Saturday, March 8, 2014

కామ్రేడ్స్ తో కలిసి... కె. బి. తిలక్:వనం జ్వాలా నరసింహారావు

కామ్రేడ్స్ తో కలిసి... కె. బి. తిలక్
వనం జ్వాలా నరసింహారావు

క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా అరెస్టయిన తిలక్‌‍ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడానికి ముందర ఓ రెండు వారాలు ఏలూరు సబ్ జైలులో వుంచారని చెప్పుకున్నాం గదా. అక్కడున్న రోజులను గుర్తు చేసుకుంటూ, ఉద్యమాల ఊపిరి తీసే ప్రయత్నాలు అప్పట్లో ఎలా జరిగా యోనని సూచనప్రాయంగా చెప్పారు. తన కంటే వయస్సులో పెద్ద వారైన మోతె నారాయణరావు గారు, కార్వంచి రామమూర్తి గారు తిలక్‌‍తో పాటు జైల్లో వున్నారు. అప్పటి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ శేషాద్రి ఒక సీనియర్ ఐ.సి.యస్. అధికారి. ఆయనో మారు సబ్‌ జైలుకు వచ్చి వీరిని పరామర్శించారు. "ఎందుకీ కుర్రవాడిని (తిలక్‌ను) మీరు చెడగొడుతున్నారు" అని మోతె-కార్వంచి లను ఆయన ప్రశ్నించినప్పుడు సమాధానం ఇచ్చింది వారు కాదు, కాని తిలక్. తనను వాళ్లు చెడగొట్టడం అనేది తప్పు అనీ, మహాత్మా గాంధీ పిలుపు మేరకు తానే స్వచ్చందంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంటున్నాననీ ఎదురు జవాబు చెప్పారు తిలక్.

ఉద్యమాలను నీరు కార్చే, కౌన్సిలింగ్ లాంటి వ్యవహారాలు ఈనాటివి కావు అన్నారు తిలక్. తన జైల్‌ మేట్స్ మోతె-కార్వంచి లను కలెక్టర్ వేసిన ప్రశ్నలు దీనికో చక్కని ఉదాహరణ అని ఆయన అభిప్రాయం. ఇలా నీతులు చెప్పడం మన సంస్కృతిలో ఓ అంతర్భాగం అనీ, మన రక్తంలో అవి జీర్ణించుకుపోయాయనీ అంటూ, ఒకవేళ శేషాద్రి మాటలకు తాను లొంగిపోయి నట్లయితే తన ఆశయాలకు అంతటితోనే తిలోదకాలు ఇచ్చినట్లే కదా అన్నారు. పోరాట పటిమను, ఉద్యమాల స్పూర్తిని నీరు కార్చే ప్రయత్నం అనాది ఆచారమే అని గుర్తుచేసుకున్నారు తిలక్.

తిలక్‌ మేనమామ ఎల్. వి. ప్రసాద్‌ గారి తండ్రి అవధులెరుగని ఔత్సాహికుడు. ఏదో, ఎప్పుడూ చేయాలన్న తపన ఆయన గుణం. స్వగ్రామం నుండి తరలి వచ్చి, పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో సెటిలయ్యారు. అక్కడి, చల్లపల్లి జమిందారు గారికి చెందిన అటవీ భూమిని నరికించి వ్యవసాయం చేయించడంతో సహా పళ్ల తోటలు కూడా వేయించారు. ఆ రోజుల్లోనే పట్టు ఉత్పత్తి (సెర కల్చర్) ఆయన వ్యాపకాల్లో ఒకటి. తిలక్‌ గారి తల్లి ఆయన ఏకైక కూతురు. అందుకే, ఆమె గారి పేరు మీద కూడా ఓ పళ్లతోట వుంచారాయన. దెందులూరుకు సమీపంలో వున్న ఆ తోటకు వేసవి శెలవుల్లో నడచుకుంటూ వెళ్ళొస్తూ సరదాగా గడుపుతుండేవారిమని గుర్తుచేసుకున్నారు తిలక్.

ఏలూరు సబ్‌ జైల్లో వున్నప్పుడు, ప్రతి రోజూ ఉదయం తననూ, తోటి ఖైదీలను కొంత సేపు ఆరు బయటకు తీసుకొచ్చి తిప్పేవారట అధికారులు. ఆ రోజుల్లో ఎల్. వి. ప్రసాద్ గారి భార్య - తన మేనత్త, పెదమామ బస్వయ్య గారితో తనకు టిఫిన్ పంపేదట. ఎల్‌ వి గారి కుటుంబం ఏలూరులోనే కాపురం వుండేదారోజుల్లో. మద్రాసులో వుండగా, హెచ్. ఎమ్. రెడ్డి గారి వద్ద ఆయన తీసిన "హోనెస్ట్ రోగ్" అనే సినిమాకు పనిచేసిన అనుభవంతో, తానే స్వతంత్రంగా ఓ సినీ కంపెనీ స్థాపించే ప్రయత్నంలో తలమునకలై వున్న శ్రీ ఎల్. వి. ప్రసాద్ ఆ పనిమీద పలుచోట్లకు వెళ్లొస్తుండేవారు. "సత్యమే జయం" అనే తెలుగు నాన్‌ డిటేయిల్డ్ పుస్తకం ఆధారంగా నిర్మించిన చలన చిత్రం హోనెస్ట్ రోగ్.


