Monday, July 27, 2015

విశ్వ నగరంగా భాగ్యనగరం:వనం జ్వాలా నరసింహారావు

విశ్వ నగరంగా భాగ్యనగరం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (28-07-2015)
          భాగ్యనగరంగా పిలువబడే  తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ 1591లో మహ్మద్‌ కులీకుతుబ్ షా నిర్మించాడు. ఈ నగరానికి 400 ఏళ్ల కు పైగా చరిత్ర ఉంది. నగర చరిత్రకు చార్మినార్, గోల్కొండ కట్టడాలు మకుటాయమానం. 1948 సైనిక చర్య తర్వాత హైదరాబాద్ భారత దేశంలో అంతర్భాగమైంది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలుగా ప్రసిద్ధికెక్కాయి. ప్రస్తుతం నగరం గ్రేటర్ హైదరాబాద్‌గా విస్తరిస్తోంది. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, సాంకేతికంగా శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ముఖ్యంగా ఐటీ హబ్‌గా వర్థిల్లుతోంది. ఇబ్రహీం హుస్సేన్ సాగర్‌ను నిర్మించి ప్రజలకు మంచి నీటి సౌకర్యం కల్పించాడు. మూసీ నదిలో కలిసే మూడు చిన్న చిన్న ఏరులకు అడ్డకట్ట (టాంక్‌బండ్) వేయించడంతో ఈ సరస్సు ఏర్పడింది. దీని పేరు దాని నిర్మాత అయిన ఇబ్రహీం పేర ఇబ్రహీం సాగర్‌గానే కుతుబ్‌షాహీ రికార్డుల్లో వుందట. అయితే, దాని నిర్మాణానికి రూపకల్పన చేసి దానిని అమలు పరచడంలో ప్రముఖపాత్ర వహించిన హుస్సేన్‌ షా వలి పేరు మీద హుస్సేన్‌సాగర్ గా ప్రసిద్ధికెక్కింది. హైదరాబాద్ నగర నిర్మాణానికి మహమ్మద్ కులీకుతుబ్ షా హిందూ, ముస్లిం పంచాంగాలను అనుసరించి ముహూర్తం పెట్టించాడని అంటారు. చంద్రుడు సింహరాశిలోను, బృహస్పతి తన స్వస్థానంలో ఉన్న శుభ ముహూర్తంలో ఈ నగర శంకుస్థాపన జరిగిందని కూడా ప్రచారంలో వుంది.
అలా అలనాడు నిర్మించబడిన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత బహుశా మున్నెన్నడూ కనీ-వినీ ఎరుగని రీతిలో అభివృద్ధిపధాన సాగుతోంది. ఒకవైపు హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, మరోవైపు దానిలో పడే మురికి నాలాల మళ్లింపు, హుస్సేన్ సాగర్ పరిసరాలలో-నగరంలోని ఇతర ప్రదేశాలలో భారీ బహుళ అంతస్తుల నిర్మాణానికి రూపకల్పన, విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు ట్రాఫిక్ నియంత్రణ కొరకు సిగ్నల్ ఫ్రీ మల్టీ లెవెల్ ఫ్లయ్ ఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వ నిర్ణయం, అంతర్జాతీయ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు...ఇలా ఎన్నెన్నో పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది.
