Wednesday, October 17, 2018

రావణ దహనం....చెడుపై విజయం : వనం జ్వాలా నరసింహారావు


రావణ దహనం....చెడుపై విజయం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (18-10-2018)
నవరాత్రి పర్వదినాలు ముగియనున్నాయి. దసరా భారతావనిలో ఒక ముఖ్యమన పండుగ. దసరా లేదా విజయదశమి చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే పండుగ. రాముడి చేతిలో రావణుడి ఓటమి దసరా నాడే జరిగిందంటారు. విష్ణుమూర్తి దశావతారాలలో ఏడవ అవతారమైన రామావతారంలో రాక్షసరాజు రావణుడిని యుద్ధంలో ఓడించి చెరలోనున్న తన భార్య సీతను విడిపించుకుంటాడు రాముడు. రామలీలాలో భాగంగా రావణ దహనం అంటే, రావణ, కుంభకర్ణ, మేఘనాథ దిష్టి బొమ్మలను దహనం చేస్తారు. ఇంతకీ ఈ రావణుడు ఎవరు? వాడిని ఎందుకు మంచివాడని అనరు? తెలుసుకోవడం ఆసక్తికరమైన విషయమే.

రావణాసురుడు దేవుడని, దసరానాడు రావణ దహనం తప్పనీ, ఇటీవల కొందరు పని కట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. ఆ మాటకొస్తే, ఒక్క రావణుడే కాదు, మహిషాసురుడు, నరకాసురుడు, హిరణ్య కశిపుడు, శిశుపాలుడు.....ఇలా మన పురాణాలలో, ఇతిహాసాలలో రాక్షసులుగా ముద్రపడిన ప్రతి వారినీ వారు దేవతలంటున్నారు. రావణుడిని అగ్రవర్ణాల వారు అణగదొక్కారని కూడా వాదిస్తున్నారు. రావణుడు పుట్టింది బ్రాహ్మణ -క్షత్రియ జంటకు. అలాంటప్పుడు వెనుకబడిన వర్గానికి చెందిన వాడెలా అవుతాడు? సుమాలి అనే రాక్షస రాజు తన కూతురు కైకసిని విశ్రవసువును వివాహం చేసుకో మంటాడు. విశ్రవసుడికి కైకసి వివాహిత భార్య కాలేకపోయింది. కొంతకాలానికి ఆమెకు నిడుపాటి కోరలు, పది తలలు, ఎర్రని వెంట్రుకలు, ఇరవై చేతులతో భయంకరమైన ఆకారం కలవాడిని కంటుంది. వాడికి దశకంఠుడు అని పేరు పెట్టాడు తండ్రి విశ్రవసుడు. ఆ తరువాత వాడికి రావణుడనే పేరు మిగిలింది. రావణుడి తండ్రి బ్రాహ్మణుడైనప్పటికీ, తల్లి రాక్షస రాజకన్యక ఐనందున, బ్రాహ్మణుడికి క్షత్రియ స్త్రీయందు కలిగిన వాడు క్షత్రియుడే. బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, మనం అనుకునే వెనుకబడిన కులాలకు చెందిన వాడుకాదు!

రావణాసురుడు బుద్ధి తెల్సినప్పటి నుంచే ఘోరాలు-నేరాలు చేసిన వాడే!. సవతి సోదరుడు కుబేరుడిని వర బలంతో లంక నుంచి వెళ్ల గొట్టాడు. ముల్లోకాలను బాధ పెట్టడం వాడికొక దిన చర్య. అడ్డూ-అదుపూ లేకుండా క్రూరుడై, దేవతలను, ఋషులను, యక్షులను చంపసాగాడు. తప్పని చెప్పిన అన్న కుబేరుడి మీద యుద్ధానికి పోయి పుష్పక విమానాన్ని లాక్కుంటాడు. శౌర్యవంతులైన రాజులను ఇబ్బందులకు గురి చేస్తూ, యుద్ధంలో ఎదిరించిన వారిని చంపుకుంటూ, ఓడిన వారిని బెదిరిస్తూ రోజులు గడిపేవాడు. నందీశ్వరుడిని అవమానించి శాపానికి గురయ్యాడు. కామంతో వేదవతిని అవమానించాడు. అయోధ్య రాజు అనరణ్యుడిని అవమానించి ఆయన శాపానికీ గురవుతాడు. యముడి మీదకు, ఇంద్రుడి మీదకు దండెత్తుతాడు. బల గర్వంతో, రాజ స్త్రీలను, ముని కన్యలను, దానవ కుటుంబినులను, దేవతా స్త్రీలను, కంటకనబడిన స్త్రీలందరినీ బలాత్కారం చేస్తాడు. రంభను చెరిచి నలకూబరుడి శాపానికి గురవుతాడు. చివరకు సీతాదేవిని అపహరిస్తాడు.

