Friday, March 1, 2013

చిదంబరం వినిపించిన ఆర్థిక మంత్ర గీతమాలిక: వనం జ్వాలా నరసింహారావు


చిదంబరం వినిపించిన ఆర్థిక మంత్ర గీతమాలిక

వనం జ్వాలా నరసింహారావు

          కేంద్ర ఆర్థికమంత్రి పి చిదంబరం ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం చిదంబరానికి ఇది ఎనిమిదోసారి. దివంగత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ తరువాత ఇన్ని సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత చిదంబరానిదే. భారత దేశ చరిత్రలో తాత్కాలిక బడ్జెట్‌తో కలుపుకుని, ఇప్పటివరకు బడ్జెట్‌ను మొత్తంమీద 82 సార్లు ప్రవేశపెట్టారు. మొట్ట మొదటిసారి నవంబర్‌ 26, 1947 న మొదటి ఆర్థిక మంత్రి ఆర్‌.కె షణ్ముఖం చెట్టి బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. గతంలో పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో, ప్రస్తుతం రాష్ర్ట పతిగా ఉన్న ప్రణబ్‌ ముఖర్జీతో సహా, ప్రధాని మన్మోహన్ సింగ్, టిటి కృష్ణమా చారి, ఆర్‌ వెంకట్రామన్‌, హెచ్ ఎం పటేల్‌, జస్వంత్‌సింగ్‌, విపి సింగ్‌, సి సుబ్రమణియం, జాన్‌ మతాయ్‌ లాంటి ప్రముఖులున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, చరణ్‌ సింగ్‌, ఎన్‌ డి తివారీ, మధు దండావతే, ఎస్‌ బి చవాన్‌, సచింద్ర చార్దురి కూడా ఒకసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీలు ప్రధానిగా ఉంటూ మరోవైపు ఆర్థిక శాఖను అదనంగా నిర్వహించిన సమయంలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం జరిగింది. అదే విధంగా చరణ్‌ సింగ్‌, మొరార్జీ దేశాయిలు డిప్యూటీ ప్రధానులుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. యశ్వంత్‌ సిన్హా, వై.బి చవాన్‌, సి.డి దేశ్ ముఖ్‌ ఏడుసార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం జరిగింది. ఇప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

          ఆర్థిక మంత్రి చిదంబరం 2013-14 సంవత్సరానికి రూ. 16, 65,297 కోట్ల వ్యయ అంచనాతో భారీ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇందులో ప్రణాళికా వ్యయం రూ. 5, 55,322 కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ. 11, 09,975 కోట్లు. ఈ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ సవరించిన అంచనాలకన్నా 29.4 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2012-13) బడ్జెట్ వ్యయ అంచనా రూ. 14, 90,925 కోట్లు. సవరించిన అంచనాలో దానిని రూ. 14, 30,825 కోట్లకు కుదించడం జరిగింది. సామాజిక రంగాలకు గత ఏడాదికన్నా కేటాయింపులు పెంచారు. వచ్చే ఏడాది సబ్సిడీ బిల్లును రూ. 2, 57,654 నుంచి రూ. 2, 31,084 కు తగ్గించారు. పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా రూ. 55,000 కోట్లు సమీకరించాలన్న భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. రక్షణ రంగానికి కేటాయింపులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాకన్నా 14 శాతం పెంచి రూ. 2, 03,672 కోట్లు ఇచ్చారు. విద్యా రంగానికి రూ. 65,867 కోట్లు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ. 37,330 కోట్లు, వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు నిధికి రూ. 11,500 కోట్లు, తాగునీరు, పారిశుధ్యానికి రూ. 15,260 కోట్లు, జవహర్‌లాల్‌ నెహ్రూ పట్టణ పునరుద్ధరణ (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం)కు రూ. 14,873 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ. 27,049 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ. 7, 00,000 కోట్లకు పెంచారు.

