Monday, March 14, 2016

అణగారిన బ్రాహ్మణులకు ఆసరా : వనం జ్వాలా నరసింహారావు

అణగారిన బ్రాహ్మణులకు ఆసరా
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర భూమి దినపత్రిక (15-03-2016)

        సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, అట్టడుగు వర్గాలకు, అసహాయులకు, అన్నార్తులకు అండగా నిలుస్తూ, స్వార్థం, దోపిడీ, సంకుచిత తత్వాలను దరిచేరనీయకుండా ధృఢ సంకల్పంతో నిజమైన అభివృద్ధిని సాధించే దిశగా, అనేక రకాల సంక్షేమ పథకాలను గత ఇరవై నెలలుగా రూపకల్పన చేసి అమలు చేస్తున్నది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించడానికి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, షెడ్యూల్డ్ కులాల-తెగల-వెనుకబడిన తరగతుల-మైనార్టీల సంక్షేమం కొరకు వరుస బడ్జెట్ లలో పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపు, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ లాంటి పథకాలు, మహిలా శిశు సంక్షేమానికి కార్యక్రమాలు....ఇలా ఎన్నో రూపొందించిన తెలంగాణ ప్రభుత్వం, మరో అడుగు ముందుకు వేసి, ఈ బడ్జెట్ లో బ్రాహ్మణ సంక్షేమం కొరకు నిధులను కేటాయించడం అభినందించాల్సిన విషయం. రాష్ట్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ..."కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సమాజంలో ఇతర వర్గాల లాగానే, బ్రాహ్మణ సామాజిక వర్గంలో పేదలున్నారని ప్రభుత్వం భావిస్తున్నదిఅందుకే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బ్రాహ్మణ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తూ అందుకోసం  రూ. 100 కోట్లు 2016-2017 బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. బ్రాహ్మణ సంక్షేమ నిధి విధి విధానాలను ఖరారు చేస్తాం". అని అన్నారు.

          బ్రాహ్మణుల పరిస్థితి గతులు రోజు-రోజుకూ క్షీణించి పోతున్న నేపధ్యంలో; ఆర్థికంగా బ్రాహ్మణులు బాగా చితికి పోయిన నేపధ్యంలో; వ్యవసాయం మీద, భూమి మీద ఆధారపడే అవకాశాలను బ్రాహ్మణులు దాదాపు కోల్పోయిన నేపధ్యంలో; కొందరు బ్రాహ్మణులకు రోజు గడవడం కూడా కష్టమై పోతున్న నేపధ్యంలో; ఒక నాటి పౌరోహిత్యం, పూజారి జీవితం, ఆయుర్వేద వైద్యం బ్రాహ్మణుల బ్రతుకు తెరువుగా కొనసాగడం కష్టమై పోయిన నేపధ్యంలో; పూర్తిగా దిగజారుతున్న బ్రాహ్మణుల ఆర్థిక స్తోమత నేపధ్యంలో, అనాథ బ్రాహ్మణుల సంఖ్య రోజు-రోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో; కడు బీదరికంతో అల్లల్లాడి పోతున్న పలువురు బ్రాహ్మణులు, పల్లెల నుంచి పట్టణాలకు ఉపాధి కొరకు వలసపోయే పరిస్థితుల నేపధ్యంలో; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎందరో బ్రాహ్మణులకు ఆసరాగా వుండబోతుందనడంలో సందేహం లేదు. నాలుగు విభాగాలుగా వున్న బ్రాహ్మణులు...అర్చకులు, పురోహితులు, ఉద్యోగులు, స్వయం ఉపాధి వున్న వారు….వీరిలో వైదిక బ్రాహ్మణులు, నియోగులు, అయ్యవార్లు, ఆరాధ్యులు, మధ్వలు, వైఖానసలు తదితరులు వున్నారు...వీరందరికీ ప్రభుత్వ నిర్ణయం ద్వారా లాభం చేకూరుతుంది. పేద బ్రాహ్మణుల జీవన స్థితిగతులపై ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేసి, సరైన డేటా కొరకు సమగ్ర సర్వే చేస్తే, అందులో...కుటుంబాలు, జనాభా, సామాజిక-ఆర్థిక స్థితి గతులు, ఆదాయ వివరాలు, ఆరోగ్య వివరాలు, విద్యా విషయక వివరాలు దొరికే అవకాశాలున్నాయి.


ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూస్తే బ్రాహ్మణుల సంక్షేమం కోసం రు. 100 కోట్లతో నిధిని ఏర్పాటు చేయడం ఆహ్వానించ దగ్గ పరిణామంసమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ఈ చర్య మరో మారు నిరూపించింది. సామాజిక ప్రగతికి నిజమైన అర్థం పేదరిక నిర్మూలనపేదరికంలో మగ్గుతున్న  ఏ వర్గానికైనా సరే చేయూతనందించడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం. నిన్నటి వరకు గుర్తించని వర్గాల లోని పేదరిక సమస్యను గుర్తించి వారి సంక్షేమం కోసం  ముందడుగు వేయటం ద్వారా ప్రభుత్వం అభివృద్ది పట్ల తనకున్న సమగ్ర దృక్పథాన్ని చాటుకున్నది. అనూచానంగా  బ్రాహ్మణులు పురోహితులుగా, అర్చకులుగా జీవనం సాగిస్తున్నారు. గ్రామీణ సమాజం సమృద్దితో, స్వావలంబనతో సాగినంతకాలం అన్ని వృత్తుల వారి మాదిరిగానే తమ కుల వృత్తి ద్వారా బ్రాహ్మణులు జీవనం గడిపారు. కాలం గడుస్తున్న కొద్ది వచ్చిన మార్పులు, నూతన ఆర్థిక విధానాల ప్రభావం, వ్యవసాయంలో నెలకొన్న సంక్షోభంతో గ్రామీణ సమాజం చెదిరి పోయిందికుల వృత్తులు దెబ్బతిన్నాయిఈ పరిణామాలు బ్రాహ్మణుల జీవితాల మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపెట్టాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే  పెద్ద, మధ్య తరగతి రైతులు తదితరుల ఇండ్లల్లో జరిగే శుభా శుభ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయంతో పురోహితులు జీవిస్తూ వస్తున్నారుకొంతమంది గ్రామంలో ఉండే దేవాలయంలో అర్చక వృత్తిని కొనసాగిస్తూ ఆ గుడికి వుండే కొద్దిపాటి భూమిలో పండే పంట ద్వారా వచ్చే ఆదాయంలోంచి కొంత వేతనంగా పొందుతూ జీవిస్తూ వస్తున్నారువ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోవడంతో  రైతుల జీవితం రోజు రోజుకు దిగజారి పోయింది.   వారిని ఆశ్రయించి పురోహితంతో జీవించే  బ్రాహ్మణుల పరిస్థితి అంతే దిగజారింది.

తెలంగాణ ప్రాంతం నదీ జలాల్లో న్యాయమైన వాటా పొందకపోవడం, సాంప్రదాయిక  జల వనరులైన చెరువులు నాశనమై పోవడం వంటి పరిణామాలతో  భూములు పడావు పడ్డాయి. దాంతో దేవాలయ భూముల మీద బ్రతికే అర్చకులకు ఆ కొద్దిపాటి ఆదాయం కూడా లేకుండా పోయిందిదీంతో బ్రాహ్మణులు జరుగుబాటు కూడా దిక్కులేని  పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. అనాదరణకు గురవుతున్న దేవాలయాల్లో భక్తులు హారతి పళ్లెంలో వేసే డబ్బుల కొసరం దీనంగా చూసే బ్రాహ్మణులు ఎందరోఆషాడం వచ్చినా, మూఢం వచ్చినా ముహూర్తాలు లేకపోయినా బ్రాహ్మణుల వంటింట్లో పిల్లి లేవదు. శుక్రవారమో, శనివారమో తప్ప మిగతా రోజుల్లో దేవాలయానికి భక్తులు రారుదాంతో ఎటువంటి ఆదాయం వుండదు. ఆకలిని, దారిద్ర్యాన్ని బయటికి చెప్పుకోలేని ఆత్మాభిమానంతో కుమిలి పోతున్నారురేషన్ కార్డు మీద వచ్చే బియ్యం కోసం ఎదురు చూసే కుటుంబాలు ఎన్నో... పురోహిత వృత్తి చేసే వారికి పిల్ల నివ్వడానికి ఆడపిల్లల తల్లి దండ్రుల ముందుకు రావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.   ధోతి కట్టుకుని ఇంటింటికీ పురోహితం కోసం తిరగడం వెనుకబాటు తనంగానే నేటి తరం ఆడపిల్లలు భావిస్తున్నారు. ఉద్యోగం ఉన్న వారు మాత్రమే భర్తలుగా రావాలని కోరుకుంటున్నారు.  

