Monday, March 10, 2014

ఒక యోధుని నిష్క్రమణ:వనం జ్వాలా నరసింహారావు

ఆదివారం (9-3-2014)మరణించిన  వీర తెలంగాణా విప్లవ రైతాంగ
సాయుధ పోరాట యోధుడు పయ్యావుల లక్ష్మయ్య  స్మృతిలో

ఒక యోధుని నిష్క్రమణ
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (11-03-2014)

       వీర తెలంగాణా విప్లవ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఖమ్మం జిల్లా గోకినేపల్లి గ్రామానికి చెందిన పయ్యావుల లక్ష్మయ్య ఆదివారం నాడు ఖమ్మంలో మరణించారు (ఆంధ్ర జ్యోతి వార్త, మార్చ్ 10, 2014). పిన్న వయసులోనే తెలంగాణా సాయుధ పోరాటం వైపు ఆకర్షితుడైన లక్ష్మయ్యను నేను ఖమ్మం వెళ్లినప్పుడల్లా వీలుంటే కలిసే వాడిని. అలాంటి సందర్భాలలో ఒకసారి ఆయనను కదిలించగా, తన గత స్మృతులను నెమరేసుకున్నారు. అందులో చాలా భాగం సాయుధ పోరాటం గురించే. ఐదేళ్ల పాటు సాగిన వీర తెలంగాణా విప్లవ రైతాంగ సాయుధ పోరాటం భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక మైలు రాయి-కీలకమైన ఒక మలుపు రాయి. పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య లాంటి మహానుభావులు అలనాటి సాయుధ పోరాట వివరాలను ఎంత సవివరంగా గ్రంధస్థం చేసినా, పోరాటంలో పాల్గొన్న ప్రతివారిని గురించి పేర్కొనడం సాధ్యమయ్యే పనికాదు. అంతమాత్రాన చరిత్ర పుటల్లోకి ఎక్కనివారి పాత్రను తక్కువగా అంచనా వేయనూలేము. అరవై మూడేళ్ల క్రితం, అక్టోబర్ 21, 1951న సాయుధ పోరాటం ఉపసంహరించబడింది. అలనాటి సాయుధ పోరాటంలో కీలక పాత్ర వహించిన పయ్యావుల లక్ష్మయ్య, అప్పటి విషయాలను వివరిస్తుంటే, కళ్లకు కట్టినట్లే అనిపించింది.  

సాహసాలు చేయాలనిపించే వయసులో, తప్పొప్పుల విశ్లేషణ చేయాలన్న ఆలోచనే రాని వయసులో, సాయుధ పోరాట ఉద్యమంలో దూకిన పయ్యావుల లక్ష్మయ్య, తనను నిర్బంధించిన నిజామాబాద్ జైలు నుంచి పారి పోదామని నిర్ణయించుకున్నాడు. నలుగురు చేతులు కలిపారు. జైలు కిటికీ వూచలు కోసి, ఐదారు ధోవతులు కలిపి కట్టి, బయట అందుబాటులో వున్న గుట్ట మీద చెట్టును ఆధారం చేసుకుని బయట పడ్డారు. సొంత గ్రామం గోకినేపల్లికి చేరుకున్నారు. తననెవరూ వూళ్లో గుర్తుపట్టరనుకున్న లక్ష్మయ్యతో ఒక పోలీసు అధికారి స్నేహం నటించి మళ్లీ పట్టించే లోపల, అది పసికట్టిన మరో విప్లవ వీరుడు మచ్చ వీరయ్య, రామాచారి అనే ఆ పోలీసు అధికారిని కాల్చి చంపాడు. అలాంటివి ఎన్నో జరిగాయని, ఒక్కొక్కసారి ఉద్యమంలో తప్పులు కూడా దొర్లి అమాయకులు బలైపోయారని అన్నారు లక్ష్మయ్య ఆ నాటి సంఘటనను గుర్తుచేసుకుంటూ. క్రమేపీ ఉద్యమం తీవ్రమైంది.

మైదానంలో రక్షణ లేదని భావించి, లక్ష్మయ్య ప్రభృతులు, ఇల్లెందు అడవుల్లోకి పోయారు. అప్పటికే యూనియన్ సైన్యాలు రంగ ప్రవేశం చేశాయి. వాళ్ల శిక్షణ అపారమైంది. అడవుల్లోకి, గుట్టల్లోకి వీరిని గాలించుకుంటూ వచ్చారు. మిలిటరీ ధాటికి తట్టుకోలేక ఎక్కడివారక్కడే విడిపోయారు. మొదట్లో ఐదు గురితో ఏర్పాటైన దళాలు, క్రమేణ ముగ్గురితో, ఇద్దరితో కుదించడం జరిగింది. మొండిగా ఉద్యమం సాగించారు. ఉద్యమం కొనసాగించడం సరైందా, కాదా-ఆపాల్నా, వద్దా అన్న మీమాంసలో తన లాంటి వారున్నప్పటికీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు మాత్రం, అడవుల్లో దళాలను అంటిపెట్టుకుని ముందుకు సాగేవారు. బసవ పున్నయ్య, చండ్ర రాజేశ్వర రావులు మాత్రం ఎక్కడున్నారో తనకు తెలియదని అన్నారు లక్ష్మయ్య. అప్పట్లో ఆయన పాలేరు ప్రాంతం ఇన్-చార్జ్ గా పనిచేశారు. నేలకొండపల్లి సమీపంలోని మూటా పురానికి చెందిన బాగం వీరయ్య రైఫిల్ పోగొట్టుకుని చిత్రహింసలకు గురై కూడా రహస్యాలు బయటపెట్టని విషయం వివరించారు లక్ష్మయ్య.


చకిలం శ్రీనివాస రావు కార్యదర్శిగా వున్న దళంలో (ఏరియా కమిటీ) భీమిరెడ్డి నరసింహారెడ్డి (పార్లమెంట్ మాజీ సభ్యుడు), మచ్చా వీరయ్య, చిర్రావూరి లక్ష్మీనరసయ్య (ఖమ్మం మాజీ మునిసిపల్ చైర్మన్) వుండేవారు. ఒక సారి జరిగిన దాడిలో లక్ష్మయ్య వారినుంచి చీలి, హుజూర్ నగర్ దళంలో కలిశాడు. అక్కడ "సాహసికుడు" అన్న పేరున్న మేదరమెట్ల సీతారామయ్య, నిజామాబాద్ జైలునుంచి తనతో పాటు పారిపోయి వచ్చిన వంకాయలపాటి కృష్ణయ్య కలిశారు. సీతారామయ్య ధైర్య సాహసాలను గుర్తుచేసుకుంటూ, ఒకసారి అడవి దేవులపల్లి-దేవరకొండ ప్రాంతంలో పోతున్నప్పుడు, తమను నిర్భంధించడానికి వస్తున్న గూర్ఖాలను పసిగట్టి ఎలా వెనుక దెబ్బతీసింది వివరించారు లక్ష్మయ్య.

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు పోలీసు స్టేషన్ మీద దాడి చేసేందుకు ప్రణాళిక తయారుచేయమని లక్ష్మయ్యను పార్టీ ఆదేశించింది. పెనుగంచిప్రోలులో వున్న, సహచర ఉద్యమకారుడు వంకాయలపాటి దూరపు బంధువులను కలుపుకుని అవసరమైన సమాచారాన్ని సేకరించారు. మేదరమెట్లను, మరొకరిని కలుపుకుని, నలుగురు స్టేషన్ పై దాడికి ప్రణాళిక వేసుకున్నారు. పొగాకు అమ్మే బేర గాళ్ల వేషంలో వూళ్లోకి సాయంత్రం ఎనిమిది గంటలకు చేరుకున్నారు. వూరి బయట పొగాకు పరిచి, తరాజులు పెట్టి అమ్మకాలు మొదలెట్టారు. జనసంచారం తగ్గిన తర్వాత ముసుగులు ధరించి, వెంట తెచ్చుకున్న తుపాకీలు పట్టుకుని పోలీసు స్టేషన్ పై దాడి చేశారు. దాడికి వచ్చింది కేవలం నలుగురే అని తెలియని పోలీసులు భయంతో, లోనికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. వెంటిలేటర్ల నుంచి బయటున్న వీరు కాల్పులు చేయడంతో లోపలున్న పోలీసులు గాయపడి చేతులెత్తి లొంగిపోయారు. బయట కొచ్చిన ఒక్కొక్కరిని బంధించారు వీళ్ళు. వాళ్ళ దగ్గరున్న 14 తుపాకీలను కట్టకట్టి, మోయలేక, అతి కష్టం మీద ఊరి బయటకు చేర్చారు. అప్పటికి అక్కడున్న రాతి బావిలో పడవేసి, తర్వాత తీసుకున్నారు.

వారి మీద అడుగడుగునా పోలీసు కాపలా వుండేదట. తుపాకీలను బావిలో పడవేసిన సంగతి, వీరిపై కాపలా వుంచిన ఒక యానాది వ్యక్తి పసిగట్టి, లక్ష్మయ్య దగ్గరే కూపీ లాగి, సమీపంలోని ఇందుమల్లి పోలీస్ స్టేషన్‌కు చేరవేశాడు. ఈ అవరోధాల మధ్య, సానుభూతి పరుల సహాయం లభించేది. ఒక సారి ఈయన దళాన్ని వంద మంది పోలీసులు చుట్టుముట్టారు. సమీపంలోని జొన్న చేలలో, చుట్టూతా తుపాకీల పహరా మధ్య తప్పించుకునే ప్రయత్నంలో వుండగా, తోటి ఉద్యమకారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని సమీపిస్తున్న లక్ష్మయ్యకు దండం పెట్టి, తాను పోలీసులకు చిక్కక ముందే చంపమని ప్రాధేయ పడ్డాడు. అతడిని భుజంపై వేసుకుని ఎలాగోలా లక్ష్మయ్య తప్పించుకోగలిగాడు. జొన్న చేలు దాటి, మరో దళానికి చెందిన సభ్యుడొకరిని, దొడ్డా నరసయ్య గ్రామం దగ్గరున్న చిలుకూరు సమీపంలో కలిశాడు లక్ష్మయ్య. ఒకరినొకరు క్షణకాలం అనుమానించినా కలిసిపోయారు. గాయపడిన సహచరుడిని, సుదూరంలో కనిపిస్తున్న గుర్రానికి కట్టి తీసుకెళ్దామని భావించారు. అయితే, ఆ గుర్రం సహాయంతోనే మరో సహచరుడు వంకాయలపాటి కృష్ణయ్య రావడం గమనించారు. మొత్తం మీద అందరూ కలిసి, చిలుకూరు నుంచి గొర్రగూడెం అడవులకు చేరుకున్నారు. అక్కడే హుజూర్ నగర్ దళం పని చేస్తున్నది. అప్పటికే, ఖమ్మం దళం కంటే పటిష్టంగా, నిర్మాణాత్మకంగా పనిచేస్తున్న హుజూర్ నగర్ దళం, కాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నది.

పయ్యావుల లక్ష్మయ్యను కల్వకుర్తి జోనల్ కమిటీ కార్యదర్శిని చేసింది పార్టీ. సరిగ్గా అదే రోజుల్లో, ఉద్యమంతో బాగా అనుబంధమున్న ఒక సీనియర్ కార్యకర్తను అరెస్టు చేసింది ప్రభుత్వం. అతడు పోలీసు ఇన్ ఫార్మర్ గా మారిపోయాడు. మోసం చేయసాగాడు. గుట్టల్లో దళం సభ్యులను కలిసి, పాత పరిచయాలతో వారినుంచి సమాచారం సేకరించి, పోలీసులకు చేరవేయ సాగాడు. వాడి విషయం కనిపెట్టలేని లక్ష్మయ్య ప్రభృతులు అతడిని గౌరవంగా చూసేవారు. చివరకు వాడిని తమ దగ్గర నుంచి, ఎల్. బి. గంగాధర రావు సారధ్యంలోని కేంద్రానికి పంపారు. ఆ దళంలో, కొండన్న అనే మాజీ సైనికాధికారి సభ్యుడుగా వుండేవారుకొండన్నగా దళంలోకి చేరిన తర్వాత పేరు మార్చుకున్న ఆయన అసలు పేరు మేజర్ జైపాల్ సింగ్ అనీ, అతడు ఆర్మీలో కరియప్పంతటి స్థాయిగల సైనికాధికారి అని లక్ష్మయ్య చెప్పారుఅతను వీడి విషయం పసిగట్టాడు. అది గ్రహించిన ఇన్ ఫార్మర్ జరగబోయేది ఊహించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. పార్టీకి, ఉద్యమానికి ద్రోహం చేశానని ఉత్తరం రాసి, ఉరేసుకుని చనిపోయేందుకు సిద్ధమయ్యాడు. అయితే వాడికి ఆ అవకాశం ఇవ్వకుండా గొడ్డలితో నరికి చంపారని, ఆ సంఘటన మీద పార్టీలో చాలాకాలం చర్చ జరిగిందని, తప్పొప్పుల బేరీజు వేసుకోవడం కూడా జరిగిందని గుర్తుచేసుకున్నారు లక్ష్మయ్య. ఏదేమైనా చరిత్ర మటుకు ముందుకు సాగింది.

కమ్యూనిస్టు పార్టీలో రెండు వర్గాలున్న విషయం ప్రస్తావించారు లక్ష్మయ్య. ఒకటి సుందరయ్య వర్గం కాగా, మరొకటి రావి నారాయణరెడ్డి వర్గం. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనమైన తర్వాత, తెలంగాణా సాయుధ పోరాటం కొనసాగించడమంటే, అది నెహ్రూ ప్రభుత్వాన్ని కూల దోయడానికి జరిగే కుట్రగా ప్రచారం మొదలైంది. యూనియన్ సైన్యాలు నిజాం సంస్థానంలో ప్రవేశించిన మరుక్షణం నుంచే, తెలంగాణా సాయుధ పోరాటాన్ని ఖండించే వర్గం మొదలైంది. తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించుతున్న నాయకత్వం లోని చండ్ర రాజేశ్వర రావు, మాకినేని బసవ పున్నయ్య, మద్దుకూరి చంద్రశేఖర రావు, పుచ్చలపల్లి సుందరయ్య అక్టోబర్ 20, 1951 న సమావేశమై, పోరాటాన్ని ఉపసంహరించుకోవడం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. నిర్ణయాన్ని అక్టోబర్ 21, 1951 న ప్రజలకు, పత్రికలకు విడుదల చేయడం రేడియోలో ప్రసారం చేయడం జరిగింది. ఈ నేపధ్యంలో పయ్యావుల లక్ష్మయ్య ప్రభృతులు, వారిలాంటి చాలామంది కార్యకర్తలు అజ్ఞాత వాసంలో వుంటూ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.

పోరాట విరమణ నిర్ణయాన్ని, దాని వెనుక వున్న భావాన్ని కింది స్థాయి కార్యకర్తలు అర్థం చేసుకోలేక పోయారంటారు లక్ష్మయ్య. పోరాట విరమణ కార్యక్రమం ఉద్యమ కారులకు వివరించడానికి లక్ష్మయ్య జోనల్ కమిటీ కార్యదర్శిగా వున్న కల్వకుర్తి జోన్ ను ఎంపిక చేసింది పార్టీ నాయకత్వం. పుచ్చలపల్లి సుందరయ్య అక్కడ కొచ్చి సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన వెంట వచ్చిన ఒక ప్రముఖ ఉద్యమ నాయకుడు (దరిమిలా ఆయన సీపీఐ లోను, ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ లోను పని చేశారు) సుందరయ్య గారి సమక్షంలో, "ఎప్పుడో పోరాటం విరమించాల్సింది" అని వ్యాఖ్యానించడంతో, అక్కడున్న వారంతా ఆయన్ను తప్పుబట్టి ఎదురు తిరిగారట. పోరాట విరమణ నిర్ణయాన్ని వివరించిన సుందరయ్య, "ఆత్మ రక్షణ కొరకు పోరాటం కొనసాగిస్తే తప్పులేదు" అన్న మాటలను లక్ష్మయ్య బృందం సరిగ్గా అవగాహన చేసుకోలేక పోయింది. "చంపవద్దు" అన్న మాట అర్థమయినా, ప్రభుత్వంతో తుపాకీల అప్పగింత విషయంలో చర్చ లింకా జరుగుతున్నాయని సుందరయ్య అనడాన్ని, ఆత్మ రక్షణ కొరకు వాటిని వాడుకోవచ్చని భావించారు.

