Saturday, August 3, 2019

శ్రీరాముడి శోకం .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-72 : వనం జ్వాలా నరసింహారావు


శ్రీరాముడి శోకం
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-72
వనం జ్వాలా నరసింహారావు
          ప్రియురాలినీ, ఆమెకు కలిగినా అపదనూ స్మరించడం వల్ల కలిగిన పరవశత్వంతో, ప్రియవిరహం వల్ల కలిగిన శోకంతో, తనకు కలిగిన దుఃఖానికి తనలాగే శోకిస్తున్న తమ్ముడు లకష్మణుడితో రామచంద్రమూర్తి ఇలా అన్నాడు.

“శోకం మీద శోకం విశేషంగా ప్రాప్తించి నా గుండెలు పగిలేట్లు కళవళ పరుస్తున్నాయి. ఈ లోకంలో నాలాంటి మహాపాపి మరొకరు వుండరు. పూర్వజన్మలో నేను విస్తారంగా ఎన్నో పాపాలను చేసిన కారణాన ఈ జన్మలో వాతి ఫలితంగా పెద్ద దుఃఖం మీద దుఃఖంలాగా ఇలా సంభవించింది. ఒకటివెంట ఇంకొక కష్టం ఏమిటంటే....చెప్తా విను. మొదటిది...న్యాయంగా రావాల్సిన రాజ్యం నాకు రాకపోవడం. ఆ కారణాన నా మేలు కోరిన ముఖ్య బంధువులందరినీ వదలడం. నాకొరకై తండ్రి చావడం. తల్లిని దిక్కులేనిదానిగా చేసి నేను అడవులకు రావడం. ఇవన్నీ ఈ శరీరాన్ని దహించి వేస్తున్నాయి. ఇప్పుడు భార్యను పోగొట్టుకోవడంతో అవన్నీ జ్ఞాపకానికి వచ్చి రగులుతున్న అగ్నికి కట్టెలు చేర్చినట్లై భగ్గున మండుతున్నాయి. ఎవడో రాక్షసుడు బలాత్కారంగా ఈడ్చి పట్టుకుని ఆకాశాన పరుగెత్తగా భయపడ్డ సీతాదేవి మారుపడ్డ గొంతుతో దిక్కులేనిదానిలాగా ఏడవకుండా వుంటుందా? బలవంతంగా తీసుకునిపోయి ఏం చేయగలడు? వశపర్చుకోవడం సాధ్యంకాని పని. కాబట్టి కోపంతో చంపి వుండవచ్చు. చంపి, ఎర్ర చందనం పూయడం వల్ల, అందమైన, మనోహరమైన ఆమె కుచాలు నెత్తురు ధారలు కారేట్లు ఎవరో దుష్టుడు చేస్తే ఆమె అందం చెడిపోయిందేమో? మృదువైన ఆమె తీయటి మాటలు, ఆ నల్లటి వెంట్రుకలు, అందమైన ముద్దులు కారే ముఖం, రాహువు చేతిలో చిక్కి దుఃఖపడే చంద్రుడిలాగా కామ్తిహీనమై పోయిందేమో?

“ముత్యాలహారాలు వేలాడే ఆమె మెడను చీల్చి నీచమైన మనసు కలవారెవరైనా ఆమె నెత్తురు తాగారేమో? నేను ఒంటరిగా అడవిలో నడిచిపోయిన కారణాన రాక్షసులు హింసిస్తే ఆమె ఏడవకుండా వుంటుందా? ఇది గోదావరీ నది. దీనిమీద సీతకు అమితమైన ప్రేమ. ఇక్కడికి ప్రతిరోజూ వస్తుంది. ఇక్కడున్నదేమో? వుండదు. ఎందుకంటే ఎన్నడూ ఇక్కడికి ఒంటరిగా రాలేదు. పద్మంల లాంటి ముఖం, పద్మం లాంటి కళ్ళు కల పద్మిని, సీతాదేవి, పద్మాల కోసం గోదావరీ  నదికి వచ్చిందేమో? ఒంటరిగా ఎన్నడూ ఇల్లు విడిచి వెళ్ళని సీత ఇవ్వాళ ఇక్కడికి వస్తుందా? రాదు. అసమానమైన పూల సమూహాలతో అందంగా, ఆడే తుమ్మెదలు, ఆడే చిలుకలు, పక్షులు వున్నా ఈ పూలపొద దగ్గరికి వచ్చిందేమో? వచ్చి వుండదు. ఎందుకంటే, సీత పిరికిది....ఒంటరిగా రావడానికి ప్రయత్నం చేయదు”.


ఇలా వెతికి-వెతికి ఎక్కడా సీతను చూడలేక జగచ్చక్షువు కాబట్టి, తన వంశానికి మూలపురుషుడైన సూర్యుడిని అడగడం ప్రారంభించాడు. “రవీ! నీకు నమస్కారం. లోకంలోని అందరి సత్య ప్రవర్తన, అసత్య ప్రవర్తన తెలిసినావాడివి కదా! నా భార్య ఎక్కడికి పోయింది? ఎవరైనా ఎత్తుకు పోయారా? చెప్పు”.

