపంలో, మానవ విలువలు కాపాడబడేందుకు నిరంతర పోరాటం జరుగుతూనే వుంటుంది. ఆ పోరాటానికి మొదలు-చివర అంటూ ఏమీలేదు. మానవ విలువల పరిరక్షణకు అసలు-సిసలైన సాధనం మాత్రం సాహిత్యమే. పండితులైనా-పామరులైనా సంభాషించుకునేది వ్యావహారిక భాషలోనే గాని గ్రాంథికంలో కాదు. రచయితకు, పాఠకుడికి మధ్య వుండాల్సిన సంబంధం సంభాషణ లాంటిదే. ఇరువురు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరు చెప్పేది ఇంకొకరికి అర్థంకాకపోతే సంభాషణకు అర్థంలేదు. రచయిత రాసింది పాఠకుడికి అర్థంకాకపోతే అసలు భాషే కాదంటాడు జీన్ పాల్ సాత్రే "సాహిత్యం అంటే ఏంటి" అన్న తన పుస్తకంలో. "వాక్యం రసాత్మకం కావ్యం" అన్న విషయం అందరికీ తెలిసిందే. రచయిత తన మేథస్సునుండి పెల్లుబుకిన ఆలోచనను, పాఠకులు అర్థంచేసుకుని-ఆకళింపు చేసుకునే రీతిలో వాక్యంగా మలిచినప్పుడే, ఆ రచనకు గుర్తింపు వస్తుందంటాడు జీన్ పాల్ సాత్రే. నలుగురితో చదివించలేని రచన చిత్తుకాగితంతో సమాన మంటాడు. రచనంటే కేవలం సాహితీ ప్రక్రియ మాత్రమే కాదు-ఉత్పత్తిదారుడుకీ (రచయిత), వినియోగదారుడుకీ (పాఠకుడు) మధ్య తలెత్తనున్న ఘర్షణ.

అతి ప్రాచీనకాలంనాటి నుంచి ఇప్పటికీ వాడుకలో వుండి, వ్యావహారిక భాషగా, సాహిత్యంగా ఉపయోగంలో వున్న వాటిలో తమిళం, తెలుగు భాషలను పేర్కొనాలి. సంస్కృతం, లాటిన్ భాషల్లో సంభాషించు కోవడం దాదాపు లేనట్లే. కొద్ది మార్పులతో గ్రీకు భాష ఇంకా వాడుకలో వుందనాలి. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో తెలుగు ఒకటి. తెలుగు వారుంటున్న ప్రాంతంలోనే ఆది మానవుడు తొలుత సంచరించాడని, దక్షిణా పథానున్న తూర్పు కోస్తా ప్రాంతంలో తిరిగి, తర్వాత పంజాబుకు తరలిపోయాడని చరిత్రకారులంటారు. రాతియుగం నాటి మానవుడు సంచరించిన ప్రీతిపాత్రమైన ప్రదేశంగా కూడా ఆంధ్ర ప్రాంతాన్ని పేర్కొన్నారంటారు. తెలుగువారిప్పుడు నివసించని ప్రదేశమంటూ లేదు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు, అమెరికాతో సహా ప్రపంచంలోని పలు దేశాల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న తెలుగువారు ఎందరో వున్నారు. ముక్కోటి ఆంధ్రులల్లా ఆరుకోట్లకెదిగి, ఎనిమిదికోట్లు దాటి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది కోట్లకు చేరుకున్నారని. అమెరికా కాలిఫోర్నియా లోని సిలికాన్ వాలీనిప్పుడు ఆంధ్రా వాలీగా-తెలుగువాడి వాలీగా పిలవాలి. ఇదిలా వుంటే, తెలుగువారుండే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ పేర్లతో పిలిచే మూడు ప్రాంతాలున్నాయి. ఈ మూడు ప్రాంతాల్లో భిన్నమైన యాసలో తెలుగు మాట్లాడే వారుకూడా వున్నారు.