60 ఏండ్ల  ఆంధ్రా వలస పాలనలో తెలంగాణ ప్రజలకు దక్కవలసిన ఉద్యోగాలు దక్కకుండా పోయినయి. అష్టకష్టాలు పడి చదువుకున్న వాళ్లకి అర్హతకు తగిన ఉద్యోగాలు లభించలేదు. ఈ పరిణామం  సమాజంలోని  అన్ని వర్గాల ప్రజలతో పాటు బ్రాహ్మణుల మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపించింది.   ఇప్పటికీ 60 శాతం బ్రాహ్మణులు అరకొర చదువులు  చదివి పురోహితం మీద ఆధారపడి అంతంత మాత్రం బతుకులే గడుపుతున్నారుసినిమా, టీవీ తదితర సాంస్కృతిక రంగాలలో తెలంగాణ  బ్రాహ్మణులు కనిపించరువ్యాపార  రంగంలో బ్రాహ్మణుల భాగస్వామ్యం నామమాత్రంగా కూడా లేదు. రాజకీయాలలో అక్కడొక్కరు ఇక్కడొక్కరు తప్ప పెద్దగా కనిపించరుసామాజిక గౌరవం కొద్దో గొప్పో ఉన్నవారు కావడంతో ఇటు చిన్న వృత్తులలో ఇమడలేక, పురోహితం, అర్చక వృత్తులు తప్ప వేరే మార్గం లేక సతమతమవుతున్నారు.   పట్టణ ప్రాంతాల్లోకి వలస వచ్చినవారు అక్కడి దేవాలయాల్లో నెలకు నాలుగైదు వేల  రూపాయలు వేతనంగా పొందుతున్నారంటే పరిస్థితులు ఊహించుకోవచ్చుబాగా ఆదాయం ఉన్న దేవాలయాల్లో  రు. 10 వేలు అంతకు మించి ఆదాయం లభించని పరిస్థితిపెరిగిపోతున్న జీవన వ్యయం, ఆడపిల్లల పెండ్లిళ్ల ఖర్చు, అనారోగ్యం పాలయితే హాస్పిటల్ల ఖర్చులు జీవితాలను మరింత కుంగ దీస్తున్నాయి. మరో వైపు ఓట్ల రాజకీయాల్లో భాగంగా జనాభా తక్కువగా ఉన్న బ్రాహ్మణులు ఎవరికీ పట్టరు. అందులోనూ అగ్రవర్ణాల గురించి  ఆలోచించవలసిన అవసరం లేదనే యాంత్రిక వైఖరిగొంతెత్తి సమస్యలు చెప్పుకునే చైతన్యం లేకచెప్పుకున్నా వినే నాథుడు లేక బ్రాహ్మణలకు సమాజంలో ఊపిరాడని పరిస్థితిఎవరికీ పట్టని, ఎన్నికల్లో లాభించని బ్రాహ్మణ సమాజం గోడు అర్థం చేసుకున్నందుకు తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం విశాల దృక్పథాన్ని అభినందించి తీరవలసిందేఈ పరిణామం తప్పకుండా పేద బ్రాహ్మణులకు గొప్ప ఊరటనిస్తుంది..వారిలో ప్రభుత్వం పట్ల గౌరవం పెరుగుతుంది. బ్రాహ్మణ సంక్షేమం కోసం 100 కోట్ల నిధులతో ఎన్నో చర్యలు చేపట్టవచ్చు.