          చిదంబరం తన బడ్జెట్‌లో అదనంగా రూ. 18,000 కోట్ల ఆదాయార్జనకు కొన్ని కొత్త పన్నులు వేశారు. ఇందులో ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ. 13,300 కోట్లు, పరోక్ష పన్నుల ద్వారా రూ. 4,700 కోట్లు అదనపు ఆదాయం వస్తుందని లెక్క చెప్పారు. అందరూ ఆశించినట్లుగా సగటు వేతన జీవికి పన్ను మినహాయింపును పెంచలేదు. అయితే.. రూ. 3లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వార్షికాదాయం గల వ్యక్తులకు ఆదాయ పన్నులో రూ.రెండు వేల రాయితీ ప్రకటించారు. పన్ను కట్టే వారందరి పై మూడు శాతం విద్యా సుంకం కొనసాగుతుందన్నారు. రూ. 50 లక్షలకు మించిన స్థిరాస్థి లావాదేవీలపై ఒక శాతం టీడీఎస్ విధించారు. ఇందులో వ్యవసాయ భూమిని మినహాయించారు. షేర్ల లావాదేవీలపై పన్ను (సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్) ను తగ్గించారు. కొత్తగా, వ్యవసాయేతర సరుకుల షేర్ల లావాదేవీల పన్నును ప్రవేశపెట్టారు.

          తొలిసారిగా గృహాలను కొనుగోలు చేసే వారికి 25 లక్షల రూపాయల లోపు రుణంపై లక్ష రూపాయల వడ్డీ రాయితీని ప్రకటించారు. 25 లక్షలకన్నా పైబడిన రుణాలపై 1.5 లక్షల రూపాయల వడ్డీని తొలగిస్తామని తెలిపారు. సంవత్సరానికి 10 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని చూపే దేశీయ కార్పొరేట్‌ సంస్థలపై 5 నుంచి 10 శాతం వరకూ సూపర్‌ రిచ్‌ టాక్స్ విధిస్తున్నట్టు తెలిపారు. దేశీయ కంపెనీలతో పోలిస్తే విదేశీ కంపెనీలు ఇప్పటికే అధిక పన్నులను చెల్లిస్తున్నందున వాటిపై సర్ చార్జీని 2 నుంచి 5 శాతానికి పరిమితం చేస్తున్నట్టు వివరించారు. డివిడెండ్‌ పంపిణీ పన్నును 5 నుంచి 10 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు. 50 లక్షల రూపాయల దాటిన గృహాల బదిలీపై ఒక శాతం వారసత్వ పన్ను విధిస్తున్నట్టు చిదంబరం తెలిపారు.

          పన్ను చెల్లింపుదారులందరిపైనా 3 శాతం విద్యా సుంకం వసూలు కొనసాగుతుందని, కొత్తగా ప్రకటించిన సర్‌ చార్జీలన్నీ 2013-14లో మాత్రమే అమలవుతాయని తెలిపారు. ప్రత్యక్ష పన్ను ప్రతిపాదనల ద్వారా అదనంగా 13,300 కోట్లు, పరోక్ష పన్నుల నుంచి 4,700 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ‘విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీని ఆదర్శంగా తీసుకుని సర్‌ చార్జ్‌ భారాన్ని ధనవంతులపై మోపాలని భావిస్తున్నాను. ఈ స్వల్ప భారాన్ని ఈ ఒక్క సంవత్సరమూ భరించేందుకు వారు ఆనందంగా అంగీకరిస్తారని భావిస్తున్నాఅని చిదంబరం వ్యాఖ్యానించారు. పొగ తాగేవారిపై ప్రతియేటాలానే ఈ సంవత్సరం కూడా ఎక్సయిజ్‌ సుంకాల భారాన్ని చిదంబరం మోపారు. సిగరెట్లు, సిగార్స్‌, చిరోట్స్‌, సిగారిల్లోస్‌పై ఎక్సయిజ్‌ సుంకాన్ని 18 శాతానికి పెంచుతున్నట్టు వివరించారు. ఎసి రెస్టారెంటులపై సుంకాలను పెంచారు. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే వారు 50 వేల రూపాయల వరకూ బంగారు ఆభరణాలను ఎటువంటి సుంకాలు చెల్లించకుండా తీసుకురావచ్చని, అదే మహిళలైతే లక్ష రూపాయల విలువైన ఆభరణాలు తెచ్చుకోవచ్చని తెలిపారు. వ్యవసాయేతర ఉత్పత్తుల దిగుమతిపై ప్రస్తుతమున్న సుంకాలే కొనసాగుతాయని చిదంబరం స్పష్టం చేశారు.