నవంబర్ 1, 1956న తెలుగువారుండే ప్రాంతాలన్నీ కలపాలని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం నివేదిక ఆధారంగా విశాలాంధ్ర ఏర్పాటయింది. తెలుగు వారందరూ కలిసుందామని అనుకున్నారో-లేదో తెలియదుగాని, కలిసుందామనుకున్న అలనాటి మద్రాస్ తెలుగువారు-తమిళులు మాత్రం విడిపోయారు. భాషాపరంగా ఒకరిమీద పడ్డ ఇంకొకరి ప్రభావం అలానే చెక్కు చెదరకుండా వుంది. ఆంధ్ర ప్రదేశ్ లో నివసించే ఏ ప్ర్రాంతం వారైనా మాట్లాడే భాషను "ఆంధ్రము" అని, "తెనుగు" అని, "తెలుగు" అని అంటాం. ప్రాచీనకాలంనాటి సంస్కృత రచనల్లో ఆంధ్రులను గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు "ఆంధ్ర" అనో, "అంధక" అనో పేర్కొనేవారు. ఆ ప్రాంతంలో నివసించేవారిని ఒక తెగగానో, సమాజంగానో, దేశీయులుగానో గుర్తించేందుకు బహుశా అలాంటి పదప్రయోగం చేసుండాలి. భాషాపరమైన పదప్రయోగాలు చాలాకాలం తర్వాతే వాడబడ్డాయి. ఆంధ్ర ప్రాంతం గురించిన ప్రస్తావన రామాయణంలోను, బౌద్ధాయనంలోను, మనుస్మృతిలోను, మత్స్యపురాణంలోను కనిపిస్తుంది. దక్షిణ దిక్కును తెలిపే "తెన్" అనే ద్రావిడ పదం ఆధారంగా "తెనుగు" ఉత్పన్నమైందని కొందరు భాషా కోవిదుల అభిప్రాయం. ద్రావిడులు తెలుగుదేశానికి ఉత్తర దిక్కుగా నివసించారని తెలియచేసే ప్రయత్నంలోనే, దక్షిణాది వారు మాట్లాడే భాషను "తెనుగు" అని సూచించారు. కాకపోతే శాస్త్రీయమైన సాక్ష్యాధారాలు ఆ సూచనకంతగా లభ్యంకాలేదు. "త్రి లింగ" నుండి తెలుగు ఆవిర్భవించిందని అందరూ అనుకుండేదే. త్రి లింగ కూడా "త్రి-కళింగ" నుండి వచ్చిందే. ఆంధ్రులను "మస్సాలియ" అని, "మైసోలియ" అను గ్రీకులు సంబోధించేవారు. కృష్ణానదిని కూడా వారు అలానే పిలిచేవారు "మసూలీపట్నం", "మచిలీపట్నం", "బందర్" అన్న పేరుతో ఇప్పటికీ కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రాన్ని పిలుస్తాం.

విశ్వామిత్ర మహర్షి కోపానికి గురై, దేశ బహిష్కృతులైన ఆయన ఏభైమంది కొడుకుల వారసులే ఆంధ్రులయ్యారని అయితరేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. వారందరు ఆర్యావర్తం సరిహద్దుల్లోకి, తూర్పు-దక్షిణ ప్రాంతాల్లోకి వ్యాపించారు. ఆర్యులనీ, ద్రావిడులనీ వాడుకలో వున్న పదాలు ఎందుకు ఉపయోగించారో ఇదమిద్ధంగా తెలియదు. ఒక తెగవారినో, భాష మాట్లాడేవారినో, సంస్కృతిని పాటించేవారినో పరోక్షంగా ప్రస్తావించడానికి అలా వాడి వుండవచ్చు. లేదా గుర్తించడంలోనే పొరబడి వుండవచ్చు. ఇదిలా వుండగా, ఆంధ్ర వాల్మీకి రామాయణంలో, తురకలపూర్వీకులైన ఇరానీయులు ఆర్య శబ్దంనుండి పుట్టినవారేనని రాయబడింది. ఆర్యన్ కు వికృతి "అయిరాన్: అనీ, అదే ఇరాన్ గా మారిందనీ చెప్పబడింది. మధ్య ప్రాంత ద్రావిడ జాతికి చెందిన గోండ్-భిల్లీ భాషలకు, తెలుగుకు అవినాభావ సంబంధముందని కొందరంటారు. ప్రాచీనకాలంలో ఆంధ్ర రాజ్యానికి శ్రీకాకుళం రాజధానిగా వుండేదట. మతపరంగా అధ్యయనం చేసి, విశ్లేషణ చేసిన మరికొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మౌర్యులకు పూర్వమే ఆంధ్ర ప్రాంతంలో జైనమతం ప్రచారంలో వుంది. అశోక చక్రవర్తి కాలంలో వైభవంగా వర్ధిల్లిందని అనుకునే బౌద్ధమతం కంటే ముందే జైనమతాన్ని అనుసరించినవారెందరో వున్నారు. క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం-క్రీస్తు శకం ఆరవ శతాబ్దం మధ్య కాలంలో ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధమత ప్రభావం ఎక్కువగా వుండేది. బౌద్ధమతం బోధించిన సర్వ మానవ సిద్ధాంతం, మానవ విలువలు, ప్రజలమధ్యనున్న అంతరాలను తొలగించి, అన్నిజాతులవారిని-తెగలవారిని కులమతాలకు అతీతంగా ఐకమత్యం చేసింది. అత్యంత బలీయమైన, శక్తివంతమైన శాతవాహన రాజుల పాలన స్థాపనకు దారితీసింది.

