Wednesday, December 25, 2013

కవిగా మావో:వనం జ్వాలా నరసింహారావు

కవిగా మావో
వనం జ్వాలా నరసింహారావు


          నవ చైనా జాతి పిత మావో 120వ జయంతిని (డిసెంబర్ 26) ఘనంగా జరుపుకునేందుకు కమ్యూనిస్టు చైనా సిద్ధమవుతోంది. వంద కోట్ల రూపాయల వ్యయంతో, ధగధగలాడే (యాబై కిలోలకు పైగా ఉన్న) మావో బంగారు విగ్రహంను ఇప్పటికీ షెంజెన్ పట్టణంలో ఆవిష్కరించారు. వాస్తవానికి వంద అడుగుల నిడివిగల మావో సేటుంగ్ భారీ విగ్రహాన్ని కూడా, ఆయన 120 వ జయంతిని పురస్కరించుకుని, నేడు (డిసెంబర్ 26, 2013 న), ఆ మహా నాయకుని స్వస్థలమైన ఛాంగ్ షాలో ప్రతిష్ఠ చేయనున్నారు. మావో 32 వ ఏట ఎలా వుండే వాడో, అచ్చు అలానే, అది కూడా ఛాంగ్ షా గురించి ఆయన తనదైన శైలిలో ఒక చక్కటి వచన కవిత రాసినప్పుడు ఏ విధంగా కూచుని వున్నాడో, అలాగే తీర్చిదిద్దారా విగ్రహాన్ని. ఆ కవిత ఇలా సాగుతుంది.

          "వణికించే చలిలో ఏకాంతంగా….ఉత్తరాన పారే నదిని వీక్షించగా….నారింజ వర్ణ ద్వీపమ్ సమీపాన.. గులాబి పర్వతాల పక్కన….అడవి లోని ఎర్రని ఆకుల నందుకునిఆ  వుద్రేకపూరితమైన నీళ్లలో ఎలా వెళ్లామో….నాతో వచ్చిన వందలాది నేస్తాలు నీకు గుర్తున్నారా?....భయానక మైన ఉప్పెన లో….మన నావలు చిక్కుకున్న తీరు….నీటి అలజడి సృష్టిస్తున్న హోరు….మనమంతా అల్లల్లాడిన వైనంచేసేది లేక వెనుతిరగాలనుకున్న తరుణం….నీకు గుర్తున్నదా?"

          ఉత్తర దిక్కుగా ప్రవహించి, టుంగ్ టింగ్ నదిలో కలుస్తుండే ప్రదేశంలో, షియాంగ్ నదికి తూర్పు తీరాన వుంటుంది ఛాంగ్ షా నగరం. నారింజ వర్ణ ద్వీపంగా ఆయన పేర్కొన్న ప్రాంతం పడమర దిశగా వుండగా, మరింత పడమటగా వెళ్తే, పర్వతాల సముదాయం కనిపిస్తుంది. మావో రాసిన వచన కవితల్లో కల్లా దానికొక ప్రత్యేకత వుందంటారు. ఆయన వర్ణించిన భూభాగం, మావో జ్ఞాపకాలను ప్రతిబింబిస్తాయి. అలాంటిదే మరో వచన కవిత...అక్టోబర్ 11, 1929 న రాశారాయన. ఆంగ్ల సంవత్సరాదిలోని తొమ్మిదో నెల, తొమ్మిదో తేదీని వర్ణించుతూ రాసిందది. ఆనందంతో పొంగిపోయే రోజుగా, ఆహ్లాదంగా పండుగ జరుపుకునే రోజుగా మావో వర్ణించాడు. చైనీస్ భాషలో మావో రాసిన వచన కవితలను మైఖేల్ బుల్లక్, జెరోమ్ చెన్ ఇంగ్లీష్ లోకి అనువదించారు. తొమ్మిదో నెల, తొమ్మిదో తేదీ గురించి మావో రాసిన కవిత ఇలా సాగుతుంది.