                బహుళార్థ సాధకుడుగా పేరు తెచ్చుకున్న మందుముల నరసింగరావు రాసిన "ఏబై సంవత్సరాల హైదరాబాద్" అలనాటి విషయాలకు సంబంధించిన ఒక విజ్ఞాన సర్వస్వం. ఆయన తన పుస్తకంలో అలనాటి విషయాలను ఎన్నో వివరించారు. అప్పట్లో, హైదరాబాద్ లో పెద్ద భవంతులు-దేవిడీలు వుండేవి. పత్తర్ ఘట్టి నగరంలోని ప్రధాన వర్తక కేంద్రం. 1908 నాటి మూసీ వరదల అపార నష్టాన్ని పూరించుకునేందుకు హైదరాబాద్ పట్టణాభివృద్ధి మొదలైంది. 1918 లో ఉస్మానియా విశ్వ విద్యాలయం స్థాపించడం జరిగింది. 1914-1918 మధ్య కాలంలో జరిగిన ప్రధమ ప్రపంచ సంగ్రామ ప్రభావం హైదరాబాద్ పాలనపై కూడా పడింది. విద్యారంగంలో, "హైదరాబాద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్" ను మౌల్వీ మహమ్మద్ ముర్తజా స్థాపించారు. 1916 లో వివేక వర్ధని హైస్కూల్ స్థాపన జరిగింది. సుల్తాన్ బజార్ లోని శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భాషా నిలయం, సికిందరాబాద్ లోని ఆంధ్ర సంవర్ధనీ గ్రంధాలయం, తెలంగాణ ప్రాంతంలో చైతన్యం కలగడానికి దోహద పడ్డాయనాలి. 1923 ప్రాంతంలో ఉస్మాన్ సాగర్ నుంచి హైదరాబాద్ పౌరులకు మంచినీటి వసతి కలిగించడం జరిగింది.
అలాగే, 40-50 సంవత్సరాల క్రితం నాటి విషయాలు కొన్ని గుర్తు తెచ్చుకుంటే ఆసక్తికరమైన అంశాలుంటాయి. అలనాటి హైదరాబాద్ నగరం-దాని సంస్కృతి కొంత అవగతమౌతుంది. విద్యానగర్‍లోని చెలమయ్య హోటెల్ ఇడ్లీలునేటి ఆర్. టి. సి. క్రాస్ రోడ్స్ ను "చార్మీనార్ చౌ రాస్తా" గా పిలవడం, చార్మీనార్ చౌ రాస్తా చుట్టుపక్కలంతా పారిశ్రామిక వాడగా వుండడం, సమీపంలో వున్న చార్మీనార్ సిగరెట్ కర్మాగారం (వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ), గోలకొండ సిగరెట్ (నీలం రంగు పాకెట్ లో వచ్చే) కర్మాగారం ...ఇలా ఎన్నో వున్నాయి. చార్మీనార్ చౌ రాస్తా (ఆర్. టి. సి. క్రాస్ రోడ్స్) నుంచి టాంక్ బండును కలిపే రోడ్డు కూడా అప్పట్లో లేదు. ఇప్పుడు టాంక్ బండును కలిపే స్థలంలో కొంచెం అటు-ఇటుగా ఒక "కల్లు కాంపౌండ్" వుండేది. ఇందిరా పార్క్ అసలే లేదు. ధర్నా చౌక్ కూడా లేదు. ఆ రోజుల్లో హైదరాబాద్ లో కనీసం పాతిక-ముప్పై వేల రిక్షాలన్నా వుండేవి. మీటర్ టాక్సీలుండేవి కాని, బేరం కుదుర్చుకోని ఎక్కించు కోవడం తప్ప మీటర్ ఎప్పుడూ వేయక పోయేవారు. టాక్సీలకు కిలోమీటరుకు పావలా చార్జ్ వున్నట్లు గుర్తు. సిటీ బస్సుల్లో హాయిగా ప్రయాణం చేసే వాళ్లు. "ఆగే బడో" అనుకుంటూ కండక్టర్ సున్నితంగా చెపుతుంటే ప్రయాణీకులు క్రమ శిక్షణతో దొరికిన సీట్లలో కూచోవడమో, లేదా, ఒక క్రమ పద్ధతిన నిలబడడమో చేసేవారు. సింగిల్ బస్సులు, ట్రైలర్ బస్సులు, డబుల్ డెక్కర్ బస్సులు వుండేవి. కండక్టర్ చేతిలో టికెట్ ఇచ్చే మిషన్ వుండేది. బర్రున తిప్పి ఒక చిన్న టికెట్ ఇచ్చేవాడు. టికెట్ ఖరీదు పైసల్లోనో, అణా-బేడలలోనో వుండేది.
