Monday, March 18, 2013

సంఖ్యాపరంగా శాసనసభ విశ్వాసం కోల్పోయిన రాష్ట్ర ప్రభుత్వం: వనం జ్వాలా నరసింహారావు


సంఖ్యాపరంగా శాసనసభ 

విశ్వాసం కోల్పోయిన రాష్ట్ర ప్రభుత్వం


కిరణ్ సర్కారుపై అవిశ్వాసం వీగిపోయినప్పటికీ, ప్రభుత్వాన్ని మైనారిటీలోకి పడిపోయేలా మాత్రం చేసింది. కాంగ్రెస్ నుంచి 9 మంది, టీడీపీ నుంచి 7 మంది, మొత్తం పదహారు మంది వారి పార్టీల విప్‍లను ధిక్కరించి, అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసి, నేడో రేపో స్పీకర్ అనర్హత అస్త్రానికి గురికాబోతున్నారు. కొన్నాళ్ల క్రితం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్యాపదేశంగా తమ పార్టీ శాసన సభ్యులపై అన్న వ్యాఖ్యలు నిజమని నిరూపించబడింది. ఆనాడు పాత్రికేయులు బొత్స చెప్పిన తొమ్మిదిమంది కాంగ్రెస్ వారు ఎవరని మరీ మరీ అడిగినా రాని సమాధానం అవిశ్వాస తీర్మానం ద్వారా బయటకొచ్చింది. అలానే అవిశ్వాస తీర్మానం ఓటింగుకు వస్తే తన పార్టీకి నష్టమనుకున్న చంద్రబాబు నాయుడు భయం కూడా నిజమని తేలింది. తనవారు కారేమోననుకున్న ఏడుగురి విషయంలో ఆయన అనుమానం ధృఢ పడింది. ఆరుగురు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసి విప్‌ను ధిక్కరిస్తే, మరొక సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో పాల్గొననప్పటికీ.. నోటీసుకు మద్దతు తెలిపారు. అదికూడా విప్ ఉల్లంఘనే!

'అర్ధరాత్రి' సమయంలో జరిగిన అవిశ్వాస పరీక్షలో.... ఎవరి 'విశ్వాసం' ఎంతో తేలిపోయింది! కాంగ్రెస్ టికెట్ల పై గెలిచి... జగన్ పంచన చేరిన తొమ్మిది మంది శాసనసభ సాక్షిగా తిరుగుబాటు బావుటాను ఎగురవేశారు. ఆది నుంచి అనుకుంటున్న ఎనిమిది మందితోపాటు... చివర్లో జోగి రమేశ్ కూడా కాంగ్రెస్‌కు 'చెయ్యి'చ్చారు. జగన్‌కు జై కొట్టారు. తెలుగుదేశంకు చెందిన ఏడుగురు సభ్యులు 'సైకిల్' దిగిపోయారు. 'మాది తటస్థ వైఖరి' అని తేల్చి చెప్పిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి... అనుకోకుండా మజ్లిస్ పార్టీ కూడా తోడైంది. అవిశ్వాస ప్రక్రియకు దూరంగా నిలిచింది. దీంతో... ముందుగా అనుకున్నట్లు గానే అవిశ్వాసం వీగిపోయింది. వైసీపీ రెండు అవిశ్వాస నోటీసులు ఇచ్చినప్పటికీ, టీఆర్ఎస్ నోటీసునే స్పీకర్ పరిగణనలోకి తీసుకున్నారు. దీనికి 45 మంది సభ్యులు మద్దతు ఇవ్వడంతో చర్చ మొదలైంది. వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు... విమర్శలు, ప్రతి విమర్శలు... ఆరోపణలు, సమాధానాలు... ఇలా వాడిగా, వేడిగా సభా సమరం కొనసాగింది. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ... వీటిలో ప్రతి పార్టీ మరో పార్టీపై దుమ్మెత్తిపోస్తూ తమ తమ వాదనలు వినిపించాయి. ఉదయం 11 గంటల సమయంలో మొదలైన చర్చ.... అర్ధరాత్రి వరకు కొనసాగింది. చివర్లో... విపక్షాల విమర్శలకు ముఖ్యమంత్రి కిరణ్ సుదీర్ఘ సమాధానం ఇస్తూ తన ప్రభుత్వ పని తీరును ఆకాశానికి ఎత్తివేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పక్ష నేత ఈటెల రాజేందర్ ఆనవాయితీ ప్రకారం మాట్లాడారు. అర్ధరాత్రి దాటాక అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఓటింగ్ జరిపారు. దీనికి టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎంతోపాటు కాంగ్రెస్, టీడీపీ రెబెల్స్... మొత్తం 58 మంది బలపరిచారు. 142 మంది అవిశ్వాసాన్ని వ్యతిరేకించారు. టీడీపీ, ఎంఐఎం సభ్యులతో సహా 91 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. టీడీపీ, ఎంఐఎం మద్దతు ఇచ్చినా సరే, అవిశ్వాసం వీగి పోవడానికే అవకాశాలు ఎక్కువగా వుండేవి. అయితే, చివరి నిమిషం దాకా అధికార పక్షానికి ముచ్చెమటలు  పోసేవి. ప్రస్తుతం ప్రభుత్వం అవిశ్వాసం నుంచి గట్టెక్కినా, సభలో మేజిక్ ఫిగర్ ను సాధించకపోవడంతో మైనారిటీలో పడిపోయినట్లే! ఏదైతేనేం... మరో ఆరునెలలపాటు 'అవిశ్వాసం' ఊసు ఉండదు.