          "వయసు పైబడేది స్వర్గానికి కాదు...మనిషికి…..నవ మాసంలో వచ్చే నవ్యమైన పండగఏటా వచ్చే పండగ….ఏటేటా వస్తూనే వుంటుంది….యుద్ధభూమిలో మాత్రం పసుపు పుష్పాలు….సువాసనలు వెదజల్లుతూనే వున్నాయిఏడాదికి ఒక సారి వచ్చే శీతాకాలంఈ ఏడు భారంగా వచ్చి నవ్విందిఎప్పటి లాగ కాక నిస్సారమైన రంగు పులుముకుంది….గతం కన్న మిన్నగా….చల్లని ఆకాశంలో ఆ నీటిలో…..లెక్క లేనన్ని ఆకులు పలకరిస్తున్నాయి".

1949 లో మావో సేటుంగ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను నెలకొల్పారు. 1921 లో చైనా కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించిన వారిలో మావో ఒకరు. మార్క్సియన్ కమ్యూనిజం సిద్ధాంతాలను నేల నాలుగు చెరగులా ప్రచారం చేసిన వారిలో మార్క్స్, లెనిన్ సరసన మావో కూడా వున్నారు. అభివృద్ధి దిశగా, సామ్యవాదం-కమ్యూనిజం స్థాయిలలో వర్గ పోరాటం ఎలా కొనసాగుతుందో అనే దానికి సైద్ధాంతిక స్వరూపం ఇచ్చిన ఘనత ఒక మార్క్సిస్ట్ ఆలోచనాపరుడిగా మావోకు మాత్రమే దక్కుతుంది. గ్రామీణ రైతాంగానికి, నిరుపేదలకు, భూమి పంపకం ఒక్క అవసరాన్ని-ప్రాధాన్యతను నొక్కి వక్కాణించిన వ్యక్తిగా మావో చరిత్ర ప్రసిద్ధికెక్కాడు. ఆయన సిద్ధాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందని మూడో ప్రపంచ దేశాలను ప్రభావితం చేశాయి.


ఒక రాజకీయ, సైనిక నాయకుడిగా, విప్లవకారుడిగా, తిరుగుబాటు దారుడిగా మావో సేటుంగ్ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసినవాడే. బహుశా అంతగా అందరికీ తెలియకపోయినా, మావో, ఒక గొప్ప రచయిత, వచన కవి, సాహితీవేత్త. చరిత్ర గమనానికి, మార్పులకు మావో చేసిన సేవ ప్రపంచ చరిత్ర మార్పుకే దారి తీసింది. చైనా దేశానికి ఒక స్థిరత్వాన్ని, ప్రజల ప్రజాస్వామ్యాన్ని, అందించిన వ్యక్తిగా, అలనాటి చైనాను సంకెళ్ల నుండి విముక్తి చేయించిన వ్యక్తిగా, పీపుల్స్ రిపబ్లిక్ స్థాపనకు ముఖ్య కారకుడిగా మావో సేటుంగ్ చిరస్మరణీయుడు. ఆయన మాటల్లో చేతల్లో కనిపించే నిజాయితీ, ప్రజల సమస్యలను అవగాహన చేసుకుని వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించడంలో ఆయన చూపిన చొరవ బహుశా అతికొద్ది మందిలో మాత్రమే కనిపిస్తుంది. కష్ట కాలంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీని ఏకతాటిపై నడిపించడానికి, అందులో భాగంగా ఆయన రాసిన ఉద్రేక పూరితమైన వచన కవిత్వం, ఆయనలోని స్నేహ కోణాన్ని ఆవిష్కరించేలా వుంటాయి. తనను, తన ఆలోచనలను, సిద్ధాంతాలను వ్యతిరేకించిన వారికి వ్యతిరేకంగా మావో చేసిన పోరాటాలను విశ్లేషిస్తే, ఆయనలోని పోరాట పటిమ, శత్రువులను ఆయన అణచివేసిన విధానం స్పష్టంగా గోచరిస్తుంది. కేవలం 26 సంవత్సరాల వయసులోనే, 1919 లో మార్క్సిజం వైపు ఆకర్షితుడైన మావో, ఒక తిరుగుబాటు దారుడిగా, విప్లవకారుడిగా మారి, ఆయుధాలు పట్టుకుని అధికార వర్గాలకు వ్యతిరేకంగా పోరాడడానికి మరో ఎనిమిది సంవత్సరాలు, అంటే, 1927 వరకు పట్టలేదు. 1934-35 లో ఓటమి తో సహా, లాంగ్ మార్చ్, యునైటెడ్ ఫ్రంట్, అంతర్యుద్ధం...ఇవన్నీ దాటుకుంటూ అంతిమ విజయం సాధించడానికి మావోకు సుమారు 22 సంవత్సరాలు పట్టింది. అంతకాలం ఆయన నిరంతర పోరాటం సాగిస్తూనే వున్నారు.