ఇరానీ రెస్టారెంటులో 15 పైసలిస్తే ఇరానీ "చాయ్" దొరికేది. "పౌనా" కూడా దొరికేది. 5 పైసలకు ఒక సమోసా, లేదా, ఒక బిస్కట్ కొనుక్కుని తినే వాళ్లు. అప్పట్లో "పానీ పురి" ఖరీదు కూడా 5 పైసలే. మిర్చి బజ్జీ కూడా 5 పైసలకే దొరికేది. అలానే మిఠాయి భండార్ లో "గులాబ్ జామూన్", "కలకంద" తిని, "హైదరాబాద్ మౌజ్" కలుపుకుని పాలు-పౌనా తాగే వాళ్లు. పావలాకు అర డజన్ మౌజ్-అరటి పళ్లు దొరికేవప్పుడు. 36 రూపాయలిస్తే 60 భోజనం కూపన్లు ఇచ్చేవారు. తడవకు 18 రూపాయలిచ్చి 30 కూపన్లు కొనుక్కోవాలి. కూపన్ పుస్తకంలో "అతిధులకు" అదనంగా రెండు టికెట్లుండేవి. నెలకు అలా నలుగురు గెస్టులను ఉచితంగా భోజనానికి తీసుకెళ్ల వచ్చు. ఇక భోజనంలో "అన్ లిమిటెడ్" పూరీలు ఇచ్చేవారు. సైజు చిన్నగా వుండేవి. వూరగాయ పచ్చళ్లతో సహా తీరు-తీరు రుచులతో భోజనం, పరిశుభ్రంగా పెట్టేవారు హోటెల్ వారు. ఇప్పుడు 36 రూపాయలకు "ప్లేట్" ఇడ్లీ కూడా రాని పరిస్థితి! హిమాయత్ నగర్, అశోక్ నగర్ మధ్య ఇప్పుడున్న "బ్రిడ్జ్" అప్పుడు లేదు. వర్షాకాలంలో మోకాలు లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. అశోక్ నగర్ లో ఇప్పుడు బ్రహ్మాండంగా వెలిగిపోతున్న "హనుమాన్" గుడి అప్పుడు లేదు. కేవలం ఒక విగ్రహం మాత్రం రోడ్డు మధ్యలో-కొంచెం పక్కగా వుండేది. పీపుల్స్ హైస్కూల్ దాటిన తరువాత మలుపు తిరిగి చిక్కడపల్లి వైపు పోతుంటే, ఇప్పుడు సిటీ సెంట్రల్ లైబ్రరీ భవనం వున్న చోట ఒక కల్లు కాంపౌండ్ వుండేది. ఆ రోజుల్లో ఇప్పుడున్నన్ని సినిమా టాకీసులు లేవు. వున్నవాటిలో ఎయిర్ కండిషన్ థియేటర్లు కాని, ఎయిర్ కూల్డ్ థియేటర్లు కాని దాదాపు లేనట్లే. ఆబిడ్స్ లో వున్న "జమ్రూద్" టాకీసు ఒక్కటే జనరేటర్ బాక్-అప్ వున్న ఎయిర్ కండిషన్ థియేటర్. అలానే వి. వి. కాలేజీ పక్కనున్న "నవరంగ్" థియేటర్ ఒకే ఒక్క ఎయిర్ కూల్డ్ థియేటర్.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో మొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాధ్యతలు చేపట్టడం, వెనువెంటనే ఆయన ప్రాధాన్యతాంశాలలో హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికా రచన జరగడం జరిగింది. హైదరాబాద్ విషయంలో రాజీ పడితే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో వచ్చేదని, ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా రాజీ పడే ప్రసక్తే లేదని, తాను చెప్ప బట్టే హైదరాబాద్ తో కూడిన తెలంగాణ వచ్చిందని ముఖ్యమంత్రి ఎన్నో సార్లు అంటుంటారు. హైదరాబాద్‌కు ఎంతో చరిత్ర, ప్రాముఖ్యతలు వున్నాయని, అవి చెదిరిపోకుండా అభివృద్ధి జరగాలన్నదే తన ధ్యేయం అనీ ముఖ్యమంత్రి అంటారు. అందుకే నగరాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే తపన తెలంగాణ ప్రభుత్వానికి కలిగింది. ఆ దిశగా తొలుత హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఏటేటా నగరంలో పెరుగుతున్న సుమారు 10-15 లక్షల జనాభా అవసరాలకు అనుగుణంగా, నగరం నాలుగు దిక్కులా ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణం, ఆకాశ రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. అవసరమైన ప్రదేశాలలో రింగ్ రోడ్ల నిర్మాణాలు కూడా చేపట్టనుంది ప్రభుత్వం. వాహనాల "గ్రిడ్ లాక్" లను అరికట్టే విధంగా రహదారుల అభివృద్ధి జరుగబోతోంది. వాహనాల రద్దీ ఎక్కువగా వుండే పలు రూట్‌లను హై ప్రెషర్ కారిడార్లుగా గుర్తించింది ప్రభుత్వం. వాహనాలు ఆగకుండా సిగ్నల్ ఫ్రీ తరహా రవాణా వ్యవస్థకు రూపకల్పన జరుగుతోంది. రహదారుల, ఫ్లయ్ ఓవర్ల నిర్మాణ దశలోనే భూగర్భ డ్రైనేజీ, భూగర్భ కేబుల్ వ్యవస్థపైనా దృష్టి సారించడం జరుగుతుంది. బంజారా హిల్స్, ఖైరతాబాద్, చాదర్ ఘాట్, కోఠి, ప్యారడైజ్, నాంపల్లి లాంటి జనం రద్దీ ఎక్కువగా వుండే 20 జంక్షన్ లలో మల్టీ లెవెల్ ఫ్లయ్ ఓవర్ల నిర్మాణానికి  రు. 2631 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది.  

హైదరాబాద్‌లో తెలంగాణ కళా భారతి నిర్మాణం జరుగనుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించే కళా భారతిలో వేరువేరు వేరు సామర్ధ్యాలతో కలిగిన ఆడిటోరియాలు ఉంటాయి. 500 మంది పట్టే ఒక చిన్న ఆడిటోరియం, 1000, 1500మందికి సరిపడా మీడియం ఆడిటోరియాలు, 3000 మంది పట్టే పెద్ద ఆడిటోరియం ఇందులో ఉంటాయి. 125-125 చదరపు మీటర్ల వైశాల్యంలో లక్షా ఇరవై ఐదు వేల చదరపు అడుగుల మేర కళా భారతి నిర్మిస్తారు. ఈ కళా భారతిలో ఆహ్లాదాన్ని కలిగించే పచ్చిక బయళ్లు, చల్లదనం చేకూర్చే నీటి కొలనులు, కను విందు, చేసే ఫౌంటేన్‌లు నిర్మిస్తారుదీనిలో అంతర్భాగంగా అత్యాధునిక థియేటర్, ప్రివ్యూ థియేటర్, కళాకారుల శిక్షణ, రిహార్సల్స్ కోసం ప్రత్యేక హాళ్లు, లైబ్రరీ, ఆర్ట్ మ్యూజియం, పెయింటింగ్ గ్యాలరీ, శిల్ప కళాకృతుల గ్యాలరీ, విఐపి లాంజ్, మీడియా లాంజ్ ఉంటాయి. 25, 50, 100 మందితో సదస్సులు నిర్వహించుకోడానికి 3 ప్రత్యేక సెమినార్ హాళ్లు, డార్మెటరీ సౌకర్యం, అతిథి గృహాలు, 3 రెస్టారెంట్లు, 40 గదులు, 10 సూట్స్, 1000 మంది పట్టే ఫుడ్ కోర్టు ఉంటాయిలలిత కళా అకాడమీ, సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ లాంటి విభాగాల నిర్వహణ కోసం కార్యాలయాల నిర్మాణం కూడా ఇందులోనే చేస్తారు. 3000 వాహనాలకు సరిపోయేలా పార్కింగ్ ఏర్పాటు చేస్తారు. 10వేల మందితో ఒకే సారి సమావేశాలు నిర్వహించుకున్నా సరిపోయేలా కళా భారతి డిజైన్ రూపొందించారు. తెలంగాణ సాంస్కృతిక వికాసానికి ప్రతిబింబంగా ఈ కళా భారతి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ ప్రాంతంలో, ఎనిమిదెకరాల స్థలంలో, అత్యంత ఆధునికమైన హంగులతో, అంతర్జాతీయ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం జరుగనుంది. నగరానికి ఒక ఐకాన్ భవనంగా మారనున్న ఈ సెంటర్‌లో, రెండు టవర్లతో కూడిన అద్దాల భవనం వస్తుంది. ఒక టవర్ 16 అంతస్తులు, మరో టవర్ 24 అంతస్తులుంటాయి. రెండు టవర్ల మధ్య వంతెన వుంటుంది. టవర్లపైన హెలిపాడ్ సౌకర్యం, సోలార్ రూఫ్ కూడా వుంటాయి. వేయి మంది పట్టే ఆడిటోరియం, వీడియో వాల్స్, లాండ్ స్కేపింగ్, వాటర్ ఫౌంటెన్స్ వుంటాయి. 600 వాహనాలు పట్టే పార్కింగ్ స్థలం వుంటుంది.

ప్రస్తుతం రవీంద్ర భారతి వున్న స్థలంలో హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక ప్రత్యేకతలను చాటే విధంగా మరో కట్టడం వచ్చే అవకాశం వుంది. మూసీ నదికి ఇరువైపులా అద్భుతమైన పార్కులకు ప్రణాళికలు తయారవుతున్నాయి. నది ప్రక్షాళన, సుందరీ కరణ పనులకోసం కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. నిజాం రాజులు కట్టించిన మోండా మార్కెట్‌ను ఆధునీకరించి అభివృద్ధి పర్చాలని ముఖ్యమంత్రి సంకల్పం. 143 సంవత్సరాల క్రితం 1872 లో నిర్మించిన మోండా మార్కెట్ ఇప్పటికీ చెక్కు చెదర లేదు. సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమౌతున్నాయి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చి దిద్దే ప్రయత్నంలో భాగంగా, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక అధ్యయనం చేయించింది ప్రభుత్వం. రెండు కోట్ల జనాభా నివసించేందుకు అనువుగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ తయారైంది. 150 కూరగాయల మార్కెట్ల నిర్మాణానికి, 80 మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ ల ఏర్పాటుకు, 136 బస్ బే ల నిర్వహణకు, అనువైన స్థలాలను ఎంపిక చేసింది నగరపాలక సంస్థ. స్మశాన వాటికల ఆధునీకరణ, దోభీఘాట్ల నిర్మాణం, పబ్లిక్ టాయ్ లెట్ల ఏర్పాటు కూడా ఇందులో భాగమే.

హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో, ఏడెనిమిది వేల ఎకరాల విస్తీర్ణంలో, జాతీయ రహదారికి-రైల్వే లైనుకు దగ్గరలో, అద్భుతమైన ఫార్మా సిటీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా అక్కడ పనిచేసే వారికి నివాస గృహాల వసతి కూడా జరుగనుంది. అలానే నగర సరిహద్దుల్లో ఒక క్రీడా నగరాన్ని కూడా నిర్మించే ఆలోచనలో వుంది ప్రభుత్వం. అలా నిర్మించ తలపెట్టిన ప్రదేశంలో జాతీయ-అంతర్జాతీయ క్రీడల పోటీల నిర్వహణతో పాటు, ఒకనాటికి ఆ సిటీ ఒలింపిక్ పోటీలను నిర్వహించే స్థాయి కూడా ఎదగాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. బంజారా హిల్స్ ప్రాంతంలో బంజారా భవన్, కొమరం భీమ్ భవన్ పేర్లతో ఆదివాసీలకు రెండు ప్రత్యేక భవనాలు నిర్మించనుంది ప్రభుత్వం. హైదరాబాద్ నగర పరిధిలో నివసిస్తున్న సుమారు రెండు లక్షల మంది పేద కుటుంబాలు గుడిసెలు, రేకుల షెడ్డులు వేసుకుని ఇరుకు ఇళ్లల్లో, మురికివాడల్లో వుంటున్నారని గుర్తించిన ప్రభుత్వం, వారికి మెరుగైన ఆవాసాలను కలిగించనుంది.
హైదరాబాద్ నగరానికి హుస్సేన్‌సాగర్ ఒక వరమని భావించిన ముఖ్యమంత్రి, దానిని ఒక మంచినీటి సరస్సుగా మార్చడానికి, దాంతో పాటు దాని చుట్టూ ఆకాశ హర్మ్యాలను నిర్మించడానికి సంకల్పించారు. సాగర్ చుట్టూ నిర్మించనున్న భారీ టవర్స్ నగరానికే ఒక మణి హారంలాగా కానున్నాయి. తెలంగాణ అభివృద్ధికి, ఆర్థిక స్థితికి, సంకేతంగా ఈ ఆకాశ హర్మ్యాలుంటాయి. సాగర్ ప్రక్షాళణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కార్యదర్శుల ఉపసంఘాన్ని కూడా ఇందుకోసం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సాగర్ లోకి వివిధ ప్రాంతాల నుంచి నాలాల ద్వారా వచ్చే మురుగు నీటి వల్ల జల కాలుష్యం జరగకుండా నివారించేందుకు చర్యలు కూడా చేపట్టింది ప్రభుత్వం. హుస్సేన్ సాగర్‌లోకి పోయే 5 నాలాలతో సహా హైదరాబాద్ లో మొత్తం 77 నాలాలున్నాయి. మిగిలిన 72 నాలాలు మూసీ నదిలో కలుస్తాయి. ఇవన్నీ కూడా దారుణమైన నిర్వహణలో వున్నందున వాటిని పరిశుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రతిష్టాత్మకమైన మెట్రో రైలు ప్రాజెక్ట్ హైదరాబాద్ నగరానికి అత్యంత ఆవశ్యకమైన ఆధునిక సదుపాయం. ఉమ్మడి రాష్ట్రంలో నత్తనడకలాగా సాగిన మెట్రో రైలు నిర్మాణ పనులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వేగంగా సాగుతున్నాయి. అదొక సమగ్ర ప్రాజెక్టుగా హైదరాబాద్ ప్రజలకు సేవలందించనుంది. నగరంలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ ఆస్తులు, ప్రార్థనా మందిరాలు, ప్రజల మనోభావాలతో ముడిపడిన చిహ్నాలు చెదిరిపోకుండా మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుతోంది.