దక్కన్ పీఠభూమినే దక్షిణాపథం అనేవారు. దానికి ఆగ్నేయ దిక్కుగా ఆంధ్ర ప్రాంతముంది. వింధ్య పర్వతాలను దాటి దక్షిణ ప్రాంతానికి తొలుత వలస వచ్చిన ఆర్యుడు అగస్త్య మహాముని అంటారు. శివలింగాన్ని మొదట కనుగొన్నది ఆయనేననీ, అందువల్లనే ఆంధ్రలోని ఎన్నో శివాలయాలలో వున్న శివలింగాలను అగస్త్యేశ్వరం అనికూడా పిలుస్తారని అంటారు. ఆపస్తంబ ధర్మ సూత్రాల ప్రకారం, క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో, ఆంధ్ర ప్రాంతంలో వైదిక మతం వేళ్లూనుకోసాగింది. భగవత్-భాగవత మతం కూడా ప్రచారంలోకి వచ్చింది. శ్రీకృష్ణుడి బోధనలను తెలియచేస్తూ, క్రమేపీ వైష్ణవ మతంగా రూపాంతరము చెందిందే భాగవత సిద్ధాంతం. సాంఖ్య-యోగ ఆధారంగా భాగవతమతం వుందని భావించినప్పటికీ, దాంట్లో తాత్త్విక చింతనకు సంబంధించిన పలు అంశాలు నిగూఢంగా వున్నాయి వాస్తవానికి. కులాలకు అతీతంగా, అన్ని కులాలవారు పాటించే మతంగా భాగవతం మొదట్లో ప్రచారంలో వున్నప్పటికీ, బ్రాహ్మణుల జోక్యంతో, బ్రాహ్మణ్యం ఆవిర్భవించడంతో, భాగవత మతం, బ్రాహ్మణ్యం కలిసిపోయాయి. కులాల గుర్తింపు మొదలయింది. ఆంధ్ర ప్రాంతంలో అతిపురాతనమైంది, ఎక్కువమంది అనుసరించేది శైవమతం. దాని ప్రభావం కూడా ఎక్కువే. అలానే శాక్తేయ మతాన్ని కొందరు అనుసరించేవారు. వీరశైవం వున్నా దాని ప్రభావం అంతగా లేదనవచ్చునేమో. బ్రాహ్మణుల మూలాన భాగవతమతం వారి చేతుల్లోకి పోయినప్పటికీ, బ్రాహ్మణుడి కర్తవ్యం సాధారణంగా వైదిక పూజలు జరిపించడానికే గాని, కులాధిక్యతకు ప్రతిరూపం కావడం మాత్రం కాదనాలి.

ఆంధ్రుల మతపరమైన నమ్మకాలు-సంప్రదాయాలు తెలుగు భాషమీద, అదేవిధంగా తెలుగు భాష మతపరమైన చారిత్రాకాంశాలమీద ప్రభావం చూపించి వుండాలి. రాజుల-చక్రవర్తుల ప్రోత్సాహంతో, స్వయంగా వాళ్లే ఒక మతాన్ని నమ్మి అనుసరించడంతో, దాని ప్రభావం జన బాహుళ్యం పైనా, వారి జీవన శైలి పైనా, మానవ విలువల పైనా స్పష్టంగా పడసాగింది. పర్యవసానంగా వైదిక మతం మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానంగా, ఎవరికైనా ఆ సిద్ధాంతాలు పాటించడం తేలికైనటువంటిదిగా, అందరికీ అందుబాటులోకి రావడం జరిగింది. అదే హిందు మతంగా వాడుకలోకొచ్చింది. బహుశా ఎన్నో మతాలకు మాతృకయింది. ప్రపంచ భాషలకు సంస్కృతం ఎలానో, ప్రపంచంలోని మతాలన్నిటికీ హిందు మతం అలానే మాతృకనాలి. అందుకేనేమో మార్క్స్ తన గతి తార్కిక భౌతికవాదంలో ఎన్నో సందర్భాల్లో పరోక్షంగా వైదిక సిద్ధాంతాలను అన్వయించుకుంటాడు.