హిమవత్పర్వత ప్రాంతంలో రావణుడికి వేదవతి కనిపించింది. కామంతో కళ్లు మూసుకున్న రావణుడు ఆమెను చేరబోయాడు. తల వెంట్రుకలు పట్టుకుని వేదవతిని లాగుతాడు. రావణుడు అవమానించిన ఆ దేహాన్ని ఇక తాను వుంచుకోనంటుంది. అగ్ని ప్రవేశం చేస్తానని, రావణుడి గర్వమణచడానికి మళ్లీ జన్మించుతానని అంటూ, చెప్పినట్లే చేస్తుంది. ఆ విధంగా రావణ వినాశానికి బీజాలు పడ్డాయి. ఆ వేదవతే, జనక మహారాజు కూతురై, భూమిలో పుట్టి, సీత పేరుతో శ్రీరాముడిని వివాహమాడింది. అయోధ్యకు వెళ్లాడు రావణుడు. ఆ సమయంలో అనరణ్యుడు అయోధ్యను పాలించేవాడు. ఆతడిని యుద్ధానికి పురిగొల్పాడు రావణుడు. యుద్ధంలో ఓడిపోయాడు అనరణ్యుడు. తన వంశంలోనే దశరథ మహారాజు కుమారుడైన రాముడు, యుద్ధంలో రావణుడిని చంపుతాడని శపించాడు. 

యముడిని చంపడానికి పోతాడు. యమ-రావణ యుద్ధం జరుగుతుంది. ఇరువురు సరిసమానంగా పోరు సల్పారు. యముడిని గెలిచినట్లు ప్రకటించుకున్న రావణుడు యమ పురిని విడిచి లంకా నగరానికి పోతూ, రాజ స్త్రీలను, ముని కన్యలను, దానవ కుటుంబినులను, దేవతా స్త్రీలను, కంటకనబడిన స్త్రీలందరినీ బలాత్కారం చేస్తాడు. చెరబడిన స్త్రీలందరూ విలపించినా రావణుడు పట్టించుకోడు. పర స్త్రీలను తన భార్యలుగా చేసుకోవాలను కోవడం కంటే పాప కార్యం లేదని, తమను కామంతో వశ పర్చుకో చూస్తున్నాడని, తామే పతివ్రతలమైతే, రావణుడు పర స్త్రీ కారణంగానే చంపబడతాడని శపించారు వారందరు. అలా మరో శాపం తగిలింది.


దేవతల మీదకు దండయాత్రకు పోతాడు. మార్గమధ్యంలో, దేవతా సౌందర్యవతి రంభను చూసి ఆమె చేయి పట్టుకుంటాడు. రావణుడు తనకు తండ్రి లాంటి వాడని, ఇలా చేయడం తగదని, వేడుకుంటుంది రంభ. రావణుడా మాటలు పట్టించుకోకుండా రంభను చెరిచి విడిచి పెట్తాడు. రావణుడు చేసిన చెడ్ద పనిని భర్త నలకూబరుడి (కుబేరుడి కొడుకు) తో చెప్తుంది రంభ. పర స్త్రీని చెరిచినట్లయితే రావణుడు మరణించుతాడని నలకూబరుడు శపించుతాడు. రావణుడు బలవంతంగా ఎత్తుకుని వచ్చిన పతివ్రతా స్త్రీలు ఆ శాపం తెలిసి కొని సంతోషించారు. రావణుడి వలన భయం వదిలారు. ఆ దినం మొదలుకుని, పర స్త్రీ సంగమం విషయంలో మనస్సు పోనిచ్చినవాడు కాదు రావణుడు.