చైనా దేశపు ఇతర నాయకులకు మావోకు చాలా తేడా వుంది. చైనా పరిస్థితులకు అనుగుణంగా, మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతాలను అన్వయించుకుంటూ, ఒక బలీయమైన  దేశంగా చైనాను తీర్చిదిద్దాలన్నదే మావో అభిప్రాయం. నగరాలలో, పట్టణాలలో నివసించే కార్మికులు, గ్రామీణ ప్రాంతాలలో వుండే కర్షకులు, వారిలోనూ ప్రత్యేకించి ఆయుధాలు ధరించిన రైతాంగం మద్దతుతో పనిచేసే మార్క్సిస్ట్ పార్టీ ఒక్కటే చైనాలో గణనీయమైన మార్పు తేగలుగుతుందని మావో విశ్వాసం. ఆయన మనసా-వాచా-కర్మణా మార్క్సిస్ట్ అయినందున ఇతర విప్లవకారులతో కొన్ని విషయాలలో బాగా విభేదించేవారు. సైనిక విప్లవంగా పేర్కొనదగిన ఆయన విధానాలు కొన్ని, సంస్కృతీ పరమైన ప్రభావాన్ని కూడా చూపేవి. మావో మహిళా పక్షపాతి కూడా. స్త్రీ-పురుషులిద్దరూ సమానులని, స్త్రీలు సమానులమనే భావనతోనే వుండాలని ఆయన భావించేవారు. అలానే, సైన్స్ అన్నా, సాహిత్యమన్నా, కళలన్నా కేవలం ఎనలేని అభిమానమే కాకుండా, అవి ప్రజలకు ఉపయోగపడే విధంగా వుండాలని, ముఖ్యంగా కార్మిక-కర్షక ప్రజానీకానికి మేలు చేయాలని అనేవారు.

గ్రామీణ వాతావరణ నేపధ్యంలో, చైనా-జపాన్ యుద్ధం జరగడానికి ఒక ఏడాది ముందర డిసెంబర్ 26, 1893 , జన్మించిన మావో, వరుసగా చోటుచేసుకున్న సంస్కరణల పర్వాన్ని, ఆటుపోట్లను, విప్లవాలను, అంతర్ యుద్ధాలను, గమనించుకుంటూ వచ్చి, వాటి ప్రభావానికి లోనయ్యాడు. చైనా దేశం పొరుగునున్న దేశాలలో సంభవిస్తున్న పరిణామాలను, అక్కడి ప్రజల జయాపజయాలను ఆకళింపు చేసుకున్నారు. మావో తండ్రి నూటికి నూరుపాళ్లు రైతు. కాకపోతే బీదరికంలోను, అప్పుల బాధలోను జీవించేవాడు మొదట్లో. దరిమిలా ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకున్నాడు. తల్లికి నైతిక విలువలంటే అమితమైన గౌరవం. ఎప్పుడూ ఎవరికో ఒకరికి సాయపడాలనే మనస్తత్వం ఆమెది. దైవమంటే భక్తి ప్రపత్తులు మెండుగా వుండేవి. చిన్నతనం నుంచే మావోకు, తాను చేసే ప్రతి పనిలోను ఒక రకమైన స్పష్టత వుండేది. చిన్నతనంలో-ఏడేళ్ల వయసులో, చదువుకొరకు మాస్టారు దగ్గరకు పంపడంతో, పుస్తకాల మీద అభిమానం, శ్రద్ధ పెరిగింది. జనరల్  నాలెడ్జ్ పుస్తకాలు చదవడం ప్రారంభం కావడంతో, ఒక కొత్త ప్రపంచం మొదలైందన్న భావన కలిగింది ఆ చిన్నారి మనసులో. పుస్తక పఠనం మీద ఆసక్తి పెరగసాగింది. చదువుతో పాటు, తండ్రి వ్యవసాయ క్షేత్రంలో కూడా పనిచేస్తుండేవాడు మావో. కొన్నాళ్లకు, 1907 లో, తన కంటే నాలుగేళ్లు పెద్దయిన అమ్మాయిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత చరిత్ర, మావో విప్లవోద్యమం, చైనాకు ఆయన తిరుగులేని నాయకుడిగా మరణించేంతవరకు వ్యవహరించడం, అందరికీ తెలిసిన చరిత్రే.

విప్లవ యోధుడైన మావో సేటుంగ్ ఒక కవిగా, రచయితగా, సాహిత్యాభిలాషిగా కూడా ఆ దేశ ప్రజలకు సుపరిచితుడే. బహుశా, ఆయన రాజకీయ-విప్లవ నేపధ్యం, దేశ నాయకుడిగా ఆయనకున్న పేరు ప్రతిష్టలు, ఆయనకు ఒక రచయితగా కూడా పేరు తెచ్చి పెట్టి వుండవచ్చు. అయితే, ఆయనకు రాజకీయ నేపధ్యం లేకపోయినా కూడా, సాహితీ వేత్తగా, వచన కవిగా, ఆయన శక్తి సామర్ధ్యాలు, అంచనాకు మించే వున్నాయనాలి. సమకాలీన చైనా సాహిత్యంలో ఆయన రాజకీయ జీవితంతో ముడిపెట్టకుండా, మావోకు మంచి పేరు వచ్చేది. మావో వచన కవితల రచనా శైలి, కూర్పు, భావన, సాహితీ విలువలు, దాదాపు పూర్తిగా ఆయన అనుభవాల ఆధారంగానో, లేదా, ఒక విప్లవ కమ్యూనిస్ట్ యోధుడి ఆలోచనా ధోరణికి అనుగుణంగానో వున్నాయని సమకాలీన రచయితల అభిప్రాయం.

ఒకటి రెండు సందర్భాలలో తప్ప, మహిళలు, ప్రేమ అనే పదాలు అరుదుగా ఆయన కవిత్వంలో కనిపిస్తాయి. మానవ నైజం, మానవ విలువలు, సమాజం, చైనా దేశం, ప్రపంచం...సంబంధించిన అంశాలే మావో కవితల కథా వస్తువు. పాఠశాల విద్యార్థిగా వుండగానే, సాహిత్యంపై అభిలాష కలగడం, కవితలు అల్లడం మొదలెట్టాడు. వచన రచన అంటే మావోకు చాలా ఇష్టం. ఆయన వచన కవిత్వానికి, గేయ కవిత్వానికి పోలికలు వున్నాయి. గ్రామీణ నేపధ్యం, ప్రకృతి అందచందాలు మావో కవితల ప్రత్యేకత.

మావో రాసిన మరో కవిత ఇలా సాగుతుంది.

ఆ శ్వేత మేరు పర్వతాల పైన….మబ్బులు వెలిశాయి…..అదే తెల్లని కొండల కిందవేదన ఉబికింది….ఎండిపోయిన అడవులు వృక్షాలు సైతం….యుద్ధానికి సై అన్నాయి….తుపాకిల మోత మోగింది….ఫిరంగుల వాన కురిసింది….ఆకాశం నుండి ఊడిపడ్డట్టు….సైన్యం ముందుకు దూసుకొచ్చింది..పదిహేను రోజుల్లో రెండు వందల మైళ్లు….సైనికుల దండు కదిలింది….ఫ్యూకేన్ పర్వతాల మీదుగా….కన్ నదికి చేరువగా….శత్రు సైన్యాన్ని తుదముట్టించే దిశగా….వేలాదిగా సేన కదిలింది విజయం వైపు….కాని..మెల్లగా ముందుకొచ్చిన తీరుని….ఆలశ్యంగా పన్నిన పన్నాగాన్ని….జీర్ణించుకోలేని మనసు ఒకటి….మౌనంగా కన్నీరు పెట్టింది.


ఇతర చైనా ప్రముఖ రచయితల లాగానే, మావో కూడా, అపారమైన సాహితీ సంపదను తన కవిత్వం ద్వారా ఆ దేశానికి అందించాడు. ఆయన రచనలు చాలా వరకు ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి. బహుశా ఇతర భాషలలో కూడా వచ్చి వుండవచ్చు. ప్రాచీన-ఆధునిక ప్రపంచం పోకడలను ప్రతిబింబిస్తాయి మావో రచనలు. End

No comments:

Post a Comment