రెండేళ్లు.. రెండు అవిశ్వాస తీర్మానాలు.. రెండుసార్లూ విజయాలు! ఇదీ.. సీఎంగా కిరణ్ ఘనత. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కూడా దాటలేదు. కానీ.. రెండు అవిశ్వాస తీర్మానాలను దాటేశారు. గత ఏడాది టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం గండం నుంచి గట్టెక్కారు. తాజాగా, టీఆర్ఎస్, వైసీపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు చర్చకు వచ్చాయి. వీటికి తాము మద్దతు ఇవ్వడం లేదని టీడీపీ ముందుగానే ప్రకటించడంతో అధికారపక్షం పైయెత్తు వేసింది. అవిశ్వాసంపై చర్చ, ఓటింగ్ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని భావించి ప్రతిపక్షాలకు ఝలక్ ఇస్తూ ఒక్క రోజులోనే చర్చ, ఓటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే, టీడీపీ నిర్ణయంతోనే 'సేఫ్'లోకి వెళ్లిన పాలక పక్షానికి ఎంఐఎం నిర్ణయం 'డబుల్ సేఫ్'లోకి నెట్టింది. అవిశ్వాసంపై పంతం నెగ్గించుకున్నామన్న ఆనందం... అధికార పక్షం దాడిని అంతే ధాటిగా తిప్పికొట్ట లేకపోయామన్న స్వల్ప నిరాశ! ఇదీ టీఆర్ఎస్ పరిస్థితి. ప్రధాన ప్రతిపక్షం కాకపోయినప్పటికీ... ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టి, చర్చ జరిగేలా చూడటంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. తనకు 17 మంది సభ్యుల బలమే ఉన్నప్పటికీ, ఇతర పక్షాలనూ కూడగట్టి, చివరికి వైసీపీ కూడా తమ వెంటే నడిచేలా చేసింది.

ఈ నేపధ్యంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అవిశ్వాస తీర్మానం పూర్వాపరాలను తెలుసుకోవడం మంచిది. అధికారంలో వున్న పార్టీ పనితీరును నిశితంగా విమర్శించేందుకు, ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ పథకాలలోని లోపాలను-లోటుపాటులను ఎత్తి చూపేందుకు, ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, తద్వారా ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించేందుకు, అవిశ్వాస తీర్మానాన్ని ఒక పదునైన ఆయుధంగా, ప్రజాస్వామ్య దేశాలలో-ముఖ్యంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలలో ప్రతిపక్షాలు వాడుకుంటాయి. సాధారణంగా ఈ పనిని ప్రధాన ప్రతిపక్షం తన భుజాన వేసుకుంటుంది. ఎన్నికైన ప్రభుత్వానికి ఒక నిర్దిష్ట కాలపరిమితి వరకు అధికారంలో వుండే అవకాశం వున్నప్పటికీ, అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం ద్వారా, ఆ కాలపరిమితి లోపునే, ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపే ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో సఫలం కావచ్చు, విఫలం కావచ్చు. ఒక విధంగా ఆలోచిస్తే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, అధికారంలో వున్న ప్రభుత్వానికి చట్ట సభలో మెజారిటీ లేదని నిరూపించి, మైనారిటీలో పడవేసి, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాని, ముందస్తుగా ఎన్నికలకు పోవడం కాని అవిశ్వాస తీర్మానం ద్వారా సాధించవచ్చు. కాకపోతే, అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన ప్రతిపక్ష పార్టీ, తీర్మానం నెగ్గించుకోగలిగితే, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అందించడానికి సిద్ధంగా వుండగలగాలి.  ఆషామాషీగా తీర్మానం పెట్టడం సాంప్రదాయం కాదు.

