Tuesday, April 18, 2017

"ఆరోగ్య పరిరక్షణ" సాకారం ఇలా... : వనం జ్వాలా నరసింహారావు ...ఆంధ్రభూమి

"ఆరోగ్య పరిరక్షణ" సాకారం ఇలా...
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (19-04-2017)

          ఆరోగ్య భారతాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్తూ, సమున్నత లక్ష్యాల పేరుతో, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో జాతీయ వైద్య విధానాన్ని ప్రకటించింది. దేశంలో వైద్యసేవలు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి చేయాలనే లక్ష్యంతో ఈ విధానానికి కేంద్రం రూపకల్పన చేసినట్లు సంబంధిత శాఖ మంత్రి చెప్పుకొచ్చారు. "దేశవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించటంతోపాటు అన్ని మందులను అందుబాటులో ఉంచటం ఈ పథకం ఉద్దేశాల్లో ఒకటి" అని కూడా మంత్రి ప్రకటించుకున్నారు. విధాన ప్రకటనలో ఇతర అంశాలతో పాటు, పేషంట్ల సాధికారత, ప్రసూతి మరణాల రేటు తగ్గింపు, నవజాత శిశు మరణాల రేటు తగ్గింపు, ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కలిగించడం లాంటి అంశాలున్నాయి. ఇదంతా బాగానే వుంది...కాని...అసలు ఏ మేరకు ఆరోగ్య సేవలు విచిధ రాష్ట్రాలలో అందుబాటులో వున్నాయనే అంశంపై స్పష్టత లేదనే అనాలి. క్రమేపీ విస్తరిస్తున్న ఆరోగ్య వైద్య అవసరాలకు అనుగుణంగా, అటు కేంద్ర ప్రభుత్వం కాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కాని, అంచెలంచలుగా అందుతున్న వైద్య సేవల్లో కాలానుగుణంగా మార్పులకు శ్రీకారం ఎంతవరకు చుట్తున్నదనేది చర్చనీయాంశం అనాలి.

          తెలంగాణ రాష్ట్రంలో, దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా, వైద్య ఆరోగ్య సేవలను మరింత పఠిష్ట పరుచు కోవటం, ప్రభుత్వ వ్యవస్థను పరిపుష్టం చేయటం, తద్వారా కావలసినంత మేరకు వైద్య, ఆరోగ్య సేవలను వినియోగించటంతో పాటు, ప్రభుత్వేతర, ప్రైవేటు, ప్రభుత్వ వైద్యరంగాలను విలీనం చేసి, ఒక సమగ్ర వైద్య విధానం రూపకల్పన చేసి, అమలు చేయడం ఎంతయినా అవసరం. భవిష్యత్ లో సాంకేతికత ఆధారంగా వైద్య సేవలను ప్రజల ఆరోగ్య పరిరక్షణకు  ఉపయోగించు కోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇందుకు తగ్గ ప్రణాళికలను తక్షణం సిద్ధం చేసుకోవలసిన ఆవశ్యకత కూడా ఉంది.

          ఇటు తెలంగాణ రాష్ట్రంలో, అటు దేశ వ్యాప్తంగాను చూసినట్లయితే స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పెద్ద ఎత్తున ప్రైవేటు రంగంలోనే అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య సేవలు మాత్రమే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు అందించటం జరుగుతోంది. భారత దేశంలో మరో ముఖ్యమైన సమస్య రోగ నిర్థారణ సేవల కయ్యే అసాధారణ వ్యయం. అటు సామాన్యులకు ఇటు మధ్య తరగతి వారికి కేవలం ప్రైవేటు సంస్థలు మాత్రమే ఈ సేవలు అందించటం జరుగుతుంది. అదీ అత్రి ఎక్కువ ధరలతో.

          ఉదాహరణకి పి..టి పరీక్ష (పోసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ) స్కాన్ కు రు.20,000 వరకు ఖర్చవుతుంది. ఎం.ఆర్. (మాగ్నటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్) పరీక్షకు రు.10,000 దాకా ఖర్చవుతుంది. ఇలా ఎన్నో రకాల పరీక్షలు ఉన్నాయి. వీటిని తక్కువ ఖర్చుతో ప్రభుత్వ వైద్య శాలలే అందించే పరిస్థితి రావాలి. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా కొంత పురోగమించింది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో పాలీక్లినిక్ లు ఏర్పాటై ప్రైవేట్ క్లినిక్ ల సహాయంతో తక్కువ ఖర్చులో వైద్య పరీక్షలకు వెసులు బాటు కావాలి. ఇందుకు ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో పాటించే విభిన్న పద్ధతులను అధ్యయనం చేసి తదనుగుణంగా మార్పులకు ఉపక్రమించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచించినట్లయితే రాష్ట్రాన్ని మోడల్ గా తీసుకుని అటు నగరవాసులకు ఇటు గ్రామీణ వాసులకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి వీలు పడే అవకాశం వుంది.

ఆరోగ్య పరిరక్షణ పద్ధతుల సమగ్ర వినియోగం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించు కోవచ్చు. 75-80 లక్షల ప్రజలున్న రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలను ఒక జోన్ గానూ, 40 లేదా అంతకన్నా ఎక్కువ ప్రాంతాలతో 60 లక్షల ప్రజలతో మరోక జోన్ గానూ, మూడవ జోన్ గా 900 గ్రామాలు కలిపి 27 లక్షల ప్రజలతోనూ, వీటిలో ప్రాథమిక, మాధ్యమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నవీ కలుపుకుంటే 47% ప్రజలకు చేరువ అవుతారు. నాలుగో జోన్ గా 8100 గ్రామాలు తీసుకుంటే 186 లక్షల ప్రజలు అవుతారు. ఈ జోన్ లోని 53% ప్రజలు ప్రస్తుతం గుర్తింపు పొందని ఆర్.ఎం.పిలు, .ఎన్.ఎమ్.ల మీద ఆధారపడి ఉన్నారు.

          ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ ఏపీ రంగారావు అంచనాల ప్రకారం ప్రస్థుతం మొదటి జోన్ లో 2400 స్పెషలిస్టులు, 640 సూపర్ స్పెషలిస్టులు ప్రభుత్వ - ప్రైవేటు పరంగా సేవలందిస్తున్నారు. వీరితో పాటుగా ఎం.బి.బి.ఎస్ చేసిన వైద్యులు ఇందులో అదనపు భాగస్వాములుగా ఉన్నారు. రెండవ జోన్ లో ప్రజలకు ప్రథమ స్థాయి ద్వితీయ స్థాయి కేంద్రాలు మాత్రమే చేరువలో ఉన్నాయి. వారికి వారి అవసరాలు బట్టి 780 స్పెషలిస్టులు, 125 సూపర్ స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. జనాభాలో 7.6% ప్రజలు (దాదాపు 27 లక్షల మంది) గ్రామాల్లో ఉన్నారు. వారికి 683 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. కానీ నిరంతర వైద్యసేవలు మాత్రం మృగ్యంగా ఉన్నాయి అన్నారు. మిగిలిన ప్రజలకు (రమారమి 1.86% కోట్ల మందికి అంటే...ఇంచుమించుగా 53% మంది ప్రజలకు) 8100 గ్రామాల్లో అనుభవంకలిగిన వైద్యులు తత్సంబంధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొన్ని మైళ్ళ దూరంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీరిలో 57 లక్షల ప్రజలకి 5 నుండి 10కి.మీ. దూరం వెళ్ళవలసిన పరిస్థితి ఉండగా, 92 లక్షలమందికి 10కి.మీ పైనే ప్రయాణించాల్సి ఉంది. నిజానికి ఈ 1.86 కోట్ల మంది ప్రజలు స్థానికంగా గుర్తింపు పొందని, దీర్ఘ కాలంగా వైద్యం అందిస్తున్న వారివద్దనో, అలోపతివైద్య సేవలు అందించే ఇతరుల సేవలనో వినియోగించు కోవడం జరుగుతున్నది.


హైదరాబాద్ నగరంలోని రమారమి 80 లక్షల ప్రజల్లో 25-30 లక్షల మంది గుర్తింపు పొందిన మురికి వాడల్లో నివసిస్తున్నారు. మెహల్లా క్లీనిక్ ల పేరుతో వీరికి వైద్య సేవలు అందించవచ్చు. ఇలా వైద్య సేవలు అందించడానికి, హైదరాబాద్ లో 5000 దాకా క్లీనిక్లు కావలసి ఉంది. ఇక్కడ పనిచేయడానికి 1750 మంది డాక్టర్ల అవసరం ఉంటుంది. ఇందుకోసం హౌస్ సర్జన్ల సేవలు ఉపయోగించుకోవచ్చు. ఏటా 2500 మందికి పైగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో చేరుతుంటారు. వీరిలో 2/3 శాతం మంది ఉత్తర్ణీత పొందిన వారు ఉంటుండగా, మోహల్లా క్లినిక్లలో పని చేయాడానికి 1650 మంది దాకా అందుబాటులో ఉంటారు. వీరి వృత్తి సాధారణ వైద్యం అందించటం, ప్రాథమిక చికిత్స చేయటం, స్క్రీనింగ్ వంటివి ఏర్పాటు కావించటం ఇలా పరిమితంగానే ఉంటుంది. ఇలా వీరి సేవలు ఉపయోగించుకుంటే, సుమారు 30 లక్షల మందికి వైద్యం చేరువ చేసినట్లవుతుందని అన్నారు.

          ప్రస్థుతం హైదరాబాద్ మహా నగరంలో 110 దాకా అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఇవి సరిపోతున్నా ఈ సంఖ్యను అదనంగా మరో 150 అర్బన్ హెల్త్ సెంటర్లుగా పెంచుకున్నట్లయితే అందులో అనుభవజ్ఞుడైన వైద్యుడు అందుబాటులోకి వచ్చినట్లువుతుంది. తద్వారా తొలి దశ వైద్య సేవలు సలహాలు అందంచినట్లుగా అవుతుంది. ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్ కు 30-35 క్లీనిక్ లు అనుసంధానం చేస్తే సమస్య తీరుతుంది. వీటిలో పి.జి మెడికల్ విద్యార్థుల సేవలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నుండి రొటేషన్ పద్ధతిలో అనుసంధానిస్తే ద్వితీయ స్థాయి వైద్య సేవలు చేరువ చేసినట్లు కూడా అవుతుంది. తెలంగాణలోని  ప్రభుత్వ, పైవేటు పి.జి కళాశాలల నుండి వీరిని వినియోగించుకుంటే దాదాపు 850 మందికి పైగా పి.జి విద్యార్థుల సేవలు వినియోగించుకున్నట్లు అవుతుంది. వైద్యంతో పాటుగా, సర్జరీ, మానసిక నిపుణులు, గర్భీణీలకు సేవలు, కళ్ళ సమస్యలకు పరిష్కారాలు వంటి వాటికి సలహాలు అందించే ఆస్కారం ఉంటుంది.

          జోన్ మూడు, నాలుగు స్థాయికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 4863 సబ్ సెంటర్లకు గాను 683 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 1147 కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, 31 ఏరియా ఆసుపత్రులు, ఏడు జిల్లా ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ తరువాత జిల్లా హెడ్ క్వార్టర్స్ పరిధిలో ఇవి 1/3 శాతం. మనకి జిల్లా స్థాయి ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 18 టీచింగ్ ఆసుపత్రులలో 10 హైదరాబాదులో ఉండగా 4 వరంగల్ లో ఉన్నాయి. వీటికి అనుబంధంగా అదనంగా 272 ఆయుర్వేద ఆసుపత్రులు, 130 హోమియో ఆసుపత్రులు, 141 యునానీ ఆసుపత్రులు, 24 నాచురోపతి ఆసుపత్రిలు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నాయి. వీటన్నంటినీ అనుసంధానించు చేసుకోవచ్చు. ప్రతి జిల్లాకు వైద్య కళాశాలలు విస్తరిస్తున్న నేపథ్యంలో హౌస్ సర్జన్ల సేవలు, పి.జి. విద్యార్థుల సేవలు సమగ్రంగా ఆయా ప్రాథమిక కేంద్రాల్లో, ద్వితియ, తృతీయ స్థాయి కేంద్రాల్లో, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రాంతీయ జిల్లా టీచింగ్ ఆసుపత్రుల్లో ఎక్కడయినా వినియోగించుకునే సౌలభ్యం వుంది. 

          ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగు రీతిలో వైద్యులు సేవలు వినియోగించుకునే ఆస్కారం ఉంది. అనే విధంగా కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో నమూనాల సేకరణ సుగమం అవుతుంది. తృతీయ స్థాయిలో జిల్లాల ఆసుపత్రులలో డయాగ్నిస్టిక్ సేవలు అందుబాటులోకి తెచ్చే ఆస్కారం ఉంది. 8100 గ్రామాల్లోని 1.86 కోట్ల ప్రజలకు (అంటే మొత్తం జనాభాలోని 53% మందికి) నైపుణ్యం కలిగిన ప్రాథమిక వైద్యం సుసాధ్యం చేయంటంతో పాటుగా టెలి మెడిసిన్, ఫిక్స్ డేట్ హెల్త్ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. గర్భీణీ స్త్రీలకు పరీక్షలు, పెరిగే పిల్లలకు వైద్యం, దీర్ఘ వ్యాధి గ్రస్థులకు పరీక్షలు, ఆయా సంబంధ సహకారం, సుసాధ్యం అవుతుంది. తద్వారా సమాన వైద్యం రోగి ముంగిట్లో అందిస్తే, తక్కువ ఖర్చుతో మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటు లోకి తీసుకువచ్చినట్లు అవుతుంది. అన్ని వర్గాల వారికి సమన్యాయం సరైన వైద్యం చేరువ చేసినట్లు అవుతుంది.


          సమాచార సాంకేతిక రంగంలో విప్తవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితుల్లో టెలి కమ్యూని కేషన్ వ్యవస్థను మరింత పరిపుష్ఠం చేసుకుని టెలి మెడిసిన్ ద్వారా దూర వైద్యాన్ని రోగికి చేరువ చేయటం ఆరోగ్య పరిరక్షణకు దోహద పడటం జరుగుతుంది. తద్వారా కాలాయాపన నివారించు కోవడంతో పాటు అనుకున్న సమయంలో, అత్యవసర వైద్యం చేరువ చేసి ఆపత్కాలంలో ఆదుకునే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితులను అధిగమించి ప్రాణాపాయన్ని నివారించి ఆపన్నహస్తం అందించినట్లవుతుంది. ఈ ఆలోచనలను ఆచరణలోకి తీసుకురాగలిగితే ప్రజలకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని చేరువచేయటంలో కొత్త అధ్యాయన్ని ఆవిష్కరించినట్లవుతుంది.

No comments:

Post a Comment