ఆకాశాన వున్న సూర్యుడికి భూమ్మీద గృహాలలో జరిగే విషయాలు చూసి వుండకపోవచ్చని వాయుదేవుడిని అడగసాగాడు. “వాయుదేవా! నీకు తెలియని విషయం లోకంలో లేదు. సీత మరణించిందా? లేక, ఎవడైనా అపహరించాడా? ఈ అడవుల్లో ఎక్కడైనా చిక్కుకుని దారి తెలియక ఇబ్బందుల్లో పడిందా? ఆలశ్యం చేయకుండా చెప్పు”.

ఈ విధంగా రామచంద్రమూర్తి విలపిస్తుంటే ధైర్యవంతుడైన లక్ష్మణుడు రాముడిని ఉరట పరచడానికి కాలానుగుణమైన కొన్ని మాటలు చెప్పాడు ఇలా. “అన్నా! ఏడవవద్దు. సంతాపంతో శుష్కించి విచారించవద్దు. ధైర్యంగా వుండు. శోకంతో కృశించవద్దు. స్త్రీరత్నమైన సీతాదేవిని వెతుకుదాం. మహాత్ములైన వారు కష్టమైన పనులు చేయడానికి కొంచెం కూడా బాధపడరు”.

(స్త్రీపురుషుల సంయోగం వల్ల కలిగిన దేహం భగవంతుడికి లేదు. అయినా విష్ణుమూర్తి ఇతర అవతారాలలాగా కాకుండా రామావతారం దోషరహితమై, చైతన్యం కలదై, నిత్యసుఖ స్వరూపమైన తన శరీరాన్ని ప్రకాశించేట్లు చేసింది. రామచంద్రమూర్తిలో రావణుడికి భగవంతుడనే బుద్ధి లేకుండా చేసి వాడికి మోక్షం లేకుండా చేయడమే రామచంద్రుడి శోకానికి ఫలం అని చెప్పడం జరిగింది. రావణుడి చేత సీతను అపహరించేట్లు చేయడం, వాడి పుణ్యాన్ని నాశనం చేసి, వాడిని తన చేతిలో చంపబడేట్లు చేయడమే. గొప్ప తపస్సు చేసి సంపాదించిన బలం కల రావణుడిని అంతకంటే అధిక తపోబలం లేకుండా చంపడం సాధ్యపడదు. దేవతలు అంతకంటే ఎక్కువ తపస్సు చేయలేరు. కాబట్టి, వాడికి అనుచితమైన అనురాగం సీతమీద కలిగించి, దానివల్ల వాడిని మోహితుడిని చేసి, రావణుడి తపశ్శక్తి నాశనం చేసి, దేవతలా కార్యం సాధించాలని లక్ష్మీదేవితో కలిసి ఆలోచించి సీతాతో సహా అవతరించాడు విష్ణువు.

రామచంద్రమూర్తి మాయామానుషవేశాధారి అని అంగీకరించాలి. కర్మబద్ధులై జన్మించిన ప్రాకృత జనులు ఎలా ప్రవర్తించారో ఆయనా అలానే చేశాడు. భార్య మీద ప్రేమగల మనుష్యులు ఆమెను పోగొట్టుకుంటే ఎలా ఏడుస్తారో రాముడు కూడా అలానే చేశాడు. కన్నీరు కార్చడం. ఏడవడం, సత్యమే కాని అది తామస శోకం వలన కలిగింది కాదు.

జయ-విజయులకు మూడో జన్మలోకాని ముక్తిలేదనే విషయం భగవంతుడికి తెలుసు. రావణ-కుంభకర్ణులది రెండవ జన్మే కాబట్టి ముక్తిలేదు. భగవంతుడు రావణుడికి మోక్షం లేకుండా చేయడానికి వాడికి దుర్బుద్ధి పుట్టించి వాడితో ఒక అకార్యం చేయించి అది నెపంగా వాడిని వధించాడు. లోక శిక్షకోసం వచ్చినవాడు కదా భగవంతుడు).

1 comment:

  1. 591వ రామకీర్తన
    సీతజాడ గోదావరి చెప్పదేమి లక్ష్మణా
    యే తీరున మాటలాడు నీనది శుభచరితుడా

    నీటికొరకు వచ్ఛియన్న నిశ్చయముగ తెలియదా
    యేటికి నా సీతజాడ యేమందువు లక్ష్మణా
    పాటించుట మౌనమును పాడిగామి యెరుగదా
    యేటికి నిర్దయను బూని యిటులున్నది లక్ష్మణా

    ప్రీతిగల యక్క రఘువీరుల కీ గోదావరి
    ఖ్యాతిగల కులవధువు గతి చెప్పదు లక్ష్మణా
    చేతులు జోడించితే చెప్పునేమొ గోదావరి
    చేతులిదే జోడించితి చెప్పు మనుము లక్ష్మణా

    సీత నేడు రాకాసుల చేజిక్కుట చూచినదా
    నాతో వచియించుటకు భీతిగొనెనొ లక్ష్మణా
    ఈ తల్లికి తెలుపవే యితడు విష్ణుతేజుడని
    సీతను రక్షించగలడు చెప్పు మనుము లక్ష్మణా

    ReplyDelete