          వెయ్యి కోట్ల రూపాయలతో నిర్భయ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహిళా బ్యాంకుకు ఈ బడ్జెట్‌లో చోటు లభించింది. మహిళల కోసం మహిళలచే నిర్వహించ బడేలా మహిళా బ్యాంకును 1000 కోట్ల రూపాయల ప్రాధమిక మూలధనంతో ప్రారంభించనున్నట్టు చిదంబరం ప్రతిపాదించారు. ఈ బ్యాంకుల నుంచి మహిళా రుణాలు, మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక బృందాలకు చేయూత వంటి కార్యకలాపాలు సాగిస్తామని తెలిపారు. దేశంలోని మహిళల భద్రత, సాధికారతకు ఈ నిధిని వినియోగిస్తామని ఆయన తెలిపారు. దీంతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖకు 200 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని చిదంబరం పేర్కొన్నారు.

          ఒక్క సారి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను విశ్లేషణ చేస్తే కొన్ని నిజాలు బయటపడ్తాయి. కలసిరాని వ్యవసాయంతో అనునిత్యం అప్పుల ఊబిలో చిక్కుకుపోయి, వాటిని తీర్చే దారిలేక, సాగు కొనసాగించలేక, సాయం కోసం వేచి చూస్తున్న రైతాంగానికి అంతంత మాత్రం ఊరట కూడా లభించకపోవడం దురదృష్టం. ఆకాశాన్నంటుతోన్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపుచేయటం మాట అటుంచి, వాటి దుష్ఫలితాలను భరించాల్సిన సగటు వేతన జీవిని సంతోషపెట్టేందుకు చిదంబరం చేసిన ప్రయత్నం ఏమీలేదు. పేదరికంలో మగ్గుతూ, ఒళ్లు హూనం చేసుకుని, ఒక్క పూట తిండికి కూడా నోచుకోలేని, పేద ప్రజలకు ఎలాంటి ఆధారమూ చూప లేదు. కంటి తుడుపు గా, ఆహార భద్రత కోసం ఓ పది వేల కోట్లు పక్కన పెడుతున్నామన్న ప్రకటన మాత్రం చేశారు. మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు అవసరమని గీతా బోధన చేసారు. వివిధ శాఖలకు, వివిధ రంగాలకు కేటాయింపులను పెంచడమై తే చేసారు కాని, కచ్చితంగా ఇలా చేయబోతున్నా మన్న హామీ కనిపించలేదు. మహిళా లోకానికి ఆదరణ చేసీచేయనట్లు, నామ్‌కే వాస్తే అన్నట్టు ప్రకటించారు. రూపు-రేఖలు లేని నిర్భయ నిధి, మహిళా బాంక్ ప్రతిపాదనలు కంటి తుడుపువే! ఉద్యోగాలు లేక, ఉపాధి దొరక్క తిప్పలుపడుతూ ఆగ్రహావేశాలతో ఆవేదనతో అవకాశాల కోసం నిరీక్షిస్తున్న యువ జనానికి ఎలాంటి ఆశా లేదు. ‘‘అన్ని వర్గాల సుస్థిరమైన అభివృద్ధికి దోహదం చేసే అధిక వృద్ధి మా లక్ష్యం.. అదే మూల మంత్రం...’’ -అంటూ బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన ఆర్థికమంత్రి.. ఆద్యంతం మాటల గారడితో మురిపించారు. కానీ చేతల్లో చేసింది మాత్రం శూన్యం! చివరాఖరికి.. ‘నగదు బదిలీనే నమ్ముకున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన నగదు బదిలీని యూపీఏ పదవీ కాలం ముగిసే లోగా దేశమంతటా విస్తరించి.. ‘ఆధార్కు అనుసంధానించే పని పూర్తిచేస్తామని సెలవిచ్చారు!

ఒకవైపు దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి.. మరొక వైపు ఏడాదిలో ఎన్నికలు.. ఒకవైపు ఆర్థిక సంస్కరణాభిలాషి ప్రధాని మన్మోహన్ సింగ్!, మరోవైపు ఆమ్ ఆద్మీమంత్రం పఠించే మేడమ్ సోనియాగాంధీ!, ఎన్నికల వరాలు ప్రకటించి ప్రజలను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం!, ఆర్థిక సంక్షోభం ముదరకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అగత్యం! వీటి మధ్య సమన్వయం సాధించడానికి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం విశ్వ ప్రయత్నం చేశారు. ఈ తక్కెడలో ఎటు మొగ్గాలో తెలియక తర్జనభర్జన పడ్డారు. ఎన్నికలకు ముందు ప్రజలను ఆకర్షించే భారీ సంక్షేమ పథకాలేవీ లేవు. అలాగని ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే పెద్ద చర్యలూ లేవు! కవితలు, సూక్తులు చెప్తూ.. సున్నితమైన అంశాలపై బరువైన మాటల మాయాజాలంతో అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేశారు!! మరో ఏడాదిలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో.. మహిళలు, యువత, పేద ప్రజల వర్గాలను ఆకట్టుకునేందుకు కూడా ప్రయత్నం చేశారు. చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో నోబెల్ బహుమతి గ్రహీత-ఆర్థిక శాస్త్ర వేత్త జోసెఫ్ స్టీగ్లిట్జ్, తిరువళ్లువర్, స్వామి వివేకానందల హితోక్తులను ప్రస్తావించటం జరిగింది. ప్రసంగం ఆరంభంలోనే, అన్ని వర్గాల సుస్థిర అభివృద్ధికి తోడ్పడే ఆర్థికవృద్ధి తన బడ్జెట్ మూల మంత్రం అని అన్నారు. సమానత్వం సాధించటమన్న ఒత్తిడి నైతిక బాధ్యతగా తనపై ఉందని, ఐతే, సుస్థిర అభివృద్ధి కావాలంటే అదికూడా అవసరం అనీ అన్నారు. "ఒక దేశపు అత్యంత ముఖ్యమైన వనరు ఆ దేశ ప్రజలే" అన్న స్టీగ్లిట్జ్ వ్యాఖ్యను ఉటంకించారు. ప్రసంగాన్ని ముగించే సమయంలో, తన అభిమాన తమిళ కవి తిరువళ్లువర్ రచనల నుంచి "మనసు నిద్రాణస్థితిలో లేకుండా, దృఢచిత్తంతో ఏది సరైనదని కన్ను విస్పష్టంగా గుర్తిస్తుందో.. మనిషి దానిని నెరవేర్చాలి" అనే పంక్తులను చదివారు. సాధారణంగా చిదంబరం బడ్జెట్ ప్రసంగంలో మూడు నాలుగు సార్లైనా తమిళ కవి తిరువళ్లువర్ పలుకులు వినిపించాల్సిందే! కానీ... ఈసారి ఆయన ఒక్కసారి వినిపించారు. వివేకానంద వాణినీ గుర్తు చేశారు. End

No comments:

Post a Comment