          ఏం చేస్తే బ్రాహ్మణుల స్థితిగతుల్లో మార్పు రావచ్చని ఆలోచన చేస్తే రకరకాల సలహాలు-సూచనలు వచ్చాయి. అసలింతకీ....రాష్ట్రంలో బ్రాహ్మణులెంతమంది వున్నారనేది ఇదమిద్ధంగా లెక్కలు లేనే లేవు. బహుశా 6 నుంచి 12 లక్షల వరకుండ వచ్చని ఒక అంచనా.... మెజారిటీ దాదాపు 85-90% వరకు 50 కి పైగా వున్న నగరాలలో వుంటే, మిగిలిన ఏ కొద్దిమందో ఇంకా గ్రామాలను అంటిపెట్టుకుని  వున్నారు. సాధారణంగా గ్రామానికి ఒకటి-రెండు కుటుంబాల కన్నా ఎక్కువ లేరు. ఒక అంచనా ప్రకారం సుమారు 10% కి పైగా 65 ఏళ్ల వయసు పైబడిన వారే. వయసు పైబడిన, ఏ సహాయం పొందలేని స్థితిలో వున్న, 65 ఏళ్ల వయసు పైబడిన బ్రాహ్మణులకు వృద్ధాశ్రమం లాంటిది నెల కొల్పడం మంచిదని కొందరు సలహా ఇచ్చారు.

          ప్రభుత్వ పథకాలలో బ్రాహ్మణులకు భాగస్వామ్యం, బ్రాహ్మణ విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సులు, వేద పాఠశాలల ఏర్పాటు, బ్రాహ్మణ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, అపర కర్మలు నిర్వహించడానికి మౌలిక వసతుల ఏర్పాటు, బ్రాహ్మణుల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం-నిర్వహణకు ట్రస్ట్ ఏర్పాటు, సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు అవకాశం-దానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన, వైద్య సౌకర్యం-ఆరోగ్య భీమా సౌకర్యం-హెల్త్ కార్డులు ఇవ్వడం, శాస్త్ర-సాంకేతిక విద్యను అభ్యసించ దల్చుకున్న పేద బ్రాహ్మణులకు ప్రభుత్వ తోడ్పాటు అందించడం, ఒక కాలం నాటి "పంచాంగం" రూపొందించడంలో ప్రత్యేక శిక్షణ...తద్వారా కొందరికి ఉపాధి కలిగించడము, ప్రత్యేకించి బ్రాహ్మణుల కొరకు ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం, పోటీ పరీక్షలకు అవసరమైన కోచింగ్, శిక్షణ ఇవ్వడం, గతంలో లాగా ప్రతి గ్రామంలో ఒకరిద్దరు పురోహితులుండేలా వృత్తి పరమైన శిక్షణ ఇచ్చి, ఉపాధి కలిగించడం, ప్రతి గ్రామంలోని దేవాలయాలలో బ్రాహ్మణ పూజారి నియామకం...ధూప దీప నైవేద్యానికి తగు ఏర్పాట్లు చేయడం, బీద బ్రాహ్మణులకు అవసరమైన రుణ సౌకర్యం-స్వయం ఉపాధి పథకాలకు ప్రభుత్వ మద్దతు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం,.....ఇలా ఎన్నో కార్యక్రమాలను అమలు చేయడానికి ముందుముందు బడ్జెట్ కేటాయింపులతో ప్రభుత్వం తీసుకున్న బ్రాహ్మణ సంక్షేమ నిధి నిర్ణయం తోడ్పడుతుందనడంలో సందేహం లేదు.  


సంక్షేమానికి వారూ-వీరూ అనే తారతమ్యం చూపించకుండా, పేదవారెవరైనా సరే, ఆదుకోవాల్సిందే అన్న దృక్ఫధంతో, సరికొత్త సామ్యవాద భావనతో, బ్రాహ్మణులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు అభినందనీయులు. End  

2 comments:


  1. జై తెలంగాణా !

    ప్రభుత్వపు పథకం సత్ఫలితా లిస్తుందని ఆశిస్తో

    జిలేబి

    ReplyDelete