చారిత్రక ఆనవాళ్లు చెదిరిపోకుండా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధునిక నగరంగా తీర్చిదిద్దాలి. హైదరాబాద్ అద్భుతమైన నిర్మాణ నైపుణ్యంతో కట్టబడిన అపురూపమైన నగరం. నిజాం నవాబులు చార్మినార్, గోల్కొండ, ఫలక్ నుమా, చౌ మహల్లా ప్యాలస్, మక్కా మస్జీద్, సాలార్‌జంగ్ మ్యూజియం, అసెంబ్లీ, హైకోర్ట్ లాంటి అద్భుతమైన భవనాలు నిర్మించి నగరానికి ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టారు. తదనంతరం వచ్చిన పాలకులు ఆ వారసత్వాన్ని కొనసాగించడంలో పూర్తిగా విఫలమయ్యారు. నిజాం నవాబుల అద్భుత నిర్మాణాలకు అదనంగా-అనుబంధంగా మరిన్ని కట్టడాలు తేవాల్సింది పోయి, దానికి బదులుగా నగరాన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా మార్చారు ఆ పాలకులు. అందుకే గత వైభవం ఉట్టిపడేలా నూతన నిర్మాణాలు రావాల్సిన అవసరం వుంది. ఇదొక యూనిక్ సిటీగా రూపాంతరం చెందాలి. దానర్థం హైటెక్ సిటీ లాంటి సాధారణ కట్టడాలు కాదు. ఏ ప్రాంతంలో ఎలాంటి కట్టడం రావాలి? ఎంత విస్తీర్ణంలో ఆ నిర్మాణం జరగాలి? వాటిని ఎలా-ఎందుకోసం ఉపయోగించాలి? అనే అంశాలపై సమగ్ర అధ్యయనం జరగాలని, తదనుగుణంగానే ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అంటారు. హైదరాబాద్ నగరమంతా ఒకే రకంగా లేదు. వాటి చారిత్రక నేపధ్యం, సామాజిక పరిస్థితుల ఆధారంగా మాత్రమే కొత్త నిర్మాణాలు జరగాలన్నదే ముఖ్యమంత్రి కోరిక. మూసీ నదికి దక్షిణ భాగంలో వున్న పురాతన నగరం, ఉత్తర భాగంలో వున్న నగరం, బంజారా హిల్స్-జూబ్లీ హిల్స్-మాధాపూర్ లాంటి ప్రాంతాలు, పారిశ్రామిక వాడల ప్రాంతాలు, ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, మురికివాడలు...ఇలా వేటికవే ఆయా ప్రాంతాల ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ధి చెందాలని అంటారు ముఖ్యమంత్రి. నగరంలో అనేక చోట్ల ఫ్లయ్ ఓవర్లు వున్నప్పటికీ, అవేవీ నగర ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా లేనందున వాటి స్థానంలో మల్టీ లేయర్ ఫ్లయ్ ఓవర్ల నిర్మాణ ఆవశ్యకత వుందంటారు ముఖ్యమంత్రి.

          భౌగోళికంగా, వాతావరణ పరంగా, సామాజికంగా, హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకత వుంది. నగర వాతావరణ సమతుల్యతను కాపాడడం అత్యంత అవసరమని కూడా ముఖ్యమంత్రి అంటారు. నగర పరిధిలో వున్న లక్షకు పైగా అటవీ భూమిని రక్షించుకోవడంతో పాటు, దానిని అందమైన ఉద్యానవనాలుగా తీర్చి దిద్దాలని, లంగ్ స్పేస్ పెంచాలని, పార్కుల కోసం కేటాయించిన స్థలాలను అందుకే ఉపయోగించాలని, వీటన్నిటి పర్యవేక్షణకు పౌర సంఘాలు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి అంటారు.
ముఖ్యమంత్రి ఆలోచనలకు-ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా, విశ్వ నగరంగా తీర్చి దిద్దడానికి కార్యాచరణ పథకం రూపుదిద్దుకుంటున్నది. అమలకు రంగం సిద్ధమౌతోంది. అనతి కాలంలోనే భాగ్యనగరం రూపురేఖలు మారనున్నాయి. విశ్వ నగరంగా భాగ్యనగరం కాబోతోంది.End


No comments:

Post a Comment