కృతయుగంలో కూడా "ఆంధ్రము" అనే విషయానికి సంబంధించిన ప్రస్తావన వుంది. అగ్నిమిత్ర అనే ఒక రాజుండేవాడు. ఒక వేసవికాలంలో ఎండల తీవ్రతకు ఆయనకు దృష్టి లోపం వచ్చి, కళ్లు కనిపించలేదు. సూర్య భగవానుడిని ప్రార్థించాడట. అగ్నిమిత్రకు ఆయన ప్రత్యక్షమై, తనను కొలిచేందుకు ఒక కొత్త భాషను నేర్పాడంటారు. సూర్యుడిని అగ్నిమిత్ర అదే భాషలో ప్రార్థించడంతో, ఆ భాషకున్న పదజాల ప్రభావంతో, అగ్నిమిత్రకు పోయిన దృష్టి తిరిగొచ్చింది. సంస్కృతంలో "అంధ" అంటే "గుడ్డి" అని-చీకటి అని అర్థమొస్తుంది. చీకటిని తొలగించి, గుడ్డి తనాన్ని పోగొట్టగలిగింది కాబట్టి ఆయన నేర్చుకున్న భాషకు "ఆంధ్ర భాష" అని పేరొచ్చింది. ఒక్కో యుగంలో ఒక్కోరకంగా తెలుగు భాష వాడుకలో వుందని కొందరి నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగా కలియుగంలో తెలుగును "కళింగ ఆంధ్ర భాష" అనీ, "రౌద్ర ఆంధ్ర భాష" అనీ ఏర్పాటుచేసింది శాతకర్ణులకు చెందిన నంది వర్ధనుడు-ఆయన శిష్యుడు దేవల రాయ అని అంటారు. ఆంధ్ర భాషకు రావణాసురుడు వ్యాకరణం రాశాడంటారు. ఆ రాసిన రావణుడు, రామాయణంలో పేర్కొన్న రావణుడే కావాలని లేదు-కాకూడదనీ లేదు. ఆంధ్ర దేశానికి, సింహళ దేశానికి మధ్య మతపరమైన అవినాభావ సంబంధాలున్నందున, తెలుగు భాషకు ఆ దేశానికి చెందిన ఒకవ్యక్తి వ్యాకరణం రాశాడంటే నమ్మ దగ్గ విషయంగానే భావించాలి. ఈ నమ్మకాల్లో, గాథల్లో, మౌఖికంగా ప్రచారంలో వున్న వాటిల్లో, కొంతలో కొంత వాస్తవం వుందనేది మాత్రం వాస్తవమే. భాషకున్న వ్యాకరణ నిర్మాణం-నిబంధనలు-మౌలికమైన పదజాల ఒరవడిని పరిగణలోకి తీసుకొని, తెలుగు భాషను అతి ప్రాచీనమైన ద్రావిడ జాతి భాషలకు చెందినదిగా శాస్త్రవేత్తలు-పరిశోధకులు-భాషా కోవిదులు-పండితులు నిర్ణయించారు. మధ్య ప్రాంత ద్రావిడ జాతి భాషల్లో బహుశా తెలుగు ఒక్కటే అతిపెద్ద వాడుక భాషగానూ, భౌగోళికంగా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన భాషగానూ, ఉత్తర-దక్షిణాల మధ్య వారధిగా వుండే భాషగానూ, ఆర్యుల-ద్రావిడుల మధ్య వారధిగా వుండే భాషగానూ పేర్కొనడం అతిశయోక్తికాదేమో.

