Tuesday, March 8, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-72 : గోదాన వివరణ : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-72
గోదాన వివరణ
వనం జ్వాలా నరసింహారావు

          జనక మహారాజు ఇలా తమ వంశ క్రమాన్ని చెప్పి, శ్రీరామ లక్ష్మణులకు తన ఇద్దరు కూతుళ్లైన సీత ఊర్మిళలను ఇచ్చి వివాహం జరిపించుదామని చెప్పిన తర్వాత, విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఆలోచించి మరో ప్రతిపాదన చేశారు. ఆ విషయం చెప్పడానికి ముందు, జనకుడి వంశం-దశరథుడి వంశం రెండూ తెలుసుకోలేనంత మహిమగలవని, మిక్కిలి గొప్పవని, వారిని మించినవారెవరూలేరని, సౌందర్యంలో-సంబంధంలో రామ లక్ష్మణులకు సీత ఊర్మిళలు సరిసమానమని అంటూ, జనకుడి చెప్పింది తమకు సమ్మతమేనని దశరథుడి పక్షాన తెలియచేశారు. జనకుడి తమ్ముడైన కుశధ్వజుడి ఇరువురు పుత్రికలను, దశరథుడి కుమారులైన భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం చేయమని కోరారు వారు. సౌందర్యంలో-భుజబలంలో-ప్రాయంలో దశరథుడి నలుగురు కుమారులు సమానమైన వారని, అందరూ దిక్పాలురవలె బలశాలురని, ఆనందించతగినవారని, రామ లక్ష్మణులకు సీత ఊర్మిళల ఈడు-జోడు ఎలా బాగుంటుందో అలాగే భరత శత్రుఘ్నులకు కుశధ్వజుడి కుమార్తెలిరువురి ఈడు-జోడు బాగుంటుందని లోకులు శ్లాఘిస్తారని చెప్పరు. విశ్వామిత్ర వశిశ్ఠులు చెప్పినదానికి జనకుడంగీకరిస్తూ, తమ ఇరువురి వంశాలు సమానమని-పరస్పర సంబంధం చెల్లుతుందని వారన్నారంటే, సూర్య వంశపు రాజులతో తమ వంశపు రాజులను సమానం చేసి తమను పావనం చేయడమేనని అంటాడు. సంతోషంతో కుశధ్వజుడి ఇరువురు పుత్రికలను భరత శత్రుఘ్నులకిస్తానని, నలుగురికీ ఒకే రోజున వివాహం చేస్తానని, ఒకే రోజున నలుగురు కోడళ్లను సంపాదించుకొని దశరథుడు సంతోషించవచ్చని అంటాడు జనకుడు.


          "ఎల్లుండి ఉత్తర ఫల్గుని. దానికధిపతి భగుడనే ప్రజాపతి. ఆయన శుభకరుడు కాబట్టి, ఉత్తర ఫల్గుని ఉత్తమమని అందరు ప్రశంసిస్తారు. నేను మీ శిష్యుడను-మీ దయకు పాత్రుడను-మీరు నాకు గొప్ప ధర్మాన్ని చెప్పారు. ఋశీష్వరులారా, మీరు ఈ మూడు ఆసనములమీద కూర్చోండి. నా రాజ్యం-తమ్ముడి రాజ్యం-దశరథుడి రాజ్యం అన్నీ మీవే కదా. దశరథుడికి ఇక్కడెంత స్వతంత్రముంటుందో, అంతే నాకు అయోధ్యలో వుంటుందికదా. ఇదీ-అయోధ్యా నా సొంతమే. అయోధ్య-ఇది దశరథుడి సొమ్మే. కాబట్టి మీ యోగ్యతకు తగిన విధంగా కార్య భారం వహించండి. సందేహించ వద్దు. దోషమేదైనా జరిగితే, ఆ తప్పు మీదే-నాది కాదు. మీ రాజ్యంలో తప్పు జరిగితే దోషం మీకు తగులుతుంది" అని కలుపుగోలుగా జనకుడన్నాడు. ఆ మాటలకు మెచ్చిన దశరథుడు, "మీ ఇరువురు అన్నదమ్ములు అమితమైన కల్యాణగుణాలున్నవారు. కోటాను-కోట్ల రాజులు, ముని శ్రేష్టులు పూజించే పుణ్యాత్ములు మీరు. మీకు తెలియందేదీలేదు. కార్య భారం అన్నీ తెలిసిన వారిమీద వుండాలికాని, ఏమీ తెలియని మామీద వేస్తే ఫలితం లేదు. తెలివితక్కువగా మేం ఏదైనా లోపంచేస్తే, అన్నీ తెలిసిన జనకుడు ఏం చేస్తున్నాడని మిమ్ములనే నిందిస్తారు. కాబట్టి మీరేం చెపితే అదే చేస్తాం" అని జనకుడితో చెప్పాడు. నాంది మొదలైన కార్యక్రమాలు జరిపించాలని అంటూ, విశ్వామిత్ర వశిష్ఠులతో కలిసి విడిదికి పోయాడు.


తన విడిదికి పోయిన దశరథుడు, నాందీ కార్యక్రమాలను జరిపించి, ఉదయమే నిద్రలేచి, తన ప్రియమైన కొడుకులను పిల్చాడు. బంగారు కొమ్ములున్న బాగా పాలిచ్చే నాలుగు లక్షల ఆవులను తెప్పించి, వాటి పాలుపితుకేందుకు తన నలుగురు కొడుకులకు కంచు పాత్రలనిచ్చాడు. కొడుకుల కొరకై, శాస్త్ర ప్రకారం బ్రాహ్మణులకు, విశేష దానాలు చేసిన దశరథుడు, నలుగురు దిక్పాలకులతో కూడిన బ్రహ్మలాగా కనిపించాడు.

No comments:

Post a Comment