రావణుడు కనిపించిన ప్రతి వారినీ, రాజులందరినీ బాధించుతూ, భుజ బల గర్వంతో, కళ్లు మూసుకొనిపోయి, ఒకనాడు మాహిష్మతీ నగరాన్ని పాలిస్తున్న కార్తవీర్యార్జునుడి మీదకు యుద్ధానికి పోతాడు. కార్తవీర్యార్జునుడు వాడిని బంధించి చెరసాలలో పడేశాడు. ఇది తెలుసుకున్న రావణుడి తాత పులస్త్యుడు అక్కడకు చేరుకుని, రావణుడిని చెరసాలనుంచి విడవమని కోరాడు. ఆయన కోరికను మన్నించాడు కార్తవీర్యార్జునుడు. రావణుడు కార్తవీర్యార్జునుడితో స్నేహం చేస్తూ, తరువాత, మళ్లా రాజులను ఓడించాలన్న కోరికతో, పొగరు పడుతూ, భూమి మీద తిరుగుతుండేవాడు.

రావణుడు లోకాలలో సంచరిస్తూ, ఒకనాడు కిష్కింధకు వచ్చి, వాలిని యుద్ధానికి పిలిచాడు.

ఆ సమయంలో వాలి సంధ్య వార్చడానికి నాలుగు సముద్రాలకు పోయాడు. అప్పుడు దక్షిణ సముద్రంలో సంధ్య వారుస్తున్నాడని తెలుసుకుని పుష్పక విమానం ఎక్కి అక్కడకు చేరుకుంటాడు రావణుడు. వాలిని వెనుక నుంచి వెళ్ళి బంధించాలనుకుంటాడు. వాడి ఉద్దేశం కనిపెట్టిన వాలి, రావణుడిని తన చంకలో ఇరికించి, ఆకాశ మార్గంలో పోయి, పడమటి సముద్రంలో, ఉత్తర సముద్రంలో, తూర్పు సముద్రంలో సంధ్య వారుస్తాడు. కిష్కింధకు తిరిగొచ్చి రావణుడిని విడిచి, ఏమీ తెలియని వాడివలె అతడి క్షేమ సమాచారం అడుగుతాడు. తాను వాలితో యుద్ధం చేయడానికి వచ్చానని, గర్వభంగం ఐందనీ, అగ్ని సాక్షిగా అతడితో స్నేహం చేయాలని వుందని అంటాడు. ఆ తరువాత వారిరువురు స్నేహితులౌతారు.

సన్న్యాసి వేషంలో సీతను రావణుడు బలాత్కారంగా ఎత్తుకుని పోతాడు. సీతతో లంక చేరుకుంటాడు. సీత మీద రాక్షస స్త్రీలను కాపలాగా వుంచుతాడు. సీత తనను కామించడానికి పన్నెండు నెలల గడువిస్తాడు. రావణుడి రూపం, తేజం, బలం, ధైర్యం అనుపమానవైనవే. సౌందర్యం, సంపద, ఆకర్షణ రాముడిలో ఎంత వున్నాయో, రావణుడి దగ్గర కూడా అంతే మోతాదులో వున్నాయనవచ్చు. ఐతే, ఇతరుల పట్ల కరుణ, రక్షించాలనే బుద్ధి రాముడిలో వున్నాయి కాని రావణుడిలో లేవు. వాడిది కఠినమైన మనస్సు. భూతదయ వాడికి లేనందునే జనులు దూషించారు. దేవదానవులు వణికారు.

రావణుడు, విధానాన్నసురించి ధర్మ శాస్త్రాలను చక్కగా అధ్యయనం చేశాడు. ప్రపంచం మెచ్చే రీతిలో తపస్సు చేశాడు. ఎంతో కష్టపడి తపస్సు చేసినా, అది మర్చిపోయి, తపో ధర్మం వల్ల కలిగే సత్ఫలితాలను పాడుచేసే పనులెన్నో చేశాడు. అతడి తపస్సు వ్యర్థమైపోయింది. తన తపస్సుతో దేవదానవులెవరూ జయించకుండా వరం పొంది, ఇంక తనకేం భయమని గర్వపడ్డాడు. వాస్తవానికి, ఆ వరాలేవే అతన్ని ఎల్లప్పుడూ రక్షించ లేవనే సంగతి అతడి ఆలోచనకే రాలేదు. 

తపఃఫలం వల్ల రావణుడు తనకు పాప ఫలం రాదనుకున్నాడు! అష్టైర్యాలను అనుభవించే వాడికి రోగాలు రావా? రావణుడి తపస్సు అతడికి దీర్ఘాయువు ఇవ్వాలి. కాని, వాడు చేసిన పర స్త్రీ అపహరణనే పాపపు పని వల్ల త్వరగా చావాలి. ఈ రెండూ ఏకకాలంలో జరగవు కాబట్టి, అతడి చావు రాముడొచ్చేవరకూ ఆగింది.
చివరకు నరవానరుల చేతిలో చచ్చాడు.

రావణుడు బలవంతంగా ఎత్తు కొచ్చిన సీతాదేవిని, ఇతర స్త్రీలను ఎవరి వారికి వారిని అప్పగించినట్లైతే అతడి దోషం పోయేది. తపఃఫలం సదా రక్షిస్తుందనేమాట భ్రాంతే! తపఃఫలం పుణ్యమనుభవించిన కొద్దీ క్షీణిస్తుంది. శాశ్వతంగా మిగిలిపోదు. రామ రావణ యుద్ధం మొదలవుతుంది. శ్రీరాముడు మూల బలాల్ని సంహరిస్తాడు. పౌరుషోక్తులు పలుకుతూ రావణుడు యుద్ధానికి వెళ్తాడు. ఇరువురూ దివ్యాస్త్రాలతో పోరాడుతారు. రావణుడు పరాజితుడై లంకకు పరుగెత్తుతాడు. రామరావణుల కడపటి యుద్ధం ప్రారంభమవుతుంది. బ్రహ్మాస్త్రంతో రావణుడిని వధించాడు రాముడు. రావణుడి మరణానికి లోకాలన్నీ సంతోషించాయి.

శ్రీమద్రామాయణం గొప్ప ధర్మ శాస్త్రం. ఇందులో సర్వ విధాలైన, అన్ని రకాల ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది. రాజ ధర్మం, ప్రజా ధర్మం, పతి ధర్మం, సతీ ధర్మం, భాతృ ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు ధర్మం, మిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా తెలుపబడి వుంది. లాభ-లోభ-పక్షపాత బుద్ధి లేకుండా, న్యాయం మీదే దృష్టి నిలిపి వాదించే న్యాయవాది ధర్మం కూడా చెప్పబడింది. వీటితో పాటు కథా సందర్భానుసారంగా, అంతరాంతరాలలో ఎన్నో నీతులు చెప్పబడ్డాయి. రావణుడి పాత్ర కూడా అందులో భాగమే! ఆ పాత్రను చెడుపాత్రగా చిత్రించడానికి కారణం వాడు చెడ్డవాడు కావడమే. ఏదేమైనా, రావణ వధతో ఒక యుగంలోని చెడు అంతరించి పోయింది. దానికి గుర్తుగా ఏటేటా దసరానాడు రామదహనం జరుపుకోవడం ఆచారంగా మిగిలిపోయింది.

1 comment:

  1. >> ... దసరానాడు రామదహనం జరుపుకోవడం ఆచారంగా మిగిలిపోయింది.

    రామదహనం ??

    ReplyDelete