పింగళి లక్ష్మీకాంతం గారు చెప్పినదాని ప్రకారం, భాషాపరంగా, తెలుగు భాషారంభం-అభివృద్ధి నన్నయకు పూర్వం-క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో మొదలై, ఆధునిక కాలం నాటి క్రీస్తుపూర్వం 1875 వరకు, ఆ తర్వాత కొనసాగింది-కొనసాగుతూనే వుంది. ప్రాచీనకాలంలో నాటి తెలుగు నాలుగు దశల్లో అభివృద్ధి చెందిందనవచ్చు. అవి: తెలుగుకు పూర్వం నెలకొన్న దశ, గ్రాంథిక తెలుగుకు పూర్వం నెలకొన్న దశ, గ్రాంథిక తెలుగు దశ, సాహిత్య దశలుగా విభజించవచ్చు. తెలుగుకు పూర్వపు దశ అంటే క్రీస్తుశకం 200 వరకే సాగిందనాలి. క్రీస్తుశకం 200-600 మధ్యకాలం వరకు గ్రాంథిక తెలుగుకు పూర్వ దశ కొనసాగింది. గ్రాంథిక దశ-వివిధ రకాల వాడుక శైలి దశ క్రీస్తుశకం 600-900 మధ్య కాలానికి చెందింది. దీని ఆధారంగా, తెలుగు భాష దక్షిణాది ద్రావిడ భాషల్లోంచి ఉద్భవించిందేననీ, ఒక ప్రత్యేకమైన భాషగా క్రీస్తుపూర్వం ఎన్నో శతాబ్దాల క్రితంనుండే వాడుకలో వుందనీ, బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు. "సాలంకాయనులుల" శాసనాల ఆధారంగా, అతి పురాతనమైన తెలుగు లిపి "వెంగి"-"తెలుగు కన్నడ" లభ్యమయిందని తెలుస్తోంది. ద్రావిడ భాషకు చెందినదే అయినప్పటికీ, తెలుగుపై సంస్కృత భాష ప్రభావం అధికంగా వుంది. వాడుకభాషపైనా, గ్రాంథిక భాషపైనా కూడ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అచ్చ తెలుగులో రచనలు చేసినవారు అరుదనాలి. అందుకే మనందరికీ కవిత్రయం నన్నయ-తిక్కన-ఎర్రా ప్రగడ అయితే, శ్రీ శ్రీ గారి కవిత్రయం మాత్రం తిక్కన-వేమన-గురజాడలు. తెలుగు భాషపై సంస్కృతం ప్రభావం పడకుండా అభిమానం చూపిన మొదటి వాడు తిక్కన అని శ్రీ శ్రీ అభిప్రాయం. ఇక ఆధునిక కాలంలో తెలుగు భాష వాడకంలో-ఉపయోగంలో హద్దులనేవి గాని, ఎల్లలనేవి గాని అసలు లేనేలేవు. ఒక వైపు సంస్కృతం ప్రభావం ఇంకా తెలుగు మీద పడుతున్నప్పటికీ, ఎక్కువ ప్రభావం ఆంగ్ల భాషదే అనాలి. నాగరికులందరూ ప్రస్తుతం మాట్లాడుతుండే తెలుగును "తెంగ్లీష్" అనాలి-ఎందుకంటే, అది ప్రధానంగా తెలుగు-ఇంగ్లీషులు కలిపిన భాష కాబట్టి. తమిళం అంతే. ఇంగ్లీష్ పదజాలం లేకుండా ఈ రోజుల్లో బహుశా ఏ భాషా లేదేమో. "వేర్ సెంచరీస్ కో ఎగ్జిస్ట్" అనే భారత ఆంగ్ల సినిమాను రూపొందించిన కృష్ణస్వామి "ఇంగ్లీష్ భారతీయ భాషనీ-దక్షిణ భారతీయ భాషనీ" అంటాడు.

ఇలా మతం, భాష, సాహిత్యం దేని కవే మానవ విలువల పరిరక్షణకు దోహదపడుతున్నాయి. మనిషి తాను భగవంతుడితో మమేకం కావడానికి, తన మూర్తిని భగవంతుడిలో-ఆయన మూర్తిని తనలో చూసుకుంటూ, తద్వారా క్రమశిక్షణతో మెలుగుతూ, తోటి మానవ విలువలను కాపాడేందుకు నిరంతరం పాటుపడుతూనే వుంటాడని ఆశించుదాం.

No comments:

Post a Comment