అవిశ్వాస తీర్మానం అనే ప్రక్రియ లేని కొన్ని ప్రజాస్వామ్య దేశాలలో, ప్రభుత్వాధినేతలను లేదా ఇతర ప్రజాప్రతినిధులను, పదవీచ్యుతులను చేసేందుకు "ఇంపీచ్‌మెంట్" కాని "రీకాల్" పద్ధతి కాని ఉపయోగించుకుంటాయి ప్రతిపక్షాలు. వీటికి అవిశ్వాస తీర్మానానికి మధ్య కొంత తేడా వున్నప్పటికీ, ఫలితం మాత్రం ఒకటే. అవిశ్వాస తీర్మానంలో ఇరుపక్షాలకు లభించిన మద్దతు ఓట్లు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. తాము ప్రతిపాదించిన అవిశ్వాసానికి ఇంతమంది మద్దతు వుందని బహిరంగపర్చడం ద్వారా, ప్రభుత్వాన్ని నిరంతరం ఇరుకున పెట్టవచ్చు. ఉదాహరణకు మొన్న ముగిసిన అవిశ్వాసాన్నే చెప్పుకోవచ్చు. దాని మూలాన, ప్రభుత్వానికి మద్దతిచ్చే సభ్యుల సంఖ్య స్పష్టంగా బయటపడింది. భవిష్యత్‍లో ఆ సంఖ్య పిసరంత తగ్గినా, ప్రభుత్వం మైనారిటీలో పడినట్లే! ఇలా మెడమీద కత్తి వేలాడుతూనే వుంటుంది. అవిశ్వాస తీర్మానానికి సెన్సార్ తీర్మానం అన్న పేరు కూడా కొన్ని చోట్ల వాడుకలో వుంది. కాకపోతే రెంటి మధ్యా తేడా కూడా వుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గితే, ప్రభుత్వం రాజీనామా తప్పనిసరి. సెన్సార్ తీర్మానం నెగ్గడం అంటే, ప్రభుత్వ విధి విధానాలకు సభ ఆమోదం తెలపడం లేదని అర్థం. సెన్సార్ తీర్మానం నెగ్గినప్పటికీ మంత్రివర్గం రాజీనామా చేయనవసరం లేదు. సెన్సార్ తీర్మానం ఏ ఒక్క మంత్రికి వ్యతిరేకంగానో, లేక, ఒకరికంటే ఎక్కువ మంత్రుల బృందానికి వ్యతిరేకంగానో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అవిశ్వాస తీర్మానం మాత్రం యావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వుంటుంది. ఒక్కో సారి, ప్రభుత్వమే, అది ప్రతిపాదించిన కొన్ని బిల్లుల విషయంలో, ఒక అడుగు ముందుకు వేసి, ఆ బిల్లు సభ ఆమోదం పొందడం అంటే, తమ ప్రభుత్వంపై విశ్వాసం ప్రకటించినట్లే అని స్పష్టం చేస్తుంది. అసంతృప్తితో వున్న అధికార పక్ష సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేయకుండా నిరోధించే చర్యలు కూడా చేపడ్తుంది ప్రభుత్వం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృక అని చెప్పుకునే బ్రిటీష్ సాంప్రదాయం ప్రకారం, ద్రవ్య వినియోగ బిల్లు కనుక చట్ట సభ ఆమోదం పొంద లేకపోతే, అవిశ్వాస తీర్మానం గెలిచినప్పుడు జరిగే విధంగానే, ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వుంటుంది. పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలకు పోవాల్సిన పరిస్థితి కూడా కలుగుతుంది.