మొత్తంమీద ఎల్. వి. గారెళ్లిన కొన్నాళ్లకు మద్రాసు చేరుకున్నారు తిలక్. సారధి బ్యానర్ క్రింద కె. ఎస్. ప్రకాశరావు గారు తన మోడల్ ప్రొడక్షన్స్ సంస్థ తరపున నిర్మిస్తున్న "గృహ ప్రవేశం" సినిమా దర్శకత్వం కూడా వహిస్తున్నారు శ్రీ ఎల్. వి. ప్రసాద్ అప్పట్లో. త్రిపురనేని గోపీచంద్ గారు ఆ సినిమా రచయిత.

మోడల్ ప్రొడక్షన్స్ తాలూకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ- "ప్రీమియర్ ఫిల్మ్స్"- ఒక దానిని నెలకొల్పారు అప్పట్లో, శ్రీ కోవెలమూడి భాస్కర్ రావుగారు. దాంతో సంబంధమున్న మరో ప్రముఖ వ్యక్తి రామనాధ బాబు. ఆయన చల్లపల్లి రాజా గారి బావమరిది. ప్రీమియర్ ఫిల్మ్స్ రెప్రజెంటేటివ్‌గా తరచూ ఆంధ్ర ప్రాంతంలోని వివిధ ప్రదేశాలకు వెళ్లవలసి వస్తుండేది తిలక్‌ గారికి. ఆ పని ఆయనకిష్టంలేదు. అయినా తప్పలేదు. అందుకే కొంతకాలమే అలా పనిచేశారు. రెప్రజెంటేటివ్‌గా తన తోడు తీసుకెళ్లిన సినిమా బాక్సుల్లో "వీర్‌కునాల్" అనే హిందీ సినిమా కూడా ఉన్నట్లు గుర్తు చేసుకున్నారాయన.

తన అభిరుచులకూ, ఆశయాలకూ అనుకూలంగా వున్న వ్యక్తులతో ఎక్కువ పరిచయం పెంచుకునే మనస్తత్వం తిలక్ గారికి - నాటికీ, నేటికీ. ఆ బాటలోనే ఎమ్. వి. రాజన్‌తో దోస్తీ కుదిరింది. అప్పటికే పేరు పొందిన సినీ ఎడిటర్ ఆయన. ఎల్.వి.గారికీ సన్నిహితుడు కూడా. ఆయన బ్యాచ్ కు చెందిన వ్యక్తి. గృహప్రవేశం సినిమాకు కూడా ఆయనే ఎడిటర్. హెచ్. ఎమ్‌. రెడ్డిగారితో కలిసి పనిచేశారు. ఎల్. వి. ప్రసాద్‌ గారు భక్త ప్రహ్లాద్ సినీ నిర్మాణం చేస్తున్న ఆ రోజుల్లో, రాజన్‌ గారితో సాన్నిహిత్యం పెంచుకుంటూ, ఎడిటింగ్ లైన్‌లో పట్టు సంపాదించుకునే ప్రయత్నాలు కొనసాగించారు తిలక్.

అందరికీ తెల్సిన విషయమే - భక్త ప్రహ్లాద్ తెలుగులో మొదటి టాకీ చిత్రం. ప్రసాద్ గారందులో నటించారు. మొదటి హిందీ టాకీ చిత్రమైన "ఆలమ్ ఆరా" తో కూడా ప్రసాద్ గారికి సంబంధముంది. భక్త ప్రహ్లాద్ రిలీజ్ అయిన రోజుల్లో ఏలూరులోని పాండురంగ థియేటర్‌లో తిలక్ ఆయన అమ్మమ్మగారి (ప్రసాద్‌గారి తల్లి) తో కల్సి సినిమా చూసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. అందులోని ఓ సన్నివేశానికి స్పందిస్తూ ఆమె గారు, తన కుమారుడికి నిజంగా ఏమన్నా జరుగుతున్నదో అన్న రీతిలో ఆందోళన చెందారని నవ్వుకున్నారు!

