Monday, December 11, 2017

తెలుగు భాష , సాహిత్యాల కలయిక : వనం జ్వాలా నరసింహారావు

తెలుగు భాష , సాహిత్యాల కలయిక
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (12-12-2017)

           అతి ప్రాచీనకాలంనాటి నుంచి ఇప్పటికీ వాడుకలో వుంటూ, వ్యావహారిక భాషగా, సాహిత్యంగా అప్రతిహతంగా మనుగడ సాగిస్తున్న ఏకైక భాష బహుశా తెలుగేనేమో! సంస్కృతం, లాటిన్ భాషల్లో సంభాషించు కోవడం దాదాపు లేనట్లే. కొద్ది మార్పులతో గ్రీకు భాష ఇంకా వాడుకలో వుందనాలి. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో తెలుగు ఒకటి. ప్రాచీన భాష హోదా సంతరించుకున్న భాష కూడా తెలుగే! తెలుగు వారుంటున్న ప్రాంతంలోనే ఆది మానవుడు తొలుత సంచరించాడని, దక్షిణా పథాన్నిoచి పంజాబుకు తరలిపోయాడని చరిత్రకారులంటారు. రాతియుగం నాటి మానవుడు సంచరించిన ప్రీతిపాత్రమైన ప్రదేశంగా తెలుగునాడును పేర్కొన్నారంటారు. తెలుగువారిప్పుడు నివసించని ప్రదేశమంటూ లేదు. భారతదేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు, అమెరికా, బర్మా, మలేషియా దేశాలతో సహా, ప్రపంచంలోని పలు దేశాల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న తెలుగువారు ఎందరో వున్నారు. తెలుగువారు  ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది కోట్లకు చేరుకున్నారని ఒక అంచనా. అమెరికా కాలిఫోర్నియా లోని సిలికాన్ వాలీనిప్పుడు తెలుగు వాలీగా-తెలంగాణా వాలీగా పిలవాలి. ఇదిలా వుంటే, తెలుగువారుండే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భిన్నమైన యాసలో తెలుగు మాట్లాడే వారున్నారు.

నవంబర్1,1956న తెలుగువారుండే ప్రాంతాలన్నీ కలపాలని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం నివేదిక ఆధారంగా విశాలాంధ్ర ఏర్పాటయింది. ఆ తరువాత మూడున్నర ఏళ్ళ కింద జూన్ 2, 2014 న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలుగు వారందరూ కలిసుందామని అనుకున్నారో, లేదో, తెలియదుగాని, కలిసుందామనుకున్న అలనాటి మద్రాస్ తెలుగువారు, తమిళులు మాత్రం విడిపోయారు. కలిసుండ వద్దనుకున్న అంధ్ర, తెలంగాణ ప్రాంతం  తెలుగువారు కూడా విడిపోయారు. కాకపోతే, భాషాపరంగా ఒకరిమీద పడ్డ మరొకరి ప్రభావం ఇంకా కొంతమేరకు అలాగే వుంది.

తెలుగువారు మాట్లాడే భాషను "తెనుగు" అని, "తెలుగు" అని అంటాం. ప్రాచీనకాలంనాటి సంస్కృత రచనల్లో ఆంధ్రులను గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు "ఆంధ్ర" అనో, "అంధక" అనో పేర్కొనేవారు. ఆ ప్రాంతంలో నివసించేవారిని ఒక తెగగానో, సమాజంగానో, దేశీయులుగానో గుర్తించేందుకు బహుశా అలాంటి పదప్రయోగం చేసుండాలి. భాషాపరమైన పదప్రయోగాలు చాలాకాలం తర్వాతే వాడబడ్డాయి. తెలుగు మాట్లాడేవారి ప్రాంతం గురించిన ప్రస్తావన రామాయణంలోను, బౌద్ధాయనంలోను, మనుస్మృతిలోను, మత్స్యపురాణంలోను కనిపిస్తుంది. దక్షిణ దిక్కును తెలిపే "తెన్" అనే ద్రావిడ పదం ఆధారంగా "తెనుగు" ఉత్పన్నమైందని కొందరు భాషా కోవిదుల అభిప్రాయం. ద్రావిడులు తెలుగుదేశానికి ఉత్తర దిక్కుగా నివసించారని తెలియచేసే ప్రయత్నంలోనే, దక్షిణాది వారు మాట్లాడే భాషను "తెనుగు" అని సూచించారు. కాకపోతే శాస్త్రీయమైన సాక్ష్యాధారాలు ఆ సూచనకంతగా లభ్యంకాలేదు. "త్రి లింగ" నుండి తెలుగు ఆవిర్భవించిందని అందరూ అనుకుండేదే. త్రి లింగ కూడా "త్రి-కళింగ" నుండి వచ్చిందే.