అవిశ్వాస తీర్మాన ప్రక్రియలో దేశ దేశాలలో కొన్ని తేడాలున్నాయి. జర్మనీ, స్పెయిన్, ఇజ్రాయెల్ లాంటి దేశాలలో, అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన ప్రతిపక్ష పార్టీ, అదే ప్రతిపాదనలో, ప్రభుత్వం ఓడిపోతే-అధినేత రాజీనామా చేస్తే, ఆయన స్థానంలో ఎవర్ని నియమించాలో కూడా తెలియచేయాలి. అంటే ఒకే ఓటు ద్వారా అధికారంలో వున్న ప్రభుత్వంపై అవిశ్వాసం, రాబోయే ప్రభుత్వంపై విశ్వాసం ప్రకటించడం అన్న మాట. బ్రిటీష్ సాంప్రదాయం ప్రకారం, ప్రతిపక్షాలకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే అవకాశం ఇవ్వకుండా, ప్రభుత్వమే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. చాలా సందర్భాలలో అవిశ్వాస తీర్మానాలు కేవలం ప్రభుత్వ పని తీరును విమర్శించేందుకు పరిమితం కావడంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అవి నెగ్గే అవకాశాలు లేకపోయినా ప్రతిపాదించడం చేయడం ప్రతిపక్షాల ఆనవాయితీ అయిపోయింది. అదే విధంగా, ఒకసారి అవిశ్వాస తీర్మానం వీగి పోతే ఒక నిర్దుష్ట కాలపరిమితి వరకు మళ్లీ ప్రతిపాదించడానికి ఆస్కారం లేదు. మన దేశంలో రాష్ట్రపతి ప్రసంగానికి, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం లాంటిదే, బ్రిటీష్ సాంప్రదాయంలో రాణి ప్రసంగానికి వుంటుంది. ఆ తీర్మానం వీగి పోయినా, ప్రభుత్వం రాజీనామా చేయాల్సిందే. అది కూడా ప్రభుత్వానికి సభ విశ్వాసం కోల్పోయినట్లే భావించాలి. 

                ప్రప్రధమ పార్లమెంటరీ సాంప్రదాయ అవిశ్వాస తీర్మానం మార్చ్ 1782 లో బ్రిటన్‌లో ప్రవేశ పెట్టడం జరిగింది. అమెరికన్ రివల్యూషనరీ యుద్ధంలో, యార్క్ టౌన్ వద్ద బ్రిటీష్ ప్రభుత్వం ఓటమి చెందడంతో, అప్పటి ప్రధాన మంత్రిపైన, మంత్రి మండలిపైనా విశ్వాసం లేదని ప్రతిపక్షాలు పార్లమెంటులో తీర్మానం ప్రతిపాదించాయి. అయితే, వెంటనే, తన రాజీనామాను నాటి ప్రధాని లార్డ్ నార్త్ బ్రిటీష్ రాణికి సమర్పించడంతో కథ సుఖాంతమైంది. అదే విధంగా 19 వ శతాబ్దం తొలినాళ్లలో, కొందరు బ్రిటీష్ ప్రధాన మంత్రులు తమకు సభలో మెజారిటీ లేకపోయినా పాలన చేసేందుకు ప్రయత్నాలు చేయడంతో, ప్రతిపక్షాల నుంచి మొదలైన వ్యతిరేకత, శతాబ్దపు మధ్యకాలానికల్లా, అవిశ్వాస తీర్మానం ఒక పటిష్టమైన ఆయుధంగా మారడానికి దారి తీసింది. ఇప్పటి వరకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటన్‌లో, 11 మంది ప్రధాన మంత్రులు అవిశ్వాస తీర్మానం పుణ్యమా అని పదవులను కోల్పోయారు. 1925 తరువాత ఒకే ఒక్క సారి-జేమ్స్ కాలహాన్ కు వ్యతిరేకంగా మాత్రమే అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఆధునిక కాలంలో, సర్వసాధారణంగా, అవిశ్వాస తీర్మానాలను నెగ్గించుకోవడం దాదాపు జరగడం లేదనే అనాలి. పార్టీ క్రమశిక్షణ పేరుతో విప్ జారీ చేయడంతో విధిగా ఏ పార్టీ వారు ఆ పార్టీకే ఓటు వేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులు  ఆ విధంగా అవిశ్వాస సమయంలో తగ్గి పోయాయి. ఒకటి రెండు ఓట్ల మెజారిటీతో అధికారంలో కొచ్చిన సందర్భాలలో అవిశ్వాస తీర్మానాలు నెగ్గుతున్నాయే మో కాని సాధారణంగా ఓటమి పాలే అవుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాలలో అవిశ్వాస తీర్మానాలను ఎక్కువ సార్లు ప్రతిపాదించడం జరుగుతోంది.

1 comment: