Friday, March 21, 2014

సారథీ స్టూడియో నిర్మాణం (కె. బి. తిలక్ అనుభవాలు-జ్ఞాపకాలు):వనం జ్వాలా నరసింహారావు

సారథీ స్టూడియో నిర్మాణం
కె. బి. తిలక్ అనుభవాలు-జ్ఞాపకాలు
వనం జ్వాలా నరసింహారావు

క్రమేపీ తిలక్‌ వ్యాపకాలు పెరగ సాగాయి. ఆ కారణాన ప్రసాద్‌ గారింట్లో వుండటం కన్నా వేరే చోట వుండటం మంచిదన్న అభిప్రాయంతో ఓ అద్దె ఇల్లు కూడా తీసుకున్నారాయన. దాంతో పాటే సి. వి. వి. ఆర్. ప్రసాద్, ఎస్. వి. నర్సయ్య గార్లతో సంబంధాలు వృద్ధి చేసుకోవడం, అందరూ కలిసి అభ్యుదయ భావాలున్న కళాకారుల బాగోగులు గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. "సారథీ ఫిల్మ్స్" వ్యవహారం గురించి ఇంతకు ముందే కొంత వరకు తెలుసుకున్నాం గదా. చల్లపల్లి రాజాగారి సోదరుడు, రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలోకి - కారణాలు ఏవైతేనేమి - ఆ సంస్థ వెళ్లింది.

అప్పట్లో ప్రజా నాట్య మండలికి చెందిన సి. వి. వి. ఆర్ ప్రసాద్, ఎస్. వి. నర్సయ్య గార్లు, అభ్యుదయ భావాలకు ఆకర్షితులైన అనేక మంది కళాకారులను ఓ వేదిక పై తీసుకు వచ్చే ప్రయత్నం చేసేవారు. శాంతినికేతన్‌లో విద్యనభ్యసించి సినీరంగంలో టెక్నీషియన్‌గా కెమేరా ఫీల్డ్ లోకి ప్రవేశించిన ప్రసాద్‌ గారు చాలా మందికి పరిచయస్తులే. శాంతినికేతన్ నుండి బొంబాయి వెళ్లడం వలన అక్కడ సి. వి. వి. ఆర్‌కు ఎల్. వి. గారితో కూడ పరిచయం అయింది. అభ్యుదయ కళాకారులందరూ ఓ వేదికపై ఎందుకు జమకూడారో కాని ఆ రోజుల్లో జరిగిన ఆ కలయిక భవిష్యత్ సినీరంగ అభివృద్ధిలో ఓ కీలకమైన ఘట్టానికి పరోక్షంగా అతి ముఖ్యమైన మైలు రాయిగా మిగిలి పోయింది.

సారథి ఫిల్మ్స్ బ్యానర్ క్రింద ఐక్య వేదిక వేర్పాటు చేసుకున్న కళాకారుల తొలి ప్రయత్నం  "అంతా మనవాళ్లే" అనే చిత్ర నిర్మాణం. సహకార వ్యవస్థ - సహకార ఉద్యమం ప్రధాన ఇతివృతంగా తీసిన ఆ చిత్రానికి కథా రచయిత శ్రీ కొండేపూడి లక్ష్మి నారాయణ. అంతా మనవాళ్లే సినీ దర్శకుడిగా పూర్తిగా కాకపోయినా ఆయన కనుసన్నలలోనే - ఆధ్వర్యంలోనే ఈ సినీ నిర్మాణం జరిగిందనే భావన (పేరు పొందిన దర్శకుడైనందున) ప్రేక్షకుల్లో కలగాలనే ఉద్దేశ్యంతో శ్రీ ఎల్. వి. ప్రసాద్ గారి పేరు వాడుకునేందుకు రామకృష్ణ ప్రసాద్ ఆసక్తి కనబర్చారు అప్పుడు ప్రథమంలో. దానికి కారణం ఇంకోటి కూడా ఉంది.

కలిసి ఉన్న రోజుల్లో ఎల్. వి. ప్రసాద్‌ గారి దర్శకత్వం లోనే సారథి ఫిల్మ్స్ సినిమాలు తీసేవారు. అయితే, అభ్యుదయ భావాల కుర్ర కారు నుండి ఎల్. వి. పేరు వాడుకోవడానికి తగినంత మోతాదుల్లో వ్యతిరేకత వ్యక్తమయింది. అలా వ్యతిరేకించిన వారిలో ముందున్న వ్యక్తి శ్రీ తాపీ చాణక్య. ఈయన తాపీ ధర్మారావు గారి మూడో కుమారుడు. చివరకు ఆయనే చిత్ర దర్శకులయ్యారు. ప్రఖ్యాత దర్శకులుగా తెలుగు సినీరంగ ప్రేక్షకులకు ఆయన సుపరిచితులే.


ఇదిలా ఉండగా, నేపధ్యంలో కథ నడిపిస్తున్న తిలక్‌ గారికి, ఎక్కడా ఎటువంటి స్పర్థలుండకూడదనే ఆలోచన కలగడంతో ఆ సమస్యకి పరిష్కారం కుదిరింది. పరిష్కార దిశగా వారు లేవనెత్తి-చర్చించి, రాజీ కొచ్చిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎల్. వి. ప్రసాద్ ఎటూ తెగ బిజీ మనిషి కాబట్టే, ఆయన తన పూర్తి కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ సెట్స్ పై గడపలేరు. ఆయన బిజీ కారణాన సినీ నిర్మాణం జరగడంలో జాప్యం కావటం అంత మంచిది కాదు. జాప్యం మూలాన క్రియేటివిటీ దెబ్బ తినకూడదు. వీటన్నిటికి తోడు రామకృష్ణ ప్రసాద్ గారు తాను లోగడ ఎల్. వి. గారి కిచ్చిన డబ్బు మళ్ళీ వెనక్కు తీసుకోవడం ఆచరణ యోగ్యం కాదు కూడా. చివరకు, ఇవన్నీ చర్చించి, తిలక్‌ గారు తన మేనమామ గారిని ఓ కోరిక కోరారు. తాము తీయదల్చిన సినిమా స్టోరీ లైన్‌ను వినమనీ, ఆయన పేరు ఉపయోగించుకున్నా, లేకపోయినా అభ్యుదయ భావాలున్న వారందరు కలిసి చేస్తున్న ప్రయత్నాలను ఓ గొప్ప వ్యక్తిగా ప్రోత్సహించమనీ అడిగారు. అందుకాయన అంగీకరించడంతో తెలుగు చలన చిత్ర రంగ అభివృద్ధిలో ఎన్నెన్నో ఫిల్మ్స్ సంస్థలు నెలకొనడానికి బాటలు వేసిన ఓ మహామనిషిగా ఎల్. వి. ప్రసాద్‌ గారు మిగిలిపోయారు.

ఆ సినిమా ఎడిటర్ శ్రీ కె. బి. తిలక్. ఆయనకు అదో అనుభూతి. "అంతా మనవాళ్లే" చిత్ర నిర్మాణం మరో అధ్యాయానికి ఆరంభమే కాని అంతం కాదు. ఆ తర్వాత ఆ బృందం సారథి బ్యానర్ క్రింద తీసి, తెలుగు చలన చిత్ర రంగంలో మరో మలుపు మైలు రాయిని వేసిన మేటి చిత్రం "రోజులు మారాయి". తాపీ ధర్మారావు - కొండేపూడి లక్ష్మీనారాయణల కలం నుండి తెలంగాణోద్యమ ప్రభావం ప్రస్పుటించే కథగా వెలువడిందా చిత్రం. బంజరు భూముల సమస్య ప్రధాన ఇతివృత్తం. కొసరాజు రచించిన "ఏరువాకా సాగేరోరన్నా... చిన్నన్నా... నీ కష్టమంతా తీరే..." అనే ఆ సినిమాలోని పాట నాటి నుండి నేటి వరకూ పల్లె ప్రజలకు మళ్లీ మళ్లీ వినాలని పించే పాట. వారు పాడుకుంటూ పనిచేసే పసందైన పాట.

హిందీ చలన చిత్ర రంగాన్ని దశాబ్దాల తరబడి కథానాయికగా శాసించిన వహీదా రెహ్మాన్ "రోజులు మారాయి" సినిమా ద్వారానే సినీరంగ ప్రవేశం చేసారు. సినీ దర్శకుడు శ్రీ తాపీ చాణక్య ఎడిటర్ శ్రీ తిలక్, డాన్స్ డైరెక్టర్ శ్రీ వెంపటి సత్యం, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వేణు (ప్రఖ్యాత సినీ కళాకారుడు శ్రీ భానుచందర్ తండ్రి) రోజులు మారాయి సినిమా కథానాయకుడిగా శ్రీ అక్కినేని నాగేశ్వరరావు, నాయికగా శ్రీమతి జానకి నటించారు. శ్రీ సి. ఎస్. ఆర్తదితరులు కూడా నటించారు.

ఈ సినిమాకు కూడా ఎడిటర్‌గా పనిచేసిన శ్రీ తిలక్ ఆ రంగంలో నిలదొక్కుకోవడమే కాకుండా మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. రోజులు మారాయి శత దినోత్సవ వేడుకలు హైదరాబాద్ నగరంలో ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌కు తెలుగు చలన చిత్రరంగం తరలి రావడానికి, ప్రప్రథమంగా సినీ స్టూడియో నిర్మాణం జరగడానికి ఆ శత దినోత్సవ వేడుకలు వేదికయ్యాయి. అదో చారిత్రక సంఘటన అని అంటారు తిలక్.

నాటి రాష్ట్ర మంత్రి స్వర్గీయ కొండా వెంకట రంగారెడ్డి ఆ వేడుకలకు ముఖ్య అతిధిగా వచ్చి, సాహితీ సంస్కృతీ రంగాల అభివృద్ధికి చలన చిత్రరంగ ప్రముఖులు అగ్ర భాగాన నిల్చి తోడ్పడాలని తమ ఉపన్యాసంలో సందేశమిచ్చారు. తదనుగుణంగానే రోజులు మారాయి సినిమా యూనిట్‌కు చెందిన ప్రముఖులందరూ కలిసి కట్టుగా ఆలోచించి హైదరాబాద్ నగరంలోకి "సారథీ స్టూడియో" స్థాపనకు ప్రయత్నాలు ప్రారంభించారు.   అచిరకాలంలోనె ఆది కార్యరూపం దాల్చింది. అమీర్‌పేటలో స్టూడియో వెలసింది.

సారథీ స్టూడియో నిర్మాణం కొరకు స్థలం కావాలని ఆ రోజుల్లో ప్రభుత్వాన్ని అర్ధించలేదు దాని యజమానులు. ప్రయివేటు వ్యక్తుల వద్ద నుండి కొనుగోలు చేసిన భూమిలోనే స్టూడియో నిర్మాణం జరిగింది. స్టూడియో వున్న అమీర్‌పేట ప్రాంతానికి రెండు మూడు మైళ్ల దూరంలో ఉన్న ఖైరతాబాద్ సమీపంలో సారథీ యూనిట్ కళాకారులందరూ నివసించడానికి ఇళ్ల స్థలాలు కొనుక్కునే ఏర్పాటు చేసారు. అలా కొన్న స్థలంలో నిర్మించిన ఇంట్లోనే ఇప్పటికీ నివాసముంటున్నారు శ్రీ సి. వి. వి. ఆర్. ప్రసాద్.

ఇదే సారథీ స్టూడియోలో విశ్వవిఖ్యాత "నటసార్వభౌములు", "నటసామ్రాట్టులు", "పద్మశ్రీ" లుగానూ, "పద్మభూషణ్" లు గానూ గౌరవ పురస్కారం అందుకున్న నటీనటులెందరో, ఎన్నో చిత్రాల్లో నటించడానికి షూటింగ్‌లో ఎన్నో సార్లు పాల్గొన్నారు. వీరిలో ఎన్టీ ఆర్, అక్కినేని, భానుమతి... ఇలా వ్రాసుకుంటూ పోతే అందరూ ఉన్నారు.

కాకపోతే ఆ తర్వాతికాల గమనంలో.... సినీ కాల గమనంలో - ఎవరికి వారే వేరై ఎవరి "సినీ కుంపటి" వారే పెట్టుకుని పరోక్షంగానో, ప్రత్యక్షం గానో సినీరంగ అభివృద్ధికి కృషి చేసారు. స్వర్గీయ కొండా వెంకట రంగారెడ్డి ఆశయం నెరవేరిందనే చెప్పుకోవాలి. సారథీ యూనిట్ పరిణామ క్రమంలో ఇలా పురోగమిస్తుంటే, అదే స్పీడ్‌లోనూ, ఒక్కొక్కసారి అంత కంటే కొద్ది తేడాలోనూ మరిన్ని సంస్థలు వెలిశాయి. వాటిలో ప్రముఖమైనవిగా చెప్పుకోవాలంటే పీపుల్స్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్, ప్రసాద్ ప్రొడక్షన్స్, నవయుగ ప్రొడక్షన్స్.. తిలక్‌గారి అనుపమ ఫిల్మ్స్.

పీపుల్స్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ వారి తొలి చిత్రం "పల్లెటూరు". తాతినేని ప్రకాశరావు గారు దర్శకుడుగా సినీరంగ ప్రవేశమయిన ఆ చిత్రంలో కథానాయకుడు శ్రీ ఎన్టీ రామారావు కాగా, శ్రీమతి సావిత్రి కథానాయిక పాత్ర పోషించారు. కథా రచయితలు సుంకర-వాసిరెడ్డి. కొడవటి గంటి కుటుంబరావు గారికి కూడా ఆ చిత్రంతో అనుబంధముంది. తాతినేని గారు మాత్రం అప్పటి వరకూ ఎల్. వి. గారికి అసిస్టెంట్‌గా మాత్రమే వుంటూ వుండేవారు. అదే విధంగా డాక్టర్ గరికపాటి రాజారావు (ఆయన పజానాట్య మండలి ముఖ్యుల్లో ముఖ్యుడు) గారు స్థాపించిన మరో ప్రోగ్రెసివ్‌ సంస్థ "రాజా ఆర్ట్స్" జమున కథానాయికగా తీసిన చిత్రం "పుట్టిల్లు". దీనికి ప్రోత్సాహం - సహాయ సహకారం అందించింది నెల్లూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టరు రాము. ఆయనే స్వర్గీయ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యగారి సోదరుడు స్వర్గీయ పుచ్చల పల్లి రామచంద్రారెడ్డిగారు. ప్రజా వైద్యుడిగా ఆయన్ను ఇప్పటికీ నెల్లూరు ప్రజలు గుర్తుచేసుకుంటుంటారు.  


అభ్యుదయ భావాలు, అభ్యుదయ భావాల వేదికలు భారత స్వాతంత్ర్య సమరంలోనూ, తెలంగాణ విమోచన ఉద్యమాలలోనూ ఆ తర్వాత మరికొంతకాలం వరకూ కూడా యువతను ఎంతగానో ఆకర్షించాయి. ఆ యువతను, కమ్యూనిస్టులు గానూ, సోషలిస్టులు గానూ, కాంగ్రెసు పార్టీలో అతివాదులు గాను మలిచాయి. అంత మాత్రాన వారంతా ఆ భావాలకే జీవితాంతం కట్టుబడి వున్నారని చెప్పడానికి వీల్లేదని అంటారు తిలక్. కారణాలు ఎమైతేనేమి.. ఏదో వ్యాపకం పేరుతో .. వారిలో పలువురి భావాలు "అభ్యుదయమే" అయినప్పటికీ.. ఆశయాలు మంచివే అయినప్పటికి - ఆచరణలో మాత్రం "అంతస్తులు" పెంచుకునే వ్యవస్థలోకి లాగాయంటారు తిలక్. కాల మహిమా? సినీ ప్రభావమా? తన్నుతానే ప్రశ్నించుకున్నారు శ్రీ కె. బి. తిలక్.

No comments:

Post a Comment