మధ్య ప్రాంత ద్రావిడ జాతికి చెందిన గోండ్, భిల్లీ భాషలకు, తెలుగుకు అవినాభావ సంబంధముందని కొందరంటారు. ఒక్కో యుగంలో ఒక్కోరకంగా తెలుగు భాష వాడుకలో వుందని కొందరి నమ్మకం. తెలుగు భాషకు రావణాసురుడు వ్యాకరణం రాశాడంటారు. ఆ రాసిన రావణుడు, రామాయణంలో పేర్కొన్న రావణుడే కావాలని లేదుకాకూడదనీ లేదు. తెలుగు మాట్లాడే  దేశానికి, సింహళ దేశానికి మధ్య మతపరమైన అవినాభావ సంబంధాలున్నందున, తెలుగు భాషకు ఆ దేశానికి చెందిన ఒకవ్యక్తి వ్యాకరణం రాశాడంటే నమ్మ దగ్గ విషయంగానే భావించాలి. ఈ నమ్మకాల్లో, గాథల్లో, మౌఖికంగా ప్రచారంలో వున్న వాటిల్లో, కొంతలో కొంత వాస్తవం వుందనేది మాత్రం నిజం. భాషకున్న వ్యాకరణ నిర్మాణం, నిబంధనలు, మౌలికమైన పదజాల ఒరవడిని పరిగణలోకి తీసుకొని, తెలుగు భాషను అతి ప్రాచీనమైన ద్రావిడ జాతి భాషలకు చెందినదిగా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, భాషా కోవిదులు, పండితులు నిర్ణయించారు. మధ్య ప్రాంత ద్రావిడ జాతి భాషల్లో బహుశా తెలుగు ఒక్కటే అతిపెద్ద వాడుక భాషగానూ, భౌగోళికంగా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన భాషగానూ, ఉత్తర, దక్షిణాల మధ్య వారధిగా వుండే భాషగానూ, ఆర్యుల, ద్రావిడుల మధ్య వారధిగా వుండే భాషగానూ పేర్కొనడం అతిశయోక్తికాదేమో.


పింగళి లక్ష్మీకాంతం గారు చెప్పినదాని ప్రకారం, భాషాపరంగా, తెలుగు భాషారంభం, అభివృద్ధి నన్నయకు పూర్వం, క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో మొదలై, ఆధునిక కాలం నాటి క్రీస్తుపూర్వం 1875 వరకు, ఆ తర్వాత కొనసాగింది-కొనసాగుతూనే వుంది. తెలుగు భాష దక్షిణాది ద్రావిడ భాషల్లోంచి ఉద్భవించిందేననీ, ఒక ప్రత్యేకమైన భాషగా క్రీస్తుపూర్వం ఎన్నో శతాబ్దాల క్రితంనుండే వాడుకలో వుందనీ, బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు. "సాలంకాయనులుల" శాసనాల ఆధారంగా, అతి పురాతనమైన తెలుగు లిపి "వెంగి"-"తెలుగు కన్నడ" లభ్యమయిందని తెలుస్తోంది. ద్రావిడ భాషకు చెందినదే అయినప్పటికీ, తెలుగుపై సంస్కృత భాష ప్రభావం అధికంగా వుంది. వాడుకభాషపైనా, గ్రాంథిక భాషపైనా కూడ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