సాయుధ పోరాటం కొనసాగుతున్న రోజుల్లో, ఇంకా తుపాకీలు అప్పచెప్పకముందు, పయ్యావుల లక్ష్మయ్య దళంలో పనిచేసిన వారిలో బూర్గుల రామకృష్ణా రావు గారి బంధువు హనుమయ్య ఒకరు. విద్యాధికుడైన హనుమయ్య, డాక్టర్ పరాంజిపే దగ్గర వైద్యం నేర్చుకున్నాడు. ఆత్మ రక్షణ కొరకు ఆయుధాలింకా ఉపయోగిస్తున్న తరుణంలో, ఒకానొక సందర్భంలో హనుమయ్యను నిర్భంధించినప్పుడు, ఆ గ్రామ పటేల్ ఆయనను కాపాడి నందువల్ల పోలీసులు అతడిని చిత్రహింసలు పెట్టిన సంగతిని గుర్తుచేసుకున్నారు లక్ష్మయ్య.

ఎప్పుడో ఒకప్పుడు సాయుధ పోరాటం వస్తుందని సుందరయ్య నమ్మేవారని, అందుకే, ఆయన మార్గాన్ని అనుసరించే తన లాంటి వారెందరో, తుపాకీల అవసరం తప్పక రావచ్చని భావించామని ఆనంద భాష్పాల మధ్య, వ్యక్తపరచలేని సుందరయ్య గారి మీదున్న అభిమానం మధ్య పేర్కొన్నారు. నందికొండ ప్రాజెక్టు కింద మునిగి పోయిన స్థలంలో, ఇప్పుడు సాగర్ జలాలు ప్రవహిస్తున్న అలనాటి ప్రాంతంలో, ఒక గుర్తు ప్రకారం తామంతా ఆయుధాలు దాచిపెట్టామని, అవి ఎప్పుడో ఒకప్పుడు భావి తరాల ఉద్యమకారులకు దర్శనమిస్తాయని, అపారమైన నమ్మకంతో, పయ్యావుల లక్ష్మయ్య అంటుంటే, ఆయన నమ్మకానికి జోహార్లు అనాలనిపించింది.


ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి, చీలిక తర్వాత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీకి ఎనలేని సేవలందించిన అలనాటి వీర తెలంగాణ విప్లవ పోరాట యోధుడు పయ్యావుల లక్ష్మయ్యను, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణ మీద సీపీఎం నుంచి బహిష్కరించడం కడు బాధాకరమైన విషయం. విప్లవ యోధులను గౌరవించడమంటే ఇదేనని సోదాహరణంగా చూపించింది సీపీఎం. లక్ష్మయ్య లాంటి "తెలుగు సోమనాథ్ ఛటర్జీ" లు ఖమ్మం జిల్లాలో చాలామంది కనిపిస్తారు మనకు. వారిలో చాలామంది నుంచి ఇలాంటి గాధలెన్నో వినవచ్చు. ఇంత జరిగినా పార్టీ మీదున్న అభిమానాన్ని, గౌరవాన్ని అణు మాత్రం కూడా వదులుకోలేని లక్ష్మయ్య, ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, తనను చూసేందుకు వచ్చిన వారితో, పార్టీతో-విప్లవంతో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకునేవారు. ఆయన మరణంతో, పాత కాలం నాటి మరో మహనీయ విప్లవ యోధుడు అంతరించినట్లయింది.

2 comments:

  1. "పయ్యావుల" is it Telangana surname? or Rayalasema surname.

    ReplyDelete
  2. Surnames are similar in all the regions in some cases

    ReplyDelete