ఏదేమైనా తెలంగాణా ఉద్యమంతో తన ప్రత్యక్ష-పరోక్ష సంబంధాలను మాత్రం కొనసాగిస్తూనే ఉండేవారు తిలక్. ఆయన తన సహచరులతో కలిసి జైలు నుండి విడుదలై బెయిల్‌పై వస్తుండే ఉద్యమకారులను ఎగ్మూర్ రైల్వే స్టేషన్‌లో కలుసుకుని, ఇంకో కంటికి తెలియకుండా అజ్ఞాత వాసానికి-వారి వారికి నిర్దేశించిన స్థలాలకు తరలిస్తూండేవారు. ఎస్. వి. నరసయ్యగారు అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ కో ఆర్డినేటర్‌గా వుంటూ అజ్ఞాత కార్యకలాపాల వ్యవహారాలు నడపడానికి కాంటాక్టు పాయింట్ గా వుండే వారు.

అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు తిలక్. "పలనాడు వెలలేని మాగాణిరా..." అనే విప్లవ గీతంతో అనుబంధమున్న పల్లనాడు పులే పుల్ శివయ్య గారిని గురించి చెప్పారు. కమ్యూనిస్టు వుద్యమ ఆరంభంలోనే ఆయన వినుకొండలో ఇంటర్న్ ఖైదీ. కొంతకాలం కండెమ్డ్ సెల్‌లో ఖైదీ కూడా. జైల్లో వున్న రోజుల్లో రాయలసీమ కరువు గాథలు, కండెమ్డ్  సెల్ ఖైదీల వ్యధలు వ్రాశారు. అవన్నీ ఆయన తిలక్‌కు చెప్పడంతో సహా స్క్రిప్ట్స్ కూడ ఇచ్చారట. తన వద్ద అవన్నీ వున్నాయని వెలికి తీయాలని చెప్పారు తిలక్. పులే పుల్ శివయ్యగారు వార్థక్యం కారణంగా, అనారోగ్యం మూలాన్న అజ్ఞాత వాసంలో ఉండలేకపోయినప్పుడు, వేరే మార్గంలేక తిలక్‌గారి సహాయంతో ప్రభుత్వానికి లొంగిపోయారు.

పులే పుల్ శివయ్యగారు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖులు. రచనానుభవం, పుస్తకపఠనం ఆయన వ్యాపకాలుతిలక్‌గారు "భూమికోసం" చిత్ర నిర్మాణం చేస్తున్న రోజుల్లో ఆయన్ను వినుకొండలో కలిసి ఆయన ఆశీర్వాదం పొందారు. తిలక్ సన్నిహితంగా మెలిగిన మరో వ్యక్తి, తన ద్వారా అజ్ఞాత వాసంలోకి వెళ్లే ఏర్పాట్లు చేసిన అతను ప్రఖ్యాత అభ్యుదయ రచయిత కంభం పాటి సత్యనారాయణగారు. ఆయన రచన "కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర" పాపులర్ పుస్తకాల్లో ఒకటి

మరో వ్యక్తి కామ్రేడ్ మద్దుకూరి చంద్రశేఖరరావు గారు. ఆ రోజుల్లో మోహన కుమార్ మంగళం తండ్రి డాక్టర్ సుబ్బరాయన్ గారింట్లో ఆర్. పి. శాస్త్రిగారు అనే కమ్యూనిస్టు అభిమాని అద్దె కుండేవారు. తిలక్ గారు ఆయన్ను ఎరుగుదురు. ఓ సారి శాస్త్రి గారి కార్లో మద్దుకూరిని తీసుకుని, మద్రాసు నుండి బెంగుళూరు వెళ్లి, అక్కడి నుండి మారు పేర్లతో విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ స్టేట్‌లో కమ్యూనిస్టు పార్టీని నిషేధించారు అప్పట్లో. తన కాంటాక్ట్ వ్యక్తి కామ్రేడ్ గోళ్ల రాధాకృష్ణమూర్తికి అప్పగించారు తిలక్ అయన్ను.


ఆ రాత్రి తిలక్‌గారు బస చేసిన హోటల్ పేరు "పెర్సీస్" ఇప్పుడు ప్యారడైజ్ వున్న ప్రక్క స్థలంలో వుండేదట అది. హోటల్ గదిలో వున్న తిలక్ సిగరెట్ ఆగుతూ ఆర్పకుండా పడవేయటంతో తివాచికి అంటుకుని పొగలొచ్చాయి. కొంత సేపు గందరగోళం అయింది. ఎట్లా అయితేనేం.. ఆ మర్నాడు రైలులో బయలుదేరి మద్రాసు చేరుకున్నారు తిలక్ తన ప్రస్థానంలో మరో మలుపు వైపుగా .... (ఇంకా వుంది)

No comments:

Post a Comment