ఆధునిక కాలంలో తెలుగు భాష వాడకంలో, ఉపయోగంలో హద్దులనేవి గాని, ఎల్లలనేవి గాని అసలు లేనేలేవు. ఒక వైపు సంస్కృతం ప్రభావం ఇంకా తెలుగు మీద పడుతున్నప్పటికీ, ఎక్కువ ప్రభావం ఆంగ్ల భాషదే అనాలి. నాగరికులందరూ ప్రస్తుతం మాట్లాడుతుండే తెలుగును "తెంగ్లీష్" అనాలి. ఎందుకంటే, అది ప్రధానంగా తెలుగు, ఇంగ్లీషులు కలిపిన భాష కాబట్టి. తమిళం అంతే. ఇంగ్లీష్ పదజాలం లేకుండా ఈ రోజుల్లో బహుశా ఏ భాషా లేదేమో. "వేర్ సెంచరీస్ కో ఎగ్జిస్ట్" అనే భారత ఆంగ్ల సినిమాను రూపొందించిన కృష్ణస్వామి "ఇంగ్లీష్ భారతీయ భాషనీ, దక్షిణ భారతీయ భాషనీ" అంటాడు.

ఇదిలా వుంటే, తెలుగు భాష గురించి కాళోజీ నారాయణరావు గారి వ్యాఖ్యలు ఓ విజ్ఞాన సర్వస్వం లాంటివి. వారి ఆత్మకథలో ఒకచోట, విశ్వనాథ సత్యనారాయణ గారితో కాళోజీ చెప్పిన మాట... "మీరు తెలుగుల రాసింది నా బోటి వాండ్లకు కూడా తెలివకపోయె. తెలుగుల రాయడం వల్ల తెలుగు రాని ప్రాంతం వాండ్లకి మీ ప్రతిభ తెల్వడం లేదు. కాబట్టి దయచేసి మీరు తెలుగు రాయడం మానుకుని సంస్కృతంలోనె రాస్తె సంస్కృతం తెల్సిన వాండ్లకి మీ ప్రతిభ బోధపడుతుంది. మీ స్థాయీ వాండ్ల కర్థమవుతుంది. మీరు తెలుగులో రాయడమెందుకు? మీ భాష అర్థం కాక మేం బాధపడడమెందుకు? ‘నీకేం తెలుస్తుందిలే’ అని మీరనడమెందుకు? సంస్కృతంలో రాయండి".

         మడులు దడులు కట్టుకోవడానికి కాళోజీ వ్యతిరేకం. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెపుతారు ఆయన. "జీవితంలోనైనా, సాహిత్యంలోనైనా మడులూ, దడులు కట్టుకోడం, గీతలూ, గిరులు గీసుకోవడం సరికాదని నేను భావిస్తను. నా ’ఇజం’ గేయంలో దీన్నే ఎండగట్టిన.....భాష, సాహిత్యం, సంస్కృతి, మనల్ని (తెలుగువాండ్లని) ఒకటి గనే వుంచెగద. నన్నయ్య మహాభారతం, పోతన భాగవతం, పెద్దన మనుచరిత్ర, విశ్వనాథ ఆంధ్ర ప్రశస్తి, రాయప్రోలు ఆంధ్రావళి, అడవి బాపిరాజు గోన గన్నారెడ్డి, అన్నే తెలుగు పుస్తకాలే. అవీ ఇవీ కూడా మనవే అని అప్పుడూ అనుకున్నం. ఇప్పుడూ అనుకుంటం. వాండ్లు వేరు, మనం వేరు అనే భావం తెలంగాణా వాండ్లకి ఎన్నడూ లేదు. కాని, వీండ్లూ మనవాండ్లే, వీండ్లదీ మన భాషే, వీండ్లదీ మన జీవిత విధానమే, అనేటి భావాలు, మా గురించి పైనుంచి వచ్చినోళ్లకి వుండేటివి కాదు. కాని తెలంగాణ లోపటి పరిస్థితి వేరు......కృష్ణదేవరాయలు, రాజరాజ నరేంద్రుడు, నన్నయ్య భట్టులాగా ప్రతాపరుద్రుడు కూడా మన తెలుగువాడేనని మేమనుకునెటోళ్లం. నన్నయ్య తెలుగువాడు, తిక్కన తెలుగువాడు, ఎల్లయ్య తెలుగువాడు, పుల్లయ్య తెలుగువాడు అని మా అభిప్రాయం. సాహిత్యంతో పరిచయమున్న పది మందికే ఇది పరిమితం"

"మేం తెలుగువాండ్లం, మాది తెలుగు భాష, మాది తెలుగు సాహిత్యం అని మాకు చాలా గొప్పగా వుండేటిది. తెలంగాణా, రాయలసీమ - రెండూ కూడా కలిసి వుంటేనే అది తెలుగు రాష్ట్రమవుతది. మొదటి నుంచీ తెలుగు భాషకీ, సంస్కృతికీ, సాహిత్యానికి ఈ మూడు ప్రాంతాల వాండ్లూ కలిసికట్టుగనే తోడ్పడిన్రు. కాని ఆంధ్రప్రదేశ్ ఏర్పడినంక మాత్రమే మనం రాజకీయంగ ఒకటైనం. ఈ మాట మర్చిపోయి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు తెలంగాణా వాండ్లు తెలుగువాళ్లే కాదన్నట్టు ఒక వ్యవహారముండేటిది గద! ఎవరిదాకానో ఎందుకు? ముఖ్యమంత్రి అంజయ్య (తెలంగాణా) తెలుగు మీద ఎంత గల్లంతు లేచిందీ! ఎన్ని కార్టూనులచ్చినై? అంజయ్య తెలుగు ఎంతచదువుకున్నడు అనేటిది అనవసరం. అతని ఇంట్లో భార్యా బిడ్దలతో గానీ, బయట ఇరుగు పొరుగుతో గానీ, తెలుగులోనె మాట్లాడిండు గద! అతని మాతృ భాష (తెలుగు) లో ఆరణాల కూలీగా కొన్ని వేల కూలీ సభల్లో మాట్టాడిండు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిండు. ఆరణాల కూలీగా పని చేసినోడు ముఖ్యమంత్రి కాకూడదా? కూలీల మాటలు తెలుగు భాష కాదనా? అందరిదీ తెలుగే. అందరం తెలుగోండ్లమే......రావి శాస్త్రి విశాఖ భాషని తెలుగు కాదని మేమూ, నల్గొండ వాండ్లది వేరే యాస కాబట్టి అది తెలుగు కాదని వరంగలోడు, వరంగల్ వానిది తెలుగుకాదని బెజవాడ వాడు, బెజవాడ వానిది తెలుగు కాదని రాయలసీమవాడు - ఇట్లనుకుంటపోతె మన మధ్య సహృద్భావం ఎట్టొస్తది? మనమందరం తెలుగువాండ్లం అని చెప్పే ఎమోషనల్ ఇంటిగ్రేషన్ - అత్మీయత ఏముంటది? ఒకని భాష విషయంలో, యాస విషయంలో, తిండి విషయంలో ఎగతాళి చేస్తే అతని ఆత్మాభిమానం దెబ్బతింటది. దానికి వెల కట్టలేం....."


ఈ నేపధ్యంలో జరుగుతున్న తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగు భాష-సాహిత్యాల కలయిక కాబోతున్నాయి. 

1 comment: